Showing posts with label contemplation. Show all posts
Showing posts with label contemplation. Show all posts

Thursday, February 7, 2013

పాండిత్యం = జ్ఞానాభాస


ఆధ్యాత్మికప్రపంచంలో - ఎంచేతనో తెలియదు కానీ కొన్ని శబ్దాలను నిర్వచించి, వాటి గురించి నిర్దుష్టమైన అర్థంలో ఉపయోగించి మనవాళ్ళు తప్పు చేశారా అనిపిస్తుందొక్కొక్కసారి. అటువంటివాటిలో రెండు శబ్దాలు - జ్ఞానం, ఆత్మ.

జ్ఞానం - అని దేన్నయితో ఆధ్యాత్మికవాదులు అంటున్నారో అది నిజానికి తెలియదగింది కాదు. అంటే బుద్ధితో , మెదడు అనే పరికరంతో అంచనా వేయవలసినది కాదు. బుద్ధి చేత తెలియదగింది సమాచారం. ద్వంద్వాలకు లోబడినది మాత్రమే సమాచారం వల్ల తెలియదగింది. భావనాత్మక ప్రపంచం సంగతి వేరు. ఉదాహరణకు దుఃఖం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం - ఒక సమాచారం వల్ల తెలిసేది కాదు. ఒకవేళ అది సమాచారమే అయితే ఆ సమాచారాన్ని , అది ఎంత పెద్దదయినా సరే తెలుసుకుని దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. అలా జరగడం లేదే. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తీసిస్ లు చదివినా మనిషికి దుఃఖం అన్నది పోవట్లేదు. ఏదో కొద్దో గొప్పో కొంతకాలం పోతుంది, మళ్ళీ వచ్చి తగులుకుంటూ ఉంది. ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కావాలంటే - కనుక్కోగలిగే  జవాబు ప్రశ్నకు బాహ్యమైనది అవకూడదు. అంటే ఆ ప్రశ్నకు సమాధానం - దుఃఖం అంటే ఎమిటి? ఆ ప్రశ్న అంతరించడంలోనే ఉంది తప్ప మరొక విధమైన ప్రక్రియలో లేదు.

ప్రశ్న అంతరించడమంటే ఏమిటి? బుద్ధి లేదా మెదడు జవాబు కోసం వెంపర్లాడకండా మూలమట్టంగా తనలో తానే annihilate కావడం. అంటే మెదడు తను నిర్వర్తించే వ్యాపారాలను తనే ఏ విధమైన choice లేకుండా గమనించే ఒక స్థితి. ఆ స్థితిలో దుఃఖం అన్నది ఉండకపోవచ్చు.

ఈ స్థితి ఒక మనిషిలో స్వతఃసిద్ధంగా ఏర్పడగలిగితే అది నిర్వాణం అని బుద్ధుడి నిర్వచనం. ఆ స్థితిలో మనిషికి , ప్రపంచానికి భేదభావం కనిపించదట. చూచేవాడు, చూడబడేది, చూచుట అన్నీ నశించి, జగత్తు అణువణువునా తనూ, తనలో జగత్తూ స్పష్టంగా కనిపిస్తూ, ఏ విధమైన ద్వంద్వమూ ఏర్పడని దశ. ఆ వాక్యంలో - స్వతఃసిద్ధంగా - అన్నది ఎందుకంటే - ప్రయత్నపూర్వకంగా మెదడు వ్యాపారాలను గమనించడం అసంబద్ధం. ఎందుకంటే - ఆ ప్రయత్నం అన్నది బుద్ధిలో అంతర్భాగం కాబట్టి.  కానీ ధ్యానం మొదలు పెట్టాలంటే ఎక్కడో ప్రయత్నం తప్పనిసరి. అదే ఆ ప్రయత్నమే ఆ తర్వాత ప్రయత్నరహితమైన ’అలవాటు’ గా మారవచ్చు. బుద్ధిని ఏ మాత్రం వికల్పాలకు తావివ్వనీయకుండా అలా శాంతంగా కూర్చుని దాని తాలూకు వ్యవహారాలను గమనించడం చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని పేరు విపశ్యన. (విశేషంగా చూచుట). ఇలా గమనిస్తూ ఉంటే కొంతకాలానికి ఆలోచనలు స్థంభించి, ఆ పని తనంతట తానే జరగడం మొదలు అవుతుంది. దాన్నే ధ్యానం అన్నారు. ఈ ఆలోచనలు స్థంభించి, ఆలోచనల మధ్య ఖాళీలు ఏర్పడే దశను ’సతోరి’ అని జెన్ బౌద్ధులు అన్నారు. అ సతోరి ముదిరితే సమాధి అవుతుందని వాళ్ళంటారు.

ఈ వ్యవహారాన్ని అట్నుంచి నరుక్కొస్తే - దుఃఖం ఎందుకు వస్తుంది? అంటే కోరిక వల్ల అని బుద్ధుడు. (అష్టావక్రుడు కూడా) కోరిక తీరితే - ఓస్ ఇంతేనా అని దుఃఖం, తీరకపోతే తీరి ఛావలేదని దుఃఖం. కోరిక అన్నది ఎలా కలుగుతూంది? ఎంపిక (choice) వల్ల. నాకు సంతోషమే కావాలి. సుఖమే కావాలి, సెక్యూరిటీయే కావాలి, బాధలొద్దు, తనకలాట వద్దు అన్న బుద్ధి తాలూకు ప్రేరణ వల్ల. అలాగని కోరికలను చంపేసుకునో, వైరాగ్యపు పాటలు వినో వైరాగ్యం కొని తెచ్చుకుంటే - అది భారం అవుతుందే తప్ప అందువల్ల root cause సమిసిపోదు. ఈ choice - బుద్ధి వల్ల కలుగుతా ఉంది. బుద్ధికి ఇలా జీవితంలో ప్రతీక్షణం ఒక choice కోసం వెంపర్లాడే ప్రవృత్తి ఎలా వచ్చింది అంటే దాని లక్షణమే అంత. దాని స్వభావమే అలాంటిది. ఆ స్వభావాన్ని దాటి ఆవల ఏముందో తెలుసుకోవాలంటే - choice-less awareness కావాలి. అదే ఇందాకటి విపశ్యన. ఆ విపశ్యనకు అంతిమప్రస్థానమే బుద్ధాదులు పొందిన సమాధి. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి అన్న ఆధునిక బుద్ధుడు Mutation of brain cells అన్నాడు.

సరే మనం మామూలు మనుషులం. అలాంటి స్థితి పొందలేం. ఊరికే మాట్లాడుకుని అలాటిదొకటుందని ఫిక్స్ అవచ్చు. అయితే ఇక్కడ చర్చ ఆ స్థితి ఎలా కొనితెచ్చుకోవడం అని కాదు. ’జ్ఞానం’ అనే ఒక పదం గురించి.

ఇందాకటి స్థితి - అనుభవానికి మాత్రమే లోబడగలిగినది. అది సమాచారం కాదు - అంటే సమాచారం ద్వారా తెలిసే వాస్తవం కాదు. That is not a knowable entity. అంటే - Unknowable cannot be known. It will be only realized as - unknowable, after mind annihilates itself by getting out from the realms of known and unknown. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి ’సత్యం’ గా ప్రవచించాడు. ఇందాక అన్నట్లు ఇది స్పష్టంగా ఇతమిత్థమని చెప్పలేనిది, కానీ సూచించగలిగేది మాత్రమే. అది ఒక ఆలోచనలకు ’అభావ’ మైన స్థితి. అంటే శూన్యస్థితి.

పరిస్థితి ఇలా ఉంటే జ్ఞానం అన్నదాన్ని - సమాచారం అన్న అర్థంలో చెప్పడం వల్ల - పండితులు జ్ఞానులై కూర్చునే ఒక పరిస్థితి ఏర్పడింది. జ్ఞానం అంటే తెలియదగింది అని నిర్వచనం చెప్పారు కాబట్టి తెలియదగిందంటే ఏదో ఒకటుండాలి కాబట్టి భగవంతుడు అన్న object వచ్చి చేరింది. భగవంతుడంటే? - ఇల్లా తెల్లబట్టలు చుట్టుకుంటాడు, ఇలా నడుస్తాడు, అలా ఆలోచిస్తాడు. ఎక్కడో ఉంటాడు, వాడికి కోపం వస్తుంది. వాడు పిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. వాడికి లడ్డూ ఇష్టం వగైరా వగైరా వగైరా. ఇందువల్ల జ్ఞానం అనేది ఎందుకు కావాలో అన్న ప్రశ్న నశించింది. మొత్తం వ్యవహారం పక్కదారి పట్టింది. పండితులు బయలు దేరారు. వారికి అనుసరణీయులు తయారయ్యారు.

ఈ జ్ఞానం మెల్లగా చాప కింద నీరులా ’మతం’ క్రిందికి చేరింది. ఏదో చాలా నిగూఢమైనది, కష్టపడి అర్థం చేసుకోగలిగినది, ’సంస్కృత’ భాషలో ఉన్నది అయిన ’సమాచారం’ మన మహర్షులు మనకు ఇచ్చి పోయారు. అది తెలుసుకుంటే మనం జ్ఞానులు అవుతాం. అది తెలియని వాడు అజ్ఞాని. అది ఒక ముక్క తెలిసి, అంతా తెలిసినట్టు మాట్లాడే వాడు కూడా జ్ఞానమార్గంలో ఉన్నాడు కాబట్టి ఏ మాత్రం తక్కువ తినలేదు. వాడి గురించి మాట్లాడ్డమా? అమ్మో? - తప్పు కదూ? ఈ భావాలు మనలో రక్తంలో, అణువణువునా ఇంకి పోయాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ మాట్లాడుతున్నదంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో అని గుర్తు చేస్తున్నాను. లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు. లౌకికంగా ఆలోచిస్తే - వైద్య విద్య (లేదా జ్యోతిషం/నిరుక్తం, వ్యాకరణం ఏదైనా) అని ఒకటుందనుకుందాం. లౌకికంగా ఆ విద్యను ఎవరో అందించిపోయారు కనుక వారి మార్గాన ప్రయాణించడం అవసరం. ఆ విద్యకు రూపకర్తలను గుర్తించడం ఒక విధి. ఆ విద్య బుద్ధి పరిధికి చెందినది కాబట్టి బుద్ధితో సమగ్రంగా తెలియదగింది కాబట్టి అక్కడ విద్యను, కర్తలను ఆరాధించడం మానసిక అవసరం. అలాగే దైవభక్తి. దేవుడున్నాడా అన్న శంక ఒకపక్క పీడిస్తున్నా, దైవభక్తి మాత్రం - మనిషికి మానసిక అవసరం. దేవుణ్ణి నమ్మడం మనిషికి బలహీన క్షణాలలో మానసిక బలాన్ని, సాంత్వననూ, చిత్తశాంతిని ప్రసాదిస్తుంది. పైగా ఈ విశ్వాసమే బలమయిన ఉపకరణంగా లౌకికంగా, ఆధ్యాత్మికంగానూ ఉపకరించగలదు. ఆధ్యాత్మికమంటే - నాస్తికత్వం కానవసరం లేదు.ఆధ్యాత్మికమంటే బౌద్ధిక దృష్టికి అందని నమ్మకానికి చెందినదనీ పొఱబాటు పడనక్కర లేదు. ఇది రెంటికీ మధ్యసంగతి. పూర్తిగా వ్యక్తిగతమైనది, వ్యవస్థాగతానికి భిన్నమైనదీనూ.

కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, existential dilemmas ఎందుకొస్తున్నాయి అన్న విషయానికి సంబంధించి ఒక ఆలంబన - ’crutch’ ఎందుకు కావాలి? ఆసియా నుండి యూరోపుకు వెళ్ళడానికి భౌతికంగా విమానం కావాలి. దుఃఖం అన్నది తెలియడానికి ఎక్కడికి వెళ్ళాలి? దుఃఖాన్ని noun గా కాక, verb గా realize అవగలగాలి. అంతే. అంటే గతం, భవిష్యత్తు నశించి, శుద్ధమైన వర్తమానంలో జీవించడం తెలియాలి. అదే అసలైన జ్ఞానం. ఇది సమాచారం కాదు, ఎఱుక మాత్రమే అని మళ్ళీ మరోమారు జిడ్డుకృష్ణమూర్తి ఉవాచ. (మనకు ఆ దృశ్యం లేదు. ఇలా సొల్లు మాట్లాడుకుంటే ఒక ఊరట)

ఇప్పుడు మన కర్తవ్యం ఏమంటే - జ్ఞానం అన్నవెంటనే అది పండితుల గుత్తసొమ్ము అన్న మాటను అంగీకరించకపోవడం. ఒకడెవడైనా జ్ఞానాగ్నిదగ్ధకర్ముణ్ణి, బ్రాహ్మీమయమూర్తిని అంటే అతడికి అనుభవజ్ఞానం ఉందని పొఱబాటు పడనవసరం లేదు. అతనికి గౌరవం ఇయ్యవచ్చు, తప్పులేదు. అయితే అతడు ఆధ్యాత్మికమార్గంలో అనుసరణీయుడు కానవసరం లేదు. అతడు చెప్పేదంతా ’జ్ఞానం’ అని సర్దిపుచ్చుకుని ’మహత్త్వం’ ఆపాదించెయ్యడం పొఱబాటని గుర్తెరగాలి. ఇది ఒక అవసరం.

మనం జ్ఞానం ఏదో తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఏది జ్ఞానం కాదో దానిని తెలుసుకుంటే అదే ఏదో ఒక రోజు మనకు మార్గం చూపించవచ్చు. అంతే కాక, ఒక పొరబాటు విషయానికి మహత్వం ఆపాదిస్తే ఆ మహత్వం చేసే కీడు బయటికి కనిపించనిది. పండితులను ఆరాధించడం కూడా అటువంటిదే.

అదీ సంగతి.

మరొకటి ’ఆత్మ’. దీన్ని కూడా మనవాళ్ళు పాజిటివ్ టెర్మ్స్ లో నిర్వచించి కష్టపెడుతున్నారు. సాంఖ్యయోగంలో గీతాకారుడంటాడు - ఆత్మ నాశనము లేనిది, ఆత్మ అన్నదానికి ఉత్పత్తి, వ్యయము, ,వృద్ధి, విపరిణామం, క్షయం ఇలాంటివి లేవు. దీన్ని అగ్ని కాల్చదు, నీరు తాకదు, దీన్నెవరు చీల్చలేరు, అసలు దీన్ని గురించి బుద్ధితో కూడా తెలుసుకోలేరు, దీనికి పుట్టుక లేదు, మరణం లేదు......ఈ తీరుగా కొండవీటి చేంతాడంత లిస్టు లక్షణాలు వెతికి పట్టుకొచ్చి వాటిల్లో ఒక్క లక్షణమూ ఆత్మకు లేదు అని ’ఆత్మ’ కు అనిర్వచనీయమైన నిర్వచనం చెప్పేశారు మనవాళ్ళు. ’ఫలానాది ఏదీ లేదు’ - ఈ వాక్యం ఎంత అసమంజసంగా ఉందో, అలానే ఏదీ లేని, అసలు ’తెలుసు’కోలేని ఆత్మ గురించి ’తెలియ’ జేసే ప్రయత్నం ఎందుకు? (అర్జునుడు మహాభక్తుడు కాబట్టి అనుకోవచ్చా?).

మరొకటి - ’అచ్చేద్యోయమచింత్యోయమవ్యక్తోయం’ అయినది ఆత్మ. అది శరీరం బట్టలు విప్పి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా దేహాన్ని విడిచి మరో దేహాన్ని పొందుతూ ఉంటుంది అన్నారు. అంటే ఒక్కో మనిషికి ఒక్కో ఆత్మ representative గా ఉంటుందా? లేక మానవులందరికీ కలిపి ఒకే ఆత్మ నా? ఆ శ్లోకం ప్రకారం అయితే ఒక్కోమనిషికి ఒక్కో ఆత్మ అనుకోవలసి వస్తున్నది. అంటే ఆత్మల జనాభా - ప్రపంచజనాభాతో సరిసాటి. ఇంకా జంతువులకూ ఆత్మలు ఉంటే వాటి ఆత్మలూ పరిగణనలోకి వస్తాయి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో జీవరాశులు. (ఇన్ని ఆత్మలను maintain చేసి మరణానంతరం appraisals చేయడం సామాన్యమైన పని గాదు.)

లేదు ఒకటే ఆత్మ అంటే - ఆ ఆత్మకు లక్షణాలు లేవు కాబట్టి అదొక pure witness కు ప్రతీక అనుకోవచ్చు.

ఈ వికృత వాఖ్యానం ఎవరినో బాధపెట్టడానికి చేయటం లేదు. క్షమించాలి. అమంగళం ప్రతిహతమగుగాక. ఆధ్యాత్మిక విషయాలలో ’బుద్ధి’ అన్న దాని గురించిన పరిధిని గురించి ప్రతీకాత్మకంగా ఊహించడానికి ఈ తపన. భగవంతుడయినా సరే, అల్పులయిన మన బోటి మానవులకు విషయాలు చెప్పాలంటే - దానిని ఏదో భాషలో చెప్పవలసిందే. భాష - అనగానే దానికున్న పరిధి దానిది. అది జ్ఞానాన్ని పూర్తిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేదు. అందుకనే కొందరు గొప్ప జ్ఞానులు, కవులు కూడా అయిన వారు - భగవంతుడి భాష మౌనం అన్నారు.

సరే మళ్ళీ మొదటికి వస్తే - మహాత్ముడు బుద్ధుడు ఆ witnessing ను అలానే ఉంచేశాడు. ఆయన ’ఆత్మ’ అనే ఒక entity ఉనికిని చెప్పలేదు. ’అనాత్మ’ అంటాడాయన. మరి శాశ్వతంగా ఏదీ ఉండదా? మరి శాశ్వతంగా ఏదీ లేకపోతే ఇక ఆనందాన్ని అనుభవించేది యేది?

ఆనందాన్ని అనుభవించేది, ఆనందానుభవం, ఆనందమూ ఇవేవీ లేదు. నిర్వాణం అంటే - Total annihilation. అదే వ్యక్తమూ, అవ్యక్తమూ అయిన జగత్తు తాలూకు యథాతథ స్థితి. భౌతికంగా అన్ని వస్తువులూ నాశనం కావలసిందే. ఆధ్యాత్మికంగా కూడా ఏదీ మిగలదు. ఆ స్థితిని ’తథాథ’ అని ఆయన సూచించాడు. అష్టావక్రగీత దాదాపుగా బుద్ధబోధ లాగానే ఉంటుంది.

ఇంతకూ నా బాధ యేమంటే - ’ఆత్మ’ ఫలానా అని చెప్పడం వల్ల - మళ్ళీ పండితులు బయలు దేరారు. వివరణలు మొదలయ్యాయి. కొన్ని లౌకిక వ్యవహారాలకు - ఆధ్యాత్మిక రంగంలో ఆలోచించవలసిన ’ఆత్మ’ ను వాడుకున్నారు. ఆ ’ఆత్మ’ను - వర్ణవ్యవస్థ తాలూకు వ్యాఖ్యానాలకు ఉపయోగించి కలుషితం చేశారు. పాండిత్యంతో మభ్యపెట్టారు. పాండిత్యాన్ని ’జ్ఞానం’ గా వ్యాపింపజేశారు. నిజానికి ’ఆత్మ’ - అచింత్యం అన్నా కూడా దానిని ’చింత్యం’ గా మార్చారు.

కనుక మన కర్తవ్యం ఏమిటంటే - తెలియని విషయాల గురించి మనకు తెలియదని ఒప్పుకోవడంతో బాటు - ఎవరైనా తెలియజెప్పబోతే వారి ఉద్దేశ్యం ఏమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు తెలియనిది తెలియనిది గానే ఉండడంలో తప్పేమీ లేదని గుర్తెరగాలి. ఏ విషయమూ తొందరపడి జ్ఞానంగా ఎంచడం తప్పని మనకు అర్థమవాలి. జ్ఞానం - సమాచారం కాదు. వంద పుస్తకాలు రాశాడనో, అనేక సంగతులు తెలుసుననో ఒక ’పండితుణ్ణి’ - జ్ఞానిగా చెయ్యటం మహాప్రమాదం. పండితుడంటే వందల కొలదీ విషయాలు తెలిసిన వాడు కాదు. అది కెపాసిటీకి చెందిన విషయం. అన్ని విషయాలకు మూలకందమైన దాని స్ఫూర్తిని ఎఱిగినవాడు పండితుడు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శునిచైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః ||

పండితుడంటే - వినయసంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, శునకమాంసం తినే వాడిని సమంగా చూడగలిగినవాడు. ఈ స్ఫూర్తి లేకుండా ’జ్ఞానం’ ’గురించి’ పేజీల కొద్దీ వివరణలు చేసిన వాణ్ణి పండితుడుగా గుర్తించటం చాలా పెద్ద పొఱబాటు.

కాబట్టి పండితుడికి, టన్నుల కొద్దీ సమాచారం సేకరించిన లేదా మాట్లాడగలిగిన మేధావికీ పొంతన లేదు.

అదీ సంగతి.

(ఈ టపా నా సొల్లు మాత్రమే. దీనికి ఎవరైనా బాధపడితే - నా పూచీకత్తు లేదు.)

Sunday, November 4, 2012

దృష్టి


"To see is to love" - అని ఒక మహాజ్ఞాని వచనం. ఆయన వచనం ఉటంకించినంత మాత్రాన ఆయనంత గొప్పవాడు కానవసరం లేదు. భగవద్గీత ను చదువుకోవడానికి,  ఉపయోగించుకోవడానికి మనిషైతే చాలు, భగవంతుడు కానక్కరలేదు.

రోజూ చూసే చెట్టు, ఈ రోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నది. ఎందుకో తెలియదు. చెట్టు తాలూకు ప్రతి ఆకు విలక్షణంగానూ, వినూత్నంగానూ కనబడుతూంది. మెత్తటి స్పర్శ, ఆకు తాలూకు ఈనెలు, నిన్నటి వర్షంలో తడిచి, హర్షం నింపుకుని రంగుతేలిన రూపం, సుకుమారమైన ఆకు చివరి భాగం, చెట్టుకు మొట్టమొదటి సారి కాస్తున్న కాయలు, ఏదో పనున్నట్టు అక్కడికి వచ్చి, బుర్ర గోక్కుని తిరిగి వెళుతున్న గండు చీమ, ఎందుకింత అమాయకంగా ఉంది ఈ చిన్ని ప్రపంచం?

రెణ్ణెల్ల క్రితం - పాపకు స్కూలుకు వెళుతుంటే ఒక బాదాం కాయ కనబడింది. ఆ కాయ ఇంటికి తెచ్చుకుని, కండ తిన్నది పాప. బాదాం చెట్టు కండ తిని నీళ్ళు తాగితే తీయగా ఉంటాయిట. ఆపైన కాయ కొట్టుకుని, మిగిలిన ముక్కను పెరట్లోకి విసిరి వేసింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక చిన్న చెట్టు మొలకెత్తింది. చెప్పడానికి భావం చాలని అందమైన దృశ్యం అది! ఇప్పుడా చెట్టు మెలమెల్లగా పెరుగుతూంది.

ఇప్పుడున్న పెరటి బాదాం చెట్టు కూడా అలాగే వచ్చిందో, ఏమో! 

చెట్టు కాండాన్ని కావిలించుకుని దానికి చెవులను ఆన్చి వింటే ఒక మౌనసంగీతం వినబడుతుందట. వినగలిగితే అంత హృదయంగమమైన సంగీతం మరొకటి లేదు. సంగీతానికి నియతి కావాలేమో, ప్రకృతిపాటకు నియమాలు లేవు.

"నియతికృతనియమరహితాం, హ్లాదైకమయీమనన్యపరతంత్రామ్" అని జ్ఞానమూర్తిని, జగజ్జననిని, సాకారంగా, సరూపార్చన చేస్తాడు కవి. ఈ సృష్టి కూడా అంతేనేమో! ఇక్కడా నియమాలు లేవు, కోకిలపాట, బాదాం ఆకులపై వర్షం చినుకుల దరువూ, చల్లటి గాలి చిఱుస్పర్శ ఈ నియమరహితమైన సౌందర్యాన్ని, హ్లాదమే పరతత్త్వంగా కనిపిస్తున్న జగతిని - భగవంతుడు సృష్టించలేదు. ఈ సృష్టే తానై ఉన్నాడు. అసలు "ఉన్నాడు", "ఉన్నది" అన్న మాట కూడా తప్పేమో! "తథా అథ" - "అది అంతే" - కనిపిస్తున్నదే సృష్టి, స్రష్ట, సృజన అన్నీ!

కొన్నాళ్ళకు ఆ ఆకు రాలిపోతుంది. ఎఱుపు రంగు తేలి, గాలి విసురుకో, బలహీనత తోనో! చెట్టు నుండి విడిపోవటం లోనూ ఒక దర్పం! ఒక దర్జా, చిఱునవ్వూ! మరణమంటే ఇంత సులువుగా, ఇంత ఆనందంగా ఉంటుందా అని చూచేవాళ్ళకు అనిపించేట్టు! హ్లాదైకమయి - అనన్య పరతంత్ర - అంటే స్వేచ్ఛను అణువణువునా నింపుకున్నది కూడా ! ఈ రాలిపోయిన ఆకు ఆ చెట్టుకు, అంటే తన తల్లికి ఎరువు!

ఆధ్యాత్మికత భగవంతుడిలోనూ, ఆచారాలలోనూ, కర్మల్లోనూ, కర్మసిద్ధాంతం లోనూ ఉందని ఎవరు చెప్పారో ఏమో! చిత్తమార్దవం, క్షమ, శుచిత్వం అభిమానం లేకపోవటం వంటివి దైవికమైన లక్షణాలుట! అవి చాలేమో మనిషికి!

పక్కింట్లో పాపాయి మారాం చేస్తూ ఉంటే అమ్మ చందమామను చూపిస్తూ బాదం ఆకులో పెరుగన్నం పెట్టి తననే తినమని చెబుతూంది! పాప నవ్వుతూంది.

To see is to love! - ప్రపంచాన్ని చూడటమే ప్రేమ!

Wednesday, September 7, 2011

భీష్ముఁడు - వైయక్తిక ధర్మము

ధర్మము వైయక్తికమా లేక సార్వజనీనమా? అన్నది మనిషి మనుగడంత పురాతనమైన ప్రశ్న. సిద్ధాంత రూపేణా బహిర్గతం కానప్పటికీ, జీవితపయనంలో ఏదో ఒక సమయంలోమనిషి  ఈ ప్రశ్నను ఎదుర్కొనవలసి  వస్తుంది. ఇదే ప్రశ్నను కాస్త సులభంగా చెప్పుకోవాలంటే - మనిషి  చేసే న్యాయాన్యాయ విచక్షణకు ఆఖరి ప్రస్థానం (సాధ్యమైనంతగా ఇతరులను పీడించకుండా) జీవితంలో సాకల్యాన్ని,సార్థకతను సాధించడమా? లేక కేవలం త్యాగబుద్ధితో ఇతరుల కోసం (కుటుంబం,సమాజం కోసం) మనుగడ సాగించడమా? ఆత్మ దర్శనమా/దీనజనోద్ధరణమా? అంతే కాక దీనికి అనుబంధంగా మరిన్ని ప్రశ్నలు బయలు దేరుతాయి. దేవుడిలో విలీనం కావడం లేదా నిర్వాణం చెందడం మానవుని అంతిమ లక్ష్యమా? లేక తనతో బాటు తనవాళ్ళనందరినీ కట్టగట్టుకుని ఉద్ధరించి, సంతృప్తితో కన్నుమూసి,తనవారిని ఇహంలో ఉద్ధరించి,ఆ తర్వాత  పుణ్యాన్ని పంచడం ద్వారా  పరంలో మోక్షానికి తీసికెళ్ళడం ముఖ్యమా?

ఈ విషయమై బౌద్ధంలో కాస్త స్పష్టమైన విధానం ఉందని వ్యక్తిగతంగా నా అనుకోలు. బుద్ధబోధ కేవలం "ఆత్మ దీపో భవ". ఇది రాజీలేని వైయక్తిక ధర్మం. మరింతగా లోతులో దిగితే బుద్ధబోధలో మరొక విషయం కనిపిస్తుంది. ఆయన చెప్పిన వైయక్తిక ధర్మంలో విలువల (morals)ప్రస్తావన లేదు. అంటే అబద్ధం ఆడరాదు, ఏకపత్నీవ్రతం, తండ్రి ఆజ్ఞపాటించడం, బ్రాహ్మణధర్మం, క్షాత్రధర్మం, కుటుంబం పట్ల నిబద్ధత  వగైరా వగైరాలు లేవు. (ఇక్కడ ఒకవిషయం గమనించాలి. బౌద్ధంలో విలువలు లేవు అంటే ఆ విలువలను ఖండిస్తున్నట్టూ, వాటి వ్యతిరేకతను సమర్థిస్తున్నట్టూ కాదు. ఆత్మశోధనలో వాటి ప్రసక్తికి తావు లేదని మాత్రమేనని గ్రహించాలి) వ్యక్తి అంతిమ లక్ష్యం తనను తాను తెలుసుకోవడం. ఆ తెలుసుకొన్న విషయానికి అనుబంధంగా విలువలు వాటంతటవే ఆవిష్కృతమౌతవి. వాటిద్వారా  ఇతరులు ప్రేరేపితమై, ఇలా అనేకులు తమను తాము తెలుసుకోగల్గడం, తద్వారా ప్రజల శ్రేయస్సు అనుగతంగా వస్తాయి. మరో విషయం ఏవంటే బౌద్ధంలో ఎక్కడా "సమాజం" అన్న పదం లేదు. బుద్ధుని మాటలన్నీ "సంఘం" గురించే ఉద్దేశించడం మనం గమనించవచ్చు. సంఘం అంటే ఏకాభిప్రాయం కలిగిన "వ్యక్తుల" సమూహం. బుద్ధుని సంఘం "భిక్షుకుల సంఘం". ఆ సంఘం కోసం చెప్పిన నియమాలు (వినయపిటకం) సార్వజనీనంగా అందరికీ అంటే - సమాజానికి వర్తించవు. స్త్రీలను సంఘంలో చేర్చరాదని బుద్ధుని ఆదేశం. అలా చేరిస్తే సంఘభావన క్రమంగా లుప్తమై,  ఏకాభిప్రాయం సడలుతుందని, సంఘం సమాజంగా (సమాజం కుటుంబాల సమూహం. సంఘం వ్యక్తుల సమూహం) పరిణమిస్తుందని, అంతటితో బౌద్ధధర్మం అంతరిస్తుందని బుద్ధుడి తీర్పు. అది అక్షరాలా జరిగింది కూడానూ.

హైందవ ధర్మం మాత్రం శతాబ్దాలుగా సార్వజనీన ధర్మం కోసం శోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వైయక్తిక ధర్మాన్ని ప్రబోధించిన గ్రంథాలు హైందవంలో ఉన్నా, వాటి చివరి సందేశం సమాజశ్రేయస్సు లేదా ఆత్మావిష్కరణతో కూడిన సమాజశ్రేయస్సుగా మనం కనుగొనవచ్చు. పూర్తిగా కుటుంబాన్ని, సమాజాన్ని,అలక్ష్యం చేసి ఆత్మావిష్కరణ  కోసం పాకులాడమని హైందవం చెప్పినట్టు కనబడదు. కొండొకచో అష్టావక్ర సంహిత వగైరాలు ఆ విషయం చెప్పినా, అట్టి గ్రంథాలకి తగినంత ఆమోదం లభించినట్టు కనబడదు. మొత్తానికి ధర్మం వైయక్తికమా లేక సార్వజనీనమా అన్న విషయం ఒక ప్రధానమైన ప్రశ్నగా నాటి నుంచి నేటి వరకు  మనకు వినబడుతున్నది. భగవద్గీతలో కూడా వైయక్తిక ధర్మాన్ని జ్ఞానయోగంగా పేర్కొని, కర్మ, భక్తి యోగాలను సార్వజనీనంగా అన్వయించడం గమనించవచ్చు. పంచమ వేదంగా ప్రశస్తమైన మహాభారతంలో భీష్ముని పాత్ర ఈ వైయక్తిక/సార్వజనీనతల సంఘర్షణకు ప్రతీక అని నా అభిప్రాయం. ఆ దృక్కోణంలో భీష్ముని పాత్రపై నా ఆలోచనల పరంపర ఇది. ఈ వ్యాసం తప్పు, ఒప్పుల నిర్ధారణ కోసం కన్నా ఒకానొక దృక్కోణాన్ని వెతికే ప్రయత్నం మాత్రమేనని నా విన్నపం.

***********************************************************

భీష్ముడు పరమపుణ్యమూర్తి. శాపగ్రస్తుడైన మహనీయుడు.అష్టవసువులలోనొకఁడు. గంగామాత తనయుడు కాబట్టి ఆతని పుట్టుకపరమపవిత్రమైనది. అనుశాసనిక పర్వంలో భీష్ముని ఉపదేశాలు ఆ కాలంలో వివిధ వర్ణాలకు అవశ్యాచరణీయాలు. ఈయన తన జీవితంలో విలువలతో కూడిన వైయక్తికధర్మానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తఱచి చూస్తే అగుపిస్తున్నది. తద్వారా సమాజశ్రేయస్సును సాధించగల్గడానికి పూనుకున్నట్టు ఆయన చరిత్రలో అంతర్లీనంగా కనబడుతుంది. భీష్ముని జీవితంలో అడుగడుగునా ఈయన ధర్మాన్ని సవాలు చేసే సంఘటనలు, సంకటపరిస్థితులు అగుపిస్తాయి. తన కట్టెదుట గుడ్డిరాజు పుత్రప్రేమతో దాయాదులకు ద్రోహం తలపెడుతున్నప్పుడు,  వంచనాద్యూతం జరుగుతున్నప్పుడు, కులస్త్రీని వివస్త్రను చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, పద్దెనిమిది రోజుల్లో లక్షలమంది - తమ భర్తలను, తమ్ములను, తండ్రులను, పిల్లలను, బంధువులను కోల్పోతున్నప్పుడు,చివరికి తన ప్రాణం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈయన జీవితం నేపథ్యంలో మనకు వైయక్తిక సామాజిక ధర్మాల తాలూకుసంఘర్షణ అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని పరామర్శించడానికి  కథను మళ్ళీ చెప్పుకోవాలి. మార్గాంతరం లేదు.

అనగనగా శంతనుడనే ఒక రాజు. గొప్పరాజు, జనరంజకమైన పాలన - మామూలే. ఈయన ఒకరోజు గంగను చూచాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. గంగ తన షరతులను శంతనునికి చెప్పింది. తను ఏం చేసిన ప్రశ్నించరాదంది. ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకున్నాడీయన. వరుసగా ఒకరితర్వాత మరొకరుగా ఏడుగురు పుత్రులు పుట్టారు. ఏడుగురిని నదిలో పారవేసిందామె. ఎనిమిదవ వాడు పుట్టాడు. ఈ సారి శంతనుడు ఆమె ప్రయత్నాన్ని అధిక్షేపించాడు. గంగ, ఆ ఏడుగురు శాపగ్రస్తులని, వారి శాపవిమోచనం కోసం తానాపని చేశానని, ఎనిమిదవ కొడుకును పెంచుకోమని చెప్పి శంతనుడిని వీడింది. కొన్నేళ్ళు ఆ పిల్లవాడికి విద్యాబుద్దులు చెప్పించి శంతనుడికి ఒప్పగించింది. ఆ బాలుడే భీష్ముడు.

ఆ బాలుడు పెఱిగి పెద్దవాడవుతున్నాడు. ఈ లోగా శంతనుడికి సత్యవతి (యోజనగంధి) అని ఒక అమ్మాయి కనిపించింది. ఆ స్త్రీపై మరులు గొన్నాడు రాజు. ఆమె తండ్రి దాశరాజు కడకు వెళ్ళి ఆమెనిమ్మని అడిగాడు. దాశరాజు శంతనునికి తన షరతును చెప్పాడు. శంతనుని తదనంతరం సత్యవతికి పుట్టబోయేబిడ్డ రాజ్యం చేయాలి. అది ఆ షరతు. శంతనుడు కూడదన్నాడు.దాశరాజు తన బిడ్డనిమ్మను పొమ్మన్నాడు. శంతనుడు దిగులు చెందాడు. తండ్రి దిగులు గమనించిన పుత్రుడు విషయం ఎలాగో కనుక్కున్నాడు. తనే స్వయంగా దాశరాజు వద్దకు వెళ్ళాడు. విషయం తెలుసుకుని రాజ్యం పరిత్యజిస్తానన్నాడు.అలాగెలాగ, నీవు ఒప్పుకుంటే అవుతుందా? ప్రజలు తిఱుగుబాటు చేస్తేనో లేదా ఆ కొడుకుకు సంతానం లేకపోతేనో అన్నాడు దాశరాజు. నేను పెళ్ళి చేసుకోనే చేసుకోను అని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు శాంతనవుడు.

ఇక్కడ ఆగాలి మనం.

౧. యోజనగంధికి తనను కట్టబెట్టమని శంతనుడు భీష్ముని అడుగలేదు. ఒకవేళ భీష్ముడు తండ్రి దగ్గర విషయం ప్రస్తావించి ఉంటే ఆయన కొడుకును వారించేవాడేమో. 
౨. తను తండ్రి కోరిక నెరవేర్చడం కోసం పెళ్ళి చేసుకోను - ఇది భీష్ముని సొంతమతం. తండ్రి "కోరిక" (ఆజ్ఞ కాదు, గమనించండి) తీర్చడం తనయుడిగా తన "ధర్మం".నిజానికి తండ్రి కోరిక తీర్చకపోయినా తండ్రి తనమీద కోపం చెందడం అన్న ప్రసక్తి వచ్చి ఉండదు.

భారతకాలం నాటి ధర్మం ప్రకారం ఒకరి తదనంతరం పెద్దకొడుకు రాజ్యం చేయాలి.అది క్షత్రియధర్మం,భీష్ముడు ఉత్తమగుణోపేతుడు, యోగ్యుడు కాబట్టి తను రాజు కావడం అన్నివిధాలా "సమాజానికి",భరతఖండానికి లాభం. పైగా సమర్థుడు కాబట్టి శాంతిభద్రతలను రక్షించి, వైరులను పారద్రోలి, రాజ్యాన్ని బలోపేతం చేసి జనులను కాపాడి ఉండేవాడు.ఈ ధర్మాన్ని విడనాడి భీష్ముడు తండ్రి కోరిక తీర్చడం కోసం ఒకానొక త్యాగానికి ఒడిగట్టడం ఎంచేత? - ఇందుకు సమాధానం వైయక్తికధర్మం అని చెప్పుకోక తప్పదు. 

కేవలవైయక్తికధర్మం లేదా శుద్ధవైయక్తికధర్మం(అంటే సంన్యాసదీక్ష) కాకుండా తండ్రి కోరిక తీర్చడమనే విలువ ఇందులో ఇమిడి ఉన్నందున ఇది నియమసహితవైయక్తికధర్మంగా కనిపిస్తుంది.
మళ్ళీ కథలోకి వెళదాం.

ఏదైతేనేం, శంతనుడు సత్యవతిని మనువాడాడు.ఆ దంపతులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు పుత్త్రులు కలిగారు. శంతనుని తర్వాత చిత్రాంగదుడు రాజు కావాలి, అయ్యాడు. ఈ చిత్రాంగదుడు సమరలంపటుఁడు. దారినపోయే గంధర్వులతో పెట్టుకుని పోరాడి మరణించాడు. తర్వాత ఆతని తమ్ముడిని విచిత్రవీర్యుడిని గద్దెనెక్కించాడు భీష్ముడు. ఆతని కోసం కాశీరాజు కూతుళ్ళు ఇద్దరమ్మాయిలను తీసుకు వచ్చి పెళ్ళి కూడా చేశాడు. (ఆ పనిలోభాగంగా అంబ అనే అమ్మాయిని నొప్పించి, లేని తలనొప్పులను తెచ్చుకుని, విద్యనేర్పిన గురువుతో పోరాడి, చివరకు తన చావుకు కారణం కూడా ఏర్పరుచుకున్నాడు).

విచిత్రవీర్యుడు పొద్దస్తమానం అంతఃపురంలో సుఖాలలో ఓలలాడి మితిమీరిన కామంతో క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు!

శంతనుని ఇద్దరు కొడుకులు గతించిన తరుణంలో తను స్వయంగా రాజ్యం చేపట్టడం భరించరానంత తప్పు కాదు. పైగా అందులో స్వార్థం లేదు ప్రజలకోసం, రాజ్యం కోసం గద్దెనెక్కడం లేదా శంతనుని ప్రతినిధిగా  (రామాయణంలో భరతుడు రాముని చెప్పులను సింహాసనం పైన పెట్టి ఆతని ప్రతినిధిగా రాజ్యం చూసుకున్నట్టు)  రాజ్యవ్యవహారాలను చూసుకోవడం ఒకవిధంగా యుక్తం. కానీ శాంతనవుడు వ్యాసుని సంప్రదించాడు. సంతానం లేని వారు ఒక సద్బ్రాహ్మణుని ద్వారా సంతానం కని వంశం నిలుపుకోవడం ఆ కాలపు ధర్మం. ఏతద్ధర్మం ప్రకారం ఆయన వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని కననిచ్చినాడు.

ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. అంగవిహీనుఁడు రాజ్యాన్ని ఏలకూడదు, విదురుడు దాసీపుత్రుడు కాబట్టి పాండురాజు సింహాసనం ఎక్కాడు. అయితే పాండురాజు మరణించడంతో మళ్ళీ ధర్మసంకటం వస్తుంది. ఎట్టిపరిస్థితులలోనూ తను గద్దెనెక్కరాదని దాశరాజుకు ఇచ్చిన మాట ఒకవైపు. అంగవిహీనుని సింహాసనాధీశుని చేసి విశాలసామ్రాజ్యాన్ని కేవలం కాపాడవలసిన వ్యక్తిగా మిగిలిపోవడమనే ఒక సంకుచిత సామాజిక ధర్మానికి లొంగవలసిన అవసరం మరో వైపు. ఈ అసిధారావ్రతాన్ని బయటకు కనబడనప్పటికి అత్యంత జాగరూకతతో నిర్వహించిన మహోన్నత మూర్తిమత్వం భీష్ములవారిది. ఒకపక్క జరాసంధుడు ౮౪ మంది రాజులను జయించి మదగర్వంతో మిడిసిపడుతున్నాడు. వృష్ణివంశస్తులు కూడా అతని జోలికి పోని పరిస్థితి. కురురాజ్యం వైపు జరాసంధుడు చూడకపోవడానికి కారణం భీష్ముడు.  

ఇంతా చేసి ఈ పితామహుని పాత్ర భృత్యత్వం లానే అగుపిస్తుంది.

ధృతరాష్ట్రుడు పుత్రోత్సాహంతో తన మాటను పెడచెవిన బెట్టిన సందర్భాలలో మౌనం వహించవలసిన పరిస్థితి తప్ప మరొక మార్గాంతరం భీష్మునికి కనబడదు. కారణం తనకై తను విధించుకుని పాటిస్తున్న "దాశరాజుకిచ్చిన మాట" అనబడే ఒక వైయక్తిక ధర్మం. ఆ పరిస్థితులలోనూ అతఁడు విదురుని ధృతరాష్ట్రునికి మంత్రిగా నియమించడం ద్వారా - రాజ్యనిర్వహణలోనూ, ధర్మనిర్వహణలోనూ జరుగుతున్న లోపాలను అరికట్టటానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేయడం అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది.

ఆ తర్వాత దుర్యోధనుడు రాజ్యానికి రావడం, పాండవులకు కౌరవులకు బాల్యమాదిగా వైరం, మాయా ద్యూతం - ఇన్ని జరుగుతున్నా ఏమీ జరుగనట్టు కనబడడం - ఇదంతా ధర్మాధర్మాల నడుమ సంఘర్షణ. నిజానికి భీష్ముడు మహావీరుడు. మహాభారత యుద్ధ సమయంలో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి,పాండవపక్షంలోని అనేక వీరులను సంహరించిన తర్వాత ధర్మరాజుకు తన రహస్యాన్ని చెబుతూ తనను యుద్ధంలో ఎదిరించి నిలువగలిగే వారు లేరని శాంతనవుడు అంటాడు. నిజం కూడా. అంతటి వీరుడు దుర్యోధనుణ్ణి కానీ ధృతరాష్ట్రున్ని కానీ ఒక్క గదుం గదిమి, వీలైతే యుద్ధం చేసి నీ రాజ్యం నిలబెట్టుకొమ్మని సవాలు విసరడు!

నిండుసభలో కులస్త్రీని దుశ్శాసనుడు వివస్త్రను చేయబూనినప్పుడు ద్రౌపది సభికులను అడుగుతుంది - నేను ధర్మవిజితనా? అధర్మవిజితనా అని. ఈ ప్రశ్నకు సమాధానం న్యాయంగా ధర్మరాజు చెప్పాలి. తనే దుర్యోధనునికి పణంగా ఒగ్గి ఓడి దాసుడైన తర్వాత ధర్మరాజు భార్య దాసీయే. అంచేత ఆమె ధర్మవిజితయే అనవలసి వస్తుంది భీష్మునికి. సభలో అబలకు అన్యాయం జరుగకుండా సభామర్యాదను కాపాడవలసిన బాధ్యత గుడ్డిరాజుది. ఆతడు మిన్నకున్నాడు. ఆ భీషణమైన ధర్మాధర్మ సంఘర్షణలో భీష్ముడు ఏమైతే అయిందని విల్లు చేతబట్టి దుశ్శాసనుణ్ణి నిలువరించాలనుకోడు. అక్కడా ధర్మసంకటం. అలా చేసి యుద్ధం దాపురిస్తే దుశ్శాసనుణ్ణి చంపి తన ఇచ్చిన మాట (సత్యవతి పుత్త్రుల వంశమే గద్దెపై ఉండాలన్నది) కు పరోక్షంగా భంగం కలిగించుకునే పరిస్థితి వస్తుందన్న తీవ్రసంఘర్షణ. 

ఈ ధర్మాధర్మాల నేపథ్యంలో భీష్ముని పాత్ర కొన్ని సందేహాలకూ, దూషణలకు తావవుతుంది. అది పాఠకుల అల్పత్వమే కానీ వ్యాసుని పాత్రసృజనలో లోపం కాదు. అర్థం/ధనం కోసం ధృతరాష్ట్రుని/దుర్యోధనునికి సహాయం చేశాడని ఒక వాదం. అర్థవాది అయితే అంతటి సామ్రాజ్యాన్ని ఒక చిన్నమాటకోసం తృణీకరించడు. వయసు మళ్ళింది కాబట్టి ఆ వయసులో ఎటూ పోలేక దుర్యోధనుడి వద్ద ఉండిపోవడన్నది మరింత పేలవమైన వాదన. ఇచ్చామరణ వరం కలిగిన వాడు, లోకంలో అందరికీ ప్రియుడు అనేక రాజులవద్ద గౌరవం చూరగొన్న మహాత్మునికి అటువంటి సామాన్య కారణాలు ఆపాదించడం అల్పత్వం.

ఇలా భీష్ముని ప్రస్థానం కొనసాగి చివరకు మహాభారత యుద్ధం సంక్రమిస్తుంది. ఆ యుద్ధంలో భీష్ముడు తలుచుకుని ఉంటే మహాస్త్రాలు ప్రయోగించి పాండవులలో కనీసం ఒకరిద్దరిని మట్టుపెట్టి ఉండవచ్చు. కానీ అలా చేస్తేనూ ధర్మం తప్పుతుంది. తన కంటి యెదుట ఏ వైయక్తికధర్మం కోసం తను జీవితం అర్పణ చేశాడో, ఆ ధర్మం నశించి తను ప్రేక్షకపాత్ర వహించి చూస్తూ నిలబడవలసి వస్తుంది. తన కట్టెదుట రాజ్యత్యాగం చేసి, బ్రహ్మచారిగా మారి సత్యవతి పుత్రుల తాలూకు వంశజులు - ఒకరితో ఒకరు యుద్ధం చేసి అందులో కౌరవులు అందరూ మరణిస్తే భీష్ముడు నిర్వికారంగా చూస్తూ నిలబడవలసి వస్తుంది.
వ్యక్తి తన జీవితంలో ధర్మాధర్మాల సంఘర్షణను ఎంత తీవ్రంగా తట్టుకుని నిలబడినాడు అన్న దృక్కోణంతో భీష్ముని పాత్రను పరిశీలిస్తే అంతటి మహోన్నతమైన పాత్ర మరొకటి కనిపించదు. ఇంతటి అద్భుత వ్యక్తి కావ్యం (ఇతిహాసం) లో కేవలం ఒక పాత్రగా ఉన్నాడు కాబట్టి భారతం ఒక మహోన్నతమైన ఇతిహాసం.పంచమ వేదం. అనితర సాధ్యం.భీష్ముని వంటి ఉదాత్త పాత్రను సృజించిన  మహర్షి - సాక్షాద్విరించి వేదవ్యాసుడు.

అచతుర్వదనో బ్రహ్మా
ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభుః
భగవాన్ బాదరాయణః

...

(మహాభారత విమర్శనం - 2 పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచన చదివిన తర్వాత నాలో కలిగిన
ఆలోచనలివి.)

Saturday, April 23, 2011

సాయిబాబా - అంతశ్శోధన


"అంతమంది జనాలు సాయిబాబాను నమ్ముతున్నారు గదా, నువ్వెందుకు నమ్మవు?" కాలేజీ చదువుతున్నప్పుడు మాయమ్మ అడిగింది ఒకరోజు.

అప్పట్లో ఒకానొక ఫంక్షన్ లో (సత్యసాయి నిగమాగమం ప్రారంభోత్సవం అనుకుంటా) సాయిబాబా రాజేష్ పైలట్ అనే కేంద్రమంత్రికి కొన్ని వేలమంది చూస్తుండగా గాలిలో నుండి ఒక చిన్న నగ సృష్టించి బహుమతిగా ఇచ్చారు, ఆ దృశ్యం వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియో రికార్డులను స్లో మోషన్ లో చూస్తుండగా ఒక విషయం బయటపడింది. సాయిబాబా పక్కన ఒకతను ఒక పళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటే, ఆ పళ్ళెం క్రిందుగా చేతులు పోనిచ్చి సాయిబాబా ఆ నగను తీసినట్టు ఆ దృశ్యం చెబుతూంది. ఆ టేపును అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ అప్పారావు గారు కాల్చేశారట. ఇదంతా పత్రికల కథనం కాబట్టి నిజానిజాలు నాకు తెలియవు. అయితే సాయిబాబా పళ్ళెం కింద చేయి పెట్టటం నగ తీయడం ఈ వరుస ఫోటోలు ఒకానొక దినపత్రికలో వచ్చాయి. వాటిని మా కాలేజీ నోటీసు బోర్డులో పెట్టారు. అదీ కథ.

ఆ రోజు వరకూ నా గోల నాది, కానీ సాయిబాబాను నమ్మకపోవడం ఆ సంఘటన నుంచి నాలో మొదలైంది. దానికి తోడు ఆయన కుండలోంచి విభూతిని పది పదిహేను నిముషాల వరకూ తీస్తూనే ఉండడం, నోట్లో శివలింగం తీయడం ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ సినిమాలో చూసి కాస్త విరక్తి కలిగింది. ఈ పైత్యానికి తోడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు పరమభక్తుడు. "దీపం విలువ దీపం క్రింద చీకట్లో కూర్చున్న వాళ్ళకు తెలీదురా. కాస్త దూరం నుంచి చూసేవాళ్ళకు మాత్రమే కనబడుతుంది" అనే వాడు. వాడి మూర్ఖభక్తి చూసి నవ్వు వచ్చేది. ఆలోచనాశక్తిలేకపోవడం వల్ల ఎప్పుడైనా కోపమూ వచ్చేది.

సాయిబాబా మీద ఈ తిరుగుబాటు భావజాలం అంతర్మథనంగా మారింది మా మేనమామ వల్ల.

కీర్తిశేషులు శంకరసుబ్రహ్మణ్యం మా మామయ్య. ఆయన కాలం చేసి నేటికి పదేళ్ళవుతూంది. ఆయన బహుభాషావేత్త. సంస్కృతంలో మంజరీశతకం అన్న శతకకావ్యమూ, వేమన పద్యాలకు హిందీ అనువాదం, ఠాగూర్ పద్యాలకు తెనుగు సేత, మేఘదూతం లా నిస్తంతీ దూతం (ఆయన టెలికాం లో ఆఫీసర్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు) ఇలాంటి రచనలతో సాహిత్యపరిశ్రమ, శారదాసేవ చేసిన వారు. నిత్యవిద్యార్థి. ఆయన ఛాందసులు కారు, ఆధునికులనే చెప్పాలి. ఆంగ్లం మీద, ఆంగ్లవిద్య మీద మోజు, ఆంగ్లం చదివితే జీవితంలో పైకి రావడం సులభమనే భావనా ఆయనకు ఉండేవి. ఆయన టెలికాం ఉద్యోగం నుండి రిటైర్ అవడానికి ముందు కొన్ని చిక్కుల్లో పడ్డారు. తన ఆఫీసులో సహోద్యోగి ఒకతను ఒక చెక్కును ఫోర్జరీయో ఏదో చేసి, డబ్బు కాజేసి, ఆ నేరం ఈయన మీదే మోపారు. ఆ కేసు పెట్టినది దళితుడు అవడంతో ఈయనకు చిక్కులు మరింత ఎక్కువయ్యాయ్. దాదాపు నలభై అయిదేళ్ళ సర్వీసులో నిజాయితీగా కష్టపడినందుకు ఈ ఫలితం దక్కిందని ఆయన మానసిక వేదన అనుభవించారు. ఆ సమయంలో సత్యసాయిబాబాను నమ్మారు. వేడుకున్నారు. ఎలాగైతేనేం కొన్ని యేళ్ళకు ఆయనకు న్యాయం దొరికింది. కోర్టు ఆయనను నిర్దోషిగా నిర్ణయించి తీర్పునిచ్చింది. సాయిమీద కృతజ్ఞతతో ఆయన ఇల్లు కట్టుకుని "సాయిసదనమ్" అని పేరు పెట్టుకున్నారు.

మా అమ్మకూ, మా పిన్నమ్మలిద్దరికీ మేనమామ మాట వేదవాక్కు కాబట్టి వాళ్ళూ ఆయనను నమ్మడం మొదలుపెట్టారు.మా ఇళ్ళ పూజాగృహాలలో సాయిబాబా పటం ఉండేది. అయితే అవజ్ఞతతో, తెలివిమాలినతనంతో అప్పట్లో మా అమ్మతో నేను కాస్త దురుసుగా మాట్లాడేవాణ్ణి, సాయిబాబా కుండలో విభూతి తీస్తే మీరెలా నమ్ముతారని మా అమ్మను ఆక్షేపించిన జ్ఞాపకం. టపా మొదట్లో మా అమ్మ కోపంగా అడిగిన ప్రశ్న ఆ సందర్భం లోనిదే.

బతికి ఉన్న రోజుల్లో మా మేనమామయ్యతో నాకు మాటలు, కొంతవరకూ చర్చలు ఉండేవి కానీ, విపరీతమైన చనువు లేదు,ఆయనతో మాట్లాడే స్థాయి కూడా లేదు. అంచేత సాయిబాబా విషయంలో నేను ఆయనతో చర్చించలేదు కానీ, ఒక సందర్భంలో నాకు తెలిసిందేమంటే, ఆయన సాయిబాబాను చూడనే లేదని, కేవలం ఆశ్రయించారని. తన లీలల గురించి కూడా తనకు తెలిసి ఉండదని నా అనుకోలు. సాయిబాబాను ఆయన కడకు దర్శించారో లేదో తెలియదు.

ఆయన ద్వారా నేను నేర్చుకున్నది సాయిబాబాను నమ్మినా, నమ్మకపోయినా నమ్మేవాళ్ళను గేలి చేయరాదన్న సంస్కారం. ఆ సంస్కారం కాస్త మిగలబట్టి మా ఇంటికి ఒకసారి నాన్న తరపున బంధువులు వస్తే, వారివెంట పుట్టపర్తి వెళ్ళి వచ్చాను. మా బంధువు పొద్దున ఐదున్నరకు వెళ్ళి మూడవ వరుసలో కూర్చున్నారు. సత్యసాయిబాబా చేతి నుండీ విభూతి రాలడం ఆయన స్వయంగా చూశానన్నారు. చాలా ఆశ్చర్యపడిపోయారు.

అయినా ఎందుచేతో అప్పుడప్పుడూ పురుగులా ఒక ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. ద్వేషం వల్ల కాదు, ఏదో తెలియని బాధ, ఆవేశం వల్ల.  ఒక వ్యక్తి రోలెక్స్/టైమెక్స్/సిటిజెన్ గడియారం గాల్లో ఎలా సృష్టిస్తారు? ఒక గడియారం కావాలంటే క్వార్ట్జ్ క్రిస్టలు, దాని వెనుకనున్న సైన్సు సూత్రాలు, నిపుణులు అనేకుల పరిశ్రమ లేకుండా ఎలా సాధ్యం? గాల్లో బూడిద పుట్టిందంటే ఏదోలే సంభావ్యత ఉందనుకుందాం, గడియారం ఎలా "పుడుతుంది"? అసలు చేతిలో పట్టేంత వస్తువెందుకు పుట్టాలి? యే రిఫ్రిజిరేటర్ నో పుట్టించవచ్చు గదా? (నేను ఎర్ర వాణ్ణి, మతద్వేషినీ కానని మనవి. నా వాదన ఎర్రవారికి మద్దతు కాదు. పైవాదన సాయిబాబా భక్తులకు ధిక్కరింపూ కాదు. నేను నమ్మవలసి వస్తే నాకు కలిగే ప్రశ్నలు మాత్రమే)

పై ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వాళ్ళు నన్నెలా ఆక్షేపిస్తారో అనుకుంటే ఈ క్రింది ప్రశ్న తట్టింది.

"నువ్వెందుకు ఐదేళ్ళ పిల్లవాడు (కృష్ణుడు) ఒక కొండను చిటికెన వ్రేలుతో ఎత్తాడంటే నమ్ముతున్నావు? పూజిస్తున్నావు?రాముడు ఒక బండకు తన కాలు సోకించగానే ఒకమ్మాయి పుట్టిందంటే నీవెలా నమ్ముతున్నావు?(ఇలాంటివి అనేకం ఉన్నయ్)

కాస్త తల చెడగొట్టుకుంటే రెండు సమాధానాలు కని(విని)పించాయి.

౧) పై రెండు కావ్యసాహిత్య విషయాలు కాబట్టి. సాహిత్యంలో ఒక పురుషోత్తముణ్ణి, శ్రేష్టుణ్ణి చేయడానికి చిలవలు పలవలుగా కల్పించడం ఉన్నదే. (రాజమౌళి సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలలాగా). అవన్నీ లేకపోతే కావ్యమూ లేదు, కావ్యోద్భవరసనిష్పందమూ లేదు. కావ్యం అంటే కేవలం న్యూస్ పేపర్ లో చదివే న్యూస్ లాంటిది కాదు, పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా లేదు. అంచేతే కావ్యమూ, రసమూ, కల్పనలూ వగైరా వగైరా..

౨) ఎవరైనా ఒక మహానుభావుడు, మహోన్నతుడు, పురుషోత్తముడు, సద్గురువు పుట్టి గతించిన తర్వాత ఆతని చుట్టూ మార్మికత, ఆచారాలు, వ్యవస్థా కమ్ముకోవడం లోకవ్యవహారం. బుద్ధుడు దేవుడే లేడన్నాడు. (లేదా దేవుణ్ణి బయట కాక అంతశ్శోధనలోనే వెతుక్కోమన్నాడు). ఆయన తర్వాత అనుచరులు ఆయనను దేవుణ్ణి చేసిపెట్టారు. ఆయన పేరు మీద అభూతకల్పనలు, అతీంద్రియ శక్తులు కల్పించారు. షిర్డీ సాయిబాబా విషయంలో అదే జరిగింది. ఇంకా ఎంతోమంది విషయంలో కూడానూ. బహుశా మరో రెండు తరాల తర్వాత ఏమో, జిడ్డు కృష్ణమూర్తి కూడా దేవుడు కావచ్చు!

జిడ్డు కృష్ణమూర్తి 1929 లో తను అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ స్టార్ సంస్థను రద్దు చేసి అప్పట్లో 3000 కోట్ల డాలర్ల సొమ్మును సంస్థ సభ్యులు ఎవరికి వారికి పంచి ఇచ్చేశాడని వార్త.

బహుశా మరో వంద, నూటయేభై సంవత్సరాల తర్వాత -

కృష్ణమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. అంతే! ఆయన ముందున్న డబ్బంతా మాయమయింది. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆశ్చర్యం!!! వాళ్ళ ఇళ్ళ అల్మైరాలలో, ఇనుపపెట్టెలలో సరిగ్గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ స్టార్ కు ఇచ్చిన విరాళం లెక్క ప్రకారం అంతే లెక్క అలాగే ఉంది. పూజాగదిలో కృష్ణమూర్తి విగ్రహం లోంచి దేదీప్యమానమైన కాంతి ప్రసరిస్తోంది......

అలాంటిది కల్పన ఒకటి మొదలయితే ఆశ్చర్యమేమీ లేదు.

**************************************************************************************************

సాయిబాబా (మత) ద్వేషులది మరో తీరు. ఏదో, ఎవరినో ఉద్దరిస్తున్నట్టు, ప్రపంచానికంతా జ్ఞానజ్యోతులు వెదజల్లుతున్నట్టు ఉంటాయి వీళ్ళవాదనలు. జీవితంలో భరించలేని కష్టాలొస్తే, మళ్ళీ వీళ్ళది అదే త్రోవనే. ఏదో ఒక నమ్మకమో, విశ్వాసమో ఆసరా కావలసిందే. వ్యవస్థీకృతమైన నమ్మకం చెడ్డదని కొందరి చిలకపలుకు. వ్యవస్థీకృతమైన నమ్మకం ఆత్మశోధనకు అడ్డంకి కావచ్చునేమో, కానీ వ్యవస్థీకృతమైన అపనమ్మకం పరమ దారుణమైనది. మనుషులను పశువులుగా మార్చేదీనూ. Truth is not opposite of false, but absence of false అనేది వివేకవంతమైన మాట. అది స్వయంగా ఎవరికి వారు తెలుసుకోవలసిందే. నమ్మకం కనీసం సాంత్వననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు. వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. వాళ్ళమాట వింటే ప్రపంచం మారిపోతుందన్న అల్పభ్రమలో ఉంటారు.

**************************************************************************************************

అయితే సాయిబాబా గురించి ఆలోచనలు వచ్చినప్పుడు దొర్లే కొన్ని ప్రశ్నలు మట్టుకు వేధిస్తూనే ఉంటాయి. Faith begins when logic ends. అని సూత్రం. Is that faith which comes is really a faith? or a subset of FEAR/DESIRE? గౌతమ బుద్ధుని నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకూ శంకను నిరంతర అన్వేషణాపరత్వాన్ని వీడకూడదని బోధిస్తారు. Doubt has a cleansing effect అంటారు కృష్ణమూర్తి. శంక అంటేనే తర్కం పరిధిలోకి వచ్చేది. తర్కాన్ని ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు తర్కం వద్దనుకోవాలి? ఎవరి దగ్గర తర్కాన్ని త్యజించి విశ్వాసం చూపడం మొదలుపెట్టాలి? తర్కం కూడా బుద్ధి పరిధి లోనిదే కదా? దాన్ని తోసిరాజనడం ఆత్మవంచన కాదా?

Logic ను పక్కకు నెట్టేసి ఒక Entity ని నమ్ముతాము అనుకుంటే నా నమ్మకం (FAITH) వెనుక ఉన్నది ఏమిటి? కోరికా? భయమా? లేక ఆత్మార్పణమా? (Total surrender)

భయమూ, కోరికా లేనప్పుడు మనలను (ఆత్మను లేదా మనసును) ఒకరికి అర్పించుకోవడం ఎందుకు? ఆ అవసరమేమిటి?

Master is born when pupil is ready
When the rain comes
grass grows by itself.

అనేది ఒక జెన్ హైకూ. గురువు కన్నా శిష్యుడే గొప్ప, అంతశ్శోధనయే గురువు అని ఈ సాంప్రదాయం. అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

Wednesday, June 30, 2010

చరిత్రా? చట్టుబండలా?

చరిత్ర అంటే ఏమిటి?
ఊహాగానమా?
కొందరు పరిశోధకుల పొంతన లేని అభిప్రాయాలకు ఊతం ఇచ్చే సబ్జెక్టా?
కోర్టులోలా circumstantial evidence ఉంటే తప్ప పరిగణనలోకి తీసుకోజాలని ఓ వ్యాజ్యమా?
తమతమ అభిజాత్యాలకు ఆటపట్టుగా మార్చుకోవడానికి తేరగా దొరికిన ఓ అవకాశమా?
వ్యక్తి వ్యక్తికీ, కాలకాలానికి మారిపోతూ ఉండేదా?

ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. అందులో సొంత అభిప్రాయాలకు, అభిజాత్యాలకు తావు ఉండరాదు. అధ్యయనం వ్యక్తిగత పేరు ప్రతిష్టల సమరం కారాదు. అది జాతికి చేస్తున్న సహాయం కానేరదు.

విమర్శ అనే ప్రక్రియకర్థం తెగడటం కాదు, పరిశీలించటం, నిష్పాక్షికంగా ఆధారాలను సేకరించటం, ఆధారాలను బట్టి సమన్వయం సాధించటం విమర్శ. సమన్వయం కుదరని పక్షంలో ఊహాగానాలకు చోటివ్వక, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఉంచి, తరువాతి తరానికి ఆ విషయాలను పరిశీలించడానికి సహాయం కల్పించటం కూడా సద్విమర్శలో భాగమే. చరిత్ర అన్నది ఒక శాస్త్రం కాదు. శాస్త్రానికి అధారం విశ్లేషణ. కళకు ఆధారం సంశ్లేషణ. శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అంటే, కంటికి కనిపించే ప్రత్యక్ష ఋజువులకోసం పాకులాట అనేది సంకుచితమైన అర్థం. 

చరిత్రాధ్యయనం ఒక కళ. ప్రాంతీయ సాహిత్యానికి, వారి దైనందిన జీవితంలో అంతర్భాగమైన అలవాట్లకు, వారి సంస్కృతి మూలాలకు, సాంప్రదాయ విషయాలకు సమన్వయం సాధించగలిగడం ఈ ప్రక్రియలో భాగం.ఇందులో పొఱబాట్లకు తావులేదు. సహానుభూతి అభిప్రాయాలకు పరిమితం కావాలి, ప్రమాణాలకు కాదు. అభిప్రాయాలకు అందరికీ అవకాశం ఉంది. అయితే అభిప్రాయం ప్రమాణం చేసే ప్రయత్నం నిర్ద్వంద్వంగా ఖండించదగింది. దురదృష్టవశాత్తూ, ఆంగ్లేయులచేత ఈ రోజు పాఠ్యాంశాలలో చేర్చబడి విద్యార్థులు చదువుతున్న భారతదేశ చరిత్ర చాలావరకు ఊహాజనితం. ఒక ఊహ నిజంగా మలచబడి, దానిపై మరొక కల్పన సృష్టింపబడి, మరిన్ని ఊహాగానాల అల్లిక,వాటికి ఋజువుల వెతుకులాట.. ఇలా చెల్లాచెదరై ఉంది.మనం చదువుకునే మన దేశచరిత్ర మొత్తం అస్తవ్యస్తం, అకటావికటం.

ఉదాహరణ: హిందువులు సాధారణంగా వాడే పంచాంగంలో ఉటంకింపబడే శాలివాహన శకం ప్రకారం ఈ యేడు 1932 వ వర్షం. యే శకమైనా ఎలా మొదలవుతుంది? ఓ మహాత్ముడితోనో, మహానుభావుడి పేరు మీదో, ఏదైనా గొప్ప సంఘటన వలనో మొదలవాలి. కలిశకం, యుధిష్టిర శకం, విక్రమ శకం, క్రీస్తు శకం ఇవన్నీ దానికి ఉదాహరణాలు. అలా శాలివాహన శకం క్రీ.శ. 78 నుండి మొదలయింది. వేల యేళ్ళుగా ఆనవాయితీగా, పంచాంగ రూపకర్తలు దీనిని ఉటంకిస్తూ వస్తున్నారు. శాలివాహన మహారాజు గురించి భారతీయ లౌకిక సాహిత్యంలో కథలున్నవి. ఎంతో ఎందుకు? ప్రాకృతభాషలో గాథాసప్తశతి - శాలివాహన సంకలితం ఉన్నది.  కాగా, శాలివాహనుడనే రాజు లేనే లేడని, ఎక్కడినుండో వచ్చిన కుషాణ వంశపు కనిష్కుడనే రాజు పుట్టుక ఆధారంగా ఈ శకం మొదలయ్యిందని కొందరు ఆంగ్లపండితుల ఊహ. పురాణాలన్నీ పుక్కిటివయ్యాయి. ఊహాగానాలు నిజమయి కూర్చున్నాయి. ఊహ చరిత్ర గా మారింది. మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కింది. ఎవరో చేసిన ఊహాగానం చరిత్ర పేరిట మనం చదువుకుంటున్నాము. అగ్ని వంశపు రాజుల గురించి చెప్పిన మత్స్య, అగ్నిపురాణాది అనేక పురాణాలు, వేలయేళ్ళుగా వచ్చే సంప్రదాయం, లౌకిక సాహిత్యం, ప్రతీ రోజు చేసే సంధ్యావందనంలోనూ, హిందువనే ప్రతివాడు ఏదో ఒక సందర్భంలో పూజలో సంకల్పం చెప్పుకునే వరుసలో వచ్చే "శాలివాహకే..హరిహర గురుసన్నిధౌ, అస్మిన్ వర్తమానే..." వరుసా, ఇవన్నీ ప్రమాణాలుగా తోసివేయబడ్డాయి!

ఇక మహాభారతం విషయానికి వద్దాం.

కలియుగం ఫిబ్రవరి 20, 3102 B.C, 2-27'-30''గంటలకు,మొదలయ్యిందని ప్రపంచ వ్యాప్తంగా, ఇండాలజిస్టులు ఒప్పుకున్న విషయం. మహాభారతంలో స్త్రీపర్వం, అనుశాసనిక పర్వం,మహాప్రస్థానిక పర్వాది కొన్ని పర్వాలలో శ్రీకృష్ణుని మరణం, పరీక్షిత్తు జననం, కలియుగాగమనం ఒకేసారి జరుగుతాయని ఉటంకించబడి ఉన్నది. గాంధారి కృష్ణునికి శాపం ఇస్తూ, సరిగ్గా 36 యేళ్ళకు యాదవకులంలో ముసలంపుట్టి వంశనాశనం జరుగుతుందని చెబుతుంది.అంటే, భారతయుద్ధకాలం క్రీ.పూ. 3138. అంటే భారత కాలం అంతకుముందే కావాలి. దేవీభాగవతం, ఇంకా కొన్ని పురాణాలలోనూ ఒకేవిధమైన సమయం ఉటంకింపబడి మహాభారత కాలానికి సమన్వయం కుదురుతున్నది. కాగా, మహాభారత సమయం క్రీ.పూ. 1200 కు మించదని, ఎందువల్లనంటే iron age అప్పుడే మొదలయ్యిందని కొందరి ఊహ అయితే, జాకోబీ, వెబర్,మాక్డోవెల్ పండితుల ప్రకారం మహాభారతం క్రీ.పూ.మూడవ శతాబ్దానికి చెందినది. వీరి ఊహకు కల్పించిన ఆధారం అలెక్జాండరు దండయాత్ర క్రీ.పూ.మూడవ శతాబ్దంలో జరిగింది. భారతంలో యవన శబ్దం ఉంది కాబట్టి, భారతం ఆ సమయంలోనే జరిగిందన్న వాదన! మరి రామాయణంలోనూ యవన శబ్దం ఉంది కదా అంటే, అది ప్రక్షిప్తం అనేశారు. సరే, అలెక్జాండర్ కంటే ముందే డేరియస్ అనే గ్రీకు రాజు ఉత్తరభారతానికి వచ్చినట్టు ఓ చరిత్రకారుడు వ్రాశాడు కదా, క్రీ.పూ.ఏడవ శతాబ్దంలో శకటాయనుడు కూడా ఆ శబ్దం ఉపయోగించాడు కదా అన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. భారత కాలం స్పష్టంగా నిర్ణయించడానికి, ఋజువులు దొరకలేదని ఘోషణ! అంతర్గత ఋజువులు (internal evidences) దొరికినప్పుడు వాటిని వీలయినంత పక్కన పెట్టటం, లేదా వక్రీకరించటం జరిగింది.

శంకరాచార్యుల కాలం గురించి కూడా, ఆయనచేత స్థాపించబడ్డ పీఠాలలో దృష్టాంతాలు వెతక్కుండా, ఏదో తలాతోకా లేని శ్లోకం ద్వారా ఊహించి,దాన్నే ప్రమాణం చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నాలు జరిగాయి.చేశారు కూడాను. ఇప్పుడు జనశ్రుతి ప్రకారం, క్రీ.పూ. జన్మించిన శంకరుడు క్రీ.శ. పదకొండవ శతాబ్దపు వ్యక్తి!!

మహాభారత కాలం గురించి, బుద్ధుడి కాలం గురించి, ఇంకా అగ్నివంశపు రాజుల గురించి, జంబూద్వీపం అంటే ఏమిటి? భరతవర్షం, భరతఖండం, తెలుగువారెవ్వరు, ఆర్యులెవ్వరు తదితర విషయాలపై కీ.శే.కోట వెంకటాచలం గారు కొన్ని గ్రంథాలు వ్రాశారు. మహాభారతంలోని సమయ సంబంధిత శ్లోకాలను అర్థసహితం తెలుపటమే కాక, ప్రత్యక్ష జ్యోతిష్య ప్రమాణాలను, సప్తర్షిమండలం ఏ రాశిలో ఉన్నది వంటి అనేక విషయాలను కూలంకషంగా ఆయన చర్చించారు. ఇంకా ఆంగ్ల చారిత్రకులు గ్రీకు గ్రంథాలలో ఉటంకింపబడ్డ జాండ్రేమ్సు,శాండ్రొకొట్టసు,శాండ్రోసిప్టసు ఎవరు? మౌర్యులకాలం ఎప్పటిది? వాటి ఆధారంగా నిర్ణయింపబడ్డ పొఱబాట్లను, ఆంగ్లచారిత్రకుల ఉటంకింపుల ద్వారనే ఆయన వెలికి తీసి ఋజువులు చూపించారు.

ఆర్య, ద్రవిడ సిద్ధాంతాలు వంటివి colonial consciousness కు ప్రతీకలుగా ఋజువులు దొరుకుతున్న ఈ రోజుల్లో ఓ సాధారణ పండితుడు వ్రాసిన గ్రంథాలు ఆయా ఋజువులకు దగ్గరగా ఉండటం పరిశీలించదగింది. ఇవి కొన్ని తెలుగులో ఉన్నవి. మహాభారతం, బుద్ధుడి కాలం గురించిన గ్రంథాలు ఆంగ్లంలోనూ DLI లో దొరుకుతున్నవి.భారతదేశ చరిత్ర మీద ఆసక్తి, ఇష్టం ఉన్నవారు తప్పక చదవవలసిన విషయాలివి.నిజమైన చరిత్ర బయటపడుతూ, అర్థం లేని సిద్ధాంతాలు ఊహాజనితమని ఋజువవుతున్న ఈ రోజుల్లో భారతదేశంలోని మారుమూల ఓ పండితుడు వ్రాసిన గ్రంథాలు నిజమైన చరిత్రకు దగ్గరగా ఉండటం గమనార్హం.

- అగ్నివంశపు రాజులు
- ఆంధ్రులెవరు?
- కలిశకవిజ్ఞానం
- Time of mahabhaarata
- Buddha's time
కోట వెంకటాచలం 
- సంస్కృత సారస్వత చరిత్ర