Showing posts with label ప్రశ్నలు. Show all posts
Showing posts with label ప్రశ్నలు. Show all posts

Saturday, April 23, 2011

సాయిబాబా - అంతశ్శోధన


"అంతమంది జనాలు సాయిబాబాను నమ్ముతున్నారు గదా, నువ్వెందుకు నమ్మవు?" కాలేజీ చదువుతున్నప్పుడు మాయమ్మ అడిగింది ఒకరోజు.

అప్పట్లో ఒకానొక ఫంక్షన్ లో (సత్యసాయి నిగమాగమం ప్రారంభోత్సవం అనుకుంటా) సాయిబాబా రాజేష్ పైలట్ అనే కేంద్రమంత్రికి కొన్ని వేలమంది చూస్తుండగా గాలిలో నుండి ఒక చిన్న నగ సృష్టించి బహుమతిగా ఇచ్చారు, ఆ దృశ్యం వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియో రికార్డులను స్లో మోషన్ లో చూస్తుండగా ఒక విషయం బయటపడింది. సాయిబాబా పక్కన ఒకతను ఒక పళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటే, ఆ పళ్ళెం క్రిందుగా చేతులు పోనిచ్చి సాయిబాబా ఆ నగను తీసినట్టు ఆ దృశ్యం చెబుతూంది. ఆ టేపును అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ అప్పారావు గారు కాల్చేశారట. ఇదంతా పత్రికల కథనం కాబట్టి నిజానిజాలు నాకు తెలియవు. అయితే సాయిబాబా పళ్ళెం కింద చేయి పెట్టటం నగ తీయడం ఈ వరుస ఫోటోలు ఒకానొక దినపత్రికలో వచ్చాయి. వాటిని మా కాలేజీ నోటీసు బోర్డులో పెట్టారు. అదీ కథ.

ఆ రోజు వరకూ నా గోల నాది, కానీ సాయిబాబాను నమ్మకపోవడం ఆ సంఘటన నుంచి నాలో మొదలైంది. దానికి తోడు ఆయన కుండలోంచి విభూతిని పది పదిహేను నిముషాల వరకూ తీస్తూనే ఉండడం, నోట్లో శివలింగం తీయడం ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ సినిమాలో చూసి కాస్త విరక్తి కలిగింది. ఈ పైత్యానికి తోడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు పరమభక్తుడు. "దీపం విలువ దీపం క్రింద చీకట్లో కూర్చున్న వాళ్ళకు తెలీదురా. కాస్త దూరం నుంచి చూసేవాళ్ళకు మాత్రమే కనబడుతుంది" అనే వాడు. వాడి మూర్ఖభక్తి చూసి నవ్వు వచ్చేది. ఆలోచనాశక్తిలేకపోవడం వల్ల ఎప్పుడైనా కోపమూ వచ్చేది.

సాయిబాబా మీద ఈ తిరుగుబాటు భావజాలం అంతర్మథనంగా మారింది మా మేనమామ వల్ల.

కీర్తిశేషులు శంకరసుబ్రహ్మణ్యం మా మామయ్య. ఆయన కాలం చేసి నేటికి పదేళ్ళవుతూంది. ఆయన బహుభాషావేత్త. సంస్కృతంలో మంజరీశతకం అన్న శతకకావ్యమూ, వేమన పద్యాలకు హిందీ అనువాదం, ఠాగూర్ పద్యాలకు తెనుగు సేత, మేఘదూతం లా నిస్తంతీ దూతం (ఆయన టెలికాం లో ఆఫీసర్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు) ఇలాంటి రచనలతో సాహిత్యపరిశ్రమ, శారదాసేవ చేసిన వారు. నిత్యవిద్యార్థి. ఆయన ఛాందసులు కారు, ఆధునికులనే చెప్పాలి. ఆంగ్లం మీద, ఆంగ్లవిద్య మీద మోజు, ఆంగ్లం చదివితే జీవితంలో పైకి రావడం సులభమనే భావనా ఆయనకు ఉండేవి. ఆయన టెలికాం ఉద్యోగం నుండి రిటైర్ అవడానికి ముందు కొన్ని చిక్కుల్లో పడ్డారు. తన ఆఫీసులో సహోద్యోగి ఒకతను ఒక చెక్కును ఫోర్జరీయో ఏదో చేసి, డబ్బు కాజేసి, ఆ నేరం ఈయన మీదే మోపారు. ఆ కేసు పెట్టినది దళితుడు అవడంతో ఈయనకు చిక్కులు మరింత ఎక్కువయ్యాయ్. దాదాపు నలభై అయిదేళ్ళ సర్వీసులో నిజాయితీగా కష్టపడినందుకు ఈ ఫలితం దక్కిందని ఆయన మానసిక వేదన అనుభవించారు. ఆ సమయంలో సత్యసాయిబాబాను నమ్మారు. వేడుకున్నారు. ఎలాగైతేనేం కొన్ని యేళ్ళకు ఆయనకు న్యాయం దొరికింది. కోర్టు ఆయనను నిర్దోషిగా నిర్ణయించి తీర్పునిచ్చింది. సాయిమీద కృతజ్ఞతతో ఆయన ఇల్లు కట్టుకుని "సాయిసదనమ్" అని పేరు పెట్టుకున్నారు.

మా అమ్మకూ, మా పిన్నమ్మలిద్దరికీ మేనమామ మాట వేదవాక్కు కాబట్టి వాళ్ళూ ఆయనను నమ్మడం మొదలుపెట్టారు.మా ఇళ్ళ పూజాగృహాలలో సాయిబాబా పటం ఉండేది. అయితే అవజ్ఞతతో, తెలివిమాలినతనంతో అప్పట్లో మా అమ్మతో నేను కాస్త దురుసుగా మాట్లాడేవాణ్ణి, సాయిబాబా కుండలో విభూతి తీస్తే మీరెలా నమ్ముతారని మా అమ్మను ఆక్షేపించిన జ్ఞాపకం. టపా మొదట్లో మా అమ్మ కోపంగా అడిగిన ప్రశ్న ఆ సందర్భం లోనిదే.

బతికి ఉన్న రోజుల్లో మా మేనమామయ్యతో నాకు మాటలు, కొంతవరకూ చర్చలు ఉండేవి కానీ, విపరీతమైన చనువు లేదు,ఆయనతో మాట్లాడే స్థాయి కూడా లేదు. అంచేత సాయిబాబా విషయంలో నేను ఆయనతో చర్చించలేదు కానీ, ఒక సందర్భంలో నాకు తెలిసిందేమంటే, ఆయన సాయిబాబాను చూడనే లేదని, కేవలం ఆశ్రయించారని. తన లీలల గురించి కూడా తనకు తెలిసి ఉండదని నా అనుకోలు. సాయిబాబాను ఆయన కడకు దర్శించారో లేదో తెలియదు.

ఆయన ద్వారా నేను నేర్చుకున్నది సాయిబాబాను నమ్మినా, నమ్మకపోయినా నమ్మేవాళ్ళను గేలి చేయరాదన్న సంస్కారం. ఆ సంస్కారం కాస్త మిగలబట్టి మా ఇంటికి ఒకసారి నాన్న తరపున బంధువులు వస్తే, వారివెంట పుట్టపర్తి వెళ్ళి వచ్చాను. మా బంధువు పొద్దున ఐదున్నరకు వెళ్ళి మూడవ వరుసలో కూర్చున్నారు. సత్యసాయిబాబా చేతి నుండీ విభూతి రాలడం ఆయన స్వయంగా చూశానన్నారు. చాలా ఆశ్చర్యపడిపోయారు.

అయినా ఎందుచేతో అప్పుడప్పుడూ పురుగులా ఒక ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. ద్వేషం వల్ల కాదు, ఏదో తెలియని బాధ, ఆవేశం వల్ల.  ఒక వ్యక్తి రోలెక్స్/టైమెక్స్/సిటిజెన్ గడియారం గాల్లో ఎలా సృష్టిస్తారు? ఒక గడియారం కావాలంటే క్వార్ట్జ్ క్రిస్టలు, దాని వెనుకనున్న సైన్సు సూత్రాలు, నిపుణులు అనేకుల పరిశ్రమ లేకుండా ఎలా సాధ్యం? గాల్లో బూడిద పుట్టిందంటే ఏదోలే సంభావ్యత ఉందనుకుందాం, గడియారం ఎలా "పుడుతుంది"? అసలు చేతిలో పట్టేంత వస్తువెందుకు పుట్టాలి? యే రిఫ్రిజిరేటర్ నో పుట్టించవచ్చు గదా? (నేను ఎర్ర వాణ్ణి, మతద్వేషినీ కానని మనవి. నా వాదన ఎర్రవారికి మద్దతు కాదు. పైవాదన సాయిబాబా భక్తులకు ధిక్కరింపూ కాదు. నేను నమ్మవలసి వస్తే నాకు కలిగే ప్రశ్నలు మాత్రమే)

పై ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వాళ్ళు నన్నెలా ఆక్షేపిస్తారో అనుకుంటే ఈ క్రింది ప్రశ్న తట్టింది.

"నువ్వెందుకు ఐదేళ్ళ పిల్లవాడు (కృష్ణుడు) ఒక కొండను చిటికెన వ్రేలుతో ఎత్తాడంటే నమ్ముతున్నావు? పూజిస్తున్నావు?రాముడు ఒక బండకు తన కాలు సోకించగానే ఒకమ్మాయి పుట్టిందంటే నీవెలా నమ్ముతున్నావు?(ఇలాంటివి అనేకం ఉన్నయ్)

కాస్త తల చెడగొట్టుకుంటే రెండు సమాధానాలు కని(విని)పించాయి.

౧) పై రెండు కావ్యసాహిత్య విషయాలు కాబట్టి. సాహిత్యంలో ఒక పురుషోత్తముణ్ణి, శ్రేష్టుణ్ణి చేయడానికి చిలవలు పలవలుగా కల్పించడం ఉన్నదే. (రాజమౌళి సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలలాగా). అవన్నీ లేకపోతే కావ్యమూ లేదు, కావ్యోద్భవరసనిష్పందమూ లేదు. కావ్యం అంటే కేవలం న్యూస్ పేపర్ లో చదివే న్యూస్ లాంటిది కాదు, పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా లేదు. అంచేతే కావ్యమూ, రసమూ, కల్పనలూ వగైరా వగైరా..

౨) ఎవరైనా ఒక మహానుభావుడు, మహోన్నతుడు, పురుషోత్తముడు, సద్గురువు పుట్టి గతించిన తర్వాత ఆతని చుట్టూ మార్మికత, ఆచారాలు, వ్యవస్థా కమ్ముకోవడం లోకవ్యవహారం. బుద్ధుడు దేవుడే లేడన్నాడు. (లేదా దేవుణ్ణి బయట కాక అంతశ్శోధనలోనే వెతుక్కోమన్నాడు). ఆయన తర్వాత అనుచరులు ఆయనను దేవుణ్ణి చేసిపెట్టారు. ఆయన పేరు మీద అభూతకల్పనలు, అతీంద్రియ శక్తులు కల్పించారు. షిర్డీ సాయిబాబా విషయంలో అదే జరిగింది. ఇంకా ఎంతోమంది విషయంలో కూడానూ. బహుశా మరో రెండు తరాల తర్వాత ఏమో, జిడ్డు కృష్ణమూర్తి కూడా దేవుడు కావచ్చు!

జిడ్డు కృష్ణమూర్తి 1929 లో తను అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ స్టార్ సంస్థను రద్దు చేసి అప్పట్లో 3000 కోట్ల డాలర్ల సొమ్మును సంస్థ సభ్యులు ఎవరికి వారికి పంచి ఇచ్చేశాడని వార్త.

బహుశా మరో వంద, నూటయేభై సంవత్సరాల తర్వాత -

కృష్ణమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. అంతే! ఆయన ముందున్న డబ్బంతా మాయమయింది. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆశ్చర్యం!!! వాళ్ళ ఇళ్ళ అల్మైరాలలో, ఇనుపపెట్టెలలో సరిగ్గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ స్టార్ కు ఇచ్చిన విరాళం లెక్క ప్రకారం అంతే లెక్క అలాగే ఉంది. పూజాగదిలో కృష్ణమూర్తి విగ్రహం లోంచి దేదీప్యమానమైన కాంతి ప్రసరిస్తోంది......

అలాంటిది కల్పన ఒకటి మొదలయితే ఆశ్చర్యమేమీ లేదు.

**************************************************************************************************

సాయిబాబా (మత) ద్వేషులది మరో తీరు. ఏదో, ఎవరినో ఉద్దరిస్తున్నట్టు, ప్రపంచానికంతా జ్ఞానజ్యోతులు వెదజల్లుతున్నట్టు ఉంటాయి వీళ్ళవాదనలు. జీవితంలో భరించలేని కష్టాలొస్తే, మళ్ళీ వీళ్ళది అదే త్రోవనే. ఏదో ఒక నమ్మకమో, విశ్వాసమో ఆసరా కావలసిందే. వ్యవస్థీకృతమైన నమ్మకం చెడ్డదని కొందరి చిలకపలుకు. వ్యవస్థీకృతమైన నమ్మకం ఆత్మశోధనకు అడ్డంకి కావచ్చునేమో, కానీ వ్యవస్థీకృతమైన అపనమ్మకం పరమ దారుణమైనది. మనుషులను పశువులుగా మార్చేదీనూ. Truth is not opposite of false, but absence of false అనేది వివేకవంతమైన మాట. అది స్వయంగా ఎవరికి వారు తెలుసుకోవలసిందే. నమ్మకం కనీసం సాంత్వననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు. వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. వాళ్ళమాట వింటే ప్రపంచం మారిపోతుందన్న అల్పభ్రమలో ఉంటారు.

**************************************************************************************************

అయితే సాయిబాబా గురించి ఆలోచనలు వచ్చినప్పుడు దొర్లే కొన్ని ప్రశ్నలు మట్టుకు వేధిస్తూనే ఉంటాయి. Faith begins when logic ends. అని సూత్రం. Is that faith which comes is really a faith? or a subset of FEAR/DESIRE? గౌతమ బుద్ధుని నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకూ శంకను నిరంతర అన్వేషణాపరత్వాన్ని వీడకూడదని బోధిస్తారు. Doubt has a cleansing effect అంటారు కృష్ణమూర్తి. శంక అంటేనే తర్కం పరిధిలోకి వచ్చేది. తర్కాన్ని ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు తర్కం వద్దనుకోవాలి? ఎవరి దగ్గర తర్కాన్ని త్యజించి విశ్వాసం చూపడం మొదలుపెట్టాలి? తర్కం కూడా బుద్ధి పరిధి లోనిదే కదా? దాన్ని తోసిరాజనడం ఆత్మవంచన కాదా?

Logic ను పక్కకు నెట్టేసి ఒక Entity ని నమ్ముతాము అనుకుంటే నా నమ్మకం (FAITH) వెనుక ఉన్నది ఏమిటి? కోరికా? భయమా? లేక ఆత్మార్పణమా? (Total surrender)

భయమూ, కోరికా లేనప్పుడు మనలను (ఆత్మను లేదా మనసును) ఒకరికి అర్పించుకోవడం ఎందుకు? ఆ అవసరమేమిటి?

Master is born when pupil is ready
When the rain comes
grass grows by itself.

అనేది ఒక జెన్ హైకూ. గురువు కన్నా శిష్యుడే గొప్ప, అంతశ్శోధనయే గురువు అని ఈ సాంప్రదాయం. అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

Wednesday, June 30, 2010

చరిత్రా? చట్టుబండలా?

చరిత్ర అంటే ఏమిటి?
ఊహాగానమా?
కొందరు పరిశోధకుల పొంతన లేని అభిప్రాయాలకు ఊతం ఇచ్చే సబ్జెక్టా?
కోర్టులోలా circumstantial evidence ఉంటే తప్ప పరిగణనలోకి తీసుకోజాలని ఓ వ్యాజ్యమా?
తమతమ అభిజాత్యాలకు ఆటపట్టుగా మార్చుకోవడానికి తేరగా దొరికిన ఓ అవకాశమా?
వ్యక్తి వ్యక్తికీ, కాలకాలానికి మారిపోతూ ఉండేదా?

ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. అందులో సొంత అభిప్రాయాలకు, అభిజాత్యాలకు తావు ఉండరాదు. అధ్యయనం వ్యక్తిగత పేరు ప్రతిష్టల సమరం కారాదు. అది జాతికి చేస్తున్న సహాయం కానేరదు.

విమర్శ అనే ప్రక్రియకర్థం తెగడటం కాదు, పరిశీలించటం, నిష్పాక్షికంగా ఆధారాలను సేకరించటం, ఆధారాలను బట్టి సమన్వయం సాధించటం విమర్శ. సమన్వయం కుదరని పక్షంలో ఊహాగానాలకు చోటివ్వక, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఉంచి, తరువాతి తరానికి ఆ విషయాలను పరిశీలించడానికి సహాయం కల్పించటం కూడా సద్విమర్శలో భాగమే. చరిత్ర అన్నది ఒక శాస్త్రం కాదు. శాస్త్రానికి అధారం విశ్లేషణ. కళకు ఆధారం సంశ్లేషణ. శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అంటే, కంటికి కనిపించే ప్రత్యక్ష ఋజువులకోసం పాకులాట అనేది సంకుచితమైన అర్థం. 

చరిత్రాధ్యయనం ఒక కళ. ప్రాంతీయ సాహిత్యానికి, వారి దైనందిన జీవితంలో అంతర్భాగమైన అలవాట్లకు, వారి సంస్కృతి మూలాలకు, సాంప్రదాయ విషయాలకు సమన్వయం సాధించగలిగడం ఈ ప్రక్రియలో భాగం.ఇందులో పొఱబాట్లకు తావులేదు. సహానుభూతి అభిప్రాయాలకు పరిమితం కావాలి, ప్రమాణాలకు కాదు. అభిప్రాయాలకు అందరికీ అవకాశం ఉంది. అయితే అభిప్రాయం ప్రమాణం చేసే ప్రయత్నం నిర్ద్వంద్వంగా ఖండించదగింది. దురదృష్టవశాత్తూ, ఆంగ్లేయులచేత ఈ రోజు పాఠ్యాంశాలలో చేర్చబడి విద్యార్థులు చదువుతున్న భారతదేశ చరిత్ర చాలావరకు ఊహాజనితం. ఒక ఊహ నిజంగా మలచబడి, దానిపై మరొక కల్పన సృష్టింపబడి, మరిన్ని ఊహాగానాల అల్లిక,వాటికి ఋజువుల వెతుకులాట.. ఇలా చెల్లాచెదరై ఉంది.మనం చదువుకునే మన దేశచరిత్ర మొత్తం అస్తవ్యస్తం, అకటావికటం.

ఉదాహరణ: హిందువులు సాధారణంగా వాడే పంచాంగంలో ఉటంకింపబడే శాలివాహన శకం ప్రకారం ఈ యేడు 1932 వ వర్షం. యే శకమైనా ఎలా మొదలవుతుంది? ఓ మహాత్ముడితోనో, మహానుభావుడి పేరు మీదో, ఏదైనా గొప్ప సంఘటన వలనో మొదలవాలి. కలిశకం, యుధిష్టిర శకం, విక్రమ శకం, క్రీస్తు శకం ఇవన్నీ దానికి ఉదాహరణాలు. అలా శాలివాహన శకం క్రీ.శ. 78 నుండి మొదలయింది. వేల యేళ్ళుగా ఆనవాయితీగా, పంచాంగ రూపకర్తలు దీనిని ఉటంకిస్తూ వస్తున్నారు. శాలివాహన మహారాజు గురించి భారతీయ లౌకిక సాహిత్యంలో కథలున్నవి. ఎంతో ఎందుకు? ప్రాకృతభాషలో గాథాసప్తశతి - శాలివాహన సంకలితం ఉన్నది.  కాగా, శాలివాహనుడనే రాజు లేనే లేడని, ఎక్కడినుండో వచ్చిన కుషాణ వంశపు కనిష్కుడనే రాజు పుట్టుక ఆధారంగా ఈ శకం మొదలయ్యిందని కొందరు ఆంగ్లపండితుల ఊహ. పురాణాలన్నీ పుక్కిటివయ్యాయి. ఊహాగానాలు నిజమయి కూర్చున్నాయి. ఊహ చరిత్ర గా మారింది. మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కింది. ఎవరో చేసిన ఊహాగానం చరిత్ర పేరిట మనం చదువుకుంటున్నాము. అగ్ని వంశపు రాజుల గురించి చెప్పిన మత్స్య, అగ్నిపురాణాది అనేక పురాణాలు, వేలయేళ్ళుగా వచ్చే సంప్రదాయం, లౌకిక సాహిత్యం, ప్రతీ రోజు చేసే సంధ్యావందనంలోనూ, హిందువనే ప్రతివాడు ఏదో ఒక సందర్భంలో పూజలో సంకల్పం చెప్పుకునే వరుసలో వచ్చే "శాలివాహకే..హరిహర గురుసన్నిధౌ, అస్మిన్ వర్తమానే..." వరుసా, ఇవన్నీ ప్రమాణాలుగా తోసివేయబడ్డాయి!

ఇక మహాభారతం విషయానికి వద్దాం.

కలియుగం ఫిబ్రవరి 20, 3102 B.C, 2-27'-30''గంటలకు,మొదలయ్యిందని ప్రపంచ వ్యాప్తంగా, ఇండాలజిస్టులు ఒప్పుకున్న విషయం. మహాభారతంలో స్త్రీపర్వం, అనుశాసనిక పర్వం,మహాప్రస్థానిక పర్వాది కొన్ని పర్వాలలో శ్రీకృష్ణుని మరణం, పరీక్షిత్తు జననం, కలియుగాగమనం ఒకేసారి జరుగుతాయని ఉటంకించబడి ఉన్నది. గాంధారి కృష్ణునికి శాపం ఇస్తూ, సరిగ్గా 36 యేళ్ళకు యాదవకులంలో ముసలంపుట్టి వంశనాశనం జరుగుతుందని చెబుతుంది.అంటే, భారతయుద్ధకాలం క్రీ.పూ. 3138. అంటే భారత కాలం అంతకుముందే కావాలి. దేవీభాగవతం, ఇంకా కొన్ని పురాణాలలోనూ ఒకేవిధమైన సమయం ఉటంకింపబడి మహాభారత కాలానికి సమన్వయం కుదురుతున్నది. కాగా, మహాభారత సమయం క్రీ.పూ. 1200 కు మించదని, ఎందువల్లనంటే iron age అప్పుడే మొదలయ్యిందని కొందరి ఊహ అయితే, జాకోబీ, వెబర్,మాక్డోవెల్ పండితుల ప్రకారం మహాభారతం క్రీ.పూ.మూడవ శతాబ్దానికి చెందినది. వీరి ఊహకు కల్పించిన ఆధారం అలెక్జాండరు దండయాత్ర క్రీ.పూ.మూడవ శతాబ్దంలో జరిగింది. భారతంలో యవన శబ్దం ఉంది కాబట్టి, భారతం ఆ సమయంలోనే జరిగిందన్న వాదన! మరి రామాయణంలోనూ యవన శబ్దం ఉంది కదా అంటే, అది ప్రక్షిప్తం అనేశారు. సరే, అలెక్జాండర్ కంటే ముందే డేరియస్ అనే గ్రీకు రాజు ఉత్తరభారతానికి వచ్చినట్టు ఓ చరిత్రకారుడు వ్రాశాడు కదా, క్రీ.పూ.ఏడవ శతాబ్దంలో శకటాయనుడు కూడా ఆ శబ్దం ఉపయోగించాడు కదా అన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. భారత కాలం స్పష్టంగా నిర్ణయించడానికి, ఋజువులు దొరకలేదని ఘోషణ! అంతర్గత ఋజువులు (internal evidences) దొరికినప్పుడు వాటిని వీలయినంత పక్కన పెట్టటం, లేదా వక్రీకరించటం జరిగింది.

శంకరాచార్యుల కాలం గురించి కూడా, ఆయనచేత స్థాపించబడ్డ పీఠాలలో దృష్టాంతాలు వెతక్కుండా, ఏదో తలాతోకా లేని శ్లోకం ద్వారా ఊహించి,దాన్నే ప్రమాణం చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నాలు జరిగాయి.చేశారు కూడాను. ఇప్పుడు జనశ్రుతి ప్రకారం, క్రీ.పూ. జన్మించిన శంకరుడు క్రీ.శ. పదకొండవ శతాబ్దపు వ్యక్తి!!

మహాభారత కాలం గురించి, బుద్ధుడి కాలం గురించి, ఇంకా అగ్నివంశపు రాజుల గురించి, జంబూద్వీపం అంటే ఏమిటి? భరతవర్షం, భరతఖండం, తెలుగువారెవ్వరు, ఆర్యులెవ్వరు తదితర విషయాలపై కీ.శే.కోట వెంకటాచలం గారు కొన్ని గ్రంథాలు వ్రాశారు. మహాభారతంలోని సమయ సంబంధిత శ్లోకాలను అర్థసహితం తెలుపటమే కాక, ప్రత్యక్ష జ్యోతిష్య ప్రమాణాలను, సప్తర్షిమండలం ఏ రాశిలో ఉన్నది వంటి అనేక విషయాలను కూలంకషంగా ఆయన చర్చించారు. ఇంకా ఆంగ్ల చారిత్రకులు గ్రీకు గ్రంథాలలో ఉటంకింపబడ్డ జాండ్రేమ్సు,శాండ్రొకొట్టసు,శాండ్రోసిప్టసు ఎవరు? మౌర్యులకాలం ఎప్పటిది? వాటి ఆధారంగా నిర్ణయింపబడ్డ పొఱబాట్లను, ఆంగ్లచారిత్రకుల ఉటంకింపుల ద్వారనే ఆయన వెలికి తీసి ఋజువులు చూపించారు.

ఆర్య, ద్రవిడ సిద్ధాంతాలు వంటివి colonial consciousness కు ప్రతీకలుగా ఋజువులు దొరుకుతున్న ఈ రోజుల్లో ఓ సాధారణ పండితుడు వ్రాసిన గ్రంథాలు ఆయా ఋజువులకు దగ్గరగా ఉండటం పరిశీలించదగింది. ఇవి కొన్ని తెలుగులో ఉన్నవి. మహాభారతం, బుద్ధుడి కాలం గురించిన గ్రంథాలు ఆంగ్లంలోనూ DLI లో దొరుకుతున్నవి.భారతదేశ చరిత్ర మీద ఆసక్తి, ఇష్టం ఉన్నవారు తప్పక చదవవలసిన విషయాలివి.నిజమైన చరిత్ర బయటపడుతూ, అర్థం లేని సిద్ధాంతాలు ఊహాజనితమని ఋజువవుతున్న ఈ రోజుల్లో భారతదేశంలోని మారుమూల ఓ పండితుడు వ్రాసిన గ్రంథాలు నిజమైన చరిత్రకు దగ్గరగా ఉండటం గమనార్హం.

- అగ్నివంశపు రాజులు
- ఆంధ్రులెవరు?
- కలిశకవిజ్ఞానం
- Time of mahabhaarata
- Buddha's time
కోట వెంకటాచలం 
- సంస్కృత సారస్వత చరిత్ర

Tuesday, January 26, 2010

మంచితనం - మానవ సంబంధాలు

చాలా యేళ్ళ క్రితం ఉద్యోగం దొరికిన కొత్తల్లో రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో నరేంద్రుడనే అతను అనేక యాత్రలు జరిపి, చీనా దేశానికి చేరుకుని అక్కడ అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ మరణిస్తాడు. అతడి వృద్ధాప్యంలో అతననుకుంటాడు. "ప్రజలు దీనులూ, దరిద్రులూ అయితేనే కదా, వాళ్ళకు సేవ చేసే అవకాశం లభించేది నాకు? అంటే పరోక్షంగా వాళ్ళు దీనులు కావాలని కోరుకుంటున్నానన్నమాటే కదా?" - ఈ వాక్యాలు చాలా కాలం గుర్తుండిపోయాయి.

మన మంచితనం వెనుక ఉన్నది స్వార్థమా? నిస్వార్థమా? అని ఓ అవిశ్వాసమూ, అపోహా నాకు. ధనసాయం కానివ్వండి, మాటసాయం కానివ్వండి, నైతిక మద్దతు కానివ్వండి, ఎంత ప్రతిఫలాపేక్ష ఆశించకపోయినప్పటికీ, మనుషులు చేసే మంచిపనుల్లోనూ అంతర్లీనమైన స్వార్థం ఉండకపోదని చాలాసార్లు అనిపిస్తుంది. స్పష్టంగా ఫలానా అని చెప్పలేకపోయినా, ఏదో అంతర్లీనమయిన స్వార్థం మటుకు ఉండి ఉండాలి.

కొన్నేళ్ళ క్రితం నాకో సహోద్యోగి ఉండేవాడు. చాలా ధనవంతుడు. ఉద్యోగం నామమాత్రమే. మామిడి తోటలూ, అవీ ఉండేవి వాడికి. వాడి భార్యా, ఉద్యోగస్తురాలే. DINK సంసారం. చీకూ చింతల్లేవు. ఆఫీసు వాళ్ళు ఏదైనా చారిటీ కార్యక్రమాలు అవీ ఏర్పాటు చేస్తే, వితరణల్లో వాడి పేరు మొదట నిల్చేది. వేలల్లో ఖర్చు పెట్టేవాడు. అయితే కారులో వెళుతూన్నప్పుడు మధ్య కూడలిలో ఎవరైనా అనాథలు కనబడితే చాలా అసహనం ప్రదర్శించేవాడు. నాకు అతగాణ్ణి చూసి విచిత్రం అనిపించేది.

ఓ రోజు నాకూ ఓ సందర్భం ఎదురయ్యింది. కాలు చెయ్యి బావున్నా, మాసిపోయిన గడ్డమూ, చింపిరిజుత్తూ ఉన్న ఒకతను చాలా దీనంగా అడుక్కుంటూ వచ్చాడు మా ఇంటిదగ్గరకు. అతడి కొడుకు చిన్నపిల్లాడట. భార్య రోగగ్రస్తురాలట. అతడు ఏదో పని చేసుకునే వాడు, కానీ పని వదిలేసి ఇలా ప్రత్యక్షమయాడో రోజు. అతణ్ణి చూడగానే సహాయం చెయ్యాలనిపించింది, కానీ తటపటాయింపు. ఆ డబ్బు అతడు తాగటానికి ఖర్చుపెడతాడేమో, లేకపోతే, అదంతా నాటకమనో ఇలా. అదే ఆఫీసు వాళ్ళో, మరొకళ్ళో ఎవరైనా డొనేషన్ అడిగితే ఆ అనుమానాలు రావు!. దానికి కారణం - ఎక్కడో, ఏ మూలనో "దానం చెయ్యడం" కన్నా, "నేను" దానం చేస్తున్నానన్న భావన మనకు ముఖ్యం. ఇది మంచితనమా? స్వార్థమా?

(అతడిది నాటకం కాదని, అతడు నిజమే చెబుతున్నాడని తెలిసింది ఆ తర్వాత. అయితే తెలుసుకునేసరికి అతడి భార్యా, పిల్లాడు పోయారు. అతనూ పోయాడు కొన్ని రోజులకు)

నైతిక మద్దతు (moral support) కూడా అలాంటిదే. మొదట నైతిక మద్దతు ఇచ్చేందుకు ఎగబడతాము, అవతలి వాడు బాగుపడిన తర్వాత, నా వల్లే అతడు బాగుపడ్డాడని చెప్పుకోవడానికి సందేహించము. ఎవరైనా మనకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తున్నారంటే, అది వారు మనతో అనుబంధం పెంచుకోవడానికి ఇస్తున్న అవకాశం తప్ప, వారి బలహీనత ఎంతమాత్రం కాదు.

కుటుంబసంబంధాలు పరస్పరం ఇలానే ఉండేవి క్రిందటి తరం వరకు. నా చిన్నతనంలో మా చిన్నాన్నలూ, మామయ్యలూ, ఇతర బంధువులూ ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆ తర్వాత తీర్చేయడాలూ, చాలా సాధారణంగా ఉండేవి. వాళ్ళలా ఉంటే, ఇప్పటి తరం వాళ్ళమయిన నేనూ, మా అన్నయ్యా, మా కజిన్స్ మాత్రం ఒకరిదగ్గర ఒకరు సహాయం అడగడం నామోషీగా భావిస్తున్నాం. నేను ఓ సారి అవసరమొచ్చినప్పుడు సిటీబ్యాంకు వాడి దగ్గర లోనుకెళితే, ఇంకొకరు సహాయం అవసరమని మాటవరసకైనా చెప్పరు. మా ఇంట ఏదైనా పండుగో పబ్బమో వస్తే, మా అత్తలూ, పిన్నమ్మలూ, ఇతరత్రా అందరూ వచ్చి కలిసికట్టుగా వంటపనుల్లో పాల్గొని పనులు చూసుకునే వారు. ఇప్పుడు మాత్రం వారిని పిలిచి వారి సహాయం అడిగి "చులకన" అవడం కన్నా ఏ క్యాటరింగు వాడికో పని వప్పజెబితే సరి!

మనిషికి డబ్బు తో బాటూ సమాంతరంగా మరొకటీ పెరుగుతూ పోతూంది. అది ఏకాకితనం (isolation). స్వార్థం అనేది బయటకు వ్యక్తమయే ఏకాకితనం. ఏకాకితనం అన్నది తెరమరుగున దాగిన కనబడని స్వార్థం. ఇది ప్రస్తుత కాలంలో కుటుంబంలో బంధువులమధ్య మొదలై, మెల్లమెల్లగా తండ్రీకొడుకుల మధ్యా పాకుతూ వస్తూంది. మెల్లగా అయినా స్ఫుటంగా ఇది భార్యాభర్తల మధ్యా వ్యాపిస్తూ ఉంది. ఎంత గొప్ప అనుబంధమైనా, ఏడేడు జన్మలబంధమైనా ఒకరికొకరికి మధ్య బలీయమైన మానసిక అవసరం లేకపోతే ఆ బంధంలో ఆపేక్ష తగ్గుతుంది. ఏ కారణం చేతయినా కానివ్వండి, స్త్రీ, పురుషుడి మీద ఆధారపడడం ద్వారా కుటుంబ బంధం బలంగా ఉండేది ఇదివరకటి రోజుల్లో. స్త్రీలకు విద్యా, పరిమితమైన ఆర్థిక స్వేచ్ఛా అవసరమే.అయితే ఉద్యోగం చేసే అవసరం మాత్రం రాకూడదు. వారి శారీరక, మానసిక సామర్థ్యాలకనుగుణంగా వారికంటూ నిర్దిష్టమైన గృహధర్మాలు ఉన్నవి.

కుటుంబసభ్యుల మధ్యే కాక, బయట సమాజంలోనూ ఈ స్వార్థం (ఏకాకితనం) బహిర్గతంగా ప్రకటితమవుతూ ఉంది. వీధికొకటి చొప్పున ఉదయిస్తున్న వృద్ధాశ్రమాలు, అమ్మమ్మల అవసరం లేకుండా పిల్లలను చదివించే ఆట ఇళ్ళూ (ప్లే హోమ్స్) వంటివి దీనికి ఉదాహరణలు.

ఇంట్లో డబ్బు సంపాదించేవాడి అవసరమెంతో, డబ్బు సంపాదించలేని వారి (అమ్మమ్మలూ, తాతయ్యలూ వగైరా) అవసరమూ మన ముందుతరంలో బాగా ఉండేది. చిట్టి మనవళ్ళనూ, మనవరాళ్ళను కాళ్ళమధ్యన బోర్లపడుకోబెట్టుకుని లాల పోసే అవసరం తో మొదలయి, వారి ఆలనాపాలనా చూస్తూ, వారికి భాషా, మంచిమాటలూ, పనుల్లో నేర్పూ అన్నీ దగ్గరుండి చెప్పించే వాళ్ళ అవసరం తగ్గిపోతూ వస్తూంది. "శాస్త్రీయ" పద్ధతుల్లో ఆటా, పాట నేర్పడానికి ప్లే హోమ్స్, రెండున్నరేళ్ళవగానే ఎగబడ్డానికి స్కూళ్ళూ ఉన్నాయి.

("శాస్త్రీయ" పద్ధతుల్లో పిల్లలను చూసుకుని, వారికి తగిన తర్ఫీదు ఇవ్వబడును. అని బెంగళూరులో ఓ బోర్డు చూశా మొన్నామధ్య)

నిజమైన సమస్య, కొడుకులు స్వార్థపరులవడమో లేక, వృద్ధులు పనికిరాకుండా పోవడమో కాదు. అది బయట కనిపించే చిహ్నం (symptom) మాత్రమే. అసలు కారణం ఒకరి మీద ఒకరికి ఆధారపడే అవసరం లోపించటము. ఆ అవసరానికి ముఖ్య ఆలంబన అయిన ధనపరమైన స్వాతంత్ర్యం సమాజంలో ఎక్కువవటమూనూ. అవసరం లేనిచోట అనుబంధం మనగలగటం కష్టం.

ఈ రకమైన సమస్యలు నిర్మూలించబడాలంటే కీలకం - అవసరాలు కల్పించుకోవడంలో ఉంది. మారుతున్న సమాజ, కుటుంబ సమీకరణాల్లో సహాయం చెయ్యటంకన్నా, సహాయం అడగటం గొప్పవిషయం. మన పెద్దలను, మన బంధువులను, మిత్రులను సహాయం అడగటం వల్ల, "చులకన" అవుతామేమో అన్నది ఓ అపోహ. తన సామర్థ్యం మీద నమ్మకం ఉన్నవాడెవడూ ఈ అపోహలు పెంచుకోడు. అలా ఎవరైనా నిజంగా చులకన చేసినా కూడా నవ్వుతూ దులిపేసుకుని పోతాడు తప్ప తలకెక్కించుకోడు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడనేది పాతమాట. వలసినప్పుడు సహాయం అడిగి, ఆ తర్వాత కుదిరినప్పుడు తిరుగు సహాయం చేస్తూ, సాధ్యమైనంతవరకూ సంబంధాలను నిలుపుకునేవాడే ఇప్పటికి ధన్యుడు! అలాంటివాళ్ళ అవసరమే ఈ రోజు మనకు కావాలి.

Tuesday, October 27, 2009

తెలుగు - ఇంగిలిపీసూ!


అప్పి గాడు: ఏంది విశేషాలు?

సుబ్బి గాడు: అదేదో ఊర్లో టీచర్లు "తెలుగు మాట్లాడను అని పలకల మీద రాయించి పిలకాయల మెడకాయలకి యేలాడగట్టినారంట".

అప్పి గాడు : ఏమంటవ్ నువ్వు?

సుబ్బి గాడు : ఆ టీచర్ చెంపకు ఒక్కటి జవిరితే, అప్పుడు నెప్పికి "అమ్మా" అని అరుస్తదో, "ఓ మై గాడ్" అని అరుత్తదో సూడాల్నుంది.

అప్పిగాడు : నెప్పెడితే తెలుగు గుర్తొస్తది, కోపమొస్తే, ఎవున్తోనయినా వాదులాటకి దిగాల్నంటే మాత్రం ఇంగిలిపీసు గావల్న మన తెలుగోల్లకు.

సుబ్బిగాడు : అదేమన్నా, అట్లంటివి?

అప్పిగాడు : అవును మల్ల, ఏదైనా విషయం సాధ్యమైనంత స్పష్టంగా చెప్పాల్నంటే, లేదా, అది నాకు బాగా తెలుసు అని చెప్పాల్నంటేనో, మనోల్లకు తెలుగు మరుపొచ్చేస్తది.

సుబ్బి గాడు : ఎట్టేట్టా అర్థం గాలే.

అప్పిగాడు : ఈ సారి యాదైనా బ్లాగులో వాదులాట, సారీ, చర్చ జరిగేప్పుడు ఎల్లి సూడు, కొట్టుకోడం ఎక్కువయే కొద్దీ ఇంగ్లీసలాగ ధారగా కారిపోతా ఉంటది.

సుబ్బి గాడు : ఏందో అర్థం గాలే.

అప్పిగాడు : If the discussion gets deepened, You know you tend to choose ...

సుబ్బి గాడు : ఇంగ జెప్పద్దు. అర్థమయెలే!

Wednesday, September 16, 2009

సత్యక్రియ - అనుబంధ చర్చ

ఇదివరకు నేను రాసిన టపా సత్యక్రియ లో ఓ చర్చ జరిగింది. అందులో ఓ అంశం కాస్త సందిగ్ధంగా మిగిలింది. అందుకే ఈ టపా. (అయితే ఈ టపా తర్వాత కూడా ఆ చర్చ సందిగ్ధంగా మిగిలితే అందుకు నేను పూచీకత్తు కాదు).

జిడ్డు కృష్ణమూర్తి మీద నాకున్న అభిమానంతో, తన వాక్యాలను అక్కడక్కడా ఉటంకించే చాపల్యం తో ఆ టపాలో రాసిన వాక్యం - "The unknowable can never be known". ఈ మాట మీద జరిగిన చర్చ అక్కడే చదవడం ఉత్తమం. చివరకు శాంతియుత ఒడంబడిక లో భాగంగా, కామేశ్వర్రావు గారి ప్రశ్నకు నేను మరికొన్ని ప్రశ్నలు జోడించి, విజయవంతం(బలవంతం?) గా దాటెయ్యడం జరిగింది. :-)

అక్కడ ప్రశ్ననే ఈ విధంగా మారుస్తున్నాను, కాస్త సౌలభ్యానికి.

"ఓ పరమ సత్యాన్ని (అది దేవుడు/బ్రహ్మం/పరమాత్మ/మోక్షం/నిర్వాణం/ ఏ పేరుతో పిలువబడినా) కనుగొన్న వాడు, దానిని ఇతరులకు చెప్పడానికి (to communicate) వీలవుతుందా? దాని గురించి విన్నవాడు, మరికొంతమందికి తెలియజెప్పడానికి వీలవుతుందా? ఒక వేళ వీలయితే ఏ విధంగా?"

ఈ ప్రశ్నకు జవాబు కృష్ణమూర్తి ద్వారానే వినాలి. ఓ చోట ఇదే ప్రశ్నకు చెప్పిన జవాబు ఇక్కడ సంభాషణలో భాగంగా చదవచ్చు. లేదా ఇక్కడ పీడీఎఫ్ ను దింపుకుని, ఐదవ పేజీ లోని ప్రశ్నను చదవవచ్చు. (ఈ సంభాషణ పూర్తిగా చదివితే ఇంకా మంచిది)

JK_VenkaTeSaananda_1
JK_VenkaTeSaananda...
Hosted by eSnips


ఇక పోతే, నేనక్కడ దాటవెయ్యడానికి సంధించిన ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం, కొంత కథనం సహాయం కూడా అవసరం.

గౌతముడు కపిలవస్తు గణతంత్రానికి యువరాజు. అనుకూలవతి అయిన భార్య, చక్కని సంసారం, ఒడిదుడుకులు లేని జీవితం. అయితే జీవితం అంటే ఇంకేనా? మరింకేదైనా ఉందా అన్న "చింత" ఆయనను అప్పుడప్పుడూ బాధిస్తుండేది. ఓ రోజు ఆయన రాచవీధిలో విహరిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన - ఓ వ్యాధి గ్రస్తుణ్ణి, ఓ మరణాన్ని, ఓ ముసలి వ్యక్తిని, ఓ శ్రమణుణ్ణీ చూశాడు.

గౌతముడు గమనించిన విషయం ఏమిటంటే - దుఃఖం అన్నది ఉన్నది. (అన్ని సౌకర్యాలు ఉన్న తనకు కూడా ఏదో తెలియని దుఃఖం ఉన్నది!). ఆ దుఃఖం భౌతిక కారణాలపై ఆధారపడి లేదు. (అన్ని సంపదలు ఉన్నా తనలోనూ దుఃఖం ఉన్నది.కాబట్టి దుఃఖానికి భౌతిక కారణం లేదు) ఈ దుఃఖ కారణాన్ని కనుక్కోవాలి! పరిహరించాలి!

(దుఃఖం ఉన్నదన్న విషయాన్నిపాశ్చాత్య చింతనలో షోపెన్ హూవర్ అనే తత్వ వేత్త కూడా చెబుతాడు. అయితే పాశ్చాత్యులది పద చర్చ, rationalization మాత్రమే. స్థిరమైన అన్వేషణ కాదు)

ఈ ఉద్దేశ్యంతోనే బుద్ధుడు ఆరేళ్ళు రకరకాలయిన పద్దతులలో సాధన చేశాడు. ఏ పద్ధతిలోనూ సమాధానం లభించలేదు. అలా నిస్పృహావశిష్టుడైన ఆయనకు ఓ రోజు, ఓ లిప్తలో తన ప్రశ్న, తనలోనే కరిగిపోయి, సత్య దర్శనం కలిగింది. నిజమైన ప్రశ్నలకు సమాధానం - జవాబు లో ఉండదు. ప్రశ్న - జవాబు అన్నవి ద్వైధీభావాలు. జవాబు భౌతికం మాత్రమే. ప్రశ్న mitigate అవడమే నిజమైన సమాధానం. అన్ని రకాల ద్వైధీభావాలు నశించి, తనను ఇతరులలోనూ, ఇతరులలో తనను, ఆ మాటకొస్తే అన్ని ప్రాణులలోనూ, కనిపిస్తున్న, కనిపించని అన్ని వస్తువులలోనూ తనను చూడడమే ఆ పరమ సత్యం.

జిడ్డు కృష్ణమూర్తి అధ్యాత్మిక అనుభవం (నిర్వాణం) పొందినప్పుడు, తన అనుభవం తన మాటల్లో.

There was such profound calmness both in the air and within the lake, I felt my physical body, with its mind and motions could be ruffled on the surface but nothing, nay nothing, could disturb the calmness of my soul ... nothing could ever be the same. I have drunk at the clear and pure waters at the source of the fountain of life and thirst was appeased. Never more could I be thirsty, never more could I be in utter darkness ... I have touched compassion which heals all sorrow and suffering; it is not for myself, but for the world ... I have seen the glorious and healing Light. The fountain of Truth has been revealed to me and the darkness has been dispersed. Love in all its glory has intoxicated my heart; my heart can never be closed. I have drunk at the fountain of Joy and eternal Beauty. I am God-intoxicated’.

అది శాశ్వతమా? అశాశ్వతమా?
నిర్గుణోపేతమా? సగుణోపేతమా?

శూన్యత్వమా? పూర్ణత్వమా?


ఇప్పుడు కొన్ని నిర్వచనాలు కూడా చూద్దాం.

మోక్షం - పునర్జన్మ రాహిత్యం (మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఈ మాసం స్వాతి)
నిర్వాణం -

"అప్రహీణం అసంప్రాప్తం అనుచ్చిన్నం అశాశ్వతం
అనిరుద్ధం అనుత్పన్నమ్ ఏతన్నిర్వాణముచ్యతే"

"పరిత్యజించనిది, పొందనిది, ఉచ్చేదం కానిది, అశాశ్వతం, అనిరోధమూ, ఉత్పన్నం కానిది నిర్వాణం"

మన చర్చకు వద్దాం.

ఈ పూర్ణత్వాన్ని/శూన్యత్వాన్ని గురించి ఒకరికి చెప్పడానికి వీలవుతుందా? ఆ మాటకొస్తే - దాన్ని "తెలుసుకోవడం" జరుగుతుందా? Does the emptiness (unknowable) can ever be known?

కాబట్టి సత్య (ఆత్మ) దర్శనం కొరకు ఒకరిని ప్రేరేపించటం (ఆత్మదీపోభవ) మాత్రమే బుద్ధులు చేయగలిగిన పని.

(దీని తర్వాత భాగం అవసరమయితే మళ్ళీ ఇంకొకసారి)