Showing posts with label musings. Show all posts
Showing posts with label musings. Show all posts

Monday, December 7, 2015

విశ్వనాథుల వారి గిరిక

శ్రీమాన్ రామేశ్వరశాస్త్రి గారు త్రయీవిద్యకు నిదర్శనం. భారతదేశపు ఆత్మ. సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి అవతారం. ఈయన సుబ్బన్నపేటలో జన్మించారు. సనాతనవాది, సాంప్రదాయానురక్తుడు అయిన ఈయన తన భార్యల వర్ణాల విషయంలో మాత్రం ఆధునికంగా ఆలోచించి సోషలిజం పాటించారు. అనగా, ఈయన బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు స్త్రీలను వివాహమాడిరి. పంచమవర్ణమొకటి కూడా అదనంగా ఉన్నది కాబట్టి బహుశా అందుకు ప్రతీకగా ఒక ఉంపుడుకత్తెను కూడా వారు చేరదీశారు.

కాలక్రమంలో వారు తమ భార్యలయందు, తన ఉంపుడుగత్తె యందూ కూడా ఉ(అను)చితమగు సంతానములను బడసిరి. బ్రాహ్మణభార్యకు బ్రాహ్మణోచిత లక్షణాలతో ధర్మారావు, క్షత్రియభార్యకు క్షత్రియోచిత లక్షణాలతోనొక పుత్రుడు, వైశ్యభార్యకు వైశ్యోచిత లక్షణాలతోనొక పుత్రుడు, శూద్రభార్యకు పాములా వంకర తిరిగి శారీరక, మానసిక అవలక్షణాలతో, పొద్దస్తమానం చెట్ల, పుట్టల వెంబడి తిరిగే పాము వంటి ఒక కొడుకూ కలిగారు. శూద్రభార్యకే ఇలాంటి కొడుకు కలుగుట యాదృచ్ఛికం. ఆ బాలునికి "పసిరిక" అని పేరు పెట్టారు. ఉంపుడుగత్తెకూ ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు గిరిక.

అందరూ కాలక్రమంలో పెరిగి పెద్దవారయ్యారు. ధర్మా’రావు’ తపస్సూ, ధ్యానమూ, స్వాధ్యాయమూ, వేదాధ్యయనమూ వంటివేవీ చేయకపోయినా పేరుకు తగినట్టు ధర్మమూర్తి. పుట్టడంతోటే అతనొక జ్ఞాని. ఈతను గిరికను చెల్లెలుగా చూచుకుంటూ ఉంటాడు. 

గిరిక పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడామె మహాసౌందర్యవతి. ఈమెకు తన కులం పట్ల, తన జాతి పట్ల, అంతులేని వేదన. పుట్టుకతోనే తనొక నీచురాలినని, తన కులం నీచకులమని ఆమెకు తెలిసి వచ్చింది.  తన తండ్రి శ్రీ మాన్ రామేశ్వర శాస్త్రి గారి పవిత్రత, దైవాంశ, మహత్త్వమూ - కన్న కూతురి కులాన్ని ఉద్ధరించడానికి పనికిరాక, ఊరిలో అందరి జీవితాలనూ ఉద్ధరించుటకు పనికి వచ్చింది.అది ఏమి దరిద్రమో యేమో - తనకు తండ్రి కులం తాలూకు పవిత్రత రాకపోయినా, తల్లి కులం తాలూకు నీచత్వం మాత్రం తగులుకుంది! ఇది యే జన్మాంతరసంచితపాపమో! ఆ న్యూనతా భావంతో ఆమెలో దైన్యం అంకురించింది. ఆమెను ధర్మారావు ఓదారుస్తున్నాడు. ఆమె పట్ల ఎనలేని సానుభూతి కనబరుస్తున్నాడు. 

ఈ దైన్యం మితి మీరి పోవడంతోటి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాగైనా సరే తన కులం తాలూకు నీచత్వాన్ని తాను ప్రక్షాళన చేసుకోవాలి. కానీ ఎలాగ? నీచత్వం సబ్బుతో కడిగితే పోయే గబ్బు కాదు కదా. అందుకని ఆమె కృష్ణస్వామి దేవాలయంలో దేవదాసీ కావడానికి నిశ్చయించుకుంది. ఆ స్వామినే మనసారా నమ్మి, భర్తగా భావించి ఆ దేవాలయంలో నృత్యగాన విశేషాలతో పండుగలసమయాలలో స్వామిని అర్చిస్తూ, ఆ విధంగా ’తన’ (తల్లి) కులానికి ఉచితమైన పని చేస్తూ, చివరకు స్వామిలో ఐక్యం అయి, ఆత్మార్పణ గావించుకొని తన జన్మాంతర సంచిత పాపాన్ని కడిగివేసుకుంటుంది. అలా కడుక్కుంటే, ఆ తర్వాత వచ్చే జన్మలో ఆమెకు మంచి జన్మ లభిస్తుంది. ఇది ఆమెకు లైఫ్ టైమ్ అజెండా.

గిరిక తల్లి రత్నావళి నీచురాలు. నీచకులజురాలు. కానీ అమెను ఉంచుకున్న రామేశ్వరశాస్త్రి గారు ధర్మమూర్తి. ఆమె నీచత్వం ఆయనకు అంటదు. "ధర్మేషు అర్థేషు కామేషు మోక్షేషు చ నాతిచరామి.." అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, వివాహం చేసుకోలేదు కాబట్టి, ఆమె నీచత్వమనే (కుల) ధర్మంతో ఆయనకు సంబంధం లేదు. 

తుచ్ఛమైన లౌకిక విషయాలపై అనురక్తిని పెంచుకుని అవి తీరక మరణించడం వ్యర్థం. సాక్షాత్తూ భగవంతునికి మనస్సునర్పించి, తన కులానికి పట్టిన నీచత్వాన్ని కడిగివేసుకోవాలని సంకల్పించడం ఆత్మార్పణ. ఇదొక మహనీయమైన చర్య. ఈ మహత్వమైన చర్యను, గిరిక దేవదాసీ కావడాన్ని ధర్మారావు సంపూర్ణంగా, ఇష్టపూర్వకంగా ఆమోదించాడు. అంతే కాక, ఆమెకూ, పాఠకులకూ "భోగాంగన వేరు, వారాంగన వేరు" - అని కూడా నచ్చజెప్పాడు.

ఈ విధంగా ధర్మమూర్తి ధర్మారావు చెల్లికి ’అమ్మాయీ! ఈ డాన్సులవీ ఎందుకు? మంచి అబ్బాయిని చూసి చక్కగా పెళ్ళి చేస్తా, భర్తతో కాపురం చేసుకో, పిల్లలను కను,భర్తను, ఆ పిమ్మట సంతానాన్ని ఆశ్రయించి సుఖపడు’ అని తను వ్యక్తిగతంగా పాటించే నశ్వరమైన లౌకిక ధర్మాలు చెప్పకుండా, ధర్మబద్ధంగా ఆమెను దేవదాసీ కావడానికి ప్రోత్సహించాడు. ఆమెకు నాట్యశాస్త్రమూ, అలంకారశాస్త్రమూ వీటికి చెందిన పాఠాలు కూడా చెప్పసాగినాడు. గిరిక ఆత్మార్పణం (Neo Suicide?) చేసుకోబోతున్నదని కూడా ధర్మారావు గారికి తెలుసు. ఈ విషయాన్ని అతను తన భార్య అరుంధతికి చెవిలో చెబుతాడు.చెల్లెలు ఛస్తుందని తెలుస్తున్నా, ధర్మానికి కట్టుబడి, ఆమె శారీరక లేదా మానసిక రోగానికి మందు ఇప్పించక, ఆమె జీవితాన్ని దేవదాసీ తనానికి అంకితం చేసేలా ప్రేరేపించి, ఆమె ఛావును ఆమె ఛావనివ్వడం ధర్మారావు గారి ఉత్కృష్టమైన నీతికి, అన్నగా ఆతను ఆచరించే ఉదాత్తమైన ధర్మానికి ప్రతిబింబంగా స-హృదయులైన పాఠకులకు అర్థమవుతుంది. అరుంధతి, ధర్మారావులే కాక ఇతర బంధువర్గమూ ఆమెను ఈ విధంగా ఆదరిస్తున్నారు. 

గిరిక కృష్ణస్వామిని ఆరాధిస్తూనే ఉన్నది. ఆ ఊళ్ళో ఒకరిద్దరు ఆమెను కామిస్తే వారిబారి నుండి ధర్మారావు గిరికను కాపాడినాడు. గిరికకూ వదిన అరుంధతికీ కూడా మంచి అనుబంధం ఉంది. అప్పుడప్పుడూ ఆమె కూడా గిరికతో బాటూ దేవాలయానికి వెళుతుంది. అంతే కాదు, ఆ వదినామరదళ్ళ మధ్య సరస సంభాషణలూ చోటు చేసుకుంటూ ఉంటాయి.

"ఏవమ్మో! నేనూ గుడికొస్తే మీ ఆయన నిన్నే చూస్తూ మమ్మల్ని గమనించడేమో!" (మీ ఆయన = శ్రీకృష్ణుడు)
"ఆయన భగవంతుడు.అందరినీ సమానంగా ఆదరిస్తాడు"
"సరసురాలివే!"

ఇలాంటివే కాక "నీకింత అవిదితశ్రోణీభరమేలనే?" (శ్రోణి = జఘనం = కటిభాగం = పిరుదులు) వంటి చిలిపి సంబోధనలూ వారిద్దరి మధ్యా కద్దు.

గిరిక ధర్మారావుకు చెల్లెలుగా ఈ విధంగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ, డాన్సులవీ చేసుకుంటూ చివరికి ఒక కృష్ణాష్టమి నాడు - నృత్య, నాట్య సంగీతాదులతో ఎందరినో మెప్పించి ప్రాణత్యాగం చేసింది.

ఆమె దేవదాసీ కావడానికి మూల కారణమేమిటి? ఆమె కులం తాలూకు నీచత్వప్రక్షాళన. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? లేదా? ఆమె కులానికి పట్టిన నీచత్వం పోయిందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఉండదు కూడా. రచనలో పాత్ర - రచయిత యొక్క (స్వార్థ) సిద్ధాంతానికి ఉపయోగపడిన తర్వాత ఆ పాత్ర లక్ష్యం గురించి పట్టించుకునేదెవరు? 

రచయిత ఆధ్యాత్మిక విదుడు, బ్రాహ్మీమయమూర్తి. అలాంటి రచయిత రచనలో గొప్ప విషయాలు వెతకటమే పాఠకుల పరమావధి. జ్ఞానపీఠం తెచ్చుకున్న రచయిత తాలూకు రచనలో ఏం రాసినా తప్పు లేదు. పీఠం ఎక్కారా లేదా అన్నది ముఖ్యం. రచనలో నిర్దయ, క్రౌర్యం, అసహజత్వం, కుతర్కం, మతిమాలిన విషయాలు - ఇవన్నీ పాఠకులకు అనవసరం.

***************************************

వేయిపడగలు అనే వచన కావ్యంలో రచయిత గారు చిత్రించిన గిరిక పాత్ర స్థూలంగా ఇది. ఈ పాత్ర ద్వారా, పాత్ర మూలంగా ఆ రచయిత ఎంతో జ్ఞానాన్ని పంచారు. హంస లాగా మంచి విషయాలను మాత్రమే స్వీకరించాలి. నవలలో పాత్ర కృష్ణస్వామికి అంకితమైతే, అది భక్తి కింద భావించడం పాఠకుల బాధ్యత. ఆమె కులమూ, ఆ కులానికి పట్టిన చీడా, పవిత్రాశయం (ఆమె కులానికి అంటిన గబ్బు తొలగించుకోవడం) కోసం పోయిన తుచ్ఛమైన ప్రాణం గురించి ఆలోచించకుండా పాఠకులూ ధర్మారావులా ధర్మమూర్తులు కావాలని ఈ పాత్ర ద్వారా గ్రహించాలి. ధర్మారావులానే పాఠకులూ ఉదాత్తంగా ఉండాలని పాత్ర ద్వారా రచయిత చెప్పించినాడు. ఇది ఆధునికసాహిత్యంలోనే గొప్పదైన వేయిపడగలలో గిరిక పాత్ర, ఆ పాత్రల చుట్టూ ఉన్న మహత్వమున్నూ.

Saturday, November 1, 2014

డైరీలో ఒకరోజు...

కాలం....

ఏది సంస్కృతమై, సుపరిష్కృతమై ఉంటుందో అది మాత్రమే కాలానికి లోబడి ఉంటుంది. Only products are definable in the realm of "time". మరొక విధంగా చెబితే - ఏవి ఉత్పన్నములై, నశిస్తాయో వాటికే అతీతం (భూతకాలం), అనాగతం (భవిష్యత్తూ) ఉంటాయి. ఉత్పన్నములు, నశ్యములు కానివాటికి వర్తమానం తప్ప మరొక కాలం లేదు. అవి ప్రత్యుత్పన్నములు. క్షణక్షణానికి రంగులు మార్చే ఆకాశం, కణకణానికి రూపు, రంగూ మార్చే మేఘమాల, మట్టివాసనా, సముద్రపు అల.........భవమూ....

అతీతమూ, అనాగతమూ లేక, భవం లో మాత్రమే మనగలిగిన మహానుభావులను ద్రష్టలు అంటాం. వీరికి ప్రతిక్షణమూ వినూత్నమైనది. ఇది భూతకాలపు తెరలతో, భవిష్యత్కాలంపై భయంతోనో, లాలసతో కూడిన చూపు కాదు. ప్రతి క్షణాన్ని, తనదైన క్షణంగా చూడగలిగిన ఒక విస్పష్టమైన దృష్టి. ఇలాంటి సంబుద్ధత్వం పొందిన మహానుభావులు నూటికో కోటికో ఒక్కరు. ఏ సిద్ధార్థుడో, యే జిడ్డు కృష్ణమూర్తో....

అతి సాధారణమైన మనుషులకూ ఒక్కొక్కసారి అపురూపమైన ’భవం’ ఒక చల్లటి స్పర్శలా తాకి కాలగర్భంలో ఘనీభవించి అనుభవం గా,అనుభూతిగా మిగిలిపోతుంది. అలాంటి ఒక రోజు...

కార్తీక మాసం మూడవరోజు, ఆదివారం...

****************************

తెల్లవారు ఝామున ఆరున్నర. కరెంటు పోయి, ఫేను ఆగిపోతే, నిద్రలో జోగుతూ లేచి తలుపు తీయగానే చల్లటి గాలి,వర్షపు చినుకులూ ఘుప్పుమని తాకాయి. అప్పటికే సంహిత నిద్ర లేచి, మేడనుండి దిగివచ్చింది. అమ్మా నాన్నలిద్దరికీ లేని ’పొద్దున పూట నిద్రలేవడం’ అనే పాడు అలవాటు దానికి జేజి దగ్గర్నుంచో, అమ్మమ్మ దగ్గర్నుంచో వచ్చినట్టుంది! 

ముందు రోజు రాత్రి పడిన వర్షమూ, పొద్దున పూట చలి తాలూకు మంచూ, మట్టివాసనా, దూరంగా వినిపిస్తోన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి విష్ణుసహస్రనామమూ, నిన్నటి రాత్రి వర్షం జామకాయపై చేసిన కాకి ఎంగిలీ..... 

తులసి కోటను పరామర్శిస్తూన్న గుమ్మడిపాదు... 



వాతః (గాలి) అంటే వాహకంగా పనిచేసేదిట. చల్లదనాన్ని, చిక్కటి సువాసననూ తీసుకొస్తోంది పెరటి గాలి. మా పెరడు ప్రతి ఉదయంలాగే పారిజాతం పూల సువాసనలతో ఘుమాయిస్తోంది. పూలు ఒక గిన్నెలో ఏరడం మొదలెడితే, ఒక గిన్నె నిండా సమకూరినాయి. వెన్నముద్దను గిన్నెలో పెట్టినట్టు ఉంది ఆ పాత్ర. 

పక్కకొస్తుంటే - వర్షపు చినుకులతో తడిచిన పచ్చటి ఆకుల మధ్య ఎర్రటి పువ్వొకటి కనబడింది. అది జపాకుసుమం......కాదు కాదు, Hibiscus flower.

అది గిన్నెపైన చేరింది. 

****************************

ఓ గంటా, గంటన్నర తర్వాత...

 సన్నగా వర్షం మొదలైంది. పారిజాతపూలతో పూజ చేయాలి. రోజూ వస్తున్నదే అది, అయితే కల్పద్రుమాణాం పారిజాతః - పారిజాతమే ఒక కల్పవృక్షమూ, సాక్షాత్తూ భగవంతుని నివాసమైనప్పుడు, మరెక్కడ పూజ చేయాలి? పారిజాతాలతో పారిజాతం చెట్టుమూలాన్ని సంహిత ఇలా అలంకరించింది.

****************************

అగ్గలమౌ యాకలి కిక
తగ్గని మహగొప్ప మందు తడబడుటేలా?
సిగ్గెందుకు? దంచి కొడుదు 
నుగ్గాణికి సాటి యేది ఉర్విని కంటే!

మీరు ఉగ్గాణి (వీలైతే వేడి మిరపకాయబజ్జీతో బాటు) తినకపోయి ఉంటే, రాయలసీమ కు వెళ్ళడం సంభవిస్తే, ఉగ్గాణి అన్న పదార్థాన్ని మాత్రం రుచి చూడకుండా వెనుదిరక్కండి. తిరపతి లడ్డూ తినకపోవడం కన్నా కొంచెం చిన్న సైజు పాపం రాయలసీమ కు వచ్చి ఉగ్గాని తినకపోవడం. ఈ పాపానికి నిష్కృతి లేదు బాబూ, నిష్కృతి లేదు. (ఈ డైలాగు గుమ్మడి వాయిస్ లో ఊహించుకుని చదువుకోండి) 

పరమపదసోపానపటంలో ఓడిపోతేనేం? ఉగ్గానితో పరమపదం చేరుకున్నాక? 

అన్నట్టు మీకు పులి మేకా ఆట తెలుసా?

****************************

బయట వర్షం ఓ మోస్తరుగా కురుస్తూనే ఉంది. పైన డాబా లో చేరి, తూము నుంచి కిందకు వచ్చిన వర్షం నీళ్ళను మా పెరట్లో చెట్లకు పోస్తూ, వర్షంలో తడిస్తే జ్వరమొస్తుంది అన్న డిఫైన్డ్ ప్రాసెస్ కు కట్టుబడి కోపంతో ఉడికిపోతున్న మా ఆవిడను ఉడికిస్తూ ఓ గంట వర్షంలో బాగా నానిన తర్వాత లోపలికి వచ్చేశాను. 

****************************

ఉన్నట్టుండి ఎండ మొదలైంది. కాసేపటికి చురచురమంటూంది. సరిగ్గా ఇలాంటప్పుడు చెట్టు కిందనిలబడి చెట్టును కుదిపి, ఆ వర్షం చినుకులు మీదపడితే ఎలా ఉంటుందోనని ’మేర్లపాక మురళి’ అనే  శృంగార (సెమీ బూతు) రచయిత శృంగారపురం ఒక కిలోమీటరు అనే ఒక నవల్లో  చెప్పాడు. అది ఒక అందమైన పక్కింటమ్మాయిని ముద్దుపెట్టుకున్నట్టు ఉంటుందిట. నిజమో అబద్ధమో అనుభవజ్ఞులకే తెలుసు.

నిమ్మచెట్టు కిందికెళ్ళి చెట్టును ఊపగానే చినుకుల సంగతేమో కానీ నిమ్మముల్లు వచ్చి చేతికి తగిలి చెయ్యి చురుక్కుమంది. వెధవ ఆలోచనలకు పర్యవసానం ఇలాగే ఉంటుంది.  

ఇంతలో సీతకోకచిలుకల జంట ఒకటి తయారయింది. ఈ మధ్య ఈ జంట తెగ తిరుగుతోంది మా పెరట్లో. ఆ జంటలో ఒక దాన్నైనా పట్టుకోవాలని చాలా సేపు ట్రై చేస్తే ఒక్కటీ దొరకలేదు. కానీ మాంఛి టైమ్ పాస్.  అన్నట్టు సీతాకోకచిలుక రెక్కలను ముట్టుకుంటే వచ్చిన మసి/మరకను బెట్టు పెట్టుకుంటే మంచిగ చదువొస్తుందంట. సంహిత ఫ్రెండు చెబితే నాకు చెప్పింది. 

****************************

సాయంత్రం - మూడు.

1926 లో రాయలసీమలో పప్పూరు రామాచార్యులు అనే మహానుభావుని సంపాదకత్వంలో ఒకానొక పత్రిక మొదలయ్యింది. ఆ పత్రిక పేరు శ్రీ సాధనపత్రిక. ఎలాగైతే భారతి పత్రికను మన ఆంధ్రదేశపు సాంస్కృతిక వారసత్వంగా మన్నిస్తామో, అలాగే శ్రీ సాధన పత్రిక రాయలసీమ తాలూకు సాంస్కృతిక భారతి. చిలుకూరు నారాయణరావు "దత్త మండలాలు" అన్న పేరును నిరసిస్తూ వ్రాసిన పద్యాలు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, గోపాలకృష్ణశర్మ ప్రభృతుల వ్యాసాలు, విద్వాన్ విశ్వం గారి అనేక రచనలూ, ఇంకా నాటి సీమ రచయితల గొప్ప కథలు, కవితలూ, ఇలా ఎన్నిటినో కలబోసుకుని, చాలా యేళ్ళు వెలువడిన పత్రిక ఇది. ఈ పత్రిక కాలగర్భంలో కలిసిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో అనంతపురంలో ప్రెస్ క్లబ్ లో, మరి ఒకరిద్దరి వద్దా, ఈ పత్రిక దాదాపుగా చినిగి పోతున్న దశలోని కాపీలు దొరికాయి. వీటి గురించి ఆరాటపడి స్కాన్ తీసిన వారు హరినాథరెడ్డి గారనే ఒక ఉపాధ్యాయుడు, ప్రెస్ అకడెమీ వారు, నాగరాజారావు గారనే వయోవృద్ధులు.

మా మిత్రులు కోడిహళ్ళి మురళీమోహన్ ప్రేరణతో ఆ రోజు నాగరాజారావు గారిని కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఆయనను అదివరకే ఓ మారు కలిసినా, ఈ సారి చక్కగా మాట్లాడే అవకాశం కలిగింది. ఆయన ఒక్క సమాచార నిధి. 

సాధన పత్రిక కాపీలను మురళీమోహన్ గారు ఒక వెబ్ సైట్ లో పెడుతున్నారు. ఆ వెబ్ సైట్ ఇది.

http://sreesadhanapatrika.blogspot.in/

****************************

తిరిగి ఇంటికి వచ్చే సరికి వాతావరణం సరిగ్గా, ఎండకూ, వర్షానికి చలికి మధ్యలో ఉంది. దానికి తార్కాణమన్నట్టు మూడురంగుల మేఘాలతో ఆకాశం అలంకరించుకుంది. 

మా పాపను తీసుకుని బండిలో అలా ఓ మారు తిరిగి వచ్చేసరికి చీకటిపడింది. ఏ నాటకానికైనా చివర తెర పడాల్సిందేగా! 

రోజు మాత్రమే కరిగిపోయింది. ఆ పరిమళం తాలూకు అనుభూతి మనసు పొరలలో మనోజ్ఞమైన భావంగా అలానే ఉంది.

"భావస్థిరాణి జననాంతరసౌహృదాని".

Monday, September 16, 2013

మృచ్ఛకటికం - కొన్ని ఆలోచనలు


రచయితకు గొప్ప ఉదాత్తత (sensibility) అన్నది ఉన్నప్పుడు, ఆ ఉదాత్తతను ప్రతిబింబిస్తూ ఒక పాత్ర వెలువడినప్పుడూ, రచయిత యొక్క sensibilities కు తగిన పాఠకుడు ఆ రచనను చదవడం తటస్థించినప్పుడు ఆ రచయితకూ ఆ పాఠకుడికి మధ్య జరిగే ఏకాంతమైన అవగాహన సద్యఃపరనిర్వృతి అని నా అభిప్రాయం. దీన్నే రసనిష్పందం అనవచ్చునేమో. రాళ్ళపల్లి వారు ఒకచోట అన్నట్టు రసం అంటే తొమ్మిది భేదాలతో మాత్రమే నిర్వచింపదగిన emotion మాత్రమే కాదు. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఏదో అనుకూలం కోసం రసాలను నవవిధాలుగా వింగడించుకున్నప్పటికీ రసనిష్పందం యొక్క ఖచ్చితత్వం ఆ వింగడింపులో మాత్రమే లేదు.

సద్యః పరనిర్వృతి కలిగించే రచయితను కవి అని, ఆ పాఠకుడిని సహృదయుడని అనవచ్చునేమో.

వ్యక్తి వ్యక్తికీ సున్నితత్వపు తేడాలు సహజం. అదే స్థాయిలోనూ పాఠకుల సహృదయత కూడా మారుతుంది. అభిమాన రచయిత కూడా మారుతాడు. శాశ్వతంగా అందరికీ నచ్చే రచయిత కానీ, నచ్చే రచన కానీ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఫలానా రచన నా అభిమాన రచన, ఫలానా రచయిత నా అభిమాన రచయిత అన్నది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. అభిప్రాయాలకంటే రచన తాలూకు sensibilities గురించి మాట్లాడుకోవడం మంచిది.

వర్షాకాలం గురించి అనుకోగానే నాకు శూద్రక మహాకవి, మృచ్ఛకటికకావ్యం, అందులో వర్షర్తు వర్ణనా గుర్తొస్తాయి. అలాంటి వర్ణన అంతకన్నా గొప్పగా ఇతర కావ్యాలలో ఉండవచ్చు గాక. అయితే మృచ్ఛకటికం తాలూకు ఉదాత్తత కేవలం వర్ణనలో లేదు. అది దృశ్యకావ్యమవడం మూలాననూ, అక్కడ కవి కల్పించిన సన్నివేశం వల్లనూ, వసంతసేన పాత్ర యొక్క ఉదాత్త స్వరూపం నేపథ్యంగానూ ఆ వర్ణన యొక్క సౌందర్యం వ్యక్తమవుతుంది.

వసంతసేన ఒక గణిక, క్షత్రియ. ఈమె దరిద్రుడూ, అప్పటికే భార్య, పుత్రుడు ఉన్న ఒక సార్థవాహుణ్ణి (బ్రాహ్మణుడు/వైశ్యుడు) ప్రేమించింది. ఒకానొక రాత్రి తన ప్రియుని ఇంటికి బయలుదేరింది. ప్రియుణ్ణి మొదటి సారి చూడబోతున్న తరుణం. ఆమె చిత్తం లోపల ఉద్వేగమూ, ఆనందమూ పెనవేసుకుని ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రశ్న. గణిక - అంటే ఒక వేశ్యకు - అంటే పురుషసంగమం అలవాటైన ఒక యువతికి - ఒక మొగవాని పట్ల అలాంటి భావాలు ఉండటం ఎలా సంభవం? సరిగ్గా ఇక్కడే పాత్ర ఉదాత్తత - సహృదయునికి తెలుస్తుంది. శీలం వేరు, స్వచ్ఛత వేరు. శీలం సామాజికం అయితే స్వచ్ఛత మానసికం. రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు, దోహదకారులూ కానవసరం లేదు. సందర్భమో కాదో తెలియదు కానీ ఈ మధ్య మరోసారి చదివిన యండమూరి నవల అష్టావక్ర గుర్తొస్తుంది. అందులో ప్రతిమా అగర్వాల్ పాత్ర ఇదే పాయింట్ మీద నడుస్తుంది. అలాగే హంపి నుండి హరప్పా దాక లో బసివి నాగమ్మ గురించి రామచంద్రగారు వివరిస్తారు. ఆ పాత్ర గురించి చదివిన తర్వాత పాఠకుడికి సానుభూతే తప్ప ఏ విధమైన వికారమూ కలుగదు. వసంతసేన కూడా అలాంటి ఒక ఉదాత్తమైన పాత్ర.

వసంతసేన ఉద్వేగానందాలను ప్రతిబింబిస్తూ బయట వాతావరణం. కుండపోతగా వర్షం. ఆ వాతావరణంలో వసంతసేనకు తోడుగా గొడుగు పట్టి వెంట వస్తున్న విటునికి, వసంతసేనకూ మధ్య వర్షం గురించిన సంభాషణ.

ఇందులో ఓ రెండు పద్యాలు.

గర్జంతి శైలశిఖరేషు విలంబిబింబా మేఘా వియుక్తవనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళశృంగైః ||

వసంతసేనా! చూడు!చూడు! శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ!

మూఢే ! నిరంతర పయోధరవా మయైవ కాంతః సహాభిరమతే యది కిం తవాత్ర!
మాం గర్జితైరితి ముహుర్వినివారయంతీ మార్గం రుణద్ధి కుపితేవ నిశా పత్నీ ||

‘ఓసి మూర్ఖురాలా! వసంతసేనా! దట్టమైన మబ్బులున్న (ఇఱుకు పయోధరాలు) ఉన్న నేను నా కాంతుడితో రమిస్తూంటే, మధ్యలో నీకేంటి?’ అని ఉరుములతో మాటిమాటికీ నివారిస్తూ (నాపై ఉరుముతూ) ఈ నిశ, సవతి లా మారి, నా దారిని అడ్డగిస్తూంది కదా!
(సవతి ఎందుకంటే, తనను తన ప్రియుడి వద్దకు చేఱుకోనీకుండా అడ్డుపడుతున్నది కాబట్టి) అని వాపోతుంది. పయః అన్న సంస్కృతపదానికి నీరు, పాలు అని రెండు అర్థాలు. నిరంతర పయోధరములు అన్నది శ్లేష. దట్టమైన మబ్బులు అని ఒక అర్థం, (నిర్ + అంతర) ఇఱుకు పయోధరాలని మరొక అర్థం.

********************************************
ఇక్కడ మరో సారి అనంతకృష్ణశర్మ గారిని గుర్తు తెచ్చుకుంటాను. యే ఉదాత్త రచన అయినా రచయిత యొక్క శాంతస్వభావం మూలం కావాలి. ధిషణాహంకారాలూ, పాండిత్యప్రగల్భా వాచ్యార్థాల ప్రాభవం పెంపు చేయవచ్చును, కానీ ఉదాత్తమైన భావం కవి అంతః కుహరాల్లోనుంచి రావాలి. అందుకు శాంతమే ఆలంబన. నిజమైన శృంగార వర్ణన - అది నిజంగా సున్నితత్వాన్ని నింపుకొన్నదైతే ఉద్రేకాన్నీ, ఆవేశాన్నీ కలిగించరాదు. అది చిత్త ఆహ్లాదకారకం కావాలి. అంతమాత్రమే కాదు, రంజింపజేయాలి. కవి తాలూకు దార్శనికత సహృదయుడైన పాఠకుడికి దారి చూపాలి.

మృచ్ఛకటికం కావ్యంలోని ఈ ఘట్టం నిజంగానే వర్షంలో తడుస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అనుభవైకవేద్యం. సన్నివేశం, పాత్రలూ, వాటి ఉదాత్తతా నేపథ్యంగా ఔచిత్యశోభితంగా ప్రావృట్వర్ణన అనే వస్తువును వర్ణించిన అపూర్వమైన ఘట్టం. వ్యక్తిగతంగా నాకు నచ్చిన గొప్ప వర్ణన.

Sunday, June 23, 2013

సంకేతపదనిర్మాణతరుణోపాయన(స)ము

అనగనగా ఒక రోజు - నాలుగు సార్లు ఫ్రెండ్స్ తో బాటు కేంటీన్ కు వెళ్ళి కాఫీ తాగి సీటు దగ్గరకు వచ్చి, ఫేసుబుక్కూ, ప్లస్సూ, కూడలి, యూట్యూబూ, మరో నాలుగు కిటికీలు తెరిచి ఆఫీసులో చాలా బిజీగా పనిచేసుకుంటూ ఉన్నాను.

తెర మీదకు ఒక మిస్సైల్లా  ఒక డబ్బా వచ్చింది. దాని మీద ఉన్న సారాంశం ఇది.

"మీ యంత్రం తాలూకు సంకేతపదం ఆరునెలలుగా పాచిపోయి కంపు కొడుతూ ఉంది. దానిని మార్చండి."

ఓస్ అంతే కదా అనుకుని "సరే" అన్న పోకముడిని ...ఛ ఛ .. బొత్తామును నొక్కాను. ఒక భయంకరమైన విషవలయంలో అడుగుపెట్టబోతున్నానని నాకా క్షణం తెలీదు.

అదివరకు ఇలాంటి బెదిరింపులను చూసి ఉన్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు గ్రామసింహం ..ఛ ఛ ..సీమసింహం బెదరదు అని సంకేతపదం ఇలా టంకించాను. -

"వెధవ123"

ఇక్కడో మినీ ఫ్లాష్బాకు. ఇలా సంకేతపదాలు మార్చమని మూడు నెలలకో మారు మాకు విన్నపం వస్తుంది. "వెధవ123", "చవట123" - ఈ రెండు సంకేతపదాలనే నేను మార్చి మార్చి వాడటం అలవాటు. మా మిత్రులు ఇలాంటివే ఏవో పద్ధతుల్లో తమ సంకేతపదాలను గుర్తుంచుకోవడానికి వీలుగా తీర్చిదిద్దుకోవడం నాకు తెలుసు.

తెరపైకి ఒక డబ్బా, దాంట్లో తిట్టు లాంటిది కనిపించింది - "మూర్ఖుడా, నీ సంకేతపదం లో వరుసగా మూడు నంబర్లను పెట్టావు. మార్చు." బేక్ గ్రవుండ్ లో చిన్న సైజు వికటాట్టహాసం.

ఈ తతంగాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేయడం తక్షణ కర్తవ్యం అని, కేన్సిల్ నాడా ...అదే బొత్తామును నొక్కాను. మరో డబ్బా. "కేన్సిల్ నొక్కి ఫేస్బుక్ కు వెళ్ళిపోదామనుకుంటున్నావా? కుదరదోయ్. సంకేతపదం మార్చేదాకా వదలను. వదల బొమ్మాళా వదల, రీస్టార్ట్ చేసినా వదల"

నా మనసు కాస్త కీడు శంకించింది. ఇలాంటిది ఇదివరకెప్పుడూ రాలేదు

సరే అని కాస్త ఆలోచించి ఇలా మార్చాను. "వెధవ321". ఫలితం ఇది.

"ఒరే కోడి బుర్ర వెధవా, వరుసగా అన్నాను. అది వెనుకనుండైనా కావచ్చు"

"వెధవ007"

"హమ్మా? ఆశ దోశ అప్పడం వడ! ఒకటే నంబర్ రెండు సార్లు రాకూడదోయ్".

తల వేడెక్కింది. కాస్త ఆలోచించాను. నేను మొట్టమొదటిసారి యాహూ అకవుంటు తెరిచినప్పుడు నా ప్రియతమ నాయిక సోనాలీ బేంద్రే స్మృత్యర్థమై ..అదే ఆమె గుర్తుండడానికి సోనాలి1 లాంటిది వాడినట్టు గుర్తు. ఇప్పుడు ఆమె, నా యాహూ ఖాతా రెండూ పదవీవిరమణ చేశాయ్. ఇప్పుడు దాన్ని వాడితే ఎలా ఉంటుంది? ఆచరణలో పెట్టాను.

"ఒరే! సంకేతపదంలో ప్రత్యేక చిహ్నం లేకుంటే ఒప్పుకోను" సందేశం, బేక్ గ్రవుండ్ లో తొడకొట్టిన సవుండూ వినిపించాయ్.

అప్పుడు సన్నగా వెన్నెముక క్రింది భాగాన చల్లటి అనుభూతి. చిన్న వణుకు.

తొడకొట్టిన సౌండు విన్నప్పుడల్లా నా హృదయం బలహీనమవుతుంది. ఎందుకంటే అదేదో సినిమాలో హీరో తొడకొట్టగానే కుర్చీ తనంతట తాను జరుక్కుంటూ హీరో దగ్గరకు వెళ్ళిపోతుంది.

అలా కుర్చీలు జరగటం గతితార్కిక భౌతికవాదులు, హేతువాదులూ నమ్మరు. నేను కేవలం అవకాశవాదిని కాబట్టి దేన్నైనా నమ్ముతాను. ఇప్పుడు నా కుర్చీ కూడా జరుగుకుంటూ నాతో సహా ఐటీ డిపార్ట్ మెంటు కు వెళ్ళిపోతే?. అలా వెళితే ఆ "ట్రావెల్" ను ఎంజాయ్ చేయడానికి ఇబ్బందేమీ లేదు కానీ ఐటీ వాళ్ళది రెండో అంతస్తు., నేనున్నది ఐదవది. ఐటీ మేనేజర్ మంత్రశక్తిని కుర్చీ అపార్థం చేసుకుంటే మెట్లపైనుండి నేను క్రిందపడతాను.అంత రిస్కు చేయలేను.

అందుకని మరింత దీక్షగా ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరింది F1 గంటును ..సారీ... బొత్తామును నొక్కాను. అక్కడ సంకేతపదం మార్చడానికి నియమాలు వ్రాసి ఉన్నాయి.

1. సంకేతపదం లో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి.
2. కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక చిన్న అక్షరం, ఒక అంకె, ఒక చిహ్నం ఉండాలి.
3. వరుసగా అంకెలు రాకూడదు.
4. వరుసగా అక్షరాలు రాకూడదు.
5. ఒకే అక్షరం లేదా అంకె తిరిగి తిరిగి రాకూడదు.
6. మీ సంకేతం మీ జీవితం లో ఎప్పుడూ ఉపయోగించనిదై ఉండాలి. ఒకవేళ పాతది కనుక్కోలేరు అనుకుని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది.
7. టంకించే ముందు కాళ్ళు కడుక్కుని వచ్చి ఉండాలి.
...
...
ఇలా అనేక సూచనలు పొందుపర్చబడి ఉన్నాయ్.

ఒక పదిహేను ఇరవై విఫల ప్రయత్నాల తర్వాత ఒక భయంకరమైన పాస్ వర్డ్ నిర్ణయించాను. అది ఎలానూ గుర్తుండి ఛావదు కాబట్టి దాన్ని మొబైల్ ఫోను లోనూ, పర్సులో ఉన్న ఒక పుస్తకం లోనూ రాసి పెట్టుకున్నాను.

అయితే అది అంతం కాదు ఆరంభం మాత్రమే. మరుసటి రోజు మా సంస్థ అంతఃజాలం (intranet) సంకేతపదం కూర్చటానికి మరో యజ్ఞం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మరొకదానికి. ఇలా సమస్య తీవ్రతరమయ్యేటప్పటికి ఒక బ్రహ్మాండమైన మీటింగు పెట్టి సమస్యను చర్చించారు అందరూ.

చివరికి కనుక్కున పరిష్కారం ఇది.
- ప్రతి ఉద్యోగికి రెండు యంత్రాలుంటాయి. మొదటి దానిలో సురక్షిత వ్యవస్థ ఉంటుంది. మరొకటి సాధారణమైనది. రోజు సాదా యంత్రంలో పని చేసి రోజు చివరన, వ్యవస్థీకృతమైన యంత్రంలోకి డేటాను తర్జుమా చేస్తారు.

ఇలా కనుక్కున్న పరిష్కారంతో సమస్య కొలిక్కి వచ్చింది.

Sunday, April 14, 2013

మాదీ హైదరాబాద్

సిటీ బస్సు మామూలుగా అన్ని ఊళ్ళల్లోలాగా కాకుండా స్టాపుకంటే కొంతదూరం ముందుకు వెళ్ళి ఆగింది. స్టాపులో ఉన్న జనం పోలో మంటూ బస్సు దగ్గరకు ఉరికారు. ఆ జనాల్లో ఒక చిన్నసైజు మహిళామండలి కూడా చీరలు కట్టుకుని రేసులో పాల్గొంటున్న పీటీ ఉష, అశ్వినీ నాచప్ప ల్లాగా పరుగెట్టారు. మా నాన్నా, నేనూ పరిగెత్తాము మందతోబాటు. మా నాన్నెలానో బస్సు ఎక్కేశాడు. నేను కాస్త వెనుకబడ్డాను. బస్సు బయలుదేరేసింది. నేను పరుగు కంటిన్యూ చేశా.

బస్సు అలా బయల్దేరి కాస్త దూరం వెళ్ళగానే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. పరిగెత్తుతున్న నేను కడ్డీ పట్టుకుని బస్సులో జొరబడ్డా. పట్టు తప్పబోయి పడిపోబోతున్న నా రెండవ చేతిని బస్సులో ఒకతను పట్టుకుని పైకి లాగేశాడు.

"కాయ్ కు రే! ఛడ్ నా నహీ ఆతా?" - ఇలాంటిదేదో వినబడింది. పక్కన తెల్లటి షేర్వాణీ, గంతల టోపీ, తాంబూల చర్వణం, సెంటు వాసన - ఇత్యాది భూషణాలతో ఇద్దరు సాహెబులు నవ్వుతున్నారు. నేనూ మొహమాటంగా నవ్వాను.

పదిహేడేళ్ళ వయసులో హైదరాబాదుతో నా తొలి అనుబంధం అది. నాయన వెంట ఎమ్సెట్ కౌన్సిలింగు కోసం నగరానికి వచ్చిన రోజులు. ’బస్సులో పరిగెత్తుకుని ఎక్కని హైదరాబాదీ తాబేలై పుట్టున్’ - అని హైదరాబాదు వాళ్ళ నినాదం. వాళ్ళలా చేస్తారనే డ్రయివర్లకు కూడా స్టాపులో బస్సునాపటం ఇష్టం ఉండదు.

అంతకు ముందు చాలా సార్లు బెంగళూరికి వెళ్ళి ఉన్నాను. అయితే బెంగళూరు కు వెళ్ళినప్పుడల్లా, ఒక ఆటవికుడు మొట్టమొదటి సారి నగరానికి వెళ్ళినట్టు ఉండేది. పైపెచ్చు మనది తెలుగు మీడియం కాబట్టి, అక్కడ మా బంధువుల పిల్లకాయలందరూ ఇంగిలీసు కాబట్టి భయంకరమైన పరిస్థితి. నా వేషభాషలు చూసి అందరూ నవ్వేవాళ్ళు. వాళ్ళదీ తప్పులేదు.

"What is your name?" అంటే "I am name Ravi" అంటే నవ్వరా వాళ్ళు?

అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు హైదరాబాదు ’కొత్త’గా అనిపించింది. బెంగళూర్లో అపరిచితుడు మనతో ఆంగ్ల భాషలో మాట్లాడతాడు. ఇక్కడో? ’కాయ్ కు రే?’ - హెంత తేడా అసలు? బస్సును పరిగెత్తుకుని ఎక్కుట - ఎంత థ్రిల్లూ? హైదరాబాదుకు ఎట్లైనా సరే మళ్ళీ రావాలి - ఆలోచన పీకేసింది. ఆ ఛాన్సు పది రోజుల్లోనే వచ్చింది. స్టడీ సర్టిఫికెట్ మర్చిపోవడంతోటి, కవున్సిలింగు వాళ్ళు పది రోజుల్లో తెచ్చివ్వమన్నారు. అది తెచ్చివ్వడం కోసం మా నాన్నకు నచ్చజెప్పి నేనొక్కణ్ణీ హైదరాబాదుకు వచ్చాను.  ఈ సారి హైదరాబాదు మరింత అందంగా కనిపించింది. ఉస్మానియా పరిసరాలు భలే ఉన్నాయి! సికిందరాబాదు దగ్గర ఇరానీ చాయ్, నాంపల్లి పుల్లారెడ్డి స్వీట్లూ, కరాచీ బేకరీ బిస్కట్లూ ........హ్మ్... హైదరాబాదు లో ఏదో ఉంది!

ఫ్లాష్ ఫ్రంట్: తదనంతరకాలంలో బస్సులో పరిగెత్తుకుని ఎక్కే ఆర్ట్ ను నేను మాస్టర్ చేసేశాను. ఈ మధ్య తిరిగి హైదరాబాదులో అడుగు పెట్టినప్పుడు ఆ విద్య ప్రదర్శించి, వేగంగా వెళుతున్న బస్సులో విజయవంతంగా ఎక్కి, అందరూ నన్ను ఆరాధనాపూర్వకంగా చూస్తుంటే వాళ్ళవంక ఇలా ఒక లుక్కు ఇచ్చాను.

అయితే మరుసటి క్షణంలో నా మొఖం ఇలా మొఖంలా మారిపోయింది.

నా జేబులో కొత్తగా కొనుక్కున్న HTC మొబయిల్ ఫోను ఎవరో లేపేశారు. నేను బస్సుతో బాటు సమాంతరంగా పరిగెత్తి, సరిగ్గా బస్సు ఎక్కుతున్నప్పుడు ఒకడు న్యూస్ పేపర్ ను అడ్డుపెట్టి దాని కిందుగా చేయిపోనిచ్చి నా పై జేబులో ఉన్న ఫోను ఎత్తేశాడు. బస్సు ఎక్కుతూనే ఇది మెహ్దీ పట్నం బస్సు కాదా? అని అడుగుతూ దిగిపోయాడు....

****************************************************************************

మళ్ళీ భాగ్యనగర దర్శనం ఉద్యోగరీత్యా కలిగింది. ఈ సారి దర్శనం తో బాటు జీవనం కూడా. గుండు బొచ్చు లో....అదేనండి అలాంటిదేదో ఉంది కదా...హ్మ్....గచ్చీబౌలి అని అదన్నమాట. గుండు బొచ్చు ....అదే గచ్చిబౌలి అప్పట్లో చాలా పీస్ ఫుల్ ఏరియా. వినాయక నగర్ లక్ష్మి అనెక్స్ అపార్ట్మెంట్ లో రూమ్మేట్లతో కలిసి సావాసం.

ఓ రోజు...

శ్రీదేవి థియేటర్ లో రాత్రి సెకండ్ షో "జోష్" హిందీ సినిమా టికట్లు పట్టుకొచ్చాడు నా ఫ్రెండు. సినిమా కెళితే మొదలు పెట్టటానికి బాగా లేటయ్యింది. ఇంటికి వచ్చే సరికి రాత్రి ఒకటిన్నర గంటలవుతోంది. గచ్చిబౌలి పక్కన క్వార్టర్స్ లో మా వాడి ఇల్లు. వాడి ఇంటిదగ్గర దిగిపోతే నేను నడుచుకుంటూ వస్తున్నాను. పోలీసు జీపు పక్కన వచ్చి ఆగింది.

"ఏయ్ యాడకెళ్తున్నావ్?" - ఒక అధికార స్వరం
"ఇంటికి సార్"
"యాడకెల్లి వస్తున్నవ్?"
"సినిమాకి"
"టికెట్ చూయించు"
చూపించాను. టికెట్ నూ నన్నూ తేరిపార చూశాడతను. అతని యూనిఫారమ్ మీద ఖాన్ అని రాసుంది.
"హైదరాబాదుకు కొత్తా?" - నా అవతారం చూడగానే పోల్చుకున్నాడతను.
"అవును సార్"
చూడు, నీకింకా తెలుస్త లేదు, హైదరాబాదంటే. రాత్రి పూట తిరగాకు. - కుసో..అని బండ్లో కూర్చోబెట్టుకుని కాస్త దూరంలో ఉన్న ఇంటిదగ్గర దింపాడతను. చిన్న సంఘటన. ఎందుకో అతని మొఖం, ఆ రోజూ అలా నిల్చిపోయినై.

****************************************************************************

మా రూమ్మేట్లు అమెరికాకు పారిపోవడంతోటి గచ్చి బౌలి నుండి సికిందరాబాదుకు షిఫ్ట్ అయాను. కవాడిగూడా లో అపార్ట్ మెంటు. ఆరవ అంతస్తు. ఐదుమంది జనాభా. అందరిదీ మా ఊరే. ఇద్దరు ఉద్యోగులం, ఒకడు నిరుద్యోగి, ఇంకో ఇద్దరు చదువు.

ఆ ఇంటికి వాకబుల్ డిస్టన్స్ లో అబ్బాయ్ మెస్సు.
రన్నబుల్ డిస్టన్స్ లో క్రాస్ రోడ్స్. ఒక కుప్ప సినిమా థియేటర్లు.
జాగబుల్ డిస్టన్స్ లో టాంకు బండ్.

అందరూ సినిమా పిచ్చోళ్ళే. ఇంకేం? ప్రతి శుక్ర, శనివారాలు పండగే పండగ.

అక్కడా ఓ రోజు ... (ఆగస్ట్ 21. 2000 అనుకుంటా)

రాత్రి ఆఫీస్ నుండి వస్తూ వస్తూ రోడ్డు దాటి ఒక కిలో పెరుగు కొనుక్కొచ్చాం (శతమర్కటాలు x 5 = ఐదు వందల కోతులకు సరిపోవాలి కదా). అప్పుడు వర్షం మొదలయ్యింది. అప్పుడు మొదలైన వర్షం రాత్రంతా ఒక్క ఊపు ఊపేసింది. పొద్దున్నే ఆరవ అంతస్తు పక్కన డాబాపైకెళ్ళగానే దూరంగా హుస్సేన్ సాగర్ పరవళ్ళు తొక్కుతా కనిపించింది. నేను ముందు రోజు దాటిన రోడ్డు ప్లేసులో ఆరడుగుల యెత్తులో నీళ్ళు పారుతున్నాయి. ఆ పెట్టె అంగడి లేనే లేదు. భీభత్సం. వరద.

ఆ నీళ్ళల్లో దాటుకుంటూ ఆఫీసుకు బయలు దేరితే బేగంపేట దగ్గర బ్రిడ్జుకు పైన నీళ్ళు!

సీమ నుండి బయటకు అడుగుపెట్టి మొట్టమొదటి సారి నా జీవితంలో వరద అనుభవం.

ఆ రూమూ కొన్ని రోజులకు వదిలి ఒక్కణ్ణే మరోచోటికి షిఫ్టయ్యాను.

****************************************************************************

తాజ్ బంజారాలో అదేదో కంపెనీ లో నడకలోపల ముఖాముఖులు (Walkin interviews) జరుగుతుంటే వెళ్ళాను. ఇట్లాంటి వాటికి ఇస్టార్ హోటల్ లోపలికెళ్ళడం కోసమే అటెండ్ అవడం నాకు హాబీ. అట్లాంటి హై ఫై పరిసరాలను చూస్తేనూ, కోట్లూ గట్రా వేసుకుని సూటుకేసులు పట్టుకొని హడావుడిగా తిరిగే జనాలను చూస్తేనూ నేనొక ఆటవికుణ్ణి అన్న ఫీలింగు నాకు అప్పట్లో. అది పోగొట్టుకోవాలన్న తపనతో అలాంటి రోజుల్లో అట్టాంటి హోటళ్ళ దగ్గర తచ్చాడుతా ఉండేవాణ్ణి.

లిఫ్టు ఎక్కకుండా మెట్లెక్కి పైకెళుతున్నా. (లిఫ్ట్ ఎక్కి మూడవ ఫ్లోర్ కెళటానికి రెండు నొక్కాలా, మూడు నొక్కాలా అని తెలిసి ఛస్తే కదా). అక్కడ లాబీలో ఒక యువకుడు నీలిరంగు గళ్ళ చొక్కా, జన్యువుల (జీన్స్) పంట్లామూ తొడుక్కుని కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నాడు. అతను పేపర్ నుండి ముఖం తిప్పి నా వంక చూశాడు. ఎంత హేండ్సమ్ గా ఉన్నాడు! బాగా తెలిసిన ముఖమే. ఛప్పున గుర్తుకు రాలే. ఎక్కడ చూశాను? మెట్లెక్కి పై ఫ్లోర్ కెళ్ళిన తర్వాత బల్బు వెలిగింది.

అతను -

అప్పటికతను కొన్ని సినిమాలు తీశాడు రాజకుమారుడు, వగైరా కానీ అంత పెద్ద హిట్లు కావు. భాగ్యనగరంలో ఇలా సైన్మా హీరో మరో చిత్రమైన సందర్భంలో ఒకచోట పుణుకులు తింటూ ఉంటే అగపడ్డాడు. అది మరీ శీను వైట్ల సినిమా సీనులా ఉంటుంది కాబట్టి రాయను.

****************************************************************************

హైదరాబాదులో ఎండాకాలంలో ఒక రోజు.

ఒక లారీలో మామిడి పళ్ళు అమ్ముతున్నారు. అవి నూజివీడు రసాలట. మా వైపు అవి దొరకవు. సరే ఒక కిలో (16 పళ్ళు) తీసుకున్నా. ఇంటికెళ్ళి మింగడం మొదలెడితే పదహారు దగ్గర ఆగింది. అప్పుడే అయిపోయాయా? ఛ. మళ్ళీ దండయాత్ర జరిపి కక్కుర్తిగా మరో మూడు కిలోలు తీసుకొచ్చాను. ఆ మూడు కిలోలు వరుసబెట్టి లాగించేశాను. ఆ రోజు బానే ఉంది. మరుసటి రోజు నుంచీ శరీరం ఇస్త్రీపెట్టెలా మారింది. మా ఫ్రెండ్స్ ఎలానో కనుక్కుని వచ్చి నా బాడీని మోసుకొని పోయి వాళ్ళ రూములో పారేశారు. అక్కడే వారం తిష్ట.

****************************************************************************

అమ్చీ హైదరాబాదులో ఉండగానే మా సంస్థ వాళ్ళు డబ్బులు కట్టి నన్ను జపాను భాష వెలగబెట్టమని శ్రీనగర్ కాలనీ లో ఒక ఇన్స్టిట్యూట్ కు పంపారు. పని చెయ్యమంటే బద్ధకం కానీ, ఇలా ఉద్ధరి బేరాలు తగిలితే విజృంభించమా యేంది? జపనీసు మూడు చెర్రీ బ్లోసమ్ పూవులు, ఆరు చెర్రీ కాయలూ లాగా సాగింది. రేవంతో సాన్ తో కొన్ని అడ్వెంచర్లూ, డిబెంచర్లూ చేయటానికి అవకాశం వచ్చింది. 

ఇంకా హైదరాబాదుతో అనుభవాలు బోల్డు, మినర్వా కాఫీబార్ లో కారప్పొడి ఇడ్లీలు, జయభేరి దగ్గరున్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, విశాలాంధ్ర పుస్తకాలూ, సికందరాబాద్ సంతోష్ సినిమా లో ఇంగ్లీషు సినేమాలు, పాతనగరం లస్సీ, ఫెలూదా, హర్ష, వెంకటరమణా, అబ్బాయి మెస్సుల్లో మీల్సూ, అభిరుచి లో జున్నూ, శ్రీనగర్ లో నెల్లూరు వాళ్ళ కారం దోసె (ఇప్పుడు లేదు).....ఇంకా మా రూమ్మేట్లు సూర్య, చక్రి గాడి సినిమా కబుర్లూ, భాగ్యనగరంలో వర్షం.....

భాగ్యనగరం - మొదటిసారి ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు - నాకు సమయమూ, డబ్బూ రెండూ అవసరమైన రోజులు. అప్పుడు మా అమ్మగారి చివరి రోజులు, ఇంట్లో కొన్ని అప్పులు. మా నాన్న తర్వాత నా హయాం మొదలైన రోజులు. ’భాగ్య’నగరం - పేరు నిలుపుకుంది. ఋణపడేలా చేసుకుంది. చాలా అవసరాలలో భాగ్యనగరం నన్ను ఆదుకొనింది. భాగ్యనగరం తో వ్యక్తిగతంగా నాకు ఏదో అనుబంధం ఉంది. డవుట్ లేదు.

Monday, January 7, 2013

జంతు ప్రపంచం


ఆర్నెల్ల క్రితం హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయింది నాకు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు ఒక వినూత్నమైన, అద్భుతమైన సత్యం నాకు తెలిసింది. బెంగళూర్ లో లాగా వీధికి కనీసం పదికుక్కల చొప్పున లేవు. బహుశా నాగార్జున వాళ్ళావిడ అమల ఆ మధ్య శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ లో తలమునకలై కుక్కల బాధ్యతను విస్మరించినట్టుంది.

బెంగళూరులో వీధిలో ఒక రాయి విసిరితే, అది - అయితే సాఫ్టు వేర్ వాడికి లేదా కుక్కకు తగులుద్ది అని ఒక సూక్తి. అదొక భయంకరమైన నిజం.

బెంగళూరు లో మొరుగేశ్ పాళ్యలో, ఉన్న భయానకమైన రోజులు మర్చిపోలేను. చీకటి వేళల్లో పిల్లిలాగా, శబ్దం చేయకుండా నడవడం ప్రాక్టీసు చేసి అందులో నిష్ణాతుణ్ణయినా, గుండెలు పీచుమనేవి. మా ఇంటి గేటు దగ్గర ఆఖరు గండం ఉండేది. ఆ చివరి మజిలీ దాటి, ప్రపంచాన్ని జయించినట్లు ఫీలయిన సందర్భాలెన్నో. ఆ బాధలు అలా పడీ ఓ రోజు దేవుడిని ప్రార్థించాను.

దేవుడా,
ఎక్కడ వీధికి పదికుక్కలు లేవో
ఎక్కడ రాత్రుళ్ళు ప్రశాంతంగా గడుస్తుందో
ఆ ఊరికి నన్ను తరిమేసెయ్

ఆ ప్రార్థన ఫలించినట్టుంది. భాగ్యనగరంలో నేను ఆద్దెకున్న వీధిలో మూడు కుక్కలే ఉన్నాయి. అవి కూడా మొరగటం లేదు.

ఇలా ఆనందదాయకమైన ప్రపంచంలో ఉంటూ - ఓ సాయంత్రం సూపర్ బజార్ నుండి సరుకులు తెస్తుండగా - ఒక కుక్క ’భవాన్ భిక్షాం దేహి’ అని వెనుక పడింది. యే మాత్రం మొరగకుండా అహింసాపద్ధతిలో భిక్ష అడిగిన ఆ సాత్విక శునకాన్ని చూసి నా హృదయం స్పందించింది. (నా చొక్కా పై జేబులో సెల్ ఫోను ఉంటుంది). ఒక బిస్కట్ ముక్క విసిరాను.

అదే నేను చేసిన తప్పు.

ఆ శునకం కేవలం క్రీమ్ బిస్కట్లనే తింటుందని, ఆ నియమం ఉంది కనుకనే తుచ్ఛమైన ఇతర బిస్కట్ల జోలికి పోదని నాకు అప్పుడు తెలియలేదు. మరుసటి రోజు యథావిధిగా మరోసారి సూపర్ బజార్ నుండి వస్తుంటే - ఆ శునకం దగ్గరకొచ్చింది. ఈ సారి నేను కాస్త బెట్టు చేశాను. ఆ కుక్క నన్ను చూసి స్వల్పంగా ’గుర్’ మన్న హలోట్యూను చేసి చుట్టూ చూసింది.

అర్థమయ్యింది నాకు. అదొక పెద్ద ఇంటలెక్చువల్ కుక్క. దాని సంకేతానికి అర్థం - క్రీమ్ బిస్కట్ ఇస్తావా లేక దూరంగా కుతూహలంగా చూస్తున్న శునకరాజాలను పిలవమంటావా? అని. ఆ బలహీనమైన క్షణంలో నేను ఆ శునకానికి లొంగిపోయాను.

అదే నేను చేసిన రెండవ తప్పు.

అలా ఆ ఇంటలెక్చువల్ కుక్క నన్ను మానసికంగా లోబర్చుకుంది. ప్రతిదినం సాయంత్రం ఇంటికి వచ్చే ముందు క్రీమ్ బిస్కట్ల కోసం షాపింగుకు వెళ్ళటం ఆనవాయితీ అయింది నాకు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే - ఇల్లు మారాలి. తప్పదు.

అలా ఇల్లు మారేను.

ఇప్పుడు ఉన్నది కొత్త ఇల్లు. ఇక్కడ కుక్కలు లేవు కానీ కొన్ని రోజులకు ముందు - పొద్దునే ఆఫీసుకు తగలడుతుంటే ఇంటి బయట ఒక నల్లని జీవి కనబడింది. ఆ జీవిని మార్జాలంగా నా మెదడు గుర్తించింది. పిల్లుల గురించి నాకొక ఫ్లాష్ బ్యాక్ ఉంది.

*********************************

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో - నేను ఒక చిన్న సైజు అభ్యుదయవాదిని.

మా ఇంటిలో ఎలుకల బాధ అధికం. ప్రతిరోజూ బోనులో కనీసం ఎనిమిది ఎలుకలైనా పడేవి. ఆ ఎలుకలను చూసి పొద్దునే మా ఇంటిదగ్గర పిల్లులు క్యూ కట్టేవి. వాటి ముఖం చూస్తే దరిద్రమని మా అమ్మా నాన్న విసుక్కునే వారు. వారిని నా అభ్యుదయవాద దృక్పథం సైలెంటుగా ఖండించేది. (సౌండుతో ఖండిస్తే పాకెట్ మనీ రాదు. అందుకే సైలెంట్ ఖండన). అది ఎంతవరకు వెళ్ళిందంటే కావాలని పనిగట్టుకుని ఫ్రెండ్ సహాయంతో పిల్లిని నా దారికి అడ్డం పరిగెత్తించి ఇంటర్మీడియట్ ఆంగ్ల పరీక్షకు అటెండ్ అయాను. ఆ పరీక్షలో పాస్ అయి మా నాన్నకు అభ్యుదయ వాదం పవర్ చెప్పి వివరించాను. (ఇంటర్మీడియట్ లో నాకు అన్నిటికన్నా తక్కువ మార్కులు ఇంగ్లీషులో వచ్చాయి. ఆ మాట అప్రస్తుతం కాబట్టి చెప్పట్లేదు)

*********************************

ఇంత తీవ్రమైన అభ్యుదయవాదిని నన్ను పిల్లులేమి చేయగలవు అని ఆ రోజు ఆఫీసుకు ధైర్యంగా తగలడ్డాను. మా ఆఫీసు - ఎల్లవేళలా రక్తచరిత్ర సినిమాకు భాష్యంలాగా ఉంటుంది. ప్రాజెక్టుకు ముందే డెడ్లైన్లు, విపరీతమైన నస, బూతులు సర్వసాధారణం. కొన్ని రోజులుగా అలా లేదు. అయితే పిల్లి కనబడ్డ మొదటి రోజు సాయంత్రం ఉన్నట్టుండి భయంకరమైన పని మొదలయ్యింది. రక్తం మరిగించే టెన్షన్.

తర్వాత రెండు రోజుల తర్వాత ఆ నల్లని పిల్లి - నన్ను చూసి స్మయిలిచ్చింది. ఆ రోజు ఆఫీసులో రుధిరం చిమ్మింది. నరాలు చిట్లిపోయే టెన్షన్. ఇండియా - పాకిస్తాను వరల్డ్ కప్ మాచ్ లోనూ అంత టెన్షన్ ఉండదు.

ఇలా ఆ పిల్లి కనబడ్డం, ఆఫీసులో రక్తం చిమ్మటం వరుసగా జరిగేసరికి నా అభ్యుదయ వాదం బీటలు వారింది. ఇప్పుడు నేను ఆ పిల్లికి కనబడకుండా వీరప్పన్ లా తప్పించుకుని తిరుగుతున్నాను. ఈ ఏరియాకు ’మియాపూర్’ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడిప్పుడే తెలుస్తూంది.

పిల్లులు, కుక్కలు, దోమలు లేని కొత్త చోటికి ఇల్లు మారాలి. మ్యాజిక్ బ్రిక్స్ అన్న వెబ్ సైట్ లో ఇలా పిల్లులు, కుక్కలు లేని చోట ఇల్లు అద్దెకు కావాలని ప్రకటిద్దామంటే - ఆ సదుపాయం లేదట.

నా ప్రస్తుతసమస్య ఎలా గట్టెక్కుతుందో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.

Sunday, November 4, 2012

దృష్టి


"To see is to love" - అని ఒక మహాజ్ఞాని వచనం. ఆయన వచనం ఉటంకించినంత మాత్రాన ఆయనంత గొప్పవాడు కానవసరం లేదు. భగవద్గీత ను చదువుకోవడానికి,  ఉపయోగించుకోవడానికి మనిషైతే చాలు, భగవంతుడు కానక్కరలేదు.

రోజూ చూసే చెట్టు, ఈ రోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నది. ఎందుకో తెలియదు. చెట్టు తాలూకు ప్రతి ఆకు విలక్షణంగానూ, వినూత్నంగానూ కనబడుతూంది. మెత్తటి స్పర్శ, ఆకు తాలూకు ఈనెలు, నిన్నటి వర్షంలో తడిచి, హర్షం నింపుకుని రంగుతేలిన రూపం, సుకుమారమైన ఆకు చివరి భాగం, చెట్టుకు మొట్టమొదటి సారి కాస్తున్న కాయలు, ఏదో పనున్నట్టు అక్కడికి వచ్చి, బుర్ర గోక్కుని తిరిగి వెళుతున్న గండు చీమ, ఎందుకింత అమాయకంగా ఉంది ఈ చిన్ని ప్రపంచం?

రెణ్ణెల్ల క్రితం - పాపకు స్కూలుకు వెళుతుంటే ఒక బాదాం కాయ కనబడింది. ఆ కాయ ఇంటికి తెచ్చుకుని, కండ తిన్నది పాప. బాదాం చెట్టు కండ తిని నీళ్ళు తాగితే తీయగా ఉంటాయిట. ఆపైన కాయ కొట్టుకుని, మిగిలిన ముక్కను పెరట్లోకి విసిరి వేసింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక చిన్న చెట్టు మొలకెత్తింది. చెప్పడానికి భావం చాలని అందమైన దృశ్యం అది! ఇప్పుడా చెట్టు మెలమెల్లగా పెరుగుతూంది.

ఇప్పుడున్న పెరటి బాదాం చెట్టు కూడా అలాగే వచ్చిందో, ఏమో! 

చెట్టు కాండాన్ని కావిలించుకుని దానికి చెవులను ఆన్చి వింటే ఒక మౌనసంగీతం వినబడుతుందట. వినగలిగితే అంత హృదయంగమమైన సంగీతం మరొకటి లేదు. సంగీతానికి నియతి కావాలేమో, ప్రకృతిపాటకు నియమాలు లేవు.

"నియతికృతనియమరహితాం, హ్లాదైకమయీమనన్యపరతంత్రామ్" అని జ్ఞానమూర్తిని, జగజ్జననిని, సాకారంగా, సరూపార్చన చేస్తాడు కవి. ఈ సృష్టి కూడా అంతేనేమో! ఇక్కడా నియమాలు లేవు, కోకిలపాట, బాదాం ఆకులపై వర్షం చినుకుల దరువూ, చల్లటి గాలి చిఱుస్పర్శ ఈ నియమరహితమైన సౌందర్యాన్ని, హ్లాదమే పరతత్త్వంగా కనిపిస్తున్న జగతిని - భగవంతుడు సృష్టించలేదు. ఈ సృష్టే తానై ఉన్నాడు. అసలు "ఉన్నాడు", "ఉన్నది" అన్న మాట కూడా తప్పేమో! "తథా అథ" - "అది అంతే" - కనిపిస్తున్నదే సృష్టి, స్రష్ట, సృజన అన్నీ!

కొన్నాళ్ళకు ఆ ఆకు రాలిపోతుంది. ఎఱుపు రంగు తేలి, గాలి విసురుకో, బలహీనత తోనో! చెట్టు నుండి విడిపోవటం లోనూ ఒక దర్పం! ఒక దర్జా, చిఱునవ్వూ! మరణమంటే ఇంత సులువుగా, ఇంత ఆనందంగా ఉంటుందా అని చూచేవాళ్ళకు అనిపించేట్టు! హ్లాదైకమయి - అనన్య పరతంత్ర - అంటే స్వేచ్ఛను అణువణువునా నింపుకున్నది కూడా ! ఈ రాలిపోయిన ఆకు ఆ చెట్టుకు, అంటే తన తల్లికి ఎరువు!

ఆధ్యాత్మికత భగవంతుడిలోనూ, ఆచారాలలోనూ, కర్మల్లోనూ, కర్మసిద్ధాంతం లోనూ ఉందని ఎవరు చెప్పారో ఏమో! చిత్తమార్దవం, క్షమ, శుచిత్వం అభిమానం లేకపోవటం వంటివి దైవికమైన లక్షణాలుట! అవి చాలేమో మనిషికి!

పక్కింట్లో పాపాయి మారాం చేస్తూ ఉంటే అమ్మ చందమామను చూపిస్తూ బాదం ఆకులో పెరుగన్నం పెట్టి తననే తినమని చెబుతూంది! పాప నవ్వుతూంది.

To see is to love! - ప్రపంచాన్ని చూడటమే ప్రేమ!

Monday, August 6, 2012

మధురస్వప్నం



రోజూ లాగే మరో పొద్దు పొడిచింది. అదే పొద్దు మునుగుతూనూ ఉంది. ఈ పొద్దుకూ ఎక్కడెక్కడో, ఎన్నో తమ్మిపూలు విరబూసి ఉంటాయ్.  ఈ ఇంటా ఒక తమ్మి విరబూసింది. ఈ రోజు పొద్దునే సంహిత పట్టులంగాలో కనిపించింది. దానికి జుట్టు అంతగా పెరగలేదు. అయినా సరే రెండు క్లిప్పులు పెట్టుకుని, ఒక్కోసారి చిన్న చిన్న మల్లెపూలమాలలు చుట్టుకుని తిరుగుతూంటుంది. భలే నవ్వొస్తుంది. నాన్న బయటికే నవ్వేస్తుంటే అది కొంచెం ఉడుక్కుంటుంది. ఊహూ, ఉడుక్కోవడం కాదు...ఏదో విచిత్రమైన భావం! నాన్న ఎందుకు అమ్మలాగా, అమ్మమ్మలాగా సీరియస్ గా ఉండడు, ఊరికే నవ్వుకుంటూ ఉంటాడు అనేమో!

అవును మరి, అమ్మకూ, అమ్మమ్మలకూ పావడా,అంగీ తడుస్తే కోపం,మట్టిలో ఆడుకుంటే తప్పు, క్రాఫు మాసిపోతేనో, షర్టు నలిగితేనో, ఐస్క్రీం తింటేనో చిన్నపాటి భయం! నాన్నకివేవీ పట్టదు. నాన్న దగ్గర ఫ్రీ!

నాన్న కు బొంగరమాడటం, చేతిలో తిప్పటం వచ్చు ( గోళీలు,బొంగరాలు, చిల్లాకట్టె, బచ్చాలు వంటి విద్యలని ఉగ్గుపాలతో నేర్చుకున్న రక్తం గదా) 



మన్నెప్పుడో రాకరాక ఊర్లో వాన పడితే, తనూ, నాయనా కలిసి గొడుగు పట్టుకుని మిద్దె మీదకెళ్ళారు. కాసేపటికి వానతో బాటు, ఎండ మొదలైంది. దానికి సైడ్ ఎఫెక్ట్ లాగా సరిగ్గా ఇంటికికెదురుగా ఒక రంగురంగులబాణం వచ్చి నిలబడింది. పాప ఆ ఇంద్రచాపాన్ని చూసి దానికంటే అందంగా నవ్వింది. కాసేపటికి మళ్ళీ కాగితపు పడవల పర్వం మొదలయ్యింది. అంతా అయ్యి ఇంటికొస్తే, పాప అమ్మకు పాప, నాన్న ముఖాల్లో వెలుగుకన్నా, పాంటు అంచుల్లో బురద, పావడ అంచుల్లో నీళ్ళు కనబడ్డాయి. తిట్లు మామూలే. నాయన నవ్వు మామూలే. తమ్మి నాన్న వంక చిత్రంగా చూడటమూ మామూలే.

తమ్మికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే అందరికీ బాధ. నాన్నకు మాత్రం ఆ ముల్లు తీయడానికి, ఆ ముల్లు ద్వారా తెలుగు నేర్పడానికి ఒక అవకాశం చిక్కిందన్న ఊహ, ఆ ఊహ వలన వచ్చిన నవ్వు.

మరుసట్రోజు పాప అమ్మ దగ్గరకెళ్ళి పెద్దగా అరుస్తా పద్యం చెప్పింది.

చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ

అమ్మకు అందులో మూడవపాదం అన్నిటికన్నా స్పష్టంగా వినిపించింది. నిరసన మామూలే.

*********************************************************

మా తమ్మిని పట్టులంగాలో చూస్తుంటే ఏదో అస్పష్టమైన జ్ఞాపకం, మా అనంతపురంలో కురిసే వానలాగా నాతో దోబూచులాడుతూ ఉంది. అంతే కాదు, అది నా దగ్గర వచ్చి ఏదో ప్రశ్న అడగడం, దానికి నేను బయటికే నవ్వడం వంటివి చూసినప్పుడు కూడా ఏదో సందిగ్ధమైన ఆలోచన. ఎప్పుడో, ఎక్కడో, ఇలాంటిది నా ముందు జరిగింది అని.

ఆ జ్ఞాపకాల సీతాకోక చిలుక ఇదుగో ఈ రాత్రి నా చేతికి పట్టుబడింది.

**************************************************************

అవును. తమ్మి లానే పట్టు లంగా, చిట్టి చిట్టి జడలతో ఉన్న అమ్మాయి నాకు బహుశా ఐదారేళ్ళప్పుడు పరిచయం. ఆ అమ్మాయి మా పక్కింటి సరోజ. బహుశా నా జీవితంలో మొదటి గర్ల్ ఫ్రెండు!

సరోజ పొద్దస్తమానం మా ఇంట్లోనే ఆడుకునేది. మా ఇంట్లోనే భోంచేసేది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్న విషయం ఆ వయసులోనే ఆమెకు అర్థమయ్యింది! దానికి భోజనం పెట్టటం అమ్మకు, ఇంట్లో అందరికీ ముచ్చట. అయితే "సుందరాంగులను చూచిన వేళల కొందరికి ముచ్చట" ఎలాగో,"కొందరికి బిత్తర" అలాగే. ఎందుకంటే మదీయులకు అప్పుడు తిండి తినిపించడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉండేవి. కిటికీ పక్కన కూర్చోవాలి, అక్కడ కూర్చుని, పెరుగన్నం తినాలి. తినేప్పుడు ఆకాశవాణి కడపకేంద్రంలో నచ్చిన పాట వినబడాలి. నచ్చినపాట - ఎంతగా నచ్చాలంటే ఆ పాట సినిమా బండిలో వినబడితే ఆ బండి వెనక నడుచుకుంటూ తన్మయత్వంతో వెళ్ళిపోయేంత మంచిపాట అన్నమాట.

తిండికి ఇంత హంగామాని చూసి సరోజ నవ్వితే సూర్యుడు సిగ్గుపడి మబ్బులదాపునకెళ్ళిపోడూ!

ట్రాన్సిస్టర్ లో అయిపోయిన సెల్సూ, కొయ్య ఏనుగు బొమ్మా, కొన్ని ప్లాస్టిక్ బొమ్మలూ మా ఇంట ఉండేవి. ఒక ఏడెనిమిది సెల్స్ ను రౌండు గా పెట్టి, వాటిపై మరికొన్నిటిని, వాటిపైన వీలైతే ఒకసెల్ ను ఇలా అమర్చి ఆడుకొంటుంటే, సరోజ పట్టుపావడతో రెండు జళ్ళతో మా ఇంటికి వచ్చేది. భోజనాల సమయానికి కొంచెం ముందుగా. అంత కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడం ఆ పాపాయికి రాదు కాబట్టి ఏదో అలా చూసి వెళ్ళిపోయేది.

చందమామలో భల్లూక మాంత్రికుడు సీరియల్ వచ్చే రోజులవి.

మాచిరాజు కామేశ్వరరావు కథల్లో ’కట్నం’ అనే పదం ఎప్పుడూ వస్తుంది. అదేంటి అని అడిగితే మా అమ్మ చెప్పలేదు. భల్లూకమాంత్రికుడు చివర్లో ’ఇంకా ఉంది’ అంటే ఆ ’ఇంకా’ ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు. సరోజకు మాత్రం వాళ్ళ నాన్న రాత్రి పూట మడతకుర్చీలో పడుకుని చుక్కలు చూపిస్తా ఏవో కథలు చెప్పేవాడు.  నాన్న చేతిలోనే అలా నిద్రపోయేది.

నాకు బాగా జ్ఞాపకమున్న ఒకరోజు. సరోజ మామూలుగానే మధ్యాహ్నానికి కాస్త ముందు మా ఇంటికి రావాలన్న ప్లానుతో ఉంది. వాళ్ళమ్మకు పొద్దస్తమానం పాప అలా పక్కింటికి వెళడం తప్పని, దానికి సర్ది చెప్పాలని తాపత్రయం. అందుకని ముందుగానే భోజనం తినిపించెయ్యాలనుకుంది. ఊహూ. కుదరదు! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా కుదరదో, అలా సరోజ చేత పక్కింటికి వెళ్ళడం మానిపించడం అమ్మకు కుదరలేదు. వాళ్ళ అమ్మకు కోపం వచ్చింది. రెండు దెబ్బలేసింది.

అంతే! ఆ పాప ఏడుపు లంకించుకుంది. ఏమయ్యిందో, ఎలా వినబడిందో తెలియదు. వాళ్ళ నాన్న ఆఫీసు నుండి వచ్చాడు. పాపను సముదాయించాడు. ఆ తర్వాత మా ఇంట్లో ఆడుకోవటానికి పంపాడు!

ఇసుకలో ఆడుకుని బట్టలు పాడుచేసుకుంటే అమ్మ బట్టలు పాడయ్యాయంటే ఏం కాదని సరోజ నాన్న ఎత్తుకుని ముద్దుచేసేవాడు.

ఆ పాప వాళ్ళ నాన్న గారికి ట్రాన్స్ ఫర్ అయింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళ ఆచూకీ లేదు! అంతే! ఆ కథ ఒక ముగిసిపోయిన అందమైన అస్పష్టమైన మధుర స్వప్నం!

తమ్మి రాత్రి పూట అన్ని నక్షత్రాలు ఎక్కణ్ణుంచి వస్తాయని అనుమానం! అవన్నీ చిన్న పిల్లలై భూమీదకు వస్తాయని, ఒక నక్షత్రం పోతే మరొకటొస్తుందని నాన్న నవ్వు దాచుకుంటూ చెబుతున్నాడు. తమ్మికి నాన్న తప్పు చెబుతున్నాడా అని ఏదో అనుమానం. దాని ముఖం చూసి దాన్ని బోల్తా కొట్టించానని నాన్నకు నవ్వు!

సరోజ వాళ్ళ నాన్న కూడా ఇలానే నవ్వేవాడు!

అవును! పాపాయి పుట్టినప్పుడే ఆ ఇంట్లో నాన్న కూడా పుడతాడు! ఆ పుట్టుక తామర పువ్వు విరిసినంత అందంగా ఉంటుంది.

Tuesday, July 10, 2012

తామరశ్రీ మోసరి రామాయణరావు ధిషణా హేల

రామాయణరావు వ్యక్తి కాదు సుత్తి. అవును. మీరు సరిగ్గానే చదివారు. రామాయణరావు ఒక మహాసుత్తి. ఆ సుత్తి తాలూకు ప్రస్థానమే ఈ కథనం.

ఒక వ్యక్తి కి ఎన్ని పార్శ్వాలుంటాయి? సాధారణంగా రెండు. రామాయణరావులో అనేక పార్శ్వాలున్నాయి.
ఒక పత్రికాధిపతి
ఒక నటుడు
ఒక దర్శకుడు
ఒక నిర్మాత
ఒక పాటల రచయిత
ఒక మాటల రచయిత
ఒక రాజకీయనాయకుడు
ఇన్ని పార్శ్వాలను పూర్తిగా ఖర్చుపెట్టే సరికి సారం అంతా పోయి, అతడు నాలుగేళ్ళు వరుసగా బ్లాగులు రాసేసిన తెలుగు బ్లాగర్ లా నిస్సారంగా తయారయ్యాడు. ప్రేక్షకులకు అతని సంగతి తెలిసి, అతని సినిమాలు ఎప్పుడో చూడ్డం మానేశారు. ఇక మిగిలిన పార్శ్వాలూ అరిగిపోయాయి. దాంతో అతని పైశాచికత్వం బయటపడింది. చలనచిత్ర సీమలో ఎక్కడ మీటింగు జరిగితే అక్కడ దాపురించి, శ్రోతల మెదళ్ళను కబళించడం అతనికి కొంతకాలంగా అలవడిన రాక్షసవిద్య. ఇది ఎప్పుడు అంతమవుతుందో తెలుగు టీవీ ప్రేక్షకులు, శ్రోతలు దీనికి ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

**********************************************************

అది 1980 వ దశాబ్దం. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే - హీరో తాలూకు ఫ్యామిలీ ని విలన్ చంపడం, విలన్ ముసలి వాడై, ఇంకో రెండు రోజుల్లో వాడంతట వాడే ఛస్తాడనగా హీరో అతనిపై పగ సాధించడం - అని మాత్రమే తెలిసిన ఒక అమాయకమైన కాలం.

ఆ కాలంలో రామాయణరావు దర్శకుడిలా మారాడు. క్లీనర్ రాముడు, సర్కార్ పేష్వారాయుడు, బొబ్బిలిభల్లూకం, కామాభిషేకం, దాహసందేశం, శ్రీవారి కుంపట్లు వంటి చిత్రాలతో తెలుగు తెరపై ఒక మాయాజాలాన్ని సృష్టించాడు. అతడికి రె. కాఘవేంద్రరావు పోటీ. కాఘవేంద్రరావు కంటే ముందే ఈతను దర్శకరాట్న అనిపించుకున్నాడు.

ఇలా దర్శకరాట్న గా మారి తన రాట్నం తిప్పసాగాడు రామాయణ్. కాలక్రమంలో అతనికోసం అతని వెనుక పనిచేసిన పిశాచులకు (ఘోస్టులు) మోక్షం కలిగి దిక్కులకొక్కరుగా వెళ్ళిపోయి ఇతణ్ణి ఒంటరివాణ్ణి చేశారు. రామాయణ్ నిరాశ చెందలేదు. 

తరువాతి తరం వచ్చింది. దర్శకరాట్న కు సరికొత్త ఛాలెంజ్.

నటబ్రహ్మాండ కొడుకు సర్పార్జున తెలుగుపరిశ్రమలో అడుగుపెట్టి కొన్నేళ్లే అయింది. సర్పార్జున కళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. అవి దైన్యాన్ని తప్ప మరోభావాన్ని పలికించవు. ఆ విషయం గ్రహించాడు దర్శకరాట్న. అతనితో గుజ్ను అనే కళాఖండాన్ని తీశాడు. అలాగే మురుగెశ్ తో కొన్ని సినిమాలు తీశాడు. శిశుకృష్ణ తోనూ కొన్ని సినిమాలు తీశాడు. ఇలా ఒక్కొక్కరినీ తన రాట్నానికి బలి చేస్తూ తన అద్భుత ప్రతిభతో రిచంజీవి తో సింహళేశ్వరుడు సినిమా తీశాడు. ఆ సినిమా ఆంధ్రదేశంలో స్కైలాబ్ లా పడింది. ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. ఆ సినిమాలో - చెల్లెలు చచ్చిపోతే హీరో బ్రేక్ డేన్సు చేసినట్టు చూపడం దర్శకరాట్న ప్రతిభాపైశాచికత్వానికి పరాకాష్ట. తర్వాత ఒక సభలో మాట్లాడుతూ దర్శకరాట్న ఒక అపూర్వమైన విషయం చెప్పాడు. "రిచంజీవి సినిమాలో కథ ఉండరాదు. నేను ఈ సినిమాలో మంచి కథ చెప్పాను. అదే జరిగిన పొఱబాటుకు కారణం".

ఇతని దెబ్బ కాచుకోవడానికి, ఇతణ్ణి పడగొట్టడానికి పథకానికి బీజాలు పడినయ్.

**********************************************************

1990 దశాబ్దం మొదట్లో, అప్పట్లో తెలుగు సినిమా నటుల్లో ప్రముఖులు సర్పార్జున, గిగాస్టార్ రిచంజీవి, దగ్గుబాటి మురుగేశ్, శిశుకృష్ణ తదితరులు ఒక చోట చేరారు. ఆ సమావేశం అజెండా రామాయణరావును ఎదుర్కోవడం ఎలా?

సమావేశం ఆరంభిస్తూ మురుగేశ్ చెప్పాడు. మురుగేశ్ , సర్పార్జున అప్పుడప్పుడే తెలుగులో వత్తులు నేర్చుకుని చిత్రపరిశ్రమలో పైకొస్తున్నారు. కాబట్టి వారి మాటల్లో వత్తులు పలుకవు. శిశుకృష్ణకు ఆవేశం ఎక్కువ. ఒక పదం పూర్తి చెయ్యకముందే మరో పదానికి పరుగులు తీయిస్తుంది ఆ ఆవేశం. అంచేత మాటల్లో చివర్లు సరిగ్గా ఉండవు.

"సబ్యులందర్కీ నమస్కారం.  ఇవ్వాళ మనం ఇక్కడ కలుసుకున్నది రామాయణరావును ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ఒక తీర్మానానికి రావడానికి. ఈ విషయంపై ఒక స్ట్రాటెజీని మనం తయారు చేసుకోవాలని నా ఆకాంచ". చెప్పాడు మురుగేశ్.

"రామాయణరావు మనపాలిట శాపంగా మారాడు. ఎప్పుడు సినిమా తీస్తానంటాడో తెలీదు. వద్దు అందామంటే మొహమాటం. మొన్న సింహళేశ్వరుడు సినిమా తీసి నా పరువు తీశాడు." - వాపోయాడు రిచంజీవి.

"నాకూ అంతే. గుజ్ను సినిమా తీశాడు. అది హిట్ అయినప్పటి నుండి ఇంకో సినిమా తీస్తానని వెంట బడుతున్నాడు. ఇప్పుడు నాకు వతులు వచ్చేశాయి. అతనితో నేనెందుకు సినిమా తీయాలో నాకర్దం కావట్లేదు" - చెప్పాడు సర్పార్జున. సర్పార్జున కంఠం పాము బుసకొట్టినట్టు ఉంది.

"అహ, అతణ్ణి ఎదుర్కోవాలంటే మనం అతణ్ణి ఉబ్బేయాలి. అదే చక్కగా పనిచేస్తుంది." - శిశు కృష్ణ చెప్పాడు.

చివరికి శిశుకృష్ణ చెప్పిన దానితో అందరూ ఏకీభవించారు. అతణ్ణి ప్రతి సమావేశానికి పిలవాలి. ప్రతి పత్రికలోనూ పొగడాలి. అతడు సినిమా తీస్తానంటే మీరు ఆస్కార్ స్థాయి దర్శకులని, మాకు ఆ స్థాయి లేదని తప్పించుకోవాలి.

**********************************************************

ఆ కుట్ర చక్కగా పనిచేసింది. రామాయణరావు పీడను చిత్రపరిశ్రమ అగ్రనటులు అలా సమర్థంగా ఎదుర్కున్నారు. దర్శకరాట్న తన ప్రయత్నాలు మానలేదు. మొన్నతరం నటి భాగమతితోనూ, నిన్నటితరం అపజయశాంతి తోనూ సినిమాలు తీశాడు. ఆ పైన తన సుపుత్త్రుణ్ణి వెండితెరకు పరిచయం చేస్తూ సినిమా తీసి, తను కూర్చున్న కొమ్మను తనే విరుగగొట్టుకున్నాడు.

రామాయణరావుకు ఆఖరుగా హిట్ వచ్చిన చిత్రం ’ఏమేవ్ నారాయణమ్మ".

ఆ తర్వాత అతడు సినిమాకళాకారుల సంఘానికి అధ్యక్షుడయాడు. కానివ్వకపోతే అతడితో సినిమా తీస్తానని వెంటబడతాడని అందరి భయం. ఆ తర్వాత సినిమా ఫంక్షన్ లలో ప్రసంగాలు ఇవ్వడం రామాయణరావుకు అలవాటుగా మారింది. ప్రతి సినిమా ఫంక్షన్ కూ హాజరై తన పురాణం వినిపిస్తూ శ్రోతల్లో గుండెల్లో నిద్రపోవడం అతనికి కొత్తగా అలవడిన విద్య.సంచలనాలు అన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి కాబట్టి అప్పుడప్పుడూ ఈయన తన మాటలతో సంచలనం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎన్నో యేళ్ల తర్వాత శిశుకృష్ణతో సినిమా తీశాడు. ఆ సినిమాకు తుస్కార్ అవార్డు వస్తుందన్న స్థాయిలో రామాయణరావు ఆశపడ్డాడు. పరిశ్రమవర్గాలూ ఆ మాటే అన్నాయి (అనకపోతే జరిగేది తెలుసు కాబట్టి).

ప్రస్తుతం .... రామాయణ రావు సినిమా ఫంక్షన్ లలో స్పీచులిస్తూ ప్రశాంతంగా ప్రజల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఇతడివి 140 సినిమాలయాయి. మరో తొమ్మిది సినిమాల వరకూ టైముంది. ఆ తర్వాత తన 150 వ చిత్రం ఎవరితో తీయబోతాడో! అప్పుడు సునామీలా ఎవరిమీద విరుచుకుపడనున్నాడో దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Saturday, July 7, 2012

వేయిపడగలతో నేను





అబ్బ! దాదాపు పాతికేళ్ళ క్రితం మొదలెట్టిన పని ఒక్కటి నిన్నటికి పూర్తి అయ్యింది. వేయి పడగలు చదివేశాను!

మాకు చిన్నతనంలో సంస్కృతం చెప్పిన అయ్యవారు విశ్వనాథ వారి శిష్యుడు, భక్తుడు. ఆయన అనువాదం క్లాసులో పాఠాలతో బాటు, మిగతా విషయాలు కూడా చెప్పేవారు. అందులో భాగంగా విశ్వనాథ గురించి చెప్పడమే కాక, ఆయన నవలలు తెఱచిరాజు, వేయిపడగలు, చెలియలి కట్ట వంటి వాటిని తరగతికి తీసుకు వచ్చి కొన్ని భాగాలు మాకు చదివి వినిపించేవారు. తెఱచిరాజులో కత్తియుద్ధవర్ణనా, వేయిపడగల ధర్మారావు గారి ఉపదేశాలు, చెలియలి కట్ట లో కొంతా ఏదో లీలగా జ్ఞాపకం ఉన్నాయి. చెలియలి కట్ట అర్థం కూడా ఆయన ద్వారానే తెలిసింది. ఒక్క సంఘటన మాత్రం జ్ఞాపకపు పొరల్లోంచి మొన్న వెలికి వచ్చింది. " స్త్రీలు మధ్యవయసు వాళ్ళను ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు? స్త్రీలు మామూలుగా భోగాసక్తులు, అలా కాకపోతే ఇద్దరు ముగ్గురు భార్యలుండి పిల్లల్లేని దుష్యంతుని శకుంతల ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని ఒకనాడాయన వేయిపడగలలో (18 వ అధ్యాయం) నుండి ఉటంకించారు. నేను  ఆయనను ఆక్షేపిస్తూ, "స్త్రీలందరూ భోగాసక్తులైతే మరి సుకన్య చ్యవనుణ్ణి ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని అడిగినట్టు గుర్తు. మా అయ్యవారికది నచ్చలేదు. ఏదో చెప్పారు, గుర్తు లేదు. నాకు మాత్రం విశ్వనాథ, మా అయ్యవారూ ఇద్దరూ అప్పట్లో నచ్చలేదు. ఆ నచ్చకపోవడం - మాకళీదుర్గంలో కుక్క - తో కాస్త బలపడింది. ఆ కథ నా తొమ్మిదవతరగతి పాఠ్యాంశం. ఆ కథా నాకప్పట్లో అర్థం కాలేదు. ఆ శైలీ నచ్చలేదు. (ఇప్పటికీ)

అంతలా ఆయన చెప్పిన వేయిపడగలు చదవాలని అప్పుడు నిశ్చయించుకున్నాను. మా పుస్తకం మా అయ్యవారినడిగితే ఇవ్వలేదు. విశ్వనాథ పుస్తకాలు అందరికీ సరిపోవని, బదులుగా మహీధరనళినీమోహన్ పుస్తకాలు చదవమని చెప్పారాయన.

అయితే వేయిపడగలు చదవాలన్న కుతూహలంతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళి కొంచెం కొంచెం చదువుతూ వచ్చాను. అలా ఓ వందపేజీలు మాత్రమే సాగింది. ఇన్నేళ్ళ తర్వాత అది ముగిసింది.

*********************************************************************************

వేయిపడగల గురించి నా అభిప్రాయం


నవలలో ఆంగ్లేయుల దమన నీతిని గురించి వివరణలూ, భారతీయుల ఔన్నత్యప్రదర్శనా, గ్రామస్వరాజ్య విచ్ఛిత్తి వివరణల్లోని సూక్ష్మతా సంచలనాత్మకంగా, అద్భుతంగా ఉన్నాయి. ఒక చోట జేబులు కొట్టుకునే పిల్లవాని ఔన్నత్యం, అతనిలోని భారతీయాత్మ గురించి చెబుతాడు. హృదయం కదిలిపోతుంది. (అలాంటి సంఘటనలు నిజజీవితంలో ఎదురైతే వాటి విలువ తెలుస్తుంది.)  కొన్ని కొన్ని సంఘటనలు కరుణరసాత్మకంగా ఉన్నాయి. అదే సమయంలో ఆంగ్లేయులను ఉద్దేశించి సమాధానాలు చెప్పినంత మాత్రాన ఈయన భావాలు సరైనవని ఎందుకు ఒప్పుకోవాలో తెలియలేదు.

ఉదాహరణకు: "మోటారు వాహనానికి పెట్టే డబ్బు ముండకు పెడితే తప్పేంటి? ఒక వేశ్యకు పూటకు తినడానికి తిండి అయినా దొరుకుతుంది." - అంటాడొకచోట. ఇది నవలలో వచ్చే కొందరు వర్ణాధికుల వేశ్యాలంపటకు చవకబారు సమర్థన. ఆంగ్లేయులు లేని కాలంలో వేశ్యాలంపటను రచయిత ఏ రకంగా సమర్థిస్తాడు? 

ఇంకా - శూద్రుల దేవాలయ ప్రవేశనిరాకరణకు రచయిత సమర్థనా, దేవదాసీ వ్యవస్థకు glorification, ఆమె పాత్రచుట్టూ చిక్కగా అల్లిన కూటనీతి ఇలాంటివి కాస్తో కూస్తో ఆలోచనాపరులైన పాఠకులకు సహించవు. (తనసిద్ధాంతాలు కరెక్టని నిరూపించడం కోసం విశ్వనాథ సహృదయులు సిగ్గుపడే వాదనలు చేస్తాడు - వల్లంపాటి వెంకటసుబ్బయ్య) ఇక విస్సన్న చెప్పింది వేదమన్నట్టు లెక్చర్లు దంచడం, భిన్నవాదాలు ఇతర పాత్రలతో చెప్పి చర్చించకుండా, తనకు తెలిసింది ధర్మమన్నట్లు హీరో చెబుతూ పోవడం, వింటున్నవాళ్ళు ’బాంచెన్ దొరా’ అన్నట్టు ఊరుకోవడం కృతకంగా, పేలవంగా ఉంటాయి.

విద్యుచ్ఛక్తి మీద విశ్వనాథ విమర్శలు చదివితే రా.రా. మాటలు గుర్తొచ్చి నవ్వొస్తుంది. వీథిదీపాలు రావడం వల్ల ఆ తీగల మీద కూర్చుని కాకులు చచ్చిపోతాయట. అవి రావడం వల్ల ఆడాళ్ళు సాయంకాలం దీపాలు పెట్టరు, అందువల్ల ఇంట్లో మహాలక్ష్మి వెళ్ళిపోతుంది, పైగా ఆముదం అవసరం తీరిపోవడంతో ఆముదం పంట రైతులు మానేసి వరిపంటనే పండిస్తారట!

ఈ రచన విశ్వనాథ స్వీయచరిత్రేనని, నవలలో ధర్మారావు ఈయనేనని, ధర్మారావు, ఆయన మిత్రుల అభిప్రాయాలు, భావజాలం రచయితవేనని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నవలను విమర్శిస్తే భావజాలాన్ని విమర్శించనట్లవుతుందో, లేక రచనను మాత్రమే విమర్శించినట్లవుతుందో తెలియదు.

నవల చదివేప్పుడు చాలాసార్లు ఠాగూర్ గుర్తొచ్చాడు.  నవల పూర్తి చేసి వెతికితే ఆర్. ఎస్. సుదర్శనం గారు విశ్వనాథను, రవీంద్రనాథుని పోల్చి వ్రాసిన విమర్శ దొరికింది. (1964 భారతి సెప్టెంబరు నెలలో ప్రచురితం) కొన్ని లోపాలున్నప్పటికీ మంచి వ్యాసం. ఈ వ్యాసాన్ని తిరిగి సారస్వత వివేచనలో రా.రా. సమీక్షించాడు. అదీ గొప్పవ్యాసమే.

ఇంకా "కొల్లాయి గట్టితేనేమి" కూడా గుర్తొచ్చింది. కొల్లాయి గట్టితేనేమి, వేయిపడగలు రెండింటి కథాకాలం ఒక్కటే. 1920 లలో సమాజ ప్రభావం కుటుంబం పైనా, సాంప్రదాయవాది అయిన వ్యక్తి మీద ఎలా ఉన్నదో ఒక అగ్రహార నేపథ్యంతో చెప్పిన కథ మొదటిదైతే, అదే కాలంలో సుబ్బన్నపేట అనే ఒక గ్రామ (స్వరాజ్య) విచ్ఛిన్నతను వ్యక్తులజీవిత నేపథ్యాలతో చెప్పిన కథ రెండవది. మొదటిది Evolution. రెండవది Involution.  బిగువైన కథనం, చిక్కటి సన్నివేశచిత్రణా మొదటి నవలలో కనిపిస్తే, రెండవదానిలో ఉపదేశధోరణీ, సాంప్రయవాదం, జమీందారీవ్యవస్థాప్రతిష్టాపనాపరాయణత్వం, విస్తృతవిషయసంగ్రహం కనిపిస్తాయి. మొదటి నవల శైలి అనాయాసమూ, సులభమూ. రెండవ నవల శైలి గ్రాంథికం లాంటి వ్యావహారికం, వ్యావహారికం లాంటి గ్రాంథికం. ఈ రెంటిని పోల్చి తులనాత్మకంగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి.

వేయి అరఠావులు, 650 పేజీల ఈ నవలను ఈ రచయిత 29  రాజుల్లో వ్రాశాడట. గొప్పవిషయమే, కానీ అది quantitative assertion అవుతుంది. రచయిత పాండిత్యంకన్నా పాఠకునికి ఒరిగినదేమిటి అనేది సరైన ప్రశ్న. నవలలో విషయవిస్తృతి విషయవివేచనను మింగివేసింది. మొత్తం చదివిన తర్వాత పాఠకునికి ఎన్నో విషయాలు చదివినట్లున్నా అనేక విషయాలపై స్పష్టమైన అభిప్రాయం, అవగాహన ఏర్పడదు.ఎందుకంటే ఈ రచన మేధోనిష్టమైనది.

సాహిత్యం హృదయనిష్టమైనది. పాండిత్యం మేధోనిష్టమైనది. రెండిటికీ తేడా ఠాగూర్ కు, విశ్వనాథకు ఉన్నంత!

Wednesday, June 13, 2012

చివరికి మోహన్ బాబే గెలిచాడు!


పాడుతా తీయగా చల్లగా కార్యక్రమం అంటే ఒకప్పుడు ఎంతో ఆసక్తి నాకు. చాలా రోజుల తర్వాత ఈ మధ్య మళ్ళీ చూడ్డం తటస్థించింది.

ఇదివరకు బాలు పిల్లకాయల మీద కాస్త అతిగా కామెంటేవాడనుకుంటా. ఈ మధ్య కాస్త తగ్గించాడు. సరే బావుంది లెమ్మని తర్వాత ఎపిసోడ్లు చూడ్డం కొనసాగించాను. క్వార్టర్ ఫైనల్, సెమి ఫైనల్ లలో నేను చూసిన ఎపిసోడ్ లలో బాలు తో బాటు మరో ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ఒకాయన తి.తి,దే ఆస్థాన విద్వాంసులు, మరొకరు ద్వారం వెంకటస్వామినాయుడు గారి మనవరాలు, మరొకామె మల్లీశ్వరి సినిమాలో ఒక నటి, సింగర్, ఇదివరకు ఇదే కార్యక్రమంలో విజేత. చాలా చక్కటి జడ్జెస్ వచ్చారు కదా అని అనుకున్నాను. ఇక ఫైనల్స్!

********************************************************************************

ఫైనల్స్ లో - బాలు ఆనాటి గెస్ట్ గురించి చెప్పాడు. నా హృదయం ఏదో కీడును శంకించింది. ఎడమ కన్ను తనపని తను చేసుకుపోయింది. ఆ నేపథ్యంలో స్టేజ్ మీదకు ఒకనాటి ఎమ్జీయార్ టోపీ ధరించి ఒక ’సెలెబ్రిటీ’ ...కాదు కాదు..లెజెండ్ అడుగుపెట్టాడు. బాలు గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆ టెన్షన్ తన మాటల్లో ప్రతిఫలించింది. "ఈ నాటి మన గెస్టు కళాప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారు. మోహన్ బాబుకు నాకు 1975 నుండీ పరిచయం. తను సినిమారంగానికి వచ్చిన మొదటి రోజు నుండి నాకు తెలుసు. ఈ రోజు వారి పక్కన కూర్చుని నా బాధ్యత నిర్వర్తించడం ఎలానో తెలియట్లేదు! ఇదొక విషమ పరీక్ష నాకు. అతణ్ణి వేదిక మీదకు సగౌరవంగా తనను ఆహ్వానిస్తున్నాను." (చివరి మాట అంటున్నప్పుడు బాలు గొంతు దుఃఖంతో పూడుకు పోయింది)

మోహన్ బాబు గారు వచ్చారు. బాలును గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత తన సీటు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

అభ్యర్థులకు కూడా ఫైనల్స్ లో మంచి పాటలు, మంచి సంగీతం కన్నా కూడా మోహన్ బాబును ఎలా మెప్పించాలన్న ధ్యాస మొదలైన క్షణమది.

మొదటి అభ్యర్థి వేదిక మీదకు పిలువబడ్డాడు. అతను ఎంచుకున్న పాట - "పుణ్యభూమి నా దేశం నమోనమామి". చాలా గంభీరంగా, పాడాడు, పాట మధ్యలో వచ్చే "ఒరే తెల్లకుక్కా, ఎందుకు కట్టాలిరా శిస్తు..." వంటివి ఎంతో గంభీరంగా మాట్లాడాడు, చివరకు ముగించాడు.

అవతల మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయాడు. తను సినిమా రంగంలో కూడు లేక పడుకున్న రాత్రుల దగ్గర్నుంచి ఈ పాట వరకూ తన జీవిత చరిత్రను లక్షలాది ప్రజలకు వినిపించాడు. అతని మనసులో ఇంత చేసినా తను లెజెండ్ కాకుండా సెలబ్రిటీ గా మిగిలిపోయాడన్న బాధ సుళ్ళు తిరుగుతూ ఉండాలి! ఆ పాటను బాలు తప్ప మరెవరూ అంత బాగా పాడలేరన్నాడు. ఇవతల అభ్యర్థి అయిన పిల్లవాడి ముఖంలో అయోమయం, బాధ! అతను కనీసం సెలబ్రిటీ అయినా అయాడు, నా పాట గురించి కనీసం ఒకమాట మాట్లాడలేదే అని ఆ అబ్బాయి పాపం పరితపించాడు. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణాన్ని చల్లబరిచే కొండంత బాధ్యతను బాలు తన భుజాలపై మోశాడు. కాసేపు మోహన్ బాబును ఇమిటేట్ చేశాడు.  తమ అనుబంధం, మిత్రత్వం గురించి చెప్పాడు. అతడి గొంతును అనుకరించి జనాలను ఆహ్లాదపరిచాడు. మోహన్ బాబు తనకు వంద రూపాయలు బాకీ అని చెప్పాడు. మండుతున్న మోహన్ బాబు గుండెలో పన్నీరు చల్లాడు. చివరకు అతణ్ణి ఎలాగో జనజీవనస్రవంతిలోకి ఈడ్చుకుని వచ్చాడు.

ప్రోగ్రాములో కమర్షియల్ బ్రేక్ వచ్చింది. దాదాపు ముప్ఫై వాణిజ్య ప్రకటనల తర్వాత తిరిగి ప్రోగ్రాం మొదలయ్యింది. "ముద్దబంతి పువ్వులో మూగ బాసలు.." ఈ పాట పాడాడు అభ్యర్థి. పాట ముగిసింది. మోహన్ బాబు మరో సారి తన పురాణం వినిపించాడు. ఈ పాట వెనుక కృషి, తన నిద్రలేని రాత్రులు, రె. కాఘవేంద్రరావు తనను మెచ్చుకోవడం, తను అప్పుల్లో మునిగి ఉండడం వంటివి శ్రోతలు అందరికి స్ఫూర్తిదాయకమైన రీతిలో చెప్పాడు. అభ్యర్థికి సలహా ఇస్తూ, "నవ్వుతూ పాడాల"న్నాడు.

"ఏదీ నవ్వుతూ ఓ ముక్క పాడు చూద్దాం!" అన్నాడు. ఆ అభ్యర్థి పాపం - నవ్వలేక ఏడుస్తూ పాడాడు. నవ్వితే పాటెలా వస్తుంది? నవ్వడమైనా ఉండాలి, లేదా పాడ్డమైన ఉండాలి. రెండూ కలిపితే పులుసులోకి ఆముదపునూనెతో తిరగమోత పెట్టినట్టుంది. అయినా సరే అభ్యర్థి గుండె చిక్కబట్టుకుని తన పని నిర్వహించాడు.

మళ్ళీ కమర్షియల్ బ్రేకు!

ఆ తర్వాత మూడో అభ్యర్థిని ఏదో పాట పాడింది. మోహన్ బాబు తిరిగి విజృంభించాడు. బాలు తనకన్నా పెద్దవాడెలాగన్నాడు? తన తండ్రి వయసు 94 యేళ్ళు అన్న విశేషాలు, తను ఎప్పుడు చిత్రరంగంలో అడుగుపెట్టాడు అన్న విషయమూ చెప్పాడు. మధ్యలో బాలు అతణ్ణి చల్లబరచాలని, తను మోహన్ బాబుకన్నా తక్కువ వయసు వాడన్నాడు. మోహన్ బాబుకు కోపం + అనుమానం వచ్చాయి. కొంపదీసి బాలు తనని లెజెండ్ కాదని శంకిస్తున్నాడా? బాలు మీద అనుమానంతో ఆ అమ్మాయిని ఓ  ప్రశ్న అడిగాడు.

"అమ్మాయ్, నువ్వు చెప్పు! నేను నా సినిమాలో ఛాన్సిస్తా! బాలు పెద్దవాడా? నేనా?" ఆ అమ్మాయి జడ్జులిద్దరిలో ఎవరిని అంటే ఏమౌతుందోనని భయపడింది. ఏం చెప్పాలో తెలియలేదంది. అదే ఆ పాప పాలిట శాపమౌతుందని ఆ క్షణాన ఆ అమ్మాయికి తెలీదు!

చివర్న - చివరి అభ్యర్థి - పాటపాడింది. ఈ సారి మోహన్ బాబు కు బాలు ఏం చెప్పాడో తెలీదు. కాస్త తొందరగానే వదిలాడు.

********************************************************************************

ఒక రోజులో ముగించాల్సిన పని మరోవారానికి వాయిదా పడింది. మరో ఎపిసోడు మొదలయ్యింది.

********************************************************************************

ఈ సారి మొదటి అభ్యర్థి - మోహన్ బాబును గాలికి వదిలేశాడు. అతణ్ణి ఇంప్రెస్ చేయడానికి కాకుండా నిజంగానే గొప్పపాట అయిన "శివశంకరీ, శివానంద లహరి" ని చక్కగా పాడాడు. మోహన్ బాబు గుండెలో కోటి వీణలు మోగాయి. అన్న పాట పాడినందుకు ఆ అభ్యర్థిని అభినందించాడు. బాలు మాత్రం ఈ సారి ఆ అబ్బాయి పాటలో కాసిన్ని తప్పులేరాడు. బాలు బాధ ఏమంటే - తను మాట్లాడకపోతే మోహన్ బాబుకు శ్రోతగా మారే ప్రమాదం ఉంది. అంచేత ఈ సారి స్ట్రాటెజికల్ గా ప్లాను వేసి తనే లీడ్ తీసుకున్నాడు. బాలు ప్రయత్నం వృథా పోలేదు. మోహన్ బాబును తన జీవిత చరిత్ర ఒక ఎపిసోడు పాటు చెప్పకుండా నిరోధించడంలో అతను 70 శాతం కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి.

రెండవ అభ్యర్థి. ’రసిక రాజ తగువారము కామా’ పాట పాడాడు. అద్భుతంగా పాడాడనే చెప్పాలి. కానీ రసికులెవరక్కడ! పిల్లవాడికి కూడా పాడడానికి ’లెజెండ్ రాజ తగువారము కామా’ అనే పాటలేదుగా మరి! అయినా పాటెవడిక్కావాలి? ఎప్పుడు పాట ముగుస్తుందా, తన జీవిత చరిత్ర మొదలెడదామా అని మోహన్ బాబు! అతణ్ణెలా కంట్రోలు చెయ్యాలా అని బాలు! ఎలాగో పాట ముగిసింది. అయితే ఎలాగో మోహన్ బాబు తన శక్తి మొత్తం కూడగట్టుకుని తన జీవిత చరిత్ర చెప్పకుండా ఆవేశాన్ని అణచుకున్నాడు.

మూడవ అభ్యర్థిని - పాపం ముందు ఎపిసోడ్ లో మోహన్ బాబు అడిగిన ధర్మసందేహం దెబ్బకు ఆమె ఇంకా కోలుకోలేదు. అంచేత చిన్న పొఱబాటు చేసింది. (అందుకు తగిన మూల్యమూ ఆ అమ్మాయి చెల్లించింది) జానకి పాడిన "నీలీల పాడెద దేవా" మొదలెట్టింది. (ఆ ’లీల’ ఎవరిదో దేవుడికే తెలియాలి). ఆ పాట మధ్యలో వచ్చే సంగీతం బిట్లు కాస్త తప్పుగా పాడింది. పాట ముగిసింది. అంతే! మోహన్ బాబుకు బాల్యం గుర్తొచ్చింది. తను వాళ్ళ గురువు గారు చెప్పిన సంస్కృత శ్లోకాన్ని ఎలా భట్టీ పట్టారో చెప్పాడు. అటుపై తన తండ్రికున్న మూడెకరాల పొలం, కష్టాలు, తనకు పెళ్ళి లేటవడం ...వగైరా విషయాలు చెప్పాడు. చివర్న పాట పాడిన అమ్మాయి ’ఏదో’ పొఱబాటు చేసినట్టు తన లెజెండ్రీ బుద్ధికి తోస్తున్నట్టు నొక్కి వక్కాణించాడు.

బాలు ఆ మిగిలిన దాన్ని పూరించాడు. ( ఈ సారి బాలు మోహన్ బాబును ఒక ఎపిసోడ్ అనుభవంతో బాగా ఎదుర్కున్నాడు. మోహన్ బాబుతో తన మిత్రత్వం గురించి చెప్పాడు) ఆ అమ్మాయి తప్పు చూపించాడు.

చివరి అమ్మాయి - అప్పటికే ఈ పోరాటంలో బాలు, మోహన్ బాబులు అలసి పోయారు. ఆ అమ్మాయి పాలిట అది వరమయ్యింది. స్వతహాగానే అందమైన గొంతున్న అమ్మాయి చక్కగా పాడింది. ఆ అమ్మాయి పాట ముగిసింది.

ప్రథమ బహుమతి ఆ చివరి అమ్మాయికే వచ్చింది. ఆ అమ్మాయి సంతోషించింది. ప్రోగ్రామును (బాబును) ఎలానో వదల్చుకున్నందుకు బాలు ఆనందపడ్డాడు.

*********************************************************

ఈ కార్యక్రమంలో నిజమైన విజేత ఎవరు???? ఇది తెలిసీ చెప్పకపోతే అతడికి మోహన్ బాబు జీవిత చరిత్ర కాసెట్ వందసార్లు చూసే అవకాశం వస్తుంది.

అవును మీరు కరెక్టే. తనే విజేత. ఇది మోహన్ బాబు లెజెండ్ అన్నంత పచ్చి నిజం.

Saturday, April 28, 2012

అమృతత్వం నుంచీ అమృతత్వం లోకి...


కృష్ణ పారుతోంది.. గునగున నడిచే చిన్ని పాపాయి గజ్జెల సవ్వడిలా బుడిబుడి ధ్వానాలతో..
కృష్ణ పారుతోంది..శ్రీకృష్ణుని మురళీనాదంలా ప్రకృతిని మైమరపిస్తూ ..
కృష్ణ పారుతోంది..తనలోని ప్రాణశక్తిని ఘనీభవింపజేసి సస్యరాశులకందిస్తూ.,
కృష్ణ పారుతోంది..తనలోని స్వచ్ఛమైన ప్రేమను రంగరించి పచ్చని పంటచేల చీరను భూమితల్లికి చుట్టబెడుతూ..
కృష్ణ పారుతోంది.. జలబిందువుల ఇంద్రనీలాలరాశులను దొరలిస్తూ.. తుళ్ళుతూ..తనలోంచి తనలోకి..చల్లగా.. మెల్లగా .. అమ్మలా .. కమ్మగా.. నవ్వుతూ..

ఆ పక్కనున్న బ్రిడ్జి కావతల ఎవరో రాజు తన శత్రువుల నుండి తప్పుకుందుకు కాబోలు నది మధ్యలో గుట్టమీద ఇల్లు అనబడే కోట కట్టుకున్నాడు. ఆయన ఖాళీ చేసివెళ్ళిపోయినా, కృష్ణ తాలూకు నల్లని నలుపును గోడలమీద ప్రతిఫలింపజేస్తూ, ’టులెట్’ బోర్డు పెట్టినా ఎవరూ ముట్టుకోని దశలో ఆయన ఇల్లు అలాగే ఉంది.

బ్రిడ్జికి ఇటువైపు విశాలమైన స్నానఘట్టాలు, అందులో స్నానాదికాలు చేస్తున్న మనుషులు, దూరంగా చిన్నపిల్లల గుంపు నీళ్ళల్లో ఈదులాడుతూ తుళ్ళుతూ కేరింతలు.. ఒడ్డున విగ్రహాలు, చిన్న చిన్న అంగళ్ళూ, తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, తనలోకి అడుగుపెట్టిన వారి మాలిన్యాన్ని కడిగేస్తూ, మనసును తేటపరుస్తూ గలగలలాడుతోంది.

నది - 

ధ్యానానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో! అందుచేతనే హెర్మన్ హెస్సే సిద్ధార్థుడు జీవిత చరమాంకంలో నదిలో పడవ నడుపుతూ, నదితో ఊసులాడుతూ, బౌద్ధిక జ్ఞానానికతీతమైన పూర్ణ(శూన్య)త్వాన్ని ఆవిష్కరించుకుంటాడు.

You cannot step in to the same river twice - అని హెరాక్లిటస్.
అవును.
నది బయటకు కనిపించే ఒక నిశ్చలత్వం.
అంతర్గతంగా ఒక అనిశ్చల ప్రవాహం.
మొత్తంగా నిశ్చలమూ, అనిశ్చలమూ రెంటికీ అతీతం.
అంటే నిశ్చలమూ, అనిశ్చలమూ రెండూ కానిది కూడానూ.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే । తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||

నది ఒక పూర్ణత్వమూ, నది ఒక శూన్యత్వమూ కూడానూ.

ఆ పూర్ణత్వాన్నేనేమో వేద ఋషి ఇలా ఘోషిస్తాడు.

ఆపోవా ఇదగుం సర్వమ్ ,విశ్వాభూతాని ఆపః, ప్రాణావాపః, పశవ ఆపః, అన్నమాపః, అమృతమాపః, సమ్రాడాపః, విరాడాపః, ఛందాగుంసి ఆపః, భూర్భువస్సువరాప ఓమ్...

జగత్తులో సర్వమూ జలమే. ప్రాణము నీరే, పశువులు నీరే, అన్నమూ నీరే, అముతమూ నీరే, సార్వభౌముడు నీరే, బ్రహ్మస్వరూపమూ నీరే, ముల్లోకాల్లో సర్వమూ నీరే....

నది ఒక సౌందర్యం.

నది ప్రాణం, బీజమూ, మరణమూ, అమృతమూ, అమృతత్వమూనూ.

ఎవరో తమ అయినవాళ్ళ చితాభస్మాన్ని నిమజ్జనం చేస్తున్నారు. ఆ పక్కనే ఒడ్డున వారగా తామర పూల మొక్కలు, నీటిలో తేలుతూ ఉన్నై. ఆ మరణం తాలూకు చిహ్నమైన చితాభస్మం కృష్ణ ప్రవాహం ద్వారా చైతన్యం పుంజుకుని ఒక తామరపూవుకు జన్మనిస్తుందేమో!

అలాంటి ఒక అమ్మ ప్రాణం అనే జీవచైతన్యపు ప్రవాహం పంచభూతాలలో ఒకటైన నీటిలో (కృష్ణలో) నిమజ్జనమై ఆ తర్వాత కొన్నేళ్ళకు మరొక తమ్మిపూవంటి ’అమ్మలు’గా మా ఇంట్లో జన్మించింది!

సృష్టి అనంతం - కృష్ణ ప్రవాహం లాగే.

ఈ ప్రవాహం -

అమృతత్వం నుంచి అమృతత్వం లోకి...

Friday, April 20, 2012

షాడో ... షాడో ... షాడో...

- గుండెల మీద పదిటన్నుల బండరాయి పడ్డట్టు ఉక్కిరిబిక్కిరయ్యాడు
- విపరీతమైన ఆలోచనలతో కందిరీగల తుట్టెలా తయారయ్యింది షాడో అంతరంగం
- అంతటితో షాడో వెన్నంటి వచ్చిన అదృష్టదేవత ముఖం చాటు చేసింది.
- తాషామర్బా లాంటి కంఠం తో అరుస్తూ...
- ’గెట్ బేక్ ఎవ్రీబడీ’ - ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నలు వెయ్యలేదెవ్వరు..
- అప్రయత్నంగా చలిగాలి వీచినట్లు జలదరించింది.
- అత్యంతప్రమాదకరమైన సైడ్ కిక్ డెలివరీ చేశాడు.
- అబే దొంగనాయాళ్ళలారా, ఈ గంగారాం నే అడ్డుకుంటార్రా?
- ’తీర్చుకుంటాను ఫ్రెండ్. నిన్ను ఈ గతికి గురిచేసిన వాణ్ణి ఇంతకన్నా దారుణమైన మరణానికి గురిచేసి గాని విశ్రమించను’.
- నల్లటి పరదాలు కళ్ళముందు ప్రత్యక్షమవుతుండగా నేలపైకి జారిపోయాడు.
- బుగ్గల మీదకు కారింది వెచ్చటి కన్నీరు
- ముఖమంతా నవ్వులమయం చేసుకుంటూ..
- అసహ్యంగా చూస్తూ సిగరెట్టు వెలిగించాడు
- రాగయుక్తంగా అంటూ...

ఈ వాక్యాలు మీకు అర్థమయితే మీ మదిలో ఓ చిన్న చిరునవ్వు కదులుతూ ఉండాలి.

బాగా అలసిపోయి మీరు ఇంటికి వచ్చారు. కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నారు. అప్పుడు యే తత్త్వవేత్త పుస్తకమో, మహాకావ్యమో, ఉత్తమ నవలో, హృదయాలు పిండేసే కథో మీ ముందు పెడితే ఆ పుస్తకమక్కడ పెట్టిన వాడిని ’ఫెడీ’ మని తందామనిపిస్తుంది. అలాంటి సమయంలో మాంఛి కాఫీ లాంటి పుస్తకమొకటి చేతిలో పడిందా, మీ తల్నొప్పి, గిల్నొప్పి చేత్తో తీసేసినట్టు మటుమాయం. అదుగో - అలాంటివే ఈ షాడో పుస్తకాలు.

1980 దశకం చివరా, 90 ప్రథమార్థం లో కాలేజీ చదువులు చదివిన వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఈ క్రింది సంఘటనలు ఏదో ఒకసారి, ఎలాగోలా అసలు రంగుతోనో, రంగుమార్చుకునో ఎదురయి ఉండకపోవు.

అమ్మా నాన్నా, షాడో బుక్కులు చదవనివ్వడం లేదు. ఈ బుక్కులు చదివితే చెడిపోతారనో, లేకపోతే అలవాటు పడి పరీక్షలకు చదివి ఛావరనో వాళ్ళ ’ఇది’. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అట్టాంటి ఒకానొక ఉపాయం పేరు కంబైన్డ్ స్టడీ. ఫ్రెండింట్లో మేడపైన మకాం. బాడుగ పుస్తకాల వాడి దగ్గర ఓ నాలుగైదు పుస్తకాలు అప్పటికే సహృదయుడొక్కడు తీసి ఉంచాడు. ఇక ఆ పూటంతా పండగే పండగ. కంబైన్డ్ స్టడీయే స్టడీ!!

మనకో థిక్కెస్టు ఫ్రెండు. అయితే వాడు మీ దగ్గర బాడుగ పుస్తకం తీసుకుని పోగొట్టాడు. అడిగితే దబాయిస్తున్నాడు. ఇవతల బాడుగ షాపు వాడు అరెస్టు వారంటు ఇష్యూ చేసి తిరుగుతూ ఉన్నాడు. చివరికి టెక్స్ట్ పుస్తకం పాత పుస్తకాల షాపులో అమ్మితే ఆ పీడ వదిలింది. అంతా అయిన తర్వాత ’ఫ్రెండు’ జాతీయం చేసిన పుస్తకాన్ని ఓపన్ గా తెచ్చి కళ్ళముందే చదువుతూ ఉన్నాడు!!!

ఇంగిలీసు పరీక్ష మరుసట్రోజే. అయితే మన టెన్షన్ అందుక్కాదు. సగం చదివిన షాడో పుస్తకం ఆ రోజు ఎలాగైనా పూర్తి చెయ్యాలి. ఎట్టకేలకు మన పని పూర్తి చేశాం. మరుసట్రోజు ఇంగిలీసు కోసం ’బూన్ టు ఇంటర్ ఇంగిలీసు’ లో తెలుగులో రాసిన ఎస్సేలు చదువుకెళ్ళాం. మనకొచ్చిన అతి భయంకరమైన ఇంగిలీసును పరీక్షలో ప్రదర్శించాం. ఆ ఉత్తమ ప్రదర్శనకు తగిన ఫలితమూ వస్తుందని తెలుసు. మనకు బాధే (సిగ్గే) లేదు. షాడో పుస్తకం చదివిన సంతోషం ముందు ఏదీ నిలవదు.

అమ్మ - షాడో పుస్తకం చదవనివ్వట్లేదు. ఒక చిన్న ఎత్తు వేశాం. రెండు భాగాలున్న మాంఛి నవలొకటి తీసుకొచ్చి బాడుగ షాపు వాడి దగ్గర నుండి తెచ్చి ఇంట్లో పెట్టాం. అమ్మ ఆ పుస్తకం తీరికున్నప్పుడు చదివి పూర్తి చేసింది. ఆ పుస్తకం తిరిగిచ్చేసి రెండో భాగం పట్టుకు రమ్మంది. ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది కాబట్టి ’అమా, నేనూ ఒక బుక్కు తెచ్చుకుంటా’  అనేసి ఆ పుస్తకం తో బాటు అఫిషియల్ గా మనక్కావలసిన పుస్తకం తెచ్చుకున్నాం.

’నువ్వు ఇలాంటి పుస్తకాలు కూడా చదువుతావా?’ - ఇంటికి వచ్చిన నాన్న గారి హైక్లాసు హైటెక్కు బంధువులెవరో అడిగారు. వాళ్ళ ఇళ్ళలో ఉత్తమాభిరుచి పేరు ’ఇంగ్లీషు అమర్ చిత్రకథ’. కసి రేగింది. మన ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ తెచ్చాం. హాశ్చర్యం! వాళ్ళ ఇళ్ళలోనూ ఇలాంటి సీన్లేనట. అసలు షాడో పుస్తకాలు చదివితే ఎన్ని దేశాల రాజధానుల పేర్లు తెలుస్తాయ్? అసలు సీ ఐ బీ (ఇది సీబీఐ కాదు. కాదని కుంచెం తెలిసినా వొప్పుకోకూడదని, రెండూ ఒకటే అని ఎప్పుడో డిసైడు అయిపోయినాం) ఎలా పని చేస్తోందో ఇంతకంటే బాగ ఎవరు చెప్తారు? అమర్ చిత్రకథల్లో చెప్పే రామాయణాలు, భారతాలు అప్పటికే ఎన్ని హరికథల్లో, పురాణ కాలక్షేపాల్లో విన్లేదు? ’చిచ్చీ ఈ పెద్దాళ్ళున్నారే’ అనే డయలాగ్ అప్పట్లో లేదు కానీ ఉంటే అదే అనుకొని ఉండేటోల్లం. ఎవరు అడ్డొచ్చినా షాడోని నీడలాగ అనుసరిస్తామని ఫ్రెండ్సు ప్రతిజ్ఞ చేసుకున్నాం!!!

ఇలా రకరకాల కథలు.

చదవడం లో మొదట చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, ఆ తర్వాత కొంచెం తక్కువ స్టాండర్డువైన బాలభారతి, బాలమిత్ర, బుజ్జాయి, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి లేదా ప్రభలో అక్కడక్కడా కొన్ని ఫీచర్సు (సినబ్బ కతలు, మిట్టురోడి కతలు, నండూరి విశ్వదర్శనం, టీ కప్పులో తుఫాను, కథాకళి, ఫిడేలు రాగాలు వగైరా), ఆ తర్వాత సీరియల్సు, ఆ తర్వాత యండమూరి, మల్లాది, చందు సోంబాబు, యర్రంశెట్టి సాయి వగైరా వగైరా....

ఈ తర్వాత లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినాయన షాడో గారు. మిరపకాయల పొట్లం తాలూకు పేపర్లోనూ ఏదైనా ఇంటరెస్టింగా ఉందేమో అని చదివే రోజులు. అమ్మా నాన్నా యేమో ’హిందూ’ పేపర్ చదవరా, మంగళవారం నాపొద్దు అదేదో ’నో యువర్ ఇంగిలీసు’ అని వస్తుందంట, అని టార్చర్ పెడుతూంటే, హిందూ చదివితే ఇంగిలీసొస్తుంది కానీ న్యూసు తెలీదని, న్యూసు పేపర్ న్యూసు కోసముండాల గానీ, ఇంగిలీసు కోసం గాదని తిరుగుబాటు ప్రకటించేసిన రోజులు. అప్పుడు పరిచయమైన షాడో....

షాడో స్పై అడ్వెంచర్ అని షాడో స్పై థ్రిల్లర్ అని రెండు కేటగిరీలు. ఇందులో మొదటిదే చాలామందికి ఇష్టమని నా గెస్సింగు. మొదటి దాంట్లో గంగారాం, రెండవ కేటగిరీలో ముకేషు, శ్రీకరూ, బిందూ, కులకర్ణి గారు ముఖ్యమైన వాళ్ళు. మొదటి రకం పుస్తకాల్లో షాడో ఊర్లోకి ఎంటరవుతూనే సేట్ మంఘారాం ఇంట్లో దొంగతనం చేసి, దస్తావేజులు గాల్లోకి విరజిమ్ముతాడు. ఇదంతా చెప్పడు. కేరక్టర్ల ద్వారా చెప్పిస్తాడు. ఒక పోలీసాయన షాడో కోసం తిరుగుతా ఉంటాడు. ఒక దీనమైన పాత్ర షాడో కోసం ఎదురుచూస్తూ ఉంటది. ఇట్లా కథ సాగిపోతుంది.

రెండవరకంలోనైతే షాడో ఏదో దేశంలో అడుగుపెడతాడు. దిగగానే ఫైటు. అతణ్ణి కలుసుకోవాలనుకున్న సీక్రెట్ ఏజెంట్ చచ్చిపోతాడు. ఆ మధ్యలో అక్కడికెందుకొచ్చాడో చెప్పే మినీ ఫ్లాష్ బాకు. ఆ తర్వాత చివరి వరకూ ఉత్కంఠ! ఈ షాడో ఎక్కడికిపోయినా ఒకటే భాష ఎట్లా మాట్లాడుతాడని, అతనికి వయసు మీదపడదా అని, అతను చచ్చిపోడా అని డవుట్లు వస్తే వాడికి షాడో మార్కు వంద సైడ్ కిక్ లు ఫ్రీ.

షాడో ని చూసి ’బుల్లెట్’ అని ఒక రచయిత మొదలెట్టాడు. సేం కాన్సెప్టు. అయితే అంత క్లిక్ అయినట్లు లేదు.

అప్పట్లో ఈ షాడో పుస్తకాలు ఎందరికో జీవన భృతిగా మారాయ్. ఎంతో మంది విద్యార్థులకు పరీక్షలంటే ఏదో ప్రాణసమస్య అనే ఫీలింగు కలుగనీకుండా కాపాడినయ్. ఎందరో భర్తారావులకు భార్యలతో పోట్లాడే ఛాన్స్ యీకుండా టైమ్ సేవ్ చేసి రక్షించాయ్. నాలాంటి వాళ్ళకు ఎందరికో ’చదవడం’ ఏమిటో నేర్పించినయ్. నిజంగా షాడో వచ్చినా అలాంటి పనులు చెయ్యలేడేమో గానీ ఆ ’మధుబాబు’ అనే ఆయన చేశాడు.

చాలా రోజులు మధుబాబు గారంటే షాడో లాగా ఎదురైన విలన్లను సింహనాదం చేసి, రెండుకాళ్ళతో ఎదుటి వాని గుండెపై ’ఫెడీ’ మని తన్నగలిగే శక్తిమంతుడిలాగా, నూనూగు మీసాల యువకునిలా, కుంగ్ ఫూ లో నిష్ణాతునిలా, కంటికి కనిపించనంత వేగంగా కదిలే వ్యక్తిలా ఊహించుకున్నాం. ఆయన కనీసం ’కులకర్ణి’ లా కూడా ఉండరని స్వాతి వారపత్రికలో అప్పుడెప్పుడో ఫుటో వచ్చినప్పుడు తెలిసింది. కళ్ళద్దాలు పెట్టుకుని సాదాసీదాగా ఉన్నారాయన.

కావ్యాలని, విమర్శలని, ఉత్తమ కథలని, సాహిత్యమని,చర్చలని మరోటని, మనలో చిన్నపిల్లవానికి రంగులు కొట్టి భేషజంతో పులివేషకాలాడుతున్న రోజుల్లోకి వచ్చి పడినాం. ఇప్పుడు షాడో అంటే నవ్వులాట. ఈ నవ్వులాట వెనుక ఎంత స్వచ్ఛమైన నవ్వులుండేవో! ఆ నాటి మా ఊహల పూలతోటల తోటమాలి మధుబాబు గారికి కుంగ్ ఫూ స్టైల్లో ఒక నమస్కారం.

* షాడో పుస్తకాలు కినిగె లో లభ్యం.