ఈజిప్ట్ అంటే పప్పులో కాలేసినట్లే.సరి అయిన సమాధానం సూడాన్. రాజధాని ఖార్తూం కు ఈశాన్య దిశ గా 500 కిలో మీటర్ల దూరంలో మెరో అన్న ప్రాంతంలో, నైలు నది సమీపాన ఉన్నాయివి. అయితే ఈ పిరమిడ్లు ఆకారంలోనూ, వైశాల్యంలోనూ ఈజిప్ట్ పిరమిడ్ల కన్నా తక్కువ.ఇవి క్రీస్తు జననానికి 3 శతాబ్దాల ముందు కాలానికి చెందిన కుష్ వంశస్తులకు చెందినవని గుర్తించారు. అప్పట్లో భారత దేశానికి ఇక్కడికి వర్తక సంబంధాలు ఉండేవట. ఆ ప్రాంతాన్ని అల్ బజ్రావియా అని వ్యవహరిస్తారు. అయితే ఇవి ఇప్పుడు దాదాపు శిథిలావస్థ కు చేరుకున్నాయి.
మరిన్ని వివరాలిక్కడ. అప్పటి కుష్ వంశ ప్రజల లిపి , (meroetic) పక్కన చిత్ర లిపి కన్నా కాస్త అభివృద్ధి దశలో ఉండటం చూడవచ్చు.
ఐతే అక్కడకు వెళ్ళాలంటే, ఇక్కడ ప్రభుత్వం విధించే అనేక గొంతెమ్మ ఆంక్షలు పాటించాలి, దారిలో ఎదురు పడ్డ పెద్ద మనుషులందరికీ ఆమ్యామ్యాలు సమర్పించాలి.
పిరమిడ్లు కాక మేము చూసిన ఇంకో చక్కటి ప్రదేశం జబల్ అవలియా. అది ఖార్తూం నుండీ గంట ప్రయాణం. అక్కడ నైలు నది (వైట్ నైల్) పై తెల్ల దొరలెవరో ఆనకట్ట కట్టేరు. అంత పెద్ద ఆనకట్ట ఉన్నా, అక్కడ వ్యవసాయం ఛాయలు కూడా లేకపోవడం గమనించాం. అక్కడి ప్రభుత్వపు అలసత్వం కాబోలు. అయితే, చేపల వేట పై ఆధారపడి ఎన్నో చిన్న చిన్న గ్రామాలు నివసిస్తున్నాయి.
జబల్ అవలియా ఇటు వైపు ఒడ్డున ఓ ఈజిప్టు దేశానికి చెందిన ఓ వౄద్ధ మహిళ (పేరు గుర్తు లేదు) ఓ చిన్ని ఢాబా వంటిది నడుపుతోంది. (ఢాబాను అరబ్బీ లో ఏమంటారో తెలియదు). ఆవిడో సంఘ సంస్కర్త. మహిళా వివక్షత విపరీతంగా ఉన్న రోజుల్లో ఆవిడ నైలు నది లో చేపల వేట వౄత్తిగా స్వీకరించి, చేప మాంసాన్ని తక్కువ ధరల్లో భద్ర పరిచడానికి సదుపాయాలను కనుక్కున్నది. ఆవిడ కు భారత దేశ ప్రభుత్వం తరఫున కూడా ఓ అవార్డ్ ఇచ్చారు. ఆ వార్త, సంబంధించిన చాయాచిత్రం ఆమె ఢాబా లో ఓ చోట చూసాం.
మా వాళ్ళు మధ్యాహ్నం అక్కడ సూడానీ బ్రెడ్ లు, ఉల్లిపాయలు, చేపల కూర తో సుష్టు గా లాగించేరు. నేను శాకాహారిని. మొదట శంకించినా, ఆకలి నకనకలాడుతుండటంతో చివరికి అభక్ష్య భక్షణం చేశాను. నిజం చెప్పద్దూ, భలే రుచి గా ఉన్నాయి. నదిలో చేపలు కాబట్టి అనుకుంటా, నీచు వాసన కూడా లేదు.


Shame to surrender to your aakali and eat aBakshyam. You cannot tolerate a few hours of aakali? Pfttt..
ReplyDelete