Showing posts with label నివాళి. Show all posts
Showing posts with label నివాళి. Show all posts

Saturday, April 28, 2012

అమృతత్వం నుంచీ అమృతత్వం లోకి...


కృష్ణ పారుతోంది.. గునగున నడిచే చిన్ని పాపాయి గజ్జెల సవ్వడిలా బుడిబుడి ధ్వానాలతో..
కృష్ణ పారుతోంది..శ్రీకృష్ణుని మురళీనాదంలా ప్రకృతిని మైమరపిస్తూ ..
కృష్ణ పారుతోంది..తనలోని ప్రాణశక్తిని ఘనీభవింపజేసి సస్యరాశులకందిస్తూ.,
కృష్ణ పారుతోంది..తనలోని స్వచ్ఛమైన ప్రేమను రంగరించి పచ్చని పంటచేల చీరను భూమితల్లికి చుట్టబెడుతూ..
కృష్ణ పారుతోంది.. జలబిందువుల ఇంద్రనీలాలరాశులను దొరలిస్తూ.. తుళ్ళుతూ..తనలోంచి తనలోకి..చల్లగా.. మెల్లగా .. అమ్మలా .. కమ్మగా.. నవ్వుతూ..

ఆ పక్కనున్న బ్రిడ్జి కావతల ఎవరో రాజు తన శత్రువుల నుండి తప్పుకుందుకు కాబోలు నది మధ్యలో గుట్టమీద ఇల్లు అనబడే కోట కట్టుకున్నాడు. ఆయన ఖాళీ చేసివెళ్ళిపోయినా, కృష్ణ తాలూకు నల్లని నలుపును గోడలమీద ప్రతిఫలింపజేస్తూ, ’టులెట్’ బోర్డు పెట్టినా ఎవరూ ముట్టుకోని దశలో ఆయన ఇల్లు అలాగే ఉంది.

బ్రిడ్జికి ఇటువైపు విశాలమైన స్నానఘట్టాలు, అందులో స్నానాదికాలు చేస్తున్న మనుషులు, దూరంగా చిన్నపిల్లల గుంపు నీళ్ళల్లో ఈదులాడుతూ తుళ్ళుతూ కేరింతలు.. ఒడ్డున విగ్రహాలు, చిన్న చిన్న అంగళ్ళూ, తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, తనలోకి అడుగుపెట్టిన వారి మాలిన్యాన్ని కడిగేస్తూ, మనసును తేటపరుస్తూ గలగలలాడుతోంది.

నది - 

ధ్యానానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో! అందుచేతనే హెర్మన్ హెస్సే సిద్ధార్థుడు జీవిత చరమాంకంలో నదిలో పడవ నడుపుతూ, నదితో ఊసులాడుతూ, బౌద్ధిక జ్ఞానానికతీతమైన పూర్ణ(శూన్య)త్వాన్ని ఆవిష్కరించుకుంటాడు.

You cannot step in to the same river twice - అని హెరాక్లిటస్.
అవును.
నది బయటకు కనిపించే ఒక నిశ్చలత్వం.
అంతర్గతంగా ఒక అనిశ్చల ప్రవాహం.
మొత్తంగా నిశ్చలమూ, అనిశ్చలమూ రెంటికీ అతీతం.
అంటే నిశ్చలమూ, అనిశ్చలమూ రెండూ కానిది కూడానూ.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే । తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||

నది ఒక పూర్ణత్వమూ, నది ఒక శూన్యత్వమూ కూడానూ.

ఆ పూర్ణత్వాన్నేనేమో వేద ఋషి ఇలా ఘోషిస్తాడు.

ఆపోవా ఇదగుం సర్వమ్ ,విశ్వాభూతాని ఆపః, ప్రాణావాపః, పశవ ఆపః, అన్నమాపః, అమృతమాపః, సమ్రాడాపః, విరాడాపః, ఛందాగుంసి ఆపః, భూర్భువస్సువరాప ఓమ్...

జగత్తులో సర్వమూ జలమే. ప్రాణము నీరే, పశువులు నీరే, అన్నమూ నీరే, అముతమూ నీరే, సార్వభౌముడు నీరే, బ్రహ్మస్వరూపమూ నీరే, ముల్లోకాల్లో సర్వమూ నీరే....

నది ఒక సౌందర్యం.

నది ప్రాణం, బీజమూ, మరణమూ, అమృతమూ, అమృతత్వమూనూ.

ఎవరో తమ అయినవాళ్ళ చితాభస్మాన్ని నిమజ్జనం చేస్తున్నారు. ఆ పక్కనే ఒడ్డున వారగా తామర పూల మొక్కలు, నీటిలో తేలుతూ ఉన్నై. ఆ మరణం తాలూకు చిహ్నమైన చితాభస్మం కృష్ణ ప్రవాహం ద్వారా చైతన్యం పుంజుకుని ఒక తామరపూవుకు జన్మనిస్తుందేమో!

అలాంటి ఒక అమ్మ ప్రాణం అనే జీవచైతన్యపు ప్రవాహం పంచభూతాలలో ఒకటైన నీటిలో (కృష్ణలో) నిమజ్జనమై ఆ తర్వాత కొన్నేళ్ళకు మరొక తమ్మిపూవంటి ’అమ్మలు’గా మా ఇంట్లో జన్మించింది!

సృష్టి అనంతం - కృష్ణ ప్రవాహం లాగే.

ఈ ప్రవాహం -

అమృతత్వం నుంచి అమృతత్వం లోకి...

Monday, April 2, 2012

సింగనమల - శ్రీరంగరాయలు

అనంతపురంజిల్లా కేంద్రమయిన అనంతపురం పట్టణం నుండి తాడిపత్రి పట్టణం వైపు వెల్లే త్రోవలో సింగనమల గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కన ఒక కొండ. అసలా కొండవల్లనే ఆ ఊరికా పేరు. అది "శృంగుని మల" - అంటే ఋష్యశృంగుడు తపస్సు చేసిన కొండ అట. ఇప్పుడది సింగనమల. ఆ ఊరిలో ఒక అందమైన చెఱువు కూడా ఉంది. ఆ చెఱువు పేరు - శ్రీరంగరాయల చెఱువు. ఆ శ్రీరంగరాయల గురించి తెలియాలంటే - ’చనిననాళుల తెలుగుకత్తులు సానబెట్టిన బండ మా పెనుగొండ కొండ’ గురించి, ఆరవీటి రామరాజు తర్వాత విజయనగర సామ్రాజ్యం గురించి తెలియాలి.

కృష్ణరాయల తర్వాత అచ్యుతరాయలు, ఆ తర్వాత సదాశివరాయలు, అతణ్ణి నామమాత్రంగా చేసి ఆర్వీటి రామరాజు (అళియ రామరాజు) వచ్చారని ఇదివరకు చెప్పుకున్నాము.

అళియరామరాజు రాజ్యానికి ఎలా వచ్చినప్పటికీ సమర్థుడు. ఆయనకే రామరాజభూషణుడనే కవి ’వసుచరిత్ర’ ను అంకితమిచ్చాడు. ఆ రాజు చేసిన ఏకైక తప్పిదం అదిల్షాను నమ్మి, ఆదరించడం. ఆ పొఱబాటు రాక్షస తంగడి అనే ఘోరయుద్ధానికి దారి తీసింది. ఆ యుద్ధంలో అటువైపు నిజాం షా (అహ్మదు నగరం), అతని అల్లుళ్ళు అదిల్షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయితే ఇటువైపు రామరాజు, అతని తమ్ముళ్ళు తిరుమల రాయలు, వెంకటపతి రాయలు. యుద్ధంలో తిరుమల రాయలు, వెంకటపతిరాయలు ముందంజలోనే ఉన్నారు. కానీ వృద్ధుడైన రామరాజు యేనుగు నుండి క్రిందపడి శత్రువులకు చిక్కి శత్రువుల కత్తికెర కావడంతో ఇటువైపు సైన్యాలు పారిపోజొచ్చినాయి. ఎలాగైతేనేం - చివరికి విజయం తురుష్కుల వైపుకు మొగ్గింది.

***********************************************************************************************************

రాక్షస తంగడి యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యప్రాభవం నశించిందని పాశ్చాత్యులు వ్రాశారు. ఇందులో అర్థం లేదని కొన్ని శాసనాల వల్ల, మరికొన్ని కావ్యాల వల్లా, ఇతర ఋజువుల వల్లా తెలుస్తుంది. (మల్లంపల్లి సోమశేఖరశర్మ గారూ ఈ మాట ధృవపరుస్తున్నారు) యుద్ధంలో ఓడిన తర్వాత రామరాజు తమ్ముడు తిరుమల రాయలు విజయనగర రాజుల చలువరాజధాని - ఘనగిరి అనబడే పెనుగొండకు వచ్చాడు. పాడుబడిన కోటలను, అగడ్తలను, బురుజులను దండనాయకుడు సవరము చెన్నప్పనాయకుడి సహాయంతో సరిచేసుకున్నాడు. అలా రాజ్యాన్ని తిరిగి స్థాపించినాడు. (తిరుమల రాయలు తిరుపతికి పారిపోయాడని హెరాసు వ్రాశాడుట. అది చరిత్ర వక్రీకరణ)

కం ||
ఆరామ శౌరి పిమ్మట
ధీరామరశాఖవీర తిరుమల రాయం
డారాసేతు హిమవ
త్మారామారమణుడై జగంబు భరించెన్ (౧-౫౪) - వసుచరిత్ర

ఇటువైపు విద్యానగరాన్ని ఆరునెలలు ఓవర్ డ్యూటీ చేసి కొల్లగొట్టిన నవాబులు తిరుమల రాయలను ఉపేక్షించలేదు. అతడు రాజ్యం తీసుకున్న కొన్ని రోజులకే క్షయనామసంవత్సరం (క్రీ.శ. 1566) పుష్యమాసంలో కేసర్ ఖాన్ అనే వాడిచేత దండయాత్ర జరిపించారు. ఆ యుద్ధంలో కేసర్ ఖాన్ ఓడిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. తర్వాత నూరు ఖాన్ అనే సైన్యాధికారి విభవ నామ సంవత్సరంలో తిరిగి దండయాత్ర చేశాడు. అతనికీ అదే గతి పట్టింది. ఆ తర్వాత అదిల్షా తనే స్వయంగా వచ్చాడు. అతడూ ఓడిపోయాడు. ఈ మూడు యుద్ధాల వెనుక తిరుమల రాయలకు అండగా నిలిచిన యోధుడు సవరము చెన్నప్పనాయకుడు. (ఈ విషయాలు పెనుగొండ ఉత్తరద్వారం దగ్గర ఆంజనేయస్వామి దేవళం దక్షిణ గోడపై చెక్కి ఉండేవట. నేడు శిథిలమైనట్టు కనబడుతూంది)

తిరుమల రాయడు రాక్షసతంగడి యుద్ధంలో ఒకకన్ను పోగొట్టుకున్నాడని ఒక చాటువు (అన్నాతి గూడిహరుడయి...) ద్వారా తెలుస్తూంది.

తురుష్కుల చతురంగబలాలు నిర్మూలించబడి, పెనుగొండ కొండలు ఎలా కనిపిస్తున్నాయని, నాటి భట్టుమూర్తి, నేటి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్ముల వారూ ఇలా చెబుతున్నారు.

భట్టు మూర్తి వారు:
తిరుమలరాయశేఖరుని ధీరచమూభటరాజి యాజి భీ
కర యవనేశ్వరప్రహిత ఖాన బలంబులఁ జక్కు సేయ ని
ద్ధరఁ బెనుగొండ కొండలు మదద్విపచర్మ కపాలమాలికా
పరికరభూషితంబులయి బల్విడిగాంచె గిరీశభావమున్.

(తిరుమల రాయని సైన్యాలు తురుష్కుల చతురంగబలాలను తుక్కు చేస్తే, శత్రుసైనికుల తాలూకు మదించిన యేనుగుల చర్మాలు, కపాలమాలికలతో పరివృతమయ్యి గుట్టలు గుట్టలుగా పేరుకొని పెనుగొండ కొండలయాయిట.)

అనంతకృష్ణ శర్మ గారు:

చనిననాళుల తెలుగుకత్తులు
సానబెట్టిన బండ మా పెనుగొండ కొండ.

రంధ్రముల ప్రహరించు శత్రుల
రక్తధారలు త్రావిత్రేచిన
ఆంధ్రకన్నడ రాజ్యలక్ష్ముల
కరతి నీలపుదండ మా పెనుగొండ కొండ.

వెఱపులెఱుగని బిరుదు నడకల
విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుగట్టిన
పచ్చినెత్తురుకండ మా పెనుగొండ కొండ.

తిరుమలేంద్రుని కీర్తి తేనెలు
బెరసిదించిన కాపుకవనపు
నిరడద్రాక్షారసంబులు
నిండి తొలికెడు కుండ మా పెనుగొండ కొండ.

చివర్లో తిరుమలేంద్రుని కీర్తి తేనెలు అంటే తిరుమల రాయలవి కావచ్చునని నా ఊహ. ఈ పాటను రాళ్ళపల్లి వారి స్వహస్తాలతో చూడాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

***********************************************************************************************************

తిరుమల రాయలు ఎంతోకాలం రాజ్యం చేయలేదు. అతని తర్వాత అతని రెండవకొడుకు శ్రీరంగరాయలను పట్టాభిషిక్తుని చేసినాడు. మొదటి కొడుకు రఘునాథరాయలు యోగ్యుడు. అయితే అతని మీద సదాశివరాయలను చంపాడనే ఒక అభియోగం ఉంది. (సదాశివరాయలు ఎవరో క్రితం వ్యాసం నుండి తెలుసుకోవచ్చు). అందుచేత శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చాడు.

హరిపద భక్తశీలుడగు నా రఘునాథ నృపాలు కూర్మి సో
దరుడు సిరంగరాయవసుధావరు డాత్మగుణప్రమోదవ
త్తిరుమల రాయశేఖరవితీర్ణ మహాయువరాజపట్ట బం
ధురుడయి సర్వభూభవన ధూర్వహశక్తివహించునెంతయున్.

ఈ రంగరాయలు తండ్రికంటే శౌర్యం చూపించినాడు. ఈయన కాలంలో గోలకొండ నవాబులు రెండు సార్లు దండయాత్ర చేస్తే రెండు సార్లూ తిప్పికొట్టటమే కాక, కుతుబ్షా యేలుబడిలో ఉన్న కొండవీడు వినుకొండ దుర్గాలను సాధించినాడు.

"....శ్రీరంగరాయ శ్శ్రితభాగధేయః
ఉద్ధగిరౌస్థితః పరివిచిత్య చ దుర్జయాన్
దుర్గమకొండ వీడు వినుకొండ పురప్రముఖాన్
భూవలయకరత్న పెనుగొండపురే నివసన్
రాజతియః సమకరాది లాంఛనత" (ఎపిగ్రాఫికా కర్ణాటికా)

ఇదంతా గతించిన చరిత్ర కావచ్చు.  ఆ గోల్కొండ నవాబులను తిరుమల రాయలు, రంగరాయలు తిప్పికొట్టకపోయి ఉంటే? వాళ్ళ ప్రాభవం పెరిగి  ఆంధ్రదేశం, దక్షిణదేశమంతా తురుష్కుల యేలుబడిలోకి వచ్చి ఉంటే? వారి ప్రాభవం అప్పటితో మొదలై, నిజాముతో బలపడి ఉంటే? ఈ ప్రశ్నలకు సమాధానం చరిత్ర చెబుతుంది.

ఈ శ్రీరంగరాయలు శృంగునిమల దగ్గర పెనుగొండకోటకు ప్రత్యామ్నాయంగా మరో దుర్గాన్ని నిర్మించుకొన్నాడు. ఆతని దుర్గం ఉన్న కొండ ’మహల్ కొండ’ - నేటి మాలకొండ. కొంతదూరంలో తటాకము త్రవ్వించుకున్నాడు. అదే శ్రీరంగరాయల చెఱువు. ఈయన అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి విడిది చేసేవాడట. ఈయన ఇక్కడ విడిది చేసినప్పుడూ తురుష్కులు దాడి చేస్తే వారిని అప్పుడూ పారద్రోలాడట.

నాడు శ్రీరంగరాయలు తవ్వించిన చెఱువు నేడూ జనాల దాహార్తిని తీరుస్తోంది. పంటలకూ నీరందిస్తూ ఉంది. ఒకప్పటి ఆ ’జీర్ణకర్ణాట పునర్జీవసుండగు రమ్యగుణశాలి శ్రీరంగరాయ మౌళి’ - నేడు రంగరాయల చెఱువు తూముదగ్గర విరిగి, అరిగి, కరిగి పోయిన జీర్ణ శిథిలాలలో దాగి ఉన్నాడు. ఆయన అందించిన స్ఫూర్తి మాత్రం ఈ తెలుగునాటిసీమ కోలుపోదు.

Thursday, July 15, 2010

జ్ఞానార్జన

ఆచార్యాత్ పదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా |
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ ||

గురువు నుండి ఒక పాలు, స్వమేధతో ఒక పాలు, ఇతరుల వల్ల ఒకపాలు, కాలక్రమేణా ఒక పాలు. శిష్యుడు ఈ విధంగా జ్ఞానం స్వీకరిస్తాడు.

***********************************************************

ఓ వారం పది రోజుల క్రితం తమ్మి (రెండేళ్ళకు ఓ నెల తక్కువ వయసున్న మా పాప) పలక, చాక్ పీసు పట్టుకుని దగ్గరకొచ్చింది. తను అలా నా దగ్గరకు రావడం, నేను గుర్రం బొమ్మ వేస్తే చూసి గాడిదని, ఏనుగేస్తే పందని అనడం మామూలే. నేను రూటు మార్చి పందులు, కుక్కల బొమ్మలెయ్య్డడం అనే అడ్వాన్సు స్టేజు కూడా వచ్చింది. అయితే ఈ రోజు తను వచ్చింది వేరే విషయమై.

"ఏం చేత్తున్నావు?" అడిగేను పాపను.
"ఏ రాతినా" అంటూ పలక చూపించింది. అవును పలక మీద అది "A" రాసింది.
మొదట ఆశ్చర్యమేసింది.
"ఏదీ, మళ్లీ రాయి" అడిగాను.
"తలే" అని A ఎడమవైపు కొస నుండి మొదలెట్టి, పైకి తీసుకెళ్ళి, అట్నుంచి కిందికి తీసుకొచ్చి, అడ్డగీత కంటికి కనిపించనంత వేగంతో గీసింది. (షాడో అలంకారం)

ఎలా నేర్చుకుందబ్బా ఆలోచించాను. అర్థమయింది. మా ఆవిడ పిన్నిగారు పిల్లలకు ట్యూషన్ చెబుతుంటారు. ఆ పిల్లల దగ్గర చేరి వెలగబెట్టిన నిర్వాకం ఇది. సో, పైన శ్లోకంలో మొదటి పాదం (గురువు నుండి నేర్చుట) బైపాస్ అయిపోయి మూడవపాదంలోకి (ఇతరులనుండి నేర్చుట) అడుగుపెట్టింది.

మా పాప మొదటి సారి "అమ్మ" అనే ప్రయత్నం చేసినప్పుడు -
Baby joy
Baby joy.mp4
Hosted by eSnips


మొదటిసారి గోడవారగా నుంచున్నప్పుడు -


మొదటిసారి చెంగావి రంగు చీర కట్టినప్పుడు

మొదటి సారి పాక్కుంటూ  ఇంటి వరండా దాటిన సందర్భంలో ఇంట్లో కుడుములు చేసినప్పుడు -
మొదటి సారి కుర్చీ ఎక్కడం నేర్చుకున్నప్పుడు -
మొదటి సారి నడిచినప్పుడు -
మొదటి సారి ’నాన్న" అన్నప్పుడు -

ఏదో లోకంలో ఉన్నట్టు బానే గడిచింది కానీ పలక మీద A రాయడం మొదట్లో బానే అనిపించినా తర్వాత "అ" రాయకుండానే A రాయడం కొంత మింగుడుపడలేదు. అయితే ఎవరూ నేర్పించకుండా తనే నేర్చుకుంది కాబట్టి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అయితే "తెలుగు", మాతృభాష, ఇంకాస్త గీర్వాణ భాష ఫీలింగులు ఉన్న నేను పాప విషయంలో ఓ హిపోక్రైట్ గా మారే రోజు దగ్గరలో ఉందని చూచాయగా అనిపిస్తోంది.

***********************************************************

సమయం వచ్చింది కాబట్టి నాకు అక్షరాలు నేర్పించిన గురువును కూడా స్మరిస్తాను. నాకు "అ" దిద్దించిన అయ్యవారి పేరు శంకరయ్య గారు. మా అమ్మా నాన్నా, నన్ను బడిలో "వేయ"డానికి యమ యాతన పడ్డారుట. బలవంతంగా ఆయనకు ఒప్పగించారుట. బడిలో పెద్దబెల్లు కొట్టేవరకూ ఇంటికి రావద్దంటే, కాసేపటికే పరిగెత్తుకొచ్చానట. "ఏరా ఇంతలోపే వచ్చావు" అనడిగితే, "ఆ శంకరయ్య, బెల్లే కొట్టి ఛావడు, అందుకని నేనే వచ్చేశా" అని చెప్పానట. బడిలో బెల్లు కొట్టే గుమాస్తా పేరు కూడా శంకరయ్యే.

ప్యూను శంకరయ్య ఏవో కారణాల వల్ల స్కూలు ఉద్యోగం మానేసి, ఓ సైకిలు షాపు, సోడాల షాపు నడుపుకుని కొన్నేళ్ళ క్రితం చనిపోయాడు.

శంకరయ్య మాస్టారు గురించి. ఆయన లింగాయతులు. మాట కర్కశం. మనసు వెన్న. ఆయన కోదండం వేస్తానని బెదిరించడం నాకు బాగా జ్ఞాపకం. ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకూ ఒకే స్కూల్లో చదివి, వీడుతున్నప్పుడు చివరగా ఆయన్ను కలిశాను. తను పెంచిన మొక్క సొంతంగా ఎదుగుతుందన్నట్టుగా ఆయన చూపు. అదే నాకు దొరికిన ఆఖరు చూపు కూడాను. కొన్నేళ్ళ తర్వాత ఆయన చాక్ పీసుల తాలూకు ధూళి ఊపిరితిత్తుల్లో చేరుకుని, శ్వాస తీసుకోవడం కష్టమై స్వర్గస్తులయ్యారు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చివరి అబ్బాయి పేరు కూడా రవి. వాళ్ళు అందరూ బానే ఉన్నారని విన్నాను.

***********************************************************

మళ్ళీ శ్లోకానికి. శ్లోకం కాస్త పరిశీలిస్తే నాకో విషయం అనిపిస్తున్నది. స్వమేధతోనూ, కాలక్రమేణా ఒకరి బుద్ధి వికసిస్తుంది. గురువు వల్ల, ఇతరులను చూసి హృదయం వికసించాలి. అప్పుడే చదువు సంపూర్ణమవుతుంది అని నేను భావిస్తాను.

Tuesday, July 6, 2010

చెఱువు

నా వయసు 700 యేళ్ళ పైమాటే.  ఆ కాలంలో అక్క, బుక్కలనే ఇద్దరన్నదమ్ములు శృంగేరీ స్వాముల వారి సహాయంతో ఈ నేలలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్ప్తాటు చేశారు. ఆ అక్క, బుక్కలలో చిన్నతను బుక్కరాయలు మా నాయన. మా అమ్మ పేరు అనంతమ్మ. నా పేరేమిటో తెలీదు కానీ, మా నాన్నపేరు (బుక్కరాయసముద్రం)తోనే నన్నూ పిలుస్తారు. మా పెదనాయన, చిన్నాయన నా లాంటి ఎందరికో జన్మనిచ్చారు. మా తాతయ్య పడమటి దిక్కునేలే మారాజు (వరుణుడు). న్యాయం ధర్మం సక్రమంగా నడిచే ఆ రోజుల్లో తాత నన్ను చూట్టానికి నెలకు మూడు సార్లు దిగివచ్చేవాడు. తాతయ్య మాట ఎంత గంభీరమో మనసంత చల్లన. ఆయనంటే పిల్లలకు చాలా ఇష్టం. ఆయన వచ్చి నన్ను పలుకరించి వెళ్ళగానే మనసు నిండిపోయేది.

మా అమ్మా, నాయనా గుర్తొస్తే, నాకో పాఠం గుర్తొస్తుంది.

"శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః |
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్ ||"

అంటే - కోటి గ్రంథాలలో చెప్పేమాట అర్ధ శ్లోకంలో చెబుతాను. పరోపకారం పుణ్యానికి, పరపీడన పాపానికి. అని అర్థం. ఆయన నేర్పిన ఈ సూక్తిని నా మనఃసాక్షిగా పాటిస్తున్నాను.

నేను కాస్త పెరిగి పెద్దవాడవుతుండగా, క్రమంగా నా చుట్టూ ఓ జనపదం ఏర్పడ సాగింది. ఆ జనపదాన్ని నా పేరుతోనే పిలిచే వారు. కొంత దూరంలో మా అమ్మ పేరుతో అనంతమ్మపురం అని ఓ పట్టణం నెలకొంది. అమాయకమైన పల్లె జనాలు పాపం నా పంచనే బతికే వారు. నా సహాయంతో పంటలు పండించుకునే వాళ్ళు. దప్పిగొంటే నా వద్దకే వచ్చే వాళ్ళు. ఇలా ఎన్ని వేల ప్రాణాలకు నేను ఓ దిక్కూ, మొక్కూ కల్పించానో తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. గర్వమూ కలుగుతుంది. అసలు నా ప్రాణం అయిన నీటి మీద పూర్వీకులకు ఎంత భక్తిభావం ఉందో, నా మీద ఎంతటి చక్కటి కవితలు అల్లారో, ఎలా పూజించారో, పూజిస్తున్నారో, ఈ భావనలు ఎన్ని వేల యేళ్ళ నాటివో తలుచుకుంటే అద్భుతంగా ఉంటుంది.

"ఆపోవా ఇధగుం సర్వం
విశ్వాభూతాన్యాపః
ప్రాణావా ఆపః
పశవ ఆపో అన్నమాపో అమృతమాపః
సమ్రాడాపో విరాడాపః
స్వరాడాపశ్చందాగుంశ్యాపో జ్యోతిగుంశాపో
యజుగుంశ్యాపః
సత్యమాపః సర్వదేవతా ఆపో భూర్భువః సువరాప ఓం"

ఇదంతా జలమే. సర్వభూతాలు జలమే. ప్రాణం జలమే. పశువులు, అన్నమూ, అమృతమూ అన్నీ జలమే. సమ్రాట్టు, విరాట్టు జలమే. స్వరాట్టు, ప్రమాణాలు, వెలుగునిచ్చేవీ, వేద సూత్రాలు, సత్యము, సర్వదేవతలు, భూ, భువః, సువః అనే ముజ్జగాలు అన్నీ జలమే. వీటన్నిటికి మూలం ఓం అనే ప్రణవం...

********************************************

ఒకసారి నాకో పుండు వచ్చింది. గట్టు తెగి ప్రజల ప్రాణాల మీదకు వచ్చిందట. నాకు ఓ ముసలమ్మ మందేసింది. కానీ పాపం ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆ ముసలమ్మకో కట్ట కట్టి పూజించుకున్నారు పల్లెప్రజలు. తర్వాత్తర్వాత ఓ కవి ముసలమ్మ ఉదంతాన్ని ఓ కావ్యంగా చెప్పాడు.

నా కట్టమీద అనంతమ్మ పురవాసులు రకరకాల గుళ్ళను కట్టుకున్నారు. పక్కన కొండమీద కూడా తోకరాయుని గుడి ఒకటి కట్టారు.

కాలం మారింది. మా తాతయ్య ఎంచేతో పలుకరించడం మానేశాడు. మా రతనాల సీమ ఇప్పుడు రాళ్ళసీమ గా మారింది.  దానికి తోడు మెల్లిగా నా శరీరాన్ని కబళిస్తూ కాలనీలు పుట్టుకొచ్చాయి. నా మీద అనేక ముళ్ళచెట్లూ, రకరకాల పిచ్చి మొక్కలూ మొలిచాయి. నన్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒకవేళ తిరిగి నాకు కళ వచ్చినా ప్రజలు నన్ను అప్యాయంగా పలుకరిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ కాలం ప్రజలు మహాబుద్ధిశాలురు. తెలివైన వారు. వీరికి నీటిని "కొని" త్రాగటం అలవాటవుతూంది. కల్మషాలను ప్రకృతిసిద్ధంగా వదిలించుకునే పద్ధతులు వీళ్ళు నమ్మరు. నాలో కల్మషాలను వదిలించడానికి ఇంటింటా ప్రత్యేక పరికరాలను అమర్చుకుంటారు. ఇన్ని వందల యేళ్ళు వేలమంది ప్రజలు నన్ను, నా సహాయంతో పండించుకున్న పంటలనూ అనుకూలంగా వీరు విస్మరిస్తారు. చివరికి ఓ రోజు, "నా గుండె చెఱువయ్యింది" అన్న మాట కూడా చాదస్తంగా మారిపోవచ్చు.

మనిషి మెదడు, హృదయాన్ని కబళించడమనేది ఓ వ్రణం. బయటి వ్యాధిని పసిగట్టటం తేలికే కానీ, పండులోపలి పురుగును గుర్తించటం బహుకష్టం. అది మిక్కిలిప్రమాదకరమైనది. ఈ వ్రణం ముదిరితే నా మిత్రుల గాథలు నాలాంటి మోడు గాథలే అవుతాయి.

Thursday, May 7, 2009

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నా నివాళి.

గ్రీష్మం.

హేమంతం, శిశిరం, వసంతం, వర్షర్తువు, శరత్తు - ఈ మిగిలిన ఋతువులన్నీ ఎందరో కవులను ఆకర్షించాయి. వసంతంలో కోకిల కూజితం ఓ కవికి ప్రణవమై, కవితా గానాన్ని ప్రేరేపిస్తే, శరజ్జ్యోత్స్నలు మరో కవిలో ప్రణయభావాలను మేల్కొలుపుతాయి. హేమంతం నీహారికలను అందిస్తే, ప్రావృష మేఘమాలలు మరోకవి, ప్రియురాలికి సందేశాన్నంపడానికి ప్రేరేపిస్తాయి.

మరి గ్రీష్మం?

గ్రీష్మానికి అచ్చట్లు ముచ్చట్లు లేవా?అలాఎండుతూ, మండుతూ కూర్చోవలసిందేనా?

..................

..................


పూర్తి వ్యాసం
ఇక్కడ.