Showing posts with label travelog. Show all posts
Showing posts with label travelog. Show all posts

Wednesday, March 21, 2012

ఒక శాసనం - వెనుక కథ

బహువృత్తాన్తాని రాజకులాని నామ - ప్రతిమా నాటకంలో భాసమహాకవి సీతమ్మ నోట చెప్పించిన మాట. రాజవంశాలలో జరిగే చిత్రాలు పలువిధాలు అన్న మాట ఆయన ఏ ముహూర్తంలో వ్రాసినాడో ఏమో ఇది భారతదేశ రాజవంశాలవిషయంలో అక్షరసత్యమయింది. ఆ ’చిత్రాలు’ తదనంతర కాలంలో శిథిలదేవాలయాలకూ, విరిగిపోయిన శిలలకూ, వైభవం కోలుపోయిన సంస్కృతీ నిలయాలకూ కారణమై, గతించిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఎట్టి కఱకు రాతి గుండెవానినయినా కరిగించి, విలపింపజేయగలిగిన కరుణాతరంగితమలయవీచికలు ఇవి. అలాంటి ఒకానొక కథను గుర్తు చేసే శిలాఫలకం, గతించిన దాని వైభవం, దానిని చెక్కించిన ఒకానొక పసి బాలుని దయనీయమైన కథనమే ఈ వ్యాసం.

(ఈ వ్యాసం ఉద్దేశ్యం చరిత్ర కాదు, చరిత్ర మీద, మన సంస్కృతి మీద సానుభూతి కలిగించడం. ఈ వ్యాసాన్ని ఏ విధమైన ప్రమాణంగా స్వీకరించవద్దని మనవి)

***********************************************************


(శాసనపాఠం - తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం)
శుభమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుద
య శాలివాహన శకవర్షంగ
ళు ౧౪౭౮ శయన సంవత్సరద
ఆషాఢ శు ౧౨ (మం)పుణ్యకాలదెయ శ్రీ
మద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ
వీరప్రతాపశ్రీ సదాసివరాయ మహ
రాయరూ ప్రౌఢిరాజ్యం గెవుతిరలు విరూ
పణనాయకరు శంఖదూర మల్లికా
ర్జున దేవర సమ్మాన సిలాశాసనద
క్రమవంతెందరె ప్రాకుదినగళలూ పారు
పత్యగారరూ మాన్యగ్రాసక్కొంబ గర్భ
రహౌసతం మ తందె రంతుప్రే నాయకరిగె
పుణ్యవాగి బెశోయంకుధారె
రద్దు కోట ధర్మశాసన యీ ధర్మ.

***********************************************************

భౌగోళికంగా రాయలసీమలో నేటి అనంతపురం జిల్లాకు ఒక వైచిత్రి ఉంది. అనంతపురం జిల్లాలోనికి కర్ణాటక తాలూకు ఒక పాయ చొచ్చుకుని వచ్చి ఉంటుంది. ఇటుప్రక్క, అటుప్రక్కనా తెలుగు, మధ్యలో కన్నడ. నేటి ఈ పరిణామం గత వందల యేళ్ళుగా కొనసాగుతున్న సాంస్కృతీ మైత్రికి చిహ్నం. రెండు భాషలు, రెండు సంస్కృతులు వందల యేళ్ళుగా కలిసి మమేకమై జీవిస్తున్న అపురూపమైన చోటు ఇది. లిపి కూడా తెలుగు కన్నడాలకు దాదాపు ఒక్కటిగానే ఉంది.

ఈ కర్ణాటక పాయకు ఇటువైపున కల్యాణదుర్గం, కంబదూరు, అటువైపు హేమావతి, అమరాపురం, మధ్యలో కన్నడనాడు ముఖ్యపట్టణం పావగడ. ఈ పేర్కొన్న పట్టణాలన్నీ గతించిన వైభవానికి చిహ్నాలే. అన్ని ప్రాంతాల్లోనూ విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్ళు కొద్దో, గొప్పో కనిపించడం కద్దు.

పైన పేర్కొన్న ఆ శాసనం కంబదూరు లోని శంఖదూరమల్లేశ్వరస్వామి దేవాలయం తాలూకుది. ఆ శాసనం తాలూకు భాష కన్నడ. శాసనంపైన శివలింగం చెక్కారు. కృష్ణరాయలు వైష్ణవుడు. ఈ శివలింగచిహ్నం ఆర్వీటి రామరాజు ప్రాభవానికి చిహ్నం కావచ్చును. ప్రతి వాక్యానికి ముందూ ’౦’ చెక్కారు. అందులో ప్రముఖంగా కనిపిస్తున్న పేరు - శ్రీ వీరప్రతాపసదాశివమహరాయలు. ఇంకా విరూపణ్ణ, పారుపత్తెదారుడు అన్న పదాలు కూడా ఉన్నై. ఆ శాసనంలో చెక్కిన సంవత్సరం - శాలివాహన శకం 1478 అంటే క్రీ.శ: 1556. ఆ యేడు ఆషాఢమాసంలో - శ్రీ మల్లేశునికి విరూపణ ద్వారా చెందవలసిన మాన్యాలను నిలుపుదల చేయిస్తున్నట్టు శ్రీ సదాశివరాయలి పారుపత్తెదారుడు వేయించిన శాసనం. పారుపత్తెదారుడు అంటే గ్రామాధికారి. బహుశా విరూపణ అనే అతను ఈ ప్రాంతానికి పారుపత్తెం వహిస్తూ ఉండేవాడు కావచ్చును. (ఈ అర్థాలు నాకు తోచినవి మాత్రమే)

మనకు తీగ దొరికింది: 1558 - అంటే తుళువ (సంపెట) శ్రీకృష్ణదేవరాయలవారు గతించిన తర్వాతి కాలం. ఆయన మరణించినది 1530 వ వత్సరంలో. అప్పటికి శ్రీవారి పుత్రసంతానం కూడా గతించింది. ఆ కుట్రకు తిమ్మరుసయ్య కారణమని ఆయన్ను పెనుగొండ జైల్లో పెట్టటమూ జరిగిపోయింది. ఆ దయనీయమైన పరిస్థితిలో ఆంధ్రవిద్యాభోజుడు, కవివరహృత్కమలబాలమిత్రుడు, ఆంధ్రాభారతీలాలసమానసాబ్జుడు, హిందూరాజ్యరమారమణుడు, మూరురాయరగండడు శ్రీ కృష్ణసార్వభౌముడు తన భౌతికకాయాన్ని విడచి యశఃకాయుడైనాడు.

సీ ||
కవిబుధనికరంబు కల్పతరూయని
వాక్రుచ్చి వాక్రుచ్చి వగచుచుండ
రాణులార్తధ్వనిఁ బ్రాణేశ్వరాయని
యుర్విపైఁబడి మూర్ఛనొందుచుండ
హా తండ్రి మమునిట్టులనదలఁ జేసితే
యని ప్రజాతతులంగలార్చుచుండ
వైరిరాజులుఁగూడ వీరాగ్రణీయని
విలపించి యశ్రులు విడచుచుండ
గీ||
గాఢమైనట్టి శోకాంధకారమందు
లోకమంతయు మునుఁగ నాలోకబాంధ
వుండు, శ్రీకృష్ణసార్వభౌముండు సుప్ర
శస్తవిక్రమసంపన్నుఁ డస్తమించె 

- (శ్రీకృష్ణదేవరాయచరిత్ర)

కృష్ణరాయల వారి తదనంతరం ఆయన సవతి తల్లి కుమారుడు (నరసరాజుకు కోబాంబిక వల్ల కలిగిన పుత్త్రుడు) అచ్యుతరాయలు - శాలివాహన శకం ౧౪౫౨ (క్రీ.శ 1530) విరోధినామ సంవత్సర కార్తీకబహుళపంచమి నాడు రాజ్యం తీసుకొన్నాడు. ఈయన రాజ్యం దక్షిణాన తిరునల్వేలి వరకు వ్యాపించినదని కంచిలో ఒక శిలాశాసనం ఉంది. అచ్యుతరాయలు ఎటువంటివాడయినా కానీ, తన దండాధిపతి, స్వయానా అచ్యుతరాయలికి బావమఱిది అయిన సలకము తిమ్మయ మాత్రం వెనకటి తిమ్మరుసయ్య లాగే కడుసమర్థుడు. ఈ తిమ్మయ్య తమ రాజ్యంలో తిరుగుబాటు ప్రకటించిన కేరళరాజును పాండ్యరాజును అణచివేసినాడు. అట్లాగే కృష్ణరాయలు ఇక లేడన్న ఔద్ధత్యంతో దాడి జరిపిన బిజాపురసులతానును పారద్రోలినాడు.

ఇలా సలకము తిమ్మయ అచ్యుతరాయని కంటికి రెప్పలా కాపాడుతూ రాజ్యాన్ని చూసుకుని వహిస్తున్నాడు. అయితే ఎంత సమర్థుడైనా తిమ్మయ కేవలం దండనాథుడు మాత్రమే. అచ్యుతరాయలు భోగలాలసుడు. సలకము తిమ్మయ చేత దెబ్బతిన్న రాజులందరినీ ఒకచోట చేర్చి కృష్ణరాయల అల్లుడు ఆరవీటి రామరాజు మెలమెల్లగా సామ్రాజ్యం మీద తిరుగుబాటు సలుపజొచ్చినాడు. అచ్యుతరాయలు ఆతని బాధ తప్పించుకోవడానికి ఇటుపక్క, యోగ్యులైన సామంతులనేకమంది నచ్చచెబుతున్నా  వినక విజాపుర సులతాను ఇబ్రహీం ఆదిల్షాతో చెలిమి చేయడమే కాక, అతనికి ఇరువది లక్షల వరహాల కప్పం చెల్లించుకున్నాడు. ఇదే అంతటి మహారాజ్యపతనానికి తొలి మెట్టుగా పరిణమించింది. మితిమించిన భోగలాలసతో అచ్యుతరాయలు అనతి కాలంలోనే కాలం చేసినాడు.

అచ్యుతరాయల తర్వాత -

సలకము తిమ్మయ తన మేనల్లుడు వేంకట దేవరాయని సింహాసనంపై కూర్చుండబెట్టి, రాజ్యవ్యవహారాలు తనే స్వయంగా చూడసాగినాడు. విధి వైపరీత్యం - వేంకటదేవరాయడు సింహాసనం ఎక్కిన కొంతకాలానికి మరణించినాడు.

"క్షితి ప్రతిష్టాపిత కీర్తిదేహే ప్రాప్తే పదం వైష్ణవమచ్యుతేంద్రే
అధ్యాస్య భద్రాసనమస్య సూనుర్వీరో బభౌ వేంకటదేవరాయః
ప్రశాస్య రాజ్యం ప్రసవాస్త్రరూపే విద్వన్నధౌ వేంకటరాయభూపే
అభాగదేయదచిరాత్ ప్రజానాం అఖండలావాసమదాధిరూఢే"

(ఎపిగ్రాఫికా ఇండికా)

సలకము తిమ్మయ్యే దేవరాయని చంపించాడని కొంతమంది చరిత్రకారులన్నారు. అయితే చరిత్రను మానవీయదృక్పథంతో, నిజాయితీతో, ప్రాంతీయనేపథ్యంతో పరిశీలించలేని అసమర్థ పాశ్చాత్య చరిత్రకారుల నిరాధారపు రాతలవి. ఆ తర్వాత తిమ్మయే రాజ్యానికి వచ్చినాడు. ఈ లోపల ఆరవీటి రామరాజు రాజ్యంలో ఒక్కొక్కరినీ తనవైపుకు తిప్పుకుని తిరుగుబాటు ప్రకటించినాడు. సలకము తిమ్మయ చేసేది లేక ఆదిల్షా సహాయం అర్థించినాడు. ఆదిల్షా విజయనగరానికి వచ్చి, కొన్ని రోజులు అతిథిలా ఉండి, కొంత కప్పం స్వీకరించి మరలినాడు. ఆదిల్షా మరలిన వెంటనే రామరాజు తిరిగి దండెత్తినాడు.

విధిలేని పరిస్థితులలో పరమరాజభక్తుడు, దేశప్రేమికుడు సలకము తిమ్మయ ఆత్మహత్య చేసికొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్నది కూడా చేవలేక కాదు - బ్రతికి ఉంటే ఆర్వీటిరామరాజు తనచేత ఇంకే అఘాయిత్యాలు చేయిస్తాడోనన్న బాధతో మాత్రమే.

ఆర్వీటి రామారాజునే అళియరామరాజంటారు. అళియ శబ్దానికి కన్నడ భాషలో అల్లుడని అర్థం.

ఆర్వీటి రామరాజు రాజ్యం కోసం ఎన్ని కుటిలప్రయత్నాలు చేసినా శౌర్యంలోనూ, రాజసంలోనూ తగ్గనివాడు. చంద్రవంశ సుక్షత్రియుడు. ఈతడు తను నేరుగా సింహాసనంపై కూర్చొనకుండా వేంకటదేవరాయని సవతి తమ్ముని - సదాసివరాయని సింహాసనాలంకృతుణ్ణి చేసినాడు. ఆ యేడు క్రీ.శ 1543. ఈ సదాశివరాయలు పాపం చిన్నవాడు. అభం శుభం ఎఱుగని పసివాడు. రాజ్యం పేరుకు ఈతనిది కానీ అధికారం అంతా రామరాజుది.

ఆ పటుకీర్తి రామవసు | ధాధిపచంద్రుఁడు కృష్ణరాయ ధా
త్రీపతిసార్వభౌమ దుహి | తృప్రియుఁడై వితతప్రతాప సం
తాపిత ప్రియుఁడై, యల స | దాశివరాయ నిరంతరాయ వి
ద్యాపుర రాజ్యలక్ష్మికి ని | దానము తానయి మించెనెంతయున్


(రామాభ్యుదయము)

సదాశివరాయలు యేడాదికొక్కమారు మాత్రమే ప్రజలకు కనబడే వాడుట. మిగిలిన సమయమంతా నిర్బంధమే. తర్వాత్తర్వాత అదీ నల్లపూసయింది. కొంతకాలానికి ఆ సదాశివరాయలు ఉన్నాడో లేడొ ప్రజలకు తెలియకుండా పోయింది. రామరాజే మొదటినుండి ఆతని పేరు వాడుకుని తద్వారా కృష్ణరాయల వారి విశ్వాసపాత్రులయిన దండనాథులను తనవైపుకు తిప్పుకొన్నాడని, రాజ్యం చేతికి రాగానే సదాశివరాయలిని నిర్బంధించి చంపించాడని హెరాసు అనే ఆయన ఆర్వీటి చరిత్రలో వ్రాశాడు.

రామరాజు అంతటి దుర్మార్గుడు కాదని, రాజ్యసంరక్షణ భారం సమర్థంగా నిర్వహించాలన్న తలంపుతో తనే ఎక్కువగా కలుగజేసుకొన్నాడని ఇంకో కథనం. ఏదేమైనా సదాశివరాయలు అతి దురదృష్టవంతుడు నిర్భాగ్యుడు. తదనంతరం ఆర్వీటి రామరాజు కడు సమర్థంగా కొంతకాలం రాజ్యం చేసినప్పటికీ, గొల్కొండ నవాబు మల్కిభరామునితో అనవసరంగా మైత్రి చేసి చివరికి దుర్మార్గంతా తురుష్కరాజులంతా దండెత్తితే ’రాక్షసతంగడి’ అనే భయంకరమైన పోరు సలిపి వీరస్వర్గం పొందినాడు.

ఒకమహాసమ్రాజ్యం తదనంతరం ఆరునెలలు తురుష్కుల ధాటికి చిన్నాభిన్నమైంది. ఒకప్పటి విజయనగరప్రభువుల రాజధాని విద్యానగరం (హంపి కమలాపురం, ఆనేగొంది పరివర్తిత ప్రాంతం) నేటి లండను నగరమంత వైశాల్యం కలిగి ఉండినదట. ఏడు ప్రాకారాలు. తుంగభద్రమ్మ చల్లని చూపులతో, అంగళ్ళరతనాలతో అలరారి దిక్కూ మొక్కూ లేక నాశనమయింది.

ఈ సామ్రాజ్యపు విషాదాన్తానికి కారణం -
మొత్తం దక్షిణదేశాన్ని చిటికినవేలుపై ఆడించిన తిమ్మరుసయ్య,
పసివాడు సదాశివరాయలు,
రాజభక్తి పరుడైన సలకము తిమ్మయ
వీళ్ళ శాపఫలితమేనేమో!

పై ముగ్గురిలో సదాశివరాయలి తాలూకు శాసనం ఈ మల్లేశ్వరస్వామి దేవళపు శాసనం. ఆతడు నాడు అనుభవించిన దుస్థితికి ప్రతిరూపంగానే దిక్కూ మొక్కూ లేకుండా ఉంది. అపురూపమైన శిల్పాలు ఉన్నై ఈ గుడిలో. గుడికి కాస్త దూరంగా పొలాల మధ్య ఒక నాలుక్కాళ్ళ మంటపం, చిన్న దేవళం శిథిలావస్థలో ఉంది. గుళ్ళో విగ్రహాలు ఇప్పటికే కొన్ని మాయమయినాయి. ఇదొక్కటే కాక, మరి కొన్ని ప్రాచీన శాసనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వాటిపై ఎవరో బట్టలారవేసుకునే దౌర్భాగ్యస్థితి నేడు ఉన్నది.

(గమనిక: ఈ రచనలోని చారిత్రకాంశాలలో సాధికారతను దయచేసి ఆశించవద్దు. ఇవి రచయితకు తెలిసినంతమేరలోని నిజాలు మాత్రమే.)

Saturday, March 17, 2012

విహారి - ఓ మినీ లోకల్ ట్రావెలాగుడు (ఫుటోలతో)

క్రితం వారం మా ఆవిడ పనిచేసే పల్లె (నీళ్ళు లేని)తిమ్మాపురంలో ఉండినాను. ఊరికే ఉండేదెందుకని ఉబుసుపోకుండా చుట్టు పక్కన ఒక మూడు పల్లెలు తిరిగొచ్చినాను. జీవితానికి మరొక రెండు అందమైన రోజులు జతపడినాయి. నా డైరీలో ఆ రోజునాటి పేజీలు..

నీళ్ళు లేని తిమ్మాపురం ఎందుకంటే - ఎక్కడో నీళ్ళుండే తిమ్మాపురం ఇంకోటుందంట. ఆ ఊరికి ఈ ఊరికి తేడా కనుక్కునేకి జనాలు ఇట్లా పెట్టుకున్నారు.

౧. రాధాస్వామి ఆశ్రమం - గుద్దెళ్ళ

అనంతపురంలో కల్యాణదుర్గం నుండి కర్ణాటక లో పావగడకు వెళ్ళేదారి బాగుంటుంది. ఆ దార్లో దాసంపల్లి తర్వాత ములకనూరు అనే పల్లెటూరు వస్తుంది. ఈ ఊరి శివార్లలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు - నెమళ్ళకొండ. అవును. ఆ కొండపైన సాయంత్రం పూట నెమళ్లను చూడవచ్చు మనం. ఒక్కొక్కసారి నెమళ్ళు కనిపించవు కానీ, చాలా దగ్గర నుండి మనకు నెమళ్ళ క్రేంకారవాలు వినిపిస్తాయి. ఆ ఊరిముచ్చట్లు మరెప్పుడైనా., ప్రస్తుతమనుసరామః...

ములకనూరు నుండి కాస్త ముందుకు వచ్చి కుడివైపు మట్టిదోవ పడితే రెండు కిలోమీటర్ల దూరంలో రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ ఇరవై ముప్ఫై ఎకరాల స్థలంలో ఆశ్రమం, తోట, ఆశ్రమం వారి నిర్వహణలో ఓల్డ్ ఏజ్ హోము ఉన్నాయి. అక్కడ వారందరు వారి అన్నం వాళ్ళే పండించుకోవాలి. అది నియమం. తోటలో సపోటా, మామిడి, జామ, అరటి, కూరగాయలు, తమలపాకులు, వక్క, ఆముదం విరగ కాసి ఉన్నాయి. దాపుల్నే చేనూ ఉందట. వేరుశనగ నూర్పిళ్ళు జరుగుతున్నాయి. బెంగుళూరు మామిడి కాయలు నవనవలాడిపోతున్నాయి. ఇవి కాస్త తీపిగా ఉండి ఊరగాయకు పనికి రావు కానీ,ముక్కలు కోసుకుని కారప్పొడి, తాలింపు వేసి పెట్టుకుని పెరుగన్నంలో నంజుకుంటే స్వర్గం కనిపిస్తుంది.


ఆశ్రమానికి వచ్చిన అతిథులకు కులజాతిమతభేదం చూపకుండా ఆశ్రమవాసులు స్వాగతించి భోజనం పెడతారు. ఒకరోజు ఉండదలుచుకుంటే ఆవాసం కల్పిస్తారు. ఆశ్రమానికి దాపున ఒక కొండ వుంది. రాత్రిపూట అక్కడనుండి ఎలుగుబంట్లు దుంపలకోసం వస్తాయి. అందుకని ఆశ్రమంలో జాతికుక్కలను సాకుతున్నారు.

ఆ ఊరికి నేను, మా ఆవిడా, తన తోడి టీచరమ్మలు, అయ్యలు కొంతమంది ఆటోలో వెళ్ళాము. వెళుతూ ఉంటే దార్లో ఒక అద్భుతం జరిగింది. కొండమలుపు దగ్గర దాదాపు పది పదిహేను జింకల గుంపు. అప్పుడు సాయంత్రం ఐదున్నర.

జింకలు మట్టి రంగుకు, సూర్యుని రంగుకు మధ్య రంగులో మెరిసిపోతున్నాయి. ఆటో శబ్దం వినగానే జింకలు గెంతుతూ పరుగు పెట్టినై.  కాళిదాసు శ్లోకం గుర్తొచ్చింది.

గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యన్దనే దత్తదృష్టిః
పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభియా భూయసా పూర్వకాయమ్ |
దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా
పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||

సూతా అదుగో చూడు! మెడను కాస్త వంచి క్రీగంట మన రథం మీద దృష్టిపెట్టి తిరిగి చూస్తూ, బాణం పడుతుందేమోనని ముడుచుకుంటూ, శ్రమవల్ల వచ్చిన ఆయాసంతో నోరు తెరిచి, గడ్డిపోచలు జారవిడుస్తూ, భూమిపైన కంటే, గాల్లోనే ఎక్కువభాగం ఉండేట్లుగా వేగంగా పరిగెత్తుతూంది.

(గ్రీవమంటే మెడ. గ్రీవాభంగమంటే మెడను తిప్పడం, గ్రీవాభంగ అభిరామం అంటే అందంగా మెడను తిప్పడం. స్యన్దనమంటే రథం)

కళ్ళకు కట్టినట్టుంది కదూ ఈ వర్ణన. ఈ సంస్కృతపద్యం అద్భుతరసానికి ఉదాహరణగా అలంకారికులు పేర్కొంటారు.
(జింక చచ్చేట్టు ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటే ఇందులో రసం, చారు కాచుకోవడమేం ఔచిత్యమని నాకొక అనుమానం ఉంది. మళ్ళెప్పుడైనా తీరిగ్గా ఆలోచించాలి.)

సరే మళ్ళీ బాటకు. జింకలు కెమెరా కన్నుకు దొరికినట్టు లేవు, ఒక్కటి దక్క.

తోటలో సపోటాలు, జామ కాయలు విరగకాసి ఉన్నాయి. మా ఆవిడ, తన సహచరులు ఆ తోటలో తమ షాపింగు చేసి రెండు సంచులు నింపుకున్నారు. ఆ రోజు గడిచింది.

౨. రాళ్ళపల్లి

మరుసటి రోజు పొద్దున - బండి తీసుకుని బయలుదేరాన్నేను సంహితతో కలిసి. తిమ్మాపురం నుండి కంబదూరుకు వెళ్ళేదారిలో ఒక కూడలి వస్తుంది. అక్కడి నుండి పక్కకు తిరిగితే - బొమ్మలో ఎఱుపు రంగు లైనుకు క్రిందుగా రోడ్డు కనిపిస్తూంది కదా ఆ దారిలో ఏడెనిమిది కిలోమీటర్లు వెళితే మేలుకుంట, రాళ్ళపల్లి గ్రామాలు వస్తాయి.


ఆ కొండ పైన ఒక చిన్న నీటి కొలను, దానిపక్కన ఒక చిన్న గుహ, అందులో ఎవరు ఎప్పుడు పెట్టారో తెలీని రాముల విగ్రహమూనూ. అక్కడికెళ్ళాలంటే కాస్త శ్రమపడి కొండ ఎక్కి దిగాలి. ఇది నిర్మానుష్యమైన ప్రదేశం. ఈ కొండపైన నీటికొలను, గుహలో రాముడి గురించి స్థానికులలో కూడా చాలా తక్కువమందికే తెలుసు. (ఈ ట్రెక్కింగు బ్లూస్ ఇప్పటివి కావు, పాత అనుభవాలు)


సరే మన దారికొచ్చాం.రాళ్ళపల్లి ఊరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక నిద్రాణమైన పల్లెటూరు. ఆ పల్లెలో ఏదో ఆంజనేయస్వామి దేవళం ఉందని విన్నా కానీ, అదీ అగుపడలేదు. వెళ్ళేదారి మాత్రం చాలా అందమైనది. అరటి తోటలు, దూరంగా కనిపించే పల్లె, మేలుకుంటలో చెఱువు...

రాళ్ళపల్లి - నిజానికి ఈ పేరు చెబితే ఇప్పటికే ఒక మహానుభావుని పేరు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మాత్రం అది తెలుగువాడి దౌర్భాగ్యం.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ - ఈయన 1893 నందన నామ సంవత్సరంలో రాళ్ళపల్లిలో పుట్టారు. (ఆయన తొమ్మిదవ యేట మైసూరుకు వెళ్ళి, ఆపై అక్కడే స్థిరపడ్డారు.) ఈయన గురించి చెప్పడం కొండను గాజుముక్కలో చూపడమే.
- రేడియోకి ఆకాశవాణి పేరు పెట్టినదీయనే.
- తొమ్మిది యేళ్ళ వయసులో అమ్మ, అయ్య చెప్పించిన చదువుతో తెలుగులో మీరా అనే ఖండకావ్యం వ్రాసిన ప్రతిభాశాలి. ఆ వయసులోనే సంస్కృత శ్లోకాలు చెప్పగలిగే వారట ఆయన. ఏక సంథాగ్రాహి, బహుభాషాకోవిదుడు కూడాను.
- మనం నేడు వింటున్న అన్నమయ్య పాటల్లో వందలాది పాటలకు స్వరాలు కూర్చిన సంగీతనిధి. (ఇప్పుడిటు కలగంటి, తందనానా ఆది, అదివో అల్లదివో..ఇట్లాంటి పాటలకు ఈయనే స్వరకర్త)
- అత్యుత్తమశ్రేణి విమర్శకుడు. ఈయన విమర్శ ఎంత నిశితమంటే, ఆయన తెనిగించిన రఘువంశకావ్యాన్ని (పదిహేడు సర్గలు), ఆయనే విమర్శించుకుని చించి వేశారు.
- వందలాది పీఠికలు వ్రాశారు. జాయపసేనాని వ్రాసిన నృత్తరత్నావళి సంస్కృత కావ్య అనువాదకర్త.
- అనేక గ్రంథాల పరిష్కర్త.

రాళ్ళపల్లి కాస్త నిరాశ కలిగించింది. అంతటి మహానుభావుడు పుట్టిన ఊరన్నట్టు లేకపోగా, ఆయనకు ప్రేరణ కలిగించినదేదైనా కనిపిస్తుందనుకుంటే అదీ లేదు.

తిరిగి వచ్చేప్పుడు, సంహిత,నేను సంహిత వాళ్ళమ్మకు చెప్పకుండా కొన్ని పనులు చేశాం. చింతచెట్ల చేతికి కొమ్మలు అందేట్లుగా కనిపిస్తే వాటిని పట్టి ఊపుకుని కాయలు రాల్చుకుని తిని, పక్కన పొలం గట్లలో పైపులో నీళ్ళు కడుపునిండా తాగేసొచ్చాం.

Wednesday, October 13, 2010

కథకళి ప్రదర్శన చూసిన రోజు...


"ఒక్క టికెట్టు రెండొందలా?" కథకళి ఆర్టిస్టులా కళ్ళు పెద్దవి చేసి అడిగింది మా శ్రీమతి. నాల్రోజులు సెలవు దొరకడంతో, కేరళకెళ్ళాము నేనూ తనూ, పాపాయీ కలిసి. ఓ సాయంత్రం పూట రిసార్టులో పనేమీ లేకపోవడంతో దగ్గరలో జరిగే కథకళి ప్రదర్శన చూడ్డానికి వచ్చేము. బయట వర్షం కురుస్తోంది.

"పర్లేదులే, చూద్దాం" అన్నాను నేను. నాకూ రెండొందలు ఎక్కువనే అనిపించింది. కానీ ఆమెను వదిలితే బయట వర్షంలో క్రెడిట్ కార్డు తూట్లు పడేలా షాపింగు చేస్తుంది, పైగా ఆమె చేసే షాపింగుకు వర్షంలో ఆమెవెంట అంగరక్షకుడిలా నేను నిలబడి ఛావాలి. అంతకంటే ఈ "కలాపోసన" మేలని నా ఎడమవైపు మెదడు ఘోషించింది.

"సీటు నంబరు 27,28" అన్నాడు టికెట్లిచ్చే యువకుడు. చక్కని ముఖ వర్ఛస్సు ఆ యువకుడిది.

పదడుగుల దూరంలో ఓ స్టేజి, ఓ యాభై ప్లాస్టిక్ కుర్చీలు, పల్చగా జనం. కుర్చీలలో కూర్చున్నాము.

రెండేళ్ళ మా పాప ఇక ప్రశ్నల కార్యక్రమం మొదలెట్టింది.

"రాచ్చతుడు ఏం చేత్తాడు?" (కథకళి ఆర్టిస్టు ముఖం చూసి రాక్షసుడని డిసైడు చేసిందది)
"రాచ్చతుడు కాదమ్మా, దామ"
"దామ ఇప్పుడేం చేత్తాడు?"
"కొంచేం సేపయిన తర్వాత డాన్సు చేస్తాడు"
"ఏ డాన్చు?"
"కథకళి"
"అదేమి"
"దీపం?"
"దీపం ఎందుకు?"
"?"
"నేను దీపం మొక్కుంటా"
"అది మొక్కుకునే దీపం కాదమ్మా"
...
...
...

స్టేజి మీద ఓ దీపం (కలివిళక్కు) వెలిగించారు. ఇద్దరు స్ఫురద్రూపులైన యువకులు కథకళి నృత్యానికి తగినట్టు మేకప్ (చుట్టి - చుట్టి అంటే పురుషపాత్రధారి గడ్డంలా ఉన్న తెల్లటి చక్రం. సామాన్యార్థంలో మేకప్) చేసుకుంటున్నారు. నాట్యంలో ఓ స్త్రీపాత్ర, ఓ పురుషపాత్ర ఉన్నట్టు తెలుస్తూంది.

ముఖానికి మేకప్పు పూర్తవగానే పురుషపాత్రధారి నడుముచుట్టూ ఓ తాడుబిగించి కట్టుకుని, నిలబడ్డాడు.

అతడి నడుముకు బిగించిన తాడు అట్టముక్కలను గుచ్చుతూ, గంపలాగ తాయారు చేశారు. దానిపైకి దుస్తులు తొడిగారు. కాళ్ళకు గజ్జలు, కిరీటం, ఇలా పైపైన ఆహార్యం పూర్తయ్యింది. తెరపైనే ఓ మూలగా ఉన్న గదిలోకెళ్ళి పూర్తిగా తయారయ్యారు.

కాసేపటికి లైట్లవీ ఆర్పి, దీపం వెలుగులో కళాకారులు స్టేజి మీదకు వచ్చారు. తెరపై కళాకారులిద్దరూ వెలిగిపోతున్నారు. వారిని చూసేసరికి, అంతవరకూ ప్రశ్నలతో, స్టేట్ మెంట్లతో ఊపిరి సలుపకుండా చేసిన పాపాయి కూడా నోరు తెరుచుకుని చూడసాగింది. ఇందాక టికెట్లు పంచిన కుర్రాడు మైకు పట్టుకుని, కథకళి గురించి ఆంగ్లంలో క్లుప్తంగా చెప్పేడు.

కథకళి ఆట 17వ శతాబ్దంనుంచి ఉన్నదట. సాహిత్యం, సంగీతం, చిత్రం, నాట్యం, నర్తనం అనే ఐదు అంగాల కలయిక కథకళి. ఈ ఆటను సాధారణంగా దేవాలయాలలో ఆడతారు. సాధారణంగా మహాభారతం, రామాయణం, పురాణాలు మొదలైన గ్రంథాల తాలూకు కథలు లేదా ఆయా గ్రంథాల పాత్రలతో అల్లిన కథలతో కథకళి ఆడటం జరుగుతుంది. కథకళి ఆటలో నర్తించే కళాకారులు పెదవి కదుపరు. కేవలం సైగలతో, హావభావాలతో 24 ముద్రలతో, శరీర కదలికలతో భావాలను ప్రతిఫలింపజేస్తారు. కథకళి తాలూకు పాటలు మణిప్రవాళం (సంస్కృతము, మలయాళమూ కలిసినది) లో ఉంటాయి. ముఖ్యమైన వాయిద్యాలు చండై (తబలా), మద్దాలం,(మద్దెల) ఇలతాళం (భజంత్రీలు), చెంగిల, ఎడక్క (ఘటం కాబోలు) మేము చూసిన ప్రదర్శనలో చండై, ఇలతాళం మాత్రమే ఉపయోగించారు.

మైకులో ఆ యువకుడు కథకళి లో నవరసాల గురించి ఒక్కొక్కటి చెబుతుంటే, యవనికపైన స్త్రీ పాత్రధారి అభినయించి చూపసాగాడు. ఆ తర్వాత 24 ముద్రలు పరిచయం చేశాడు.

తర్వాత ఓ పదిహేను నిముషాలు స్త్రీపాత్రధారి చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి హావభావాలను అభినయించేడు.

చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి ముఖంలో మురిపెం,
బిడ్డ అమ్మను గుర్తించి నవ్వితే తల్లి ముఖంలో కనబడే సంతోషం,
బిడ్డ స్పర్శకు తల్లి పులకరింత,
బిడ్డకు స్తన్యం ఇచ్చేప్పుడు తల్లి వదనంలో ప్రశాంతత,
బిడ్డ నిద్రలో నవ్వితే అమ్మ ముఖంలో కనబడే సంబరం, సంభ్రమం,
..
చివరికి బిడ్డ తన అంకంపై ఉచ్చపోస్తే, ఆ ఉచ్చను అలవోకగా విదిలిస్తూ అమ్మ బిడ్డపై చూపే చిరుకోపం
..
అత్యద్భుతంగా, అనన్యసాధ్యంగా అభినయించేడు.

ఆ తర్వాత ఆహ్వానం మూడు విధాలుగా అంటే విన్నపం, ఆజ్ఞ, శాసనం రూపాల్లో అభినయించి ప్రేక్షకులకు ఆహ్వానం పలికాడు. ఆ తర్వాత కథకళి నాట్యప్రదర్శన మొదలైంది. ఆ రోజు నేపథ్య కథ ఇది.

************************************************************

నరకాసురుని దాసి అయిన నక్రతుండి, స్వర్గంలో అప్సరసలను అపహరించుకుని రమ్మని నరకుడు ఆజ్ఞాపిస్తే ఆ కార్యనిమిత్తం స్వర్గానికి వెళుతుంది. అక్కడ ఆమె ఇంద్రసుతుడు జయంతుని చూసి, మోహించి, ఓ అందమైన అమ్మాయిలా మారి, తన పేరు లలిత అని చెప్పుకుంటూ నృత్యగానాదులతో అతణ్ణి సమీపిస్తుంది. 

తను సురకన్యనని, తనను వరించమని జయంతుణ్ణి వేడుకుంటుంది. జయంతుడు, తన గురించి చెప్పుకుని, తన తండ్రి ఆజ్ఞలేనిదే ఏ యువతిని చేపట్టనంటాడు. లలిత వేషంలోని నక్రతుండి విడవక, జయంతుణ్ణి కౌగిలించుకోజూస్తుంది. కృద్ధుడైన జయంతుడు ఆమెను అక్కడనుండి వెళ్ళిపోమని శాసిస్తాడు. నక్రతుండి నిజరూపం ధరించి జయంతుని సమీపిస్తుంది. జయంతుడు నక్రతుండి ముక్కు చెవులు కోసివేస్తే, బాధతో పెనుకేకలు పెడుతూ అక్కడనుండి నక్రతుండి నరకాసురుని దగ్గరకు తిరిగి పరిగెడుతుంది. జయంతుడు తన తండ్రి వద్దకు జరిగిన విహయాలు చెప్పడానికై నిష్క్రమిస్తాడు.

************************************************************

ఓ గంటన్నరసేపు జరిగిన నాట్యం - కేవలం ఇద్దరు పాత్రలతో, ఓ పాటగాడు, ఒకేఒక్క తబలా వాయిద్యంతో
రక్తికట్టించడంలో వారు కృతకృత్యులయ్యేరు. చివర్లో నక్రతుండి ముక్కు చెవులు కోసేప్పుడు స్త్రీపాత్రధారి
హావభావాలు, ఆర్తనాదాలు (భీభత్స రసం) గగుర్పొడిచేలా ఉన్నాయి. మాకు భాష అర్థంకాకపోయినా, అభినయంలోని భావం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇటువైపు మా పాపాయి బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని
చూస్తోంది. మొదట్లో శృంగారం ఎంత చక్కగా అభినయించాడో, చివర్లో భీభత్సం కూడా అంతే చక్కగా అభినయించేడు. పురుషపాత్రధారి వీరత్వం, రౌద్రం కూడా తీసిపోలేదు. నాటకం ముగియగానే అక్కడ ఉన్న ప్రేక్షకుల (కేవలం 26 మంది మాత్రమే) కరతాళధ్వనులతో మారుమోగింది, ప్రదర్శనశాల.

చివర్లో ఆ కళాకారులతో ఫోటోలు దిగడం చక్కటి ముక్తాయింపు. స్త్రీపాత్రధారి పేరు మహేష్ అట. కళాకారులిద్దరినీ మనఃస్ఫూర్తిగా అభినందించేను, అభినందనలు స్వీకరించినట్టు వారి ముఖంలో భావాలు స్పష్టంగా తెలిపాయి.

************************************************************

"ఈ షోకు రెండొందలు తక్కువే" - మా శ్రీమతి వస్తూవస్తూ చెప్పిన మాట.

************************************************************

కథకళి గురించి ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ.

************************************************************

Sunday, November 22, 2009

ఊరికి పోదాం ...

రోజూ చూస్తున్న పూలు, చెట్లూ, మనుషులూ ఒక్కోసారి కొత్తగా కొంగ్రొత్తగా కనబడితే ఆ అనుభూతి ఎలాంటిది? నా వరకూ ఆ అనుభూతి, ఊరికి వెళ్ళేప్పుడు, ఊరిలో మన వారిని కలుసుకోబోతున్నాం అన్న ఆనందం లాంటిది. జీవితం వారాంతపు సంకెళ్ళలో కట్టివేయబడిన ఓ సగటు నిర్భాగ్యోద్యోగిని నేను. అదుగో ఆ వారాంతం ఒకింత ముందుగా ఒచ్చింది మొన్న శుక్రవారం. ఊరికే రాలేదండోయ్. ఓ అర్ధ రోజు సెలవును మింగేస్తూ వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరాను మా ఊరికి.

అనుభూతిపరంగా రైలు ప్రయాణంలో ఉన్నంత సుఖం బస్సు ప్రయాణంలో ఉండదు. రైలు తలుపు దగ్గర నుంచుని, ఆ గాలిలో చెట్లు పరుగెత్తుకుని వెనక్కెళ్ళి పోతుంటే, ఓ మేఘం చాలా దూరం వరకూ వచ్చి, దూరమైన స్నేహితుడిలా వీడుకోలు పలుకుతూ వెళ్ళిపోతుంటే అబ్బ! ఎంత హాయిగా ఉంటుంది! ఆ పక్కన జామకాయలమ్మి, స్టేషన్ లో దొరికే తినుబండారాలు, అవి తింటూ కూర్చుంటే, రైలు బయలుదేరిపోతుందనే ఆదుర్దా, మన కూపేలో అందమైన అమ్మాయి ఎక్కినప్పుడు "ఆహా!" అన్న ఓ చిన్ని ఆనందం, అంతలోనే ఆ అమ్మాయి పుస్తకంలో కూరుకుపోతే ఆవిరయిపోయిన ఆ అనుభూతి, చిన్నపిల్లాడు వాళ్ళమ్మను అడిగే "ఇంటెలిజెంట్ ప్రశ్నలూ" ..రైలు ప్రయాణం ఓ అందమైన లఘు కావ్యం, ఒక్క "లేటు" అన్న ముద్రారాక్షసం తక్క.

అయితే, బస్సు ప్రయాణం కూడా ఇందుకు తీసిపోదు ఒక్కోసారి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడూ, వర్షం వెలిసినప్పుడూ, ఆ తర్వాత వచ్చే ఇంద్రధనుస్సు "హాయ్" మన్నప్పుడూ!

మొదటికొస్తాను. బస్సు నేషనల్ హైవే 7 మీదుగా వెళుతూంది. బెంగళూరు దాటింది. వర్షం పడసాగింది. మెత్తగా జారిపోతున్న బస్సు! సుతిమెత్తగా కిటికీ పక్కనుంచీ కొడుతున్న వాన చినుకులు! (ఏదో యద్దనపూడి నవలలో అనుకుంటా, ఆరంభం అట్టాగే ఉంటది). ఇంతలో .... ఏజోల్డు నోస్టాల్జియా! తగుదునమ్మా అని ఒచ్చేసింది. అదేనండి, శనగపిండి ప్రొడక్షన్స్ వారి పకోడీలు! వర్షం పడుతూంటే పకోడీలు తినని వాడు పశువై పుట్టున్! ఇది గిరీశం లాంటోడికి కూడా ట్రివియల్ మాటరు. అందుకే ఎక్కడా చెప్పలే! సరే బస్సు హైవే నుండి పక్కకు మట్టి రోడ్డులోకి, అప్పుడే కొత్తగా నడకలు నేర్చుకున్నట్టు ఊగుతూ కొంతదూరం నడిచి, ఓ హోటలు అలియాస్ ఢాబా దగ్గరాగింది. ఆ హోటలు వాడికున్నంత సామాజిక స్పృహ తెలుగు బ్లాగర్లలో కూడా లేదు. వేడి వేడి పకోడీలు, చపాతీలూ, దోసెలూ, చిక్కటి కాఫీ, నీళ్ళటి అల్లం టీ, ఇవీ అక్కడ మెనూ కార్డు లో ఐటమ్సు. మెను కార్డు బూర్జువా వ్యవస్థ కు ప్రతిరూపమనేమో అక్కడ పెట్టలేదు. దానికి ముందు వర్షను వాయిస్ మెనూ కార్డే అక్కడ నడుస్తూంది. ఆ వర్షంలో పకోడీ తింటూ, మధ్య మధ్యలో నీళ్ళటి అల్లం టీ తాగుతున్నప్పుడు - ఆహా! కరడుగట్టిన నాస్తికులకు, గతి తార్కిక భౌతిక వాదులకు కూడా కాసేపు దేముడు కనబడతాడు. అది ఆ హోటలు వాడి శాపం లాంటి వరం. అదంతే!

తిరిగి బస్సు రోడ్డునపడింది. (క్షమించాలి. మామూలుగానే అన్నా, విమర్శనాత్మకంగా కాదు!) ఈ సారి వర్షం వెలసింది. అయితే ఈ సారి రివ్వున, చల్లటి గాలి కొట్టసాగింది. ప్రేమలో పడ్డవాళ్ళకు ఆకాశం మామూలుగాకన్నా, ఎక్కువగా నీలంగా కనిపిస్తుందట. సైన్సు కేవలం వర్ణాంధత్వం (కలరు బ్లయిండ్ నెస్సు) గురించే చెబుతుంది కానీ, ఈ కలరు ఎన్రిచ్ మెంటు గురించి మాట్లాడదు. నాకు అట్లాగే కనిపించింది బయట. ఎందుకో మరి. (మనలో మాట. నేను ప్రేమలో చాలా సార్లు పడ్డాను కానీ, పడి దెబ్బలు తగిలించుకోలే. కనీసం మోకాళ్ళు దోక్కుపోలే.నాది విశ్వజనీనమైన ప్రేమో, విశ్వస్త ప్రేమో నాకే తెలీదు). హైవే బ్లూస్ ను మీరూ చూస్తారా?








మీకో గుండెలు పిండేసే నిజం చెప్పనా? ఆ ఫోటోలు రాయలసీమ, అందునా కరువుకు ఇంటిపేరయిన మా అనంతపురం జిల్లా తాలూకువి. అసలు కెనడాలు, న్యూజీలాండులకెందుకెళ్తారో ఈ సినిమా వాళ్ళు. కాస్త కళ్ళు తెరిస్తే ఇక్కడే ఇలాంటివి కనిపిస్తాయి.


ఏం చెబుతున్నా. సీనికి బ్యూటీ గురించి కదా! ఆ బ్యూటీతో పాటుగా నేను చేస్తున్నపని ఇంకొకటున్నది.

మొన్న పుస్తక ప్రదర్శనలో కొన్న ఓ కావ్యం (తెలుగు వ్యాఖ్యానసహితం) చదువుతున్నాను. అందులో వర్షం వర్ణన మొదలయింది. (ఆ పుస్తకం గురించి పెద్దలెవరైనా చెబుతారేమో అని ఎదురుచూస్తున్నా. ఎవరో లేకపోతే నేనే ఓ రోజు పెద్దరికం తీసుకోవాలి)

వర్షంలో మైమరిచిన కొంగలు చిందులేస్తూ, ప్రావృట్, ప్రావృట్ అని అరుస్తున్నాయిట. అదీ వర్ణన. బయట ఆ వర్ణనకు తగినట్టుగా కొంగలు కనబడ్డాయ్. (ఫోటోలో బంధించలేకపోయాను)

కాసేపటికి మేఘాలలా దూరంగా ఒళ్ళు విరుచుకుంటున్నట్టు కనబడ్డాయ్. గరుత్మంతుడు విష్ణువును మోసి, మోసి, అలసి, నిలబడి రెక్కలు బారజాపి, .. అలా ఒళ్ళు విరుచుకుంటున్నట్టు, ఓ బ్రహ్మాండమైన మేఘం గరుడపక్షి రూపంలో ఇలా....





మరి కాస్సేపటికి ఓ వరాహ రూపంలో భూమి పైకి యుద్దానికి వస్తున్నట్టుగా ఓ మేఘం. ఆ వరాహం ధనుస్సును కూడా ధరించింది. అది - ఇంద్రధనుస్సు. (ఫోటో మీద క్లిక్కి, తదేక దీక్షతో చూస్తే, రైన్ బో ముక్క కనిపిస్తుంది) ఈ ఫోటోలో ఆంగిల్ లేదు! రెసొల్యూషన్ లేదు!పొజిషనూ లేదు!(ఈ టీలో రంగులేదు! రుచి లేదు!చిక్కదనం లేదు! ఆ టోన్ లో అనుకోండి). అనుకోవడం వరకే ఛాయిస్.



మరి కాసేపటికి సింహం (సింహం దవడకండరం కాస్త బిగుసుకుంది. ఏమనుకోకండి!)




నలుపు, ఆకుపచ్చ, నీలాలతో ప్రకృతి త్రివర్ణ పతాకలా ఉంది.



అదీనండీ..అలా చూసుకుంటూ, మల్లీశ్వరిలో "పరుగులు తీయాలి" పాట వినుకుంటూ ఊరికి చేరుకున్నానండి.ఊరు చేరగానే సాయంత్రమయింది. మా ఊరు యథావిధిగా వర్షాలు అవీ లేకుండా క్షామంగా ప్రశాంతంగా ఉంది. మా పాపాయి ఇంటి ముందు ఇసుకలో ఆడుతూ స్వాగతం పలికింది.




రెండు రోజుల జీవితం తర్వాత మళ్ళీ బతకడానికి నగరానికొచ్చేశాను యథావిధిగా.

Thursday, December 11, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౫



ప్రపంచంలో అతి పురాతనమైన పిరమిడ్లు ఎక్కడ ఉన్నాయి?

ఈజిప్ట్ అంటే పప్పులో కాలేసినట్లే.సరి అయిన సమాధానం సూడాన్. రాజధాని ఖార్తూం కు ఈశాన్య దిశ గా 500 కిలో మీటర్ల దూరంలో మెరో అన్న ప్రాంతంలో, నైలు నది సమీపాన ఉన్నాయివి. అయితే ఈ పిరమిడ్లు ఆకారంలోనూ, వైశాల్యంలోనూ ఈజిప్ట్ పిరమిడ్ల కన్నా తక్కువ.ఇవి క్రీస్తు జననానికి 3 శతాబ్దాల ముందు కాలానికి చెందిన కుష్ వంశస్తులకు చెందినవని గుర్తించారు. అప్పట్లో భారత దేశానికి ఇక్కడికి వర్తక సంబంధాలు ఉండేవట. ఆ ప్రాంతాన్ని అల్ బజ్రావియా అని వ్యవహరిస్తారు. అయితే ఇవి ఇప్పుడు దాదాపు శిథిలావస్థ కు చేరుకున్నాయి.

మరిన్ని వివరాలిక్కడ. అప్పటి కుష్ వంశ ప్రజల లిపి , (meroetic) పక్కన చిత్ర లిపి కన్నా కాస్త అభివృద్ధి దశలో ఉండటం చూడవచ్చు.

ఐతే అక్కడకు వెళ్ళాలంటే, ఇక్కడ ప్రభుత్వం విధించే అనేక గొంతెమ్మ ఆంక్షలు పాటించాలి, దారిలో ఎదురు పడ్డ పెద్ద మనుషులందరికీ ఆమ్యామ్యాలు సమర్పించాలి.

పిరమిడ్లు కాక మేము చూసిన ఇంకో చక్కటి ప్రదేశం జబల్ అవలియా. అది ఖార్తూం నుండీ గంట ప్రయాణం. అక్కడ నైలు నది (వైట్ నైల్) పై తెల్ల దొరలెవరో ఆనకట్ట కట్టేరు. అంత పెద్ద ఆనకట్ట ఉన్నా, అక్కడ వ్యవసాయం ఛాయలు కూడా లేకపోవడం గమనించాం. అక్కడి ప్రభుత్వపు అలసత్వం కాబోలు. అయితే, చేపల వేట పై ఆధారపడి ఎన్నో చిన్న చిన్న గ్రామాలు నివసిస్తున్నాయి.




ఇక ఆ చుట్టుపక్క గ్రామాలు దారిద్ర్యానికి నిలయాలు. అక్కడ జనాల జీవితం, మనం ఊహించలేని మరో ప్రపంచాన్ని మన ముందు నిలుపుతుంది. ఇటుకలతో కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఆ ఇళ్ళకు విద్యుచ్ఛక్తి మాట అన్నది లేదు. ఓ గ్రామం ఉండీ ఇంకో గ్రామానికి వెళ్ళటానికి కాలినడక, లేదా గాడిదల బళ్ళు. కాస్త ఆస్తిపరుడైతే, సొంత గాడిదపై సవారీ.

జబల్ అవలియా ఇటు వైపు ఒడ్డున ఓ ఈజిప్టు దేశానికి చెందిన ఓ వౄద్ధ మహిళ (పేరు గుర్తు లేదు) ఓ చిన్ని ఢాబా వంటిది నడుపుతోంది. (ఢాబాను అరబ్బీ లో ఏమంటారో తెలియదు). ఆవిడో సంఘ సంస్కర్త. మహిళా వివక్షత విపరీతంగా ఉన్న రోజుల్లో ఆవిడ నైలు నది లో చేపల వేట వౄత్తిగా స్వీకరించి, చేప మాంసాన్ని తక్కువ ధరల్లో భద్ర పరిచడానికి సదుపాయాలను కనుక్కున్నది. ఆవిడ కు భారత దేశ ప్రభుత్వం తరఫున కూడా ఓ అవార్డ్ ఇచ్చారు. ఆ వార్త, సంబంధించిన చాయాచిత్రం ఆమె ఢాబా లో ఓ చోట చూసాం.


మా వాళ్ళు మధ్యాహ్నం అక్కడ సూడానీ బ్రెడ్ లు, ఉల్లిపాయలు, చేపల కూర తో సుష్టు గా లాగించేరు. నేను శాకాహారిని. మొదట శంకించినా, ఆకలి నకనకలాడుతుండటంతో చివరికి అభక్ష్య భక్షణం చేశాను. నిజం చెప్పద్దూ, భలే రుచి గా ఉన్నాయి. నదిలో చేపలు కాబట్టి అనుకుంటా, నీచు వాసన కూడా లేదు.

Wednesday, December 3, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౪

ప్రపంచంలో ఏ మత్తు పదార్థమూ, మాదక ద్రవ్యమూ ఇవ్వనంత కిక్కు, ఉన్మాదం, సిద్ధాంతం (idealogy) ఇస్తుంది - తీసుకోగలిగితే. ఆ idealogy మతం కావచ్చు, వర్ణ విభేదం కావచ్చు, మరే ఇజమైనా కావచ్చు. మనిషి మనుగడలో సౌలభ్యానికి, మానవీయ విలువల ఆవిష్కరణకూ ఆలంబన కావలసిన మతం మనిషి వినాశనానికి దారి తీయటం శొచనీయం.

*************************************

సూడాన్ దేశం ఆఫ్రికాలో అతి పెద్ద దేశం. మన భారత దేశంలో మూడు వంతులు ఉంటుంది సుమారుగా. జనాభా 4 కోట్లు (మాత్రమే). దేశం లో దక్షిణ (సగ) భాగం పర్వతాలు, అరణ్యాలు అయితే, మిగిలిన భాగం ఎడారి. దేశమంతటా ప్రవహించే నైలు నది.

దేశానికి పడమర దిశగా, సరిహద్దులో ఉన్న ప్రాంతం పేరు దార్ఫుర్.

సూడాను గురించి గూగిలిస్తే, మనకు ఎదురయ్యే లంకె లలో ఎక్కువ భాగం ఆ దార్ ఫుర్ కి సంబంధించినవే.ఓ నాలుగు సంవత్సరాల క్రితం ఆ దార్ఫుర్ ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది పిల్లలు, ఆడవాళ్ళు అని లేకుండా, దారుణంగా హత్య చేయబడ్డారు. హత్యలు, మానభంగాల రాక్షస కాండతో ఆ ప్రాంతం అట్టుడికి పోయింది. లక్షల మంది నిరాశ్రయులై, పక్కన ఉన్న చాడ్ దేశానికి వలస వెళ్ళి కాందిశీకులుగా మారారు.

సూడాన్ అన్న పదానికి అర్థం "నల్ల వాళ్ళ భూమి" (land of blocks) అట. అక్కడ సాధారణంగా రెండు వర్గాల ప్రజలు కనిపిస్తారు. కారునలుపు రంగులో ఉన్న ఆఫ్రికనులు (నీగ్రోలు), కాస్త ముదురు గోధుమ వర్ణంలో ఉన్న ఆఫ్రో అరబ్బు జాతి వారు. (మాకు ఈ తేడా కనిపించింది, మేము చూసిన జన సమూహాల్లో).

ఆ ఆఫ్రికనులు అబ్దుల్ వహిద్ అల్ నుర్ అనే అతని నేతృత్వంలో 1992 లో Sudan Liberation Movement / Army అనబడే పార్టీ స్థాపించి, స్థానికుల (భూమి పుత్రుల) సమస్యలను పరిష్కరించుకోవాలనుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో National Islamic front కేవలం 10 శాతం ఓట్ళ తేడాతో ఓడిపోయింది. ఆ పార్తీ జెనెరల్ అల్ బషిర్ అధికారం హస్తగతం చేసుకుని, వెంటనే SLM మీద "జిహాద్" ప్రకటించి, దక్షిణ సూడాన్ లో నూబా పర్వత ప్రాంతాలపై దాడి చేయించి, భయంకరమైన ఊచకోతకు నాంది పలికాడు. ఆ మారణహోమంలో సుమారు 5 లక్షల మందిని చంపించాడని ఓ అంచనా. కొన్ని సంవత్సరాల పాటు స్తబ్దుగా ఉన్న NLM, తిరిగి దార్ఫుర్ దగ్గర ఓ గ్రూపుగా ఏర్పడి, కార్యకలాపాలు ఆరంభించసాగింది. ఈ సారి అల్ బషిర్, సూడాను లో ఆఫ్రో అరబ్బు తెగకు చెందిన జంజవీద్ అన్న తెగకు ఆయుధాలు అందించి, ఇంకో మారణ హోమానికి నాంది పలికాడు.పాశ్చాత్య ప్రపంచం, UN దీనికి స్పందించి, అక్కడ రక్షణ శిబిరాలు ఏర్పరిచి, సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ వ్యవహారం అంతా, అమెరికనులు, యూరోపియనులు, సహాయం పేరు తో జొర్బడి, సూడానులో ఉన్న తైల వనరుల ఆధిపత్యం కోసం ఆడుతున్న నాటకం అని అక్కడ అనేకమంది మనసులో సందేహం.

ఆ సంక్షోభం మీద ఇంకా అనేక వివరాలు అంతర్జాలంలో కనిపిస్తాయి.

మేము వెళ్ళినది రాజధాని ఖార్తూమ్ కు. ఇది అటు దార్ఫుర్ కు, ఇటు దక్షిణ ప్రాంత అడవులకు చాలా దూరం. అందువల్ల మాకు అక్కడ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదు.

అయితే ఓ రోజు...

ఆ రోజు పొద్దున ఆఫీసుకు వెళ్ళే దారిలో అనేకమంది రోడ్డుపైన జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ కనిపించారు. జాగ్రత్తగా గమనిస్తే (తేడా స్వల్పమే అయినా) వాళ్ళందరూ ఆఫ్రికన్లు అని గుర్తించవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత బాల్కనీ దగ్గర నిలబడి ఉన్నాం. మా ఆఫీసుకు కాస్త ముందు నగరంలో ఓ ప్రధానమైన కూడలి. అక్కడ మిలిటరీ దుస్తుల్లో కొంత మంది. పొద్దున బస్సుల్లో, బోక్సు ల్లో కనిపించిన ఆ విప్లవ కారులు ఆ కూడలి వద్ద గుమి గూడి కనిపించారు. ఇంతలో మేము చూస్తుండగనే కొన్ని కాల్పులు, భాష్ప వాయువు ప్రయోగం, నినాదాల జోరు మిన్నుముట్టాయి. మాకు అరబ్బీ రాదు కాబట్టి, ఏమీ అర్థం అవలేదు.ఆ భాష్ప వాయువు ప్రయోగానికి, స్వల్పంగా మాకు కళ్ళల్లో కాస్త మంటగా అనిపించడంతో లోనికి వెళ్ళాము. మా క్లయింట్ తో అడిగేము, ఆ గొడవ ఏమిటని. తను చెప్పినది, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జనాభా చేస్తున్న బందు అని. అప్పటికి నాకు దార్ ఫుర్, సూడాన్ సంక్షోభం గురించి తెలియదు., కాబట్టి పట్టించుకోలేదు. నిజమే కామోసు అనుకున్నా.

ఇంకో విషయం చెప్పటం మరిచాను. మేము ఖార్తూమ్ నగరంలో రోమింగ్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు, వూరి శివారులలో ధ్వంసమైన ఓ ఫాక్టరీ చూసాము. అది ఓ కెమికల్ ఫాక్టరీ. దాని గురించి అప్పుడు మాకు తెలియలేదు. (దాని ఫోటో తీసుకోలేదు, నిషిద్ధం కాబట్టి) తర్వాత ఓ రోజు అక్కడ ఒకతనితో మాటల సందర్భంలో తెలిసిన వివరాలివి.
ఆ ఫాక్టరీ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ఓ తీవ్రవాది తాలూకుది (అని చెప్పబడుతోంది).

ఆ వ్యక్తి ఒసామా బిన్ లాడెన్.

ఆ కర్మాగారంలో రసాయన ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందని, పాశ్చాత్యులు ఎవరో దాడి జరిపి ధ్వంసం చేశారట. అక్కడ అలాంటిదేమీ లేదని, అక్కడి అభివృధ్ది ని ఓర్వలేక పాశ్చాత్యులు చేసిన ఆగడం అని అక్కడ కొంతమంది స్థానికుల వాదన. నిజానిజాలు భగవంతుడికే తెలియాలి.

దార్ఫుర్ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి మా అపార్ట్మెంట్ లో పని చేసిన మూసా అనే కుర్రాడు.


ఫోటోలో నల్లనయ్య మూసా. పక్కన మా కొలీగు.

మూసా తల్లిదండ్రులూ, బంధు వర్గం మొత్తం దార్ఫుర్ లో చంపబడ్డారు. ఆ తర్వాత ఏ పుణ్యాత్ముడో తనను తీసుకొచ్చి, ఇక్కడ పనిలో పెట్టేడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు. ఆఫ్రికనుల వద్ద ఓ విషయం గమనించవచ్చు. వారు అమాయకులు.వారికి వచ్చినది, చెప్పింది చేయడం మాత్రమే.సొంతంగా ఓ విషయాన్ని ఆలోచించి, ఆచరణలో పెట్టే సామర్థ్యం అంతగా కనిపించదు వారిలో. మూసా కూడా అలాంటి వాడే. వాష్ బేసిన్ తాలూకు ఊడిపోయిన నీటి ట్యూబును బిగించమంటే ఓ రోజు "కుల్లు ముశ్కిలా" అన్నాడు, నవ్వుతూ. (కుల్లు ముశ్కిలా అంటే చాలా కష్టం). ఆ ముశ్కిలా అన్న మాట చాలా సార్లు విన్నాం తన దగ్గర. తన పని మా బట్టలు ఉతికి పెట్టటం, పాత్రలు తోమటం వగైరా, వగైరా అంతే. ఆ పైన మరే పని చేయంచాలన్నా మాకు భాష అడ్డు, తనకు "ముశ్కిలా". అయితే మా వాలకం చూసి తనూ, తన వాలకం చూస్తూ మేము, తెగ నవ్వుకునే వాళ్ళం.

(సశేషం)

Tuesday, December 2, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౩

హబూబ్ లో తడిసి మట్టి అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చేము. అక్కడ మా సంస్థలో భోజన శాలలో విచిత్రం. చాలా మంది భారతీయులు మమ్మల్ని చూసి, మేము వాళ్ళను చూసి ఆశ్చర్యపొయాం. సంగతేమిటంటే, అక్కడ ఆ సంస్థలో దాదాపు 30 శాతం భారతీయులే. డిప్యూటీ మేనేజరు తెలుగాయన కృష్ణమోహన్. ఇంకా బిహారీలు, మలయాళీలు (డీఫాల్ట్), ముంబైకర్లు, వగైరా, వగైరా. వంటతను వంగ దేశస్తుడు (బంగ్లా దేశ్)., చక్కటి భోజనం పెట్టేడు మాకు. భోజనం చివర్లో లస్సీ కొసమెరుపు.

అక్కడ ఉన్న భారత దేశ పౌరులు, మమ్మల్ని శుక్రవారం ఆహ్వానించేరు,తమతో గడపడానికి. వాళ్ళకోసం ఓ హాస్టలు ఏర్పాటు చేసారక్కడ.

సరే, మధ్యాహ్నం తిరిగి రోమింగ్ టెస్ట్ కోసం బయలుదేరాం. అంటే, కారులో ఊరంతా తిరుగుతూనే ఉండాలి. (రోమింగ్ టెస్ట్ కోసం)మా ఆఫీసు సందు గొందుల నుండీ కాస్త బయటకు వచ్చి, మెయిన్ రోడ్డు కి రాగానే ఊపిరి ఆగి పోయేంత చక్కటి దృశ్యం. అక్కడ - నైలు నది, దిగువన వరద కారణంగా, దాదాపు రోడ్డు కు ఒరుసుకుని, మట్టి రంగు (వరద) నీళ్ళతో, దాదాపు రెండు కిలో మీటర్ల వెడల్పుతో ఉధృతంగా ప్రవహిస్తోంది!



చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది, నైలు నది ప్రపంచంలో అన్ని నదులకన్నా పొడవైనది, మన గంగా నదికి ౩ రెట్లు పొడవైనది అని. అప్పుడు స్వయంగా చూడ్డం. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

మేము చూసినది, బ్లూ నైలు నిజానికి. బ్లూ నైలు , వైట్ నైలు అన్న రెండు నదులు కలిసి, ఓ నదిగా ఏర్పడి, నైలు నదిగా ఉత్తరాన ఈజిప్టు వైపు సాగిపోతుంది. ఆ రెండు నదులు కలిసే చోటు సూడాన్ రాజధాని ఖార్తూమ్ లోనే. మన భారద్దేశం లో అయితే, అలాంటి సంగమం పవిత్రంగా భావిస్తాం. అక్కడ అలాంటిదేమీ లేదు. ఓ చిన్న పార్క్ ఏర్పాటు చేసారా సంగమ ప్రదేశంలో. మేము వెళ్ళినప్పుడు ౨ నదులు వరదలో ఉన్నాయ్ కాబట్టి, మట్టి రంగులోనే కనిపించాయి రెండూనూ.

నైలు నది పక్కన సాయంత్రం ఓ అనిర్వచనీయమైన అనుభూతి.
సరే, మొదటి రోజు ఆఫీసులో అలా గడిచింది. ఆ సాయంత్రం మా బసకు తిరిగి వచ్చేము. మేము సాయంత్రం వచ్చే సరికి, అక్కడ మా ఇంట్లో కరెంట్ పోయింది. మా డ్రయివర్ కు చెప్పాము వెంటనే, కరెంట్ లేదని. సరే, ఇప్పుడే వస్తా అంటూ, ఓ పది నిముషాల తర్వాత వచ్చేడు. వచ్చి కరెంట్ మీటరు దగ్గర ఉన్న కీ పాడ్ లో కొన్ని నంబర్లు నొక్కేడు. కరెంట్ తిరిగి వచ్చింది! అక్కడ కరెంట్ ప్రీ పెయిడ్. ఉన్న డబ్బులకు కరెంట్ అయిపోగానే, విద్యుత్ శాఖ ఆఫీసుకెళ్ళి, డబ్బులు కడితే, వాళ్ళో నంబరు చెబుతారు. ఆ నంబరు ఇంట్లో ఉన్న కరెంట్ మీటరు లో ఎంటర్ చేస్తే చాలు!

అన్నట్టు సాయంత్రం వచ్చేప్పుడు అక్కడ ఓ మిలిటరీ వారి ఆఫీసు చూసేము. అక్కడ UN వారి అనేక బళ్ళు అనేకం ఉన్నాయి. ఓ పెద్ద కాంపస్. ఆ కాంపస్ ద్వారం వద్ద కొంత మంది సాయుధులు కాపు కాస్తున్నారు. ఆ ద్వారం పై భాగాన, కొన్ని ఇసుక మూటలు (?) వెనుక నక్కి, కొంత మంది తమ గన్ లను గురి పెట్టి అలర్ట్ గా ఉన్నారు. అక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం.

సూడాను వివాదం గురించి వచ్చే టపాలో.
(సశేషం)

Friday, November 28, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౨

సూడాను విమానం దాదాపు ఖాళీ గా ఉంది. ఉన్న కొద్ది మంది భారతీయులు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళవటం వల్ల, కీసర బాసర గా గోల చేస్తున్నారు. వాళ్ళు మలయాళీలని వేరే చెప్పాలా?

సూడాను విమానాశ్రయం కు వచ్చి పడ్డాము. సాయంత్రం 4:30 గంటలు దాదాపు.అక్కడ ఇమ్మిగ్రేషన్ కవుంటరు దగ్గర నిలబడి ఉన్నాము. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఎవరు లేరక్కడ. ఓ అరగంట టెన్షన్ గా గడిచింది. ఆ తర్వాత నల్లగా పొడుగ్గా ఉన్న ఒకతను మా వద్దకు వచ్చి, మా పాస్ పోర్ట్లను దాదాపు గుంజుకున్నంత పని చేశాడు. గంగిరెద్దు మెడ లో గలగంటలా, అతని మెడ నుండీ వేల్లాడుతున్న ఐ డీ కార్డును ఎవరూ చూడలేదు, నేను తప్ప. అతణ్ణి మేము ఎవరని విచారించే లోపల, ఇప్పుడే వస్తానంటూ ఎటో మాయమయాడు!

మా వాళ్ళు టెన్షన్ తో సినిమాల్లో గుండె పోటు వచ్చే ముందు గుమ్మడిలా తయారయ్యారు. షమీరు అయితే, పోలీసు కంప్లయింట్ ఇద్దామని మొదలెట్టాడు. నేను తన మెడలో మా కంపనీ కార్డు చూట్టం వల్ల నాకు కాసేపు అర్థం అవలేదు, జనాలెందుకు టెన్షన్ గా ఉన్నారో.

సరే, ఎలాగయితేనేం, ఆ నల్లనయ్య తిరిగి వచ్చేడు. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ వాళ్ళతో ఏదో చెప్పి, బయటకు తీస్కెళ్ళాడు. అక్కడ స్కానింగ్ మిషను నడపడానికి ఎవరు లేరు. ఆ మిషను తనే ఆన్ చేసుకుని, ఆ పని అయిందనిపించాడు. సూడాన్ లో అడుగుపెట్టాం.

ఆ వచ్చిన వాడు అజ్ గర్. (అజగరం అంటే పాము అని అర్థం ట). తను అక్కడ మాకు సంబంధించిన కంపనీ లో ఫెసిలిటీస్ మేనేజరు. సూడాన్ లో బయట సంస్థలు స్వయంగా వచ్చి వ్యాపారం చేయడానికి వీల్లేదు. అక్కడ కంపనీ తో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి.

ఇంకో విషయం. ప్రపంచం లో అత్యంత లంచగొండి దేశాల చిట్టాలో మొదటి పదిలో సూడాను ఒకటి (ఎప్పుడో చదివినది). అందులో మన దేశం లేకపోవడానికి, మన వాళ్ళు ఆ చిట్టా తయారు చేసిన సంస్థకు ఎంతో కొంత కట్టబెట్టి ఉంటారని నా ఊహ.

విమానాశ్రయం బయట మా కోసం "బోక్సు" ఎదురు చూస్తోంది. బోక్సు అంటే, కారు కు ఎక్కువ, మెటడోర్ కి తక్కువ. ఓ చిన్న కారుకు, లారీకు వెనుక సైడు లగేజ్ వేయడానికి ఉంచినట్టు, ఓపన్ గా తెరిచి ఉంచారు. కారులో ముగ్గురు మాత్రమే కూర్చోగలరు. మిగిలిన ఇద్దరు కారు వెనుక ట్రాలీలో బయట ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదిస్తూ ఊరేగాలి. నేనూ, నితినూ ఆ ఇద్దరం. నాకు చాలా సంతోషమనిపించింది.ఎందుకంటే, ఎప్పుడో కాలేజీ రోజుల్లో వూరి బయట ఉన్న మా కాలేజీ నుండీ వూరికి రావడానికి ఒకట్రెండు సార్లు, బస్సు టాపు పైకి ఎక్కి వచ్చిన రోజులున్నాయి.ఇప్పుడు ఎంతో కాలం తర్వాత అలాంటి అవకాశం !

అన్నట్టు సూడాన్ లో బోక్సు అన్నది ఓ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు. మన ఆటో లాగా.

అజ్ గర్ మమ్మల్ని ఓ అపార్ట్ మెంట్ వద్దకు తీసుకెళ్ళి దింపి, పొద్దున వస్తానని వెళ్ళేడు.

మా ఫ్లాటు లో 2 పడక గదులు, ఓ హాలు, ఓ టాయిలెట్ కం బాత్ రూమ్. అంటే 5 మందికి కలిపి ఒక్కటి! బాత్ రూం లో కాస్త ఫ్రెష్ అవడానికి వెళుతూ, మా కొలీగు నాబ్ ను క్లాక్ వైస్ గా బలంగా తిప్పేడు. అంతే! అది విరిగి చేతికొచ్చింది. అక్కడ మొత్తం మీటలన్ని వ్యతిరేక దిశలో పని చేస్తాయి!! ఉన్న ఒక్క రెస్ట్ రూము, దాని మీట మొదటి రోజు విరగడం. శుభం!!!

మరుసటి రోజు ఉదయం ఆఫీసుకెళ్ళాం. మా పనిలో భాగంగా మేము మా సంస్థ తాలూకు ప్రాడక్టు ను నగరం లో కొన్ని నిర్ణీత ప్రదేశాల్లోనూ, కారులో తిరుగుతూ ఉన్నప్పుడూనూ (రోమింగ్) రకరకాల టెస్ట్ లు జరపాలి. కాబట్టి పొద్దున 10 గంటలకు కారులో బయటపడ్డాం. బయట ఇలా ఉంది.



తుఫాను, గాలి వాన అనుకుంటున్నారా? తుఫానే, కానీ గాలివాన కాదు. అది ఇసుక (దుమ్ము) తుఫాను. ఆ ఫోటో లో కనిపిస్తున్నది దుమ్ము, ధూళి. ఎంత ధూళి అంటే, కూత వేటు దూరంలో ఉన్నవి మనకు కనిపించవు. (ఆ ఫోటోలో ఉన్నది మా కొలీగు). దాన్ని "హబూబ్" అంటారు ఇక్కడ.

(సశేషం)



Tuesday, November 25, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౧

శ్రీయుతులు గొల్లపూడి మారుతీ రావు గారు కౌముది జాల పత్రికలో జనవరి నుండీ జూలై వరకు ఓ ట్రావెలాగు (టాంజానియా) రాసారు. అత్యద్భుతమైన ట్రావెలాగు అది. అందులో ఆయన టాంజానియా కు ట్రావెలాగు ఏమిటి ఏ అమెరికాకో వెళ్ళక? అన్న అనుమానానికి, ఓ చక్కటి సమాధానం చెబుతారు.

"సంపద ఎక్కడ చూసినా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కువ సార్లు చూస్తే బోరుకొడుతుంది....నేలబారు జీవితం ఆకర్షిస్తుంది. ఆలోచింపచేసేట్లు చేస్తుంది.A master piece is monotonus,while life is not...."

బహుశా అందుకేనేమో అభివృద్ధి చెందిన దేశాలకు వెళితే (కొంతకాలం పాటు), మొదట కొన్ని రోజులు ఆ ఆకర్షణ లో మునిగినా, మనకు మన ఇల్లు, మన వూరు, మన జీవితాలు తిరిగి గుర్తుకొస్తాయి. మేధ గారు కొన్ని నెలల క్రితం కొరియా మీద వరుస టపాలు రాశారు. ప్రతి టపా చివర "జై భారత్" తప్పనిసరి.ఆమెది ఆ రకమైన నొస్టాల్జియానే నేమో?

అయితే, ఉన్నన్ని రోజులు (రెండు నెలలు దాదాపు) కాస్తో కూస్తో మన లాంటి మనుషులు, మన జీవిత విధానానికి దగ్గరగా ఉన్న జీవితంతో, Feel at home అన్నట్టు నాకు అనిపించిన (నేను చూసిన) దేశంసూడాను.

************************************

వెంకటేష్ సినిమా "నువ్వు నాకు నచ్చావు" లో చంద్రమోహన్, "మా వాడికి, అదేదో సాఫ్ట్ వేర్ నేర్పించి, అమెరికాకు కాకపోయినా, కనీసం పాకిస్తాన్ అయినా పంపించరా" అంటాడు, ప్రకాష్ రాజ్ తో.

ఒకప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం కూడా అదే. అయితే బుద్ధి propose చేస్తే, లెగ్గు Dispose చేసిందన్నట్టు, నా భీకరమైన లెగ్గు వల్ల వచ్చిన అవకాశాలు అన్ని ఏవో కారణాల వల్ల తప్పిపొయాయి. రోజులలా గడుస్తుండగా ఓ రోజు నేను పనిచేస్తున్న కంపనీకి ఓ సూడాను ప్రాజెక్ట్ వచ్చింది. ఆన్ సయిట్ కి 5 మంది వెళ్ళాలి. సూడాను కాబట్టి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో, 12th మాన్ లా పడి ఉన్న నాకు అవకాశం వచ్చింది. సూడాను అయితేనేం, నా జీవితంలో మొట్టమొదటి విదేశయాత్ర!

అయితే, అనుకున్నంత వీజీగా గడవలేదు. ప్రయాణానికి అడుగడుక్కూ ఆటంకాలే. నన్ను తప్పించి, ఇంకో అమ్మాయికి ఆన్ సయిట్ చాన్స్ కట్టబెట్టాలని బాసురుడి ఊహ (ఎందుకో ఊహించుకోండి). అయితే, ఆ అమ్మాయి అదివరకే ఒకట్రెండు అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి ఉండటం వల్లా, పైగా నాకా అమ్మాయి మంచి మిత్రురాలవటం వల్ల, అవకాశం తిరస్కరించింది ఆవిడ.

ఆఫీసులో ఇలా ఉంటే, ఇంటి దగ్గర మా నాన్న నా జీవితం పైన కుట్ర పన్ని నాకు పెళ్ళి చేయాలని తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాడు. (నాకు పెళ్ళి సుతరాము ఇష్టం లేదు. ఫిలాసఫీ తల నిండా దట్టించుకున్న వాణ్ణి కాబట్టి). ఓ బలహీనమైన క్షణంలో మా నాన్న మాటకు సరే అన్నాను. ఇక అమ్మాయిని చూసారు. (మాకు తెలిసిన అమ్మాయే). పెళ్ళి చూపులు (బలవంతపు బ్రాహ్మణార్థం) ఎపిసోడ్ అయిపోయింది. అప్పుడు సరిగ్గా ఈ ట్రావెలు.

ఒడిదుడుకులన్నీ అయిన తర్వాత, ఓ సాదా ముహూర్తంలో (శుభ ముహూర్తం అనడం లేదు. ఆఫ్రికాకు వెళ్ళటానికి ఏ తొక్కలో ముహూర్తమైతేనేం?) బెంగళూరు నుండీ కింగ్ ఫిషర్ విమానంలో ముంబై కి బయలుదేరాం. అక్కడ నుండీ ఖతర్ ఎయిర్ లైన్స్ (ఈ పేరు విన్నప్పుడు ఎందుకో ఎడమ కన్ను అదిరింది నాకు) లో మా ప్రయాణం, సూడాను రాజధాని ఖార్తూమ్ కు. మధ్యలో దోహాలో (ఖతర్ రాజధాని) విమానం మార్పు.

*************************************

కింగ్ ఫిషర్ విమానంలో చాలామంది క్వీన్ లు. మొట్టమొదట ఏరోప్లేన్ ఎక్కగానే, అదీ కింగ్ ఫిషర్ విమానం, ఓ కొత్త బంగారు లోకం లోకి వచ్చి పడ్డట్టు అనిపించింది. మా జట్టులో మొత్తం 5 మంది. ఆ ఐదుగురిలో నేనూ, మా ఆన్ సయిటు టీం లీడరు నితినూ మట్టి ముఖాలం., పల్లెటూరి సరుకు. నితిన్ నాకంటే ఓ ఆకు ఎక్కువ నమిలాడు. బీహారీ. మిగిలిన ముగ్గురు సివిలైజ్డ్.

విమానం ఎక్కగానే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఓ అమ్మాయి, చిరునవ్వుతో విష్ చేసింది. "ప్లీజ్ వెల్ కం" అంటూ. మా వాడు బదులుగా, ముఖమంతా నవ్వులు పులుముకుంటూ, "గుడ్ మార్ణింగ్" అన్నాడు. అప్పుడు సమయం సరిగ్గా, రాత్రి 9:30 గంటలు.

అలాంటి మరికొన్ని సంఘటనల మధ్య ప్రయాణం ప్రారంభమై, బొంబాయి విమానాశ్రయం వచ్చి పడ్డాం.

అక్కడ నాకు ఓ హర్డిల్ ఎదురయింది. సూడాన్ వెళ్ళటానికి మాకు సూడానులో మా కంపనీ తరపు ఆఫీసు నుండీ, అక్కడ ఎంబసీ ఆమోద ముద్ర పొందిన ఓ ఆహ్వాన పత్రం మాత్రమే ఉన్నది. వీసా (స్టాంపు) లేదు మా దగ్గర. నేను నిలబడ్డ క్యూలో ఉన్న వీసా ఆఫీసరు నన్ను ఎగాదిగా చూసాడు. నా పాస్ పోర్ట్ పెళ్ళి శుభలేఖలా కొత్తగా నవనవలాడుతూ ఉంది. నేను వెళ్ళబోయేది సూడాను. వాడికి అనుమానం వచ్చి, ఓ పెద్ద ఇంటర్వ్యూ మొదలెట్టాడు. యెల్లో ఫీవర్ షాట్ చూపించమన్నాడు (ఆఫ్రికా దేశాలకు వెళ్ళాలంటే, యెల్లో ఫీవరు ఇంజక్షను తీసుకోవడం తప్పనిసరి, తీసుకున్నట్టు ఋజువు కూడా చూపించాలి.), ఇంకా కంపనీ పేరు, అక్కడ సూడానులో మా ఆఫీసెక్కడ, ఇలా... నాకు టెన్షను పెరిగిపోసాగింది. మా వాళ్ళందరు ఇమ్మిగ్రేషన్ దాటి నా కోసం చూస్తున్నారు. ఆ ఇమ్మిగ్రేషను వాడు పక్కకెళ్ళి ఇంకో ఆవిడను పిలుచుకొచ్చాడు. ఆవిడ, వాడు మరాఠీలో మాట్లాడుకున్నారు కాసేపు. ఎట్టకేలకు నన్ను ఆమోదించి, పంపించారు అవతలకు.

ఆన్ సయిట్ కు బలిపశువుల్లా మా ప్రయాణం మొదలయింది. అన్నట్టు ఖతర్ ఎయిర్ లైన్స్ లోగో - మేక.

*************************************

ఎట్టకేలకు విమానం బయలుదేరి, ఖతార్ రాజధాని దోహా లో వచ్చి ఆగింది. దోహా విమానాశ్రయం శుభ్రంగా, విశాలంగా ఉంది. విమానాశ్రయం లో కార్మికులు చాలామంది భారతీయులే. విమానాశ్రయంలో ఓ చోట ప్రపంచ పటం, ఎక్కడెక్కడి నుండీ విమానాలు నడుస్తున్నాయి తదితర వివరాలు సూచించబడ్డాయి.

అందులో భారద్దేశం కూడా ఉంది. అయితే భారద్దేశం లో కాశ్మీరులో కొంత భాగాన్ని మాత్రం (ఆ భాగాన్ని ఆ - ఆక్రమిత పేరుతో పిలవడం అంటే మనస్సు చివుక్కుమంటుంది) పాకిస్తానులో కలిపి చూపించారు!

అక్కడ విమానం మారి సూడాను రాజధానికి వెళ్ళే విమానం ఎక్కాము. మా ఆన్ సయిట్ యాత్ర మొదలయింది.

(యేడాది క్రితం బ్లాగ్లోకంలో నా మొట్టమొదటి టపా కూడా ఇదే మకుటంతో రాసాను. దానికి కొనసాగింపు ఇది.)

(సశేషం)

Tuesday, July 15, 2008

యెమెన్ (మినీ) ట్రావెలాగుడు!

అనగనగా పర్షియా దేశానికి సాబూర్ అనే చక్రవర్తి. ఆయనకు ఓ కొడుకూ, ఓ కూతురూనూ. ఆయన ప్రతి యేడూ జరిపే రాజ్యోత్సవాల్లో, ఓ యేడు వివిధ దేశాలకు చెందిన ముగ్గురు దేశస్తులు మూడు వింత వస్తువులను బహూకరించారు. అందులో ఒక వస్తువు కీలుగుర్రం. ఆ కీలుగుర్రం తలుచుకున్న చోటికి ఆకాశ మార్గాన ప్రయాణం చేయగలదు. ఆ కీలుగుర్రం ఇచ్చినందుకు సాబూర్ రాజు ఎంతో ఆనందించి ఆ వృద్దుణ్ణి ఏమైనా కోరుకొమ్మంటాడు. అదే తడవుగా ఆ వృద్దుడు యువరాణినీచ్చి వివాహం చేయమంటాడు. సరే నంటాడు చక్రవర్తి. యువరాణిఈ ముసలి వాడితో నా పెళ్ళా అని దిగులు చెందుతుంది. యువరాజు అక్మార్ ఈ వృద్దుని ఆట నేను కట్టిస్తానంటాడు.

యువరాజు అక్మార్ ఆ కీలు గుర్రాన్ని పరీక్షించే నెపంతో, దాన్ని ఎక్కి, ప్రయాణిస్తూ, ఓ దేశం వస్తాడు. ఆ దేశంలో ఇళ్ళన్నీ బొమ్మరిళ్ళ మాదిరి అందంగా ఉన్నాయి ఇలా.




ఆ దేశపు యువరాణి పేరు షంస్-అల్ -నహార్ తో అక్మార్ యువరాజు ప్రేమలో పడతాడు. ఆ యువరాణి ని ఎక్కించుకుని తనదేశానికి కీలుగుర్రంపై తీసుకు వస్తాడు యువరాజు.

ఇక్కడ సాబూర్ చక్రవర్తి తన కొడుకు కనబడక పోవడంతో ఆ వృద్దునిపై అగ్రహించి, వెళ్ళగొడతాడు. నగరం బయట ఆ వృద్దుడు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంటాడు.

తిరిగి వచ్చిన యువరాజు నగరం బయట ఓ స్థలంలో కీలుగుర్రాన్ని దాచి, ఆ పక్కనే ఓ ఉద్యాన వనంలో తన ప్రియురాలిని విశ్రాంతి కమ్మని చెప్పి నగరంలోకి వెళతాడు. తన తండ్రి తో సంగతులన్నీ చెప్పి, తన ప్రియురాలిని కోటకు తెసుకు వద్దాం అని తన ఆలోచన. చక్రవర్తి పరమానందభరితుడవుతాడు. సరే, తోటలోకి తిరిగి వచ్చి చూస్తే తన ప్రియురాలు మాయం!

టక్కరి వృద్దుడు ఆమెను, కీలు గుర్రాన్ని అపహరించి తీసుకెళ్ళిపోతాడు.తిరిగి యువరాజు అక్మార్ కీలుగుర్రాన్ని వెదికి, తన ప్రియురాలిని ఎలా కలుసుకుంటాడు? ఈ విశెషాలు 1958 చందమామ (జూన్ నుండీ అక్టోబర్ వరకు) లో వచ్చిన కీలు గుర్రం ధారావాహిక లో చదవండి.

అక్మార్ యువరాజు చూసిన ఆ దేశం యెమెన్. ఆ నగరపు రాజధాని సనా. ప్రపంచపు అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటి.

**************************************************
ఇది అరేబియన్ గల్ఫ్ లో ఉండడం వల్లా, ఈ దేశపు సాగర తీర నగరాలు భారతానికి దగ్గరవడం వల్లా, ఇక్కడి సంస్కృతి లో కాస్త మనదేశపు ఛాయలు కనబడతాయి. ముఖ్యంగా వీళ్ళ తిండిలో మన చపాతీలు, తందూరీ రోటీలు ఓ ముఖ్య భాగం.

ఈ దేశం మిగిలిన గల్ఫ్ దేశాల్లా కాక కాస్త సస్య శ్యామలమైనది. మొక్కాసినో అనబడే కాఫీ ఈ దేశంలోనే పుట్టిందట. ప్రపంచపు అత్యంత శ్రేష్టమైన కాఫీ గింజలు ఇక్కడే పండుతాయట. బ్రెజిల్ లో కాఫీ ఉత్పత్తి అధికం, అయితే నాణ్యత పరంగా యెమెన్ కాఫీ ఉత్తమమైనదని ఇక్కడి ప్రజలు చెబుతారు. అలానే మామిడి పళ్ళూ, సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్కువే.

అలానే ఇక్కడ ఖరీదయిన కార్లు కూడా ఎక్కువే. పెట్రోలు ధర మన రూపాయల్లో అనువదించుకుంటే 12/- లీటరుకు. ఓ లీటరు నీటి ధర కూడా అంతే.

ఈ దేశంలో అడుగు పెట్టగానే మనకు అనుభవమవేవి 2 అంశాలు.

ఒకటి, ఇక్కడి ప్రజలు రోజస్తమానం నములుతూ ఉండే 'గాట్ ' అనబడే ఓ రకమైన ఆకు. ఈ ఆకు తేలిక రకం మాదక ద్రవ్యం అని అమెరికా వారు దీన్ని నిషేధించారు. ఇది యెమెన్ దేశపు సంస్కృతిలో వేల యేళ్ళుగా మమేకమైంది. అక్కడ రహదారుల్లో, ఇళ్ళల్లో, చివరకు ఆఫీసుల్లోనూ, వాళ్ళు ఈ ఆకు ను నములుతూ ఉంటారు.

రెండవది, ఇక్కడి ప్రజల అలసత్వం. మామూలుగా భారతీయుల అలసత్వం గురించి అందరూ దెప్పుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఓ పని జరగాలంటే వారం ముందు నుండీ చుట్టూ తిరుగుతూ ఉండాలి. పక్కన పిడుగు పడినా పట్టించుకోని మనస్తత్వం వీరిది.

భారతీయ మృదులాంత్రపు సంస్థలు (సత్యం, విప్రో, టీసీఎస్ వంటివి) ఈ మధ్య ఇక్కడి వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి.

**********************************
ఇక్కడి భాష అరబిక్. ఉర్దూ కి ఇది మాతృక అని నా ఊహ. అరబిక్ సరళ సుందరమైన భాష. ఇందులో పదాలు మన హిందీ కి కాస్త దగ్గరగా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది.
ఉదా :-
శుక్రాన్ (అరబిక్) - శుక్రియా (హిందీ) - ధన్యవాదాలు
ముశ్కిలా - ముశ్కిల్ - కష్టం
కుల్లు - కుల్ - మొత్తంగా వగైరా..

ఐతే ఇక్కడి అరబ్బీ కి ఆఫ్రికన్ (సూడాన్) అరబ్బీకి కాస్త వాచికంలో తేడా కనిపిస్తుంది.

ఇది చాలా ప్రాచీనమైన భాష. యెడమ నుండీ కుడికి రాస్తారు ఈ లిపి. మాకు అక్కడ అధికారులు మా పాస్పోర్ట్ నంబరు అలా వ్రాసి లేని పోని ఇబ్బందులు ఎదుర్కున్నాము.

అరబిక్ భాషలో నీటిని 'మ్యే 'లేదా 'మోయా ' అంటారు. ప్రాచీనులు చిత్రలిపి లో నదిని తెలుపడం కోసం ప్రవాహం (తరంగాలు) గీసేవారట. అదే చివరకు M అనే ఆంగ్ల అక్షరం గా ఆరిందని తిరుమల రామచంద్ర గారంటున్నారు.
***************************************
యెమెన్ దేశానికి ముఖ్యపట్టణం 'సనా'. ఇక్కడ మన హైదరాబాదు లాగే పాత నగరం ఉన్నది. ఇది నిజంగా 'పాత ' నగరమే. ఇక్కడి దారుల్లో వెళుతుంటే యే 15 వ శతాబ్దంలోనో ఉన్నట్టు అనుభూతి చెందుతాము. రహదారులూ, చుట్టుపక్క ఇళ్ళూ, కోటగోడలు వగైరా 2000 యేళ్ళుగా రక్షించుకుంటున్నారట వీళ్ళు. ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదనటంలో ఆశ్చర్యం లేదు.

ముఖ్యంగా చూడవలసినది, బాబ్ - అల్ - యెమెన్ అనబడే ఓ కోట వాకిలి. (బాబ్ అంటే అరబ్బీ లో ద్వారం అట). ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించ బడ్డది.
***************************************

ఇలాంటి దేశాలకు ఆన్సైటు దొరికినప్పుడు కాస్త బాధగా ఉంటుంది, మన తోటి మృదులాంత్రపు నిపుణులు అమెరికాలూ, జర్మనీలు తిరుగుతున్నారు కదా అని. (అసూయ మగ వాళ్ళకూ శత్రువే :-)) ఐతే, ఇలా అయినా కాసిన్ని సంస్కృతులు, కొత్త విషయాలూ తెలుసుకునే అవకాశం కలుగుతున్నది కదా అని ఆనందం కూడా ఓ పక్క.

ఇవండీ నా మినీ ట్రవెలాగుడు విశేషాలు.