"అబ్బా, సెగట్రీ, ఎప్పుడూ పనులూ బిగినెస్సేనా, మడిసనింతర్వాత కూసింత కలాపోసనుండాలి. పరగడుపునే కూసింత పచ్చిగాలి పీల్చి ఆ పత్యచ్చ నారాయుడి సేవజేసుకోవద్దూ".............
ఇంచుమించుగా అదే పద్ధతిలోనే -
"అబ్బా, ఎప్పుడూ చందమామ, బాలమిత్రలేనా. చదివి చదివి బోరు కొడతా ఉంది. కొత్తగా ఏమైనా కొనక్క రావా అమ్మా?".................
నా భ్రాతాశ్రీ అమ్మ దగ్గర అర్జీ పెట్టుకున్నాడు చిన్నప్పుడు.
ఇప్పుడంటే చందమామ చుట్టూ బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా ముసురుకుంటున్నాం కానీ, అప్పట్లో చందమామ రాగానే, దానికోసం - అక్కకూ చెల్లికీ, అన్నకూ తమ్ముడికీ, అక్కకూ తమ్ముడికీ...ఇలా ఏ ఇంట్లో ఏ కాంబినేషన్స్ ఉన్నాయో వారందరికీ మధ్య ఓ సంకుల సమరం జరిగి, ఎట్టాగోలా చందమామ దక్కిన తర్వాత - తీరా చూస్తే, ఓ గంట కంతా పుస్తకం చదవడం అయిపోతుండేది. తిరిగి ఇంకో నెల వరకు వెయిటింగు.
అదుగో..ఆ పరిస్థితి చూసి చూసి, విసిగి వేసారి ఒక రోజు మా అన్న అమ్మ దగ్గర పైన చెప్పిన రకంగా అర్జీ పెట్టుకున్నాడు. ఆ అర్జీ అమాయకమైన అర్జీ కాదు. అఖండుడతను. అంతకు ముందే బాలభారతి పుస్తకం చివరి అట్టమీద రెండు పొట్టి జానపద నవలల ఆడ్స్ చూసి పెట్టుకున్నాడు.
"ఏమి చెయ్యమంటావురా? " అమ్మ విసుక్కుంది.
"వేరే రకం పుస్తకాలు కొనుక్కుంటా". అమ్మ ఏ కళనుందో ఏమో, "సరే. ఏ పుస్తకం" అడిగింది.చెప్పాడు భ్రాతాశ్రీ.
"ఇవా?" కొంచెం సందేహించింది మాతాశ్రీ. (ఇవి దయ్యాలు, భూతల కథలు కదా. ఇవి పిల్లలు చదవచ్చా?)
"సరే. ఒక్క పుస్తకం మాత్రమే". బడ్జెట్ సాంక్షన్ చేసింది మా అమ్మ. అప్పుడా పుస్తకం ఖరీదు 1-75 పైసలు.
చందమామల నుండి మొట్టమొదటి సారి అప్ గ్రేడ్ అయిన వైనం అదీ. నేను చదివిన మొట్టమొదటి పొట్టినవల పేరు గుర్తు లేదు, కానీ ముఖపత్రం, చూచాయగా కథ గుర్తుకు ఉన్నాయి.
ఈ నవలల్లో కథ 80 వ దశకం తెలుగు సినిమాల్లోలాగ కొన్ని ఫిక్సెడ్ ఫార్ములాలు.
ఫార్ములా 1 : ఒక రాజుకు ఎన్ని నోములు నోచినా పిల్లలు కలుగరు. చివరికి ఎలాగోలా ఒక పాప పుడుతుంది. యువరాణీ వారు యుక్తవయస్కులవగానే, ఎవడో పొద్దుపోని మాంత్రికుడొకడు ఆమెను ఎత్తుకుపోతాడు. ఇక ఒక క్షత్రియ యువకుడు ఆమెను వెతుకుతూ వెళతాడు. చివరికి ఎక్కడో సప్త సముద్రాలకవతల ఏ చిలుకలోనో సేఫ్ గా ఉన్న ప్రాణాలను తీస్తాడు. యువరాణి + యువరాజు ఆల్ హాపీస్. యువరాణి కాకపోతే, రాజుకున్న జబ్బు మాన్పించటం - ఇక్కడ వెళ్ళటం ముఖ్యం, ఎందుకు అన్నది కాదు. అలాగే చివరకు మాంత్రికుణ్ణి చంపుతాడు అన్నది ముఖ్యం కాదు, మధ్య దారిలో ఏం జరిగింది అన్నది మాత్రమే ముఖ్యం.
ఫార్ములా 2 : ఒక రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తుంటాడు. (అంటే మరీ జోకొట్టటాలు, గోరు ముద్దలు తినిపించడాలు ఇలా కాకుండా). అతని సేనాపతి దుర్జయుడికి ఈ కాన్సెప్టు నచ్చదు. రాజ్యాన్ని దొంగగా తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఇంతలో ఊళ్ళో ఒక ముసుగు వీరుడు బయలుదేరి అక్కడక్కడా కొన్ని వీరోచిత కృత్యాలు చేస్తుంటాడు. ఈ ముసుగు వీరుణ్ణి యువరాణి ప్రేమిస్తుంది. ఈ ముసుగు వీరుడు చివరికి ఆ దుర్జయుడి ఆటకట్టిస్తాడు. ఇక్కడా కొన్ని పాయింట్లు. ఆట కట్టిస్తాడన్నది ముఖ్యాం కాదు. ఎలాగ అన్నదే మనకు ముఖ్యం.
ఇవి రెండూ కాక మూడో రకం నవలలు. ఇవి పురాణాలో, భారతంలో ముఖ్య పాత్రలో, అరేబియన్ నైట్స్ కథలో,... ఇలాగ వేటి మీదో ఆధారపడి ఉంటాయి. ఇవండీ రసగుళికలు.
బహుళ జాతి సంస్థల్లో హెచ్ ఆర్ వాళ్ళు హోరెత్తించే, ప్రోయాక్టివ్ థింకింగులు, పాజిటివ్ అవుట్ లుక్కులు, హై ఎనెర్జీ లెవెల్లు, యాంటిసిపేషన్లు, రిస్క్ మిటిగేషన్ ప్లాన్లు....ఇలాంటివన్నీ ఈ జానపద నవలల్లో హీరోలకు అలవోకగా స్వతః సిద్ధంగా ఉంటాయి. హెచ్ ఆర్ వారు ఇచ్చే టుమ్రీ ట్రయినింగులకన్నా, ఈ పుస్తకాలు చదవడం చాలా లాభదాయకం.
పఠనాసక్తి ని అమాంతం ఆకాశానికెత్తే ఇలాంటి పుస్తకాలు ఈ కాలం పిల్లలకు అందకపోవడం చాల పెద్ద దురదృష్టం. ఇన్ఫర్మేషన్ యుగం కదా. ఇన్ఫర్మేషన్ ముఖ్యం, ఇమాజినేషను కాదు! పైగా వెధవ డబ్బా ఉండనే ఉంది. ఇక ఇవన్నీ ఎందుకూ?
ఈ జానపద నవలలు, బుజ్జాయి, బాలభారతి, బొమ్మరిల్లు - ఈ సంస్థలు ముద్రించేవి అప్పట్లో. బుజ్జాయి లో "కేశి" అనే ఆయన బొమ్మలేసే వారు. ఎంతచక్కగా ఉండేవో అవి. ఆ "కేశి" గారు చందమామ పత్రికలోనూ బొమ్మలేశారు.
తలవని తలంపుగా నాకు ఈ జానపద నవల నిధి సంవత్సరం క్రితం దొరికింది. ఇప్పటి వరకు ఆ నవలలు పూర్తీ చేయలేదు. చిన్న పిల్లాడికి లాలీపాప్ దొరికితే ఎక్కడ అయిపోతుందో అన్నట్టు నిదానంగా లాగిస్తాడు కదా - అదే కాన్సెప్టు నాదీను.
అన్నట్టు నాకు దొరికిన నవలలకుప్పలో, సంస్కృత నాటకాలయిన రత్నావళి (శ్రీ హర్ష విరచితం) , మృఛ్ఛ కటికం (శూద్రకుడు), కథా సరిత్సాగరం (సోమదత్తుడు), ఇంకా సింద్ బాద్, అల్లా ఉద్దీన్ వంటి అరేబియన్ నైట్స్ కథలు ఉన్నాయి.
సుదూర భవిష్యత్తులో ఓ అందమైన రోజు - నా మనవరాలికి/మనవడికి ఈ కథలు చదివి వినిపిస్తాను, ఆ పాప రాజకుమారుడు మాంత్రికుడిని చంపక ముందే నిద్రపోతుంది. - ఇదీ నా అరుదయిన పగటి కల.


