Showing posts with label Review. Show all posts
Showing posts with label Review. Show all posts

Sunday, August 25, 2013

The conjuring అను పిశాచప్రకరణము


భయము అనగానేమి? భయమనగా ఉద్వేగకారకచిత్తవికల్పము. కొందరికి నల్లి యన్న భయము. మరికొందరికి బల్లియన్న భయము. ఇంకొందరికి బొద్దింకను జూచిన యొడలు గంపించును. మా ఊరియందు నొకఁడు గలడు. వానికి నీరనిన భయము. మానవుల చిత్తములు బలు విధములు. ఒక కవి "బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను" అని నుడివెను.(ఈ రోజే బహుళపంచమి) వెన్నెలకు భయపడువాడు కవి యేనా? కావచ్చును, కాకపోవచ్చును. అదియొక చమత్కారము.

భయములు సాధారణములు, విపరీతములు అని రెండు తెరఁగులు. దయ్యములన్న సాధారణముగ నందరికీ భయము. మన కావ్యములలో భయానక రసమున్నది. ఈ భయానక రసమును తెరపై జూపించుచూ అనేకులు చలన చిత్రములు నిర్మించిరి. ఈ మధ్యకాలమున అట్టి యొకానొక చలనచిత్రము "The Conjuring" అనునది.

ఈ చలనచిత్రమున దెయ్యములు గలవు. కొందరు దయ్యములు లేవందురు. దైవమున్నదని నమ్మిన దయ్యమున్నదని యేల నమ్మరాదు? ఇది మానవుని స్వభావదోషము. ఈ చిత్రమునందు దయ్యముల స్వభావములనూ జక్కగా జూపించిరి. మొదట భయపెట్టును. పిమ్మట లోబర్చుకొనును, అటపై ఆవేశించును. ఇట్లు దయ్యము మూడు వంతులుగా మానవుని స్వాధీనపరచుకొనును. దీనినే ఈ చలన చిత్రమున ఎడ్ అనువాడు జెప్పెను. ఈ చలన చిత్ర ఇతివృత్తమిట్లున్నది.

అమెరికాలో ఫ్లోరిడా అను నొకచోట నొకఁడు నొకానొక బెద్ద భవంతిని కొనును. అచ్చటికి సంసారమును తరలించును. మన సాంప్రదాయమున యిల్లు జేరునపుడు శాంతి హోమము నెరపుట యాచారము. మ్లేచ్ఛులకట్టి యాచారములు లేవు.  ఆచారములన్నియునూ వ్యర్థములని కొందరందురు. అదియే మ్లేచ్ఛనాగరకత. అన్నియునూ తెలియవలనన్న దురాశ ఈ భావమునకు మూలము. కొన్ని విషయములుండును. వాని సారములెరుగవలసిన బని అందరకునూ లేదు. సమాజమున నందరి బుద్ధి స్థాయీభావములొక్క తెరగున నుండదు. అది సృష్టి. కర్మగత భావసారము ఆచరణతో ముడివడియున్నది. ఆచరించుచూ పోయిన యెడల ఒకనాటికి ఆతని సంస్కారశుద్ధిజనితబుద్ధ్యధికృతమై ఆ సాధనాఫలముగా యాచారముల యాంతర్యమవగతము గావచ్చును.

(సొల్లుతో శాఖాచంక్రమణము గావించితిని, ఇక మిమ్ములను బాధపెట్టక కథకు పోవుదును.)

యాతనికి భార్య, ఐదుగురు ఆడపిల్లలు. ఆ భవనమున అంతకు పూర్వము పెక్కు దుర్ఘటనలు జరిగి యుండును. ఆ దుర్ఘటనలలో గతించిన వారలందరు దయ్యములై తిరుగుచుందురు. ఆ భవనమున జేరిన నాట నుండి ఆ కుటుంబమునకు ఈతి బాధలు మొదలగును.

అంతియగాక ఆ భవనమునందు కరవునందు యధికమాసమన్నట్టు అనేకగదులకు తోడుగా  అనేక నేలమాళిగలుండును. దయ్యములా నేలమాళిగలందు నివసించుచూ రాత్రులయందు తలుపులను తాడించుచు యుండును. మరియొకటున్నది. ఆ ఇంట గడియారములన్నియునూ 3:07 గంటలకు నిలిచిపోవుచుండును. అందులో మర్మమేమి? మూడు అనగా నది తండ్రి, యేసువు, పవిత్రభూతము (holy ghost)నకు సంకేతములు. మన సాంప్రదాయమున త్రిమూర్తులు గలరు. ముజ్జగములున్నవి. మరి మ్లేచ్ఛులకు పొంతనలేని మూడిఁటి విషయసంగమమున్నది. యదియే సత్సాంప్రదాయమునకూ, మ్లేచ్ఛ సాంప్రదాయమునకూ భేదము. అది యట్లుండె. 07 సంగతి దర్శకుడు జెప్పలేదు. మరచెనేమో?

ఈ దయ్యపుకొంపలో ఆ దంపతులన్యోన్యముగా కష్టసుఖములనే గాక భయమునూ "సమానము"గా పంచుకుని గాపురము సాగించుచుండిరి. (సమానత్వము?!? ......వద్దు. ఈ విషయముపై ప్రస్తుతము మౌనము వహించెద)

క్రమముగా ఆ ఇల్లాలికి దేహముపై గాయములు కలుగును. పిల్లలకు యెడనెడ భయోత్పన్నమైన దృశ్యములగుపించుచుండును. దరిద్రమునకు యాకలి తోడన్నట్టుగా వారు క్రైస్తవులైననూ మతాచారములను బాటింపరు. చర్చికి వెళ్ళుట వారి యింటి సాంప్రదాయము గాదు. ఇంకేమున్నది. పిశాచరాజములకు కళ్ళెములు విడచినట్లైనది. అవి విశృంఖలముగా తమ కార్యకలాపములు సాగించును. ఈ కార్యకలాపములు ముందు జెప్పినట్టు మూడు తెరగులు.

అన్ని దెయ్యపు సినిమాల వలెనే ఈ సినిమాయందు దెయ్యములను పారద్రోలు వారలున్నారు. వారలు కూడా దంపతులే. ఆ దంపతులలో నిల్లాలికి దయ్యములను జూచు, తత్సంబంధిత శబ్దములను గ్రహింపగల, తదధికృత దుర్గంధములను మూర్కొనగల అతీంద్రియశక్తులుండును. ఆ దంపతులొకమారు దయ్యముల గురించి ప్రసంగించుచుండగా, మన దయ్యపు కుటుంబపు యిల్లాలు వారిని గలసి తమ యింటికి యాహ్వానించును. వారలందులకంగీకరించి ఈ ఇంటియందడుగు పెట్టుదురు.

వారికినీ దెయ్యములకునూ జరిగిన యాధిపత్యపు బోరున నెవరు గెల్చిరి అనునది వెండి తెరపై జూడవచ్చును.

ఈ చలనచిత్రమునందు భయానకరసము అంగి. గుణీభూతముగా గొంత హాస్యమున్నది. దెయ్యములకు యాటలపై ఆసక్తి యుండును. "వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?" అను కళ్ళకు గంతలు కట్టుకొను యాట మనకు అనూచానముగా గలదు. ఆంగ్లేయులకు "hide and claps" అను యాట గలదు. ఆశ్చర్యమేమి? భారతీయమైన సాంప్రదాయములు జగద్విస్తృతములు గదా! అప్పుడప్పుడూ దెయ్యములూ ఆ యాట యాడును.

తెలుగు చలన చిత్రములలో చివరి దృశ్యమున పోలీసులు యరుదెంచుట గలదు. ఈ చిత్రముననూ, చివరన వాటికన్ అధికారులు ఆ యింటిని దెయ్యముల బారినుండి వదలించుటకు అనుమతి నొసగుట గలదు. ఆంగ్లేయుల హాస్యరసపోషణములట్లుండును.

దెయ్యములన్న భయమున్న వారికి, అనగా భయానకరసార్ద్రైకచిత్తులకు, పిశాచవిషయసంగ్రహపరివిష్టులకూ ఈ చలనచిత్రమునందు గావలసినయంత సరుకున్నది. మ్లేచ్ఛ దెయ్యములగురించిన సాంకేతిక సమాచారమిందు సరిపడినంత యున్నది. ఈ చిత్రకథ నిజముగా జరిగినదట.

యేది యేమైననూ, ప్రస్తుతము తెలుగునాట వచ్చు పేలవమైన చిత్రములను బోల్చినచో, ఈ చిత్రమున దెయ్యములే మేలనిపించును. తొడలు చరిచెడు నాయకులకన్న తలుపులు బాదు దెయ్యములెంతియో మేలు. తక్కిన సాంకేతికవిషయములన్నియునూ అద్భుతముగ సమకూరినవి. ఈ చలనచిత్రరాజమును యభిరుచిగల ప్రేక్షకులు జూచి యానందిం....క్షమించుము, మిక్కుటముగ భయమందుదురు గాక.

Sunday, December 9, 2012

క్రిష్ ఆడిన నాటకం - కృష్ణం వన్దే జగద్గురుమ్



కొన్నాళ్ళ క్రితం దిండు క్రింద పోక చెక్క అన్న నవల చదివాను. దాని అట్టపైన "కల్పనాత్మకమైన చారిత్రక నవల" అని రాసుంది. అందులో ఉన్నది అంతా కల్పనే. చరిత్ర శూన్యం. ఆ కల్పన వెనుక ఉన్నది రచయిత విశ్వనాథ సత్యనారాయణ యొక్క కుత్సితత్వపు బుద్ధి అన్నది నవల చదివితే అర్థమవుతుంది.

ఈ రోజు సాక్షి పేపర్ లో జాగర్లమూడి క్రిష్ గారి ముఖాముఖి లో "సినిమా" గురించి తన అభిప్రాయం కూడా అలాంటిదే. "సినిమా వ్యాపారాత్మక కళ" అని ఆయన వాక్రుచ్చారు. ఆయన లేటెస్టు సినిమా "క్రిష్ణం వన్దే జగద్గురుమ్" లో "కళ" కంటే వ్యాపారమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఆ వ్యాపారం వెనుక ఏముంది అని ఆలోచిస్తే, ఇది క్రిష్ గారు జనాల మెదళ్ళమీద ఆడిన డ్రామా లాగా అనిపిస్తా ఉంది.

ఇదివరకు ఠాగూర్, అపరిచితుడు, మల్లన్న, శివాజీ వంటి సుగర్ కోటెడ్ సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ ఏదో సామాజిక సమస్య మీద వ్యక్తి పోరాడుతున్నట్టు చిత్రీకరించి హీరోతో విలన్లను చితకబాదించి, ఆయనతో దైవాంశ సంభూతమైన పనులు చేయించి నేల విడిచి సాము చేసి, మధ్యలో హీరోవిన్లతో ప్రదర్శన చేయించి ఓ మూడుగంటలు ప్రేక్షకులను ఎంటర్ టయిన్ చేసి, పబ్బం గడుపుకున్నాయి. క్రిష్ గారు చేసిన "కొత్త" పని ఏమంటే - ఆ సుగర్ కు "దైవత్వం" అన్న మరొక లేయర్ "తేనె" దట్టించటం. ఈ కొత్త పని వల్ల ఆయనకు వచ్చే అడ్వాంటేజి ఏమిటంటే - ఈ సినిమాను మెచ్చుకుంటే "దైవత్వం" తాలూకు గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టు ప్రేక్షకుడికి కలిగే భ్రమ, ఈ సినిమాలో లోపాలెత్తి చూపితే వాడికి టెస్టూ సెంటిమెంటూ లేవని చెప్పడానికి కలిగే వెసులుబాటూనూ.

ఇంతా చేసి ఈ సినిమాలో హీరో గారు చేసిన పనుల సారాంశం ఏమంటే - లక్ష కోట్ల ఆస్తి ఉన్న విలన్ ను డ్రమటిక్ గా నరసింహ స్వామి రూపం ధరించి చంపెయ్యటం. అందుకు పైకి చెప్పే కారణం - ఆ విలనుడు నేలను తవ్వి వ్యాపారం చేసి, అడవులను నాశనం చేసి, అడవి బిడ్డల్ని తిప్పలు పెట్టాడని. ఆ కారణం మీదనే సినిమా నడుస్తే మంచిదే. అయితే అలా చేస్తే "వ్యాపారం" ఎలా? అందుకని విలన్ గారు హీరో తల్లితండ్రులను చంపిన మేనమామ అన్న తెలుగు సినిమా తాలూకు పాచిపోయిన భావదారిద్ర్యపు ఫార్ములానే దర్శకుడు వాడుకున్నారు. హీరోతో విన్యాసాలు, ఫైట్లు చేయించారు. హీరోవినును ప్రేమింపజేశారు. అట్టహాసపు డవిలాగుల హంగులను, పాటల జిలుగులను అద్దెకు తెచ్చుకున్నారు. సగటు ప్రేక్షకుడిని "సగటు" గానే ఉండమని సరికొత్తగా చెప్పారు.

నాటక రంగం నాశనమైపోయిందని ఈ సినిమాలో హీరో, వారి తాతగారి (దర్శకుడి) బాధ. (ఇది మాటల్లోనూ, సన్నివేశకల్పనలోనూ చూపించడంలో సఫలమయ్యారనే చెప్పవచ్చు) అయితే దానికి నేపథ్యం కావాలని బళ్ళారి కి హీరోను తీసుకొచ్చారు. హీరో తాతగారిది బళ్ళారిట. ఆ బళ్ళారి బాబులు బళ్ళారి తెలుగులో మాట్లాడరు. శుద్ధమైన కోనసీమభాషలో మాట్లాడుతారు, టేక్సీ డ్రయివరుతో సహా. పోనీ కన్నడ భాషయినా సరిగ్గా వెలగబెట్టారా అంటే అదీ లేదు. నిజానికి బళ్ళారి కన్నడ బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో కన్నడకంటే భిన్నమైన యాస. తెలుక్కే గతిలేదు, ఇక కన్నడ యాసకెక్కడ? ఇలాంటివి మామూలు సినిమాల లో కనిపిస్తే ఓకే. కానీ ఈ సినిమాలో "కళ" మీద గొప్పగొప్ప డవిలాగులు రాయించుకున్న క్రిష్ గారికి కళ కు ప్రాంతీయత్వపు సౌరభం అతి ముఖ్యమైన అంగమని, అవసరమని తెలియకుండా పోయింది. ఒక్క యాసే కాదు, బళ్ళారి, అసలు రాయలసీమ తాలూకు వాసనే ఈ సినిమాలో కనిపించదు. ఆ ఊరి పేరు మీద రామోజీ సిటీలో వేసిన చవకబారు సెట్లు తప్ప. బళ్ళారి రాఘవ, వారి శిష్యులూ, ఇంకా ధర్మవరం రామకృష్ణమాచార్యులు, ధర్మవరం గోపాలాచార్యులు, యడవల్లి సూర్యనారాయణ, ఇత్యాది మహానుభావులు ఒకప్పుడు సీమ ప్రాంతంలో పోషించిన  బళ్ళారి నాటకరంగం తాలూకు ఆనవాళ్ళు మచ్చుకైనా లేవు. వారి ఫోటోలు కూడా హీరో గారి ఇళ్ళల్లోనూ మరెక్కడానూ లేవు. బళ్ళారిలో రైట్ ఆనరబుల్ కోలాచలం వారు కట్టించిన రంగ మందిరం, (నేటి మునిసిపల్ ఆఫీసు అనుకుంటాను) వారి "సుమనోహర" సంఘం, వారు వ్రాసిన నాటకాలు, రూపనగుడి నారాయణరావు గారి సాహిత్యం ...ఊహూ...ఏవీ కాబట్టలేదు. చివరికి బళ్ళారి పట్టణంలో నాటి చరిత్రకు మౌనసాక్ష్యాలైన టిప్పుసుల్తాను కోట, వార్డ్ లా కాలేజ్, మెడికల్ కాలేజ్ (బ్రిటిష్ హయాంలో స్వాతంత్ర్య సమరయోధుల జైలు) ఏవీ లేవు. అసలు బళ్ళారి ఊరికే వెళ్ళకుండా ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఊపిరి పోసుకున్న మహోజ్జ్వల కళ గురించి క్రిష్ గారు రామోజీ సిటీ సహాయంతో ప్రేక్షకులకు జ్ఞానసంపద పంచిపెట్టారు! హాట్సాఫ్!

నేపథ్యం "కళ" తో క్లాసు ప్రేక్షకులను గేలం వేసి, మైనింగు, లక్ష కోట్లు సంపాదించిన విలను, అతని క్రూరత్వం, వీటి ద్వారా సాధారణ సినిమాకు కావలసిన మసాలా హంగులను కూర్చుకోవడంలో చక్కని తెలివి తేటలు కనబర్చారు. ఆ లక్ష కోట్ల విలను - చేసే పనులు కాస్త లాజిక్ ఉపయోగిస్తే పేలవమైనవని తెలిసిపోతాయి. అన్ని కోట్లు కూడగట్టి, పేరలల్ ప్రభుత్వం నడుపుతున్నతను, హీరోయిన్ ను చంపాలని, ఆమె దగ్గర రహస్యాలున్నాయని తాపత్రయపడటమేమిటో? చక్కగా ఆమె బాస్ ను డబ్బుతో కొనెయ్యచ్చు, లేదా మీడియానే కొనెయ్యవచ్చు, లేదా సాక్ష్యాలు తారుమారు చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి, ఒక సిన్సియర్ తెలుగు విలన్ లా, హీరోవిన్ ను, చంపాలని తన మందితో ప్రయత్నిస్తాడు! నిజానికి ఆ స్థాయి విలన్ తన చెయ్యికి మట్టి అంటకుండా పనులు చేస్తాడు. తన రౌడీలతో అలాగే చేయిస్తాడు. ఆ రౌడీలు దర్శకుడి చేతిలో కీలుబొమ్మలు కనుక, హీరోగారి ట్రూపులో సభ్యుణ్ణి అనవసరంగా నాలుక కోసి, హీరో తాత గారి అస్తికలపై మూత్రం పోసి హీరోతో వైరాన్ని కొనితెచ్చుకొని, ఆ ప్రయత్నంలో దైవాంశసంభూతుడిలాంటి అతని చేతిలో తన్నులు తింటూ, హీరో పగను మరింత రెచ్చగొడుతూ తమ ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉంటారు!

ఒక్క విషయానికి మాత్రం క్రిష్ గారిని మెచ్చుకోవాలి. లాజిక్ కు అందని విన్యాసాలను చక్కగా అడవి పుత్రుల తాలూకు ఎమోషన్ సీన్స్ ద్వారా కవర్ చేసి ఊపిరి ఆడకుండా పని జరిపేసుకున్నారు. సామాన్యుల ఆక్రోశం, మట్టి రాజు అనే పాత్ర ద్వారా మట్టిని ఎవరూ దోచుకెళ్ళకుండా నీళ్ళలోకి వేసి దాచిపెడుతున్నట్టు చూపించడం, వాళ్ళ ఆగ్రహాన్ని చూపించడానికి హీరో వాళ్ళతో కుండలు పగులగొట్టించటం, చివర్లో విలన్ ను మోసుకొచ్చి వాళ్ళ ద్వారానే చంపించటం, దానిని చూసిన ఒక పిల్లవాడు "ఏ దేవుడు" అంటే - మనిషి దేవుడనటం....సిరివెన్నెల గారి దశావతారాల్లో కృష్ణుడి వరకు మాత్రమే వచ్చిన పాట, పవర్ ఫుల్ డైలాగులు, సినిమా మొదట్లో అభిమన్యుడు, ఘటోత్కచుల అద్భుత ప్రదర్శన, హీరో హీమేనిజం, హీరోవిన్ తో సరమైన శృంగారం, చీప్ కామెడీ, ఒకట్రెండు చవకబారు ఐటెమ్ సాంగ్స్ - అన్నీ కలిపి, ఈ సినిమాను హిట్ సినిమా చేస్తాయి. అయితే ఈ సినిమా "కళ" కు అద్దం పట్టిందనో, గొప్ప సినిమా అనో అంటే మభ్యపడే ప్రేక్షకులతో బాటూ సైలెంట్ గా కూర్చుని ఆలోచించే వాళ్ళూ ఉంటారు. అలాంటి వారికి ఇది క్రిష్ గారు ఆడించిన డ్రామా అని తెలిసిపోతుంది.

మంచి ఎంటర్ టైనర్ ఈ సినిమా. సరికొత్త ప్రయోగం కూడా. డవిలాగులు చాలా బావున్నాయి. సినిమా తప్పక చూడండి. అయితే "కళ" గురించి క్రిష్ గారు వేసే జోకులు డ్రామాలో భాగంగాను, టీవీ ఛానెళ్ళలో సిరివెన్నెల గారిని అడ్డుపెట్టుకుని దశావతారాలని అవని ఇవని, కళ అని పడికట్టు మాటలలో వెనుక ఉండే హంగామాను జాగ్రత్తగా గమనించండి.

Saturday, October 29, 2011

కొల్లాయి గట్టితేనేమి?

ఈ నవల చాలాకాలం నుండి చదవాలనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది. చదవడానికి ప్రేరణ మహీధర రామ్మోహనరావు గారు మహీధరనళినీమోహన్ గారితండ్రి కావడం వల్ల. నళినీమోహన్ రచనలు, గణితంలో ఆయన పుస్తకాలు చదివి పెరిగిన బాల్యం నాది. నా చదువుకు, ఇంజినీరింగ్ సీటుకు, ఉద్యోగానికి పరోక్షంగా ఆయన వ్రాసిన పుస్తకాలనే ఎఱువు కొంతవరకూ కారణం.

ఈ పుస్తకం గురించి విమర్శ, సమీక్ష వంటివి చేయడం చేయదల్చుకోలేదు. రానారె అప్పుడెప్పుడో మునికన్నడిసేద్యం పుస్తకానికి రివ్యూ రాస్తూ, పుస్తకానికి రివ్యూ వ్రాయడమంటే జీవితానికి రివ్యూ వ్రాయడమేనన్నారు. కొల్లాయి...అదే కోవకు చెందుతుంది.

చదువుతూ ఉండగా అక్కడక్కడా ’షాకింగ్’ గా అనిపించినవి, నా జీవితంలో ముడివడిన ఒకట్రెండు సందర్భాలు పంచుకొందుకు ఈ రాత. (ఇంకా అనేకం ఉన్నా, ఇప్పటికింతే)

1.
ఓ నెలరోజుల ముందు మా పాపాయితో ఆడుకుంటుంటే బంతి గుమ్మం దగ్గరకెళ్ళింది. పాప బంతిని తీసుకుని, గడప మీద కూర్చుంది. ఆ తర్వాత అంది - "నానా, గడప మీద కూర్చోకూడదా? దేవుడుంటాడా?" - నేను సమాధానం చెప్పలేదు కానీ కొంత ఆలోచించి లేచి వచ్చి గడప మీద కూర్చున్నాను.

సరిగ్గా పదేళ్ళనాడు నేను మా అమ్మను అదే ప్రశ్న అడిగినట్టు గుర్తు. మా అమ్మ "గడప" అంటే లక్ష్మీదేవి కూర్చోకూడదు అంటే, బడాయిగా - "లక్ష్మీదేవి ఒళ్ళో కూర్చోడం మంచిదేగా" అని ఆక్షేపించి అక్కడ కూర్చున్నట్టు నాకు గుర్తు.

"కొల్లాయి గట్టితేనేమి?" - ఈ నవల్లో రామనాథం (వయసు ఇరవై) కు వాళ్ళమ్మకూ ఇదే సంభాషణ ఉంది. కాకతాళీయంగా అక్కడా అమ్మ పేరు రాజమ్మే.

"పీట వాల్చుకో. గడప మీద కూర్చోకూడదు."
"కూర్చుంటేనేమమ్మా!"
రామనాథం మామూలు ప్రకారం అనేశాడే కానీ, వాగ్వాదం పెట్టుకునే ధోరణిలో లేడు.

కొల్లాయి...నవలాకాలం 1920. అప్పటికి, 1985 కు, 2011 కు ఒకటే ప్రశ్న. పైకి అనుకొన్నంత చిన్న ప్రశ్న కాదిది. సమాజ విలువలను సమీక్షించుకోవడం మనిషికి ఎప్పటికప్పుడు అవసరమేమో? నిజానికి ఆ ప్రశ్నలో "చెడ్డ", "మంచి" అన్న శషభిషకన్నా, - వివేకం వైపు వేసే తప్పటడుగుల మార్దవం ఉందని నా అనుకోలు.

2.

"కొల్లాయి ..." నవల్లో చేయని శిక్షకు రామనాథాన్ని జైల్లో పెడతారు. అక్కడ మొదటిరోజు తర్వాత అతని జందెం బట్టలతోబాటు వెళ్ళిపోతుంది. జైల్లో త్రాడు వంటివి ఖైదీల అందుబాటులో ఉంచకపోవడం ఒక రూలు. ఆ తర్వాత ఆరునెలలకు రామనాథం జైలునుండి విడుదలై, తన అగ్రహారం ముంగండకు వస్తాడు. అక్కడ పినతండ్రి శంకరశాస్త్రి గారు రామనాథం ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటారు (జైల్లో శూద్రుల చేతికూడు తిన్నందుకు). ఒకాయన "ఆరు నెలలు భుజం మీద జందెం లేదా చొచ్చొచ్చో" - అంటాడు (పేజి - 192).

సరిగ్గా అదే మాట - అదే ప్రశ్న నాకు ఒకప్పుడు తగిలింది. నేను జందెం తీసివేయడం వెనుక కారణం జైలు కాదు. :)) జందెం తీసివేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న తపన, జందెం వల్ల పక్కన ఎవరికీ రాని ఒక పవిత్రత నాకు వస్తుందంటే అప్పట్లో ఒప్పుకోలేని ఔద్ధత్యం. నాకు సమాధానం చెప్పలేకపోయినా, ఆక్షేపణ చెప్పిన వాళ్ళు మా నాన్నగారితో సహా చాలామంది. ఒకరిద్దరు మిత్రులతో సహా. వారిదెవరిదీ తప్పు లేదు. అయితే అప్పట్లో నేను చేసింది కూడా తప్పు కాదని నాకు తెలుసు.

ఇప్పుడదంతా  తల్చుకుంటే చాలా నవ్వొస్తుంది.

***********************************************

ఇంట్లో ఆడవాళ్ళను ఇంటిబయట మూలన కూర్చోబెట్టేవాళ్ళు, దానికి శాస్త్రాల్లో సమాధానాలు వెతికేవాళ్ళు, రజస్వల అయిన అమ్మాయి కరివేపాకు చెట్టు ముట్టుకుంటే ఎండిపోతుందని నమ్మేవాళ్ళు, మంగలిదగ్గరికెళితే అస్పృశ్యత పాటించేవాళ్ళు రోజూ కనబడుతూనే ఉంటారు. ఇటువంటి విలువలను మానవత్వమనే గీటురాయి మీద నిరంతరం గీస్తూ పరీక్షిస్తూ ఉండకపోతే మనిషనేవాడు మిగలడు. రాక్షసుడే మిగులుతాడు. "ఛాందసత్వం" ఆ రాక్షసత్వానికి తొలిమెట్టు. కొల్లాయి గట్టితేనేమి? - ఈ నవల బ్రాహ్మణ కుటుంబంలో ఛాందసంతో కూడిన సాంప్రదాయికవిలువలసంఘర్షణను అద్భుతంగా చిత్రీకరించిన ఒక ఆధునిక కావ్యం.

Wednesday, September 7, 2011

భీష్ముఁడు - వైయక్తిక ధర్మము

ధర్మము వైయక్తికమా లేక సార్వజనీనమా? అన్నది మనిషి మనుగడంత పురాతనమైన ప్రశ్న. సిద్ధాంత రూపేణా బహిర్గతం కానప్పటికీ, జీవితపయనంలో ఏదో ఒక సమయంలోమనిషి  ఈ ప్రశ్నను ఎదుర్కొనవలసి  వస్తుంది. ఇదే ప్రశ్నను కాస్త సులభంగా చెప్పుకోవాలంటే - మనిషి  చేసే న్యాయాన్యాయ విచక్షణకు ఆఖరి ప్రస్థానం (సాధ్యమైనంతగా ఇతరులను పీడించకుండా) జీవితంలో సాకల్యాన్ని,సార్థకతను సాధించడమా? లేక కేవలం త్యాగబుద్ధితో ఇతరుల కోసం (కుటుంబం,సమాజం కోసం) మనుగడ సాగించడమా? ఆత్మ దర్శనమా/దీనజనోద్ధరణమా? అంతే కాక దీనికి అనుబంధంగా మరిన్ని ప్రశ్నలు బయలు దేరుతాయి. దేవుడిలో విలీనం కావడం లేదా నిర్వాణం చెందడం మానవుని అంతిమ లక్ష్యమా? లేక తనతో బాటు తనవాళ్ళనందరినీ కట్టగట్టుకుని ఉద్ధరించి, సంతృప్తితో కన్నుమూసి,తనవారిని ఇహంలో ఉద్ధరించి,ఆ తర్వాత  పుణ్యాన్ని పంచడం ద్వారా  పరంలో మోక్షానికి తీసికెళ్ళడం ముఖ్యమా?

ఈ విషయమై బౌద్ధంలో కాస్త స్పష్టమైన విధానం ఉందని వ్యక్తిగతంగా నా అనుకోలు. బుద్ధబోధ కేవలం "ఆత్మ దీపో భవ". ఇది రాజీలేని వైయక్తిక ధర్మం. మరింతగా లోతులో దిగితే బుద్ధబోధలో మరొక విషయం కనిపిస్తుంది. ఆయన చెప్పిన వైయక్తిక ధర్మంలో విలువల (morals)ప్రస్తావన లేదు. అంటే అబద్ధం ఆడరాదు, ఏకపత్నీవ్రతం, తండ్రి ఆజ్ఞపాటించడం, బ్రాహ్మణధర్మం, క్షాత్రధర్మం, కుటుంబం పట్ల నిబద్ధత  వగైరా వగైరాలు లేవు. (ఇక్కడ ఒకవిషయం గమనించాలి. బౌద్ధంలో విలువలు లేవు అంటే ఆ విలువలను ఖండిస్తున్నట్టూ, వాటి వ్యతిరేకతను సమర్థిస్తున్నట్టూ కాదు. ఆత్మశోధనలో వాటి ప్రసక్తికి తావు లేదని మాత్రమేనని గ్రహించాలి) వ్యక్తి అంతిమ లక్ష్యం తనను తాను తెలుసుకోవడం. ఆ తెలుసుకొన్న విషయానికి అనుబంధంగా విలువలు వాటంతటవే ఆవిష్కృతమౌతవి. వాటిద్వారా  ఇతరులు ప్రేరేపితమై, ఇలా అనేకులు తమను తాము తెలుసుకోగల్గడం, తద్వారా ప్రజల శ్రేయస్సు అనుగతంగా వస్తాయి. మరో విషయం ఏవంటే బౌద్ధంలో ఎక్కడా "సమాజం" అన్న పదం లేదు. బుద్ధుని మాటలన్నీ "సంఘం" గురించే ఉద్దేశించడం మనం గమనించవచ్చు. సంఘం అంటే ఏకాభిప్రాయం కలిగిన "వ్యక్తుల" సమూహం. బుద్ధుని సంఘం "భిక్షుకుల సంఘం". ఆ సంఘం కోసం చెప్పిన నియమాలు (వినయపిటకం) సార్వజనీనంగా అందరికీ అంటే - సమాజానికి వర్తించవు. స్త్రీలను సంఘంలో చేర్చరాదని బుద్ధుని ఆదేశం. అలా చేరిస్తే సంఘభావన క్రమంగా లుప్తమై,  ఏకాభిప్రాయం సడలుతుందని, సంఘం సమాజంగా (సమాజం కుటుంబాల సమూహం. సంఘం వ్యక్తుల సమూహం) పరిణమిస్తుందని, అంతటితో బౌద్ధధర్మం అంతరిస్తుందని బుద్ధుడి తీర్పు. అది అక్షరాలా జరిగింది కూడానూ.

హైందవ ధర్మం మాత్రం శతాబ్దాలుగా సార్వజనీన ధర్మం కోసం శోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వైయక్తిక ధర్మాన్ని ప్రబోధించిన గ్రంథాలు హైందవంలో ఉన్నా, వాటి చివరి సందేశం సమాజశ్రేయస్సు లేదా ఆత్మావిష్కరణతో కూడిన సమాజశ్రేయస్సుగా మనం కనుగొనవచ్చు. పూర్తిగా కుటుంబాన్ని, సమాజాన్ని,అలక్ష్యం చేసి ఆత్మావిష్కరణ  కోసం పాకులాడమని హైందవం చెప్పినట్టు కనబడదు. కొండొకచో అష్టావక్ర సంహిత వగైరాలు ఆ విషయం చెప్పినా, అట్టి గ్రంథాలకి తగినంత ఆమోదం లభించినట్టు కనబడదు. మొత్తానికి ధర్మం వైయక్తికమా లేక సార్వజనీనమా అన్న విషయం ఒక ప్రధానమైన ప్రశ్నగా నాటి నుంచి నేటి వరకు  మనకు వినబడుతున్నది. భగవద్గీతలో కూడా వైయక్తిక ధర్మాన్ని జ్ఞానయోగంగా పేర్కొని, కర్మ, భక్తి యోగాలను సార్వజనీనంగా అన్వయించడం గమనించవచ్చు. పంచమ వేదంగా ప్రశస్తమైన మహాభారతంలో భీష్ముని పాత్ర ఈ వైయక్తిక/సార్వజనీనతల సంఘర్షణకు ప్రతీక అని నా అభిప్రాయం. ఆ దృక్కోణంలో భీష్ముని పాత్రపై నా ఆలోచనల పరంపర ఇది. ఈ వ్యాసం తప్పు, ఒప్పుల నిర్ధారణ కోసం కన్నా ఒకానొక దృక్కోణాన్ని వెతికే ప్రయత్నం మాత్రమేనని నా విన్నపం.

***********************************************************

భీష్ముడు పరమపుణ్యమూర్తి. శాపగ్రస్తుడైన మహనీయుడు.అష్టవసువులలోనొకఁడు. గంగామాత తనయుడు కాబట్టి ఆతని పుట్టుకపరమపవిత్రమైనది. అనుశాసనిక పర్వంలో భీష్ముని ఉపదేశాలు ఆ కాలంలో వివిధ వర్ణాలకు అవశ్యాచరణీయాలు. ఈయన తన జీవితంలో విలువలతో కూడిన వైయక్తికధర్మానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తఱచి చూస్తే అగుపిస్తున్నది. తద్వారా సమాజశ్రేయస్సును సాధించగల్గడానికి పూనుకున్నట్టు ఆయన చరిత్రలో అంతర్లీనంగా కనబడుతుంది. భీష్ముని జీవితంలో అడుగడుగునా ఈయన ధర్మాన్ని సవాలు చేసే సంఘటనలు, సంకటపరిస్థితులు అగుపిస్తాయి. తన కట్టెదుట గుడ్డిరాజు పుత్రప్రేమతో దాయాదులకు ద్రోహం తలపెడుతున్నప్పుడు,  వంచనాద్యూతం జరుగుతున్నప్పుడు, కులస్త్రీని వివస్త్రను చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, పద్దెనిమిది రోజుల్లో లక్షలమంది - తమ భర్తలను, తమ్ములను, తండ్రులను, పిల్లలను, బంధువులను కోల్పోతున్నప్పుడు,చివరికి తన ప్రాణం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈయన జీవితం నేపథ్యంలో మనకు వైయక్తిక సామాజిక ధర్మాల తాలూకుసంఘర్షణ అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని పరామర్శించడానికి  కథను మళ్ళీ చెప్పుకోవాలి. మార్గాంతరం లేదు.

అనగనగా శంతనుడనే ఒక రాజు. గొప్పరాజు, జనరంజకమైన పాలన - మామూలే. ఈయన ఒకరోజు గంగను చూచాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. గంగ తన షరతులను శంతనునికి చెప్పింది. తను ఏం చేసిన ప్రశ్నించరాదంది. ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకున్నాడీయన. వరుసగా ఒకరితర్వాత మరొకరుగా ఏడుగురు పుత్రులు పుట్టారు. ఏడుగురిని నదిలో పారవేసిందామె. ఎనిమిదవ వాడు పుట్టాడు. ఈ సారి శంతనుడు ఆమె ప్రయత్నాన్ని అధిక్షేపించాడు. గంగ, ఆ ఏడుగురు శాపగ్రస్తులని, వారి శాపవిమోచనం కోసం తానాపని చేశానని, ఎనిమిదవ కొడుకును పెంచుకోమని చెప్పి శంతనుడిని వీడింది. కొన్నేళ్ళు ఆ పిల్లవాడికి విద్యాబుద్దులు చెప్పించి శంతనుడికి ఒప్పగించింది. ఆ బాలుడే భీష్ముడు.

ఆ బాలుడు పెఱిగి పెద్దవాడవుతున్నాడు. ఈ లోగా శంతనుడికి సత్యవతి (యోజనగంధి) అని ఒక అమ్మాయి కనిపించింది. ఆ స్త్రీపై మరులు గొన్నాడు రాజు. ఆమె తండ్రి దాశరాజు కడకు వెళ్ళి ఆమెనిమ్మని అడిగాడు. దాశరాజు శంతనునికి తన షరతును చెప్పాడు. శంతనుని తదనంతరం సత్యవతికి పుట్టబోయేబిడ్డ రాజ్యం చేయాలి. అది ఆ షరతు. శంతనుడు కూడదన్నాడు.దాశరాజు తన బిడ్డనిమ్మను పొమ్మన్నాడు. శంతనుడు దిగులు చెందాడు. తండ్రి దిగులు గమనించిన పుత్రుడు విషయం ఎలాగో కనుక్కున్నాడు. తనే స్వయంగా దాశరాజు వద్దకు వెళ్ళాడు. విషయం తెలుసుకుని రాజ్యం పరిత్యజిస్తానన్నాడు.అలాగెలాగ, నీవు ఒప్పుకుంటే అవుతుందా? ప్రజలు తిఱుగుబాటు చేస్తేనో లేదా ఆ కొడుకుకు సంతానం లేకపోతేనో అన్నాడు దాశరాజు. నేను పెళ్ళి చేసుకోనే చేసుకోను అని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు శాంతనవుడు.

ఇక్కడ ఆగాలి మనం.

౧. యోజనగంధికి తనను కట్టబెట్టమని శంతనుడు భీష్ముని అడుగలేదు. ఒకవేళ భీష్ముడు తండ్రి దగ్గర విషయం ప్రస్తావించి ఉంటే ఆయన కొడుకును వారించేవాడేమో. 
౨. తను తండ్రి కోరిక నెరవేర్చడం కోసం పెళ్ళి చేసుకోను - ఇది భీష్ముని సొంతమతం. తండ్రి "కోరిక" (ఆజ్ఞ కాదు, గమనించండి) తీర్చడం తనయుడిగా తన "ధర్మం".నిజానికి తండ్రి కోరిక తీర్చకపోయినా తండ్రి తనమీద కోపం చెందడం అన్న ప్రసక్తి వచ్చి ఉండదు.

భారతకాలం నాటి ధర్మం ప్రకారం ఒకరి తదనంతరం పెద్దకొడుకు రాజ్యం చేయాలి.అది క్షత్రియధర్మం,భీష్ముడు ఉత్తమగుణోపేతుడు, యోగ్యుడు కాబట్టి తను రాజు కావడం అన్నివిధాలా "సమాజానికి",భరతఖండానికి లాభం. పైగా సమర్థుడు కాబట్టి శాంతిభద్రతలను రక్షించి, వైరులను పారద్రోలి, రాజ్యాన్ని బలోపేతం చేసి జనులను కాపాడి ఉండేవాడు.ఈ ధర్మాన్ని విడనాడి భీష్ముడు తండ్రి కోరిక తీర్చడం కోసం ఒకానొక త్యాగానికి ఒడిగట్టడం ఎంచేత? - ఇందుకు సమాధానం వైయక్తికధర్మం అని చెప్పుకోక తప్పదు. 

కేవలవైయక్తికధర్మం లేదా శుద్ధవైయక్తికధర్మం(అంటే సంన్యాసదీక్ష) కాకుండా తండ్రి కోరిక తీర్చడమనే విలువ ఇందులో ఇమిడి ఉన్నందున ఇది నియమసహితవైయక్తికధర్మంగా కనిపిస్తుంది.
మళ్ళీ కథలోకి వెళదాం.

ఏదైతేనేం, శంతనుడు సత్యవతిని మనువాడాడు.ఆ దంపతులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు పుత్త్రులు కలిగారు. శంతనుని తర్వాత చిత్రాంగదుడు రాజు కావాలి, అయ్యాడు. ఈ చిత్రాంగదుడు సమరలంపటుఁడు. దారినపోయే గంధర్వులతో పెట్టుకుని పోరాడి మరణించాడు. తర్వాత ఆతని తమ్ముడిని విచిత్రవీర్యుడిని గద్దెనెక్కించాడు భీష్ముడు. ఆతని కోసం కాశీరాజు కూతుళ్ళు ఇద్దరమ్మాయిలను తీసుకు వచ్చి పెళ్ళి కూడా చేశాడు. (ఆ పనిలోభాగంగా అంబ అనే అమ్మాయిని నొప్పించి, లేని తలనొప్పులను తెచ్చుకుని, విద్యనేర్పిన గురువుతో పోరాడి, చివరకు తన చావుకు కారణం కూడా ఏర్పరుచుకున్నాడు).

విచిత్రవీర్యుడు పొద్దస్తమానం అంతఃపురంలో సుఖాలలో ఓలలాడి మితిమీరిన కామంతో క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు!

శంతనుని ఇద్దరు కొడుకులు గతించిన తరుణంలో తను స్వయంగా రాజ్యం చేపట్టడం భరించరానంత తప్పు కాదు. పైగా అందులో స్వార్థం లేదు ప్రజలకోసం, రాజ్యం కోసం గద్దెనెక్కడం లేదా శంతనుని ప్రతినిధిగా  (రామాయణంలో భరతుడు రాముని చెప్పులను సింహాసనం పైన పెట్టి ఆతని ప్రతినిధిగా రాజ్యం చూసుకున్నట్టు)  రాజ్యవ్యవహారాలను చూసుకోవడం ఒకవిధంగా యుక్తం. కానీ శాంతనవుడు వ్యాసుని సంప్రదించాడు. సంతానం లేని వారు ఒక సద్బ్రాహ్మణుని ద్వారా సంతానం కని వంశం నిలుపుకోవడం ఆ కాలపు ధర్మం. ఏతద్ధర్మం ప్రకారం ఆయన వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని కననిచ్చినాడు.

ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. అంగవిహీనుఁడు రాజ్యాన్ని ఏలకూడదు, విదురుడు దాసీపుత్రుడు కాబట్టి పాండురాజు సింహాసనం ఎక్కాడు. అయితే పాండురాజు మరణించడంతో మళ్ళీ ధర్మసంకటం వస్తుంది. ఎట్టిపరిస్థితులలోనూ తను గద్దెనెక్కరాదని దాశరాజుకు ఇచ్చిన మాట ఒకవైపు. అంగవిహీనుని సింహాసనాధీశుని చేసి విశాలసామ్రాజ్యాన్ని కేవలం కాపాడవలసిన వ్యక్తిగా మిగిలిపోవడమనే ఒక సంకుచిత సామాజిక ధర్మానికి లొంగవలసిన అవసరం మరో వైపు. ఈ అసిధారావ్రతాన్ని బయటకు కనబడనప్పటికి అత్యంత జాగరూకతతో నిర్వహించిన మహోన్నత మూర్తిమత్వం భీష్ములవారిది. ఒకపక్క జరాసంధుడు ౮౪ మంది రాజులను జయించి మదగర్వంతో మిడిసిపడుతున్నాడు. వృష్ణివంశస్తులు కూడా అతని జోలికి పోని పరిస్థితి. కురురాజ్యం వైపు జరాసంధుడు చూడకపోవడానికి కారణం భీష్ముడు.  

ఇంతా చేసి ఈ పితామహుని పాత్ర భృత్యత్వం లానే అగుపిస్తుంది.

ధృతరాష్ట్రుడు పుత్రోత్సాహంతో తన మాటను పెడచెవిన బెట్టిన సందర్భాలలో మౌనం వహించవలసిన పరిస్థితి తప్ప మరొక మార్గాంతరం భీష్మునికి కనబడదు. కారణం తనకై తను విధించుకుని పాటిస్తున్న "దాశరాజుకిచ్చిన మాట" అనబడే ఒక వైయక్తిక ధర్మం. ఆ పరిస్థితులలోనూ అతఁడు విదురుని ధృతరాష్ట్రునికి మంత్రిగా నియమించడం ద్వారా - రాజ్యనిర్వహణలోనూ, ధర్మనిర్వహణలోనూ జరుగుతున్న లోపాలను అరికట్టటానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేయడం అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది.

ఆ తర్వాత దుర్యోధనుడు రాజ్యానికి రావడం, పాండవులకు కౌరవులకు బాల్యమాదిగా వైరం, మాయా ద్యూతం - ఇన్ని జరుగుతున్నా ఏమీ జరుగనట్టు కనబడడం - ఇదంతా ధర్మాధర్మాల నడుమ సంఘర్షణ. నిజానికి భీష్ముడు మహావీరుడు. మహాభారత యుద్ధ సమయంలో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి,పాండవపక్షంలోని అనేక వీరులను సంహరించిన తర్వాత ధర్మరాజుకు తన రహస్యాన్ని చెబుతూ తనను యుద్ధంలో ఎదిరించి నిలువగలిగే వారు లేరని శాంతనవుడు అంటాడు. నిజం కూడా. అంతటి వీరుడు దుర్యోధనుణ్ణి కానీ ధృతరాష్ట్రున్ని కానీ ఒక్క గదుం గదిమి, వీలైతే యుద్ధం చేసి నీ రాజ్యం నిలబెట్టుకొమ్మని సవాలు విసరడు!

నిండుసభలో కులస్త్రీని దుశ్శాసనుడు వివస్త్రను చేయబూనినప్పుడు ద్రౌపది సభికులను అడుగుతుంది - నేను ధర్మవిజితనా? అధర్మవిజితనా అని. ఈ ప్రశ్నకు సమాధానం న్యాయంగా ధర్మరాజు చెప్పాలి. తనే దుర్యోధనునికి పణంగా ఒగ్గి ఓడి దాసుడైన తర్వాత ధర్మరాజు భార్య దాసీయే. అంచేత ఆమె ధర్మవిజితయే అనవలసి వస్తుంది భీష్మునికి. సభలో అబలకు అన్యాయం జరుగకుండా సభామర్యాదను కాపాడవలసిన బాధ్యత గుడ్డిరాజుది. ఆతడు మిన్నకున్నాడు. ఆ భీషణమైన ధర్మాధర్మ సంఘర్షణలో భీష్ముడు ఏమైతే అయిందని విల్లు చేతబట్టి దుశ్శాసనుణ్ణి నిలువరించాలనుకోడు. అక్కడా ధర్మసంకటం. అలా చేసి యుద్ధం దాపురిస్తే దుశ్శాసనుణ్ణి చంపి తన ఇచ్చిన మాట (సత్యవతి పుత్త్రుల వంశమే గద్దెపై ఉండాలన్నది) కు పరోక్షంగా భంగం కలిగించుకునే పరిస్థితి వస్తుందన్న తీవ్రసంఘర్షణ. 

ఈ ధర్మాధర్మాల నేపథ్యంలో భీష్ముని పాత్ర కొన్ని సందేహాలకూ, దూషణలకు తావవుతుంది. అది పాఠకుల అల్పత్వమే కానీ వ్యాసుని పాత్రసృజనలో లోపం కాదు. అర్థం/ధనం కోసం ధృతరాష్ట్రుని/దుర్యోధనునికి సహాయం చేశాడని ఒక వాదం. అర్థవాది అయితే అంతటి సామ్రాజ్యాన్ని ఒక చిన్నమాటకోసం తృణీకరించడు. వయసు మళ్ళింది కాబట్టి ఆ వయసులో ఎటూ పోలేక దుర్యోధనుడి వద్ద ఉండిపోవడన్నది మరింత పేలవమైన వాదన. ఇచ్చామరణ వరం కలిగిన వాడు, లోకంలో అందరికీ ప్రియుడు అనేక రాజులవద్ద గౌరవం చూరగొన్న మహాత్మునికి అటువంటి సామాన్య కారణాలు ఆపాదించడం అల్పత్వం.

ఇలా భీష్ముని ప్రస్థానం కొనసాగి చివరకు మహాభారత యుద్ధం సంక్రమిస్తుంది. ఆ యుద్ధంలో భీష్ముడు తలుచుకుని ఉంటే మహాస్త్రాలు ప్రయోగించి పాండవులలో కనీసం ఒకరిద్దరిని మట్టుపెట్టి ఉండవచ్చు. కానీ అలా చేస్తేనూ ధర్మం తప్పుతుంది. తన కంటి యెదుట ఏ వైయక్తికధర్మం కోసం తను జీవితం అర్పణ చేశాడో, ఆ ధర్మం నశించి తను ప్రేక్షకపాత్ర వహించి చూస్తూ నిలబడవలసి వస్తుంది. తన కట్టెదుట రాజ్యత్యాగం చేసి, బ్రహ్మచారిగా మారి సత్యవతి పుత్రుల తాలూకు వంశజులు - ఒకరితో ఒకరు యుద్ధం చేసి అందులో కౌరవులు అందరూ మరణిస్తే భీష్ముడు నిర్వికారంగా చూస్తూ నిలబడవలసి వస్తుంది.
వ్యక్తి తన జీవితంలో ధర్మాధర్మాల సంఘర్షణను ఎంత తీవ్రంగా తట్టుకుని నిలబడినాడు అన్న దృక్కోణంతో భీష్ముని పాత్రను పరిశీలిస్తే అంతటి మహోన్నతమైన పాత్ర మరొకటి కనిపించదు. ఇంతటి అద్భుత వ్యక్తి కావ్యం (ఇతిహాసం) లో కేవలం ఒక పాత్రగా ఉన్నాడు కాబట్టి భారతం ఒక మహోన్నతమైన ఇతిహాసం.పంచమ వేదం. అనితర సాధ్యం.భీష్ముని వంటి ఉదాత్త పాత్రను సృజించిన  మహర్షి - సాక్షాద్విరించి వేదవ్యాసుడు.

అచతుర్వదనో బ్రహ్మా
ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభుః
భగవాన్ బాదరాయణః

...

(మహాభారత విమర్శనం - 2 పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచన చదివిన తర్వాత నాలో కలిగిన
ఆలోచనలివి.)

Sunday, October 17, 2010

ఖేలా - ఈ మధ్యకాలంలో నేను చూసిన Best Movie

The weakest relation among all human relations is, Wife-Husband relation. - OSho

భార్యాభర్తల సంబంధం గురించి వేల యేళ్ళుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా, కొత్తగా చెప్పడానికి ఏదో మూల ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది. భార్యాభర్తల సంబంధంలోని భిన్నత్వాన్ని, ఒకరికొకరిమధ్య అవగాహనారాహిత్యాన్ని హృద్యంగా ఆవిష్కరించిన చిత్రం రితుపర్ణఘోష్ దర్శకత్వం వహించిన ఖేలా.


రాజు భౌమిక్ ఓ సృజనాత్మక దర్శకుడు. అతడికి తన వృత్తే ప్రాణం, ఊపిరి, శ్వాస అన్నీనూ. తన సృజనాత్మకతకు భంగమని పిల్లలు కూడా వద్దనుకునే రకం. అతని భార్య షీలా ఓ సాధారణ గృహిణి. ఆమెకు తన సంసారం, భర్త అనురాగం, భర్త తనమీద అభిమానం చూపాలన్న ఆశ తప్ప మరొకవిషయం పట్టదు. వీరిద్దరి ఆరేళ్ళ కాపురం సాగిన తర్వాత, షీలా అతణ్ణి విడిచి వెళ్ళిపోతుంది.

రాజు భౌమిక్ తర్వాత తీయబోయే సినిమా రబీంద్రనాథ్ ఠాగోర్ వ్రాసిన ఒకానొక నవలిక కు సినిమా రూపమైన "నాలోక్". అందులో బాల బుద్ధుని పాత్రధారికి సరిపోయే పిల్లవాడికోసం తను వెతుకుతుంటాడు. ఓ పట్టాన అతడికి ఎవరూ నచ్చరు. ఓ రోజు నిర్మాత, తను ఆఫీసులో ఉండగా రోడ్డు మీద పానీపూరీ తింటున్న ఇద్దరు స్కూలు కుర్రాళ్ళను చూస్తాడు. అందులో ఒకబ్బాయిని నాలోక్ పాత్రకు నిశ్చయించి, వెంటనే ఆ అబ్బాయిల దగ్గరకు వెళతాడు. ఆ పిల్లవాడికి తనను సినిమా దర్శకుడిగా పరిచయం చేసుకుంటాడు. ఆ అబ్బాయితో బాటు వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నతో తన చిత్రంలో అబ్బాయిని రెణ్ణెళ్ళు నటింపజేయమని అభ్యర్థిస్తాడు. పిల్లవాడి చదువు పాడవుతుందని వారు ఒప్పుకోరు.

తర్వాతరోజు ఆఫీసులో ఉండగా రాజుకు ఆ అబ్బాయి, అభిరూప్ నుండి ఫోనొస్తుంది. తనను కిడ్నాప్ చేయమని ఆ అబ్బాయి రాజుకు సలహా ఇస్తాడు. రాజు ఆ సలహా ఆచరణలో పెడతాడు. ఈ కిడ్నాప్ నాటకం యూనిట్ లో మరెవరికీ తెలియదు. సినిమా షూటింగు మొదలవుతుంది. పిల్లవాడి బాధ్యత మొత్తం రాజుమీద పడుతుంది.

యూనిట్ లో అప్పుడే కాలేజీ చదువు ముగించిన ఓ అమ్మాయి డ్రెస్ డిజైనరుగా పనిచేస్తుంటుంది. ఆమెకు మొదటి సినిమా ఇది. ఆ అమ్మాయి అభిరూప్ ను చూసుకుంటూ, అల్లరి చేసినప్పుడు సముదాయిస్తూ ఉంటుంది. ఆమెకు, పిల్లవాడికి, రాజుకు అనుబంధం బలపడుతూంటుంది.

అభిరూప్ కు మొదటి రోజు షూటింగ్ లో గుండు కొట్టించగానే ఆ అబ్బాయి ఏడ్చి, మొండితనం చూపించి నానాహంగామా చేస్తాడు. ఇలా గుండు పాత్ర అయితే తను సినిమా ఒప్పుకుని ఉండేవాణ్ణి కాదంటాడు. అతణ్ణి ఎలానో చాక్లెట్లవీ ఇచ్చి బుజ్జగిస్తారు.

ఇక్కడ అభిరూప్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు సినిమా షూటింగ్ ను ట్రేస్ చేయడానికి మొదలెడతారు. వారికి దొరక్కుండా లొకేషన్ లు మారుస్తూ షూటింగు నడుపుతుంటాడు రాజు.

కొన్ని రోజులకు నిర్మాతకు కిడ్నాప్ విషయం తెలుస్తుంది. ఆ పిల్లవాణ్ణి తల్లిదండ్రులకు అప్పగించి ఇక షూటింగ్ చాలిద్దామంటాడతను. రాజు ఎలాగోలా బతిమాలి, బామాలి మరో రెండు రోజులు షూటింగ్ కొనసాగేలా చూస్తాడు.

ఇలా ఆ అబ్బాయితో రెణ్ణెళ్ళ అనుబంధం రాజుభౌమిక్ వ్యక్తిగత జీవితంలో ఏ మార్పు తీసుకు వచ్చింది? భార్యపట్ల తన దృక్పథం ఎలా మారింది అన్నది కథ.

ఈ సినిమాలో చెప్పుకోవలసినది కాస్టింగ్. రాజుభౌమిక్ పాత్రలో ప్రసేన్ జిత్ అనే బెంగాలీ నటుడు, షీలగా మనిషా కొయిరాలా, డ్రెస్ డిజైనర్ గా రైమాసేన్, పిల్లవాడిగా ఆకాష్ నీల్ ముఖర్జీ అనే అబ్బాయి చాలా సహజంగా నటించారు. రైమాసేన్ నటన ఒక revelation. పిల్లవాని పాత్ర - తారే జమీన్ పర్ లో పిల్లవాడి నటనను గుర్తు తెప్పిస్తుంది.

తర్వాత చెప్పుకోవలసింది స్క్రీన్ ప్లే, ఎడిటింగు. ఒక్క అనవసర సన్నివేశం కూడా లేని సినిమా ఇది. రాజు, షీలల మధ్య వచ్చే సన్నివేశాలు - షూటింగ్ మధ్యమధ్యలో రాజు భార్య గురించి ఆలోచిస్తూండగా ఫ్లాష్బ్యాక్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనిళ్ళలో జరిగే మామూలు సన్నివేశాల్లా ఉంటాయి.

ఇక ఫోటోగ్రఫీ - చాలా హుందాగా ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ ఇల్లయినా, డార్జీలింగ్ హిల్ స్టేషనయినా చాలా చక్కగా ఉంది. అనవసర అర్భాటాలు లేవు.

పాటలు మరీ అద్భుతంగా లేవు కానీ బావున్నాయి.

************************************************************

ఈ మధ్య కాలంలో ఇంతటి హృద్యమైన సినిమా నేను చూడలేదు. బహుశా ఈ దశాబ్దంలో నేను చూసిన అందమైన సినిమా ఇదేనేమో. ఈ సినిమాలో చిట్టచివరి సన్నివేశం - బహుశా రితుపర్ణఘోష్ తప్ప ఇంకెవరూ ఆ సన్నివేశాన్ని తీయలేరు!

మీగొట్టం (youtube) లంకె ఇది 

Eagle వారి DVD కూడా దొరుకుతోంది.

Sunday, August 1, 2010

మరియొక ఆంగ్ల చిత్రరాజము

ఆంగ్ల చిత్రమును జూచి అనేక దినములు గడచినవి. అందులకై ఇంచుక సేద దీరుటకై ఈ దినమున నొక్క ఆంగ్ల చిత్రరాజమును గంటిని. ఆ చిత్రరాజము యొక్క నామము inception.

చిత్రము చూచుచున్నంత సేపునూ, ఏదియోనొక్క ఊహాలోకమున మదీయమానససారసము విహరించుచునే యున్నది. ఏమని జెప్పవలె? అదియొక్క అద్భుత లోకము! అనితరసాధ్యమయిన ప్రపంచము! ఈ చిత్రమునకు కథ చెప్పుట అత్యంయ క్లిష్టతరమైనయట్టిది. అయిననూ నా శక్తికొలది ప్రయత్నింతును.

కథ:

ఈ కథలో ముఖ్యపాత్రధారి పేరు కోబు. ఈతని వద్ద కొందరు వ్యక్తులు పనిచేయుచుందురు. ఈ కోబ్ అనునాతడు ఓ పరికరము సహాయమున ఎదుటి వ్యక్తి మనమున కలలను కలుగజేసి, ఆ కలలో అతని మెదడున ఒక ఊహను స్థాపించి, ఆ ఊహ పరిణామమును తమకనుకూలముగా మలుచుకొనును. ఎంత క్లుప్తతమముగా జెప్పిననూ ఎంత జటిలముగానున్నదో గమనించితిరి కదా!

ఇక కలలు నిక్షిప్తపరుచుటకు కొన్ని నియమములు గలవు. కలలో తమ అనుభవములను పొందుపరుచరాదు. కలలో పదిగంటలు జరుగు ప్రక్రియ, చేతనా ప్రపంచమున పదినిముషములే గావచ్చును. కలమధ్యలో అధికముగా మెదడు శ్రమకు గురయినచో సదరు కలగనునాతని మెదడు విపత్కరమగు పరిస్థితిలో చిక్కుకొనును. తను ఉన్నది కలయందా కాదా అని ఎరుగుటకు, ఓ చిన్న సంజ్ఞాసూచకము అవసరమగును. కోబు తనవద్ద ఓ బొంగరమును సంజ్ఞాసూచకముగా వాడుచుండును.

ఈ బృందము జపాను దేశమందు ఒక వాణిజ్య ప్రముఖుని ప్రత్యర్థిని వశపర్చుకుని, తన ద్వారా, తన వ్యాపారమునే కూల్చుటకు ప్రేరేపించెడి లాగున ఓ పథకమునల్లుదురు. అందులో భాగముగా, కలలు సృష్టించుట, కలయందు మరియొక కల, అందు మరొకటి, ఇవ్విధముగా ఊహాప్రపంచమున గొనిపోవుదురు. 

మధ్యలో కోబు యొక్క భార్యామణి తారసపడును. ఆమె కలల ప్రపంచమునబడి తననుతాను పోగొట్టుకొనినయట్టి ఒక అభాగిని.

ఈ చిత్రరాజమునందు పోరాట దృశ్యములు శూన్యగురుత్వాకర్షణ యున్న యొక కల్పిత స్థలమున చిత్రీకరింపబడి ఉత్కంఠగొలుపును.

ఇక కొన్ని దృశ్యములలో ప్రపంచము మూసికొని పోవుట, ఊహాలోకమున అనేక భవనములు కంటి యెదురుగ ప్రత్యక్షమగుట వంటి ఉత్కంఠభరితమైన దృశ్యములు గలవు.

ఈ చిత్రరాజమును చూచుటకు మిక్కుటమైన ఏకాగ్రత అవసరము. అయిననూ ఓ రెండు గంటలపర్యంతము ఊహాలోకమున విహరించుట తథ్యము.

లియొనార్డో డీకాప్రియో నను ప్రముఖ నటుడు కోబు పాత్ర పోషించెను.

Wednesday, June 30, 2010

చరిత్రా? చట్టుబండలా?

చరిత్ర అంటే ఏమిటి?
ఊహాగానమా?
కొందరు పరిశోధకుల పొంతన లేని అభిప్రాయాలకు ఊతం ఇచ్చే సబ్జెక్టా?
కోర్టులోలా circumstantial evidence ఉంటే తప్ప పరిగణనలోకి తీసుకోజాలని ఓ వ్యాజ్యమా?
తమతమ అభిజాత్యాలకు ఆటపట్టుగా మార్చుకోవడానికి తేరగా దొరికిన ఓ అవకాశమా?
వ్యక్తి వ్యక్తికీ, కాలకాలానికి మారిపోతూ ఉండేదా?

ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. అందులో సొంత అభిప్రాయాలకు, అభిజాత్యాలకు తావు ఉండరాదు. అధ్యయనం వ్యక్తిగత పేరు ప్రతిష్టల సమరం కారాదు. అది జాతికి చేస్తున్న సహాయం కానేరదు.

విమర్శ అనే ప్రక్రియకర్థం తెగడటం కాదు, పరిశీలించటం, నిష్పాక్షికంగా ఆధారాలను సేకరించటం, ఆధారాలను బట్టి సమన్వయం సాధించటం విమర్శ. సమన్వయం కుదరని పక్షంలో ఊహాగానాలకు చోటివ్వక, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఉంచి, తరువాతి తరానికి ఆ విషయాలను పరిశీలించడానికి సహాయం కల్పించటం కూడా సద్విమర్శలో భాగమే. చరిత్ర అన్నది ఒక శాస్త్రం కాదు. శాస్త్రానికి అధారం విశ్లేషణ. కళకు ఆధారం సంశ్లేషణ. శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అంటే, కంటికి కనిపించే ప్రత్యక్ష ఋజువులకోసం పాకులాట అనేది సంకుచితమైన అర్థం. 

చరిత్రాధ్యయనం ఒక కళ. ప్రాంతీయ సాహిత్యానికి, వారి దైనందిన జీవితంలో అంతర్భాగమైన అలవాట్లకు, వారి సంస్కృతి మూలాలకు, సాంప్రదాయ విషయాలకు సమన్వయం సాధించగలిగడం ఈ ప్రక్రియలో భాగం.ఇందులో పొఱబాట్లకు తావులేదు. సహానుభూతి అభిప్రాయాలకు పరిమితం కావాలి, ప్రమాణాలకు కాదు. అభిప్రాయాలకు అందరికీ అవకాశం ఉంది. అయితే అభిప్రాయం ప్రమాణం చేసే ప్రయత్నం నిర్ద్వంద్వంగా ఖండించదగింది. దురదృష్టవశాత్తూ, ఆంగ్లేయులచేత ఈ రోజు పాఠ్యాంశాలలో చేర్చబడి విద్యార్థులు చదువుతున్న భారతదేశ చరిత్ర చాలావరకు ఊహాజనితం. ఒక ఊహ నిజంగా మలచబడి, దానిపై మరొక కల్పన సృష్టింపబడి, మరిన్ని ఊహాగానాల అల్లిక,వాటికి ఋజువుల వెతుకులాట.. ఇలా చెల్లాచెదరై ఉంది.మనం చదువుకునే మన దేశచరిత్ర మొత్తం అస్తవ్యస్తం, అకటావికటం.

ఉదాహరణ: హిందువులు సాధారణంగా వాడే పంచాంగంలో ఉటంకింపబడే శాలివాహన శకం ప్రకారం ఈ యేడు 1932 వ వర్షం. యే శకమైనా ఎలా మొదలవుతుంది? ఓ మహాత్ముడితోనో, మహానుభావుడి పేరు మీదో, ఏదైనా గొప్ప సంఘటన వలనో మొదలవాలి. కలిశకం, యుధిష్టిర శకం, విక్రమ శకం, క్రీస్తు శకం ఇవన్నీ దానికి ఉదాహరణాలు. అలా శాలివాహన శకం క్రీ.శ. 78 నుండి మొదలయింది. వేల యేళ్ళుగా ఆనవాయితీగా, పంచాంగ రూపకర్తలు దీనిని ఉటంకిస్తూ వస్తున్నారు. శాలివాహన మహారాజు గురించి భారతీయ లౌకిక సాహిత్యంలో కథలున్నవి. ఎంతో ఎందుకు? ప్రాకృతభాషలో గాథాసప్తశతి - శాలివాహన సంకలితం ఉన్నది.  కాగా, శాలివాహనుడనే రాజు లేనే లేడని, ఎక్కడినుండో వచ్చిన కుషాణ వంశపు కనిష్కుడనే రాజు పుట్టుక ఆధారంగా ఈ శకం మొదలయ్యిందని కొందరు ఆంగ్లపండితుల ఊహ. పురాణాలన్నీ పుక్కిటివయ్యాయి. ఊహాగానాలు నిజమయి కూర్చున్నాయి. ఊహ చరిత్ర గా మారింది. మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కింది. ఎవరో చేసిన ఊహాగానం చరిత్ర పేరిట మనం చదువుకుంటున్నాము. అగ్ని వంశపు రాజుల గురించి చెప్పిన మత్స్య, అగ్నిపురాణాది అనేక పురాణాలు, వేలయేళ్ళుగా వచ్చే సంప్రదాయం, లౌకిక సాహిత్యం, ప్రతీ రోజు చేసే సంధ్యావందనంలోనూ, హిందువనే ప్రతివాడు ఏదో ఒక సందర్భంలో పూజలో సంకల్పం చెప్పుకునే వరుసలో వచ్చే "శాలివాహకే..హరిహర గురుసన్నిధౌ, అస్మిన్ వర్తమానే..." వరుసా, ఇవన్నీ ప్రమాణాలుగా తోసివేయబడ్డాయి!

ఇక మహాభారతం విషయానికి వద్దాం.

కలియుగం ఫిబ్రవరి 20, 3102 B.C, 2-27'-30''గంటలకు,మొదలయ్యిందని ప్రపంచ వ్యాప్తంగా, ఇండాలజిస్టులు ఒప్పుకున్న విషయం. మహాభారతంలో స్త్రీపర్వం, అనుశాసనిక పర్వం,మహాప్రస్థానిక పర్వాది కొన్ని పర్వాలలో శ్రీకృష్ణుని మరణం, పరీక్షిత్తు జననం, కలియుగాగమనం ఒకేసారి జరుగుతాయని ఉటంకించబడి ఉన్నది. గాంధారి కృష్ణునికి శాపం ఇస్తూ, సరిగ్గా 36 యేళ్ళకు యాదవకులంలో ముసలంపుట్టి వంశనాశనం జరుగుతుందని చెబుతుంది.అంటే, భారతయుద్ధకాలం క్రీ.పూ. 3138. అంటే భారత కాలం అంతకుముందే కావాలి. దేవీభాగవతం, ఇంకా కొన్ని పురాణాలలోనూ ఒకేవిధమైన సమయం ఉటంకింపబడి మహాభారత కాలానికి సమన్వయం కుదురుతున్నది. కాగా, మహాభారత సమయం క్రీ.పూ. 1200 కు మించదని, ఎందువల్లనంటే iron age అప్పుడే మొదలయ్యిందని కొందరి ఊహ అయితే, జాకోబీ, వెబర్,మాక్డోవెల్ పండితుల ప్రకారం మహాభారతం క్రీ.పూ.మూడవ శతాబ్దానికి చెందినది. వీరి ఊహకు కల్పించిన ఆధారం అలెక్జాండరు దండయాత్ర క్రీ.పూ.మూడవ శతాబ్దంలో జరిగింది. భారతంలో యవన శబ్దం ఉంది కాబట్టి, భారతం ఆ సమయంలోనే జరిగిందన్న వాదన! మరి రామాయణంలోనూ యవన శబ్దం ఉంది కదా అంటే, అది ప్రక్షిప్తం అనేశారు. సరే, అలెక్జాండర్ కంటే ముందే డేరియస్ అనే గ్రీకు రాజు ఉత్తరభారతానికి వచ్చినట్టు ఓ చరిత్రకారుడు వ్రాశాడు కదా, క్రీ.పూ.ఏడవ శతాబ్దంలో శకటాయనుడు కూడా ఆ శబ్దం ఉపయోగించాడు కదా అన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. భారత కాలం స్పష్టంగా నిర్ణయించడానికి, ఋజువులు దొరకలేదని ఘోషణ! అంతర్గత ఋజువులు (internal evidences) దొరికినప్పుడు వాటిని వీలయినంత పక్కన పెట్టటం, లేదా వక్రీకరించటం జరిగింది.

శంకరాచార్యుల కాలం గురించి కూడా, ఆయనచేత స్థాపించబడ్డ పీఠాలలో దృష్టాంతాలు వెతక్కుండా, ఏదో తలాతోకా లేని శ్లోకం ద్వారా ఊహించి,దాన్నే ప్రమాణం చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నాలు జరిగాయి.చేశారు కూడాను. ఇప్పుడు జనశ్రుతి ప్రకారం, క్రీ.పూ. జన్మించిన శంకరుడు క్రీ.శ. పదకొండవ శతాబ్దపు వ్యక్తి!!

మహాభారత కాలం గురించి, బుద్ధుడి కాలం గురించి, ఇంకా అగ్నివంశపు రాజుల గురించి, జంబూద్వీపం అంటే ఏమిటి? భరతవర్షం, భరతఖండం, తెలుగువారెవ్వరు, ఆర్యులెవ్వరు తదితర విషయాలపై కీ.శే.కోట వెంకటాచలం గారు కొన్ని గ్రంథాలు వ్రాశారు. మహాభారతంలోని సమయ సంబంధిత శ్లోకాలను అర్థసహితం తెలుపటమే కాక, ప్రత్యక్ష జ్యోతిష్య ప్రమాణాలను, సప్తర్షిమండలం ఏ రాశిలో ఉన్నది వంటి అనేక విషయాలను కూలంకషంగా ఆయన చర్చించారు. ఇంకా ఆంగ్ల చారిత్రకులు గ్రీకు గ్రంథాలలో ఉటంకింపబడ్డ జాండ్రేమ్సు,శాండ్రొకొట్టసు,శాండ్రోసిప్టసు ఎవరు? మౌర్యులకాలం ఎప్పటిది? వాటి ఆధారంగా నిర్ణయింపబడ్డ పొఱబాట్లను, ఆంగ్లచారిత్రకుల ఉటంకింపుల ద్వారనే ఆయన వెలికి తీసి ఋజువులు చూపించారు.

ఆర్య, ద్రవిడ సిద్ధాంతాలు వంటివి colonial consciousness కు ప్రతీకలుగా ఋజువులు దొరుకుతున్న ఈ రోజుల్లో ఓ సాధారణ పండితుడు వ్రాసిన గ్రంథాలు ఆయా ఋజువులకు దగ్గరగా ఉండటం పరిశీలించదగింది. ఇవి కొన్ని తెలుగులో ఉన్నవి. మహాభారతం, బుద్ధుడి కాలం గురించిన గ్రంథాలు ఆంగ్లంలోనూ DLI లో దొరుకుతున్నవి.భారతదేశ చరిత్ర మీద ఆసక్తి, ఇష్టం ఉన్నవారు తప్పక చదవవలసిన విషయాలివి.నిజమైన చరిత్ర బయటపడుతూ, అర్థం లేని సిద్ధాంతాలు ఊహాజనితమని ఋజువవుతున్న ఈ రోజుల్లో భారతదేశంలోని మారుమూల ఓ పండితుడు వ్రాసిన గ్రంథాలు నిజమైన చరిత్రకు దగ్గరగా ఉండటం గమనార్హం.

- అగ్నివంశపు రాజులు
- ఆంధ్రులెవరు?
- కలిశకవిజ్ఞానం
- Time of mahabhaarata
- Buddha's time
కోట వెంకటాచలం 
- సంస్కృత సారస్వత చరిత్ర