Showing posts with label సెల్ఫ్ డబ్బా. Show all posts
Showing posts with label సెల్ఫ్ డబ్బా. Show all posts

Monday, September 16, 2013

మృచ్ఛకటికం - కొన్ని ఆలోచనలు


రచయితకు గొప్ప ఉదాత్తత (sensibility) అన్నది ఉన్నప్పుడు, ఆ ఉదాత్తతను ప్రతిబింబిస్తూ ఒక పాత్ర వెలువడినప్పుడూ, రచయిత యొక్క sensibilities కు తగిన పాఠకుడు ఆ రచనను చదవడం తటస్థించినప్పుడు ఆ రచయితకూ ఆ పాఠకుడికి మధ్య జరిగే ఏకాంతమైన అవగాహన సద్యఃపరనిర్వృతి అని నా అభిప్రాయం. దీన్నే రసనిష్పందం అనవచ్చునేమో. రాళ్ళపల్లి వారు ఒకచోట అన్నట్టు రసం అంటే తొమ్మిది భేదాలతో మాత్రమే నిర్వచింపదగిన emotion మాత్రమే కాదు. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఏదో అనుకూలం కోసం రసాలను నవవిధాలుగా వింగడించుకున్నప్పటికీ రసనిష్పందం యొక్క ఖచ్చితత్వం ఆ వింగడింపులో మాత్రమే లేదు.

సద్యః పరనిర్వృతి కలిగించే రచయితను కవి అని, ఆ పాఠకుడిని సహృదయుడని అనవచ్చునేమో.

వ్యక్తి వ్యక్తికీ సున్నితత్వపు తేడాలు సహజం. అదే స్థాయిలోనూ పాఠకుల సహృదయత కూడా మారుతుంది. అభిమాన రచయిత కూడా మారుతాడు. శాశ్వతంగా అందరికీ నచ్చే రచయిత కానీ, నచ్చే రచన కానీ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఫలానా రచన నా అభిమాన రచన, ఫలానా రచయిత నా అభిమాన రచయిత అన్నది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. అభిప్రాయాలకంటే రచన తాలూకు sensibilities గురించి మాట్లాడుకోవడం మంచిది.

వర్షాకాలం గురించి అనుకోగానే నాకు శూద్రక మహాకవి, మృచ్ఛకటికకావ్యం, అందులో వర్షర్తు వర్ణనా గుర్తొస్తాయి. అలాంటి వర్ణన అంతకన్నా గొప్పగా ఇతర కావ్యాలలో ఉండవచ్చు గాక. అయితే మృచ్ఛకటికం తాలూకు ఉదాత్తత కేవలం వర్ణనలో లేదు. అది దృశ్యకావ్యమవడం మూలాననూ, అక్కడ కవి కల్పించిన సన్నివేశం వల్లనూ, వసంతసేన పాత్ర యొక్క ఉదాత్త స్వరూపం నేపథ్యంగానూ ఆ వర్ణన యొక్క సౌందర్యం వ్యక్తమవుతుంది.

వసంతసేన ఒక గణిక, క్షత్రియ. ఈమె దరిద్రుడూ, అప్పటికే భార్య, పుత్రుడు ఉన్న ఒక సార్థవాహుణ్ణి (బ్రాహ్మణుడు/వైశ్యుడు) ప్రేమించింది. ఒకానొక రాత్రి తన ప్రియుని ఇంటికి బయలుదేరింది. ప్రియుణ్ణి మొదటి సారి చూడబోతున్న తరుణం. ఆమె చిత్తం లోపల ఉద్వేగమూ, ఆనందమూ పెనవేసుకుని ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రశ్న. గణిక - అంటే ఒక వేశ్యకు - అంటే పురుషసంగమం అలవాటైన ఒక యువతికి - ఒక మొగవాని పట్ల అలాంటి భావాలు ఉండటం ఎలా సంభవం? సరిగ్గా ఇక్కడే పాత్ర ఉదాత్తత - సహృదయునికి తెలుస్తుంది. శీలం వేరు, స్వచ్ఛత వేరు. శీలం సామాజికం అయితే స్వచ్ఛత మానసికం. రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు, దోహదకారులూ కానవసరం లేదు. సందర్భమో కాదో తెలియదు కానీ ఈ మధ్య మరోసారి చదివిన యండమూరి నవల అష్టావక్ర గుర్తొస్తుంది. అందులో ప్రతిమా అగర్వాల్ పాత్ర ఇదే పాయింట్ మీద నడుస్తుంది. అలాగే హంపి నుండి హరప్పా దాక లో బసివి నాగమ్మ గురించి రామచంద్రగారు వివరిస్తారు. ఆ పాత్ర గురించి చదివిన తర్వాత పాఠకుడికి సానుభూతే తప్ప ఏ విధమైన వికారమూ కలుగదు. వసంతసేన కూడా అలాంటి ఒక ఉదాత్తమైన పాత్ర.

వసంతసేన ఉద్వేగానందాలను ప్రతిబింబిస్తూ బయట వాతావరణం. కుండపోతగా వర్షం. ఆ వాతావరణంలో వసంతసేనకు తోడుగా గొడుగు పట్టి వెంట వస్తున్న విటునికి, వసంతసేనకూ మధ్య వర్షం గురించిన సంభాషణ.

ఇందులో ఓ రెండు పద్యాలు.

గర్జంతి శైలశిఖరేషు విలంబిబింబా మేఘా వియుక్తవనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళశృంగైః ||

వసంతసేనా! చూడు!చూడు! శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ!

మూఢే ! నిరంతర పయోధరవా మయైవ కాంతః సహాభిరమతే యది కిం తవాత్ర!
మాం గర్జితైరితి ముహుర్వినివారయంతీ మార్గం రుణద్ధి కుపితేవ నిశా పత్నీ ||

‘ఓసి మూర్ఖురాలా! వసంతసేనా! దట్టమైన మబ్బులున్న (ఇఱుకు పయోధరాలు) ఉన్న నేను నా కాంతుడితో రమిస్తూంటే, మధ్యలో నీకేంటి?’ అని ఉరుములతో మాటిమాటికీ నివారిస్తూ (నాపై ఉరుముతూ) ఈ నిశ, సవతి లా మారి, నా దారిని అడ్డగిస్తూంది కదా!
(సవతి ఎందుకంటే, తనను తన ప్రియుడి వద్దకు చేఱుకోనీకుండా అడ్డుపడుతున్నది కాబట్టి) అని వాపోతుంది. పయః అన్న సంస్కృతపదానికి నీరు, పాలు అని రెండు అర్థాలు. నిరంతర పయోధరములు అన్నది శ్లేష. దట్టమైన మబ్బులు అని ఒక అర్థం, (నిర్ + అంతర) ఇఱుకు పయోధరాలని మరొక అర్థం.

********************************************
ఇక్కడ మరో సారి అనంతకృష్ణశర్మ గారిని గుర్తు తెచ్చుకుంటాను. యే ఉదాత్త రచన అయినా రచయిత యొక్క శాంతస్వభావం మూలం కావాలి. ధిషణాహంకారాలూ, పాండిత్యప్రగల్భా వాచ్యార్థాల ప్రాభవం పెంపు చేయవచ్చును, కానీ ఉదాత్తమైన భావం కవి అంతః కుహరాల్లోనుంచి రావాలి. అందుకు శాంతమే ఆలంబన. నిజమైన శృంగార వర్ణన - అది నిజంగా సున్నితత్వాన్ని నింపుకొన్నదైతే ఉద్రేకాన్నీ, ఆవేశాన్నీ కలిగించరాదు. అది చిత్త ఆహ్లాదకారకం కావాలి. అంతమాత్రమే కాదు, రంజింపజేయాలి. కవి తాలూకు దార్శనికత సహృదయుడైన పాఠకుడికి దారి చూపాలి.

మృచ్ఛకటికం కావ్యంలోని ఈ ఘట్టం నిజంగానే వర్షంలో తడుస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అనుభవైకవేద్యం. సన్నివేశం, పాత్రలూ, వాటి ఉదాత్తతా నేపథ్యంగా ఔచిత్యశోభితంగా ప్రావృట్వర్ణన అనే వస్తువును వర్ణించిన అపూర్వమైన ఘట్టం. వ్యక్తిగతంగా నాకు నచ్చిన గొప్ప వర్ణన.

Sunday, July 3, 2011

తొలకరి జల్లు


ఈ మధ్య బ్లాగులు వ్రాయడంలో ఏ మాత్రం ఆసక్తి కుదరట్లేదు. ఇటు రెండేళ్ళు కుస్తీ పట్టి, అయ్యవార్లను పీడించి
నేర్పించుకున్న పద్యాలు కూడా ఎంచేతో కుదరట్లేదు. ఏదో ఒకటి రాయాలి..రాయాలి..అని మనసు లాగేస్తోంది. సరే ఏం రాద్దాం అనుకుంటే ఈ రోజు (నా డిక్షనరీలో ఈ రోజు అంటే నిన్న)  ఆషాఢమాసం అని తెలిసొచ్చింది. ఈ మధ్య న్యూసు, టీవీ పుణ్యమాని మదర్స్ డే లు ఫాదర్స్ డేలు తెలుస్తున్నాయి కానీ ఆషాఢ మాసాలు, పాడ్యమి తిథీ, నక్షత్రాలు తెలియట్లేదు. షో కేసులో ప్లాస్టిక్ పూలు చూసుకుని మురిసి పోయే రకాలం మనం. ఏదైనా ప్రశాంతంగా ఉన్న తోటలోకి పారిపోయి పూలమొక్కల మధ్య ఓ సాయంత్రం మొత్తం మౌనంగా గడిపి వస్తే మనసుకు పట్టిన తుప్పు వదిలి ఫలితం కనబడవచ్చునేమో!

విషయానికొద్దాం. ఆషాఢమాసం వర్షర్తువు, ప్రావృట్కాలం. "మాసానాం మార్గశీర్షోsహం ఋతూనాం కుసుమాకరః" అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. "నెఱ్ఱెలు విచ్చిన నేలతల్లిని చూసి పైనున్న ఆకాశం రాల్చిన అశ్రుకణం తాకే ఆషాఢ మాసం" -ఆయన్ను కదిలించలేకపోయింది. ఆయనేమో ఆనంద స్వరూపుడాయె. ఆయనకు కోకిల కుహూరవాలు, మామిడి పూతలు, చిగురించే పుష్పాలతో అవసరం. మనం మనుషులం కాబట్టి మనకు తొలకరి జల్లులు, మట్టి వాసనలు, పసి పిల్లల కాగితపు పడవలు మనకివి ఆనందం. (అఫ్కోర్సు due apologies on గీతాకారుడు)   
 
వర్షం పడుతూంటే కిటికీ పక్కన చల్లగాలి తగులుతూంటే ప్లేట్లో పకోడీలు, ఇటుపక్కన ఏ చిట్టిబాబు వీణానాదమో, ఆకాశవాణి లో ఛాయాగీత్ కానీ వింటూ, పక్కనో పాత చందమామ లేదా యువ పత్రిక తిరగేస్తూ ఉంటే.. ఆహా. స్వర్గంలో రంభలూ,ఊర్వశులు తప్ప ఇలాటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో.

నాకు నా చిన్నతనం నుండీ నీళ్ళ పిచ్చి విపరీతంగా ఉండేదట. అపసోపాలు పడి బడిలో చేర్పించాక, ఒక రోజు పొద్దున మా వీధి మొగదల వీధి కొళాయి నీళ్ళు అందరూ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను దానికింద తిష్టవేశానట. అలా నీళ్ళలో తడిసిపోతూ ఆనందంలో మునిగి తేలుతా ఉంటే, ఎవరో దుర్మార్గుడు మా ఇంట్లో వాళ్ళకు చెప్పి, వాళ్ళు నా తడిచిపోయిన పలక, బలపం తీసేసుకుని లాక్కుపోయి బడితెపూజ చేశారట. (ఈ విషయాలు మా ఇంట్లో వాళ్ళెప్పుడైనా చెప్పుకుంటూంటారు) ఆ తర్వాత ఏడవ తరగతిలో ఓ మారు మా ఫ్రెండు ఇంట్లో దిగుడు బావి ఉంటే అక్కడకెళ్ళి మునగబెండ్లవీ కట్టుకుని ఈత నేర్చుకుందుకు ప్రయత్నిస్తే, ఆ కుట్రను కూడా మా ఇంట్లో వాళ్ళు కనిపెట్టి భగ్నం చేశారు.

మూడేళ్ళ తమ్మి (సంహిత) కి కొన్ని నాన్న బుద్దులు వచ్చాయి. అమ్మ వారసత్వం కూడా (తమ్మి వాళ్ళమ్మ రైతుబిడ్డ). నాన్న బుద్దులు విజృంభించినప్పుడు వర్షంలో/నీళ్లలో ఆటలు, అమ్మ వారసత్వం బలంగా పని చేసినప్పుడు మా ఇంటి వెనుక చెట్లకు పాదులు తవ్వడం వంటి శ్రమజీవి లక్షణాలు అలవర్చుకుంది. నాకైతే అమ్మవారసత్వం ఇబ్బంది లేదు కానీ, మా ఆవిడ మాత్రం తమ్మి తాలూకు నాన్న బుద్ధుల్ని నిరసిస్తుంది. వర్షంలో తడిస్తే కసురుతూంటుంది.

రెండేళ్ళ క్రితం ఓ రోజు బస్సులో వెళుతున్నాను. బయట చినుకులు పడుతున్నాయి. ఆకాశం మన కళ్ళు పడితే
దిష్టి కొడుతుందేమో అన్నంత అందంగా ముస్తాబయింది. అప్పుడు బయట ఆకాశం, కిటికి పక్కన అలవోకగా జల్లు
కొడుతున్నప్పుడు మృచ్ఛకటికం అనే సంస్కృతనాటకం పుస్తకం చదివాను. ఆ నాటకంలోనూ కాకతాళీయంగా (ఐదవ అంకం) వర్ష రుతు వర్ణన. ఆ నాటకంలో సందర్భం ఇది. నాయిక వసంతసేన తన ప్రియుడి ఇంటికి వెళుతూంటుంది. ఆమెకు తోడుగా ఒకతను. వాళ్ళిద్దరూ (గాసిప్పులవీ కాకుండా) వర్షం గురించి మాట్లాడుకొంటూ, వర్షాన్ని వర్ణిస్తూ ఉంటారు.

" ఆహా ఈ నల్లమబ్బులు విరహిణుల హృదయాల్లాగా ఎంత భారంగా ఉన్నాయి? ఇదుగో ఈ ఉరుములు విని నెమళ్ళు పైకెగిరి, రెక్కలు అల్లల్లాడిస్తూంటే, ఆకాశాన్ని ఎవరో మణిమయవింజామరలతో వీస్తున్నట్టు లేదూ!"

"మేఘుడు వర్షధారలనే శరాలతో కొట్టి చంద్రుణ్ణి వశపర్చుకున్నాడు. ఉరుములు ఈ యుద్ధంలో భేరీనినాదాలు. మెఱుపులు మేఘుని విజయపతాకలు. చంద్రకిరణాలు - చంద్రుడు పన్నుల ద్వారా ప్రజలను పిండి వసూలు చేసిన సొమ్ము. వాటిని మేఘుడు కబళించాడు."

"ఈ దట్టమైన మేఘం చూడు! ఏనుగాలాగా ఉంది. ఆ కొంగలబారును చూశావూ! ఏనుగు కుంభస్థలంమీద అలంకరించిన పట్టుపాగాలానూ, మెఱుపులు వింజామరల్లానూ లేవూ?"

"ఆ పైనున్న మేఘాలు ఇంద్రుడి ఆజ్ఞ మేర మెఱుపులనే వెండి మోకులు విడిచి భూమిని కట్టి పైకి లాగుతున్నట్టుగా ఉంది!"

"ఆ కదంబ వృక్షం ఎఱ్ఱటి దివ్వెలా ఎలా వెలిగిపోతుంది చూడు!"

"దుష్టుడికి చేసిన ఉపకారాల్లాగా నక్షత్రాలు ముఖం చాటు చేశేసాయి.  ప్రోషితభర్తృకలలాగా దిక్కులు శోభను కోల్పోయినాయి."

"ఈ ఆకాశం మెఱుపులతో మండుతూంది. కొంగల గుంపుతో నవ్వుతూంది. హరివిల్లుతో కయ్యం పెట్టుకుంటూంది. పిడుగులతో అరుస్తూంది. మబ్బులతో ధూపంలా ఉంది"

....
....
....

అన్నట్టు ప్రోషిత భర్తృక = సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్య అని అర్థమట. ఈ మధ్యే తెలిసింది.

మృచ్ఛకటికం లో ఈ వర్ష ఋతు వర్ణన, సంస్కృత సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన వర్ణనగా పండితులు చెబుతారు.

అంత హెవీగా కాకపోయినా మన రవీంద్రుడు కూడా వర్షాన్ని తెగ వర్ణిస్తాడు. ఉరుముల శబ్దం, వలలో చిక్కిన అడవిదున్న ఆర్తనాదంలా ఉందంటాడాయన. ఈ వర్ణనలకన్నా, నాకు మాత్రం (కవీంద్రుని) కాగితపు పడవ తెగ నచ్చుతుంది. మా పాపకు కూడా.

Saturday, April 23, 2011

సాయిబాబా - అంతశ్శోధన


"అంతమంది జనాలు సాయిబాబాను నమ్ముతున్నారు గదా, నువ్వెందుకు నమ్మవు?" కాలేజీ చదువుతున్నప్పుడు మాయమ్మ అడిగింది ఒకరోజు.

అప్పట్లో ఒకానొక ఫంక్షన్ లో (సత్యసాయి నిగమాగమం ప్రారంభోత్సవం అనుకుంటా) సాయిబాబా రాజేష్ పైలట్ అనే కేంద్రమంత్రికి కొన్ని వేలమంది చూస్తుండగా గాలిలో నుండి ఒక చిన్న నగ సృష్టించి బహుమతిగా ఇచ్చారు, ఆ దృశ్యం వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియో రికార్డులను స్లో మోషన్ లో చూస్తుండగా ఒక విషయం బయటపడింది. సాయిబాబా పక్కన ఒకతను ఒక పళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటే, ఆ పళ్ళెం క్రిందుగా చేతులు పోనిచ్చి సాయిబాబా ఆ నగను తీసినట్టు ఆ దృశ్యం చెబుతూంది. ఆ టేపును అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ అప్పారావు గారు కాల్చేశారట. ఇదంతా పత్రికల కథనం కాబట్టి నిజానిజాలు నాకు తెలియవు. అయితే సాయిబాబా పళ్ళెం కింద చేయి పెట్టటం నగ తీయడం ఈ వరుస ఫోటోలు ఒకానొక దినపత్రికలో వచ్చాయి. వాటిని మా కాలేజీ నోటీసు బోర్డులో పెట్టారు. అదీ కథ.

ఆ రోజు వరకూ నా గోల నాది, కానీ సాయిబాబాను నమ్మకపోవడం ఆ సంఘటన నుంచి నాలో మొదలైంది. దానికి తోడు ఆయన కుండలోంచి విభూతిని పది పదిహేను నిముషాల వరకూ తీస్తూనే ఉండడం, నోట్లో శివలింగం తీయడం ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ సినిమాలో చూసి కాస్త విరక్తి కలిగింది. ఈ పైత్యానికి తోడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు పరమభక్తుడు. "దీపం విలువ దీపం క్రింద చీకట్లో కూర్చున్న వాళ్ళకు తెలీదురా. కాస్త దూరం నుంచి చూసేవాళ్ళకు మాత్రమే కనబడుతుంది" అనే వాడు. వాడి మూర్ఖభక్తి చూసి నవ్వు వచ్చేది. ఆలోచనాశక్తిలేకపోవడం వల్ల ఎప్పుడైనా కోపమూ వచ్చేది.

సాయిబాబా మీద ఈ తిరుగుబాటు భావజాలం అంతర్మథనంగా మారింది మా మేనమామ వల్ల.

కీర్తిశేషులు శంకరసుబ్రహ్మణ్యం మా మామయ్య. ఆయన కాలం చేసి నేటికి పదేళ్ళవుతూంది. ఆయన బహుభాషావేత్త. సంస్కృతంలో మంజరీశతకం అన్న శతకకావ్యమూ, వేమన పద్యాలకు హిందీ అనువాదం, ఠాగూర్ పద్యాలకు తెనుగు సేత, మేఘదూతం లా నిస్తంతీ దూతం (ఆయన టెలికాం లో ఆఫీసర్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు) ఇలాంటి రచనలతో సాహిత్యపరిశ్రమ, శారదాసేవ చేసిన వారు. నిత్యవిద్యార్థి. ఆయన ఛాందసులు కారు, ఆధునికులనే చెప్పాలి. ఆంగ్లం మీద, ఆంగ్లవిద్య మీద మోజు, ఆంగ్లం చదివితే జీవితంలో పైకి రావడం సులభమనే భావనా ఆయనకు ఉండేవి. ఆయన టెలికాం ఉద్యోగం నుండి రిటైర్ అవడానికి ముందు కొన్ని చిక్కుల్లో పడ్డారు. తన ఆఫీసులో సహోద్యోగి ఒకతను ఒక చెక్కును ఫోర్జరీయో ఏదో చేసి, డబ్బు కాజేసి, ఆ నేరం ఈయన మీదే మోపారు. ఆ కేసు పెట్టినది దళితుడు అవడంతో ఈయనకు చిక్కులు మరింత ఎక్కువయ్యాయ్. దాదాపు నలభై అయిదేళ్ళ సర్వీసులో నిజాయితీగా కష్టపడినందుకు ఈ ఫలితం దక్కిందని ఆయన మానసిక వేదన అనుభవించారు. ఆ సమయంలో సత్యసాయిబాబాను నమ్మారు. వేడుకున్నారు. ఎలాగైతేనేం కొన్ని యేళ్ళకు ఆయనకు న్యాయం దొరికింది. కోర్టు ఆయనను నిర్దోషిగా నిర్ణయించి తీర్పునిచ్చింది. సాయిమీద కృతజ్ఞతతో ఆయన ఇల్లు కట్టుకుని "సాయిసదనమ్" అని పేరు పెట్టుకున్నారు.

మా అమ్మకూ, మా పిన్నమ్మలిద్దరికీ మేనమామ మాట వేదవాక్కు కాబట్టి వాళ్ళూ ఆయనను నమ్మడం మొదలుపెట్టారు.మా ఇళ్ళ పూజాగృహాలలో సాయిబాబా పటం ఉండేది. అయితే అవజ్ఞతతో, తెలివిమాలినతనంతో అప్పట్లో మా అమ్మతో నేను కాస్త దురుసుగా మాట్లాడేవాణ్ణి, సాయిబాబా కుండలో విభూతి తీస్తే మీరెలా నమ్ముతారని మా అమ్మను ఆక్షేపించిన జ్ఞాపకం. టపా మొదట్లో మా అమ్మ కోపంగా అడిగిన ప్రశ్న ఆ సందర్భం లోనిదే.

బతికి ఉన్న రోజుల్లో మా మేనమామయ్యతో నాకు మాటలు, కొంతవరకూ చర్చలు ఉండేవి కానీ, విపరీతమైన చనువు లేదు,ఆయనతో మాట్లాడే స్థాయి కూడా లేదు. అంచేత సాయిబాబా విషయంలో నేను ఆయనతో చర్చించలేదు కానీ, ఒక సందర్భంలో నాకు తెలిసిందేమంటే, ఆయన సాయిబాబాను చూడనే లేదని, కేవలం ఆశ్రయించారని. తన లీలల గురించి కూడా తనకు తెలిసి ఉండదని నా అనుకోలు. సాయిబాబాను ఆయన కడకు దర్శించారో లేదో తెలియదు.

ఆయన ద్వారా నేను నేర్చుకున్నది సాయిబాబాను నమ్మినా, నమ్మకపోయినా నమ్మేవాళ్ళను గేలి చేయరాదన్న సంస్కారం. ఆ సంస్కారం కాస్త మిగలబట్టి మా ఇంటికి ఒకసారి నాన్న తరపున బంధువులు వస్తే, వారివెంట పుట్టపర్తి వెళ్ళి వచ్చాను. మా బంధువు పొద్దున ఐదున్నరకు వెళ్ళి మూడవ వరుసలో కూర్చున్నారు. సత్యసాయిబాబా చేతి నుండీ విభూతి రాలడం ఆయన స్వయంగా చూశానన్నారు. చాలా ఆశ్చర్యపడిపోయారు.

అయినా ఎందుచేతో అప్పుడప్పుడూ పురుగులా ఒక ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. ద్వేషం వల్ల కాదు, ఏదో తెలియని బాధ, ఆవేశం వల్ల.  ఒక వ్యక్తి రోలెక్స్/టైమెక్స్/సిటిజెన్ గడియారం గాల్లో ఎలా సృష్టిస్తారు? ఒక గడియారం కావాలంటే క్వార్ట్జ్ క్రిస్టలు, దాని వెనుకనున్న సైన్సు సూత్రాలు, నిపుణులు అనేకుల పరిశ్రమ లేకుండా ఎలా సాధ్యం? గాల్లో బూడిద పుట్టిందంటే ఏదోలే సంభావ్యత ఉందనుకుందాం, గడియారం ఎలా "పుడుతుంది"? అసలు చేతిలో పట్టేంత వస్తువెందుకు పుట్టాలి? యే రిఫ్రిజిరేటర్ నో పుట్టించవచ్చు గదా? (నేను ఎర్ర వాణ్ణి, మతద్వేషినీ కానని మనవి. నా వాదన ఎర్రవారికి మద్దతు కాదు. పైవాదన సాయిబాబా భక్తులకు ధిక్కరింపూ కాదు. నేను నమ్మవలసి వస్తే నాకు కలిగే ప్రశ్నలు మాత్రమే)

పై ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వాళ్ళు నన్నెలా ఆక్షేపిస్తారో అనుకుంటే ఈ క్రింది ప్రశ్న తట్టింది.

"నువ్వెందుకు ఐదేళ్ళ పిల్లవాడు (కృష్ణుడు) ఒక కొండను చిటికెన వ్రేలుతో ఎత్తాడంటే నమ్ముతున్నావు? పూజిస్తున్నావు?రాముడు ఒక బండకు తన కాలు సోకించగానే ఒకమ్మాయి పుట్టిందంటే నీవెలా నమ్ముతున్నావు?(ఇలాంటివి అనేకం ఉన్నయ్)

కాస్త తల చెడగొట్టుకుంటే రెండు సమాధానాలు కని(విని)పించాయి.

౧) పై రెండు కావ్యసాహిత్య విషయాలు కాబట్టి. సాహిత్యంలో ఒక పురుషోత్తముణ్ణి, శ్రేష్టుణ్ణి చేయడానికి చిలవలు పలవలుగా కల్పించడం ఉన్నదే. (రాజమౌళి సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలలాగా). అవన్నీ లేకపోతే కావ్యమూ లేదు, కావ్యోద్భవరసనిష్పందమూ లేదు. కావ్యం అంటే కేవలం న్యూస్ పేపర్ లో చదివే న్యూస్ లాంటిది కాదు, పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా లేదు. అంచేతే కావ్యమూ, రసమూ, కల్పనలూ వగైరా వగైరా..

౨) ఎవరైనా ఒక మహానుభావుడు, మహోన్నతుడు, పురుషోత్తముడు, సద్గురువు పుట్టి గతించిన తర్వాత ఆతని చుట్టూ మార్మికత, ఆచారాలు, వ్యవస్థా కమ్ముకోవడం లోకవ్యవహారం. బుద్ధుడు దేవుడే లేడన్నాడు. (లేదా దేవుణ్ణి బయట కాక అంతశ్శోధనలోనే వెతుక్కోమన్నాడు). ఆయన తర్వాత అనుచరులు ఆయనను దేవుణ్ణి చేసిపెట్టారు. ఆయన పేరు మీద అభూతకల్పనలు, అతీంద్రియ శక్తులు కల్పించారు. షిర్డీ సాయిబాబా విషయంలో అదే జరిగింది. ఇంకా ఎంతోమంది విషయంలో కూడానూ. బహుశా మరో రెండు తరాల తర్వాత ఏమో, జిడ్డు కృష్ణమూర్తి కూడా దేవుడు కావచ్చు!

జిడ్డు కృష్ణమూర్తి 1929 లో తను అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ స్టార్ సంస్థను రద్దు చేసి అప్పట్లో 3000 కోట్ల డాలర్ల సొమ్మును సంస్థ సభ్యులు ఎవరికి వారికి పంచి ఇచ్చేశాడని వార్త.

బహుశా మరో వంద, నూటయేభై సంవత్సరాల తర్వాత -

కృష్ణమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. అంతే! ఆయన ముందున్న డబ్బంతా మాయమయింది. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆశ్చర్యం!!! వాళ్ళ ఇళ్ళ అల్మైరాలలో, ఇనుపపెట్టెలలో సరిగ్గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ స్టార్ కు ఇచ్చిన విరాళం లెక్క ప్రకారం అంతే లెక్క అలాగే ఉంది. పూజాగదిలో కృష్ణమూర్తి విగ్రహం లోంచి దేదీప్యమానమైన కాంతి ప్రసరిస్తోంది......

అలాంటిది కల్పన ఒకటి మొదలయితే ఆశ్చర్యమేమీ లేదు.

**************************************************************************************************

సాయిబాబా (మత) ద్వేషులది మరో తీరు. ఏదో, ఎవరినో ఉద్దరిస్తున్నట్టు, ప్రపంచానికంతా జ్ఞానజ్యోతులు వెదజల్లుతున్నట్టు ఉంటాయి వీళ్ళవాదనలు. జీవితంలో భరించలేని కష్టాలొస్తే, మళ్ళీ వీళ్ళది అదే త్రోవనే. ఏదో ఒక నమ్మకమో, విశ్వాసమో ఆసరా కావలసిందే. వ్యవస్థీకృతమైన నమ్మకం చెడ్డదని కొందరి చిలకపలుకు. వ్యవస్థీకృతమైన నమ్మకం ఆత్మశోధనకు అడ్డంకి కావచ్చునేమో, కానీ వ్యవస్థీకృతమైన అపనమ్మకం పరమ దారుణమైనది. మనుషులను పశువులుగా మార్చేదీనూ. Truth is not opposite of false, but absence of false అనేది వివేకవంతమైన మాట. అది స్వయంగా ఎవరికి వారు తెలుసుకోవలసిందే. నమ్మకం కనీసం సాంత్వననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు. వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. వాళ్ళమాట వింటే ప్రపంచం మారిపోతుందన్న అల్పభ్రమలో ఉంటారు.

**************************************************************************************************

అయితే సాయిబాబా గురించి ఆలోచనలు వచ్చినప్పుడు దొర్లే కొన్ని ప్రశ్నలు మట్టుకు వేధిస్తూనే ఉంటాయి. Faith begins when logic ends. అని సూత్రం. Is that faith which comes is really a faith? or a subset of FEAR/DESIRE? గౌతమ బుద్ధుని నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకూ శంకను నిరంతర అన్వేషణాపరత్వాన్ని వీడకూడదని బోధిస్తారు. Doubt has a cleansing effect అంటారు కృష్ణమూర్తి. శంక అంటేనే తర్కం పరిధిలోకి వచ్చేది. తర్కాన్ని ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు తర్కం వద్దనుకోవాలి? ఎవరి దగ్గర తర్కాన్ని త్యజించి విశ్వాసం చూపడం మొదలుపెట్టాలి? తర్కం కూడా బుద్ధి పరిధి లోనిదే కదా? దాన్ని తోసిరాజనడం ఆత్మవంచన కాదా?

Logic ను పక్కకు నెట్టేసి ఒక Entity ని నమ్ముతాము అనుకుంటే నా నమ్మకం (FAITH) వెనుక ఉన్నది ఏమిటి? కోరికా? భయమా? లేక ఆత్మార్పణమా? (Total surrender)

భయమూ, కోరికా లేనప్పుడు మనలను (ఆత్మను లేదా మనసును) ఒకరికి అర్పించుకోవడం ఎందుకు? ఆ అవసరమేమిటి?

Master is born when pupil is ready
When the rain comes
grass grows by itself.

అనేది ఒక జెన్ హైకూ. గురువు కన్నా శిష్యుడే గొప్ప, అంతశ్శోధనయే గురువు అని ఈ సాంప్రదాయం. అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

Monday, October 4, 2010

పద్యరచన for dummies

ఈ టపా వ్రాయడానికి నాకున్న అర్హత - అనేకమంది ప్రోత్సాహం, ప్రోద్బలం వల్ల నేర్చుకున్న కాసిన్ని ముక్కలు, నా దిక్కుమాలిన ప్రయోగాలున్నూ. నేను ఏ విధమైన కవిని, పండితుణ్ణీ కానని నాకు తెలుసు. మీకు ఇదివరకే పద్యాలు వ్రాసిన అనుభవం ఉంటే ఈ టపాలో సొల్లును పట్టించుకోకండి. ఇక విషయంలోకి.

దాదాపు ఒకటిన్నర యేళ్ళ క్రితం. ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు చింతా రామకృష్ణారావు గారోమాట అన్నారు. "వచనం వ్రాయడం కన్నా, పద్యం వ్రాయడం సుళువు. బస్సు నడపడం కన్నా రైలు నడపడం సులువు. నియమాలను పాటిస్తూ వెళితే మిగిలిన సంగతి పద్యమే చూసుకుంటుంది అని. అప్పుడాయన మాట నమ్మశక్యం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది.

పద్యరచనలో మెళకువలు, నియమాలు నేర్పడానికి జాలంలో శంకరయ్య గారు, రామకృష్ణారావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు, కామేశ్వర రావు గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు వంటి వారు ఇదివరకే ఉన్నారు. కొన్ని చక్కటి వ్యాసాలు అందం బ్లాగులో రాకేశ్వరరావుగారు వ్రాశారు. ఉపజాతి పద్యాల గురించి పొద్దులో రాఘవగారు చక్కగా వివరించారు. వీటికి తోడు నా అనుభవాలు ఎవరికైనా ఉపయోగపడవచ్చునని ఈ టపా వ్రాస్తున్నాను. ఇందులో కాస్త స్వోత్కర్ష ధ్వనించవచ్చు. అలాగే ఈ చెప్పబోయే విషయాలు సూచనల్లా ధ్వనించినా, నిజానికి అవి నేను అనుకరించిన పద్ధతులు.

మొదట కావలసిన దినుసులు 3.

౧. వ్రాయాలన్న తపన
౨. నియమాలు తెలుసుకోవడం
౩. మంచి గురువు/సలహాలు చెప్పగల వారిని ఎన్నుకోవడం.

రెండవ విషయం - జాలంలో దొరుకుతుంది. అయితే విషయం మీకర్థం అవడం కోసం ఓ పుస్తకంలో మీకు అర్థమయే విధంగా వ్రాసుకోండి. ఈ నియమాలను చూసి భయపడవద్దు, చికాకు పడవద్దు. తప్పులు చేయడానికి జంకవద్దు. ఇంకా వీలయితే మొదట ఓ మాట అనుకుని, దానిని ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించండి.

ఉదా: కాకిపిల్ల కాకికి ముద్దు.

ఇది ఆటవెలదికి దగ్గరగా ఉంది. ఓ గణం (మూడవ గణం), చివరి గణంలో ఓ అక్షరం మాత్రమే లోపం. ఆ మార్పు కాస్తా చేసేద్దాం.

కాకిపిల్ల తల్లికాకికి ముద్దొకొ!

అంతే - ఓ పాదం తయారు!

అత్త లేని కోడలుత్తమురాలు! ఈ వాక్యాన్ని ఒకే ఒక్క చిన్న మార్పుతో ఆటవెలది పాదంగా మార్చవచ్చు. మీకు తెలుసా?

మీకు వ్రాయాలన్న ’తపన’ ఉంటే అదే మీచేత వ్రాయిస్తుంది. నిజం. కానీ మనకు ఈ నియమాలు అవీ చూస్తే చికాకు. ఈ చికాకు, పరాకు పోవాలంటే మీకు ఇష్టమైన విషయంలో మంచి పద్యాలు, వీలయితే చిన్నచిన్న పద్యాలు, తేటగీతి, ఆటవెలది, కందం వీటిలో వ్రాసినవి చదవండి. ఉదాహరణకు - ఓ చక్కని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందం ఎలా ఉందంటే -

నువ్వుపువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురుసవురు జవురు నువిదమోవి
మబ్బునుబ్బుగెబ్బు బిబ్బోకవతివేణి
జగమెఱుంగు దాని జగమెఱుంగు.

ఈ పద్యంలో చిన్నచిన్న పదాలలో అమ్మాయి ముక్కును, పెదవిని, జడను వర్ణించడం చూస్తే ఓ మారు ఆహా అనిపిస్తుంది. (ఈ పద్యం నేను పదవ తరగతిలో ఓ లైబ్రరీలో చదివి భట్టీయం వేశాను. ఈ మధ్యనే ఇది చేమకూరవెంకటకవి విజయవిలాసం లోనిదని తెలిసింది)

అలాగే మీకు పదాలతో కవులు ఎలా ఆడుకుంటారు! ఈ విషయం మురిపెంగా అనిపిస్తే ఈ క్రింది పద్యం స్ఫూర్తినివ్వచ్చు.

ఎందుండి ఎందు బోవుచు
ఇందలి కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేడు కదామ
న్మందిరము ధన్యంబయ్యె మాన్యుడ నైతిన్!

ఈ పద్యం మనుచరిత్రలోనిది. ఇలాంటివి అనేకం దొరుకుతాయి. చదువుతూ ఉండండి. ఇంకా సులువుగా , సమస్యాపూరణలు శంకరయ్యగారి బ్లాగులో ప్రతిదినం ఉంటున్నాయి. వాటిని చదవండి.

ఒక్కోసారి, మన కోపాన్ని కూడా ’తపన’ కింద మార్చుకోవచ్చు. ఉదా: నాకు ’ఫలానా’ కామేశ్వర రావు గారంటే కోపం. ఆయనలా పద్యాలు రాయలేకపోతున్నానని ఉక్రోషం. ఆయన బ్లాగు హిట్లను చూసి కుళ్ళు, వగైరా. ఇప్పుడు ఆ ’స్ఫూర్తి’ తో ఎలాగో కష్టపడి

’మర్రిచెట్టు కలదు మహిలోన ఒకచోట
మర్రిచెట్టుకొక్క తొర్ర కలదు’ - అని గరికపాటి వారు వెక్కిరించిన రీతిలో ఓ పద్యం వ్రాసాను. పైగా ఈ పద్యం తప్పొప్పులు చూడమని ఆయన్నే అడుగుతాను! నా ప్రతీకారం, ఆకాంక్ష రెండూ తీరతాయి! పైగా ఆయన్ను ఇలాంటి పద్యాలతో కాల్చుకు తినదం అన్న పురుషార్థమూ దక్కె.చూశారా, ద్వేష బ్లాగు రాయడం కంటే ద్వేషపద్యం వల్ల ఎన్ని అడ్వాంటేజులో!

నేర్చుకోవాలన్న ’తపన’- చాలా పనులు చేయిస్తుంది. ఈ విషయం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. అంచేత పైన విషయాలు వ్రాశాను.

ఇక గురువు. ఈ విషయంలో చాదస్తం అనుకున్నా పర్లేదు చెప్పాలి. ఒక్కోసారి మంచి గురువు, మీ చేత అద్భుతాలు చేయిస్తాడు, నిజానికి తనేమీ చేయకుండానే. అయితే దీనికి ప్రేమతో కూడిన ఓ బలమైన అభిమానం, నమ్మకం ముఖ్యం. ఈ విషయాలు quantitative కాదు కాబట్టి నిరూపించడం సాధ్యం కాదు. కానీ నా జీవితంలో చాలా సార్లు నాకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ విషయం మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవలసిందే. 

దినుసులు సమకూరాయి.

ఇక మొదలెట్టటం ఎలా? ఇదో భయంకరమైన భూతం. కానీ భూతాన్ని ఎదుర్కోవాలంటే రాకుమారుడు లేదా షాడో లాంటి వీరుడు మొదట దాని వీక్నెస్ ఎక్కడుందో చూస్తాడు. అంటే సమస్యను కుదింపజేయడానికి చూస్తాడు. మనమూ అదే చేస్తే పోలా? ఎలానో క్రమంగా చూద్దాం.

౧. మొదట ఆటవెలది/తేటగీతి పద్యాలు సులువు. వాటితో మొదలెట్టటం మంచిది.
౨. ఏ పద్యం మనకు సులువు? ఇది వ్యక్తులను బట్టి ఉంటుంది. ఒకరికి వర్ణన ఇష్టమైతే ఒకరికి సమస్యాపూరణ ఇష్టం.

సమస్యాపూరణ అనుకోండి. సమస్యాపూరణ చివరిపాదం అయితే అంతకు ముందు ఓ పాదం మాత్రమే వ్రాయండి. ఆ తర్వాత వీలున్నప్పుడు మిగిలిన పాదాలు వ్రాయండి. కుదరకపోతే మీ ప్రయత్నాలు వివరించి గురువులను శరణు వేడండి. వారే మార్గం చూపిస్తారు.

వర్ణన అయితే ఏ పాదానికి ఆ పాదం విడిగా వ్రాసేసుకోడానికి పూనుకోండి. ఉదాహరణకు - పద్యం గురించే రాయాలనుకోండి. ఇలా మొదలెట్టవచ్చు. ఆటవెలది ఎంచుకుందామా?

ఆ.వె:

పద్యము మనసుకును హృద్యముగాఁ దోచు
పద్యము సుమలలిత పద శుభదము
...
...

మిగిలిన రెండు పాదాలు అవే మాటలలో పూరించి ప్రయత్నించి చూడవచ్చు.

అబ్బే! పై పద్యం "నాకొక బుల్లి చెల్లి" ని గ్రాంథికంగా చెప్పినట్టు ఉంది అని మీరనుకోవచ్చు. కానీ "కాకిపిల్ల కాకికి ముద్దు". ఇలా జనులమీద experiment చేస్తేనే మనకు వస్తుంది.

ఇంకాస్త సులువు పద్ధతుంది, అయితే కాస్త తెలివి, ట్రిక్సు కావాలి. ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది. మీ ఎదుట ఇతరులు ’అసలు’విషయం తెలుసుకోలేక మీ పద్యాలను ’ఆహా, ఓహో’ అంటూంటే, భలేగా ఉంటుంది. (నేనిలా బోల్డన్ని రాశాను. :-))

ఉదాహరణకు చాటువుల్లో తిరుపతి కొండమీద ఒకాయన సీసం వ్రాశారు. ప్రతి పాదాంతంలో "కొండ" అని వస్తుంది. నేను అలాగే ప్రతి పాదం చివర్లో "నగరి" అని వాడుకుని పద్యం ప్రయత్నించి సఫలమయ్యాను.

ఇలా తేటగీతులు, ఆటవెలదులు, బ్లాగు జనులమీద ప్రయోగిస్తూ వెళ్ళండి. మధ్యమధ్యలో మన గురువులను సాధ్యమైనంత విసిగిస్తూ ఉందండి. ఇంకా మీ బ్లాగు ఉంది కదా, అక్కడ ఫోటొ, కింద ఓ పద్యం, బాలకృష్ణ, విజయకాంత్ లాంటివారి మీద పద్యాలు, వీలైతే సమస్యా పూరణలు, మీ పాపాయి/బాబు బోసినవ్వు మీద ఓ మాట, ఇంకొన్ని సలహాలు క్రింద.

* ఇతరుల పద్యాలు తీసుకుని, వాటిలో పదాలు మాత్రం మార్చి మీరో పద్యం వ్రాయండి.
* యతి కిట్టించదం కోసం బ్రౌణ్యగ్రంథం వెతకండి. ఉదా: ఇది వరకు పద్యం మీద పద్యం ఉంది కదా. మీకో ఆలోచనొచ్చింది."పద్యము వలన మది ........" తర్వాత రావట్లేదు. ఇప్పుడు -
యతి స్థానంలో "ప", "పం", "పా", "పై", "పౌ", "వ", "వా","వౌ","వై" - వీటితో మొదలయే పదాలు వెతకండి. ఏదో ఓ పదం దొరక్కపోదు!
* వేటూరి పాట, మీకిష్టమైన దాన్ని తేటగీతి/ఆటవెలదిగా మార్చండి. (ఇది నేను చేశానోసారి. మరో ప్రముఖులు కూడా చేశారు.:-))
* మీ దైనందిన జీవితంలో మాటలని పద్యాలుగా మార్చండి. (ఇది చాలా ప్రావీణ్యతనిస్తుంది. నిజం)
* మీరో పద్యపాదం వ్రాశారు. అది చూసి, మీకే "ఏంట్రా ఇది" అనిపించిందనుకోండి. ఫీల్ అవద్దు. కాస్త ఆలోచించి, కుదిరిన చోట్ల అరసున్న పెట్టండి. పద్యానికి హుందాతనం వస్తుంది. నిజమ్.
* చివరిగా - కొంచెం వ్యక్తిత్వ వికాసం టచ్ లో - మీ రచనలను మీరు గర్వంగా ఫీల్ కండి. ఇతరులూ వాటి గురించి అలానే అనుకుంటారు.

Saturday, June 19, 2010

నా పద్య బ్లాగు

ఇంద్ర ధనుస్సు అనే నా పద్య బ్లాగు ఆరంభించి మూలన పెట్టాను చాలా రోజులుగా. దానిని పునరుద్ధరించాలని అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. ప్రోత్సాహాన్ని బట్టి అందులో రాతలను కంటిన్యూ చేస్తాను.

లంకె ఇక్కడ.

Sunday, June 13, 2010

ఇంకొంచెం జపాను

హలో
నమస్తే

నమస్కార

వణక్కం

రాం రాం

కోన్నిచివా

పలుకరింపులెన్నైనా హృదయమొక్కటే. కోన్నిచివా అనేది జపనీసు భాషలో పలుకరింపు.


********************************************
*******************

బెంగళూరు వచ్చిన మొదటి రోజులు. పెన్ గర్ల్ ఫ్రెండు (ఇదివరకటి టపాలో ఆవిడ కాదు) ఓ రోజిలా అంది. "మీ బెంగళూరులో ---- బుద్ధ ట్రస్ట్ అని ఒక జపాను వారి మందిరం ఉంది. మీరక్కడికి నా మిత్రుడని చెప్పి వెళ్ళండి. మీకో జెన్ గురువు పరిచయం కాగలడు. అక్కడ ఉన్న వారి ద్వారా జపాను సంస్కృతి, సంప్రదాయాలు మీక్కాస్త తెలియవచ్చు".

సరే, అప్పుడు బ్రహ్మచారిని కాబట్టి ఓ శనివారం ఎగేసుకుంటూ బీటీఎమ్ లే అవుట్, విప్రో ఆఫీసు వెనుకవైపు అడ్రసు వెతుక్కుంటూ జపాను మందిరం చేరుకున్నాను.


అదో అపార్టుమెంటు!

తలుపు బజ్జర్ నొక్కగానే ఓ జపాను ఆంటీ వచ్చి తలుపు తీసింది. "?" ఇలా నా వైపు చూసింది. నేను ఫలానా అమ్మాయి ఫ్రెండునని ప్రవర చెప్పుకున్నాను. ఆమె "?", "!" గా మారింది. లోనికి ఆహ్వానించింది. అక్కడ సూటు బూటు వేసుకుని ఒకాయన సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఆయన, ఈ ఆంటీ ఏదో మాట్లాడుకున్నారు. సూటుబూటాయన కూడా "!" తో, "దోజో, సువత్తే కుదాసాయ్ నే" (తిట్లు కాదండి- ఇంద, రండి కూర్చోండి- అని అర్థం) అంటూ నాకు స్వాగతం పలికేడు. ఆ సూటుబూటాయన్ను"ఈయనే గురూజి మకెయ్ సాన్" అంటూ ఆంటీ నాకు పరిచయం చేసింది. ఈ సారి "?+!" నా వంతైంది.

నిడుపాటి గడ్డం, జడలు కట్టిన జుత్తూ, దండకమండలాలూ - ఇవి లేకపోయినా మానె. ఓ కిమోనో తగలెట్టుకుని ఉండవచ్చు కదా జపనీసు గురువు అని నాకు అనిపించింది. అయితే ఆయన మాట, మంతీ మహా సున్నితంగా ఉన్నాయి. (Unlike the traditional zen masters!) పైపెచ్చు ఆయన అమాయకుడిలా కనబడ్డాడు నాకు. (ఎందుకో మీకు తెలుస్తుంది)


కాసేపు తర్వాత అందరూ నార్మల్ స్టేట్ కొచ్చాము. ఆ గది పరికించి చూస్తే - ఎదురుగా ఓ పెద్ద బల్లపై బుద్ధుడి ప్రతిమ, దానికింద అగరొత్తులూ, బిస్కెట్లు, కుకీస్ వంటి ప్రసాదాలు, పూలు -ఏదో పూజ జరిగినట్టు సూచిస్తున్నాయి. ఓ మూల నిలువెత్తు గుఱ్ఱం బొమ్మ, మరో మూల పిల్లి బొమ్మ, కుండీలలో చెట్లు (బోన్సాయ్) అనుకుంటాను.అలా ఉంది. ఇంతలో ఆ జపాన్ ఆంటీ టీ, బిస్కట్లు తెచ్చి పెట్టింది. ఆ టీ - కషాయానికి చెల్లి మన టీ కి అక్క. టీ తో బాటు బిస్కట్లు ఎందుకు పెడతారో నాకు తెలిచి వచ్చిన క్షణమది. కాసేపు మాట్లాడిన తర్వాత ఆవిడ ఇదుగో ప్రసాదం అంటూ దాదాపు పావుకిలో పరిమాణంలో రెండు తగరపు పాకేజీలిచ్చింది. బయటపడి హాస్టలుకొచ్చి, ఆ పాకేజీలిప్పాను. అందులో - కమ్మటి పులిహోర, చక్కెరపొంగలి! అవి వారికెలా దొరికాయి, అదీ అని వచ్చిన ఆలోచనను, వాటి పరిమళాలు మింగేసినయ్. రూము గడివేసి, ఒక్కణ్ణె ఆ రెండు డబ్బాలూ లాగించేను. (ఇలాంటివి దొరికినప్పుడు హాస్టల్లో గడి వేసుకుని తినడం స్ట్రిక్టుగా నేను పాటించే ఓ నియమం).


తర్వాతి వారం.

జపనీసు ’సంప్రదాయాన్ని’ ఇంకా తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాను. ఈ సారి తలుపు ఓ అమ్మాయి తీసింది. ఆ అమ్మాయి అచ్చం ఇలా ఉంది.


ఈ సారి, "?", "!", ఇవేవీ నన్ను బాధించలేదు. లాస్ట్ సమురాయ్ సినిమాలో ఓ పిల్లవాడు టామ్ క్రూయిస్ తో "నువ్వు బుద్ధి ఉపయోగించి యుద్ధం చేస్తున్నావు. ఏవీ ఆలోచించక యుద్ధం చెయ్" అంటాడు. (అశొచ్యానన్వశోచస్త్వం ..టైపు). జెన్ ప్రిన్సిపుల్ అది. నేనూ ఆ అమ్మాయిని చూసి నేను ఓ క్షణం ఏవీ ఆలోచించలేదు.

తేరుకున్నాక అమ్మాయికి నేను ఇందాకటి ప్రవర చెప్పుకున్నాను. ఆమె చిన్నికళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయాయి. నన్ను ఆమె నవ్వుతూ ఆహ్వానించింది.



ఆమెకు నేను ఇదివరకే నా పెన్ ఫ్రెండు ద్వారా తెలుసట. ఎంచేతో ఆ అమ్మాయి తెగ ఆశ్చర్యపడిపోతున్నట్టు అనిపించింది నాకు. మాటిమాటికి జపాను పద్ధతిలో దణ్ణం పెడుతూ ఉందామె. అలా ఎందుకు దణ్ణం పెడుతున్నావని అడిగేశానామెను. అది దణ్ణం కాదని, వినయమని, కుడి చేయి పిడికిలి, ఎడమ అరచేతిలో బిగించే ముద్ర, కడుపులో పాపాయిని సూచిస్తుందనీ - ఇలా ఏవో చెప్పిందా అమ్మాయి. ఈ సారి ఆంటీని, గురూజీని నేనెక్కువగా మాట్లాడించలేదు. వారు ఏదో పనుల్లో ఉండి అంతగా పట్టించుకోలేదు. టీ, బిస్కట్లు మామూలే. ఈ సారి జపాను ’సంప్రదాయం’ దొరకలేదు.


******************************************** **********************

నా రూములో ఏదో గూడుపుఠానీ జరుగుతున్నట్టు హాస్టల్లో ఒకరిద్దరు కనిబెట్టారు. దాంతో విషయం కొంత బయటకు పొక్కింది. తర్వాతి వారం నేను, పక్క రూమువాడు వాడి బండిలో బయల్దేరాము. అక్కడికెళ్ళిన తర్వాత మరో ముగ్గురు చేరారు. నేను సైన్యాధ్యక్షుడిలా కోటవైపు అడుగుపెట్టాను.

ఈ సారి మళ్ళీ ఆంటీ. నా ఫేసు ( @_@ ) లా అయ్యింది. cherry blossoms కోసం నా కళ్ళు గాలించేయ్. దొరకలేదు. ఊరెళ్ళిందట ఆ అమ్మాయి, నాతో మాటవరసకైనా చెప్పకుండా. ఇంతలో ఓ బృందం వచ్చిందక్కడికి. అందరూ హడావుడిగా ఓ ఫంక్షన్ కోసం ప్రిపేరు అవసాగారు.
ఆ రోజో జపాను పండుగట.

ఆంటీ అక్కడ చేరిన వారితో ఒక్కొక్కరితో నూరు రూపాయలు (నాతో ఐదొందలు, నా మిత్రులందరివీ కలిపి) ఇప్పించుకుంది. మకెయ్ సాన్ వచ్చారు. మమ్మల్నందరిని వరుసలలో నిలబెట్టారు. ఏవో మంత్రాలు చదువసాగారు మకెయ్ సాన్. ఆయన పక్క ఓ ఇండియన్ అమ్మాయి, ఆయన ఆజ్ఞల ప్రకారం మమ్మల్ను అప్పుడప్పుడూ నేలపై సాగిలపడమని, పంచప్రతిష్టితం (kneel down) చేయమని అంటూంది. మా ఫ్రెండ్సందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ ప్రహసనం ముగియగానే ఆవిడ - "మీరందరు ఇక నిర్వాణానికి (enlightenment) అర్హులు. అభినందనలు" అంటూ విశాలంగా నవ్వింది. ఇంకో ముక్క చెప్పింది. జీవితంలో ఏదైనా కొట్టుకుపోయే సమస్య వచ్చినప్పుడు, "మితాయ్ బుత్సు మొరొకొ" అనుకోవాలిట. అప్పుడా సమస్య సమిసిపోతుందట. అయితే ఈ ఆఫర్ ను జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవాలిట.

(నేను ఓ పదిహేను సార్లు ఆ మంత్రం వాడుకున్నానని లీలగా గుర్తు. ఓ సీక్రెట్ కూడా తెలిసింది. ఆ మంత్రం ఒక్కసారికంటే ఎక్కువసార్లు కూడా పనిచేస్తుంది!)


అయితే ఆ జపనీసు ’సంస్కృతి’,’సంప్రదాయాల’ వల్ల మా హాస్టల్లో నాకు ఏదీ ఒరగకపోగా, నన్ను చూసి కొన్ని రోజులు నవ్వుకున్నారు.
ఆ తర్వాత నాకు ఆ విషయాలపై ఆసక్తి తగ్గిపోయింది.

Wednesday, June 9, 2010

కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ

మొన్నామధ్య బీహారీ బాసురుడు కంపెనీకెవడో హెడ్డాపీసు నుండి వస్తే, వాడితో నానాబాధలు పడి "యే క్యా హరాకిరీ హై" అంటూ వాపోయాడు. హరాకిరీ - ఆ మాట వినగానే ఒకప్పుడు నేను వెలగబెట్టిన జపనీసు గుర్తొచ్చింది.

"హరాకిరీ" అనేది జపనీసు మాట. హరా అంటే బొడ్డు (navel), ఇంకో అర్థం పువ్వు. కిరిమాసు అంటే కత్తిరించటం, కోయటం లేదా పొడవటం. జపనీసు క్రియాపదాలన్నీ విడిగా అయితే మాసుగా ’మాసు’తో ముగుస్తాయి. మనకు ’ట’ తో ముగుస్తాయిగా అలాగన్నమాట. (ఉదా: లేయుట, మింగుట, పరుండుట ) జపనీసులో అయితే, ’ఇకిమాసు, కిమాసు, హజిమెమాసు ఇలా. నామవాచకంతో కలిసినప్పుడు మాసు లుప్తమవుతుంది.

ఈ హరాకిరీ అన్నమాట ఎలా వచ్చిందంటే సమురాయ్ ల గురించి తెలియాలి. సమురాయిలు జపాను యోధులని మనకు తెలుసు. ఈ రాలుగాయిలు యుద్ధంలో ఓడిపోతే, ఏదో ఓడాంలే అని ఊరుకోక, ఫీలయిపోయి, తమ షోగన్నులతో (షోగన్ను అంటే షో గన్ను కాదు, పొడుగాటి కత్తి. సుజుకి షోగన్ అనేదదే) తమే పొడుచుకు ఛస్తారు. అదియొక చమత్కారము! బతికుంటే బలుసాకు తినచ్చులే అనుకోక ఇలా ఛావడమేమిటో మరి. వెధవ ఫిలాసఫీలు, వెధవ పీడ!

పై విషయం మనం ’లాస్ట్ సమురాయ్’ సినిమాలో చూస్తాం(శాం). ఆ చచ్చే ప్రాసెస్ పేరు ఈ హరాకిరీ. ఈ పదం ఇంత దూరం వచ్చి, మన దేశంలో ఎలా తిష్టవేసుక్కూచుందో తెలిసి ఛావట్లేదు. ఇలాంటిదే మరొక మాట, కిరికిరి. దీనర్థమేంటో, దీని వెనక యే కథుందో ఏమో నాకు తెలీదు.

వాళ్ళమాట మనకు వచ్చి చేరినట్టు, మన మాటొకటి అక్కడ చేరుకుంది. అది ’సేవ’. అవును సేవ అనేపదం, జపాను భాష (నిహోంగొ) లో అదే అర్థంలో ఉన్నది. ఇప్పుడు ఆ పదాన్ని వాక్యంలో ప్రయోగించి మీ సహనాన్ని కొద్దిగా పరీక్షిస్తాను, ఏమనుకోకండి.

"ఇరోఇరోయిన ఓ-సేవాని నరిమాషిత. అరిగతో గొజైమాసు" (రకరకాల సేవలను పొందాను.కృతజ్ఞతలు).

మీరు కాస్త పట్టిచూస్తే ఇరోఇరోయి=రకరకాల ఒకేరకంగా ఉన్నాయని గ్రహిస్తారు. చెప్పొచ్చేదేమంటే, వాళ్ళభాష structure తెలుగుకు కాస్త దగ్గర.

లాస్ట్ సమురాయ్ సినిమా గురించి కాస్త మాట్లాడుకుందాం. అందులో టామ్ క్రూయిసు గాడు యుద్ధంలో గాయపడి జపానోళ్ళ ఇంట్లో వచ్చి పడతాడు, తంతే బూరెలగంపలో పడ్డట్టు. వాడికి తను పూర్వాశ్రమంలో రెడ్ ఇండియన్ పిల్లవాణ్ణొకణ్ణి చంపినట్టు గుర్తొస్తూ ఉంటుంది. ఆ చచ్చిన పిల్లాడి పేరు సాకే. టామ్ క్రూయిస్ సాకే, సాకే అని పలవరిస్తుంటాడు. సాకే అంటే జపనీసులో వరితో చేసిన సారాయం. వీడి కలవరింతను అక్కడవాళ్ళు అలా ఇంటర్ ప్రెట్ చేసుకుని వాడికి సారా తెచ్చి పోస్తుంటారు.

ఆ సాకేను కొరియాలో సోజు గా పిలుస్తారు. నేను దాన్ని ఓ గుటక వేశాను. బాగా వేడిచేసిన ఓ చిన్న నిప్పుగోళాన్ని మింగినట్టు అనిపించింది. కంపు వాసన దాని అడిషనల్ క్వాలిటీ.

ఆ సాకే తయారు చేసే వారు పురాతన జపానులో ఓ పల్లె వద్ద నివసించేవారు. ఆ పల్లె ఇప్పుడో పెద్ద పట్టణం. దానిపేరు ఒసాకా. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒకాయన, 1947 లో ఓ సంస్థ నెలకొల్పాడు. అదే ఇప్పటి సోనీ.

జపాను వారి పేర్లన్నీ ప్రకృతికి సంబంధించినవై ఉంటాయి. నాకో పెన్ గర్ల్ ఫ్రెండు ఉండేది. ఆ అమ్మాయి పేరు చిహారు అని ఏదో వస్తుంది. దానర్థం - వేయి వసంతాలు అనట. ఆమే చెప్పింది.

ఇంతకూ టైటిలు సంగతేమంటారా? అదేమంటే - జపాను వారి ఓ క్యాండీ ఉంది. చాక్పీసులా ఉంటుంది. దాన్ని ఏ భాగంలో అడ్డుగా కోసినా, కనబడే గుండ్రటి తలంలో, మనిషి ముఖం ఉంటుంది. కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ అంటే, ఎక్కడ కోసినా, ఒకే ముఖం అని. (కెవొ - ముఖం, కిత్తెమొ - కోసినా). ఈ మధ్య ఓ జపానెళ్ళిన ఫ్రెండొకడు ఆ క్యాండీ తెచ్చాడు. అది చూడగానే దానికి సంబంధించిన కథ, ఏదో చదివినట్టు లీలగా అనిపించింది. ఇదుగో ఇప్పుడు గుర్తొచ్చిందది.

ఇప్పుడో మణిప్రవాళ కందం. (బొత్తిగా సంకరం అంటే బావుండదు, అందుకని ఆ పేరు)

లత్తుక జపాను భాషను
’కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ’ అని అంటే
కత్తెర వేసిన చోటుల
తిత్తెరి! కనబడిన ముఖమె తిరిగి కనపడే.

లత్తుక జపాను ఎందుకంటే ఎర్రని సూర్యుడి చిహ్నం కాబట్టి.

అన్నట్టు జపనీసులో అమ్మానాన్నలను ’చిచి’, ’హహ’ అంటారు. తల్లిగారు, తండ్రిగార్లను ’ఒకాసాన్’, ’ఒతోసాన్’ అంటారు.

జపాను వార్తలు ఇప్పటికి సమాప్తం. ఇంకొన్ని మళ్ళీ ఎప్పుడైనా.
ఒ యాసుమి నాసాయ్. (ఇదేదో నాశనమైపో అన్న తిట్టు కాదండి. ప్యూర్ ట్రాన్సిలేషన్- సుఖ నిద్రాప్రాప్తిరస్తు)
సయోనర.

Tuesday, December 29, 2009

పులిహోర

"అప్పన్నా!నీ బుద్ధిలో దద్ధోజనం పసేగానీ పులిహోర ప్రభావం రవంత కూడా కనిపించలేదురా!" అంటారు తాతాచార్యుల వారు శిష్యపరమాణువు అప్పలాచార్యుల వారితో, తెనాలి రామకృష్ణ సినిమాలో.

అవును, వేణుగోపాల స్వామి వారి కోవెలలో అప్పనంగా వచ్చే ప్రసాదం అయినంతమాత్రాన పులిహోర ప్రభావం తక్కువ కాదు. అసలు సిసలు పులిహోర అంటేనే - గమ్మున ఆ నేతిసువాసన గుబాళించాలి. నాలుకకు తగులగానే కారంతో కూడిన రుచి నషాళానికంటాలి. ఆ తర్వాత ఏ ఆనందలోకంలోనో విహరించాలి. పులిహోరలో అద్వైత సిద్ధాంతం దాగుందనడంలో సందేహం లేదు. మొదట పంచేంద్రియాలను, ఆ తర్వాత దాన్నధిగమించి జ్ఞానేంద్రియాన్ని పరిచయం చేస్తున్న పదార్థమనే కాబోలు - వైష్ణవ దేవాలయాల్లో ఇందుకు పెద్దపీట! మొన్నటికి మొన్న తిరుపతికెళ్ళినప్పుడు స్వామి వారి ఉచిత ప్రసాదం పులిహోర దొరికింది. చెప్పొద్దూ, కాసేపు వైకుంఠం ఇన్ ఎ నట్ షెల్ కనిపించింది.

నూడుల్స్ రాకమునుపు ఇది కూడా బాచిలర్స్ అమ్ములపొదిలో ఒక అస్త్రం. ఇది నిజం. అన్నమొకటి వార్చేసుకుని, అమ్మ తన ప్రేమను కూడా కలిపి గట్టిగా మూతెట్టేసిన జాడీలోంచి, కాస్త గుజ్జు, అందుకు తోడుగా నెయ్యి కలుపుకుంటే - ఆ పూట ఆత్మారాముడు అనంతంగా శాంతించేవాడు. ఆ తర్వాత ఫలశృతికి పెరుగూ ఆవకాయ ఉండనే ఉన్నాయి.

ఉన్నట్టుండి ఈ రోజెందుకిలా పులిహోర పైత్యం? అంటే - ఉందండి. మా ఫ్రెండు, ఆఫీసులో నా కొలీగు విఠ్ఠల్ అగార్కర్ చాలా యేళ్ళ తర్వాత కన్నడ పులిహోర రుచి చూపించి నన్ను శిఖరం ఎక్కించాడు. ఆ అబ్బాయి వంటల్లో ఘనాపాఠీ. ఓ సారి విదేశానికి ఆన్ సైటు వెళ్ళినప్పుడు నాకు రూమ్మేటు. చిత్రంగా అతడికి మా ఇంటి అధరువులు తెగనచ్చాయి అప్పట్లో. నాకు మాత్రం ఆ అబ్బాయి వంటలు తెగ నచ్చేసేవి. ఓ శిల్పి శిల్పం చెక్కుతున్నట్టుగా వంట చేసేవాడతను.

కాలేజీ రోజుల్లో మా అమ్మ పులిహోర క్యారియరు కట్టించేది. (నేను డే స్కాలర్ ను) ఆ ఘుమఘుమలు అలా సోకంగానే నా మిత్రులు అలా దాని మీద పడి ఖాళీ చేసేవారు. చింత చచ్చినా పులుపు చావనట్లు, చిన్నతనం అయిపోయినా చింత చిగురు, పులిహోర జ్ఞాపకాలు వదలకుండా వేధిస్తూ ఉంటాయి నన్ను. అమ్మ గోరుముద్దల్లో నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది ఈ చింతచిగురు పప్పు అన్నమే. సంగటితో ఈ పప్పు కలుపుకుంటే - చింతాకు జితా జితా అనుకోవాల్సిందే. (ఈ చింతచిగురు పప్పు ఇప్పుడు ఎవరూ చేయట్లేదనుకుంటాను)

మా వూళ్ళో దీన్ని పులగం అని కూడా అంటారు. ఈ పులిహోర లో పులి నేతిబీరకాయ లోనేతి లా కాకపోయినా చిన్నసైజు ముద్రారాక్షసమో టైపాటో లాంటిదే. అది నిజానికి "పుళి". పుళి అంటే తమిళంలో పుల్లనిది. (ఆమ్లము). చింతపండును కూడా పుళి అనే అంటారు. గోంగూరను తమిళంలో పుళిచ్చకీరై అంటారు(ట). అదుగో ఆ పుళి, పులిలా మీదబడి అంటుకుంది. "హోర" ఎలా వచ్చిందో మరి తెలియదు నాకు. పుళియ ఊర - పుళిహోర అయిందా?

కన్నడంలో పుళి - హుళి కావాలి. అయితే ఆ హుళి హుళక్కి అయిపోయి, పులిగానే మిగిలిందెందుకో మరి.

ఈ పులిహోర ఉరఫ్ పులగం కన్నడ వారిదేనేమో అని నా ఊహ. "తింత్రిణీ పల్లవ యుక్తమౌ ఉడుకుబచ్చలి శాకము" - గుజ్జు కాకపోయినా (తింత్రిణీ పల్లవం అన్నారు కాబట్టి) తింత్రిణీ ఫలావిష్టమైన శాకాలు కూడా ఇదే ప్రాంతానికి చెందినవై ఉండవచ్చు. వైద్యానికి పనికి వచ్చే కాయ అని ఒకప్పుడు ఈసడించబడినా, శ్రీవారి కొలువులో ప్రసాదం దాకా దీని ప్రస్థానం సాగింది కనుక దీని ప్రాభవాన్ని విస్మరించడానికి వీలు లేదు.

ఆ పద్యం ఓ సారి పునశ్చరణ

ఫుల్ల సరోజ నేత్ర! యలపూతన చన్నుల చేదు ద్రావి, నా
డల్ల దవాగ్ని మ్రింగితి వటంచును నిక్కెద వేమొ! తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన యొక్క ముద్ద దిగమ్రింగుమ! నీ పస కాన నయ్యెడిన్.

నా చిన్నప్పుడు మా ఊళ్ళో శ్మశానం దగ్గర ఓ చింతచెట్టు ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతం కాస్త నిర్మానుష్యంగా ఉండేది. నేనూ, నా స్నేహితులు "అతడు" సినిమాలో చూపించినట్లుగా పందేలయితే వేసుకోలేదు కానీ, మాట్లాడుకునే వాళ్ళం, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళగలిగే ధైర్యం ఎవరికుందా అని. నేనప్పట్లో పిరికి వాడిని అయినా ఓ రోజు సాహసం చేసి, మరీ రాత్రి పూట కాకపోయినా కాస్త వెలుగు రేకలు పర్చుకుంటున్న సమయంలో దీర్ఘశంక కోసం ఆ చెట్టు దరిదాపులదాకా వెళ్ళిన గుర్తు.

ఎవరు రాశారు, ఏమిటి గుర్తు లేదు కానీ ఓ సంస్కృత చాటువు గుర్తొచ్చింది.

మేరుమందరసమానమధ్యమా
తింత్రిణీదళవిశాలలోచనా |
అర్కశుష్కఫలకోమలస్తనీ
పెద్దిభట్టగృహిణీ విరాజతే ||

మందరపర్వతం లాంటి నడుమూ, చింతాకులా విశాలమైన కన్నులూ, ఎండిన జిల్లేడుకాయల్లాంటి ఉరోజాలు కలిగి ఉన్నది పెద్దిభట్ట వారి గృహిణి అని అర్థం. ఇంత వ్యంగ్యం ఎందుకు రాశారో మరి.

(చాలా రోజుల తర్వాత సోది చెప్పుకోవాలనిపించి రాసిన కబుర్లివి. ఇంతటితో సమాప్తం.)

Sunday, September 6, 2009

నా కొత్తబ్లాగు!

నా కొత్తబ్లాగు ఇక్కడ చూడండి. కూడలికి ఇదివరకే జోడించబడింది.

Friday, August 21, 2009

నూరు టపాల సింగారం

ఎట్టకేలకు....నేనూ హండ్రెడ్ షాట్ వాలా సరం పేల్చాను.

రెండేళ్ళు కావస్తూంది, బ్లాగ్లోకంలో అడుగుపెట్టి. నేను బ్లాగు మొదలెట్టిన విధంబెట్టిదనిన .......... మామూలే. ఆదివారం ఈనాడు అనుబంధం చదివి. చదవగానే బాడీ లో మూవ్ మెంట్స్ వచ్చాయి. ఆవేశం తన్నుకొచ్చింది, అదీ కాక ఆ వ్యాసంలో డాక్టర్ ఇస్మాయిల్ గారని మా సీమ డాక్టర్ బ్లాగు గురించి రాశారు! తట్టుకోలేక జూనియర్ ఎన్ టీ ఆర్ "ఆది" సినిమాలో లాగా, "ఎన్నాళ్ళిలాగ", "ఎన్నాళ్ళిలాగ" అని మనసు ఆక్రోశించింది. జనాలు నా రాతలు మిస్ అవుతున్నారు కదా అన్న భావన కుదిపేసింది. (అక్కడికి నా సోది వినడానికిక్కడ అందరూ కాసుక్కూర్చున్నట్టు) ఏదో చేసెయ్యాలి అని ఊగిపోయాను. ఆఫీసుకెళ్ళి చూస్తే అక్కడ బ్లాగర్.కాం వంటి తుచ్చమైన వాటికి పర్మిషన్ లేదు!

ఆ తర్వాత 2007 ఆగస్ట్ లో ఆన్ సైట్ తగిలింది. వాడుకోడానికి లాప్ టాప్ ఇచ్చారు ఆఫీసుగాళ్ళు. రూమ్ లో ఇంటర్నెట్ ధారలై ప్రవహిస్తూంది. అంత ఇంటర్నెట్ తేరగా దొరికే సరికి ఓ రెండు రోజులు అందరు మగాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ తేరగా దొరికితే ఏం చేస్తారో ఆ పనులు చేసి, విసుగెత్తి, బ్లాగుల గురించి చూశాను. త్రివిక్రం గారి బ్లాగు మొట్టమొదట తగిలింది. ఆ తర్వాత రాధిక గారి స్నేహమా బ్లాగు. అంతకు ముందు ఇస్మాయిల్ గారి గురించి విన్నారుగా. ఇదిగోండి, ఈ ముగ్గురే నేను బ్లాగడానికి మూలకారణమైన త్రిమూర్తులు. రానారె, ప్రవీణు, కొ.పా గారు, తదితరులు మొదట్లో రాసిన సోదంతా చదివి ప్రోత్సహించారు. మేధ (నాలో నేను) కూడా ఇంచుమించు అదే టైం లోనే బ్లాగులు మొదలెట్టారనుకుంటా. కాబట్టి ఆమె ఏమి రాస్తున్నారో చూసేవాణ్ణి రెగ్యులర్ గా.

సరే బ్లాగుకు ఏం పేరు పెడదామా అని "నీహారిక" అని డిసైడ్ చేసి, ప్రయత్నిస్తే, ఆ పేరుతో ఎవరో బ్లాగేస్తున్నారు. ఆ తర్వాత "హరివిల్లు", "ఉత్పలమాల" ఇలా ప్రయత్నించి, అవేవి కుదరక, చివరికి మాస్ టైటిల్ ప్రయత్నిస్తే, గూగులమ్మ ఓకే అంది. అదీ టైటిలు కథ.


రాద్దామనుకున్నది పేరడీలు. సినిమా రివ్యూలు. (నాకు కూసింత అనుభవం ఉండేది వాటిలో. మా మిత్రుల వెబ్ సైట్లు బలయ్యాయి నా రాతలకు) ఇప్పుడు రాసేవి చూస్తే, మళయాళం క్లాసిక్ సినిమా కథలా నా రాతలు నాకే అర్థమయి చావడం లేదు.

చాలా రోజులు ఆఫీసులో ఆఫీసుటైం లో బ్లాగిన తర్వాత (ప్రాక్సీ కనుక్కుని, దాని ద్వారా లాగిన్ అయి), మొన్నామధ్య మార్గదర్శిలో చేరకుండానే ఓ లాప్ టాప్ కొనుక్కున్నాను. అదీ నా సెల్ఫ్ డబ్బా.

వెనక్కి తిరిగి చూసుకుంటే -


ఈ రెండేళ్ళలో, కొన్ని నవ్వులు, కొన్ని చమక్కులు, ఇంకొన్ని చురుక్కులు, కొంచెం అమాయకత్వం, కొంచెం ఆస్తికత, కొంచెం తిరగబడ్డ ఆస్తికత్వం, అస్తవ్యస్తమైన ఆలోచనలు, కుదురుగా ఉండలేని తలబిరుసుతనం,
జ్ఞాపకాల అల్మారాలో వెలికితీతలు, హృదయమనే భూగర్భంలో నుంచి తవ్వుకున్న అనుభూతుల జలాలు,

"పుస్తకం" లో వెలగబెట్టిన కబుర్లూ..

అబ్బో.... నా రేంజుకంటే చాలా ఎక్కువే వెలగబెట్టాను!!

నిజానికి నా రాతల్లో చాలా తప్పులు నాకే కనిపిస్తాయి. అవి అలా ఉంటేనే బావుంటుందని నా అవుడియా.


నన్ను అనవసరంగా రాతగాణ్ణి చేసి, నా సోది ఓపికగా విన్న వారికి, వింటున్న వారికి, ప్రోత్సహించిన, ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు (బిల్ కుల్ ముఫ్త్). వీవెన్ గారికి కృతజ్ఞతలు. ఈ రెండేళ్ళలో రెండు సార్లు మాత్రం, ఎందుకొచ్చిన సోది, మానేద్దామనుకున్నాను. తిరిగే కాళ్ళు, తిట్టే నోరు ఊరుకోవు అని సింద్ బాద్ చెప్పినట్టు,మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాను. బ్లాగులు అన్నవి తెలియక ముందు, రాయలసీమ వాణ్ణి అని చెప్పుకోవాలంటే - ఓ గోళీలాట ఆటగాడు, క్యారమ్స్, బిలియర్డ్స్ ఆటగాళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయే వాణ్ణి. ఇప్పుడు షర్ట్ కున్న ఓ బటన్ విప్పేసి చెప్పుకుంటున్నాను, నేనో సీమ బ్లాగరిని (రచయితను కాకపోయినా) అని.

అన్నట్టు నా సోది రాతల వల్ల కొందరు సహృదయులను కలిసే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టం. ఇంకా బ్లాగర్లు సాధ్యమైనంత మందిని కలవాలని ఉంది. చూడాలి.


(టపాలో వాడుకున్న ఫోటోలకు మోడల్ - సంహిత అనే దుండగురాలు

వయసు - సరిగ్గా యేడాది.

చేసే పనులు - బొమ్మల తలలు, కాళ్ళు విరగ్గొట్టటం,
ఈనాడు పేపర్ రాగానే చింపెయ్యటం,
కొత్త గౌను మీద నీళ్ళు పోసుకోవటం,
మట్టి, చెప్పులు, పరక, ఇలాంటి వాటితో ఆడుకోవడం,
లాప్ టాప్ మీదెక్కి చిచ్చిపోయటం,
నాన్న సులోచనాలను (కళ్ళజోడు) లాగి విసిరెయ్యటం వగైరా..)