Showing posts with label ఙ్ఞాపకాలు. Show all posts
Showing posts with label ఙ్ఞాపకాలు. Show all posts

Wednesday, March 24, 2010

ప్రపంచం చాలా చిన్నది

కొన్నేళ్ళ క్రితం, నా జీవితంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఓ రెండు సంఘటనలు.

మొదటిది.

ఓ ప్రాజెక్టు నిమిత్తమై ఇండోనేషియా కు వెళ్ళాను. అక్కడ నా పనిలో భాగంగా ఓ కొరియన్ మార్కెటింగు మేనేజరుతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఉంటుందా, ఊడుతుందా అన్న ప్రాజెక్టు అదృష్టవశాత్తూ, అనుకున్నదానికన్నా బాగా వచ్చి, విజయవంతమయింది. ఆ మానేజరు మాతో చాలా ఆప్యాయంగా వ్యవహరించేవాడు. (కొరియా వాళ్ళు పని తప్ప మిగిలిన విషయాలు మామూలుగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా, వారి ప్రవర్తనలో diplomacy తప్ప అప్యాయత ఉండదు) చివరి రోజు ఆ కొరియా ఆయన మాకు ఓ పార్టీ ఇచ్చాడు. పార్టీలో ముచ్చటిస్తూ, ఆయన ఓ వింత కథ చెప్పాడు. ఆ విషయం కొరియా సంస్కృతికి సంబంధించిన చిన్న అంశం.


వందల సంవత్సరాల క్రితం భారతదేశం, అయోధ్యానగరానికి చెందిన ఓ రాకుమారి, పడవలో సువర్ణద్వీపానికి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో తుఫాను రావడంతో, పడవ తలక్రిందులయింది. ఆమె దొరికిన ఓ చెక్కముక్కను పట్టుకుని ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుంది. అలా ఆమె ఓ తీరం చేరుకుంది. అది కొరియా దేశంలోని తీరం. అక్కడ ఆమెను ఎవరో రక్షించి, రాజు గారికి తెలిపారు. రాజు ఆమెను చేరదీసి, ఆమెకు ఏ లోటు రానివ్వకుండా, ఘనంగా చూసుకున్నాడు. ఆ రాజుకు, ఆ దేశ ప్రజల అభిమానానికి మెచ్చి, ఆ రాకుమారి, అతణ్ణే పెళ్ళాడి, అక్కడే స్థిరపడిపోయింది. ఆమెకు, ఆ రాజుకు పుట్టిన వంశం "కిమ్" అన్న పేరుతో పిలువబడ్డారు. (కొరియాలో అడుగుకు ఓ పదిమంది "కిమ్" లు, ఓ ఐదు మంది "లీ" లు, మరో మూడు మంది "పార్క్" లు తారసపడతారు. అయితే అందరు "కిమ్" లు ఆ రాకుమారి వంశస్థులు కారు. ఏదో ఒక్క "కిమ్" వారు మాత్రమే ఆ రాకుమారి వారసులు). రాకుమారి, ఆ దేశపు రాణి గారు కదా! రాణి గారిది భారతదేశం కాబట్టి, భారతీయులను "cousins" అన్నదమ్ముల్లా భావించమని రాజు ఆజ్ఞ జారీచేశారు. అప్పటి కథ ప్రకారం కొరియనులు, భారతీయులు, సహోదరులు అని ఓ భావన.


మాకు పార్టీ ఇచ్చినాయన పేరు మీరు ఊహించగలరనుకుంటాను.

ఇంతా చెప్పి, ఆయన ఓ చిన్న ట్విస్టు ఇచ్చాడు. అయోధ్య అనే నగరం ఒకటి థాయిలాండులో ఉన్నదట. ఆ రాకుమారి థాయిలాండు దేశానికి కూడా చెందినది అయి ఉండవచ్చు అని ఓ మెలిక పెట్టాడు. అయితే మాపట్ల అతడి ప్రవర్తన, అతడిమనసును మాకు చెప్పకనే చెప్పేది

*******************************************************************

ఇంకో కథ.


ఈ సారి మరో ప్రాజెక్టు, మరో దేశం, యెమెన్.

ఈ సారి మార్కెటింగ్ అధికారి పేరు అహ్మద్. ఆ దేశస్థుడే. యువకుడు, అందగాడు, పనిరాక్షసుడు, పనిలో ఏ చిన్న పొరబాటూ సహించనివాడూ. ఈతడితో కలిసి పనిచేసేప్పుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పేవాడు.

నేను యెమెన్ లో ఉన్నప్పుడు మా ఆవిడకు నాలుగో నెల.


ఈ యెమెన్ లో తిండి విషయంలో మాకు ఏ లోటూ రాలేదు. నేనూ, నా మిత్రుడూ, శాకాహారులమైనా, అక్కడ మాకు మంచి రుచికరమైన చపాతీలు, రోటీలు (భట్టీలో గోడలకు తాపించి తయారు చేసినవి), కూర (ముషక్కల్ ఆధి (అరబ్బీ) - శాకాహారపు కూర) దొరికేది. బయట కిరాణా కొట్లలో కూడా చపాతీలు దొరికేవి. ఒక చపాతీ భారతదేశ రూపాయల్లో ఒక రూపాయి. ఓ రోజెందుకో మా ఆవిడ యెమెన్ నుండీ వస్తూ ఆ చపాతీలు పట్టుకు రమ్మని చెప్పింది. ఈ విషయం నేను అహ్మద్ కు మాటవరసకు చెబితే, తనన్నాడు. గర్భవతుల కోరిక ఎటువంటిదైనా నెరవేర్చాలి. అతడికో చెల్లి. ఆమె చూలాలుగా ఉన్నప్పుడు, ఓ రోజు పుచ్చకాయ (కళింగడి) తినాలనుందని కోరిందట, అహ్మద్ ను. అప్పుడు ఆ ఫలాల సీజన్ కాదు. అయినప్పటికీ ఈ అబ్బాయి ఎక్కడెక్కడో వెతికి ఏవో తిప్పలు పడి ప్రయత్నాలు చేశాడుట. చివరికి పుచ్చకాయ దొరకలేదట. ఆ తర్వాత అహ్మద్ చెల్లెలికి ఓ పాపాయి పుట్టిందట. ఆ పాపాయి కడుపు మీద కాస్త ముదురు రంగు చార, ఆ చార మీద అక్కడక్కడా నల్లటి చుక్కలు. (పుచ్చకాయ రూపులో) ఈ ఉదంతం చెప్పి, చివర్లో అహ్మద్ "గర్భవతులకు రెండు హృదయాలు ఉంటాయి. ఒకటి తనది, రెండవది కడుపులో పెరుగుతున్న పాపాయిది" అంటూ ముక్తాయించాడు.


ఆ తర్వాత కొన్ని నెలలకు రఘువంశకావ్యం చదువుతుంటే, అందులో "దౌహృదా" అన్న ప్రయోగం చూశాను. దిలీపుడి భార్య సుదక్షిణా దేవి గర్భవతి అయినప్పటి సన్నివేశంలో. "దౌహృదా" అంటే - రెండు హృదయాలు కలది అని అర్థం.

ఎక్కడి అరబ్బు? ఎక్కడి భారతదేశం?


(ఇంతకూ నా విషయం ఏమైందంటే, నేను ఆ చపాతీలు పట్టుకు రాలేదు, మా ఆవిడకోసం. మా పాపాయికి చారలవీ రాలేదు కానీ.....ఈ క్రింద బొమ్మ చూడండి.
.....అదీ కథ. దానికి చపాతీల పీట, అప్పడాలకర్ర చూస్తే, ఆవేశం ఆగదు.)

ఓ చిన్న విషయం చెప్పి ముక్తాయిస్తాను. ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య, భాష, సంస్కృతి, సంప్రదాయము, రంగు, మతం ఇలాంటివాటికి అతీతంగా ఏదో రకమైన అనుబంధం ఉందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటూంది. (It may sound sentimental & romantic, but it gets revealed to us few times magically) దీనికి దృష్టాంతాలు మనం వెతికి చూస్తే కనబడుతూనే ఉంటాయి.

Wednesday, August 5, 2009

ఓ వర్షం కురవని రాత్రి

"తారా సువర్ణం" హిందీ చానెల్ లో "డర్నా మనా హై" సినిమా వస్తోంది. ఈ సినిమా ఓ మంచి ప్రయోగం. నాకు చాలా నచ్చిన సినిమా. మంచి కథ, కథనం, చక్కటి నటులు, మంచి ఫోటోగ్రఫీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే ..ఇలా అనేక హంగులున్నప్పటికీ "అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని" అన్నట్టు ఎందుకు ఫ్లాపు అయిందో తెలియదు.

డర్నా మనా హై లో కొంతమంది ఏదో పిక్నిక్ కు వెళ్ళి, చీకటి పడ్డాక తిరిగి వస్తూ మధ్యలో ఓ అడవిలో ఆగుతారు. అక్కడ వాళ్ళు ఓ పాడుబడ్డ కొంపలో చేరి, కూర్చుని కథలు చెప్పుకుంటుంటారు. మొత్తం 6 కథలు. కథల మధ్యలో పక్కకెళ్ళిన వారు అందరూ హత్యకు గురవుతుంటారు. ఇలా భయానకంగా ఉంటుంది.

పాతికేళ్ళ క్రితం యండమూరి "దుప్పట్లో మిన్నాగు" అని సరిగ్గా ఈ సినిమా కథలాంటి ప్రయోగమే చేశాడు. 6 కథలను గుది గుచ్చి, ఒక కథ లో భాగంగా రాయటం. ఆ తర్వాత అప్పుడెప్పుడో స్రవంతి పత్రికలో ఈ నవల ఏదో ఇంగ్లీషు నవలను చూసి రాసింది అని చిన్న సైజు దుమారం రేగింది.

రాత్రి పూట ఎటూ కాని చోట ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో నాకూ ఓ సారి అనుభవమైంది.

పన్నెండేళ్ళ ముందు మాట. అప్పటికి పూనా కొచ్చి ఎక్కువ రోజులు కాలేదు. పూనా అంటే పూనా నగరం కాదు. నా నివాసం, పూనాకు దాదాపు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామం. ఆ గ్రామం పేరు ఆళంది. మహారాష్ట్రీయులందరికీ ఈ ఊరి పేరు తప్పక తెలిసి ఉంటుంది. ఈ వూళ్ళో 11 వ శతాబ్దంలో జ్ఞానేశ్వరుడనే ఓ గొప్ప మహానుభావుడు పుట్టి చిన్న వయసులోనే "జ్ఞానేశ్వరీ" అని భగవద్గీత కు భాష్యం వ్రాసి, 14 యేళ్ళకు సమాధి చెందాడు. ఆయన సమాధి, ఈ ఊళ్ళో ఇంద్రాణి నది ఒడ్డున ఉన్నది. అలాగే ఈ వూరి నిండా అనేక సత్రాలు, మధుకరం చేబట్టిన విద్యార్థులు..ఇలా చాలా సాంప్రదాయికంగా ఉండేది.

అప్పట్లో నాకు మరాఠీ, హిందీ రెండూ రావు. ఎలానో నెట్టుకొచ్చే వాణ్ణి. మరాఠీ కాస్త అర్థమయేది, ఎందుకంటే కొన్ని సంస్కృత శబ్దాలు కలిసేవి కాబట్టి. (ఉదా : తాందుళ్ - తండులం - బియ్యం)

సెలవు రోజు వస్తే పొద్దునే ఆ ఊరు వదిలి పూనా వెళ్ళే వాణ్ణి నేను. పూనాలో నా ఫ్రెండు, తన మామయ్య వాళ్ళతో గడిపే వాణ్ణి. అలా ఓ సెలవు రోజు ఉదయమే పూనా వెళ్ళాను. వెస్ట్ ఎండ్ లో సినిమా చూసి, సాయంత్రం అలా తిరిగి, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నుండి బయటపడే సరికి బాగా చీకటి పడింది.

సమయం రాత్రి 12:30 . ఆళంది బస్ ఎక్కాను. ఆళంది వెళ్ళటానికి నాకు తెలిసి 2 మార్గాలు ఉండేవి. అయితే నేను ఎక్కిన బస్సు, ఆ రెండు మార్గాల నుండీ కాక, వూరి బయట ఓ రింగు రోడ్డు దారి పట్టింది. బస్ లో పది మంది కంటే ఎక్కువ లేరు. బస్సు హై వే వదిలి లోపల దాదాపు అడవి లాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళుతూంది.

ఇంతలో బస్సు చక్రం రోడ్డు పక్కగా ఓ బురద గుంతలో కూరుకుపోయింది. డ్రయివర్ చాలా సేపు ప్రయత్నించాడు. ఇక కుదరక ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. బస్ లో వాళ్ళందరూ దిగి ఏదో మాట్లాడేసుకుంటున్నారు.

"కాయ్ ఝాలా"
"లవ్ కర్ కరూన్ టాక్" ...ఇలా...

నేను బస్ దిగలేదు. బస్ ప్రయాణీకులు ఒక్కొక్కరు అలా నడుచుకుంటూ వెళ్ళసాగారు. బస్ దగ్గర కండక్టర్, నేను మిగిలేం. డ్రయివర్ ఏదో అడిగాడు. నాకు ఏమి అర్థమవలే. ఊరుకున్నాను. కాసేపటికి డ్రవర్ ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు. చివరికి నేనొక్కణ్ణి మిగిలా. రోడ్డు పక్కనంతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్. చిమ్మ చీకటి. నాకు మెల్లగా వెన్నులోంచి చలి మొదలయింది. బయట కూడా చలి!

కాసేపయింతర్వాత ఏదో గోల వినిపించింది. ఆ గోల మెల్ల మెల్లగా అధికమవసాగింది. అలాగే కొన్ని కాగడాలు, కనిపించాయ్ దూరంగా. ఆ కాగడాలు, ఆ కాగడా తాలూకు వాళ్ళు బస్ కు కాస్తంత దూరం వచ్చారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లెం కాబట్టి అలాగే ఉన్నాను.

ఆ గోల క్రమంగా భజన గా మారింది. విషయమేమంటే ఆ రోజో,మరుసటి రోజో కృష్ణాష్టమి. అక్కడ గ్రామంలో లైట్లు లేవు. వాళ్ళు ఇలా కాగడాలు అవీ వెలిగించుకుని భజన చేస్తున్నారు. ఇక అనుమానం తీరిన తర్వాత అక్కడికెళ్ళా నేను. వాళ్ళు కాసేపటి భజన తర్వాత ప్రసాదం పంచసాగారు. నన్నూ పిలిచేరు. ఆ ప్రసాదం - కాందా పోహే, పూరీ,శ్రీఖండ్. పోహే అంటే అటుకుల తిరుగువాత, ఉల్లిపాయలూ. శ్రీఖండ్ ఎప్పుడైనా రుచి చూశారా? లేకపోతే మీరు జీవితంలో కాస్త కోల్పోయినట్టే. ఆంధ్రులకు పూతరేకులు, ఆవకాయ, గోంగూర ఎలాంటి ట్రేడ్ మార్కు సింబల్సో, మరాఠీలకు శ్రీఖండ్ అలాగ. (దీన్ని మరీ ఎక్కువ తినలేమనుకోండి). అక్కడ నాతో బాటి బస్ తాలూకు ఇతర ప్రయాణీకులూ ఉన్నారు. అందరూ వరుసగా కూర్చున్నారు. ప్రసాదం అందరికీ పంచేరు. నేను వచ్చీ రాని హిందీలో అడిగాను. "ఏం జరుగుతోందని". ఆ గ్రామస్తుడు నవ్వుతూ విడమర్చి చెప్పేడు.

కాసేపటి తర్వాత ఆ గ్రామస్తుల సహాయంతోనే బస్సు కదిలింది. ఎట్టకేలకు తిరిగి ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి చేరుకునేప్పటికి సమయం రాత్రి 2:30.

ఆ తర్వాత ఆ గ్రామానికి మరో సారి వెళ్ళడం తటస్తించింది. ఆ గ్రామం పేరు తులా పూర్. ఇంద్రాణీ, భీమా నదుల సంగమ స్థానం ఆ చోటు. ఔరంగజేబు కిరాతకంగా చంపించిన శంభాజీ (శివాజీ పుత్రుడు) సమాధి ఉందక్కడ.

ఇలా ఓ రోజు రాత్రి అనుభవం అందమైన అనుభూతిగా మిగిలిపోయింది, నాకు.

Wednesday, May 27, 2009

చెట్టు - మనిషి - దేవుడు


ఓ రావి చెట్టు (అశ్వత్థ వృక్షం). కాస్త ఎడంగా ఓ వేపచెట్టు. అదే సరళ రేఖలో మరింత ఎడంగా ఓ బిల్వ (మారేడు)చెట్టు. మా ఇంటి ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లా. ఓ గుడి ఆవరణలో ఉండే వాళ్ళం చిన్నప్పుడు.

ఇంకో పక్క బాదామి చెట్టు. కాస్త దూరంలో బంకీరు కాయల చెట్టు. భక్తులు ప్రదక్షిణం చేసే దారిలో కాస్త మూల ఒద్దికగా ఓ ఉసిరి చెట్టు మొలిచింది కొన్నళ్ళకు. ఈ ఉసిరి చెట్టు కాయలు చిన్నవి, కాస్త వగరు తక్కువగా ఉన్నవీను. గింజ కూడా పెద్ద ఉసిరి కాయల్లా కాక చిన్నగా ఉండేవి. ఉసిరి చెట్టు ఐదు దేవతా వృక్షాల్లో ఒకటి అని మా తాతయ్య చెప్పేవారు. మిగిలిన నాలుగు కూడా చెప్పారు కానీ గుర్తులేవు.

ఆ ఆవరణలోనే వెనుక వైపు బ్రహ్మాండమైన వేపచెట్టు, దానికి పక్కనే ఓ కాగితంపూలచెట్టు. భాగవతంలో కృష్ణుని కథలో, చిన్ని కృష్ణుని యశోదమ్మ ఓ మద్దెలకు కట్టేసి వదిలేస్తే, ఆయన రెండు మద్ది చెట్ల గుండా వెళ్ళి, రెంటినీ పడగొట్టి గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడని చదువుకున్నాం కదా. అదుగో, అప్పుడు ఆ మద్దిచెట్ల మధ్య ఎంత ఎడం ఉండి ఉండేదో, సరిగ్గా అంతే ఎడం వేప చెట్టు, కాగితం పూల చెట్టు మధ్యానూ.శాపగ్రస్తులైన గంధర్వుల్లా ఆకుల మధ్యలోనుంచీ సంగీతం వినిపిస్తూ, ఓ తేలికపాటి సువాసన వెదజల్లుతూ, అద్భుతంగా, ఆకాశాన్ని తాకుతూ ఉండేవి అవి. వాటి నీడన ఆవులు, పొద్దస్తమానం ఏదో నముల్తూ.

(ఆ ఆవులు ఎందుకమ్మా, పొద్దస్తమానం ఏదో నముల్తుంటాయి? - నేను.
ఏమో తెలీదమ్మా - అమ్మ)

వాటి నీడన గుడి పూజారి, సత్యనారాయణ శాస్త్రి అలియాస్ సత్యమయ్య. ఆయనలో ఓ గొప్పకళాకారుడుండేవాడు. మధ్యాహ్నం పూట భోజనం ముగించి, నులక మంచం మీద పడుకున్న తర్వాత ఆయన లోని కళాకారుడు గొంతు విప్పేవాడు, "భక్త యోగ పదన్యాసి, వారణాసి..పావన క్షేత్రముల రా...శి" "రా" కు "శి" కు మధ్య ఓ అల లాంటి గమకం పెట్టి పాడుకుంటుండే వాడు, అర్ధనిమీలిత నేత్రాలతో.

ఇంకాస్త వెనుక సీమ చింతకాయల చెట్టొకటి.

ఇంకా జమ్మిచెట్టు, మరో బిల్వపత్రి, వరుసగా పూల చెట్లు, నాగుల కట్ట ఓ వేపచెట్టుకింద నీడలో...

మొట్టమొదట కనుమరుగయినది, వెనకున్న సీమ చింతకాయల చెట్టు. నరికేశారు దాన్ని. రోజు ఆ సీమ చింతకాయలకోసం ఆ చెట్టును రాళ్ళతో కొట్టేవాళ్ళు పిల్లలు. బహుశా నవ్వుకొనేదేమో ఆ చెట్టు. ఆ చెట్టు పడిపోయిన రోజు, దాని కాయలు కింద చిందరవందరగా పడ్డాయి. అన్ని కాయలు కళ్ళ ముందు కనబడ్డా, చిత్రంగా ఆ కాయలు ఏరుకోడానికి పిల్లలకు సంకోచం, రేపట్నించీ ఈ చెట్టు లేదుగా అనేమో. చెట్టు ఏమనుకుందో ఏమో? రాళ్ళదెబ్బలకంటే పెద్ద దెబ్బ తగిలినందుకు నవ్వుకుందో, పిల్లలు కాయలు తీసుకోనందుకు నొచ్చుకుందో?

కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు కాగితం పూలచెట్టుకు ఎసరు పెట్టారు. దానికి ఓ కథ అల్లారు. కాగితం పూల చెట్టు, వేప చెట్టు, ఒకదాని పక్కన మరొకటి ఉంటే అరిష్టం అట. అలా అని రాసుందట. ఆ చెప్పినాయన పెద్దాయన. పూజ్యుడు, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాడూనట. ఇక చేసేదేముంది. శాపగ్రస్తుడైన గంధర్వుడికి శాపవిమోచనం జరుగలేదు. జనాలు దాన్ని శాపంతోనూ ఉండనివ్వలేదు. చచ్చిపోయిందది. ఈ చెట్టూ నవ్వుకుని ఉంటుంది, మనుషుల మూర్ఖత్వం చూసి. దీని చెలికత్తె, వేప చెట్టు మాత్రం మనసులో కుమిలిపోయి ఉంటుంది.

మరి కొన్నాళ్ళు గడిచింది. ఎవరో పుణ్యాత్ములు నాటిన విత్తుతో ఓ పక్కగా చెట్టు మొలిచింది. అసలది యే చెట్టో మాకు తెలియదు. మా ఇంటికి దగ్గరలో ఉండటంతో, మా అమ్మ నీళ్ళు పోసేది దానికి. అలా మా కళ్ళ ముందు పెరిగింది. ఆ చెట్టుతో రాధామాధవం పూలతీగ నేస్తం కట్టింది. ఎంచక్కా, ఆ చెట్టుకు కమ్ముకుని, నమ్ముకుని, అల్లుకుపోయింది. పెద్దగయిన తర్వాత ఆ చెట్టుకు కాయలు కాసాయి. అప్పుడు తెలిసింది అది ఉసిరి చెట్టని. మా అమ్మ కళ్ళలో తెలియని సంతోషం. పసిబిడ్డ మొట్టమొదటి సారి "అమ్మా" అని అని పలిచినప్పుడు ఎలాంటి సంతోషమో అలాంటిది. ఆ చెట్టు వద్దకు అప్పుడప్పుడూ, వనభోజనాలని జనం వచ్చేవారు. ఉసిరి చెట్టు కింద మొదల కుంకుమ పెట్టి పూజించి, మొక్కుకుని, ఆ తర్వాత కుటుంబంతో సహా భోంచేసి ఇళ్ళకెళ్ళేవారు. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ ఉసిరి కాయలు, పక్కన బాదం కాయలు గర్వంగా కోసుకొని తెచ్చిచ్చేవాళ్ళం.

దేవాలయం ఆవరణ సుమారుగా పెద్దదే. నిజానికి అందులో మూడు చిన్న చిన్న మందిరాలు, లింగాష్టకం, నవగ్రహ స్తోత్రం వగైరా రాతి ఫలకలపై రాతలు, నవగ్రహాలు. ఓ రోజు భక్తులకో ఆలోచన వచ్చింది. ఇందరు దేవుళ్ళున్నారు, కానీ "మన" దేవుడు లేడు. ఆ దేవుడి కోసమూ గుడి కట్టాలి. అందుకు చందాలు పోగయ్యాయ్. కొత్త గుడి వస్తే, ఆదాయం బావుంటుంది, కాబట్టి అందరూ సంతోషించారు. గుడికి కావలసిన స్థలం సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి, ఓ గొప్ప ఎమ్మెల్ల్యే ( అప్పటి మంత్రి, ఇప్పుడూ ఉన్నాడు. రాజశేఖరుడి ద్వారా మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన ఇద్దరు ప్రముఖులలో ఒకడు) .

వారగా ఉన్న పూల మొక్కలు తెగ్గోట్టేరు. ఆ పూలతో రోజూ పూజ చేయించుకునే దేవుడు ఇప్పుడు పూలు కొనుక్కుని పూజలు చేయించుకుంటాడు. గుడి కట్టటం మొదలయింది. దాదాపు పూర్తి కావచ్చింది. గుడికి మెట్లు పెట్టాలి. ఉసిరి చెట్టు ఆ మెట్లకు అడ్డమయింది కాస్త. దాన్ని కూల్చేయాలని తీర్మానించారు. ఓ భక్తుడు మరుసటి రోజు ఓ మచ్చు కత్తి తీసుకొచ్చాడు. మా అమ్మ అడ్డుపడింది. "అయ్యా, ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చేస్తారా? చెయ్యం కదా. ఈ ఉసిరి చెట్టు ఉప్పు కూడా మనం తిన్నాం కదా. పచ్చని చెట్టుకెందుకయ్యా ఎసరు పెడతారు" అంది. దేవుడికి గుడి కడుతున్నామమ్మా, చెట్టు అడ్డమొస్తుంది అన్నాడతను. నిజానికి చెట్టు వారగనే ఉంది. మెట్లకు పక్కగా. మా అమ్మా అదే అంది. కుదరదన్నాడతను. మేము చందాలేసుకున్నాం, దైవ కార్యం, పైగా దేవాలయం కమిటీ ఒప్పుకుంది, మధ్యలో మీరెవరు అని వాదులాటకు దిగాడు. "ఏం చెబుతుంది? ఆ చెట్టు మేం నాటలేదు. నీళ్ళు పోశామంతే" అని చెప్పాలి. అదీ చెప్పలేదు మా అమ్మ. ఆ చెట్టూ నరికేశారు.

నరికిన తర్వాత మొదలయింది మరో కథ. ఉసిరి దేవతా వృక్షం, కూల్చరాదు. అని ఒకాయన చెప్పాడు (ఇందాక కాగితం పూల విషయంలో శాస్త్రాలు చదువుకునొచ్చి వివరాలు చెప్పినాయన). సరే, పరిహారం కోసం పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాని దేవుడు ఖచ్చితంగా వెళ్ళిపోయుంటాడు అక్కడ నుంచీ.

ఇప్పుడు మా అమ్మా, అక్కడ చెట్లలో కొన్ని వదిల్సి మిగినవన్నీ, భూమ్మీద లేరు.

చెట్టు కూలిస్తే వాతావరణం సంగతి ఏమవుతుందో కానీ, ఆ చెట్టు పక్కన కాయల కోసం వచ్చే పిల్లలు, ఆ చల్ల గాలి, గాలి వాలున పడుకున్న గోమాత, గాలిలో తేలాడే పరిమళం, వీటన్నిటికి వెనకాల దాగిన ఓ సున్నితత్వం, ఆ సున్నితత్వం తాలుకు మనిషి అస్తిత్వానికి నిర్వచనం, ఇవేవి ఉండవు.

చెట్టు దైవం.
ఆ చెట్టుకు అనవసరంగా హాని తలపెట్టే మనిషి రాక్షసుడు.
దాన్ని మౌనంగా చూసే దేవుడు నిమిత్తమాత్రుడు!

Friday, August 8, 2008

ఉద్యోగ భారతం - ముగింపు

(గత టపా తరువాయి)

కష్టాలకున్న ఐకమత్యం, సుఖాలకు లేదు.వస్తే, కష్టాలు అన్నీ ఒక్కసారే వచ్చి పడతాయి అని ఎక్కడో చదివాను. అది స్వయంగా నాకూ జీవితంలో అనుభవమైంది.

ఇంటి పరిస్థితుల దృష్ట్యా, అనివార్య కారణాల వలన పూనాలో సాగుతున్న ఉద్యోగం విరమించుకుని, తిరిగి రావాల్సి వచ్చింది నాకు. సరే, ఇక్కడ మా వూళ్ళోకి తిరిగి రాగానె తెలిసిన సమాచారం,మా లెగ్గు మిత్రులు నలుగుర్లో ఒకడు, అదేదో Mainframes course, 45 రోజుల్లో పూర్తి చేసి, ఓ సంస్థలో చేరి, ఓ నెల తిరక్కుండానే తన ఉక్కు పాదాన్ని అమెరికా పై మోపాడు!

నాకు అలాంటి ఆశలు లేవు, అయితే, మా వూరికి దగ్గర ఉన్నబెంగళూరు నగరంలో ఓ ఉద్యోగం చూసుకోవాలి అని.మా నాన్న ఆనందానికి పగ్గాలు లేవు.ఆయనకు బంధుప్రీతి జాస్తి. తన బంధువులు నాకు ఉద్యోగం చూసి పెడతారని వెర్రి ఆశ ఆయనకు. నాకు అస్సలు ఇష్టం లేదు ఇలాంటివి. అయితే, వేరే మార్గమే లేదు! మా వాళ్ళు కేవలం మాట్లాడ్డానికే తప్ప, సహాయం మాట వచ్చేసరికి, చేయి చూపుతారని నాకు తొందరలోనే తెలిసింది. పైగా, నేను నగర వాతావరణానికి చెందిన వాణ్ణి కాకపోవడంతో ఓ రకమైన చులకన భావం! సహాయం మాట అటుంచి, అడుగడుగునా ఆటంకాలు.

అది ఒకందుకు మంచిదే అయింది.

విధిలేని పరిస్థితుల్లో, ఓ ప్రముఖ mainframes సంస్థలో చేరేను. అక్కడ కోబాల్ నేర్పిస్తున్నారు. ఆ కోబాల్ లో ఒక్క ముక్క అర్థమయి చావలేదు నాకు! మిగిలిన జనాభా అంతా కుమ్మేస్తున్నారు. సరే, నా పాత టెక్నిక్ ప్రయోగించాను. ఓ మేధావి పాస్వర్డ్ సంగ్రహించి, అతని ప్రోజెక్ట్ ఒకటి కాపీ చేసుకున్నాను. ఆ ప్రోజెక్ట్ ను రకరకాల మార్పులు చేసి, పరిశీలించేసరికి అర్థమైంది కాస్త.

ఇంతలో, ఆ సంస్థ ఉద్యోగం గ్యారంటీ అని నమ్మజూపి, ఉద్యోగాలు లేవు అని చెప్పేసరికి, అక్కడ జనాభా తిరుగుబాటు లేవదీశారు. ఆ సంస్థ వారు, తీసుకున్న సొమ్ములో కొంత సొమ్ము తిరిగి ఇచ్చేసి, మాలో ఓ రెండు నెల్ల పాటు ట్రయినింగు కొనసాగించండి అని అని చెప్పారు. నేనూ, ఇంకో నలుగురు మాత్రం అలా కంటిన్యూ అయాము. ఆ రెండు నెల్ల తర్వాత నాకు ఓ చోట జీతం లేని పని దొరికింది.

ఆ జీతం లేని సంస్థలో పని చేస్తున్న వాళ్ళం మేము. అయితే, ఆ సంస్థ పేరు తమ రెస్యూమె లలో పెట్టుకుని, చివరకు ఆ సంస్థ పేరునే చెడగొట్టారిక్కడ.

అప్పట్లో ఈ సాఫ్ట్వేర్ సంస్థలలో, హెచ్ ఆర్ వారి ఆధిపత్యం కాస్త హెచ్చుగా ఉండేది. వాళ్ళకు టెక్నికల్ విషయాలు తెలియకపోయినా, తెలిసినట్టు ఫోజు కొట్టే వారు.

ఓ కంపనీలో, నేనూ, నా మిత్రుడు (అతను MTech) వెళ్ళాము.అక్కడ హెచ్ ఆర్ వారు నా మిత్రుని మొదట ముఖాముఖి జరిపారు. తరువాతి వంతు నాది. నేను ఆ ఇంటర్వ్యూ చాలా బాగ చేసాను. బయటకు వచ్చి ఇద్దరం సమాధానాలు సరిచూసుకున్నాము. నా మిత్రుడు సరిగ్గా చేయలేదు, నావి దాదాపు అన్నీ కరెక్ట్ అని తేలింది. అయితే, ఆ కంపనీ హెచ్ ఆర్ వారు, మొదట తనను ముఖాముఖీ జరిపారు కదా, ఆయన MTech కాబట్టి, తన సమాధానాలన్నీ కరెక్ట్ అని డిసైడు అయిపోయి, నన్ను రిజెక్ట్ చేసారు.ఈ సంగతి, అదే కంపనీలో పని చేస్తున్న వ్యక్తుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.అయితే, నా మిత్రుని కూడా, తర్వాతి రవుండ్ లో బయటకు పంపేశారు.

ఇలాంటి అనేక "Get back to you" ( మృదులాంత్రపు ఉద్యోగ ముఖాముఖీలో, అభ్యర్థి ఎంపిక కాకపోతే, ’ఎన్నిక కాబడలేదు’ అని చక్కగా చెప్పరు. We'll get back to you" అని చా....లా పాలిష్డ్ గా చెప్పడం ఆనవాయితీ) ల తర్వాత, ఓ రోజు.

తాతబ్బాయ్ మృదులాంత్రపు బాధితుడే. నాతో బాటు కాంప్లెక్స్ (హాస్టల్) లో ఉండేవాడు. తనూ, నేను కలిసి ఓ ముఖాముఖి కి వెళ్ళాం. అక్కడ ఓ రాత పరీక్ష. అందులో నేను తనకు సహాయం చేశాను. ముఖాముఖిలో మాత్రం తను సెలెక్ట్ అయాడు.

ఆ తరువాత రోజు, తనో ముఖాముఖికి వెళ్ళాడు. వెళ్ళి, అక్కడి విశేషాలన్నీ నాకు పూస గుచ్చినట్టు చెప్పేడు.తర్వాత ఆ ముఖాముఖి కి నేను వెళ్ళి, సెలెక్ట్ అయేను.

జీవితం గాడిలో పడింది.

ఆ గాడిలో పడ్డ జీవితం, ఓ మూడు కంపనీల మార్పు తర్వాత కూడా, ఇప్పటికీ, గానుగెద్దు జీవితం లా సాగుతూనే ఉంది!

(సమాప్తం)

Thursday, July 31, 2008

ఉద్యోగ భారతం - పూనా పర్వం

(గత టపా తరువాయి)

ఓ రోజు ఉదయం, పూనాలో చేతిలో లగేజీతో, పూనా, విమాన్ నగర్ లోని నా మిత్రుడి, అన్న గారి మిత్రుడి
రూములో దిగేను.పూనా విమాన నగర్,"నా మిత్రుడి అన్న గారి మిత్రుడి" రూము, నా లాంటి
అథితి,అభ్యాగతులతో (దండగమారి కేసులతో) కిటకిటలాడేది. నేను వెళ్ళిన సమయానికి అక్కడ మా వాడు
లేడు.వాళ్ళకు నన్ను నేను సైగలతో పరిచయం చేసుకున్నా (వాళ్ళకు హిందీ, ఇంగ్లీషు తప్ప వేరే భాషలు రావు, నాకు తెలుగు తప్ప వేరే యోగ్యత లేదు)


పూనాలో అడుగు పెట్టిన వేళా విశేషమో, లేదూ, పూనా లో మాకు ఆశ్రయమిచ్చిన వాళ్ళ ప్రార్థనలు ఫలించాయో
యేమో, సరిగ్గా 4 రోజులకో చిన్న ఉద్యోగం సంపాదించేము, నేనూ, నా మిత్రుడు ఇద్దరం ఓ ఫాక్టరీలో.పూనాకు
25 మైళ్ళ దూరంలో ఉన్న ఆళందీ అనబడే ఓ గ్రామంలో ఆ ఫాక్టరీ.నా మొదటి జీతం 955 రుపాయలు. 45
రుపాయలు, టీ కి కటింగు పోగా.


అంత వీజీగా ఉద్యోగమా అని డవుట్ వచ్చిందా? దానికి ఓ చిన్న మతలబు. మహారాష్ట్రలో, B.Tech అంటే,
ఆ అబ్బాయి IIT లో చదివాడు అని. మిగిలిన కాలేజుల్లో అంతా B.E డిగ్రీలు.నాది JNTU, B.Tech
డిగ్రీ. నా డిగ్రీ B.Tech అనగానే అక్కడ ఆ ఫాక్టరీ యజమాని ఆనందంతో మూర్చపోయి ఉద్యోగం ఇచ్చాడు. (ఆ కంపనీ తర్వాత మూతపడింది అని విన్నాను!)


ఆళంది గ్రామం గురించి కొన్ని విశేషాలు. ఇంద్రాణీ నది ఒడ్డున ఉన్నఈ గ్రామం గురించి దాదాపు మరాఠీ వారికి
అందరికీ తెలిసి ఉంటుంది. 13 వ శతాబ్దంలో మహారాష్ట్రలో ఙ్ఞానదేవుడనే గొప్ప మహానుభావుడు జన్మించాడట.
ఆయన చిన్న వయసులోనే ఙ్ఞానేశ్వరీ అని భగవద్గీత కు వ్యాఖ్యానం రాసేడు. ఈయన సమాధి, ఈ వూళ్ళో
ఉంది. ఈ ఊరి నిండా ధర్మ శాలలు.చిన్నప్పుడే, ఈ వూరికి వచ్చి మధుకరం (మధుకరం - తుమ్మెదలు
పువ్వు పువ్వునా వాలి తేనె సేకరించినట్టుగా అన్న అర్థం) చేసుకుంటూ అభంగాలు, ఙ్ఞానేశ్వరీ వల్లించే
విద్యార్థులు!


ఇంకా ఓ ఓపన్ ఎయిర్ థియేటర్/టెంట్ (స్వదేశ్ సినిమాలో లా)...ఇంద్రాణీ నదిపైని అందమైన
సాయంత్రాలు...ఊరి పక్కన పంట పొలాలు...ఆ పొలాల మధ్య, పిందెలతో విరగకాసి, తనలో తానే ముసి
ముసి నవ్వులు నవ్వుకుంటున్న పెద్ద మామిడి చెట్టూ...


నాకు వచ్చే 1000 రుపాయలలో, 175 గది కిరాయికీ, 350 మెస్సు ఖర్చులకూ, మిగిలిన 200
అదనపు ఖర్చులకూ పోగా, దాదాపు 200 రుపాయలు నెలకు మిగిలేవి. (20 శాతం!)
(ఇప్పుడు 10 యేళ్ళ తర్వాత, జీతం అప్పటి జీతానికి ఎన్నోరెట్లయినా పొదుపు మాత్రం శూన్యం! నిజం,
సోడెక్సో మీదొట్టు!)


సరే..ఈ ఊళ్ళో నాలుగు నెలలున్నాను.మధ్యలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాను. ఆ కంపనీ రెసెప్షనిస్ట్ ను
చూడగానే కళ్ళు చెదిరిపొయాయి. పైగా, ఆమె నవ్వుతూ పలకరించింది! ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడంతో
ఆ ఉద్యోగానికి మారేను. ఆ రెసెప్షనిస్ట్ ను మనసారా ప్రేమించసాగాను. ఆమె కూడా ఆమె
ఉద్యోగాన్ని మనసారా ప్రేమిస్తూ, వచ్చిన అందరితోనూ, నవ్వుతూ పలకరించడం చూసి, నా మనసు విరిగి
పోయింది. "ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్ని కోరుతుంది" అని, నా మనసును సమాధాన
పర్చుకుని, ఆమెకు బదులుగా, నా అభిమాన నటి మమతా కులకర్ణి ని ప్రేమించసాగాను.

నా మిత్రుడు అంతకు ముందే, పూనాలో ఉన్నవాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళి ఇంకో ఉద్యోగంలో మారేడు.

పూనా అంటే, నా నిఘంటువులో అర్థం ’అందమైన అమ్మాయిలు’ అని.పూనాలో ఓ పది మంది అమ్మాయిలు
కనిపిస్తే, అందులో, కనీసం 8 మందిని తిరిగి మళ్ళీ చూడాలనిపిస్తుంది.సాయంత్రం ఉద్యోగాలనుండీ, కాలేజుల
నుండీ తిరిగి వస్తున్న వేళల్లో కూడా, యే మాత్రం అలసట కనిపించకుండా, కడిగిన ముత్యాల్లా కనిపించడం,
ఇక్కడి అమ్మాయిల ప్రత్యేకత.


నా రూం మేటు అక్కడ ఓ ప్రముఖ అమ్మాయిల కాలేజీలో లైబ్రేరియను. నాకు తీరిక ఉన్నప్పుడల్లా, వాడు
కాలేజీ లో ఉన్నప్పుడు నాకు వాడితో రూమ్ కీ ఇప్పించుకోవడం లాంటి ’అవసరం’ పడేది, వాళ్ళ కాలేజీకి వెళ్ళి
తనని కలిసే వాణ్ణి. (అక్కడ మగ వాళ్ళను లోపలకు అనుమతించరు, నా లా 'జెనుయిన్' కేసులకు ఎక్సెప్షన్!)


నా మిత్రుడి మావయ్య, Pune Film and Telivision institute of India లో మేకప్
విభాగానికి అధిపతి. ఆయన పూనా లోని ఓ మంచి సెంటర్ లో ఓ బ్యూటీ పార్లర్ తెరిచేడు. అంకుల్ బిజినెస్స్
ఒకటీ, మా బిజినెస్స్ ఒకటీనా? ఈ బ్యూటీ పార్లర్ ను కనిపెట్టుకుని ఉన్డే బాధ్యత మాది! (ఆ బ్యూటీ పార్లరు
మూతపడిందని వేరే చెప్పాలా? 6 నెలల్లో ఆ పని జరిగింది. అలానే, నా మిత్రుడూ వాళ్ళ మావయ్య ఇంటి
నుండీ వచ్చేసేడు.గెంటేశారా, లేదు లేదు తోశేసారు.అయితే, ఆయన తిరిగి మళ్ళీ ఆ బిజినెస్సు పునరుద్ధరించి, ఇప్పుడు పూనాలో చాలా ఫేమస్ అయాడు(ట) లెండి.
)

పూనా సిటీ బస్సుల్లో ఇంకో ఫెసిలిటీ. ఇక్కడ లాగా, అమ్మయిలకు ప్రత్యేకమైన సీట్లు ఉండవు. పక్కన ఉన్న
అమ్మాయి గురించి మేము తెలుగులో మాట్లాడుకుంటున్నా, వారికి అర్థమయేది కాదు!


నా ఉద్యోగం అలా సాగిపోతోంది. 3 నెలల తర్వాత మరో ఉద్యోగం మారేను.ఇది ఓ ప్రముఖ స్టీలు సంస్థ. ఆ
అనుభవం జీవితంలో బాగా ఉపకరించింది.


నేను పని చేసేది ఫాక్టరీలో. ఓ రోజు ఏదో పని మీద కంపనీ ఆఫీసుకు వెళ్ళాను. కొరెగావ్ పార్క్, అక్షర్ ధామ్
అన్నచోట. మంచి పాష్ లొకాలిటీ అది. అక్కడ చాలా మంది ఫారీనర్స్, ముదురు రంగు దుస్తుల్లో
తిరుగుతున్నారు. కొంచెం విచిత్రమైన వాతావరణం.ఆ అక్షర ధామ్ పక్కన రజనీష్ ధామ్ అని ఓషో ఆశ్రమం.
అప్పట్లో, ఓషో గురించి పెద్దగా తెలియదు నాకు. (ఇప్పుడు నేను తనకు పంఖాని)


అలా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ’సాఫ్ట్ వేర్’ అన్న అవిశ్వాస తీర్మానం
ప్రవేశించింది!

(సశేషం)

Tuesday, July 29, 2008

ఉద్యోగ భారతం - కాలేజీ పర్వం

నేను కాలేజీ చదివే రోజుల్లో దుష్ట చతుష్టయం లాగా ’లెగ్గు చతుష్టయం ’ ఉండేది. అందులో ప్రముఖ లెగ్గు నాదే.
2 వ ప్రముఖుడు నా మిత్రుడు. ఇన్కా మిగిలిన ఇద్దరిదీ అంత భీభత్సమైన లెగ్గు కాకపోయినా, అప్పుడప్పుడూ
ప్రభావం కనిపించేది. నన్ను క్యాస్ట్ ఐరన్ లెగ్గు అని అనేవాళ్ళు మా సహాధ్యాయులు.


మాలో (ప్రముఖంగా నాలో) కనిపించని ఇంకొక ఏంగిల్ ఉండేది. అదేమంటే, నాతో పాటూ, ఎవరైనా కలిసి
చదివితే (కో-స్టడీ) ఆ చదివిన వాడు జెండా ఎత్తే వాడు, మా (నా) విషయం మాత్రం ఎలాగోలా గట్టెక్కేది.
3 వ సంవత్సరం 2 వ సెమిస్టరు చదువుతున్నప్పుడు జరిగిందిది.


మామూలుగా పరీక్షలు రాగానే, మా సహాధ్యాయులు అంతా మా మిత్ర వర్గాన్ని చుట్టుముట్టే వాళ్ళు, " మీరు
ఏయే చాప్టర్లు చదువుకున్నారు " అని అడగటానికి. ఎందుకంటే, మేము (లెగ్గు చతుష్టయం)
చదువుకున్నచాప్టర్లు వదిలేసి, మిగిలిన చాప్టర్లు చదువుకుంటారు(ట) వాళ్ళు. మా (లెగ్గు)మీద అంత
నమ్మకం మా సహాధ్యాయులకు. ఈ లెగ్గు విషయం ఏదో తేల్చుకోవాల్సిందే అని, నేనూ, నా మిత్రుడూ, ఓ కుట్ర
పన్నాము.3 వ సంవత్సరం ఇంజినీరింగు లో కామర్స్, ఎకనామిక్స్ కి సంబంధించి, ఆది శంకరుల వారి
మాయా వాదం లాంటి జటిలమైన ఓ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో సరిగ్గా సగం నేను, మిగతా సగం నా
మిత్రుడూ పంచుకుని ఎక్సామ్స్ ప్రిపేర్ అయ్యాము.


అంటే, ఆ కామర్సు సబ్జెక్టు పరీక్షలో, వస్తే, నేను చదివిన చాప్టర్లలో ప్రశ్నలు రావాలి, లేదూ, మా వాడు
చదివిన చాప్టర్లలో చదివిన ప్రశ్నలు రావాలి. మేము చదవని చాప్టర్లలో ప్రశ్నలు పరీక్షలో రావడానికి అవకాశం
లేదు.ఈ రకంగా మా మీద పడ్డ ’లెగ్గు ’ మచ్చ ను తుడిపేసుకోవాలి అని మా ఊహ. మా సహాధ్యాయులకు
తెలియనే తెలిసింది, ఈ విషయం. ఏం జరుగుతుందో, ఏమోనని ఉత్కంఠ అందరిలోనూ.


ఆ పరీక్ష రానే వచ్చింది. మా సహాధ్యాయుల ముఖాల్లో ప్రేతకళ!

ఆ పరీక్ష ప్రశ్నాపత్రంలో, మొత్తం ప్రశ్నలన్నీ ’అవుట్ ఆఫ్ సిలబస్’! ఇంజినీరింగు సబ్జెక్ట్ అయితే, వికెట్లు
లేచిపోయి ఉండేవి. ఇది కామర్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ కదా, అందరు, వాళ్ళకు తోచిన సమాధానాలు
రాశారు. క్లాసు మొత్తం మీదకు బెస్ట్ మార్క్ 22/50. దాదాపు క్లాసులో అందరికీ స్టాంపులు ముద్రించారు
(18/50 - సరిగ్గా పాస్ మార్కు). ఆ బెస్ట్ మార్క్ నాకే.


ఆ దెబ్బకు నా పాదం మీద నాకు నమ్మకం బాగా బలపడింది. ఆ నమ్మకం నన్ను చాలా కాలం వేధించింది
కూడా.


ఇక కాలేజీ చదివేప్పుడు, మాకు ఫోర్ ట్రాన్ అనబడే కంప్యూటర్ భాష ఓ సబ్జెక్ట్. కాలేజీలో కంప్యూటర్ ల్యాబు లో
మాత్రం జనాలు ’సీ ’, ’బేసిక్ ’ లాంటి వాటి మీద బడి కుమ్మేసే వారు. అప్పుడప్పుడూ, నేనూ వెళ్ళే వాణ్ణి
అక్కడకు (నా బ్రాంచ్, మెకానికల్ అయినా కొన్ని ప్రత్యేక సమయాల్లో మాకు అనుమతి వుండేది ఆ లాబ్ లో
ప్రవేశించడానికి).


మొదట ఓ మిత్రుడు ఏదో చేస్తుంటే, చూడ్డం, వాడు పక్కకెళ్ళిన తర్వాత, భయపడుతూ, కీ బోర్డు కి దెబ్బ
తగులుతుందేమోనని అని భయపడుతూ నొక్కడం, ఇలా సాగింది. కొన్ని రోజుల తర్వాత ఓ మేధావి, బేసిక్ అనే
కమ్ప్యూటర్ భాషలో, యేదో ప్రోగ్రామ్ రాశాడు. ’ జనగణమణ ’ పాట వస్తుంది, ఆ ప్రోగ్రాం ఎక్సిక్యూట్ చేస్తే.,
అదీ కాస్త (కారక్టర్) గ్రాఫిక్స్ తో..ఆ ప్రోగ్రాం నాకు ప్రేరణ. ఆ అబ్బాయి పక్క కూర్చుని, తన పాస్ వర్డ్
సంగ్రహించి, తన ప్రోగ్రామ్ ను కాపీ చేసుకున్నాను. (మరి మామూలుగా చెప్పమంటే చెప్పడుగా!) ఆ ప్రేరణతో,
నేనూ, ఓ ప్రోగ్రామ్ రాసేను.


" క్రికెట్ పిచ్, ఇరువైపులా స్టంప్స్, బ్యాటు, బంతి ఇవతల పక్కనుందీ విసరబడ్డం, బ్యాటు కాస్త అటూ ఇటూ గా
ఆ బాల్ ను తాకడానికి ప్రయత్నిస్తుంది. ఒక వేళ బంతి, బ్యాటు ను తాకితే, బంతి వచ్చిన దారిన
పరిగెత్తుతుంది". ఇదీ నా మొదటి ప్రోగ్రామ్. బేసిక్ లో ఇది రాయడానికి దాదాపు రెండున్నర నెలలపైగా పట్టింది.
గ్రాఫిక్స్ లో ఇష్టం అలా అంతర్గతంగా ఉండిందేమో మరి, గ్రాఫిక్స్ లో ఓ రెండేళ్ళు పని చేయడానికి అవకాశం
దొరికింది.


ఇలా నా ఇంజినీరింగు చదువు ముగిసింది.

సరే, ఉద్యోగం పురుష లక్షణం కదా, యేదైనా ఉద్యోగం వెతుక్కోవాలి, లేదూ, ఇంకొక ఆప్షను, ఓ రెండేళ్ళు
ఉన్నత విద్య (M Tech) కి వెళితే, కాస్త ఆలోచించుకొనే అవకాశమూ దొరుకుతుంది, కాస్త స్టయిఫండ్ తో
పనీ నడుస్తుంది కదా అని ఆలోచించేను.


GATE పరీక్ష రాయడమూ, అందులో ఓ మోస్తరు స్కోర్ రావడమూ వెంట వెంటనే జరిగాయ్. అలాగే ఓ
REC లో సీట్ కూడా వచ్చేసింది. చేరేశాను.


ఇంత వీజీ గా ఎలా జరిగింది అంటారా? నాతో పాటు ఒక మిత్రుడు కో స్టడీ చేసి, తన ఙ్ఞానాన్ని నాకు పంచి,
తను మాత్రం అస్తమిస్తున్న సూర్యుడి దిశగా అలా సాగిపోయాడు.(ఇందాకే చెప్పాగా, నాతో కో స్టడీ చేస్తే
యేమవుతుందో?) అలా సాగి, రవి అస్తమించని సామ్రాజ్యం లో తేలాడు లెండి, ఓ రెండేళ్ళ తర్వాత.


చేరిన తర్వాత తెలిసింది, స్టయిఫండ్ రావడానికి కనీసం ఓ యేడాది పడుతుంది, పైగా నాకు దొరికిన
స్పెషలైజేషన్ లో కేవలం రీసెర్చ్ అవకాశాలు మాత్రమే వుంటాయి అని. యేడాది వరకు ఇంటి నుండీ డబ్బు
తెప్పించుకోవడం మా ఇంటి పరిస్థితుల కారణంగా కుదరని పని. అదే కారణం చేతే, ఇంజినీరింగు లో REC
సీట్ వచ్చినా చేరక, మా వూళ్ళోని ఇంజినీరింగు కాలేజీలో చదవడం జరిగింది.


ఆ కారణం చేత, ఆ MTech చదువుకు తిలోదకాలు ఇచ్చేను.

ఇంటి వద్ద మా నాన్న ఒకటే పోరు, మా బంధువుల వద్దకు వెళ్ళమని, నాకు ఉద్యోగం వాళ్ళే వేయిస్తారని.

అలా వెళితే, నా ’సీమ పౌరుషం ’ దెబ్బ తినదూ?

ఇంతలో కాలేజీలో నా లెగ్గు మిత్రుడు పూనాలో వాళ్ళన్నయ్య మిత్రుడి దగ్గరకు వెళ్ళి, ఉద్యోగం వెతుక్కునే
ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసింది.సరే, ఓ శుభ ముహూర్తం, నేనూ, పూనా కి మకాం మార్చేను, జేబు లో ఓ
2 వేల రూపాయలతో.


(సశేషం)