చాలా యేళ్ళ క్రితం ఉద్యోగం దొరికిన కొత్తల్లో రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో నరేంద్రుడనే అతను అనేక యాత్రలు జరిపి, చీనా దేశానికి చేరుకుని అక్కడ అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ మరణిస్తాడు. అతడి వృద్ధాప్యంలో అతననుకుంటాడు. "ప్రజలు దీనులూ, దరిద్రులూ అయితేనే కదా, వాళ్ళకు సేవ చేసే అవకాశం లభించేది నాకు? అంటే పరోక్షంగా వాళ్ళు దీనులు కావాలని కోరుకుంటున్నానన్నమాటే కదా?" - ఈ వాక్యాలు చాలా కాలం గుర్తుండిపోయాయి.
మన మంచితనం వెనుక ఉన్నది స్వార్థమా? నిస్వార్థమా? అని ఓ అవిశ్వాసమూ, అపోహా నాకు. ధనసాయం కానివ్వండి, మాటసాయం కానివ్వండి, నైతిక మద్దతు కానివ్వండి, ఎంత ప్రతిఫలాపేక్ష ఆశించకపోయినప్పటికీ, మనుషులు చేసే మంచిపనుల్లోనూ అంతర్లీనమైన స్వార్థం ఉండకపోదని చాలాసార్లు అనిపిస్తుంది. స్పష్టంగా ఫలానా అని చెప్పలేకపోయినా, ఏదో అంతర్లీనమయిన స్వార్థం మటుకు ఉండి ఉండాలి.
కొన్నేళ్ళ క్రితం నాకో సహోద్యోగి ఉండేవాడు. చాలా ధనవంతుడు. ఉద్యోగం నామమాత్రమే. మామిడి తోటలూ, అవీ ఉండేవి వాడికి. వాడి భార్యా, ఉద్యోగస్తురాలే. DINK సంసారం. చీకూ చింతల్లేవు. ఆఫీసు వాళ్ళు ఏదైనా చారిటీ కార్యక్రమాలు అవీ ఏర్పాటు చేస్తే, వితరణల్లో వాడి పేరు మొదట నిల్చేది. వేలల్లో ఖర్చు పెట్టేవాడు. అయితే కారులో వెళుతూన్నప్పుడు మధ్య కూడలిలో ఎవరైనా అనాథలు కనబడితే చాలా అసహనం ప్రదర్శించేవాడు. నాకు అతగాణ్ణి చూసి విచిత్రం అనిపించేది.
ఓ రోజు నాకూ ఓ సందర్భం ఎదురయ్యింది. కాలు చెయ్యి బావున్నా, మాసిపోయిన గడ్డమూ, చింపిరిజుత్తూ ఉన్న ఒకతను చాలా దీనంగా అడుక్కుంటూ వచ్చాడు మా ఇంటిదగ్గరకు. అతడి కొడుకు చిన్నపిల్లాడట. భార్య రోగగ్రస్తురాలట. అతడు ఏదో పని చేసుకునే వాడు, కానీ పని వదిలేసి ఇలా ప్రత్యక్షమయాడో రోజు. అతణ్ణి చూడగానే సహాయం చెయ్యాలనిపించింది, కానీ తటపటాయింపు. ఆ డబ్బు అతడు తాగటానికి ఖర్చుపెడతాడేమో, లేకపోతే, అదంతా నాటకమనో ఇలా. అదే ఆఫీసు వాళ్ళో, మరొకళ్ళో ఎవరైనా డొనేషన్ అడిగితే ఆ అనుమానాలు రావు!. దానికి కారణం - ఎక్కడో, ఏ మూలనో "దానం చెయ్యడం" కన్నా, "నేను" దానం చేస్తున్నానన్న భావన మనకు ముఖ్యం. ఇది మంచితనమా? స్వార్థమా?
(అతడిది నాటకం కాదని, అతడు నిజమే చెబుతున్నాడని తెలిసింది ఆ తర్వాత. అయితే తెలుసుకునేసరికి అతడి భార్యా, పిల్లాడు పోయారు. అతనూ పోయాడు కొన్ని రోజులకు)
నైతిక మద్దతు (moral support) కూడా అలాంటిదే. మొదట నైతిక మద్దతు ఇచ్చేందుకు ఎగబడతాము, అవతలి వాడు బాగుపడిన తర్వాత, నా వల్లే అతడు బాగుపడ్డాడని చెప్పుకోవడానికి సందేహించము. ఎవరైనా మనకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తున్నారంటే, అది వారు మనతో అనుబంధం పెంచుకోవడానికి ఇస్తున్న అవకాశం తప్ప, వారి బలహీనత ఎంతమాత్రం కాదు.
కుటుంబసంబంధాలు పరస్పరం ఇలానే ఉండేవి క్రిందటి తరం వరకు. నా చిన్నతనంలో మా చిన్నాన్నలూ, మామయ్యలూ, ఇతర బంధువులూ ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆ తర్వాత తీర్చేయడాలూ, చాలా సాధారణంగా ఉండేవి. వాళ్ళలా ఉంటే, ఇప్పటి తరం వాళ్ళమయిన నేనూ, మా అన్నయ్యా, మా కజిన్స్ మాత్రం ఒకరిదగ్గర ఒకరు సహాయం అడగడం నామోషీగా భావిస్తున్నాం. నేను ఓ సారి అవసరమొచ్చినప్పుడు సిటీబ్యాంకు వాడి దగ్గర లోనుకెళితే, ఇంకొకరు సహాయం అవసరమని మాటవరసకైనా చెప్పరు. మా ఇంట ఏదైనా పండుగో పబ్బమో వస్తే, మా అత్తలూ, పిన్నమ్మలూ, ఇతరత్రా అందరూ వచ్చి కలిసికట్టుగా వంటపనుల్లో పాల్గొని పనులు చూసుకునే వారు. ఇప్పుడు మాత్రం వారిని పిలిచి వారి సహాయం అడిగి "చులకన" అవడం కన్నా ఏ క్యాటరింగు వాడికో పని వప్పజెబితే సరి!
మనిషికి డబ్బు తో బాటూ సమాంతరంగా మరొకటీ పెరుగుతూ పోతూంది. అది ఏకాకితనం (isolation). స్వార్థం అనేది బయటకు వ్యక్తమయే ఏకాకితనం. ఏకాకితనం అన్నది తెరమరుగున దాగిన కనబడని స్వార్థం. ఇది ప్రస్తుత కాలంలో కుటుంబంలో బంధువులమధ్య మొదలై, మెల్లమెల్లగా తండ్రీకొడుకుల మధ్యా పాకుతూ వస్తూంది. మెల్లగా అయినా స్ఫుటంగా ఇది భార్యాభర్తల మధ్యా వ్యాపిస్తూ ఉంది. ఎంత గొప్ప అనుబంధమైనా, ఏడేడు జన్మలబంధమైనా ఒకరికొకరికి మధ్య బలీయమైన మానసిక అవసరం లేకపోతే ఆ బంధంలో ఆపేక్ష తగ్గుతుంది. ఏ కారణం చేతయినా కానివ్వండి, స్త్రీ, పురుషుడి మీద ఆధారపడడం ద్వారా కుటుంబ బంధం బలంగా ఉండేది ఇదివరకటి రోజుల్లో. స్త్రీలకు విద్యా, పరిమితమైన ఆర్థిక స్వేచ్ఛా అవసరమే.అయితే ఉద్యోగం చేసే అవసరం మాత్రం రాకూడదు. వారి శారీరక, మానసిక సామర్థ్యాలకనుగుణంగా వారికంటూ నిర్దిష్టమైన గృహధర్మాలు ఉన్నవి.
కుటుంబసభ్యుల మధ్యే కాక, బయట సమాజంలోనూ ఈ స్వార్థం (ఏకాకితనం) బహిర్గతంగా ప్రకటితమవుతూ ఉంది. వీధికొకటి చొప్పున ఉదయిస్తున్న వృద్ధాశ్రమాలు, అమ్మమ్మల అవసరం లేకుండా పిల్లలను చదివించే ఆట ఇళ్ళూ (ప్లే హోమ్స్) వంటివి దీనికి ఉదాహరణలు.
ఇంట్లో డబ్బు సంపాదించేవాడి అవసరమెంతో, డబ్బు సంపాదించలేని వారి (అమ్మమ్మలూ, తాతయ్యలూ వగైరా) అవసరమూ మన ముందుతరంలో బాగా ఉండేది. చిట్టి మనవళ్ళనూ, మనవరాళ్ళను కాళ్ళమధ్యన బోర్లపడుకోబెట్టుకుని లాల పోసే అవసరం తో మొదలయి, వారి ఆలనాపాలనా చూస్తూ, వారికి భాషా, మంచిమాటలూ, పనుల్లో నేర్పూ అన్నీ దగ్గరుండి చెప్పించే వాళ్ళ అవసరం తగ్గిపోతూ వస్తూంది. "శాస్త్రీయ" పద్ధతుల్లో ఆటా, పాట నేర్పడానికి ప్లే హోమ్స్, రెండున్నరేళ్ళవగానే ఎగబడ్డానికి స్కూళ్ళూ ఉన్నాయి.
("శాస్త్రీయ" పద్ధతుల్లో పిల్లలను చూసుకుని, వారికి తగిన తర్ఫీదు ఇవ్వబడును. అని బెంగళూరులో ఓ బోర్డు చూశా మొన్నామధ్య)
నిజమైన సమస్య, కొడుకులు స్వార్థపరులవడమో లేక, వృద్ధులు పనికిరాకుండా పోవడమో కాదు. అది బయట కనిపించే చిహ్నం (symptom) మాత్రమే. అసలు కారణం ఒకరి మీద ఒకరికి ఆధారపడే అవసరం లోపించటము. ఆ అవసరానికి ముఖ్య ఆలంబన అయిన ధనపరమైన స్వాతంత్ర్యం సమాజంలో ఎక్కువవటమూనూ. అవసరం లేనిచోట అనుబంధం మనగలగటం కష్టం.
ఈ రకమైన సమస్యలు నిర్మూలించబడాలంటే కీలకం - అవసరాలు కల్పించుకోవడంలో ఉంది. మారుతున్న సమాజ, కుటుంబ సమీకరణాల్లో సహాయం చెయ్యటంకన్నా, సహాయం అడగటం గొప్పవిషయం. మన పెద్దలను, మన బంధువులను, మిత్రులను సహాయం అడగటం వల్ల, "చులకన" అవుతామేమో అన్నది ఓ అపోహ. తన సామర్థ్యం మీద నమ్మకం ఉన్నవాడెవడూ ఈ అపోహలు పెంచుకోడు. అలా ఎవరైనా నిజంగా చులకన చేసినా కూడా నవ్వుతూ దులిపేసుకుని పోతాడు తప్ప తలకెక్కించుకోడు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడనేది పాతమాట. వలసినప్పుడు సహాయం అడిగి, ఆ తర్వాత కుదిరినప్పుడు తిరుగు సహాయం చేస్తూ, సాధ్యమైనంతవరకూ సంబంధాలను నిలుపుకునేవాడే ఇప్పటికి ధన్యుడు! అలాంటివాళ్ళ అవసరమే ఈ రోజు మనకు కావాలి.
Showing posts with label Thoughts. Show all posts
Showing posts with label Thoughts. Show all posts
Tuesday, January 26, 2010
Tuesday, August 11, 2009
సత్య క్రియ
సీత అగ్ని ప్రవేశ ఘట్టం మీద ఈ బ్లాగులో చర్చ జరిగి అప్పుడే సంవత్సరం కావస్తూంది. నిన్న బౌద్ధ జాతక మాల చదువుతుంటే కథ చివర్లో ఒక చోట రామాయణాన్ని, అందునా సీత అగ్ని ప్రవేశ ఘట్టాన్ని ఉటంకిస్తూ రాసిన ఒక ఫుట్ నోట్ చూశాను. అప్పుడు సాగిన ఆలోచనలతో ఈ టపా రాయాలనిపించింది.
రాముడి మీద ప్రశ్నలు, రామాయణం లో విలువలు, గతి తార్కిక భౌతిక వాదాలు ఇవన్నీ తిరగదోడి ఆరోగ్యాలు చెడగొట్టుకొనే తీరిక, ఓపిక, ఆసక్తి ఇప్పుడు నాకు లేవు. కాబట్టి వాటి జోలికి వెళ్ళదల్చుకోలేదు.
ముందుగా కథ, సాధ్యమైనంత విశదంగా.
జాతక మాల లో ఈ కథ పేరు శిబి జాతకం. శిబి అనగానే గుర్తొచ్చే డేగ - పావురం కథ చాలా మందికి తెలిసిందే. జాతకమాలలో ఈ కథ కాస్త భిన్నంగా ఉంటుంది.
ఈ కథలో శిబి (బోధిసత్వుడు) ఓ గణతంత్ర రాజ్యానికి రాజు. ఆయన దాన ప్రవృత్తికి సరిపడా గొప్ప యాచకుడు దొరకలేదని ఒక రోజు మథన పడతాడు. అప్పుడు ఆయన అత్యుదార సంకల్పానికి పృథివి, భర్త యెడల అనురక్తమైన స్త్రీ వలె చలించిపోతుంది. పృథివి చలనానికి మేరు పర్వతం కూడా చలిస్తుంది. ఆ కంపనాన్ని స్వర్గలోకంలో ఇంద్రుడు గమనించి, ఆశ్చర్య పడి, శిబిని పరీక్షించడానికి భూమిపై అడుగెడతాడు.
ఓ వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి శిబి వద్దకు వచ్చి, ఇంద్రుడు, శిబిని ఒక కన్ను దానమడుగుతాడు. అప్పుడు శిబి, ఇన్ని నాళ్ళకు నా దాన ప్రవృత్తికి సార్థకత లభిస్తున్నదని ఆనందపడి తన రెండు కళ్ళను దానమిస్తానంటాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని, తన గురించి ఇంత గొప్పగా చెప్పి ప్రేరణ కలిగించినదెవరని అడుగుతాడు. అప్పుడా బ్రాహ్మణుడు అది ఇంద్ర ప్రేరణ అని చెబుతాడు.
శిబి మహోన్నత నిర్ణయాన్ని విన్న మంత్రులు, ఆ వచ్చిన వాడు దేవుడని, ఒకరి నేత్రం ఇంకొకరికి అమరదని, ఇలా అతణ్ణి రకరకాలుగా వారిస్తారు. శిబి వారికి నచ్చజెబుతూ, కార్పణ్యదోషం (avarice) పాపహేతువు అని చెబుతాడు.
ఇంకా
నైకకారణ సాధ్యత్వం కార్యాణాం ననుదృశ్యతే
కారణాంతరసాపేక్షః స్యాద్దేవో 2పి విధిర్యతః
ఏకకారణం (single cause) వల్ల కార్యములు (effects) ఏర్పడడం మనకు ఎక్కడా కనిపించదు. కనుక దేవుడికైనా తన కార్యసిద్ధికి కారణ సామగ్రిని ఆపేక్షించక తప్పదని చెబుతాడు. ఇలా చెప్పి అందరిని ఒప్పించి, శిబి తన నయన పద్మాలను సహస్ర నయనునికి అర్పించి, పద్మములు లేని, పద్మాకరముఖుడవుతాడు.
అప్పుడు శక్రుడు మిక్కిలి సంతోషించి, ఈ మహా పురుషుడికి పునః చక్షు ప్రాప్తికి సమర్థమైన ఉపాయం కలిగేలా ప్రేరణ ఇస్తానని తీర్మానించుకుంటాడు.
కొన్ని రోజుల తర్వాత శిబి గాయాలు మానిన తర్వాత, తిరిగి ఇంద్రుడు నిజరూపంతో వస్తాడు. ఏమి కావాలో ఆజ్ఞాపించమంటాడు శిబి. ఇంద్రుడేదయినా వరం కోరుకొమ్మంటాడు. శిబి ఆ మాటలకు ఆశ్చర్యపడి, "శక్రా, నాకు ఏ దానము వద్దు. అయితే నాకు అన్ని సంపదలున్నా, యాచకులు దానం గ్రహించినప్పుడు వారి ముఖంలో సంతోషాన్ని చూడలేకపోతున్నాను. అందుకే మృత్వువును కోరుతున్నా"నంటాడు. చలించిపోతాడు ఇంద్రుడు. అయితే పరీక్షించడానికి, రెచ్చగొడుతూ, "యాచకుల వలనే కదా నీకీ దురవస్థ. యాచకులపై నీ భావాలేమిటి" చెప్పమంటాడు.
తదివ చైతర్హి చ యాచకానాం వచాంసి యాంచానియతాక్షరాని
ౠశీర్మయాణీవ మమ ప్రియాణి యథా తథోదేతు మమైకమక్షి
"యాచకుల యాచనా వాక్యాలు ఆశీర్వాదాల లాగా శ్రవణపేయంగా ఇదివరకు ఎలా అనిపించాయో, ఇప్పుడు అలానే అనిపించే పక్షంలో నాకు ఒక కన్ను ఉదయించుగాక!"
శిబి ఇలా చెప్పగానే సత్యాధిష్టాన బలం వల్ల శిబి కన్ను తిరిగి ఉదయించింది.ఆశ్చర్య చకితుడైన శిబి, ఇంకో శ్లోకం చెబుతాడు.
యశ్చాపి మాం చక్షురయాచితైకం తస్మై ముదా ద్వే నయనే ప్రదాయ
ప్రీత్యుత్సవైకాగ్రమతిర్యథాసం ద్వితీయమప్యక్షి తథా మమాస్తు ||
"ఒక నేత్రాన్ని యాచించిన యాచకుడికి నా రెండు నేత్రాలు మోదంతో ఇచ్చి ఆనందోల్లాసంతో నా చిత్తం లగ్నమై ఉండిన పక్షంలో రెండవ నేత్రం నాకు కలుగుగాక!"
రెండవనేత్రమూ ఆయనకు కలుగుతుంది. ఆ సత్యక్రియకు హర్షం పట్టలేక భూమి కంపిస్తుంది. సాగరుడు చెలియలికట్ట దాటుతాడు. సూర్యదేవుడు శరత్కాలంలో వలె శుద్ధంగా ప్రకాశిస్తాడు. పుష్పవృష్టి కురుస్తుంది. సకల దేవతా గణమూ బోధి సత్వుణ్ణి ప్రశంసిస్తుంది.
ఇది కథ. ఇక విషయానికి వద్దాం.
ఎటువంటి లోపానికి తావివ్వకుండా ధర్మానుచరణ కలిగిన వారి వాక్కులకు ఒక దివ్యప్రభావం సంక్రమిస్తుంది. జీవితంలో ఏదేని అతిక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు వారు దాన్ని సత్య అధిష్టాన బలం (Power of truth blessing)ద్వారా అధిగమిస్తారు. ఈ సత్యక్రియ ఆచరించేప్పుడు వారి సంకల్పం వాగ్రూపంలో వ్యక్తం కావడం అవసరమై ఉంటుంది. శిబి అంతకు ముందే ఆ క్రియను ఆచరించి, నేత్ర సిద్ధి పొంది ఉండవచ్చు. అయితే ఆ మహనీయుడు అందుకూ ఆశపడక మౌనం వహిస్తే, చివరికి ఇంద్రుడు ప్రేరణ కలిగించవలసి వస్తుంది.ధర్మ మహాత్మ్యానికి భారతీయహృదయం ఇచ్చిన మహోన్నత స్థానానికి సత్యక్రియ ఒక ప్రతీక (symbol).ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఈ సత్యక్రియా ప్రక్రియ ప్రముఖంగా కనబడుతుంది. ఉదా: సీతాదేవి అగ్ని ప్రవేశ ఘట్టం.
పైన శిబి కథలోనూ, సీతాదేవి విషయంలోనూ నాకు కనిపించిన ఒప్పుకోదగిన విషయాలు ఏమంటే - ఈ సందర్భాలలో సత్య క్రియ అన్నది తమకు వచ్చిన ఆపదను తొలగించుకోటానికి, లేదా సత్యంపట్ల తమ అనుయాయులకు, ప్రజలకు నమ్మకం సడలపోరాదని చెప్పటానికి ఉపయోగించబడింది. తమను ధిక్కరించిన వారిపై శాపాలు పెట్టటానికి సత్యక్రియ ఉపయోగించబడలేదు. (మహర్షులు పెట్టే శాపాల మీద వ్యక్తిగతంగా నాకు విశ్వాసం లేదు. కామక్రోధాదులను జయించగోరే వారు, జయించినట్లు చెప్పబడే వాళ్ళు, శాపాలెందుకిస్తారో ఊహకు అందదు. అందులో మానవీయత, మహనీయత కూడా నాకు గోచరించదు.)
పైన శిబి ఉదంతం, సీతా దేవి ఉదంతంలోని సత్యక్రియ నిదర్శన కరుణరసప్లావితమై ఉంటుంది. చూచాయగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సత్యక్రియ కలిగిన వ్యక్తులు మనజీవితంలోనూ ఎదురవడం కద్దు - మన నమ్మకం, అపనమ్మకం, విశ్వాసాలతో సంబంధం లేకుండా. తిరుమల రామచంద్ర గారి జీవిత చరిత్రలో ఓ చోట రాతి బసవడు, చెక్క బసవడు అని ఇద్దరు మిత్రుల కథ చెబుతారు. వారిద్దరికి సంస్కృతం వంటబట్టదు. ఇంటినుండీ పారిపోతారు. వారికి రామచంద్రగారు మంచి మాట చెబుతారు. ఓ మంచి మాట, మంచి జరగాలనే సంకల్పం అంతే. ఆ తర్వాత ఆ ఇద్దరు మంచి జీవితాలలో స్థిరపడతారు.
నా చిన్నప్పుడు మా ఊళ్ళో వర్షం పడకపోతే, వారం రోజులు మా ఇంటి పక్క గుడిలో ఏవో పూజలు, భజనలు జరిపారు. బాగా జ్ఞాపకం నాకు. సరిగ్గా ఆ వారం చివరిరోజు - మంచి వర్షం కురిసింది. ఇక్కడ నేనా పూజలను, విధానాలను సమర్థించడానికి ప్రయత్నం చేయట్లేదు. వర్షం కురవక, గొంతులెండిన అనేకమంది ఆర్తి - ఆ రోజు అక్కడ సత్యక్రియగా మారింది అని నా అనుకోలు.
అలాంటి పూజలు ఇప్పుడు జరిపినా వర్షం కురుస్తుందన్న ఆశ లేదు. దురదృష్టవశాత్తూ వ్యాపార సంస్కృతి అడుగంటా పాతుకుపోయిన సమాజంలో ఉన్నాం మనం. మనకు ఇలాంటి సంకల్ప బలాలు, సత్యాధిష్టానం తాలూకు ప్రతిఫలాలు బహుశా అర్థమవమేమో. పైగా మనమున్నది సమాచార విప్లవపు సమాజంలో. మనకు సమాచారం, హేతువు, విశ్లేషణ(analysis), విషయాన్ని ముక్కలుగా నరకటం - వీటి మీద ఉన్న శ్రద్ధ, motives ను కనుక్కునే విషయం మీద, విషయాలను సమన్వయం/సంశ్లేషణం (synthesis) చేయడం మీద లేదు. మనిషికి అజ్ఞానం ఇచ్చిన తృప్తి, విజ్ఞానం ఇవ్వలేకపోతోంది.
హేతువుకు దొరకని సంఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి. జీవితం మీద అనురక్తిని కలిగించేవి అలాంటి సంఘటనలే. వాటికి హేతువులు వెతకటం కన్నా, motives గురించి ఆలోచించటమో (contemplation), వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమో మాత్రం మనం చేయగలిగినది.
"The unknowable can never be known." - J Krishnamurthy
రాముడి మీద ప్రశ్నలు, రామాయణం లో విలువలు, గతి తార్కిక భౌతిక వాదాలు ఇవన్నీ తిరగదోడి ఆరోగ్యాలు చెడగొట్టుకొనే తీరిక, ఓపిక, ఆసక్తి ఇప్పుడు నాకు లేవు. కాబట్టి వాటి జోలికి వెళ్ళదల్చుకోలేదు.
ముందుగా కథ, సాధ్యమైనంత విశదంగా.
జాతక మాల లో ఈ కథ పేరు శిబి జాతకం. శిబి అనగానే గుర్తొచ్చే డేగ - పావురం కథ చాలా మందికి తెలిసిందే. జాతకమాలలో ఈ కథ కాస్త భిన్నంగా ఉంటుంది.
ఈ కథలో శిబి (బోధిసత్వుడు) ఓ గణతంత్ర రాజ్యానికి రాజు. ఆయన దాన ప్రవృత్తికి సరిపడా గొప్ప యాచకుడు దొరకలేదని ఒక రోజు మథన పడతాడు. అప్పుడు ఆయన అత్యుదార సంకల్పానికి పృథివి, భర్త యెడల అనురక్తమైన స్త్రీ వలె చలించిపోతుంది. పృథివి చలనానికి మేరు పర్వతం కూడా చలిస్తుంది. ఆ కంపనాన్ని స్వర్గలోకంలో ఇంద్రుడు గమనించి, ఆశ్చర్య పడి, శిబిని పరీక్షించడానికి భూమిపై అడుగెడతాడు.
ఓ వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి శిబి వద్దకు వచ్చి, ఇంద్రుడు, శిబిని ఒక కన్ను దానమడుగుతాడు. అప్పుడు శిబి, ఇన్ని నాళ్ళకు నా దాన ప్రవృత్తికి సార్థకత లభిస్తున్నదని ఆనందపడి తన రెండు కళ్ళను దానమిస్తానంటాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని, తన గురించి ఇంత గొప్పగా చెప్పి ప్రేరణ కలిగించినదెవరని అడుగుతాడు. అప్పుడా బ్రాహ్మణుడు అది ఇంద్ర ప్రేరణ అని చెబుతాడు.
శిబి మహోన్నత నిర్ణయాన్ని విన్న మంత్రులు, ఆ వచ్చిన వాడు దేవుడని, ఒకరి నేత్రం ఇంకొకరికి అమరదని, ఇలా అతణ్ణి రకరకాలుగా వారిస్తారు. శిబి వారికి నచ్చజెబుతూ, కార్పణ్యదోషం (avarice) పాపహేతువు అని చెబుతాడు.
ఇంకా
నైకకారణ సాధ్యత్వం కార్యాణాం ననుదృశ్యతే
కారణాంతరసాపేక్షః స్యాద్దేవో 2పి విధిర్యతః
ఏకకారణం (single cause) వల్ల కార్యములు (effects) ఏర్పడడం మనకు ఎక్కడా కనిపించదు. కనుక దేవుడికైనా తన కార్యసిద్ధికి కారణ సామగ్రిని ఆపేక్షించక తప్పదని చెబుతాడు. ఇలా చెప్పి అందరిని ఒప్పించి, శిబి తన నయన పద్మాలను సహస్ర నయనునికి అర్పించి, పద్మములు లేని, పద్మాకరముఖుడవుతాడు.
అప్పుడు శక్రుడు మిక్కిలి సంతోషించి, ఈ మహా పురుషుడికి పునః చక్షు ప్రాప్తికి సమర్థమైన ఉపాయం కలిగేలా ప్రేరణ ఇస్తానని తీర్మానించుకుంటాడు.
కొన్ని రోజుల తర్వాత శిబి గాయాలు మానిన తర్వాత, తిరిగి ఇంద్రుడు నిజరూపంతో వస్తాడు. ఏమి కావాలో ఆజ్ఞాపించమంటాడు శిబి. ఇంద్రుడేదయినా వరం కోరుకొమ్మంటాడు. శిబి ఆ మాటలకు ఆశ్చర్యపడి, "శక్రా, నాకు ఏ దానము వద్దు. అయితే నాకు అన్ని సంపదలున్నా, యాచకులు దానం గ్రహించినప్పుడు వారి ముఖంలో సంతోషాన్ని చూడలేకపోతున్నాను. అందుకే మృత్వువును కోరుతున్నా"నంటాడు. చలించిపోతాడు ఇంద్రుడు. అయితే పరీక్షించడానికి, రెచ్చగొడుతూ, "యాచకుల వలనే కదా నీకీ దురవస్థ. యాచకులపై నీ భావాలేమిటి" చెప్పమంటాడు.
తదివ చైతర్హి చ యాచకానాం వచాంసి యాంచానియతాక్షరాని
ౠశీర్మయాణీవ మమ ప్రియాణి యథా తథోదేతు మమైకమక్షి
"యాచకుల యాచనా వాక్యాలు ఆశీర్వాదాల లాగా శ్రవణపేయంగా ఇదివరకు ఎలా అనిపించాయో, ఇప్పుడు అలానే అనిపించే పక్షంలో నాకు ఒక కన్ను ఉదయించుగాక!"
శిబి ఇలా చెప్పగానే సత్యాధిష్టాన బలం వల్ల శిబి కన్ను తిరిగి ఉదయించింది.ఆశ్చర్య చకితుడైన శిబి, ఇంకో శ్లోకం చెబుతాడు.
యశ్చాపి మాం చక్షురయాచితైకం తస్మై ముదా ద్వే నయనే ప్రదాయ
ప్రీత్యుత్సవైకాగ్రమతిర్యథాసం ద్వితీయమప్యక్షి తథా మమాస్తు ||
"ఒక నేత్రాన్ని యాచించిన యాచకుడికి నా రెండు నేత్రాలు మోదంతో ఇచ్చి ఆనందోల్లాసంతో నా చిత్తం లగ్నమై ఉండిన పక్షంలో రెండవ నేత్రం నాకు కలుగుగాక!"
రెండవనేత్రమూ ఆయనకు కలుగుతుంది. ఆ సత్యక్రియకు హర్షం పట్టలేక భూమి కంపిస్తుంది. సాగరుడు చెలియలికట్ట దాటుతాడు. సూర్యదేవుడు శరత్కాలంలో వలె శుద్ధంగా ప్రకాశిస్తాడు. పుష్పవృష్టి కురుస్తుంది. సకల దేవతా గణమూ బోధి సత్వుణ్ణి ప్రశంసిస్తుంది.
ఇది కథ. ఇక విషయానికి వద్దాం.
ఎటువంటి లోపానికి తావివ్వకుండా ధర్మానుచరణ కలిగిన వారి వాక్కులకు ఒక దివ్యప్రభావం సంక్రమిస్తుంది. జీవితంలో ఏదేని అతిక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు వారు దాన్ని సత్య అధిష్టాన బలం (Power of truth blessing)ద్వారా అధిగమిస్తారు. ఈ సత్యక్రియ ఆచరించేప్పుడు వారి సంకల్పం వాగ్రూపంలో వ్యక్తం కావడం అవసరమై ఉంటుంది. శిబి అంతకు ముందే ఆ క్రియను ఆచరించి, నేత్ర సిద్ధి పొంది ఉండవచ్చు. అయితే ఆ మహనీయుడు అందుకూ ఆశపడక మౌనం వహిస్తే, చివరికి ఇంద్రుడు ప్రేరణ కలిగించవలసి వస్తుంది.ధర్మ మహాత్మ్యానికి భారతీయహృదయం ఇచ్చిన మహోన్నత స్థానానికి సత్యక్రియ ఒక ప్రతీక (symbol).ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఈ సత్యక్రియా ప్రక్రియ ప్రముఖంగా కనబడుతుంది. ఉదా: సీతాదేవి అగ్ని ప్రవేశ ఘట్టం.
పైన శిబి కథలోనూ, సీతాదేవి విషయంలోనూ నాకు కనిపించిన ఒప్పుకోదగిన విషయాలు ఏమంటే - ఈ సందర్భాలలో సత్య క్రియ అన్నది తమకు వచ్చిన ఆపదను తొలగించుకోటానికి, లేదా సత్యంపట్ల తమ అనుయాయులకు, ప్రజలకు నమ్మకం సడలపోరాదని చెప్పటానికి ఉపయోగించబడింది. తమను ధిక్కరించిన వారిపై శాపాలు పెట్టటానికి సత్యక్రియ ఉపయోగించబడలేదు. (మహర్షులు పెట్టే శాపాల మీద వ్యక్తిగతంగా నాకు విశ్వాసం లేదు. కామక్రోధాదులను జయించగోరే వారు, జయించినట్లు చెప్పబడే వాళ్ళు, శాపాలెందుకిస్తారో ఊహకు అందదు. అందులో మానవీయత, మహనీయత కూడా నాకు గోచరించదు.)
పైన శిబి ఉదంతం, సీతా దేవి ఉదంతంలోని సత్యక్రియ నిదర్శన కరుణరసప్లావితమై ఉంటుంది. చూచాయగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సత్యక్రియ కలిగిన వ్యక్తులు మనజీవితంలోనూ ఎదురవడం కద్దు - మన నమ్మకం, అపనమ్మకం, విశ్వాసాలతో సంబంధం లేకుండా. తిరుమల రామచంద్ర గారి జీవిత చరిత్రలో ఓ చోట రాతి బసవడు, చెక్క బసవడు అని ఇద్దరు మిత్రుల కథ చెబుతారు. వారిద్దరికి సంస్కృతం వంటబట్టదు. ఇంటినుండీ పారిపోతారు. వారికి రామచంద్రగారు మంచి మాట చెబుతారు. ఓ మంచి మాట, మంచి జరగాలనే సంకల్పం అంతే. ఆ తర్వాత ఆ ఇద్దరు మంచి జీవితాలలో స్థిరపడతారు.
నా చిన్నప్పుడు మా ఊళ్ళో వర్షం పడకపోతే, వారం రోజులు మా ఇంటి పక్క గుడిలో ఏవో పూజలు, భజనలు జరిపారు. బాగా జ్ఞాపకం నాకు. సరిగ్గా ఆ వారం చివరిరోజు - మంచి వర్షం కురిసింది. ఇక్కడ నేనా పూజలను, విధానాలను సమర్థించడానికి ప్రయత్నం చేయట్లేదు. వర్షం కురవక, గొంతులెండిన అనేకమంది ఆర్తి - ఆ రోజు అక్కడ సత్యక్రియగా మారింది అని నా అనుకోలు.
అలాంటి పూజలు ఇప్పుడు జరిపినా వర్షం కురుస్తుందన్న ఆశ లేదు. దురదృష్టవశాత్తూ వ్యాపార సంస్కృతి అడుగంటా పాతుకుపోయిన సమాజంలో ఉన్నాం మనం. మనకు ఇలాంటి సంకల్ప బలాలు, సత్యాధిష్టానం తాలూకు ప్రతిఫలాలు బహుశా అర్థమవమేమో. పైగా మనమున్నది సమాచార విప్లవపు సమాజంలో. మనకు సమాచారం, హేతువు, విశ్లేషణ(analysis), విషయాన్ని ముక్కలుగా నరకటం - వీటి మీద ఉన్న శ్రద్ధ, motives ను కనుక్కునే విషయం మీద, విషయాలను సమన్వయం/సంశ్లేషణం (synthesis) చేయడం మీద లేదు. మనిషికి అజ్ఞానం ఇచ్చిన తృప్తి, విజ్ఞానం ఇవ్వలేకపోతోంది.
హేతువుకు దొరకని సంఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి. జీవితం మీద అనురక్తిని కలిగించేవి అలాంటి సంఘటనలే. వాటికి హేతువులు వెతకటం కన్నా, motives గురించి ఆలోచించటమో (contemplation), వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమో మాత్రం మనం చేయగలిగినది.
"The unknowable can never be known." - J Krishnamurthy
Thursday, July 16, 2009
జలోపాఖ్యానం
"మీ ఆంధ్ర మీల్స్ తెగ స్పైసీనోయ్. అయినా సరే చాలా అద్భుతంగా ఉంది" అన్నాడా బాబు మోషాయ్ కన్నీళ్ళతో. అతనివి దుఃఖాశ్రువులు కావు. ఆనంద భాష్పాలూ కావు. మజ్జిగ మిరపకాయ ముక్క కాస్త కొరికి, ఆ ఘాటు నషాలాకెక్కడంతో, కంట్లో, ముక్కులో నీళ్ళు కారాయ్ తనకు. నాగార్జున హోటల్లో మధ్యాహ్నం లంచడానికి వెళ్ళేం మేము. బాబు మోషాయ్, బీహారీ, కన్నడ కస్తూరి, ఇలా మినీ ఇండియా లాగ ఉందక్కడ.
"సార్, సాయంత్రమయే సరికి కడుపు మంట స్టార్ట్ అవుతుంది చూడండి. దీనికి అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు అల్సర్ రావడం ఖాయం" వంతపాడాడు కన్నడ కస్తూరి.
నేనన్నాను. "అవును, ఈ అన్నం ఇక్కడ తిని అరిగించుకోవటం కాస్త కష్టమే" అని.
"అంటే?" క్వశ్చన్ మార్క్ ఫేసు పెట్టాడు కాట్రవెల్లి కండో (మలయాళీ).
"ఏముందీ, ఇదే భోజనం ఆంధ్రాలో అంతమంది తింటున్నారు, అక్కడ అల్సరూ, హలసూరు ఏదీ లేదు. మా వూళ్ళో ఇంతకంటే స్పైసీగా భోంచేస్తాం. మాకు కడుపులో ఏ మంటా కలగదు" చెప్పాను.
"ఎందుకంటావ్?" బీహారీ డవుటేడు.
"మా వూరి నీళ్ళు అలాంటివి." చెప్పేను నేను. నా మాటకు బాబూ మోషాయ్ ఏకీభవించలేదు. నీళ్ళు ఎక్కడికెళినా ఒకేలా ఉంటాయ్. అసలు నీళ్ళకు టేస్టేంటి? వితండవాదం సాగించేడు. బాబూ మోషాయ్ నా బాసురుడు కావడంతో నేను మాట్లాడలేదు.
అవును. మా వూళ్ళో నీళ్ళకు ఆ గుణముంది అని నా నమ్మకం. కాలేజీ రోజుల్లో దాదాపు ప్రతిరోజు సాయంత్రం నారాయణ బొరుగులో, ఉగ్గాని, మిరపకాయ బజ్జీలో, కట్లెట్ పానీపూరీయో మాకు కడుపున పడాల్సిందే. ఆ నారాయణ బొరుగులు తినేప్పుడు కళ్ళల్లో నీళ్ళలా కారిపోయేవి, అయినా సరే అలాగే లాగించేవాళ్ళం.
ఓ సారి నేను, నా ఫ్రెండ్ ఓ పందెం వేసుకున్నాం తను పాతిక మిరపకాయ బజ్జీలు తింటానని, దానికి ప్రతిగా నేను పాతిక రూపాయల బొరుగులు తినగల్ననీనూ. అన్నంతపనీ చేశాం. గెలుపు ఎవరిది అని తేలలేదు. అయితే మా వాడు మరుసటి రోజు హాస్పిటల్లో సెలైన్ బాటిళ్ళ వాతన బడ్డాడు. నేను తప్పించుకున్నా. కారణం బాగా నీళ్ళు తాగడమే. అవును మా వూరి నీళ్ళల్లో అలా కారాన్ని హరాయించే శక్తి ఉంది. అలానే మా వూరి నీళ్ళ రుచి కూడా. (అందరూ వాళ్ళ వూరి నీళ్ళ గురించి అలానే అనుకోవచ్చు). నా చిన్నప్పుడు మా నాన్న మా సొంత ఇంట్లో బావి తవ్వించారు. 200 అడుగులకు పైగా. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ నీళ్ళు కొబ్బరి పాలలా ఎంత తియ్యగా ఉండేవో. పొద్దులో అరిపిరాల సత్య గారి మంచినీళ్ళ బావి కథ చదివినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు.
అయితే మా మేనమామ ఒప్పుకోడు. "గంగా స్నాన, తుంగా పాన". మా ఊరి నీళ్ళే మంచివి అనే వారాయన. ఆయన బళ్ళారి లో నివాసముండేవారు.
నీళ్ళ విషయంలో బెంగళూరు వాళ్ళది తెగ బడాయి. మేము కావేరీ నీరు తాగుతాం. కావేరి వాటర్లో ఫాస్పరస్ కంటెంట్ ఉందట. అది బుద్ధిని తెగ షార్ప్ చేస్తుందట, అని వీళ్ళ మాటలు. అక్కడికి బుద్ధి పెన్సిలయినట్లు, కావేరీ నీళ్ళు బ్లేడులా దాన్ని చెక్కుతున్నట్లు.
నీళ్ళకో గుణం. ఏం తిన్నా హరాయిస్తాయా నీళ్ళు. అలాగే ఎంత తాగినా ఏవీ తాగినట్టుండదు, ఎందుకో ఏమో?
పారే నదిలో మధ్యలో వెళ్ళి ఆ నీళ్ళు తాగటం ఓ గొప్ప సంతోషాన్నిస్తుంది నాకు. బాసర వద్ద గోదావరి నది మధ్యకు తెప్పలో వెళ్ళి నది మధ్యలో తెప్పనాపించి, నీళ్ళు ముంచుకు స్నానం చేసి, ఆ నీళ్ళు తాగడం నాకున్న గొప్ప జ్ఞాపకాల్లో ఒకటి. తెప్ప అంటే హరిగోలు కాదు. థర్మోకోల్ షీట్లను తాళ్ళతో కట్టి చేసిన ఓ నలుచదరపు పడవ. అలానే శృంగేరి దగ్గర తుంగా నది నీళ్ళు కూడా. ఇంకా గొప్ప జ్ఞాపకం నైలు నది మధ్యలో పడవలో వెళ్ళి నీళ్ళు ముంచుకు తాగటం.
ఇంతకూ నేనిలా మంచినీళ్ళ మీద పడ్డానికి కారణం, గత ఐదేళ్ళుగా ఈ దరిద్రపు ఊళ్ళో మినరల్ వాటర్ కొనుక్కుని తాగి బతుకీడ్చాల్సిన ఖర్మ పట్టటం. మన చదువులు, మన బతుకులన్నీ "ఉద్యోగం" చుట్టూ తిరుగుతూ తగలడ్డాయ్. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే పనికొచ్చేవి, పనికి రానివీ రకరకాల వస్తువుల ఉత్పత్తి జరగాలి. పనికి రాని వస్తువులు మార్కెటింగ్ ప్రతిభ కారణంగా, పనికొచ్చే వస్తువులుగా తయారు చేయాలి. అదుగో అందుకనేనేమో చివరకు నీళ్ళను కూడా కొనుక్కుని తాగే దిశకు చేరుకున్నాం. ఎవణ్ణి తిట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఈ నీళ్ళల్లోనూ కాంపిటీషను. టాటా వాడి నీళ్ళు లీటరు పాతిక రూపాయలు. ఇంకొకడెవడో క్యువా అట. బాటిలు నలభై రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు.
అలానే మన తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం. నైలు నది వద్ద ఒక ఆన్ సైటుకెళ్ళినప్పుడు నెల్లాళ్ళు దాదాపు నేనే వండాను, మా కొలీగుల కోసం. అయితే అదే వంట ఇక్కడ బెంగళూరులో చాలా సార్లు ప్రయత్నిస్తున్నా, కుదిరి చావడం లేదు. నైలు నీళ్ళలోనే మర్మం ఉంది.
ఇంతకూ, మనకు ఎప్పుడు వానలు కురిసి నీటి కరువు తీరుతుందో ఏమిటో?
ఇప్పుడు కొంచెం జ్ఞానదాయకమైన విషయాలు చెప్పుకుందాం
నీరు అన్నది సంస్కృత "నీయతే ఇతి" అన్న ధాతువు నుండి వచ్చిన "నీర" శబ్దానికి తద్భవం కాదని నుడి నానుడి రామచంద్ర గారు. నిగనిగలాడేది కాబట్టి నిగళ్ష్, నిగర్, నీరు, నివురు అయిందట. అలాగే వెణ్ణ, పెన్నా వీటి నుంచి వెల్ల, వెల్లువ, మలయాళలో వెళ్ళం (వెళ్ళం అంటే నీరు ఆ భాషలో), వానావానా వల్లప్ప లోని వల్లప్ప ఇవన్నీ వచ్చాయట. ఇలాంటివి మరెన్నో. కాబట్టి మనపదాలన్నీ సంస్కృతానికి కాపీ అని బాధపడాల్సిన అవసరం లేదు.
"సార్, సాయంత్రమయే సరికి కడుపు మంట స్టార్ట్ అవుతుంది చూడండి. దీనికి అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు అల్సర్ రావడం ఖాయం" వంతపాడాడు కన్నడ కస్తూరి.
నేనన్నాను. "అవును, ఈ అన్నం ఇక్కడ తిని అరిగించుకోవటం కాస్త కష్టమే" అని.
"అంటే?" క్వశ్చన్ మార్క్ ఫేసు పెట్టాడు కాట్రవెల్లి కండో (మలయాళీ).
"ఏముందీ, ఇదే భోజనం ఆంధ్రాలో అంతమంది తింటున్నారు, అక్కడ అల్సరూ, హలసూరు ఏదీ లేదు. మా వూళ్ళో ఇంతకంటే స్పైసీగా భోంచేస్తాం. మాకు కడుపులో ఏ మంటా కలగదు" చెప్పాను.
"ఎందుకంటావ్?" బీహారీ డవుటేడు.
"మా వూరి నీళ్ళు అలాంటివి." చెప్పేను నేను. నా మాటకు బాబూ మోషాయ్ ఏకీభవించలేదు. నీళ్ళు ఎక్కడికెళినా ఒకేలా ఉంటాయ్. అసలు నీళ్ళకు టేస్టేంటి? వితండవాదం సాగించేడు. బాబూ మోషాయ్ నా బాసురుడు కావడంతో నేను మాట్లాడలేదు.
అవును. మా వూళ్ళో నీళ్ళకు ఆ గుణముంది అని నా నమ్మకం. కాలేజీ రోజుల్లో దాదాపు ప్రతిరోజు సాయంత్రం నారాయణ బొరుగులో, ఉగ్గాని, మిరపకాయ బజ్జీలో, కట్లెట్ పానీపూరీయో మాకు కడుపున పడాల్సిందే. ఆ నారాయణ బొరుగులు తినేప్పుడు కళ్ళల్లో నీళ్ళలా కారిపోయేవి, అయినా సరే అలాగే లాగించేవాళ్ళం.
ఓ సారి నేను, నా ఫ్రెండ్ ఓ పందెం వేసుకున్నాం తను పాతిక మిరపకాయ బజ్జీలు తింటానని, దానికి ప్రతిగా నేను పాతిక రూపాయల బొరుగులు తినగల్ననీనూ. అన్నంతపనీ చేశాం. గెలుపు ఎవరిది అని తేలలేదు. అయితే మా వాడు మరుసటి రోజు హాస్పిటల్లో సెలైన్ బాటిళ్ళ వాతన బడ్డాడు. నేను తప్పించుకున్నా. కారణం బాగా నీళ్ళు తాగడమే. అవును మా వూరి నీళ్ళల్లో అలా కారాన్ని హరాయించే శక్తి ఉంది. అలానే మా వూరి నీళ్ళ రుచి కూడా. (అందరూ వాళ్ళ వూరి నీళ్ళ గురించి అలానే అనుకోవచ్చు). నా చిన్నప్పుడు మా నాన్న మా సొంత ఇంట్లో బావి తవ్వించారు. 200 అడుగులకు పైగా. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ నీళ్ళు కొబ్బరి పాలలా ఎంత తియ్యగా ఉండేవో. పొద్దులో అరిపిరాల సత్య గారి మంచినీళ్ళ బావి కథ చదివినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు.
అయితే మా మేనమామ ఒప్పుకోడు. "గంగా స్నాన, తుంగా పాన". మా ఊరి నీళ్ళే మంచివి అనే వారాయన. ఆయన బళ్ళారి లో నివాసముండేవారు.
నీళ్ళ విషయంలో బెంగళూరు వాళ్ళది తెగ బడాయి. మేము కావేరీ నీరు తాగుతాం. కావేరి వాటర్లో ఫాస్పరస్ కంటెంట్ ఉందట. అది బుద్ధిని తెగ షార్ప్ చేస్తుందట, అని వీళ్ళ మాటలు. అక్కడికి బుద్ధి పెన్సిలయినట్లు, కావేరీ నీళ్ళు బ్లేడులా దాన్ని చెక్కుతున్నట్లు.
నీళ్ళకో గుణం. ఏం తిన్నా హరాయిస్తాయా నీళ్ళు. అలాగే ఎంత తాగినా ఏవీ తాగినట్టుండదు, ఎందుకో ఏమో?
పారే నదిలో మధ్యలో వెళ్ళి ఆ నీళ్ళు తాగటం ఓ గొప్ప సంతోషాన్నిస్తుంది నాకు. బాసర వద్ద గోదావరి నది మధ్యకు తెప్పలో వెళ్ళి నది మధ్యలో తెప్పనాపించి, నీళ్ళు ముంచుకు స్నానం చేసి, ఆ నీళ్ళు తాగడం నాకున్న గొప్ప జ్ఞాపకాల్లో ఒకటి. తెప్ప అంటే హరిగోలు కాదు. థర్మోకోల్ షీట్లను తాళ్ళతో కట్టి చేసిన ఓ నలుచదరపు పడవ. అలానే శృంగేరి దగ్గర తుంగా నది నీళ్ళు కూడా. ఇంకా గొప్ప జ్ఞాపకం నైలు నది మధ్యలో పడవలో వెళ్ళి నీళ్ళు ముంచుకు తాగటం.
ఇంతకూ నేనిలా మంచినీళ్ళ మీద పడ్డానికి కారణం, గత ఐదేళ్ళుగా ఈ దరిద్రపు ఊళ్ళో మినరల్ వాటర్ కొనుక్కుని తాగి బతుకీడ్చాల్సిన ఖర్మ పట్టటం. మన చదువులు, మన బతుకులన్నీ "ఉద్యోగం" చుట్టూ తిరుగుతూ తగలడ్డాయ్. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే పనికొచ్చేవి, పనికి రానివీ రకరకాల వస్తువుల ఉత్పత్తి జరగాలి. పనికి రాని వస్తువులు మార్కెటింగ్ ప్రతిభ కారణంగా, పనికొచ్చే వస్తువులుగా తయారు చేయాలి. అదుగో అందుకనేనేమో చివరకు నీళ్ళను కూడా కొనుక్కుని తాగే దిశకు చేరుకున్నాం. ఎవణ్ణి తిట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఈ నీళ్ళల్లోనూ కాంపిటీషను. టాటా వాడి నీళ్ళు లీటరు పాతిక రూపాయలు. ఇంకొకడెవడో క్యువా అట. బాటిలు నలభై రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు.
అలానే మన తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం. నైలు నది వద్ద ఒక ఆన్ సైటుకెళ్ళినప్పుడు నెల్లాళ్ళు దాదాపు నేనే వండాను, మా కొలీగుల కోసం. అయితే అదే వంట ఇక్కడ బెంగళూరులో చాలా సార్లు ప్రయత్నిస్తున్నా, కుదిరి చావడం లేదు. నైలు నీళ్ళలోనే మర్మం ఉంది.
ఇంతకూ, మనకు ఎప్పుడు వానలు కురిసి నీటి కరువు తీరుతుందో ఏమిటో?
ఇప్పుడు కొంచెం జ్ఞానదాయకమైన విషయాలు చెప్పుకుందాం
నీరు అన్నది సంస్కృత "నీయతే ఇతి" అన్న ధాతువు నుండి వచ్చిన "నీర" శబ్దానికి తద్భవం కాదని నుడి నానుడి రామచంద్ర గారు. నిగనిగలాడేది కాబట్టి నిగళ్ష్, నిగర్, నీరు, నివురు అయిందట. అలాగే వెణ్ణ, పెన్నా వీటి నుంచి వెల్ల, వెల్లువ, మలయాళలో వెళ్ళం (వెళ్ళం అంటే నీరు ఆ భాషలో), వానావానా వల్లప్ప లోని వల్లప్ప ఇవన్నీ వచ్చాయట. ఇలాంటివి మరెన్నో. కాబట్టి మనపదాలన్నీ సంస్కృతానికి కాపీ అని బాధపడాల్సిన అవసరం లేదు.
Friday, August 15, 2008
దేశభక్తి అంటే?
కాలేజీ రోజుల్లో ఆగస్టు 15 ను తల్చుకోగానే, ఓ మోస్తరుగా బాడీ లో మూవ్మెంట్స్ వచ్చేవి. అంటే, రక్తం ఉప్పొంగటం, రోమాలు నిక్క బొడుచుకోవటం, కళ్ళు అరమోడ్పులవటం, అర్జెంట్ గా పాకిస్తాన్ వాళ్ళను చంపేయాలంత ఆవేశం కలగటం వగైరా...అలానే క్రికెట్ మాచులు చూసినప్పుడూనూ (ఇప్పటికీ అనుకోండి) మన దేశమే గెలిచి తీరాలనే ఓ దురాశ కలుగుతుంది. నిజానికి అదో ఆట మాత్రమే, అన్న నిజం మనకూ తెలుసు. అయితే మనం అందులో లీనమైనప్పుడు అవన్నీ కనిపించవు.
దేశభక్తి అంటే యేమిటి? ఈ ప్రశ్న మామూలుగా అయితే ఎవరికీ రాకూడదు. అయితే, దేశభక్తి కి మనం అనుకునే దానికైనా భిన్నమైన అభిప్రాయాలు ఎక్కడైనా చదివినప్పుడు, లేదా విన్నప్పుడు ఓ సారి పునరాలోచించుకోవలసి వస్తుంది.
అలాంటి ఆలోచన నాకు జిడ్డు కృష్ణ మూర్తి, ఓషో, (కొద్దిగా రవీంద్ర నాథ్ ఠాగూర్) వీళ్ళ ప్రవచనాలు/ప్రసంగాలు చదివినప్పుడు, విన్నప్పుడు కలిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారి కొన్ని ప్రముఖ వ్యాఖ్యలు
" Nationalism is a glorified form of tribalism "
" The flag, is nothing but a piece of loin cloth, which represents a symbol, which is of the mind. Does the love belongs to mind? "
సిద్ధాంతాల గురించి ఆయన చెప్పదల్చుకున్నది (నాకు అర్థమయినంత వరకూ) ఎటువంటి సిద్ధాంతం (idealism) అయినా సరే, మౌలికంగా, మానవుని, యే రకమైన సమస్యనూ దూరం చేయలేదు.
అలానే ఓషో అంటాడు, "దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు మనుషుల్లో అసమానతలను పెంచడానికి తప్ప, మనిషి దుఃఖాన్ని నిరోధించటానికి యే మాత్రం ఉపయోగపడదు."
చంద్ర మండలం పై అమెరికా మొదటి సారి అడుగు పెట్టి, తమ దేశపు జెండాను ఎగురవేయటం మీద ఆయన విసురు, "ఆ జెండాపై రెట్ట వేయటానికి ఓ పక్షి కూడా లభ్యం కాని ప్రదేశం చంద్ర మండలం. అక్కడ జెండా ఎగురవెయ్యటం ఎంత మూర్ఖత్వం?"
దేశ భక్తి అంటే, ఇతర దేశాలను విమర్శిచటమా, లేదూ జపాన్, కొరియా లాంటి దేశాలను అనుకరించటమా (దీనికి స్పూర్తి పొందటం అని అందంగా కవర్ చేస్కోవచ్చుననుకోండి) ?
ఈ ఇద్దరి రచనలు బాగా చదివిన తర్వాత, నాకు ఎప్పుడూ ఉదయించే ప్రశ్న, అది ఎలాంటిదైనా అవనివ్వండి (దేశ భక్తి లాంటి ఉన్నతమైన సిద్ధాంతం ముదలుకుని, నాజీఇజం లాంటి చెత్త సిద్ధాంతం వరకు) సిద్ధాంతం గొప్పదా? మనిషి గొప్ప వాడా? సాటి మనిషిపై (ఆ మాటకొస్తే, సాటి జీవం పై, ఆఖరుకు చెట్లు పుట్టలపై) ఉన్న ప్రేమ (ఫీలింగ్) గొప్పదా?
మనిషి ప్రస్థానం ఎటువైపు సాగుతోంది??
దేశభక్తి అంటే యేమిటి? ఈ ప్రశ్న మామూలుగా అయితే ఎవరికీ రాకూడదు. అయితే, దేశభక్తి కి మనం అనుకునే దానికైనా భిన్నమైన అభిప్రాయాలు ఎక్కడైనా చదివినప్పుడు, లేదా విన్నప్పుడు ఓ సారి పునరాలోచించుకోవలసి వస్తుంది.
అలాంటి ఆలోచన నాకు జిడ్డు కృష్ణ మూర్తి, ఓషో, (కొద్దిగా రవీంద్ర నాథ్ ఠాగూర్) వీళ్ళ ప్రవచనాలు/ప్రసంగాలు చదివినప్పుడు, విన్నప్పుడు కలిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారి కొన్ని ప్రముఖ వ్యాఖ్యలు
" Nationalism is a glorified form of tribalism "
" The flag, is nothing but a piece of loin cloth, which represents a symbol, which is of the mind. Does the love belongs to mind? "
సిద్ధాంతాల గురించి ఆయన చెప్పదల్చుకున్నది (నాకు అర్థమయినంత వరకూ) ఎటువంటి సిద్ధాంతం (idealism) అయినా సరే, మౌలికంగా, మానవుని, యే రకమైన సమస్యనూ దూరం చేయలేదు.
అలానే ఓషో అంటాడు, "దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు మనుషుల్లో అసమానతలను పెంచడానికి తప్ప, మనిషి దుఃఖాన్ని నిరోధించటానికి యే మాత్రం ఉపయోగపడదు."
చంద్ర మండలం పై అమెరికా మొదటి సారి అడుగు పెట్టి, తమ దేశపు జెండాను ఎగురవేయటం మీద ఆయన విసురు, "ఆ జెండాపై రెట్ట వేయటానికి ఓ పక్షి కూడా లభ్యం కాని ప్రదేశం చంద్ర మండలం. అక్కడ జెండా ఎగురవెయ్యటం ఎంత మూర్ఖత్వం?"
దేశ భక్తి అంటే, ఇతర దేశాలను విమర్శిచటమా, లేదూ జపాన్, కొరియా లాంటి దేశాలను అనుకరించటమా (దీనికి స్పూర్తి పొందటం అని అందంగా కవర్ చేస్కోవచ్చుననుకోండి) ?
ఈ ఇద్దరి రచనలు బాగా చదివిన తర్వాత, నాకు ఎప్పుడూ ఉదయించే ప్రశ్న, అది ఎలాంటిదైనా అవనివ్వండి (దేశ భక్తి లాంటి ఉన్నతమైన సిద్ధాంతం ముదలుకుని, నాజీఇజం లాంటి చెత్త సిద్ధాంతం వరకు) సిద్ధాంతం గొప్పదా? మనిషి గొప్ప వాడా? సాటి మనిషిపై (ఆ మాటకొస్తే, సాటి జీవం పై, ఆఖరుకు చెట్లు పుట్టలపై) ఉన్న ప్రేమ (ఫీలింగ్) గొప్పదా?
మనిషి ప్రస్థానం ఎటువైపు సాగుతోంది??
Subscribe to:
Posts (Atom)

