Showing posts with label సంస్కృతం. Show all posts
Showing posts with label సంస్కృతం. Show all posts

Wednesday, March 20, 2013

వ్యక్తివివేకం

భ్రమ ధార్మిక! విస్రబ్ధః స శునకోऽద్య మారితస్తేన |
గోదానదీకుచ్ఛకుడంగవాసినా దృప్తసింహేన ||

------------------------------

గాథాసప్తశతి లో ఉన్నట్లు చెప్పబడుతున్న శ్లోకం అది. (ఆ శ్లోకం అందులో ప్రక్షిప్తమని కొందరు) ఆ శ్లోకం గురించి నిదానంగా చెప్పుకుందాం. అది ’ధ్వని’ కి ఒకానొక ఉదాహరణ.

ఒక మాటను సూటిగా - అంటే వాచ్యంగా కాక వ్యంగ్యంగా చెప్పటం ధ్వని అని ఒక సిద్ధాంతం. ఇలా చెప్పడమే ’గొప్ప’ అని, ఉపమా, ఉత్ప్రేక్ష్య ఇత్యాది అలంకారాలు కావ్యానికి శరీరం అయితే ’ధ్వని’ అనేది కావ్యం తాలూకు ఆత్మ అని, రామాయణాది కావ్యాలలో ఉన్నది ధ్వని యేనని, అందుకే అవి ఉత్తమ కావ్యాల కోవకు చెందుతాయని ఆ సిద్ధాంతం చెబుతుంది. దీని కర్త ఆనందవర్ధనుడు. ఈయనది 9 వ శతాబ్దం. అంతకు ముందు కావ్యం తాలూకు ఆత్మ రీతి అని, అలంకారాదులని, అదని ఇదని తెగ కొట్టేసుకుని, ఈ ’ధ్వని’ కాన్సెప్టు వచ్చిన తర్వాత అందరూ సైలెంటయిపోయేరు.

ఈ ధ్వని కాన్సెప్టుకు మన మనుచరిత్రలో వరూధిని మంచి ఉదాహరణ.

పాటున కింతులోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె!

- ’ఇచ్చోట’ భవన్నఖాంకురము సోకె - అని ఆమె చెప్పటం ఒక ధ్వని. (ఈ పద్యం మొత్తం సారాంశం తీసుకుంటే ధ్వని కాదనుకోండి. అందుకే ఇక్కడే ఆపాం.)

’ఒరే, నన్ను ఇలా తోసేశావే, నీవు తోసేప్పుడు నీ గోరు ఇదుగో ఇక్కడ, ఇక్కడ గుచ్చుకుంది చూడు’ అని వరూధిని ప్రవరాఖ్యునికి చూపిస్తుందన్నమాట. (ఎక్కడ అని అడిగిన వాళ్ళు బెంచీ మీద నిలబడండి.) - అంటే పైకి చెప్పే అర్థం - (విధేయార్థం అంటారు దీన్ని) ఒకటి. చెప్పదల్చుకున్న ఒరిజినల్ అర్థం (ప్రతీయమానార్థం అని దీని పేరు) మరొకటి.

సాఫ్టు వేరు వాళ్ళకు అప్రైసల్ టైం లో వాళ్ళ మానేజరు ఈ ధ్వని పద్ధతిలోనే మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళకు వీజీగా అర్థం అవచ్చు. ఇంకా నిత్యజీవితంలో ఎన్నో చోట్ల ధ్వని కనిపిస్తుంది. ఇది వరకటి రోజుల్లో భార్యలు కూడా భర్తలతో ముఖ్యంగా జీతాలొచ్చే సమయంలో ’ధ్వని’ పద్ధతిలో మాట్లాడేవాళ్ళట. ఆ ’ధ్వని’ కి భర్త స్పందించకపోతే ధ్వని పద్ధతిని వదిలేసి ఏకంగా ధ్వనితోనే మాట్లాడేవాళ్ళట. ఇది నిన్నటి తరం భార్యల సంగతి. నేటి భార్యల సంగతి -  ప్రస్తుతానికి - అప్రస్తుతం. :)

ఇలా ఈ ధ్వని సిద్ధాంతం - కావ్యంలో కవి భావనలను ఎలా చెప్పాలో చెప్పి తిరుగులేని బావుటా ఎగరేసింది. కావ్యం అంటే మరేమీ లేదా? ఇలా చెప్పదల్చిన దాన్ని చెప్పకుండా చెప్పటమేనా అని కొన్ని ’ముక్కుసూటిగా’ ఆలోచించే హృదయాలు గాయపడి బాధపడినయ్. ఆ గాయపడిన లిస్టులో ఒకానొక తిరుగుబాటుదారుడు - మహిమభట్టు.

ఈ మహిమభట్టు ధ్వని సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఒక పుస్తకం వ్రాసినాడు. ’ఖండిస్తూ’ అని కాస్త సభ్యభాషలో చెబుతున్నాను కానీ, నిజంగా వ్యవహారం వేరేలా ఉంటది. అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళే రేంజులో ఈయన ధ్వని సిద్ధాంతాన్ని కుళ్ళబొడుస్తూ వెళతాడు.

ధ్వని సిద్ధాంతాన్ని నిర్వచిస్తూ ఆనందవర్ధనుడు చెప్పే శ్లోకం ఇది.

యత్రార్థః శబ్దో వా తమర్థమ్ ఉపసర్జనీకృతస్వార్థౌ |
వ్యఙ్క్తః కావ్యవిశేషః సః ధ్వనిరితి సూరిభిః కథితః ||

తాత్పర్యము: ఎక్కడ (ఏ కావ్యంలోనైతే) అర్థం కానీ, శబ్దం కానీ తనను అప్రధానంగా చేసుకుని ప్రతీయమానార్థాన్ని వ్యక్తీకరిస్తుందో అది విశేషమైన కావ్యం అని పండితులచేత చెప్పబడింది.

ఈ Definition శ్లోకంలోనే మహిమభట్టు పది తప్పులు చూపెట్టాడు. ఆ తర్వాత ఇక వీరంగమే. అదంతా గొప్ప శాస్త్ర చర్చ.

మహిమభట్టు పుస్తకం పేరు వ్యక్తివివేకం. ఇక్కడ వ్యక్తి - ’అభివ్యక్తి’, ’వ్యక్తీకరణ’ - వీటిల్లో ఉన్న వ్యక్తి. Expression అన్నట్లు. ఈ ’వ్యక్తి’ తాలూకు పూర్వాపర జ్ఞానాన్ని చెప్పటమే ఈ ఈ పుస్తకం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. ఈయన ప్రధానంగా చెప్పేదేమంటే - పొగ లేకుండా నిప్పు లేదు. ధూమవత్ అగ్నిః. ఎంతటి అవివేకి కూడా వాచ్యార్థాన్ని మాత్రమే పట్టించుకోడు. అనుమానప్రమాణంతోటి ఎదుటివాడు ఏం చెబుతున్నాడోనని కనీసం ఆలోచిస్తాడు. ఇందాక వరూధిని ’ఇచ్చోట’ అనగానే ఓహో అలాగనా అని అమాయకంగా అడిగేవాడు అవివేకి. వివేకి అయితే వరూధిని ఏమి చెబుతున్నదని గ్రహిస్తాడు. ఎలా గ్రహిస్తాడు? అనుమానప్రమాణం తోటి. అంటే ధ్వని అని ఏదయితే అంటున్నారో అది అనుమానంలో అంతర్భాగమే తప్ప ’ధ్వని’ అని కొత్తగా ఏదీ లేదన్నమాటే కదా?

ఇది ఈయన లాజిక్.

ఈ మహిమభట్టుది, ఆ పెద్దాయన ఆనందవర్ధనునిది ఇద్దరిదీ కాశ్మీరదేశమే. ఇద్దరూ కాశ్మీరశైవులే. అయితే మహిమభట్టు నైయాయికుడు. (న్యాయ దర్శనాన్ని అనుసరించే వారిని నైయాయికులు అంటారు. వీళ్ళు ఒక టైపు నాస్తికులు. అంటే దేవుడు అనే quadratic expression ను - నమ్మకంతో కాక - అనుమానంతో సాధిస్తారన్నమాట). దానికి తోడు ఈ మహిమభట్టు కాస్త బౌద్ధాన్ని వంటబట్టించుకున్నట్టున్నాడు.

ఒక వస్తువును - ఇది ’ఫలానా’ అని బౌద్ధులు నిర్వచించరు. ఎందుకంటే ఫ - లా - నా అని పలికేలోపు ఆ వస్తువులో ఎంత సూక్ష్మపరిధిలోనైనా సరే మార్పు వచ్చేసుంటుంది. వీడు ’రాముడు’ - అనే లోపలే సదరు రా-ము-డు గారికి మూడు క్షణాల ఆయుష్షు పెరిగింది. అతని తలలో వెంట్రుక ఒక మైక్రాను పరిమాణంలో నెరిసి ఉంటుంది. అంటే ఇందాకటి, మూడు క్షణాల క్రిందటి రాముడు, ఇప్పటి రాముడు వేరు. ఇవతల చూసేవాడిలోనూ మార్పొచ్చీసింది. బయట ప్రపంచంలోనూ మార్పొచ్చేసింది. ఒక క్షణంలో గోదావరిలో కొన్ని గేలన్ల నీరు సముద్రం చేరేసింది. రాముడు లేడు. రాముడిలో 'మార్పు' మాత్రమే ఉన్నాది. అంటే ’మార్పు’ మాత్రమే real. మరేదీ కాదు. మరి - ఇందాకటి రాముణ్ణి రాముడు ++ లాంటిదేదో అనాలికానీ రాముణ్ణి - రాముడు అనే అనడం తప్పు కదూ? - ఇది బౌద్ధుల - దిమ్మ తిరిగింపజేసే లాజిక్.

మహిమభట్టు లో ఆ ఛాయలు గోచరిస్తాయి. శబ్దానికి అభిధ, లక్షణ, వ్యంజన అని మూడు రకాల స్వరూపాల అర్థాలున్నయని మనవాళ్ళు పాపం ఏదో కాస్త సమాధానపడ్దారు. ఈ మహిమభట్టు ప్రకారం శబ్దానికి ’అభిధ’ మాత్రమే ఉంటుంది. అని అడ్డం తిరుక్కుని వాదిస్తాడు. ఇదీ చాలా గొప్ప వాదన.

ఇలా ఈయన ధ్వని సిద్ధాంతాన్ని మూలమట్టంగా విమర్శిస్తూ పోతాడు. ఇదంతా చాలా గొప్పగా ఉంటుంది, చాలావరకూ అర్థం కాదు కూడా. పన్లోపనిగా ఈయన కుంతకుడనే మరొక అలంకారికుణ్ణి (అతని సిద్ధాంతం వక్రోక్తి - అంటే చమత్కారంగా చెప్పుట) తన్ని తగలేస్తాడు.

------------------------------

ఈ బేక్ గ్రవుండ్ తోటి మొదట స్టార్టింగులో చెప్పిన శ్లోకం, దాని అర్థం, దాని కథాకమామీషు చెప్పుకుందాం. ఇది మహిమభట్టు లాజిక్ లా ఉండదు, భయపడకండి. నిజానికి లడ్డూ లాంటి శ్లోకం ఇది.

భ్రమ ధార్మిక! విస్రబ్ధః స శునకోऽద్య మారితస్తేన |
గోదానదీకుచ్ఛకుడంగవాసినా దృప్తసింహేన ||

ఈ శ్లోకానికి ఒక బేక్ గ్రవుండు ఉంది. ఇదీ -

మాంచి పరువంలో ఉన్న నాయిక తన ప్రియునితోటి గోదారి గట్టుకాడ ఒక తోటలో అంతకు ముందే అనుకున్న సంకేతస్థలంలో కలుసుకుందామనుకుంది. అక్కడకెళ్ళి చూస్తే ఒక బాపనాయన (ధార్మికుడు) ’పూజలు చేయా పూలు కోస్తాను’ అని పాడుకుంటూ పూలు తెంపుకోడానికి వచ్చినాడు. వేళకాని వేళలో అతనలా దాపురించడానికి ఒక కారణం ఉంది. అతనికి కుక్కలంటే అలర్జీ. ఆ చుట్టుపక్కల ఓ కుక్క ఉన్నది. ఆ కుక్క ఇప్పుడు ఇతను వచ్చిన టైములో డ్యూటీకెళ్ళింది కాబట్టి రాదు. అది కనిపెట్టి మనవాడు పూలు తెంపుకోడానికి వచ్చాడు. ఈమె అతణ్ణి చూసింది. "అబ్బా! శనిగాడు!" అనుకుంది. అతనితో ఈ శ్లోకం చెప్పింది.

ఓ ధార్మికుడా! ఇక నువ్వు స్వేచ్ఛగా (ఈ ప్రాంతాలలో) తిరుగాడు! ఆ పాడు కుక్క ఉందే, దాన్ని ఈ దగ్గర్లో నదిపక్కన పొదల్లో నివాసముండే సింహం చంపేసిందిలే. ఆ కుక్కకు భయపడే పని లేదింక!

ఇదీ ఆమె పైకి చెప్పిన అర్థం.

దీనికి ’ధ్వని’ కారుడు చెప్పిన ప్రతీయమానార్థం ఇది - ’ఓ ధార్మికుడా! ఇక్కడకు రాబాకు. ఇక్కడ సింహం ఉన్నాది. అది కుక్కను చంపేసింది, నిన్నూ చంపేస్తూంది. వెళ్ళిపో’ (నీవు దయ చేస్తే నేనూ నా ప్రియుడూ కలిసి ఏదో తృతీయపురుషార్థసాధన చేసుకుంటాము)

------------------------------

దీనికి మహిమభట్టు అబ్జెక్షన్లు చాలా లేవదీశాడు. అన్నిటికన్నా పక్కాగా ఉన్నది, నాకు బాగా నచ్చినదీ అయిన అబ్జెక్షన్ ఇది.

- సింహం కుక్కను చంపేసింది, ఇక నువ్వు కుక్కకు భయపడకుండా ’తిరుగు’ అనగానే ఆ బ్రాహ్మణుడు తెలివైన వాడైతే ఇలా ఆలోచిస్తాడు.

- తిరుగు అని అంటా ఉంది. అదీ వినమ్రతతో అంటా ఉంది. కానీ సింహం ఉంది అని భయపెడతా ఉంది. సింహం కుక్కకంటే బలమైనది. సింహమే వచ్చి ఉంటే సింహం వస్తుంది పారిపో అని చెప్పకుండా - అలా అలవోకగా, సావకాశంగా, ఆమె కూడా సింహమొస్తుందన్న టెన్షన్ పడకుండా - నన్ను పారిపొమ్మని చెప్పకుండా - ఇక్కడ నీకు వచ్చిన అడ్డంకీ యేమీ లేదులే, హాయిగా పూలు కోసుకో అని అసంబద్ధంగా ఎందుకు చెబుతా ఉంది?

అంటే ఈమె చెబుతున్నది నిజం కాదు.

ఇలా బ్రాహ్మణుడు సహజంగానే ఆలోచిస్తాడు. ఎందుకంటే అతను వివేకి కాబట్టి, లేదా కనీసం ఆ అమ్మాయికున్న తెలివితేటలు అతనికి ఉంటాయి కనుక.

అలా బ్రాహ్మణుడు ఆలోచిస్తాడన్న సెన్సు ఆమెకు ఉంటే అలా చెప్పదు. అంటే - ఈ పద్యం అనౌచిత్యమూ, ధ్వని సిద్ధాంతానికి విపరీతంగానూ ఉన్నది. అంచేత ధ్వని సిద్ధాంతం తప్పు.

ఇంకా ఆలోచిస్తే ఎంత సింహమైనా తన స్టేటస్ కు తగిన జంతువులను చంపి తింటుంది కానీ, కుక్క వెంటబడి చంపదు. అది లోకవ్యవహారానికి భిన్నంగా ఉంది. ఇది అనౌచిత్యం. మరి ఆ ధ్వని కారుడు మేనర్సు లేకుండా తప్పుడర్థాలెందుకు చెబుతా ఉన్నాడు?

------------------------------

ఏతావతా ధ్వని అనేదే లేదు.

ఇలా ధ్వనికారుడు చెప్పే ఒక్కో ఉదాహరణనూ ఈ మహిమభట్టు తాట వలిచేస్తూ, వెళతాడు. ఈతని వాదనలన్నీ చాలా గొప్ప లాజిక్ తోటి ఉంటాయి. ఇందాక అన్నట్లు అర్థం కావు కానీ, ధ్వన్యాలోకాన్ని, ఈ వ్యక్తివివేకాన్నీ పక్కపక్కన పెట్టి చదువుకుంటూ పోతే అర్థమయినంత మేరా భలే ఎంటర్ టయిన్ మెంటు. అలాగని ఈ మహిమభట్టుగారు ఏదో కోపంతోనో, ఈసడిస్తున్నట్టో, ఆనందవర్ధనుణ్ణి తిడుతున్నట్టో ఉండదు. గ్రంథం మొదట్లో ఆనందవర్ధనుణ్ణి మనసారా అభినందించి, గొప్పవాళ్ళను విమర్శించడం కూడా యశస్సుకు దోహదమని చెప్పుకుంటాడు.

వాదనలు రాజవాదమని, పండితవాదమని రెండురకాలట. రాజవాదమంటే - వాదించే వ్యక్తి పూర్తీగా తనంతట తానే అన్ని విషయాలనూ కూలంకషంగా తను నమ్మిన/ఆచరించే/ఆదర్శంగా పెట్టుకున్న సిద్ధాంతాలకనుగుణంగా విమర్శ చేయటం. పండితవాదమంటే - ఇద్దరూ కలిసి విషయాన్ని అటూ ఇటూ పొర్లించి చూడటం. పండితవాదానికి మిళిందపన్హ అనే బౌద్ధగ్రంథం గొప్ప ఉదాహరణ అయితే, రాజవాదానికి వ్యక్తివివేకం గొప్ప ఉదాహరణ

Friday, September 3, 2010

వర్ణాల నుండి ధ్వని దిశగా..

(క్రితం టపా తరువాయి)

వర్ణాలు ముఖావయవాలల్లో పుడతాయనిన్నీ, వాటిని పుట్టించడానికి - ప్రయత్నం అవసరమనిన్నీ, స్థానమూ ప్రయత్నమూ రెండూ ఒకేలా ఉంటే సవర్ణాలనిన్నీ అర్థం చేసుకున్నాం.

అభ్యంతర ప్రయత్నం గురించి మరో సారి చెప్పుకుని, సందులనుండి రహదారికొద్దాం.

ఉదాహరణకు "త" వర్గం తీసుకుందాం. త వర్గం అంటే త,థ,ద,ధ మరియు న - వీటికన్నిటికీకి స్థానం దంతము. నాలుక కొస దంతాల వెనుక భాగాన్ని స్పృశించడమనే అభ్యంతర ప్రయత్నం ద్వారా ఈ వర్ణాలను పుట్టించవచ్చు.ఇవి సవర్ణాలు.

ఇప్పుడో అనాలజీ.

ఓ తబలా ఉందనుకుందాం. ఆ తబలా మధ్య స్థానంలో (వృత్తం గీసి ఉన్నచోట), ఒకే బలం (ప్రయత్నం) తో ఎన్ని సార్లు కొట్టినా ఒకే ధ్వని వినిపిస్తుంది.

సైకిలు బెల్లును ఎన్ని సార్లు మోగించినా ఒకేరకంగానే మోగుతుంది.

నాలుక కొసతో దంతాల వెనుక భాగాన్ని స్పృష్టము అనే అభ్యంతర ప్రయత్నంతో ప్రేరేపించినపుడు ఒకే ధ్వని రావాలి కానీ "త", "థ", "ద", "ధ", "న" అన్న ఐదు భిన్న ధ్వనులెలా వస్తున్నాయి? ఈ ఐదింటికీ స్థానం, అభ్యంతర ప్రయత్నం ఒకటే అయితే, భిన్నంగా ఎందుకు ధ్వనిస్తున్నాయి?

దీనికి కారణం మొదట సైకిలు బెల్లు అనాలజీతోనే సాధిద్దాం. బెల్లు కొట్టేప్పుడు మరోచేతితో బెల్లు పట్టుకున్నారనుకోండి, అప్పుడు "ట్రింగ్", "ట్రింగ్" బదులు "ట్రిక్", "ట్రిక్" మంటుంది కదా. అలాగే బెల్లుపై ఓ పల్చటి తడిగుడ్డ కట్టినప్పుడు, లేదా బాగా ఎదురుగాలి వీస్తున్నప్పుడు, తబలా లోపల గాలి బదులు నీళ్ళతో నింపినపుడు.....ఇలా రకరకాల బాహ్య కారణాల వల్ల ధ్వని భేదం కలుగుతుంది.

ఇక్కడ వర్ణాల పుట్టుకలో ధ్వని భేదానికి కూడా అదే కారణం. దానిని బాహ్యప్రయత్నం అన్నారు పాణిని మహర్షి. (అయితే వర్ణాల విషయంలో తేడా కాస్త సూక్ష్మంగా ఉంటుంది, తబలా ఉదాహరణలోలా కాకుండా)

బాహ్యప్రయత్నం అచ్చులకు  3 రకాలు, వ్యంజనాలకు 8 రకాలని (4 జంటలు) సూత్రీకరించారు. అచ్చులని కాసేపు పక్కనెట్టి, హల్లుల బాహ్యప్రయత్నాలను చూద్దాం.

నివారము (బాహ్య అవయవం తెరుచుకొనుట) - సంవారము (మూసుకొనుట)
శ్వాసము - నాదము
అఘోషము - ఘోషము (గంభీరతను బట్టి)
అల్పప్రాణము - మహాప్రాణము (ప్రాణవాయువు వినిమయం బట్టి)

ఈ నాలుగు జంటల్లో ఒక్కో జంటనుండి ఒక్కో అంశము - అనగా ఓ వర్ణానికి నాలుగు బాహ్యప్రయత్నాలు ఉంటాయి. అంటే

"త" కు నివారము, శ్వాసము, అఘోషము, అల్పప్రాణము - అన్న నాలుగు బాహ్యప్రయత్నాలు, స్పృష్టము అనే అభ్యంతర ప్రయత్నము, దంతము అనే స్థానం వద్ద జరుగడం వల్ల సదరు వర్ణం అలా ధ్వనిస్తోంది.

ఇంకా వివరంగా చెప్పాలంటే -

దంతము వెనుక నాలుక కొస తాకుట వల్లనూ, మరియూ, ఆ తాకు సమయమున ముఖభాగము విడివడి యుండుటయు, శ్వాసమును అధికముగ ప్రయోగించుటచే, గంభీరధ్వని వెలువడకుండుటయు, ప్రాణవాయువు వినిమయము తక్కువగ జరుగుటయు అను చర్యలు ఒకేకాలమున సంభవించుట వలన "త" వర్ణము పుట్టి అవ్విధమున ధ్వనించుచున్నది.

త వర్గంలో మిగిలిన వర్ణాలకు చూద్దామా?

"థ" - సంవారము, నాదము, ఘోషము, మహాప్రాణము
"ద" - సం, నా, ఘో, అ.ప్రా.
"ధ" - సం, నా, ఘో, మ.ప్రా,
"న" - సం, నా, ఘో, అ.ప్రా..

ఇదండీ వర్ణాల నుండి ధ్వని వైపుకి వెళ్ళే దిశ.

బాహ్యప్రయత్నం తెలుసుకోవడం ఎందుకంటే, వీటి ద్వారా, కొన్ని సంధులకు సూత్రాలు ప్రతిపాదిస్తున్నారు పాణిని. (వాటిని వివరించేంత సీను నాకు లేదు.)

చివరగా అచ్చులకు సంబంధించిన బాహ్య ప్రయత్నాల పేర్లు తెలుసుకుందాం. అవి - ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. - వీటిని గురుముఖతః నేర్వాలి. వేరే మార్గం లేదు.

వేల సంవత్సరాలకు పూర్వం - ఇంత శాస్త్రీయమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడి, వాటి మూలకంగా భాషాశాస్త్రం బ్రహ్మాండమైన రీతిలో అభివృద్ధి చెందటం అనేది ప్రపంచభాషలలో సంస్కృతభాషలో మాత్రమే జరిగి ఉంటుంది.

అందుకేగా అన్నారు, "జనని సంస్కృతంబు సకలభాషలకును" అని.

(ఈ టపా చదివిన తర్వాత ఆసక్తి కలిగితే పొద్దులో వ్యాసం రెండవభాగం కూడా చదవగలరు.)

Disclaimer: ఈ టపా  ఉద్దేశ్యం ఆసక్తి కలిగించటం, నాకు తెలిసిన పరిధిలో విషయాలను పంచుకోవడం మాత్రమే. ఈ విషయాలపై పూర్తిస్థాయి అవగాహన నాకూ లేదు. ఇంకా ఎక్కువ వివరాలకు లఘుసిద్ధాంతకౌముది చూడగలరు.

Tuesday, August 31, 2010

సవర్ణదీర్ఘ సంధి for dummies!

తెలుగులో మౌలికాంశం ఒకటి తెలీకండానే ఇన్నిరోజులు బతికేశానని నిన్న తెలిసింది. అదీ సంస్కృత వ్యాకరణం చదువుతుంటే. ఈ కథాకమామీషు ఇది.

చిన్నప్పుడెపుడో తెలుగు టీచరమ్మ సవర్ణదీర్ఘసంధి చెబితే ఊకొట్టాం, ఆ సూత్రం నిర్వచనం ఇలా ఉంటుంది.

అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును. (ఈ సూత్రం వికీపీడియాలో కొట్టుకురాబడినది)

బానే ఉంది, సవర్ణాలంటే? దీనివెనుక ఓ పెద్ద కథ. ఆ కథ కోసం సంస్కృతానికెళ్ళాలి.

**********************************************************************************

సూత్రము: తుల్యాస్య ప్రయత్నం సవర్ణమ్. (౧-౧-౯)

స్థానము, (అభ్యంతర) ప్రయత్నము ఈ రెండునూ ఏ వర్ణమునకు మరే వర్ణముతో తుల్యముగా నుండునో అవి రెండును ఒకదానికొకటి సవర్ణములనబడును.

స్థానము: అర్థమును చెప్పాలన్న బుద్ధి మనస్సును చేరుతుంది. ఆ మనస్సు శరీరంలో అగ్నిని (energy) ని ప్రజ్వలింపజేస్తుంది. ఆ అగ్ని వాయువును ప్రేరేపిస్తే, ఆ వాయువు తగిన ముఖావయవానికి తాకడంతో ధ్వని ఉత్పన్నమవుతుంది. ఏయే స్థానంలో వాయువు తాకితే ఏ శబ్దం వస్తుందో ఈ లంకెలో వివరంగా చెప్పారు.

ప్రయత్నం: కేవలం ఆకాంక్ష ఉంటే సరిపోదుగా, ప్రయత్నం కూడా కావాలి. అంటే "ప" అనే అక్షరం పలుకాలంటే రెండు పెదవులు కలువడం, విడివడడం అన్న క్రియాజాతము జరుగాలి. దాన్నే యత్నము అంటారు. అధికమైన యత్నం - ప్రయత్నం. ఇవి రెండు రకాలు. అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నం ప్రసక్తి సవర్ణనిర్ణయంలో లేదు.

అభ్యంతర ప్రయత్నం, స్పృష్టము (పూర్తిగా స్పర్శించుట),ఈషత్ స్పృష్టము (కొంచెము స్పర్శించుట),వివృతము (విడివడుట), ఈషద్వివృతము (కొంచెము విడివడుట), సంవృతము అని ఐదు రకాలు.

స్థానము, ప్రయత్నము రెండూ కలిసిన వర్ణాలే సవర్ణాలు. స్థానమొక్కటీ, లేదా ప్రయత్నమొక్కటీ కలిస్తే లాభం లేదు. ఉదా: "ప", "ఫ" సవర్ణాలు.

**********************************************************************************

ఇప్పుడు మళ్ళీ సంధికొద్దాం.

అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగుచో - అంటున్నాడు. మనం "అ" ఒక్కటి తీసుకుని సూత్రం ప్రతిక్షేపిద్దాం. "అ" కు సవర్ణాలు వెతకాలి.

"అ" కు సవర్ణం అంటే,
౧. "అ" అనే ధ్వని ఎక్కడ పుడుతుందో, అక్కడే సదరు సవర్ణమూ పుట్టి ఉండాలి.
౨. ఆ ధ్వని పుట్టడానికి జరిగిన ప్రయత్నం సవర్ణానికి కూడా వర్తించాలి.

"అ" అనే ధ్వని కంఠంలో పుడుతుంది. (అకుహ విసర్జనీయానాం కణ్ఠః)

ఇంకా కంఠంలో పుట్టేవి, "అ","ఆ", "హ", "హా", మరియు "క" . వీటిని రెండవ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం.
(అంత అవసరం లేదు నిజానికి. ఎందుకంటే, సవర్ణదీర్ఘసంధి అచ్చులకు మాత్రమే అని చెప్పబడియున్నది. కానీ కొంత సరదా కూడా తీర్చుకుందాం.)

ఈ క్రింది పట్టిక చూడుడి.
వర్ణము - అభ్యంతర ప్రయత్నము
అ - వివృతము
ఆ - వివృతము
హ - ఈషద్వివృతము
హా - ఈషద్వివృతము
క - స్పృష్టము

అంటే "హ" కు "అ", "ఆ" లకు అభ్యంతర ప్రయత్నం తేడా ఉంది కాబట్టి, సవర్ణం అనే పొత్తు కుదరదు. అంచేత "అ", కు "అ", "ఆ" మాత్రమే సవర్ణాలు.

ఉదా:
దైత్యారి = దైత్య+అరి
విశ్వాత్మ = విశ్వ + ఆత్మ
చంద్రాస్య = చంద్ర + ఆస్య

ఇలానే మిగిలిన అచ్చులకూ సవర్ణాలు తెలుసుకోవచ్చు.

ఏ ధ్వని ఏ స్థానంలో పుట్టిందో గుర్తుపెట్టుకోడానికో శ్లోకం పాణిని చెప్పారు.

అకుహ విసర్జనీయానాం కణ్ఠః
ఇచుయశానాం తాలుః
ఋటురషాణాం మూర్ధా
ఌతులసానాం దన్తాః
ఉపూప్ధ్మానీయా నామోష్టౌ
ఞ మ ఙ ణ నానాం నాసికాచ
ఏదైతో కణ్ఠతాలుః
ఓదౌతోః కణ్ఠోష్టం
వకారస్య దంతోష్టం
జిహ్వమూలీయస్య జిహ్వమూలమ్
నాసికా2నుస్వరస్య.


ఇక అభ్యంతర ప్రయత్నాలను చూద్దాం

అ, ఇ, ఉ, ఋ, ఌ, ౡ, ఏ, ఓ, ఐ, ఔ - వివృతము
క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము - స్పృష్టము
య,ర,ల,వ - ఈషత్పృష్టము
శ,ష,స,హ,ః,ం - ఈషద్వివృతము

ఈ సవర్ణ కథలో చివరి ట్విష్టు ఏమంటే - ఋ వర్గము, ఌ వర్గము ఒకదానికొకటి (అంటే "ఋ" కు "ఌ") పై సూత్రం ప్రకారం సవర్ణాలు కాకపోయినప్పటికీ, వీటికి ప్రత్యేక కోటా కింద "ఋ" ను "ఌ" కు సవర్ణంగా చేర్చారుట. ఋ, ఌ లను ప్రయోగించి, సవర్ణదీర్ఘసంధి చేసుకోవచ్చా అనేది తెలియకుండా ఉంది. అలాంటి ప్రయోగం ఎక్కడైనా ఉందేమో పెద్దలెవరైనా చెబితే బావుణ్ణు.

**********************************************************************************

Disclaimer: పైన చెప్పిన వివరాలు ఓ పుస్తకంలో నాకు అర్థమైన పరిధిలో తెలుసుకుని వ్రాసినవి. తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం.

కృతజ్ఞత - పాణిని లఘుకౌముది మార్గదర్శిని , ఆచార్య శలాక రఘునాథశర్మ.

Sunday, March 21, 2010

సంస్కృత సాహిత్యంలో పేరడీలు



సరస్వతి అమ్మవారు బంతి ఆడుతున్నారు. ఆ తల్లి బంతి ఆడుతున్న తీరు ముగ్గురు ఉద్దండులైన సంస్కృతకవులిలా వర్ణిస్తున్నారు(ట).

దండి:

ఏకో2పి త్రయ ఇవ భాతి కందుకో2యం కాన్తాయాః కరతలరాగరక్తరక్తః |
భూమౌ తచ్చరణనఖాంశుగౌరగౌరః స్వస్థః తన్నయనమరీచినీలనీలః ||

అయం కన్దుకః = ఆ బంతి (సరస్వతి చేత ఆడబడుతున్నయట్టిది)
కరతలరాగరక్తరక్తః = (ఆమె) కరతలము యొక్క శోణవర్ణం చేత శోణవర్ణం దాల్చినదై
భూమౌ = భూమి యందు (భూమి దిశగా వెళ్ళినప్పుడు)
తచ్చరణనఖాంశుగౌరగౌరః = (ఆమె) పాదం గోరు తాలూకు ధవళవర్ణం చేత ధవళ వర్ణం సంతరించుకున్నదై
స్వస్థః = పైకి ఎగసినపుడు
తన్నయనమరీచినీలనీలః = (ఆమె) కనులనబడే ఇంద్రనీలమణుల నీలము చేత నీలము కాబడి
ఏకః అపి = ఒకటి అయిననూ (ఒక్క బంతే)
త్రయ ఇవ = మూడు (బంతుల) వలే
భాతి = ప్రకాశించుచున్నది.

భవభూతి:

విదితం నము కన్దుక తే హృదయం దయితాధరసంగమలుబ్ధ ఇవ |
వనితాకరతామరసాభిహతః పతితఃపతితః పునరుత్పతసి ||

కన్దుక = ఓ బంతీ!
తే హృదయం = నీ హృదయము
దయితాధరసంగమలుబ్ధః ఇవ = వనితాధరచుంబన మోహిత అని
విదితం నము = తెలుసుకున్నానోయి.
(అందుకనే)
వనితాకరతామరసాభిహతః = పద్మముల వంటి వనిత కరముల చేత కొట్టబడి
పతితః పతితః (అపి) = మాటి మాటికి క్రిందపడుచున్ననూ
పునరుత్పతసి = తిరిగి ఎగురుచున్నావు!

కాళిదాసు:

పయోధరాకారధరో హి కన్దుకః కరేణ రోషాదభిహన్యతే ముహుః |
ఇతీవ నేత్రాకృతిభీతముత్పలం స్త్రియాః ప్రసాదాయ పపాత పాదయోః ||

(ఈ శ్లోకం నాకు ఖచ్చితంగా అర్థం కాలేదు. అయితే నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. భావం ముందుగా: సరస్వతి అమ్మవారు పయోధరాకారంలో ఉన్న బంతిని రోషంతో నేలకు కొడుతున్నారు. ఆ అదటుకు ఆమె తలలో తామర పువ్వు జారి ఆమె పాదాలపై బడి శరణు వేడింది. భయం ఎందుకంటే ఆమె పద్మనయనాలలో రోషం తనను కొడుతున్నట్టు ఉంది కాబట్టి.)

పయోధరాకారధరః హి కన్దుకః = చనుగుబ్బల ఆకారము దాల్చిన బంతి
కరేణ = చేతితో
ముహుః = మాటిమాటికీ
రోషాదభిహన్యతే = రోషంగా కొట్టబడుచున్నది.
నేత్రాకృతిభీతముత్పలం = ఆమె కనుల ఆకారంలో ఉన్న (ఆమె జడలోని) తామర
స్త్రియాః ప్రసాదాయ + ఆమె శరణు కొరకు
పాదయోః పపాత ఇవ = పాదద్వయమందు పడినది.

పైన వర్ణించబడ్ద శ్లోకాలు ఆయా కవులకు పేరడీలు. ఈ శ్లోకాలకు కర్త ఎవరో తెలియదు. (భోజప్రబంధం వ్రాసిన బల్లాలుడు అని ఊహ.)

చైత్రశుద్ధ పంచమి పర్వదినం సందర్భంగా, సరస్వతి అమ్మవారి దయకు ఎల్లరూ పాత్రులవుదురు గాక! శుభమ్.