చరిత్ర అంటే ఏమిటి?
ఊహాగానమా?
కొందరు పరిశోధకుల పొంతన లేని అభిప్రాయాలకు ఊతం ఇచ్చే సబ్జెక్టా?
కోర్టులోలా circumstantial evidence ఉంటే తప్ప పరిగణనలోకి తీసుకోజాలని ఓ వ్యాజ్యమా?
తమతమ అభిజాత్యాలకు ఆటపట్టుగా మార్చుకోవడానికి తేరగా దొరికిన ఓ అవకాశమా?
వ్యక్తి వ్యక్తికీ, కాలకాలానికి మారిపోతూ ఉండేదా?
ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. అందులో సొంత అభిప్రాయాలకు, అభిజాత్యాలకు తావు ఉండరాదు. అధ్యయనం వ్యక్తిగత పేరు ప్రతిష్టల సమరం కారాదు. అది జాతికి చేస్తున్న సహాయం కానేరదు.
విమర్శ అనే ప్రక్రియకర్థం తెగడటం కాదు, పరిశీలించటం, నిష్పాక్షికంగా ఆధారాలను సేకరించటం, ఆధారాలను బట్టి సమన్వయం సాధించటం విమర్శ. సమన్వయం కుదరని పక్షంలో ఊహాగానాలకు చోటివ్వక, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఉంచి, తరువాతి తరానికి ఆ విషయాలను పరిశీలించడానికి సహాయం కల్పించటం కూడా సద్విమర్శలో భాగమే. చరిత్ర అన్నది ఒక శాస్త్రం కాదు. శాస్త్రానికి అధారం విశ్లేషణ. కళకు ఆధారం సంశ్లేషణ. శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అంటే, కంటికి కనిపించే ప్రత్యక్ష ఋజువులకోసం పాకులాట అనేది సంకుచితమైన అర్థం.
చరిత్రాధ్యయనం ఒక కళ. ప్రాంతీయ సాహిత్యానికి, వారి దైనందిన జీవితంలో అంతర్భాగమైన అలవాట్లకు, వారి సంస్కృతి మూలాలకు, సాంప్రదాయ విషయాలకు సమన్వయం సాధించగలిగడం ఈ ప్రక్రియలో భాగం.ఇందులో పొఱబాట్లకు తావులేదు. సహానుభూతి అభిప్రాయాలకు పరిమితం కావాలి, ప్రమాణాలకు కాదు. అభిప్రాయాలకు అందరికీ అవకాశం ఉంది. అయితే అభిప్రాయం ప్రమాణం చేసే ప్రయత్నం నిర్ద్వంద్వంగా ఖండించదగింది. దురదృష్టవశాత్తూ, ఆంగ్లేయులచేత ఈ రోజు పాఠ్యాంశాలలో చేర్చబడి విద్యార్థులు చదువుతున్న భారతదేశ చరిత్ర చాలావరకు ఊహాజనితం. ఒక ఊహ నిజంగా మలచబడి, దానిపై మరొక కల్పన సృష్టింపబడి, మరిన్ని ఊహాగానాల అల్లిక,వాటికి ఋజువుల వెతుకులాట.. ఇలా చెల్లాచెదరై ఉంది.మనం చదువుకునే మన దేశచరిత్ర మొత్తం అస్తవ్యస్తం, అకటావికటం.
ఉదాహరణ: హిందువులు సాధారణంగా వాడే పంచాంగంలో ఉటంకింపబడే శాలివాహన శకం ప్రకారం ఈ యేడు 1932 వ వర్షం. యే శకమైనా ఎలా మొదలవుతుంది? ఓ మహాత్ముడితోనో, మహానుభావుడి పేరు మీదో, ఏదైనా గొప్ప సంఘటన వలనో మొదలవాలి. కలిశకం, యుధిష్టిర శకం, విక్రమ శకం, క్రీస్తు శకం ఇవన్నీ దానికి ఉదాహరణాలు. అలా శాలివాహన శకం క్రీ.శ. 78 నుండి మొదలయింది. వేల యేళ్ళుగా ఆనవాయితీగా, పంచాంగ రూపకర్తలు దీనిని ఉటంకిస్తూ వస్తున్నారు. శాలివాహన మహారాజు గురించి భారతీయ లౌకిక సాహిత్యంలో కథలున్నవి. ఎంతో ఎందుకు? ప్రాకృతభాషలో గాథాసప్తశతి - శాలివాహన సంకలితం ఉన్నది. కాగా, శాలివాహనుడనే రాజు లేనే లేడని, ఎక్కడినుండో వచ్చిన కుషాణ వంశపు కనిష్కుడనే రాజు పుట్టుక ఆధారంగా ఈ శకం మొదలయ్యిందని కొందరు ఆంగ్లపండితుల ఊహ. పురాణాలన్నీ పుక్కిటివయ్యాయి. ఊహాగానాలు నిజమయి కూర్చున్నాయి. ఊహ ’చరిత్ర’ గా మారింది. మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కింది. ఎవరో చేసిన ఊహాగానం చరిత్ర పేరిట మనం చదువుకుంటున్నాము. అగ్ని వంశపు రాజుల గురించి చెప్పిన మత్స్య, అగ్నిపురాణాది అనేక పురాణాలు, వేలయేళ్ళుగా వచ్చే సంప్రదాయం, లౌకిక సాహిత్యం, ప్రతీ రోజు చేసే సంధ్యావందనంలోనూ, హిందువనే ప్రతివాడు ఏదో ఒక సందర్భంలో పూజలో సంకల్పం చెప్పుకునే వరుసలో వచ్చే "శాలివాహకే..హరిహర గురుసన్నిధౌ, అస్మిన్ వర్తమానే..." వరుసా, ఇవన్నీ ప్రమాణాలుగా తోసివేయబడ్డాయి!
ఇక మహాభారతం విషయానికి వద్దాం.
కలియుగం ఫిబ్రవరి 20, 3102 B.C, 2-27'-30''గంటలకు,మొదలయ్యిందని ప్రపంచ వ్యాప్తంగా, ఇండాలజిస్టులు ఒప్పుకున్న విషయం. మహాభారతంలో స్త్రీపర్వం, అనుశాసనిక పర్వం,మహాప్రస్థానిక పర్వాది కొన్ని పర్వాలలో శ్రీకృష్ణుని మరణం, పరీక్షిత్తు జననం, కలియుగాగమనం ఒకేసారి జరుగుతాయని ఉటంకించబడి ఉన్నది. గాంధారి కృష్ణునికి శాపం ఇస్తూ, సరిగ్గా 36 యేళ్ళకు యాదవకులంలో ముసలంపుట్టి వంశనాశనం జరుగుతుందని చెబుతుంది.అంటే, భారతయుద్ధకాలం క్రీ.పూ. 3138. అంటే భారత కాలం అంతకుముందే కావాలి. దేవీభాగవతం, ఇంకా కొన్ని పురాణాలలోనూ ఒకేవిధమైన సమయం ఉటంకింపబడి మహాభారత కాలానికి సమన్వయం కుదురుతున్నది. కాగా, మహాభారత సమయం క్రీ.పూ. 1200 కు మించదని, ఎందువల్లనంటే iron age అప్పుడే మొదలయ్యిందని కొందరి ఊహ అయితే, జాకోబీ, వెబర్,మాక్డోవెల్ పండితుల ప్రకారం మహాభారతం క్రీ.పూ.మూడవ శతాబ్దానికి చెందినది. వీరి ఊహకు కల్పించిన ఆధారం అలెక్జాండరు దండయాత్ర క్రీ.పూ.మూడవ శతాబ్దంలో జరిగింది. భారతంలో ’యవన’ శబ్దం ఉంది కాబట్టి, భారతం ఆ సమయంలోనే జరిగిందన్న వాదన! మరి రామాయణంలోనూ ’యవన’ శబ్దం ఉంది కదా అంటే, అది ప్రక్షిప్తం అనేశారు. సరే, అలెక్జాండర్ కంటే ముందే డేరియస్ అనే గ్రీకు రాజు ఉత్తరభారతానికి వచ్చినట్టు ఓ చరిత్రకారుడు వ్రాశాడు కదా, క్రీ.పూ.ఏడవ శతాబ్దంలో శకటాయనుడు కూడా ఆ శబ్దం ఉపయోగించాడు కదా అన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. భారత కాలం స్పష్టంగా నిర్ణయించడానికి, ఋజువులు దొరకలేదని ఘోషణ! అంతర్గత ఋజువులు (internal evidences) దొరికినప్పుడు వాటిని వీలయినంత పక్కన పెట్టటం, లేదా వక్రీకరించటం జరిగింది.
శంకరాచార్యుల కాలం గురించి కూడా, ఆయనచేత స్థాపించబడ్డ పీఠాలలో దృష్టాంతాలు వెతక్కుండా, ఏదో తలాతోకా లేని శ్లోకం ద్వారా ఊహించి,దాన్నే ప్రమాణం చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నాలు జరిగాయి.చేశారు కూడాను. ఇప్పుడు జనశ్రుతి ప్రకారం, క్రీ.పూ. జన్మించిన శంకరుడు క్రీ.శ. పదకొండవ శతాబ్దపు వ్యక్తి!!
మహాభారత కాలం గురించి, బుద్ధుడి కాలం గురించి, ఇంకా అగ్నివంశపు రాజుల గురించి, జంబూద్వీపం అంటే ఏమిటి? భరతవర్షం, భరతఖండం, తెలుగువారెవ్వరు, ఆర్యులెవ్వరు తదితర విషయాలపై కీ.శే.కోట వెంకటాచలం గారు కొన్ని గ్రంథాలు వ్రాశారు. మహాభారతంలోని సమయ సంబంధిత శ్లోకాలను అర్థసహితం తెలుపటమే కాక, ప్రత్యక్ష జ్యోతిష్య ప్రమాణాలను, సప్తర్షిమండలం ఏ రాశిలో ఉన్నది వంటి అనేక విషయాలను కూలంకషంగా ఆయన చర్చించారు. ఇంకా ఆంగ్ల చారిత్రకులు గ్రీకు గ్రంథాలలో ఉటంకింపబడ్డ జాండ్రేమ్సు,శాండ్రొకొట్టసు,శాం డ్రోసిప్టసు ఎవరు? మౌర్యులకాలం ఎప్పటిది? వాటి ఆధారంగా నిర్ణయింపబడ్డ పొఱబాట్లను, ఆంగ్లచారిత్రకుల ఉటంకింపుల ద్వారనే ఆయన వెలికి తీసి ఋజువులు చూపించారు.
ఆర్య, ద్రవిడ సిద్ధాంతాలు వంటివి colonial consciousness కు ప్రతీకలుగా ఋజువులు దొరుకుతున్న ఈ రోజుల్లో ఓ సాధారణ పండితుడు వ్రాసిన గ్రంథాలు ఆయా ఋజువులకు దగ్గరగా ఉండటం పరిశీలించదగింది. ఇవి కొన్ని తెలుగులో ఉన్నవి. మహాభారతం, బుద్ధుడి కాలం గురించిన గ్రంథాలు ఆంగ్లంలోనూ DLI లో దొరుకుతున్నవి.భారతదేశ చరిత్ర మీద ఆసక్తి, ఇష్టం ఉన్నవారు తప్పక చదవవలసిన విషయాలివి.నిజమైన చరిత్ర బయటపడుతూ, అర్థం లేని సిద్ధాంతాలు ఊహాజనితమని ఋజువవుతున్న ఈ రోజుల్లో భారతదేశంలోని మారుమూల ఓ పండితుడు వ్రాసిన గ్రంథాలు నిజమైన చరిత్రకు దగ్గరగా ఉండటం గమనార్హం.
- అగ్నివంశపు రాజులు
- ఆంధ్రులెవరు?
- కలిశకవిజ్ఞానం
- Time of mahabhaarata
- Buddha's time
కోట వెంకటాచలం
- సంస్కృత సారస్వత చరిత్ర



