Showing posts with label అనుభూతులు. Show all posts
Showing posts with label అనుభూతులు. Show all posts

Sunday, May 3, 2015

RSVP స్మృతులు....1

2010 వైశాఖ మాసం (మే నెల)
మంచినీళ్ళ గుట్ట,
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠము,
తిరుపతి.
ఎం.ఏ ఎంట్రన్సు పరీక్షకు ముందు రోజు.

తిరుపతి లో అలిపిరి కి పోయేదారిలో రామకృష్ణా డీలక్సు అన్న బస్ స్టాప్. దానికి ఎదురుగా ఉన్న ఒక సందులోపలికి వెళితే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం బోర్డు, ప్రవేశద్వారమూ కనిపిస్తాయి. 

లోపలికి వెళ్ళగానే బాటకు రెండువైపులా చెట్లూ, వరుసగా చిన్న చిన్న బోర్డులపై వ్రాయించిన సంస్కృత సూక్తులూ కనిపిస్తాయి. అదుగో, ఆ కాంపస్ లో ఒకానొక సిమెంటు బెంచి పైన ఆ నాడు భవదీయుని తిష్ట.

సంస్కృతంలో ఆచార్య కోర్సు చేయాలంటే డిగ్రీలో సంస్కృతం ఒక సబ్జెక్ట్ గా చదివిఉంటే ప్రవేశం మామూలుగా, ప్రవేశపరీక్ష లేకనే దొరుకుతుంది. లేదంటే ఎంట్రన్సు రాయాలి. ఆ ఎంట్రన్స్ కోసమే ఆ రోజక్కడ మకాం.. 

"భవానపి ఆచార్య ప్రవేశపరీక్షాసార్థం ఆగతవాన్ వా?"  - పక్కన ఒక గొంతు వినిపించింది. (మీరు కూడా ఆచార్య - ఎంట్రన్స్ కోసం వచ్చారా?) - సమాధానం తెలుగు, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, హిందీ లలో తెలుసు. కాస్త తడుముకుంటే మలయాళ, మరాఠీల్లో కూడా. సంస్కృతంలో తెలియదు. ఆ భాషలేవీ వాడకుండా మౌనంగా తలూపాను. ఆ పలుకరింపు మెల్లగా సంభాషణ, తర్వాత స్నేహానికీ మళ్ళింది.

ఆ వచ్చినాయన తమిళాయన వెంకట్రామన్ గారు. చూస్తూనే గుర్తుపట్టవచ్చు. తమిళనాడు లో తిరునెల్వేలి వాస్తవ్యులు. ఐసీఐసీఐ బేంకులో మేనేజరుగా రిటయిర్ అవబోతున్నారు (2010 మాట. ఇప్పుడు పదవీవిరమణ చేశారు). అంతేకాదు, ఆయన గొప్ప తమిళభాషాభిమాని, కవీ కూడానూ. ఆ వివరాలు తెలియగానే నేను ఆయనతో మొహమాటం లేకండా తమిళంలోకి దిగిపోయాను. 

అంతలో తలపైన కొప్పుతో ఒక యువకుడు మా దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయి వృత్తిరీత్యా పురోహితుడు. తమిళుడు,  బెంగళూరు నివాసి. శబరిగిరీశన్ - అతడి పేరు. చాలా వినయశీలి. తెలివితేటలు పైకి కనబర్చని వ్యక్తి. - ప్రతిభను పైకి చెప్పుకోకుండా, డబ్బా కొట్టుకోకుండా ఉండేవాడిని సంస్కృతంలో "అ-వికత్థనుడు" అంటారు. వికత్థనుడంటే - డబ్బా కొట్టుకునేవాడు. సంస్కృతకావ్యాల్లో (ముఖ్యంగా డ్రామాలలో) హీరోలను నాలుగు విధాలుగా విభజిస్తారు. అందులో మొదటి టైపు - ధీరోదాత్తుడు. ఆ ధీరోదాత్తుని లక్షణాలలో "అవికత్థనత్వం" ముఖ్యమైనది.  అందుకు ఉదాహరణ - రాముడు. 

ఎంట్రన్స్ - తర్వాతి రోజు కాబట్టి ఈ రోజుకు ఏదైనా వసతి దొరుకుతుందేమోనని ముగ్గురం కలిసి ఆ పక్కనే ఉన్న హాస్టల్ కు దారితీశాం. సెలవులు కాబట్టి విద్యార్థులు పెద్దగా లేరు. అక్కడ ఒక పెద్ద హాలులో ఉండవచ్చన్నారు. భోజనం అక్కడే. వసతీ భోజనం కలిపి రు. 50/-. 

ప్రవేశపరీక్ష నూరుమార్కులకు. అందులో రెండు సబ్జెక్టులు. ఆ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలను కూడా యూనివర్సిటీ వారే పంపిస్తారు.

మొదటి సబ్జెక్టు - ప్రతాపరుద్రీయం అనే పుస్తకంలో రెండు ప్రకరణాలు. కావ్యప్రకరణం, నాయకప్రకరణం. 
రెండవసబ్జెక్టు - సంస్కృతసాహిత్యచరిత్ర - ఇందులో తిరిగి రెండు ప్రకరణాలు. వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం. 

ప్రతాపరుద్రీయం అనే లక్షణగ్రంథాన్ని రచించినది విద్యానాథుడనే ఆంధ్రకవి. ఈయనకు అగస్త్యుడు అని మరొక పేరు. ఈ క్రింది పద్యం చాలామంది తెలుగు వాళ్ళకు తెలుసు.

నానాసూనవితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్ కాకన్ తపంబంది యో
షా నాసాకృతి తాల్చి సర్వ సుమన స్సౌరభ్య సంవాసియై
పూనెన్ ప్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్.

తుమ్మెద తనపై వాలట్లేదని కోపంతో సంపంగిపువ్వు అడవిలో తపస్సు చేసింది. తప:ఫలంగా అందమైన అమ్మాయి ముక్కుగా అవతరించింది. ఆ ముక్కు(సంపెంగ)కు రెండువైపులా తుమ్మెదలు కళ్ళ రూపంలో బారులు కట్టాయి. 

పై పద్యానికి సంస్కృతమాతృక ఇది. 

భృంగానవాప్తి ప్రతిపన్నభేదా, కృత్వా వనే గంధఫలీతపోऽలమ్ |
తన్నాసికాऽభూదనుభూతగంధా స్వపార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా ||

ఈ సంస్కృతశ్లోకం రచించిన కవి అగస్త్యుడు/విద్యానాథుడు. ఈయన కావ్యం ప్రతాపరుద్రీయం - ప్రతాపరుద్రుడిని పొగడ్డానికి రచించినట్టుగా ఉంటుంది. దాదాపు ప్రతి ఉదాహరణా - ప్రతాపరుద్రుని గుణగణాలను ప్రశంసిస్తూనే ఉంటుంది. ఇందులో నాయకప్రకరణం - సులభం. కావ్యప్రకరణం - కష్టం. 

ఇక సంస్కృతసాహిత్యచరిత్ర - ఇందులో వైదిక సంస్కృత విభాగంలో వేదాలు, అరణ్యకాలు, సంహితలూ, పురాణాలూ, ఉపనిషత్తులూ, దర్శనాలూ,  రామాయణమూ, మహాభారతమూ - వీటి సంగ్రహం. ఇది మొదటి చాప్టరు. లౌకిక సంస్కృతం లో పంచమహాకావ్యాలూ, ఇతర కావ్యభేదాలూ, కవులూ, కవిహృదయాలూ, వారి కాలాదులూ వగైరా.

వేంకట్రామన్ గారికి, శబరిగిరీశన్ కూ (ఆ మాటకొస్తే చాలామందికి) వైదిక సంస్కృతం గురించి బాగా తెలుసు. లౌకిక సంస్కృతం గురించి అస్సలు తెలియదు. నాది పూర్తిగా రివర్సు వ్యవహారం. కాళిదాసు, మాఘుడు, సంస్కృత డ్రామాలు వీటి గురించి నాకు మంచి పరిచయం ఉన్నది. మరొక విషయమేమంటే - వెంకట్రామన్ గారు, కాస్తో కూస్తో తప్పులు లేక సంస్కృతంలో అనాయాసంగా మాట్లాడగలరు, వ్రాయగలరు. ఆ రెండు యోగ్యతలూ నాకు లేవు (ఇప్పటికీ).

మేం ముగ్గురం తెలిసిన సబ్జెక్టులన్నీ తిరగేశాం. వెంకట్రామన్ గారు శుక్లయజుర్వేదం గురించీ, పురాణాలను గుర్తుంచుకోవడానికి ఉన్న శ్లోకం (పద్వయం, మద్వయం...ఇలా ఏదో) చెప్పారు. అలాగే నాయకప్రకరణం కూడా తిరగేశాం. భోజనాల వేళయ్యింది. తిరుపతి లో చాలా చోట్ల అన్నం దైవప్రసాదంగా భావిస్తారు. ఆ సంస్కృత హాస్టల్లోనూ అంతే. ఆ భావనలోని మాధుర్యమో, లేక ఆ రోజు విశేషమో తెలియదు కానీ, కేవలం ఒక నంజుడు, పప్పు, చారులతో వడ్డించిన ఆ భోజనం రుచి ఈ నాటికీ కూడా గుర్తొస్తూనే ఉంటుంది.  

కాంపస్ లో నేరెడు చెట్లెక్కువ. హాస్టల్ మధ్యలో కూడా ఒక నేరెడు చెట్టు ఉంది. విరగకాసి ఉన్నదది. విద్యార్థుల్లో ఒకరిద్దరు - ఆ చెట్టు పై చేరి కొమ్మల్ని అల్లలాడిస్తూన్నారు. నేరెడు పళ్ళు జలజల రాలుతున్నాయి. సంస్కృతంలో నేరెడు పండు పేరు జంబూ ఫలం. జంబూఫలమంటే - బాణభట్టు ఛప్పున గుర్తొస్తాడు. కాదంబరి కావ్యం గుర్తొస్తుంది.

అదొక చిలుక. ఆ చిలుక మాట్లాడగలదు. ఎవరో ఒక గిరిజన యువతి ఆ చిలుకను పట్టుకుని మహారాజు శూద్రకునికి బహూకరించింది. ఆ చిలుకకు రాజు అతిథిమర్యాదలు ఘనంగా జరిపించాడు. మరుసటి రోజు కుశలమడుగుతూ రాజు చిలుకను - భోజన కార్యక్రమాదుల గురించి అడిగేడు. ఆ చిలుక చెబుతుంది - "ఆమత్త-కోకిల-లోచనచ్ఛవిర్నీలపాటలః-కషాయమధురః-ప్రకామమాపీతో-జంబూఫలరసః" - కైపెక్కిన కోకిల కళ్ళలా నలుపూ ఎఱుపూ కలిసి, కాస్త వగరూ, తీపి కలిసిన నేరెడు పళ్ళ రసం ఇచ్ఛ వచ్చినంత సేపు త్రాగాను మహారాజా.. అంటూ సాగుతుంది. నేరెడు పళ్ళంటే "నెయ్యములల్లో నేరెళ్ళో.." అన్నమయ్యా గుర్తొస్తాడు.

సాయంత్రం మరొక యువకుడు వచ్చాడు. అతని పేరు సోను. గుజరాత్ నుంచి వచ్చాడు. ధారాళంగా సంస్కృతం మాట్లాడగలడు. అయితే పుస్తకజ్ఞానం అంతగా లేదు. అతడికి కూడా వైదిక సంస్కృత చరిత్ర బాగా తెలుసు. 

నలుగురితో ఇలా ఆ రోజు గడిచింది.  తర్వాతి రోజు దాదాపు అరవై మంది సంస్కృతప్రవేశపరీక్ష వ్రాశారు. సోనూ సంగతి తెలియదు. మిగిలిన మా ముగ్గురికీ సీటు వచ్చింది. ప్రవేశపరీక్ష మార్కులు - విశ్వవిద్యాలయం వారు చెప్పరు. అంచేత తెలియదు. తెలియకపోవడమే మంచిది. :)

విద్య - అనేది నీలో ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశనూ, అనురక్తినీ పెంచాలి అని వివేకానందుడు.  డబ్బుకోసమూ, కీర్తి కోసమూ, మరే కక్కుర్తి కోసమూ కాకుండా,బిచ్చమెత్తుకు బతకవలసి వచ్చినా సరే, తనకు మనసులో ఇష్టం ఉన్న విషయం వైపుగా అధ్యయనం సాగించే అదృష్టం బహుశా చాలా గొప్పది. అదే బహుశా నిజమైన చదువు అని నా విశ్వాసం. అది ఎలానూ మనకు లేదు. 

భవదీయుడు అలా ఆ రెండు రోజులు అక్కడ ఉండటానికి - దైవప్రేరణ, సహృదయుల ప్రోత్సాహం, తోడ్పాటు, సహధర్మచారిణి ప్రోద్బలం, అక్కడ పరిచయమైన మిత్రులద్వారా అప్పటికప్పుడు నేర్చుకున్న కొన్ని ముక్కలూ - ఇవి మాత్రమే నిజమైన కారణాలు. ఇది నిజంగా నిజం. మిగిలినదంతా నిమిత్తమే.

RSVP నుంచి మరుసటిరోజు వచ్చేస్తుంటే - ఆ విశ్వవిద్యాలయం బోర్డుపై చిన్నగా ఉన్న అక్షరాలు కనిపించాయి - "తమసో మా జ్యోతిర్గమయ" - "చీకటి నుండి నన్ను వెలుగువైపుకు మళ్ళించు".

Saturday, November 1, 2014

డైరీలో ఒకరోజు...

కాలం....

ఏది సంస్కృతమై, సుపరిష్కృతమై ఉంటుందో అది మాత్రమే కాలానికి లోబడి ఉంటుంది. Only products are definable in the realm of "time". మరొక విధంగా చెబితే - ఏవి ఉత్పన్నములై, నశిస్తాయో వాటికే అతీతం (భూతకాలం), అనాగతం (భవిష్యత్తూ) ఉంటాయి. ఉత్పన్నములు, నశ్యములు కానివాటికి వర్తమానం తప్ప మరొక కాలం లేదు. అవి ప్రత్యుత్పన్నములు. క్షణక్షణానికి రంగులు మార్చే ఆకాశం, కణకణానికి రూపు, రంగూ మార్చే మేఘమాల, మట్టివాసనా, సముద్రపు అల.........భవమూ....

అతీతమూ, అనాగతమూ లేక, భవం లో మాత్రమే మనగలిగిన మహానుభావులను ద్రష్టలు అంటాం. వీరికి ప్రతిక్షణమూ వినూత్నమైనది. ఇది భూతకాలపు తెరలతో, భవిష్యత్కాలంపై భయంతోనో, లాలసతో కూడిన చూపు కాదు. ప్రతి క్షణాన్ని, తనదైన క్షణంగా చూడగలిగిన ఒక విస్పష్టమైన దృష్టి. ఇలాంటి సంబుద్ధత్వం పొందిన మహానుభావులు నూటికో కోటికో ఒక్కరు. ఏ సిద్ధార్థుడో, యే జిడ్డు కృష్ణమూర్తో....

అతి సాధారణమైన మనుషులకూ ఒక్కొక్కసారి అపురూపమైన ’భవం’ ఒక చల్లటి స్పర్శలా తాకి కాలగర్భంలో ఘనీభవించి అనుభవం గా,అనుభూతిగా మిగిలిపోతుంది. అలాంటి ఒక రోజు...

కార్తీక మాసం మూడవరోజు, ఆదివారం...

****************************

తెల్లవారు ఝామున ఆరున్నర. కరెంటు పోయి, ఫేను ఆగిపోతే, నిద్రలో జోగుతూ లేచి తలుపు తీయగానే చల్లటి గాలి,వర్షపు చినుకులూ ఘుప్పుమని తాకాయి. అప్పటికే సంహిత నిద్ర లేచి, మేడనుండి దిగివచ్చింది. అమ్మా నాన్నలిద్దరికీ లేని ’పొద్దున పూట నిద్రలేవడం’ అనే పాడు అలవాటు దానికి జేజి దగ్గర్నుంచో, అమ్మమ్మ దగ్గర్నుంచో వచ్చినట్టుంది! 

ముందు రోజు రాత్రి పడిన వర్షమూ, పొద్దున పూట చలి తాలూకు మంచూ, మట్టివాసనా, దూరంగా వినిపిస్తోన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి విష్ణుసహస్రనామమూ, నిన్నటి రాత్రి వర్షం జామకాయపై చేసిన కాకి ఎంగిలీ..... 

తులసి కోటను పరామర్శిస్తూన్న గుమ్మడిపాదు... 



వాతః (గాలి) అంటే వాహకంగా పనిచేసేదిట. చల్లదనాన్ని, చిక్కటి సువాసననూ తీసుకొస్తోంది పెరటి గాలి. మా పెరడు ప్రతి ఉదయంలాగే పారిజాతం పూల సువాసనలతో ఘుమాయిస్తోంది. పూలు ఒక గిన్నెలో ఏరడం మొదలెడితే, ఒక గిన్నె నిండా సమకూరినాయి. వెన్నముద్దను గిన్నెలో పెట్టినట్టు ఉంది ఆ పాత్ర. 

పక్కకొస్తుంటే - వర్షపు చినుకులతో తడిచిన పచ్చటి ఆకుల మధ్య ఎర్రటి పువ్వొకటి కనబడింది. అది జపాకుసుమం......కాదు కాదు, Hibiscus flower.

అది గిన్నెపైన చేరింది. 

****************************

ఓ గంటా, గంటన్నర తర్వాత...

 సన్నగా వర్షం మొదలైంది. పారిజాతపూలతో పూజ చేయాలి. రోజూ వస్తున్నదే అది, అయితే కల్పద్రుమాణాం పారిజాతః - పారిజాతమే ఒక కల్పవృక్షమూ, సాక్షాత్తూ భగవంతుని నివాసమైనప్పుడు, మరెక్కడ పూజ చేయాలి? పారిజాతాలతో పారిజాతం చెట్టుమూలాన్ని సంహిత ఇలా అలంకరించింది.

****************************

అగ్గలమౌ యాకలి కిక
తగ్గని మహగొప్ప మందు తడబడుటేలా?
సిగ్గెందుకు? దంచి కొడుదు 
నుగ్గాణికి సాటి యేది ఉర్విని కంటే!

మీరు ఉగ్గాణి (వీలైతే వేడి మిరపకాయబజ్జీతో బాటు) తినకపోయి ఉంటే, రాయలసీమ కు వెళ్ళడం సంభవిస్తే, ఉగ్గాణి అన్న పదార్థాన్ని మాత్రం రుచి చూడకుండా వెనుదిరక్కండి. తిరపతి లడ్డూ తినకపోవడం కన్నా కొంచెం చిన్న సైజు పాపం రాయలసీమ కు వచ్చి ఉగ్గాని తినకపోవడం. ఈ పాపానికి నిష్కృతి లేదు బాబూ, నిష్కృతి లేదు. (ఈ డైలాగు గుమ్మడి వాయిస్ లో ఊహించుకుని చదువుకోండి) 

పరమపదసోపానపటంలో ఓడిపోతేనేం? ఉగ్గానితో పరమపదం చేరుకున్నాక? 

అన్నట్టు మీకు పులి మేకా ఆట తెలుసా?

****************************

బయట వర్షం ఓ మోస్తరుగా కురుస్తూనే ఉంది. పైన డాబా లో చేరి, తూము నుంచి కిందకు వచ్చిన వర్షం నీళ్ళను మా పెరట్లో చెట్లకు పోస్తూ, వర్షంలో తడిస్తే జ్వరమొస్తుంది అన్న డిఫైన్డ్ ప్రాసెస్ కు కట్టుబడి కోపంతో ఉడికిపోతున్న మా ఆవిడను ఉడికిస్తూ ఓ గంట వర్షంలో బాగా నానిన తర్వాత లోపలికి వచ్చేశాను. 

****************************

ఉన్నట్టుండి ఎండ మొదలైంది. కాసేపటికి చురచురమంటూంది. సరిగ్గా ఇలాంటప్పుడు చెట్టు కిందనిలబడి చెట్టును కుదిపి, ఆ వర్షం చినుకులు మీదపడితే ఎలా ఉంటుందోనని ’మేర్లపాక మురళి’ అనే  శృంగార (సెమీ బూతు) రచయిత శృంగారపురం ఒక కిలోమీటరు అనే ఒక నవల్లో  చెప్పాడు. అది ఒక అందమైన పక్కింటమ్మాయిని ముద్దుపెట్టుకున్నట్టు ఉంటుందిట. నిజమో అబద్ధమో అనుభవజ్ఞులకే తెలుసు.

నిమ్మచెట్టు కిందికెళ్ళి చెట్టును ఊపగానే చినుకుల సంగతేమో కానీ నిమ్మముల్లు వచ్చి చేతికి తగిలి చెయ్యి చురుక్కుమంది. వెధవ ఆలోచనలకు పర్యవసానం ఇలాగే ఉంటుంది.  

ఇంతలో సీతకోకచిలుకల జంట ఒకటి తయారయింది. ఈ మధ్య ఈ జంట తెగ తిరుగుతోంది మా పెరట్లో. ఆ జంటలో ఒక దాన్నైనా పట్టుకోవాలని చాలా సేపు ట్రై చేస్తే ఒక్కటీ దొరకలేదు. కానీ మాంఛి టైమ్ పాస్.  అన్నట్టు సీతాకోకచిలుక రెక్కలను ముట్టుకుంటే వచ్చిన మసి/మరకను బెట్టు పెట్టుకుంటే మంచిగ చదువొస్తుందంట. సంహిత ఫ్రెండు చెబితే నాకు చెప్పింది. 

****************************

సాయంత్రం - మూడు.

1926 లో రాయలసీమలో పప్పూరు రామాచార్యులు అనే మహానుభావుని సంపాదకత్వంలో ఒకానొక పత్రిక మొదలయ్యింది. ఆ పత్రిక పేరు శ్రీ సాధనపత్రిక. ఎలాగైతే భారతి పత్రికను మన ఆంధ్రదేశపు సాంస్కృతిక వారసత్వంగా మన్నిస్తామో, అలాగే శ్రీ సాధన పత్రిక రాయలసీమ తాలూకు సాంస్కృతిక భారతి. చిలుకూరు నారాయణరావు "దత్త మండలాలు" అన్న పేరును నిరసిస్తూ వ్రాసిన పద్యాలు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, గోపాలకృష్ణశర్మ ప్రభృతుల వ్యాసాలు, విద్వాన్ విశ్వం గారి అనేక రచనలూ, ఇంకా నాటి సీమ రచయితల గొప్ప కథలు, కవితలూ, ఇలా ఎన్నిటినో కలబోసుకుని, చాలా యేళ్ళు వెలువడిన పత్రిక ఇది. ఈ పత్రిక కాలగర్భంలో కలిసిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో అనంతపురంలో ప్రెస్ క్లబ్ లో, మరి ఒకరిద్దరి వద్దా, ఈ పత్రిక దాదాపుగా చినిగి పోతున్న దశలోని కాపీలు దొరికాయి. వీటి గురించి ఆరాటపడి స్కాన్ తీసిన వారు హరినాథరెడ్డి గారనే ఒక ఉపాధ్యాయుడు, ప్రెస్ అకడెమీ వారు, నాగరాజారావు గారనే వయోవృద్ధులు.

మా మిత్రులు కోడిహళ్ళి మురళీమోహన్ ప్రేరణతో ఆ రోజు నాగరాజారావు గారిని కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఆయనను అదివరకే ఓ మారు కలిసినా, ఈ సారి చక్కగా మాట్లాడే అవకాశం కలిగింది. ఆయన ఒక్క సమాచార నిధి. 

సాధన పత్రిక కాపీలను మురళీమోహన్ గారు ఒక వెబ్ సైట్ లో పెడుతున్నారు. ఆ వెబ్ సైట్ ఇది.

http://sreesadhanapatrika.blogspot.in/

****************************

తిరిగి ఇంటికి వచ్చే సరికి వాతావరణం సరిగ్గా, ఎండకూ, వర్షానికి చలికి మధ్యలో ఉంది. దానికి తార్కాణమన్నట్టు మూడురంగుల మేఘాలతో ఆకాశం అలంకరించుకుంది. 

మా పాపను తీసుకుని బండిలో అలా ఓ మారు తిరిగి వచ్చేసరికి చీకటిపడింది. ఏ నాటకానికైనా చివర తెర పడాల్సిందేగా! 

రోజు మాత్రమే కరిగిపోయింది. ఆ పరిమళం తాలూకు అనుభూతి మనసు పొరలలో మనోజ్ఞమైన భావంగా అలానే ఉంది.

"భావస్థిరాణి జననాంతరసౌహృదాని".

Sunday, November 4, 2012

దృష్టి


"To see is to love" - అని ఒక మహాజ్ఞాని వచనం. ఆయన వచనం ఉటంకించినంత మాత్రాన ఆయనంత గొప్పవాడు కానవసరం లేదు. భగవద్గీత ను చదువుకోవడానికి,  ఉపయోగించుకోవడానికి మనిషైతే చాలు, భగవంతుడు కానక్కరలేదు.

రోజూ చూసే చెట్టు, ఈ రోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నది. ఎందుకో తెలియదు. చెట్టు తాలూకు ప్రతి ఆకు విలక్షణంగానూ, వినూత్నంగానూ కనబడుతూంది. మెత్తటి స్పర్శ, ఆకు తాలూకు ఈనెలు, నిన్నటి వర్షంలో తడిచి, హర్షం నింపుకుని రంగుతేలిన రూపం, సుకుమారమైన ఆకు చివరి భాగం, చెట్టుకు మొట్టమొదటి సారి కాస్తున్న కాయలు, ఏదో పనున్నట్టు అక్కడికి వచ్చి, బుర్ర గోక్కుని తిరిగి వెళుతున్న గండు చీమ, ఎందుకింత అమాయకంగా ఉంది ఈ చిన్ని ప్రపంచం?

రెణ్ణెల్ల క్రితం - పాపకు స్కూలుకు వెళుతుంటే ఒక బాదాం కాయ కనబడింది. ఆ కాయ ఇంటికి తెచ్చుకుని, కండ తిన్నది పాప. బాదాం చెట్టు కండ తిని నీళ్ళు తాగితే తీయగా ఉంటాయిట. ఆపైన కాయ కొట్టుకుని, మిగిలిన ముక్కను పెరట్లోకి విసిరి వేసింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక చిన్న చెట్టు మొలకెత్తింది. చెప్పడానికి భావం చాలని అందమైన దృశ్యం అది! ఇప్పుడా చెట్టు మెలమెల్లగా పెరుగుతూంది.

ఇప్పుడున్న పెరటి బాదాం చెట్టు కూడా అలాగే వచ్చిందో, ఏమో! 

చెట్టు కాండాన్ని కావిలించుకుని దానికి చెవులను ఆన్చి వింటే ఒక మౌనసంగీతం వినబడుతుందట. వినగలిగితే అంత హృదయంగమమైన సంగీతం మరొకటి లేదు. సంగీతానికి నియతి కావాలేమో, ప్రకృతిపాటకు నియమాలు లేవు.

"నియతికృతనియమరహితాం, హ్లాదైకమయీమనన్యపరతంత్రామ్" అని జ్ఞానమూర్తిని, జగజ్జననిని, సాకారంగా, సరూపార్చన చేస్తాడు కవి. ఈ సృష్టి కూడా అంతేనేమో! ఇక్కడా నియమాలు లేవు, కోకిలపాట, బాదాం ఆకులపై వర్షం చినుకుల దరువూ, చల్లటి గాలి చిఱుస్పర్శ ఈ నియమరహితమైన సౌందర్యాన్ని, హ్లాదమే పరతత్త్వంగా కనిపిస్తున్న జగతిని - భగవంతుడు సృష్టించలేదు. ఈ సృష్టే తానై ఉన్నాడు. అసలు "ఉన్నాడు", "ఉన్నది" అన్న మాట కూడా తప్పేమో! "తథా అథ" - "అది అంతే" - కనిపిస్తున్నదే సృష్టి, స్రష్ట, సృజన అన్నీ!

కొన్నాళ్ళకు ఆ ఆకు రాలిపోతుంది. ఎఱుపు రంగు తేలి, గాలి విసురుకో, బలహీనత తోనో! చెట్టు నుండి విడిపోవటం లోనూ ఒక దర్పం! ఒక దర్జా, చిఱునవ్వూ! మరణమంటే ఇంత సులువుగా, ఇంత ఆనందంగా ఉంటుందా అని చూచేవాళ్ళకు అనిపించేట్టు! హ్లాదైకమయి - అనన్య పరతంత్ర - అంటే స్వేచ్ఛను అణువణువునా నింపుకున్నది కూడా ! ఈ రాలిపోయిన ఆకు ఆ చెట్టుకు, అంటే తన తల్లికి ఎరువు!

ఆధ్యాత్మికత భగవంతుడిలోనూ, ఆచారాలలోనూ, కర్మల్లోనూ, కర్మసిద్ధాంతం లోనూ ఉందని ఎవరు చెప్పారో ఏమో! చిత్తమార్దవం, క్షమ, శుచిత్వం అభిమానం లేకపోవటం వంటివి దైవికమైన లక్షణాలుట! అవి చాలేమో మనిషికి!

పక్కింట్లో పాపాయి మారాం చేస్తూ ఉంటే అమ్మ చందమామను చూపిస్తూ బాదం ఆకులో పెరుగన్నం పెట్టి తననే తినమని చెబుతూంది! పాప నవ్వుతూంది.

To see is to love! - ప్రపంచాన్ని చూడటమే ప్రేమ!

Friday, September 14, 2012

వీణ వేణువైన మధురిమ!


ఆయన పాటలో ఆయన వేషం లానే పటాటోపాలు ఉండవు. పెద్ద పెద్ద సమాసాలు, బిగువైన పదబంధాలు, ఊపిరి తిప్పుకోలేని అద్భుతాలు లేవు. అలా రాయలేక కాదు. అవసరం లేక అలా రాయడాయన. చిన్న చిన్న తెనుగు పదాలతో మనసులను మైమరపించగలిగిన కలం ఆయనది. ఆయన పెన్నులో ఇంకు వాడతారో లేక తేనె వాడతారో తెలీదు కానీ రాసిన పాటలో మాత్రం మాధుర్యం కారిపోతూ ఉంటుంది.

ఒకపక్క బాలు, జానకి, మరోపక్క తెరపై నటించడానికి ముచ్చటైన జంట రంగనాథ్, ప్రభ. ఇంకేముంది? బాలు కు తోడు జానకి గారు, నటించడానికి చక్కనైన జంట ఉంది కాబట్టి "పూలు గుసగుసలాడేనని" పాటలోలాగా, గాయకుడు, నటుడు కలిసి రచయిత ను, సంగీత దర్శకుడిని తుక్కు రేగ్గొట్టాలి. కానీ అలా జరగలేదు. బాలు గొంతులో మాధుర్యం, జానకి గొంతులో నయగారాలు ఆ అపురూపమైన సాహిత్యానికి పక్క వాయిద్యాలుగా చేరిపోయాయి. మనోహరమైన సంగీతానికి పల్లకీలు మోసినాయి. వేటూరి, రాజన్ నాగేంద్ర గారలు చిరస్మరణీయులు అయ్యారు. వేటూరి గారి కలం వేణువు, రాజన్ నాగేంద్ర గారల సంగీతం వేణునాదమూ అయినాయి.

*************************************************************************

ఈ పాట ఇంటింటి రామాయణం సినిమా లోనిది. అనగనగా ఒక డాక్టరు. ప్రవృత్తి రీత్యా కవి. చిన్న చిన్న కవితలల్లుతుంటాడు. గొప్పింటి బిడ్డ. ఆయనకు నచ్చిన అమ్మాయితో వివాహమైంది. మనసైన వాడు. అమ్మాయి అణకువ, అందమూ కలబోసిన చక్కని చుక్క. వారి దాంపత్యం, ప్రేమ పాటగా జాలువారింది.

ప్రేమ పాట కాబట్టి ప్రేమ, మనసు, అనురాగం, దాంపత్యం, హృదయం, మమత, ప్రాణం ఇలాంటి శబ్దాల్లో ఒక్కటైనా వినబడాలి మరి.

చిత్రం! అవేవీ ఈ పాటలో లేవు. మరో చిత్రం - ఆ సినిమాలో నాయకుని ప్రవృత్తి కవిత. ఆ ’కవిత’ ను ఒదల్లేదాయన. అక్కడా చాలా అర్థం ఇరికించాడు. వేటూరి కలం ఎలా మెలికలు తిరిగిందో చూడండి.

పల్లవి:

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...


అబ్బాయి మనసు వేణువు, అమ్మాయి మనసు వీణ. మనసు కు బదులుగా అనురాగాన్ని కానీ, ఆరాధనను కానీ దేన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. ఎంత క్లాసుగా ఊహించవచ్చో, అంత మాస్ గా కూడా ఊహించుకోవచ్చు. అది వేటూరి స్పెషాలిటీ!

వేటూరి కలం చిలికించిన ’ప్రాస’ లీలను ఇక్కడ చదువుకోండి. ఈ పాట గురించి వివరించి స్వారస్యం చెడగొట్టటం వద్దు.

’కదిలే అందం కవిత....అది కౌగిలి కొస్తే యువత’ - అబ్బాయీ నీవు రాసే కవితలు కాదు, నీ ఎదుట కదిలే అందాన్ని చూడలేదా? ఆ అందాన్ని కౌగిట్లో చేరిస్తేనే నీ యౌవ్వనానికి సార్థకం....కాదంటావా?....

పాఠకవర్యా! ఎన్ని అర్థాలు ఊహించుకుంటారో ఊహించుకోండి. ఇది మీకు విందుభోజనం....ఇదే వేటూరి ఆహ్వానం.


సరే. పాట చదువుకున్నారు కదా. ఇప్పుడు సంగీతానికి వద్దాం. ఇప్పుడు పాటను పల్లవి ఆరంభం ముందు వరకూ వినండి. పాట ఆరంభంలో వీణ! ఆ వీణ అలా మెలమెల్లగా వచ్చి మురళీనాదంతో లీనమవడం - అంటే వీణ వేణువైన సరిగమ, తీగె రాగమైన మధురిమ ను గమనించారా?  ట్యూను తో సంగీతదర్శకుడు భావాన్ని చెబితే, ఆ భావాన్ని మనసుతో పట్టుకుని అందుకు అనుగుణంగా పాట వ్రాయడం వేటూరికి చెల్లింది.




సరిగ్గా అర్థం కాకపోతే మరోసారి పాటను చూస్తూ వినండి.


మొదటి చరణం జానకితో మొదలెడితే, రెండవ చరణం బాలు తో మొదలు. రెండు చరణాల మధ్యలో హమ్మింగ్. వేటూరి కలం ప్రాస! ఆహా! ఎంత అందమైన symmetry?

ఈ పాటలో జానకి "తహ తహ" లాడాల అన్నప్పుడు పరవశమూ, బాలూ "అహాహా లలలా" అని రాగం తీసినప్పుడు ఉన్న అలవోక, అద్భుతంగా ఉన్నా, "పూల గుసగుస లోలా" డామినేట్ చేయలేదు. వాళ్ళ పప్పులు వేటూరి ముందు ఉడకలేదు. అలాగే - ’కదిలే అందం కవిత’ అన్నప్పుడు నాయిక అందంగా సిగ్గు పడటం, ’చెలి ఊగాల ఉయ్యాల లీవేళలో’ - అన్నప్పుడు నాయిక, నాయకుల మధ్య అందమైన బిట్ వంటివి - సంగీత మాధుర్యాన్ని పెంచాయే గానీ సంగీతాన్ని మర్చిపోయే విధంగా కళ్ళకు పని చెప్పలేకపోయాయి. 


రాజన్ నాగేంద్ర గారల దమ్ము అది! ఇంకా రాజన్ నాగేంద్ర ల గురించి తెలియాలంటే ఈ పాట మాతృక , కన్నడ సినిమా పాటను చూడండి. కన్నడ పాట విరహ గీతం. తెనుగు పాట ఆహ్వాన గీతం. రెంటికీ దాదాపుగా ఒకే ట్యూను? ఎలా సాధ్యం? అది రాజన్ నాగేంద్ర గారి ఇంద్రజాలం. ఈయన పాటల్లో నాకు తెలిసి వినలేనివంటూ ఒక్కటీ లేవు. అంత మధురమైన సంగీతం ఆయనది.



ఈ పాట సాహిత్యానికి, సంగీతానికి సంబంధించి నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంటింటి రామాయణం సినిమాకు ’హొంబిసిలు’ అనే నవల ఆధారితమైన కన్నడ సినిమా మూలం.

Thursday, September 13, 2012

పూల గుసగుసలు మరొకసారి..


వామ్మో! అసలు బాలు మనిషేనా? పాటలెవరైనా పాడతారు కానీ ఇదేంటిది? ’వయసు సవ్వడి చేసేనని’ - ఆ ముక్క పాడేప్పుడు వయసు సవ్వడి ’చేసే’ - లో అదుగో ఆ చేసే అనే చోట బాలు గొంతు వినితీరాలి బాబులూ!

ఎక్కడ నుండి మొదలెట్టాలి? చరణం నుండి మొదలెడదామా? వద్దు. ముందు ఈ వీడియోలు చూసెయ్యండి. చెప్తా. రెండు వీడియోలెందుకంటే రెండు ట్యూన్లలో కాస్త తేడాలున్నయ్ వినండి తెలుస్తుంది. మొదటి వీడియోలో కృష్ణ ఏక్షన్ ను కూడా వదలద్దు.


 

చూశారా? ఇప్పుడు చరణం గుర్తుకు తెచ్చుకోండి.

మబ్బు కన్నెలు ’పిలిచే’నని - మేఘాల కన్నెలు పిలుస్తున్నట్టే లేదూ?
మనసు రివ్వున ’ఎగిరే’నని - ’ఎగిరే’నని అనే కాడ రోంత మనసు పెట్టి యినండి. మనసు ఎగురుతున్నట్టు లేదూ?
వయసు సవ్వడి ’చేసే’నని - ఇదివరకే చెప్పా గదా! ’చేసే’ అనేచోట గొంతును అలా మార్చడం ఈ భూప్రపంచంలో బాలుకు మాత్రమే సాధ్యం. మా
భాస్కర్ భాయ్ కూడా అదే అంటున్నాడు.

సరే, బాలు కు సిగ్గు లేదు కాబట్టి ఇలా పాడి పెట్టాడు. మా ’బెండు’ అప్పారావు - కృష్ణకు ఏమొచ్చింది మాయరోగం? ఆ వీడియో చూశారు గందా, మొదట్లో ఈల వేసుకుంటూ వస్తాడు కదా, అక్కడ అసలు మొగ్గ లాగానే నడుస్తున్నాడు చూడండి. ఆ తర్వాత పూలు గుస గుస అని పల్లవి ఎత్తుకునేప్పుడు మాత్రం పువ్వులా వికసించిపోయాడు.అసలు మా వాడు కృష్ణయే పువ్వు లాగున్నాడు. అతణ్ణి చూసి పువ్వులే సిగ్గుపడాలి. ఇక కోటు తొడగటం ’ఊర మాస్’ లో క్లాసు కు పరాకాష్ట! ఈ పాటకు కోటు వేసుకోకుండా మామూలు అంగీ తొడిగి ఉంటే ఎంత దరిద్రంగా ఉండేదో ఊహించండి! అసలు ఎవడు సామీ ఆ సైన్మ దర్శకుడు? ఎవడసలు నృత్యదర్శకుడు? అందరూ ఇట్లా రెచ్చిపోతే ఎలాగ ?

కళా దర్శకుడు తక్కువ తిన్నాడా? ఆ లొకేషనేంటి? ఫోటోగ్రాఫరో? కృష్ణ మొదటి చరణం పాడేసి రిలాక్సెడ్ గా ఉన్నప్పుడు గాంధీ విగ్రహం చూపిస్తున్నాడు. ఆ తర్వాత "ఆ, ఓహ్" అనే అమ్మాయి గొంతు గమకాల మధ్య వాణిశ్రీ! వామ్మో! ఏం మాసు? ఏం క్లాసు??



పూలు గుసగుస అనే దాన్ని మూడు టోన్ లలో పాడినప్పుడు నాకు మొదటి సారి బాలు గొంతులో మల్లెపువ్వు, రెండో సారి బంతి పువ్వు, మూడో సారి వంద రేకులతో తామరపువ్వూ విరిసినట్టు (వి)కనిపిస్తా ఉంది. ఏం, పోలిక బాలేదా? అయినా సరే అదంతే.

పల్లవి అయిన తర్వాత మ్యూజిక్ వచ్చేప్పుడు (లల లలా, లాలా) పూలమీద నుండి పక్కకు మళ్ళుతుంది కెమెరా. ఒక్క కెమెరాయే కాదండి. మ్యూజిక్కూ మళ్ళుతుంది. చరణం మొదలవుతుంది.

చరణం తర్వాత ఒకసారి వినండి. ’రురురు రూరూరురు ,,, ఆ...ఓహ్’ లో ఆ ’ఆహ్..ఓహ్..’ ల కాడ ఆ ట్యూను ఉందే అది రికార్డు చేసేప్పుడు బాత్ రూమ్ లో దూరి రికార్డు చేసి ఉంటాడు ఖచ్చితంగా. బాలు మనిషి కాదు కాబట్టి చెప్పలేం కానీ మనలాంటి మనుషులకు మాత్రం కృష్ణ గొంతులో వినిపించే ఆ ’ఆహ్, ఓహ్’ లు బాత్ రూములో మాత్రమే సాధ్యమైతయ్.

రెండో చరణం -

అలలు చేతులు సాచేనని - అలలు అన్నప్పుడు అలలు వస్తున్నట్టు ’చే’తులు లో ’చే’ దగ్గర అల విరిగింది. సాచే లో చే దగ్గర మరోసారి అల విరిగింది.

నురుగు నవ్వులు పూచేనని - పూచే లో పూలు పూయడం విన్నారా?
నింగి నేలను తాకేనని ... నేడే తెల్సింది రురు .. రురు.. రురురూ ..ఆహ్ .. ఓహ్

నింగి నేలను ’తాకే’ నని - ’తాకే’ దగ్గర గొంతులో ఆ తమకం! బాలూ నీవు కడుపుకేం తింటున్నావురా బాబు? ఆ పరవశం నుండి కోలుకోకుండానే మళ్ళీ ఆ ’ఆహ్..ఓహ్’ లు!

ఈ పాటకు రెండు రకాల ట్యూన్లు. ఒకటి సినిమాలో, మరొకటి బయట. రెండూ రెండే! ఈ పాట వినడానికి కళ్ళూ, చూడడానికి చెవులూ కావాలి. ఎందుకంటారా? పాట వినేప్పుడు పూవు విచ్చుకోవడం కనిపిస్తుంది. కృష్ణ వీడియో లో ఆడియో మూసి పెట్టి చూడండి. పూల గుసగుసలు, మబ్బు కన్నెలు పిలవడం, వయసు సవ్వడి చేయడమూ వినిపించట్లే?

నిజానికి నాకయితే విన్న ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా వినిపిస్తుంది. వందసార్లు విన్న తర్వాత కూడా కొత్తగానే ఉంటది. కొన్ని నెల్ల క్రితం నా ఫోనులో రింగుటోను పెట్టాను. ఆఫీసులో కొరియావాడు మొదట ఈలతో వచ్చే మ్యూజిక్ విని డంగై పోయాడు! ఆ ఈల సహజంగా ఉంది, ఎవరో వేస్తున్నట్టు! ఆ పాట నాతో అడిగి ఎక్కించుకున్నాడు కూడా!

తెలుగు సైన్మా పాటల్లో ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది రాసింది నారాయణరెడ్డి అట. సంగీతం జీకే వెంకటేష్. అయితే వాళ్ళిద్దరి కంటే బాలు, కృష్ణలే ఈ పాటకు నిజమైన కర్త, కర్మ క్రియ అన్నీ! ఇంత చేసి ఈ పాట హిందీ సినిమా పాటకు కాపీ. అయితే ఆ హిందీపాట జితేంద్ర మొఖంలా ఉంది. దాని గురించి మాట్లాడ్డం వేస్ట్.



ఈ పాటను మళ్ళీ ఈ మధ్యన ఒక సైన్మా లో పెట్టుకున్నారు. అది లెజెండ్రీ స్థాయినుండి సెలెబ్రిటీకి పడిపోయినట్టు నికృష్టంగా ఉంది.

మరొక పాట ’వీణ వేణువైన సరిగమ విన్నావా?’ దాని గురించి మరెప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు.

Monday, August 6, 2012

మధురస్వప్నం



రోజూ లాగే మరో పొద్దు పొడిచింది. అదే పొద్దు మునుగుతూనూ ఉంది. ఈ పొద్దుకూ ఎక్కడెక్కడో, ఎన్నో తమ్మిపూలు విరబూసి ఉంటాయ్.  ఈ ఇంటా ఒక తమ్మి విరబూసింది. ఈ రోజు పొద్దునే సంహిత పట్టులంగాలో కనిపించింది. దానికి జుట్టు అంతగా పెరగలేదు. అయినా సరే రెండు క్లిప్పులు పెట్టుకుని, ఒక్కోసారి చిన్న చిన్న మల్లెపూలమాలలు చుట్టుకుని తిరుగుతూంటుంది. భలే నవ్వొస్తుంది. నాన్న బయటికే నవ్వేస్తుంటే అది కొంచెం ఉడుక్కుంటుంది. ఊహూ, ఉడుక్కోవడం కాదు...ఏదో విచిత్రమైన భావం! నాన్న ఎందుకు అమ్మలాగా, అమ్మమ్మలాగా సీరియస్ గా ఉండడు, ఊరికే నవ్వుకుంటూ ఉంటాడు అనేమో!

అవును మరి, అమ్మకూ, అమ్మమ్మలకూ పావడా,అంగీ తడుస్తే కోపం,మట్టిలో ఆడుకుంటే తప్పు, క్రాఫు మాసిపోతేనో, షర్టు నలిగితేనో, ఐస్క్రీం తింటేనో చిన్నపాటి భయం! నాన్నకివేవీ పట్టదు. నాన్న దగ్గర ఫ్రీ!

నాన్న కు బొంగరమాడటం, చేతిలో తిప్పటం వచ్చు ( గోళీలు,బొంగరాలు, చిల్లాకట్టె, బచ్చాలు వంటి విద్యలని ఉగ్గుపాలతో నేర్చుకున్న రక్తం గదా) 



మన్నెప్పుడో రాకరాక ఊర్లో వాన పడితే, తనూ, నాయనా కలిసి గొడుగు పట్టుకుని మిద్దె మీదకెళ్ళారు. కాసేపటికి వానతో బాటు, ఎండ మొదలైంది. దానికి సైడ్ ఎఫెక్ట్ లాగా సరిగ్గా ఇంటికికెదురుగా ఒక రంగురంగులబాణం వచ్చి నిలబడింది. పాప ఆ ఇంద్రచాపాన్ని చూసి దానికంటే అందంగా నవ్వింది. కాసేపటికి మళ్ళీ కాగితపు పడవల పర్వం మొదలయ్యింది. అంతా అయ్యి ఇంటికొస్తే, పాప అమ్మకు పాప, నాన్న ముఖాల్లో వెలుగుకన్నా, పాంటు అంచుల్లో బురద, పావడ అంచుల్లో నీళ్ళు కనబడ్డాయి. తిట్లు మామూలే. నాయన నవ్వు మామూలే. తమ్మి నాన్న వంక చిత్రంగా చూడటమూ మామూలే.

తమ్మికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే అందరికీ బాధ. నాన్నకు మాత్రం ఆ ముల్లు తీయడానికి, ఆ ముల్లు ద్వారా తెలుగు నేర్పడానికి ఒక అవకాశం చిక్కిందన్న ఊహ, ఆ ఊహ వలన వచ్చిన నవ్వు.

మరుసట్రోజు పాప అమ్మ దగ్గరకెళ్ళి పెద్దగా అరుస్తా పద్యం చెప్పింది.

చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ

అమ్మకు అందులో మూడవపాదం అన్నిటికన్నా స్పష్టంగా వినిపించింది. నిరసన మామూలే.

*********************************************************

మా తమ్మిని పట్టులంగాలో చూస్తుంటే ఏదో అస్పష్టమైన జ్ఞాపకం, మా అనంతపురంలో కురిసే వానలాగా నాతో దోబూచులాడుతూ ఉంది. అంతే కాదు, అది నా దగ్గర వచ్చి ఏదో ప్రశ్న అడగడం, దానికి నేను బయటికే నవ్వడం వంటివి చూసినప్పుడు కూడా ఏదో సందిగ్ధమైన ఆలోచన. ఎప్పుడో, ఎక్కడో, ఇలాంటిది నా ముందు జరిగింది అని.

ఆ జ్ఞాపకాల సీతాకోక చిలుక ఇదుగో ఈ రాత్రి నా చేతికి పట్టుబడింది.

**************************************************************

అవును. తమ్మి లానే పట్టు లంగా, చిట్టి చిట్టి జడలతో ఉన్న అమ్మాయి నాకు బహుశా ఐదారేళ్ళప్పుడు పరిచయం. ఆ అమ్మాయి మా పక్కింటి సరోజ. బహుశా నా జీవితంలో మొదటి గర్ల్ ఫ్రెండు!

సరోజ పొద్దస్తమానం మా ఇంట్లోనే ఆడుకునేది. మా ఇంట్లోనే భోంచేసేది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్న విషయం ఆ వయసులోనే ఆమెకు అర్థమయ్యింది! దానికి భోజనం పెట్టటం అమ్మకు, ఇంట్లో అందరికీ ముచ్చట. అయితే "సుందరాంగులను చూచిన వేళల కొందరికి ముచ్చట" ఎలాగో,"కొందరికి బిత్తర" అలాగే. ఎందుకంటే మదీయులకు అప్పుడు తిండి తినిపించడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉండేవి. కిటికీ పక్కన కూర్చోవాలి, అక్కడ కూర్చుని, పెరుగన్నం తినాలి. తినేప్పుడు ఆకాశవాణి కడపకేంద్రంలో నచ్చిన పాట వినబడాలి. నచ్చినపాట - ఎంతగా నచ్చాలంటే ఆ పాట సినిమా బండిలో వినబడితే ఆ బండి వెనక నడుచుకుంటూ తన్మయత్వంతో వెళ్ళిపోయేంత మంచిపాట అన్నమాట.

తిండికి ఇంత హంగామాని చూసి సరోజ నవ్వితే సూర్యుడు సిగ్గుపడి మబ్బులదాపునకెళ్ళిపోడూ!

ట్రాన్సిస్టర్ లో అయిపోయిన సెల్సూ, కొయ్య ఏనుగు బొమ్మా, కొన్ని ప్లాస్టిక్ బొమ్మలూ మా ఇంట ఉండేవి. ఒక ఏడెనిమిది సెల్స్ ను రౌండు గా పెట్టి, వాటిపై మరికొన్నిటిని, వాటిపైన వీలైతే ఒకసెల్ ను ఇలా అమర్చి ఆడుకొంటుంటే, సరోజ పట్టుపావడతో రెండు జళ్ళతో మా ఇంటికి వచ్చేది. భోజనాల సమయానికి కొంచెం ముందుగా. అంత కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడం ఆ పాపాయికి రాదు కాబట్టి ఏదో అలా చూసి వెళ్ళిపోయేది.

చందమామలో భల్లూక మాంత్రికుడు సీరియల్ వచ్చే రోజులవి.

మాచిరాజు కామేశ్వరరావు కథల్లో ’కట్నం’ అనే పదం ఎప్పుడూ వస్తుంది. అదేంటి అని అడిగితే మా అమ్మ చెప్పలేదు. భల్లూకమాంత్రికుడు చివర్లో ’ఇంకా ఉంది’ అంటే ఆ ’ఇంకా’ ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు. సరోజకు మాత్రం వాళ్ళ నాన్న రాత్రి పూట మడతకుర్చీలో పడుకుని చుక్కలు చూపిస్తా ఏవో కథలు చెప్పేవాడు.  నాన్న చేతిలోనే అలా నిద్రపోయేది.

నాకు బాగా జ్ఞాపకమున్న ఒకరోజు. సరోజ మామూలుగానే మధ్యాహ్నానికి కాస్త ముందు మా ఇంటికి రావాలన్న ప్లానుతో ఉంది. వాళ్ళమ్మకు పొద్దస్తమానం పాప అలా పక్కింటికి వెళడం తప్పని, దానికి సర్ది చెప్పాలని తాపత్రయం. అందుకని ముందుగానే భోజనం తినిపించెయ్యాలనుకుంది. ఊహూ. కుదరదు! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా కుదరదో, అలా సరోజ చేత పక్కింటికి వెళ్ళడం మానిపించడం అమ్మకు కుదరలేదు. వాళ్ళ అమ్మకు కోపం వచ్చింది. రెండు దెబ్బలేసింది.

అంతే! ఆ పాప ఏడుపు లంకించుకుంది. ఏమయ్యిందో, ఎలా వినబడిందో తెలియదు. వాళ్ళ నాన్న ఆఫీసు నుండి వచ్చాడు. పాపను సముదాయించాడు. ఆ తర్వాత మా ఇంట్లో ఆడుకోవటానికి పంపాడు!

ఇసుకలో ఆడుకుని బట్టలు పాడుచేసుకుంటే అమ్మ బట్టలు పాడయ్యాయంటే ఏం కాదని సరోజ నాన్న ఎత్తుకుని ముద్దుచేసేవాడు.

ఆ పాప వాళ్ళ నాన్న గారికి ట్రాన్స్ ఫర్ అయింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళ ఆచూకీ లేదు! అంతే! ఆ కథ ఒక ముగిసిపోయిన అందమైన అస్పష్టమైన మధుర స్వప్నం!

తమ్మి రాత్రి పూట అన్ని నక్షత్రాలు ఎక్కణ్ణుంచి వస్తాయని అనుమానం! అవన్నీ చిన్న పిల్లలై భూమీదకు వస్తాయని, ఒక నక్షత్రం పోతే మరొకటొస్తుందని నాన్న నవ్వు దాచుకుంటూ చెబుతున్నాడు. తమ్మికి నాన్న తప్పు చెబుతున్నాడా అని ఏదో అనుమానం. దాని ముఖం చూసి దాన్ని బోల్తా కొట్టించానని నాన్నకు నవ్వు!

సరోజ వాళ్ళ నాన్న కూడా ఇలానే నవ్వేవాడు!

అవును! పాపాయి పుట్టినప్పుడే ఆ ఇంట్లో నాన్న కూడా పుడతాడు! ఆ పుట్టుక తామర పువ్వు విరిసినంత అందంగా ఉంటుంది.

Saturday, March 17, 2012

విహారి - ఓ మినీ లోకల్ ట్రావెలాగుడు (ఫుటోలతో)

క్రితం వారం మా ఆవిడ పనిచేసే పల్లె (నీళ్ళు లేని)తిమ్మాపురంలో ఉండినాను. ఊరికే ఉండేదెందుకని ఉబుసుపోకుండా చుట్టు పక్కన ఒక మూడు పల్లెలు తిరిగొచ్చినాను. జీవితానికి మరొక రెండు అందమైన రోజులు జతపడినాయి. నా డైరీలో ఆ రోజునాటి పేజీలు..

నీళ్ళు లేని తిమ్మాపురం ఎందుకంటే - ఎక్కడో నీళ్ళుండే తిమ్మాపురం ఇంకోటుందంట. ఆ ఊరికి ఈ ఊరికి తేడా కనుక్కునేకి జనాలు ఇట్లా పెట్టుకున్నారు.

౧. రాధాస్వామి ఆశ్రమం - గుద్దెళ్ళ

అనంతపురంలో కల్యాణదుర్గం నుండి కర్ణాటక లో పావగడకు వెళ్ళేదారి బాగుంటుంది. ఆ దార్లో దాసంపల్లి తర్వాత ములకనూరు అనే పల్లెటూరు వస్తుంది. ఈ ఊరి శివార్లలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు - నెమళ్ళకొండ. అవును. ఆ కొండపైన సాయంత్రం పూట నెమళ్లను చూడవచ్చు మనం. ఒక్కొక్కసారి నెమళ్ళు కనిపించవు కానీ, చాలా దగ్గర నుండి మనకు నెమళ్ళ క్రేంకారవాలు వినిపిస్తాయి. ఆ ఊరిముచ్చట్లు మరెప్పుడైనా., ప్రస్తుతమనుసరామః...

ములకనూరు నుండి కాస్త ముందుకు వచ్చి కుడివైపు మట్టిదోవ పడితే రెండు కిలోమీటర్ల దూరంలో రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ ఇరవై ముప్ఫై ఎకరాల స్థలంలో ఆశ్రమం, తోట, ఆశ్రమం వారి నిర్వహణలో ఓల్డ్ ఏజ్ హోము ఉన్నాయి. అక్కడ వారందరు వారి అన్నం వాళ్ళే పండించుకోవాలి. అది నియమం. తోటలో సపోటా, మామిడి, జామ, అరటి, కూరగాయలు, తమలపాకులు, వక్క, ఆముదం విరగ కాసి ఉన్నాయి. దాపుల్నే చేనూ ఉందట. వేరుశనగ నూర్పిళ్ళు జరుగుతున్నాయి. బెంగుళూరు మామిడి కాయలు నవనవలాడిపోతున్నాయి. ఇవి కాస్త తీపిగా ఉండి ఊరగాయకు పనికి రావు కానీ,ముక్కలు కోసుకుని కారప్పొడి, తాలింపు వేసి పెట్టుకుని పెరుగన్నంలో నంజుకుంటే స్వర్గం కనిపిస్తుంది.


ఆశ్రమానికి వచ్చిన అతిథులకు కులజాతిమతభేదం చూపకుండా ఆశ్రమవాసులు స్వాగతించి భోజనం పెడతారు. ఒకరోజు ఉండదలుచుకుంటే ఆవాసం కల్పిస్తారు. ఆశ్రమానికి దాపున ఒక కొండ వుంది. రాత్రిపూట అక్కడనుండి ఎలుగుబంట్లు దుంపలకోసం వస్తాయి. అందుకని ఆశ్రమంలో జాతికుక్కలను సాకుతున్నారు.

ఆ ఊరికి నేను, మా ఆవిడా, తన తోడి టీచరమ్మలు, అయ్యలు కొంతమంది ఆటోలో వెళ్ళాము. వెళుతూ ఉంటే దార్లో ఒక అద్భుతం జరిగింది. కొండమలుపు దగ్గర దాదాపు పది పదిహేను జింకల గుంపు. అప్పుడు సాయంత్రం ఐదున్నర.

జింకలు మట్టి రంగుకు, సూర్యుని రంగుకు మధ్య రంగులో మెరిసిపోతున్నాయి. ఆటో శబ్దం వినగానే జింకలు గెంతుతూ పరుగు పెట్టినై.  కాళిదాసు శ్లోకం గుర్తొచ్చింది.

గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యన్దనే దత్తదృష్టిః
పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభియా భూయసా పూర్వకాయమ్ |
దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా
పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||

సూతా అదుగో చూడు! మెడను కాస్త వంచి క్రీగంట మన రథం మీద దృష్టిపెట్టి తిరిగి చూస్తూ, బాణం పడుతుందేమోనని ముడుచుకుంటూ, శ్రమవల్ల వచ్చిన ఆయాసంతో నోరు తెరిచి, గడ్డిపోచలు జారవిడుస్తూ, భూమిపైన కంటే, గాల్లోనే ఎక్కువభాగం ఉండేట్లుగా వేగంగా పరిగెత్తుతూంది.

(గ్రీవమంటే మెడ. గ్రీవాభంగమంటే మెడను తిప్పడం, గ్రీవాభంగ అభిరామం అంటే అందంగా మెడను తిప్పడం. స్యన్దనమంటే రథం)

కళ్ళకు కట్టినట్టుంది కదూ ఈ వర్ణన. ఈ సంస్కృతపద్యం అద్భుతరసానికి ఉదాహరణగా అలంకారికులు పేర్కొంటారు.
(జింక చచ్చేట్టు ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటే ఇందులో రసం, చారు కాచుకోవడమేం ఔచిత్యమని నాకొక అనుమానం ఉంది. మళ్ళెప్పుడైనా తీరిగ్గా ఆలోచించాలి.)

సరే మళ్ళీ బాటకు. జింకలు కెమెరా కన్నుకు దొరికినట్టు లేవు, ఒక్కటి దక్క.

తోటలో సపోటాలు, జామ కాయలు విరగకాసి ఉన్నాయి. మా ఆవిడ, తన సహచరులు ఆ తోటలో తమ షాపింగు చేసి రెండు సంచులు నింపుకున్నారు. ఆ రోజు గడిచింది.

౨. రాళ్ళపల్లి

మరుసటి రోజు పొద్దున - బండి తీసుకుని బయలుదేరాన్నేను సంహితతో కలిసి. తిమ్మాపురం నుండి కంబదూరుకు వెళ్ళేదారిలో ఒక కూడలి వస్తుంది. అక్కడి నుండి పక్కకు తిరిగితే - బొమ్మలో ఎఱుపు రంగు లైనుకు క్రిందుగా రోడ్డు కనిపిస్తూంది కదా ఆ దారిలో ఏడెనిమిది కిలోమీటర్లు వెళితే మేలుకుంట, రాళ్ళపల్లి గ్రామాలు వస్తాయి.


ఆ కొండ పైన ఒక చిన్న నీటి కొలను, దానిపక్కన ఒక చిన్న గుహ, అందులో ఎవరు ఎప్పుడు పెట్టారో తెలీని రాముల విగ్రహమూనూ. అక్కడికెళ్ళాలంటే కాస్త శ్రమపడి కొండ ఎక్కి దిగాలి. ఇది నిర్మానుష్యమైన ప్రదేశం. ఈ కొండపైన నీటికొలను, గుహలో రాముడి గురించి స్థానికులలో కూడా చాలా తక్కువమందికే తెలుసు. (ఈ ట్రెక్కింగు బ్లూస్ ఇప్పటివి కావు, పాత అనుభవాలు)


సరే మన దారికొచ్చాం.రాళ్ళపల్లి ఊరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక నిద్రాణమైన పల్లెటూరు. ఆ పల్లెలో ఏదో ఆంజనేయస్వామి దేవళం ఉందని విన్నా కానీ, అదీ అగుపడలేదు. వెళ్ళేదారి మాత్రం చాలా అందమైనది. అరటి తోటలు, దూరంగా కనిపించే పల్లె, మేలుకుంటలో చెఱువు...

రాళ్ళపల్లి - నిజానికి ఈ పేరు చెబితే ఇప్పటికే ఒక మహానుభావుని పేరు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మాత్రం అది తెలుగువాడి దౌర్భాగ్యం.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ - ఈయన 1893 నందన నామ సంవత్సరంలో రాళ్ళపల్లిలో పుట్టారు. (ఆయన తొమ్మిదవ యేట మైసూరుకు వెళ్ళి, ఆపై అక్కడే స్థిరపడ్డారు.) ఈయన గురించి చెప్పడం కొండను గాజుముక్కలో చూపడమే.
- రేడియోకి ఆకాశవాణి పేరు పెట్టినదీయనే.
- తొమ్మిది యేళ్ళ వయసులో అమ్మ, అయ్య చెప్పించిన చదువుతో తెలుగులో మీరా అనే ఖండకావ్యం వ్రాసిన ప్రతిభాశాలి. ఆ వయసులోనే సంస్కృత శ్లోకాలు చెప్పగలిగే వారట ఆయన. ఏక సంథాగ్రాహి, బహుభాషాకోవిదుడు కూడాను.
- మనం నేడు వింటున్న అన్నమయ్య పాటల్లో వందలాది పాటలకు స్వరాలు కూర్చిన సంగీతనిధి. (ఇప్పుడిటు కలగంటి, తందనానా ఆది, అదివో అల్లదివో..ఇట్లాంటి పాటలకు ఈయనే స్వరకర్త)
- అత్యుత్తమశ్రేణి విమర్శకుడు. ఈయన విమర్శ ఎంత నిశితమంటే, ఆయన తెనిగించిన రఘువంశకావ్యాన్ని (పదిహేడు సర్గలు), ఆయనే విమర్శించుకుని చించి వేశారు.
- వందలాది పీఠికలు వ్రాశారు. జాయపసేనాని వ్రాసిన నృత్తరత్నావళి సంస్కృత కావ్య అనువాదకర్త.
- అనేక గ్రంథాల పరిష్కర్త.

రాళ్ళపల్లి కాస్త నిరాశ కలిగించింది. అంతటి మహానుభావుడు పుట్టిన ఊరన్నట్టు లేకపోగా, ఆయనకు ప్రేరణ కలిగించినదేదైనా కనిపిస్తుందనుకుంటే అదీ లేదు.

తిరిగి వచ్చేప్పుడు, సంహిత,నేను సంహిత వాళ్ళమ్మకు చెప్పకుండా కొన్ని పనులు చేశాం. చింతచెట్ల చేతికి కొమ్మలు అందేట్లుగా కనిపిస్తే వాటిని పట్టి ఊపుకుని కాయలు రాల్చుకుని తిని, పక్కన పొలం గట్లలో పైపులో నీళ్ళు కడుపునిండా తాగేసొచ్చాం.

Monday, October 31, 2011

మూగోళ్ళ తోట


జనార్దనరెడ్డి నా వంక విచిత్రంగా చూసినాడు. వాడి చూపును చూసి నాకెందుకో భలే ముచ్చటేసింది. పలుకరించినా. వాడు తిరిగి బదులివ్వలేదు. రోంతలికి వాడి చూపుల్లో విచిత్రం కొంచెం కొంచెంగా సర్దుకుని మట్టసంగా ఐనాడు. నాతోబాటూ మా ఆవిడా, పాఠశాలలో ఆమె తోటి టీచర్లూ, ఇంకా స్టాఫు, అక్కడ కొట్టంలో జనార్దనరెడ్డి వాళ్ళ ఇంటి ఆడవాళ్ళూ.. ఇంతమంది ఉన్నా, నాకెందుకో వాడితోనే ఊసులాడాలానీ, ఆ అందమైన సాయంత్రం ఆడుకోవాలని అనిపించింది. వాడు అంతమంది మధ్య నాదగ్గర మొగమాటం లేకుండా దగ్గరికి రాగలిగినాడు కానీ మాట్లాడడు.

ఆ పిల్లోని నోట పలుకు రాకపోవడానికి కారణం తెలిసి, ఆ రోజు బలవంతంగా నా ఉద్వేగాన్ని అణుచుకోవలసి వచ్చింది. జనార్దనరెడ్డి పుట్టుమూగి. అతడే కాదు, వాళ్ళ నాన్న, ఇద్దరు పెదనాన్నలూ ఎందుకనో యేమో మూగవాళ్ళు.(అందుకనేనేమో, దేవుడిభాష మౌనాన్ని అర్థం చేసుకున్న వానికి మనుషుల గోల చూసి చిత్రమనిపించుంటుంది. దేవుని భాష, గీర్వాణమూ, ప్రాకృతమూ కాదు. మౌనమే ఆయన భాష. కావాలంటే ఈ సారి ప్రశాంతమైన దేవళంలో శివుని లింగం ఎదురుగానో, అమ్మవారి ముంగిటనో నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళుమూసుకోండి. ఒట్టు. దేవుని పలుకరింపు వినబడుతుంది. ఇంకా పెద్దమనసున్న వానికి దేవుని గుడే అక్కర్లే, యే చెట్టుకిందనో అందమైన పూట కూర్చుంటే చాలు)

రెడ్డేర్ల తోటలో మామిడిచెట్లూ, పనస చెట్టూ, కొబ్బరి బొండాలు, పక్కనున్న బాయి, దూడ, ఇవన్నీ మమ్మల్నా రోజు ఆప్యాయంగా పలకరించినై. మమ్మల్ని కట్టమీద కూర్చోమని రెడ్డి చెట్టుపైనెక్కి కొబ్బరి బొండాలు దింపినాడు. నవనవలాడే పచ్చిమామిడి కాయలు ఎవరికాళ్ళు కోసుకుని ఒకపక్క ఉప్పురాసుకుని నముల్తా మురిసిపోతున్నారు.

నాకు మాత్రం వాటికన్నా మా జనార్దనరెడ్డి లోటాలో తెచ్చుకున్న బొరుగులు వాడికి తినిపిస్తా, ఒకట్రెండు పలుకులు నేనూ నోట్లో యేసుకుంటా ఉంటే, అహా అనిపించింది.

రెడ్డెర్ల ఇంటాడంగులు మాట్లాడిస్తా, పొలం కబుర్లు చెప్పిరి. అందర్లోకి చిన్నోడంట ఇప్పుడు పొలం చూస్తా ఉండేది. యే యేడికాయేడు ఎట్లో నెగ్గుకొస్తన్నామని చెప్పినాదాయమ్మ. ఆ మహాతల్లికి, మాకు ఏం సమ్మందమని? మామిడికాయలు కోసిచ్చి, ఉప్పూకారం తెచ్చిచ్చి, బొండాలు తాపి, తోటకి మళ్ళీ రమ్మని పిలిచిందాయమ్మ.

సాయంత్రం బండిమీద తిమ్మాపురంలో శనక్కాయలతోట కాడికి, ఆడ నుండి మూగోళ్ళ తోటకూ బైల్దేరి, పొద్దుగుంకే వేళ చంద్రుడు, సూర్యుడు డ్యూటీలు మార్చుకునే టయానికి తిరిగొస్తిమి.

బండి మీద ఊరేగటం భలే ముచ్చట. 

ఇప్పటికి మూడున్నరేండ్ల ముందర ముచ్చట ఇది.  టీవీ సీరియళ్ళూ, క్రికెట్టు మజా, ఫ్రిజ్జు నీళ్ళూ, సోఫాసెట్టు మెత్తదనం, ఫ్యాను గాలి, లాప్ టాపులో intellectual ejaculations, దవడలల్లాడించడానికి ఏదో జంక్ ఫుడ్డు ఇయేవీ లేని ఒక సాయంకాలం అది. మొబైల్ ఫోను సిగ్నలు కూడా లేదు. శుభం.

జనార్దనరెడ్డి ని మర్చిపోలేను. వాని చూపును కూడా. మళ్ళీ వాణ్ణి చూసే ధైర్యం మటుకు నాకు లేదు. వాడు బాగుంటే అంతే చాలు.

ఈ ముచ్చటనంతా కళ్ళున్నాయో లేవో తెలవదు కానీ తనకళ్ళతో కాక, మనసుతో చూసిన ప్రాణి ఇంకొకరున్నారు. దాని పేరు సంహిత. అవును. అప్పుడు మా ఆవిడ దౌహృద :).

Sunday, July 3, 2011

తొలకరి జల్లు


ఈ మధ్య బ్లాగులు వ్రాయడంలో ఏ మాత్రం ఆసక్తి కుదరట్లేదు. ఇటు రెండేళ్ళు కుస్తీ పట్టి, అయ్యవార్లను పీడించి
నేర్పించుకున్న పద్యాలు కూడా ఎంచేతో కుదరట్లేదు. ఏదో ఒకటి రాయాలి..రాయాలి..అని మనసు లాగేస్తోంది. సరే ఏం రాద్దాం అనుకుంటే ఈ రోజు (నా డిక్షనరీలో ఈ రోజు అంటే నిన్న)  ఆషాఢమాసం అని తెలిసొచ్చింది. ఈ మధ్య న్యూసు, టీవీ పుణ్యమాని మదర్స్ డే లు ఫాదర్స్ డేలు తెలుస్తున్నాయి కానీ ఆషాఢ మాసాలు, పాడ్యమి తిథీ, నక్షత్రాలు తెలియట్లేదు. షో కేసులో ప్లాస్టిక్ పూలు చూసుకుని మురిసి పోయే రకాలం మనం. ఏదైనా ప్రశాంతంగా ఉన్న తోటలోకి పారిపోయి పూలమొక్కల మధ్య ఓ సాయంత్రం మొత్తం మౌనంగా గడిపి వస్తే మనసుకు పట్టిన తుప్పు వదిలి ఫలితం కనబడవచ్చునేమో!

విషయానికొద్దాం. ఆషాఢమాసం వర్షర్తువు, ప్రావృట్కాలం. "మాసానాం మార్గశీర్షోsహం ఋతూనాం కుసుమాకరః" అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. "నెఱ్ఱెలు విచ్చిన నేలతల్లిని చూసి పైనున్న ఆకాశం రాల్చిన అశ్రుకణం తాకే ఆషాఢ మాసం" -ఆయన్ను కదిలించలేకపోయింది. ఆయనేమో ఆనంద స్వరూపుడాయె. ఆయనకు కోకిల కుహూరవాలు, మామిడి పూతలు, చిగురించే పుష్పాలతో అవసరం. మనం మనుషులం కాబట్టి మనకు తొలకరి జల్లులు, మట్టి వాసనలు, పసి పిల్లల కాగితపు పడవలు మనకివి ఆనందం. (అఫ్కోర్సు due apologies on గీతాకారుడు)   
 
వర్షం పడుతూంటే కిటికీ పక్కన చల్లగాలి తగులుతూంటే ప్లేట్లో పకోడీలు, ఇటుపక్కన ఏ చిట్టిబాబు వీణానాదమో, ఆకాశవాణి లో ఛాయాగీత్ కానీ వింటూ, పక్కనో పాత చందమామ లేదా యువ పత్రిక తిరగేస్తూ ఉంటే.. ఆహా. స్వర్గంలో రంభలూ,ఊర్వశులు తప్ప ఇలాటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో.

నాకు నా చిన్నతనం నుండీ నీళ్ళ పిచ్చి విపరీతంగా ఉండేదట. అపసోపాలు పడి బడిలో చేర్పించాక, ఒక రోజు పొద్దున మా వీధి మొగదల వీధి కొళాయి నీళ్ళు అందరూ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను దానికింద తిష్టవేశానట. అలా నీళ్ళలో తడిసిపోతూ ఆనందంలో మునిగి తేలుతా ఉంటే, ఎవరో దుర్మార్గుడు మా ఇంట్లో వాళ్ళకు చెప్పి, వాళ్ళు నా తడిచిపోయిన పలక, బలపం తీసేసుకుని లాక్కుపోయి బడితెపూజ చేశారట. (ఈ విషయాలు మా ఇంట్లో వాళ్ళెప్పుడైనా చెప్పుకుంటూంటారు) ఆ తర్వాత ఏడవ తరగతిలో ఓ మారు మా ఫ్రెండు ఇంట్లో దిగుడు బావి ఉంటే అక్కడకెళ్ళి మునగబెండ్లవీ కట్టుకుని ఈత నేర్చుకుందుకు ప్రయత్నిస్తే, ఆ కుట్రను కూడా మా ఇంట్లో వాళ్ళు కనిపెట్టి భగ్నం చేశారు.

మూడేళ్ళ తమ్మి (సంహిత) కి కొన్ని నాన్న బుద్దులు వచ్చాయి. అమ్మ వారసత్వం కూడా (తమ్మి వాళ్ళమ్మ రైతుబిడ్డ). నాన్న బుద్దులు విజృంభించినప్పుడు వర్షంలో/నీళ్లలో ఆటలు, అమ్మ వారసత్వం బలంగా పని చేసినప్పుడు మా ఇంటి వెనుక చెట్లకు పాదులు తవ్వడం వంటి శ్రమజీవి లక్షణాలు అలవర్చుకుంది. నాకైతే అమ్మవారసత్వం ఇబ్బంది లేదు కానీ, మా ఆవిడ మాత్రం తమ్మి తాలూకు నాన్న బుద్ధుల్ని నిరసిస్తుంది. వర్షంలో తడిస్తే కసురుతూంటుంది.

రెండేళ్ళ క్రితం ఓ రోజు బస్సులో వెళుతున్నాను. బయట చినుకులు పడుతున్నాయి. ఆకాశం మన కళ్ళు పడితే
దిష్టి కొడుతుందేమో అన్నంత అందంగా ముస్తాబయింది. అప్పుడు బయట ఆకాశం, కిటికి పక్కన అలవోకగా జల్లు
కొడుతున్నప్పుడు మృచ్ఛకటికం అనే సంస్కృతనాటకం పుస్తకం చదివాను. ఆ నాటకంలోనూ కాకతాళీయంగా (ఐదవ అంకం) వర్ష రుతు వర్ణన. ఆ నాటకంలో సందర్భం ఇది. నాయిక వసంతసేన తన ప్రియుడి ఇంటికి వెళుతూంటుంది. ఆమెకు తోడుగా ఒకతను. వాళ్ళిద్దరూ (గాసిప్పులవీ కాకుండా) వర్షం గురించి మాట్లాడుకొంటూ, వర్షాన్ని వర్ణిస్తూ ఉంటారు.

" ఆహా ఈ నల్లమబ్బులు విరహిణుల హృదయాల్లాగా ఎంత భారంగా ఉన్నాయి? ఇదుగో ఈ ఉరుములు విని నెమళ్ళు పైకెగిరి, రెక్కలు అల్లల్లాడిస్తూంటే, ఆకాశాన్ని ఎవరో మణిమయవింజామరలతో వీస్తున్నట్టు లేదూ!"

"మేఘుడు వర్షధారలనే శరాలతో కొట్టి చంద్రుణ్ణి వశపర్చుకున్నాడు. ఉరుములు ఈ యుద్ధంలో భేరీనినాదాలు. మెఱుపులు మేఘుని విజయపతాకలు. చంద్రకిరణాలు - చంద్రుడు పన్నుల ద్వారా ప్రజలను పిండి వసూలు చేసిన సొమ్ము. వాటిని మేఘుడు కబళించాడు."

"ఈ దట్టమైన మేఘం చూడు! ఏనుగాలాగా ఉంది. ఆ కొంగలబారును చూశావూ! ఏనుగు కుంభస్థలంమీద అలంకరించిన పట్టుపాగాలానూ, మెఱుపులు వింజామరల్లానూ లేవూ?"

"ఆ పైనున్న మేఘాలు ఇంద్రుడి ఆజ్ఞ మేర మెఱుపులనే వెండి మోకులు విడిచి భూమిని కట్టి పైకి లాగుతున్నట్టుగా ఉంది!"

"ఆ కదంబ వృక్షం ఎఱ్ఱటి దివ్వెలా ఎలా వెలిగిపోతుంది చూడు!"

"దుష్టుడికి చేసిన ఉపకారాల్లాగా నక్షత్రాలు ముఖం చాటు చేశేసాయి.  ప్రోషితభర్తృకలలాగా దిక్కులు శోభను కోల్పోయినాయి."

"ఈ ఆకాశం మెఱుపులతో మండుతూంది. కొంగల గుంపుతో నవ్వుతూంది. హరివిల్లుతో కయ్యం పెట్టుకుంటూంది. పిడుగులతో అరుస్తూంది. మబ్బులతో ధూపంలా ఉంది"

....
....
....

అన్నట్టు ప్రోషిత భర్తృక = సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్య అని అర్థమట. ఈ మధ్యే తెలిసింది.

మృచ్ఛకటికం లో ఈ వర్ష ఋతు వర్ణన, సంస్కృత సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన వర్ణనగా పండితులు చెబుతారు.

అంత హెవీగా కాకపోయినా మన రవీంద్రుడు కూడా వర్షాన్ని తెగ వర్ణిస్తాడు. ఉరుముల శబ్దం, వలలో చిక్కిన అడవిదున్న ఆర్తనాదంలా ఉందంటాడాయన. ఈ వర్ణనలకన్నా, నాకు మాత్రం (కవీంద్రుని) కాగితపు పడవ తెగ నచ్చుతుంది. మా పాపకు కూడా.

Tuesday, October 26, 2010

జయజయ....

ఆదిత్య 369 గుర్తుందా? సకుటుంబ సమేతంగా చూడగలిగిన కొన్నేకొన్ని బాలకృష్ణ సినిమాలలో అది ముఖ్యమైనదని మా ఇంట్లో పెద్దలు నొక్కకుండనే వక్కాణించేవాళ్ళు. ఆ సినిమాలో ఒకానొక దృశ్యంలో కృష్ణదేవరాయలు విష్ణువు మీద ఓ పద్యం చదువుతాడు (పాడతాడు), తనదేవేరితో కలిసి దేవాలయంలో కులదైవాన్ని పూజిస్తున్న సందర్భంలో. ఆ పద్యం ఇక్కడ చూసి రండి. తర్వాత మాట్లాడుకుందాం.

ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు నాకీ పద్యం తెగనచ్చేసింది. పాడుకోడానికి పాటలా ఉంది, స్తోత్రంలానూ ఉంది. అలాగని కఠినంగా లేక, చాలా లయాత్మకంగా ఉంది. ఇదేం పద్యమబ్బా అని చాలాసార్లు అనుకున్నాను. ఈ పద్యం రాయల వారు పాడారు కాబట్టి, ఆముక్తమాల్యద లోనిదని ఇన్నాళ్ళూ అనుకుంటూ వస్తున్నాను . ఆముక్త మాల్యద లో చాలా పద్యాలు వ్యాఖ్యానం ద్వారా విన్నప్పటికీ, చదివినప్పటికీ ఈ పద్యం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదా అనిపించేది. తెలుగుపద్యం - కామేశ్వరరావు గారిని ఈ పద్యం గురించి చాలాసార్లు అడగాలనుకుని మర్చిపోయాను.

- ఈ పద్యం అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలోనిది. నాకు ఈ మధ్యనే పాతపుస్తకాల దుకాణంలో వావిళ్ళ వారి మనుచరిత్రము, రాఘవపాండవీయము దొరికాయి. ఈ రోజు మనుచరిత్రం సౌరభాన్ని ఆస్వాదించాలని, (ఆఘ్రాణించాలని కూడా) మనసుపుట్టి ఓ పేజీ తెరవగానే చప్పున ఈ పద్యం కనిపించింది. 

ఆరవ ఆశ్వాసంలో, స్వారోచిషునికి హరి ప్రత్యక్షమయితే ఆయనను స్వారోచిషుడీ విధంగా పొగడుతాడు.

జయజయ దానవదారణకారణశార్ఞ్గరథాంగగధాసిధరా
జయజయ చంద్రదినేంద్రశతాయుతసాంద్రశరీరమహఃప్రసరా
జయజయ తామరసోదరసోదరచారుపదోజ్ఝితగాంగఝరా
జయజయ కేశవకేశినిషూదన శౌరి హరీ దురితాపహరా

అర్థం :
దానవ = అసురుల
దారణకారణ = భేదమునకు హేతువులైన
శార్ఞ్గ, రథాంగ, గదా, అసి, ధరా = విల్లు, చక్రము, గద, ఖడ్గము తాల్చినవాడా
జయజయ
చంద్ర దినేంద్ర శతాయుత, సాంద్ర శరీరమహః ప్రసరా = చందురుల, ఆదిత్యుల, పదిలక్షలయొక్క విస్తారమైన శరీరకాంతినిపోలిన శరీరకాంతి కల్గినవాడా
జయజయ
తామరసోదర = పద్మాంతర్భాగమైన కెంపుకు
సోదర = సమానమైన
చారు = మనోహరమైన
పద ఉజ్ఝిత = పాదములనుండి వదలబడిన
గాంగఝరా = గంగానదీప్రవాహము కలిగినవాడా
జయజయ
కేశవ = మంచికేశములు కలిగినవాడు/బ్రహ్మరుద్రులకు పుట్టుక అయినవాడు అని రెండర్థాలుట (శోభానాః కేశాః యస్య సః, కశ్చ, ఈశశ్చ కేశౌ, తావస్మిన్ స్తః ఇతి కేశవః)
కేశినిషూదన = కేశి అనే రాక్షసుని చంపిన
శౌరి = శూరవంశోద్భవుడా
హరీ = హరీ
దురితాపహరా = వృజినములణఁచి వేయువాడా
జయజయ.

ఈ పద్యంలో మరో చక్కటి విశేషముంది. ఇది "కవిరాజవిరాజితము" అన్న ఛందస్సు. ఈ ఛందస్సులో ప్రత్యేకత మొదట నగణం తో మొదలై, ఆ తర్వాత 6 జ గణాలు ( లఘువు, గురువు, లఘువు), చివర్లో వ గణం తాలూకు దీర్ఘం తో ముగుస్తుంది. ఇదో అద్భుత లయ. ఎంత చక్కనిదంటే - మా చిన్నారి మొన్నామధ్య - విశ్వనాథ్ సినిమా, సప్తపది లో ఇదే ఛందస్సులో ఓ పాటని చూస్తూ (వింటూ), పాట ముగిసిన తర్వాత ఆ పాట తాలూకు మకుటాన్ని వచ్చీరాకుండా పాడుకుంది. ఆ పాట/స్తోత్రం ఊహించారా?

అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే
సురవర వంద్య విరోధిని వాహిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హేసితి కంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

(ఇప్పుడు "తమ్మి" (సంహిత) కు పై శ్లోకం చివరిపాదం వచ్చేసింది. ) ఈ ఛందస్సు కాస్త అరుదైనది అనుకుంటున్నాను. ఈ ఛందస్సులో ఏ కవులు వ్రాశారో తెలియకుండా ఉంది. మనుచరిత్రలో మాత్రం రెండు సందర్భాలలో ఈ ఛందస్సు ఉపయోగించాడు కవి.

ఈ రోజు నిదురకు ముందు చక్కటి అనుభూతి. తెలుగు సాహిత్యంలో నాకు చాలా ఇష్టమైన కవి అల్లసాని పెద్దన. (అనేక విధాలుగా ;-)) ఆయన పద్యమే నేను చాలాకాలంగా వెతుకుతున్నదని తెలియటమూ, నాకు నచ్చిన ఛందస్సులో ఉందని తెలియటమూ (ఈ పద్యం ఈ ఛందస్సులోనిదని ఊహించలేదు. పుస్తకం చూసిన తర్వాతే తెలిసింది) ....చాలా బావుంది.

ఈ ఛందస్సు గురించి, ఇతరకవుల ప్రయోగాలను ఎవరైనా తెలిపితే చాలా బావుంటుంది.

Friday, July 30, 2010

ఆషాఢస్య ప్రథమ దివసే..

తేదీ - జులై 12 వ తేదీ!
ఓ పల్లెలో.

ఆ రోజు ఆషాఢ మాసారంభం! తొలకరి జల్లు మొదలయింది. ఆ ఊరిపక్కన కొండ ఇలా ఉంది.

తస్సిన్నద్రౌ కతిచిదబలావిప్రయుక్తస్స కామీ
నీత్వా మాసాన్ కనకవలయభ్రంశరిక్తప్రకోష్టః
ఆషాఢస్య ప్రథమదివసే మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం దదర్శ.



ప్రేయసి విరహము అనుభవిస్తూ, ముంజేతి కంకణము లేని వాడయిన యక్షుడు ఆ పర్వతమందు కొన్ని మాసాలు గడిపి, ఆషాడమాసం మొదటి రోజు వప్రక్రీడలో నిమగ్నమైన ఏనుగులా కొండను ఆక్రమిస్తూన్న ఓ మేఘాన్ని చూశాడు.

పంటపొలం ఇలా ఉంది.


మా పాపాయి ఇలా అంది.




మా ఇంటి ముందు ఓ చెట్టిలా..


ఊరినుండి తిరిగి వస్తుంటే -

సూర్యకాంతం పూలు కూడా ’రవి’ ని చూడటం లేదు.


గత స్మృతులలో మునిగిన మధుగిరి కోట. ఆ కోట వివరాలిక్కడ.


జరిగి అప్పుడే ఎన్ని రోజులయ్యింది?

Thursday, July 15, 2010

జ్ఞానార్జన

ఆచార్యాత్ పదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా |
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ ||

గురువు నుండి ఒక పాలు, స్వమేధతో ఒక పాలు, ఇతరుల వల్ల ఒకపాలు, కాలక్రమేణా ఒక పాలు. శిష్యుడు ఈ విధంగా జ్ఞానం స్వీకరిస్తాడు.

***********************************************************

ఓ వారం పది రోజుల క్రితం తమ్మి (రెండేళ్ళకు ఓ నెల తక్కువ వయసున్న మా పాప) పలక, చాక్ పీసు పట్టుకుని దగ్గరకొచ్చింది. తను అలా నా దగ్గరకు రావడం, నేను గుర్రం బొమ్మ వేస్తే చూసి గాడిదని, ఏనుగేస్తే పందని అనడం మామూలే. నేను రూటు మార్చి పందులు, కుక్కల బొమ్మలెయ్య్డడం అనే అడ్వాన్సు స్టేజు కూడా వచ్చింది. అయితే ఈ రోజు తను వచ్చింది వేరే విషయమై.

"ఏం చేత్తున్నావు?" అడిగేను పాపను.
"ఏ రాతినా" అంటూ పలక చూపించింది. అవును పలక మీద అది "A" రాసింది.
మొదట ఆశ్చర్యమేసింది.
"ఏదీ, మళ్లీ రాయి" అడిగాను.
"తలే" అని A ఎడమవైపు కొస నుండి మొదలెట్టి, పైకి తీసుకెళ్ళి, అట్నుంచి కిందికి తీసుకొచ్చి, అడ్డగీత కంటికి కనిపించనంత వేగంతో గీసింది. (షాడో అలంకారం)

ఎలా నేర్చుకుందబ్బా ఆలోచించాను. అర్థమయింది. మా ఆవిడ పిన్నిగారు పిల్లలకు ట్యూషన్ చెబుతుంటారు. ఆ పిల్లల దగ్గర చేరి వెలగబెట్టిన నిర్వాకం ఇది. సో, పైన శ్లోకంలో మొదటి పాదం (గురువు నుండి నేర్చుట) బైపాస్ అయిపోయి మూడవపాదంలోకి (ఇతరులనుండి నేర్చుట) అడుగుపెట్టింది.

మా పాప మొదటి సారి "అమ్మ" అనే ప్రయత్నం చేసినప్పుడు -
Baby joy
Baby joy.mp4
Hosted by eSnips


మొదటిసారి గోడవారగా నుంచున్నప్పుడు -


మొదటిసారి చెంగావి రంగు చీర కట్టినప్పుడు

మొదటి సారి పాక్కుంటూ  ఇంటి వరండా దాటిన సందర్భంలో ఇంట్లో కుడుములు చేసినప్పుడు -
మొదటి సారి కుర్చీ ఎక్కడం నేర్చుకున్నప్పుడు -
మొదటి సారి నడిచినప్పుడు -
మొదటి సారి ’నాన్న" అన్నప్పుడు -

ఏదో లోకంలో ఉన్నట్టు బానే గడిచింది కానీ పలక మీద A రాయడం మొదట్లో బానే అనిపించినా తర్వాత "అ" రాయకుండానే A రాయడం కొంత మింగుడుపడలేదు. అయితే ఎవరూ నేర్పించకుండా తనే నేర్చుకుంది కాబట్టి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అయితే "తెలుగు", మాతృభాష, ఇంకాస్త గీర్వాణ భాష ఫీలింగులు ఉన్న నేను పాప విషయంలో ఓ హిపోక్రైట్ గా మారే రోజు దగ్గరలో ఉందని చూచాయగా అనిపిస్తోంది.

***********************************************************

సమయం వచ్చింది కాబట్టి నాకు అక్షరాలు నేర్పించిన గురువును కూడా స్మరిస్తాను. నాకు "అ" దిద్దించిన అయ్యవారి పేరు శంకరయ్య గారు. మా అమ్మా నాన్నా, నన్ను బడిలో "వేయ"డానికి యమ యాతన పడ్డారుట. బలవంతంగా ఆయనకు ఒప్పగించారుట. బడిలో పెద్దబెల్లు కొట్టేవరకూ ఇంటికి రావద్దంటే, కాసేపటికే పరిగెత్తుకొచ్చానట. "ఏరా ఇంతలోపే వచ్చావు" అనడిగితే, "ఆ శంకరయ్య, బెల్లే కొట్టి ఛావడు, అందుకని నేనే వచ్చేశా" అని చెప్పానట. బడిలో బెల్లు కొట్టే గుమాస్తా పేరు కూడా శంకరయ్యే.

ప్యూను శంకరయ్య ఏవో కారణాల వల్ల స్కూలు ఉద్యోగం మానేసి, ఓ సైకిలు షాపు, సోడాల షాపు నడుపుకుని కొన్నేళ్ళ క్రితం చనిపోయాడు.

శంకరయ్య మాస్టారు గురించి. ఆయన లింగాయతులు. మాట కర్కశం. మనసు వెన్న. ఆయన కోదండం వేస్తానని బెదిరించడం నాకు బాగా జ్ఞాపకం. ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకూ ఒకే స్కూల్లో చదివి, వీడుతున్నప్పుడు చివరగా ఆయన్ను కలిశాను. తను పెంచిన మొక్క సొంతంగా ఎదుగుతుందన్నట్టుగా ఆయన చూపు. అదే నాకు దొరికిన ఆఖరు చూపు కూడాను. కొన్నేళ్ళ తర్వాత ఆయన చాక్ పీసుల తాలూకు ధూళి ఊపిరితిత్తుల్లో చేరుకుని, శ్వాస తీసుకోవడం కష్టమై స్వర్గస్తులయ్యారు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చివరి అబ్బాయి పేరు కూడా రవి. వాళ్ళు అందరూ బానే ఉన్నారని విన్నాను.

***********************************************************

మళ్ళీ శ్లోకానికి. శ్లోకం కాస్త పరిశీలిస్తే నాకో విషయం అనిపిస్తున్నది. స్వమేధతోనూ, కాలక్రమేణా ఒకరి బుద్ధి వికసిస్తుంది. గురువు వల్ల, ఇతరులను చూసి హృదయం వికసించాలి. అప్పుడే చదువు సంపూర్ణమవుతుంది అని నేను భావిస్తాను.