Tuesday, March 27, 2012

భోజనప్రలాపం

...అనే తిండిగోలను చాలకాలం తర్వాత నా బ్లాగులో చెప్పుకోవాలనిపించి రాస్తున్నాను.

దీనికి శ్రీకారం చుట్టించినాయన శ్రీనాథుడు. అవును. ఈ మధ్య శ్రీనాథ కవిసార్వభౌమ అనే ఎన్టీవోడి సినిమా డీవీడీ లో చూశాను. సినిమా గురించి నా అభిప్రాయం చెప్పను కానీ, అందులో శ్రీనాథుడు తిండిపై కూసిన పద్యాలు విన్న తర్వాత నా చెవులలో చిమ్మిరేగింది.

నేటి సారస్వతవిమర్శకులు కవిహృదయం ఎఱుగకుండా సాహిత్యం మీద విమర్శించిన రీతిలో - ఎంతసేపూ జొన్నన్నం మీద నోరు చేసుకునేకే సరిపోయింది కానీ అసలు జొన్నలలో స్వారస్యం కనుక్కుందామనే ఆలోచన ఆయనకు లేకుండా పోయింది.

శ్రీ కృష్ణుడా, పూతన చన్నులచేదు తాగినాను, దవాగ్ని మింగినాను అని చెప్పబాకు, ఉడుకు చింతాకు బచ్చలి కూర జొన్నకూటితో ఒక ముద్ద తినిచూడు నీ పస కనిపిస్తుంది - అట.

బహుశా ఆయనకు జొన్నన్నమో, జొన్నరొట్టో చేసిపెట్టినావిడ మెత్తగా చేసి ఉండదు. అంతే తప్ప జొన్నరొట్టె, చింతచివురు పప్పు ఒకసారి మా సీమకొచ్చి తిని చూడు అని స్వర్గానికి వినిపించేలా చెప్పాలనిపించింది.

చెల్లవు, సార్వభౌమ! కడు చెన్నగు భోజన సౌఖ్యమందినా
డల్ల సుభాగ్యముల్ గొనితి టంచును నిక్కెదవేమొ! తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు పప్పును మెత్తని జొన్నరొట్టెతో
మెల్లగ యొక్క ముక్క దిగ మ్రింగుమ! మోక్షము కానవచ్చెడిన్.

(చిన్న మాట. జొన్నరొట్టె పై పద్యంలాగా ఏడ్సినట్టు ఉండదు. శ్రీనాథుని పద్యం లానే ఉంటుందని మనవి)

ఒక్క చింతాకు పప్పేమిటీ, గుత్తివంకాయ కూర, పెరుగు, కారప్పొడి కాదేదీ జొన్నరొట్టెతో నంజుడుకనర్హం. శ్రీనాథుల వారు ఇంతటితో ఎలానో ఆగారు రాగి ముద్దపైనా, లేదా గోంగూర డ్రగ్ మీదా ఏమీ అనలేదు. శుభం. (గోంగూర ’డ్రగ్’ ఎందుకంటే నాకు ఓ మారు సరైన గోంగూర పచ్చడి తగిలి రుచి చూడ్డం జరిగితే ఆ తర్వాత భోజనానికి అది లేకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది.)

శ్రీనాథుని మీద పై పద్యం ద్వారా చేయి చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న డవుటొచ్చింది. శ్రీనాథుడు తిన్నది జొన్నన్నము కదా, జొన్నరొట్టె గురించి అప్పటికి తెలియదేమోనని. కానీ ’రొట్టె’ శ్రీనాథుని కాలం నాటికి ఉన్నది. సాక్ష్యం -

ఉలుమిడి చెక్కయున్, మిగుల నొక్కయుఁ జప్పని రొట్టెముక్కయున్
మలినపు గుడ్డలున్, నులుక మంచపుఁ గుక్కియుఁ, జీరటిల్లునుం
దలఁచిన రోఁత వచ్చు, నొకనాఁటి సుఖం బొకయేఁటి దుఃఖమీ
పలివెల వారకాంతల యుపస్థలకున్ బదివేల దండముల్.

హిందీ రోటీ - తెలుగులో రొట్టె అయిందని నా ఊహ. కానీ శ్రీనాథుని కాలానికి రొట్టె తెలిసిందంటే యేమో!

భోజన విషయంలో ఈయనకు స్వ-పర భేదాలు లేవన్నట్టు తెలుస్తూంది. మరో పద్యంలో తమిళులవంటను ఆడిపోసుకున్నాడు. మొట్టమొదటనే మిర్యపుచారు చెవులలో పొగరేగేటట్టు వడ్డిస్తారట. ఇలా మొదలెట్టి అరవ వారి విందెల్ల యాగడంబు అంటాడీయన.

నిజానికి తమిళుల ఇళ్ళల్లో చప్పని పప్పు, నేయి వడ్డించడం కొన్ని చోట్ల నేను గమనించాను. అలాగే మరికొంతమంది ఇళ్ళల్లో పప్పుతో బాటు పెరుగుపచ్చడి కలిపి భోంచెయ్యడం ఒక ఆనవాయితీ. శ్రీనాథుడు చెప్పే సాంబారు కూడా అంత అన్యాయమేమీ కాదు. ముఖ్యంగా ములక్కాడల సాంబారు. ఇదంతా చూస్తూంటే శ్రీనాథుడు బెంగాలీ వాళ్ళలాగా పొద్దున లేచి స్వీట్లు, కాఫీలో వెన్న తగలెట్టుకుని తాగే రకమా అని ఒక అనుమానం వస్తుంది. మరీ కొంచెం కూడా ఘాటు తింటున్నట్టు ఎక్కడా లేదు, బాపు సినిమాలో మాత్రం "ఆవ ఠేవ" ఏదీ? అని ఆయనతో అనిపిస్తాడు దర్శకుడు. నిజానికి ఆవకాయ ఆయన కాలానికి లేదు. ఊరుగాయ - అంటే ఉప్పునీటిలో ఊరవేసిన కొన్ని కాయలు అనే కాన్సెప్టు 15 వ శతాబ్దానికి కానీ రాలేదు. ఆ తర్వాత 18 వ శతాబ్దానికి కానీ మిరపకాయ భారద్దేశానికి రాలేదు. అది శ్రీనాథుని సినిమాలో బాపు చేసిన చందోభంగం.

ఇందాక సాంబారు అంటే గుర్తొచ్చింది. మా ఊళ్ళో ఓ మారు నాగఫణిశర్మ గారి అవధానం జరిగింది. అందులో దత్తపదిలో భాగంగా సాంబారు, పూరీ, వడ, దోస లతో శివుణ్ణి వర్ణించమన్నారు. నాకు పద్యం గుర్తు లేదు కానీ, సాంబా! రుద్రా! అని చివరిపాదంలో రావడం గుర్తుండిపోయింది.

తమిళులు అన్నారు కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళి మలయాళీలనూ పలకరించి వద్దాం. మలయాళీల సాంబారు/పులుసు/గ్రేవీ కూర పేరు ’అవియల్’. దీని వెనుక టెక్నాలజీ నాకు తెలీదు కానీ, ఇందులో ముక్కలను నిలువునా కోసి తగలెడతారు (అదేనండి పొయ్యిమీద పెడతారు). అంటే కేరట్ ముక్కలు రౌండు రౌండుగా కాక కాస్త పొడుగు పొడుగు ముక్కలుగా అన్నట్టు. అరటి, కేరట్టు, కంద, గుమ్మడి ఇత్యాది కూరగాయల కలగలుపుగా ఈ వంటకం తయారు చేస్తారు. ఇక మలయాళీల పేటెంట్ కొబ్బరినూనె తప్పనిసరి. ఈ వంటకం చేసేప్పుడు వంటగది వైపుకు వెళ్ళటం రిస్కు. కొబ్బరి నూనె ఉడికేప్పుడు వచ్చే వాసన భరించవలసి వస్తుంది. అయితే సరిగ్గా చేస్తే దీని రుచి - "న్యాన్ ఎంద పరయుమ్!" - అంతే. ఈ అవియల్ మలయాళీల పండుగ ఓణం కు చేసే వంటకాల లిస్టులో ఒకటి. ఆ విందును ’సద్య’ అని అందురు. దాని గురించి మరెప్పుడైనా.

ఈ మధ్య నా వెరైటీ తిండిగోలతోటి నా శీర్షం మీదికి తెచ్చుకున్నాను. బెంగళూరు బ్రిగేడు రోడ్డులో నీలగిరి దుకాణాని కెళ్ళానో మారు. అక్కడ ఎండబెట్టిన తామరతూళ్ళను చూశాను. (తామరకళంగు వరువల్) వాటిని ఫ్రై చేసుకుని తినాలట. వాటిని ఇంటికి తెచ్చి మా ఆవిడకు ఆర్డరిచ్చాను. మా పాప తమ్మి (సంహిత) మొదటి ముక్క బానే తిన్నది. ఆ తర్వాతి ముక్కకు దానికి ఖోపం వచ్చేసింది. మా ఆవిడ డవుటు పడి దారుణాయుధాలు ప్రయోగించకముందే మిగిలిన వాటినన్నిటినీ బలవంతంగా తినవలసివచ్చింది.

ఇక్కడ దుర్భాగ్యనగరం హైటెక్ సిటీ నుండి లోపలకు వచ్చే దారిలో అవియల్ పేరుతో ఒక రెస్టారెంటు ఉంది. అక్కడ అవియల్ చేస్తారో లేదో తెలియదు.

ఈ అవియల్ ను తమిళులు (ముఖ్యంగా తమిళబ్రాహ్మలు), మలయాళీలు భోజనంలోనే కాక ములగాకు అట్టుతో కలిపి తింటారు.

శ్రీనాథుడు ఇవన్నీ తిని డెఫినిట్ గా ఉండడు. మనకా అవకాశం ఉంది. ఉపయోగించుకుందాం. తిని ఉండబట్టలేక ఇలా వాగుదాం.

Wednesday, March 21, 2012

ఒక శాసనం - వెనుక కథ

బహువృత్తాన్తాని రాజకులాని నామ - ప్రతిమా నాటకంలో భాసమహాకవి సీతమ్మ నోట చెప్పించిన మాట. రాజవంశాలలో జరిగే చిత్రాలు పలువిధాలు అన్న మాట ఆయన ఏ ముహూర్తంలో వ్రాసినాడో ఏమో ఇది భారతదేశ రాజవంశాలవిషయంలో అక్షరసత్యమయింది. ఆ ’చిత్రాలు’ తదనంతర కాలంలో శిథిలదేవాలయాలకూ, విరిగిపోయిన శిలలకూ, వైభవం కోలుపోయిన సంస్కృతీ నిలయాలకూ కారణమై, గతించిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఎట్టి కఱకు రాతి గుండెవానినయినా కరిగించి, విలపింపజేయగలిగిన కరుణాతరంగితమలయవీచికలు ఇవి. అలాంటి ఒకానొక కథను గుర్తు చేసే శిలాఫలకం, గతించిన దాని వైభవం, దానిని చెక్కించిన ఒకానొక పసి బాలుని దయనీయమైన కథనమే ఈ వ్యాసం.

(ఈ వ్యాసం ఉద్దేశ్యం చరిత్ర కాదు, చరిత్ర మీద, మన సంస్కృతి మీద సానుభూతి కలిగించడం. ఈ వ్యాసాన్ని ఏ విధమైన ప్రమాణంగా స్వీకరించవద్దని మనవి)

***********************************************************


(శాసనపాఠం - తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం)
శుభమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుద
య శాలివాహన శకవర్షంగ
ళు ౧౪౭౮ శయన సంవత్సరద
ఆషాఢ శు ౧౨ (మం)పుణ్యకాలదెయ శ్రీ
మద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ
వీరప్రతాపశ్రీ సదాసివరాయ మహ
రాయరూ ప్రౌఢిరాజ్యం గెవుతిరలు విరూ
పణనాయకరు శంఖదూర మల్లికా
ర్జున దేవర సమ్మాన సిలాశాసనద
క్రమవంతెందరె ప్రాకుదినగళలూ పారు
పత్యగారరూ మాన్యగ్రాసక్కొంబ గర్భ
రహౌసతం మ తందె రంతుప్రే నాయకరిగె
పుణ్యవాగి బెశోయంకుధారె
రద్దు కోట ధర్మశాసన యీ ధర్మ.

***********************************************************

భౌగోళికంగా రాయలసీమలో నేటి అనంతపురం జిల్లాకు ఒక వైచిత్రి ఉంది. అనంతపురం జిల్లాలోనికి కర్ణాటక తాలూకు ఒక పాయ చొచ్చుకుని వచ్చి ఉంటుంది. ఇటుప్రక్క, అటుప్రక్కనా తెలుగు, మధ్యలో కన్నడ. నేటి ఈ పరిణామం గత వందల యేళ్ళుగా కొనసాగుతున్న సాంస్కృతీ మైత్రికి చిహ్నం. రెండు భాషలు, రెండు సంస్కృతులు వందల యేళ్ళుగా కలిసి మమేకమై జీవిస్తున్న అపురూపమైన చోటు ఇది. లిపి కూడా తెలుగు కన్నడాలకు దాదాపు ఒక్కటిగానే ఉంది.

ఈ కర్ణాటక పాయకు ఇటువైపున కల్యాణదుర్గం, కంబదూరు, అటువైపు హేమావతి, అమరాపురం, మధ్యలో కన్నడనాడు ముఖ్యపట్టణం పావగడ. ఈ పేర్కొన్న పట్టణాలన్నీ గతించిన వైభవానికి చిహ్నాలే. అన్ని ప్రాంతాల్లోనూ విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్ళు కొద్దో, గొప్పో కనిపించడం కద్దు.

పైన పేర్కొన్న ఆ శాసనం కంబదూరు లోని శంఖదూరమల్లేశ్వరస్వామి దేవాలయం తాలూకుది. ఆ శాసనం తాలూకు భాష కన్నడ. శాసనంపైన శివలింగం చెక్కారు. కృష్ణరాయలు వైష్ణవుడు. ఈ శివలింగచిహ్నం ఆర్వీటి రామరాజు ప్రాభవానికి చిహ్నం కావచ్చును. ప్రతి వాక్యానికి ముందూ ’౦’ చెక్కారు. అందులో ప్రముఖంగా కనిపిస్తున్న పేరు - శ్రీ వీరప్రతాపసదాశివమహరాయలు. ఇంకా విరూపణ్ణ, పారుపత్తెదారుడు అన్న పదాలు కూడా ఉన్నై. ఆ శాసనంలో చెక్కిన సంవత్సరం - శాలివాహన శకం 1478 అంటే క్రీ.శ: 1556. ఆ యేడు ఆషాఢమాసంలో - శ్రీ మల్లేశునికి విరూపణ ద్వారా చెందవలసిన మాన్యాలను నిలుపుదల చేయిస్తున్నట్టు శ్రీ సదాశివరాయలి పారుపత్తెదారుడు వేయించిన శాసనం. పారుపత్తెదారుడు అంటే గ్రామాధికారి. బహుశా విరూపణ అనే అతను ఈ ప్రాంతానికి పారుపత్తెం వహిస్తూ ఉండేవాడు కావచ్చును. (ఈ అర్థాలు నాకు తోచినవి మాత్రమే)

మనకు తీగ దొరికింది: 1558 - అంటే తుళువ (సంపెట) శ్రీకృష్ణదేవరాయలవారు గతించిన తర్వాతి కాలం. ఆయన మరణించినది 1530 వ వత్సరంలో. అప్పటికి శ్రీవారి పుత్రసంతానం కూడా గతించింది. ఆ కుట్రకు తిమ్మరుసయ్య కారణమని ఆయన్ను పెనుగొండ జైల్లో పెట్టటమూ జరిగిపోయింది. ఆ దయనీయమైన పరిస్థితిలో ఆంధ్రవిద్యాభోజుడు, కవివరహృత్కమలబాలమిత్రుడు, ఆంధ్రాభారతీలాలసమానసాబ్జుడు, హిందూరాజ్యరమారమణుడు, మూరురాయరగండడు శ్రీ కృష్ణసార్వభౌముడు తన భౌతికకాయాన్ని విడచి యశఃకాయుడైనాడు.

సీ ||
కవిబుధనికరంబు కల్పతరూయని
వాక్రుచ్చి వాక్రుచ్చి వగచుచుండ
రాణులార్తధ్వనిఁ బ్రాణేశ్వరాయని
యుర్విపైఁబడి మూర్ఛనొందుచుండ
హా తండ్రి మమునిట్టులనదలఁ జేసితే
యని ప్రజాతతులంగలార్చుచుండ
వైరిరాజులుఁగూడ వీరాగ్రణీయని
విలపించి యశ్రులు విడచుచుండ
గీ||
గాఢమైనట్టి శోకాంధకారమందు
లోకమంతయు మునుఁగ నాలోకబాంధ
వుండు, శ్రీకృష్ణసార్వభౌముండు సుప్ర
శస్తవిక్రమసంపన్నుఁ డస్తమించె 

- (శ్రీకృష్ణదేవరాయచరిత్ర)

కృష్ణరాయల వారి తదనంతరం ఆయన సవతి తల్లి కుమారుడు (నరసరాజుకు కోబాంబిక వల్ల కలిగిన పుత్త్రుడు) అచ్యుతరాయలు - శాలివాహన శకం ౧౪౫౨ (క్రీ.శ 1530) విరోధినామ సంవత్సర కార్తీకబహుళపంచమి నాడు రాజ్యం తీసుకొన్నాడు. ఈయన రాజ్యం దక్షిణాన తిరునల్వేలి వరకు వ్యాపించినదని కంచిలో ఒక శిలాశాసనం ఉంది. అచ్యుతరాయలు ఎటువంటివాడయినా కానీ, తన దండాధిపతి, స్వయానా అచ్యుతరాయలికి బావమఱిది అయిన సలకము తిమ్మయ మాత్రం వెనకటి తిమ్మరుసయ్య లాగే కడుసమర్థుడు. ఈ తిమ్మయ్య తమ రాజ్యంలో తిరుగుబాటు ప్రకటించిన కేరళరాజును పాండ్యరాజును అణచివేసినాడు. అట్లాగే కృష్ణరాయలు ఇక లేడన్న ఔద్ధత్యంతో దాడి జరిపిన బిజాపురసులతానును పారద్రోలినాడు.

ఇలా సలకము తిమ్మయ అచ్యుతరాయని కంటికి రెప్పలా కాపాడుతూ రాజ్యాన్ని చూసుకుని వహిస్తున్నాడు. అయితే ఎంత సమర్థుడైనా తిమ్మయ కేవలం దండనాథుడు మాత్రమే. అచ్యుతరాయలు భోగలాలసుడు. సలకము తిమ్మయ చేత దెబ్బతిన్న రాజులందరినీ ఒకచోట చేర్చి కృష్ణరాయల అల్లుడు ఆరవీటి రామరాజు మెలమెల్లగా సామ్రాజ్యం మీద తిరుగుబాటు సలుపజొచ్చినాడు. అచ్యుతరాయలు ఆతని బాధ తప్పించుకోవడానికి ఇటుపక్క, యోగ్యులైన సామంతులనేకమంది నచ్చచెబుతున్నా  వినక విజాపుర సులతాను ఇబ్రహీం ఆదిల్షాతో చెలిమి చేయడమే కాక, అతనికి ఇరువది లక్షల వరహాల కప్పం చెల్లించుకున్నాడు. ఇదే అంతటి మహారాజ్యపతనానికి తొలి మెట్టుగా పరిణమించింది. మితిమించిన భోగలాలసతో అచ్యుతరాయలు అనతి కాలంలోనే కాలం చేసినాడు.

అచ్యుతరాయల తర్వాత -

సలకము తిమ్మయ తన మేనల్లుడు వేంకట దేవరాయని సింహాసనంపై కూర్చుండబెట్టి, రాజ్యవ్యవహారాలు తనే స్వయంగా చూడసాగినాడు. విధి వైపరీత్యం - వేంకటదేవరాయడు సింహాసనం ఎక్కిన కొంతకాలానికి మరణించినాడు.

"క్షితి ప్రతిష్టాపిత కీర్తిదేహే ప్రాప్తే పదం వైష్ణవమచ్యుతేంద్రే
అధ్యాస్య భద్రాసనమస్య సూనుర్వీరో బభౌ వేంకటదేవరాయః
ప్రశాస్య రాజ్యం ప్రసవాస్త్రరూపే విద్వన్నధౌ వేంకటరాయభూపే
అభాగదేయదచిరాత్ ప్రజానాం అఖండలావాసమదాధిరూఢే"

(ఎపిగ్రాఫికా ఇండికా)

సలకము తిమ్మయ్యే దేవరాయని చంపించాడని కొంతమంది చరిత్రకారులన్నారు. అయితే చరిత్రను మానవీయదృక్పథంతో, నిజాయితీతో, ప్రాంతీయనేపథ్యంతో పరిశీలించలేని అసమర్థ పాశ్చాత్య చరిత్రకారుల నిరాధారపు రాతలవి. ఆ తర్వాత తిమ్మయే రాజ్యానికి వచ్చినాడు. ఈ లోపల ఆరవీటి రామరాజు రాజ్యంలో ఒక్కొక్కరినీ తనవైపుకు తిప్పుకుని తిరుగుబాటు ప్రకటించినాడు. సలకము తిమ్మయ చేసేది లేక ఆదిల్షా సహాయం అర్థించినాడు. ఆదిల్షా విజయనగరానికి వచ్చి, కొన్ని రోజులు అతిథిలా ఉండి, కొంత కప్పం స్వీకరించి మరలినాడు. ఆదిల్షా మరలిన వెంటనే రామరాజు తిరిగి దండెత్తినాడు.

విధిలేని పరిస్థితులలో పరమరాజభక్తుడు, దేశప్రేమికుడు సలకము తిమ్మయ ఆత్మహత్య చేసికొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్నది కూడా చేవలేక కాదు - బ్రతికి ఉంటే ఆర్వీటిరామరాజు తనచేత ఇంకే అఘాయిత్యాలు చేయిస్తాడోనన్న బాధతో మాత్రమే.

ఆర్వీటి రామారాజునే అళియరామరాజంటారు. అళియ శబ్దానికి కన్నడ భాషలో అల్లుడని అర్థం.

ఆర్వీటి రామరాజు రాజ్యం కోసం ఎన్ని కుటిలప్రయత్నాలు చేసినా శౌర్యంలోనూ, రాజసంలోనూ తగ్గనివాడు. చంద్రవంశ సుక్షత్రియుడు. ఈతడు తను నేరుగా సింహాసనంపై కూర్చొనకుండా వేంకటదేవరాయని సవతి తమ్ముని - సదాసివరాయని సింహాసనాలంకృతుణ్ణి చేసినాడు. ఆ యేడు క్రీ.శ 1543. ఈ సదాశివరాయలు పాపం చిన్నవాడు. అభం శుభం ఎఱుగని పసివాడు. రాజ్యం పేరుకు ఈతనిది కానీ అధికారం అంతా రామరాజుది.

ఆ పటుకీర్తి రామవసు | ధాధిపచంద్రుఁడు కృష్ణరాయ ధా
త్రీపతిసార్వభౌమ దుహి | తృప్రియుఁడై వితతప్రతాప సం
తాపిత ప్రియుఁడై, యల స | దాశివరాయ నిరంతరాయ వి
ద్యాపుర రాజ్యలక్ష్మికి ని | దానము తానయి మించెనెంతయున్


(రామాభ్యుదయము)

సదాశివరాయలు యేడాదికొక్కమారు మాత్రమే ప్రజలకు కనబడే వాడుట. మిగిలిన సమయమంతా నిర్బంధమే. తర్వాత్తర్వాత అదీ నల్లపూసయింది. కొంతకాలానికి ఆ సదాశివరాయలు ఉన్నాడో లేడొ ప్రజలకు తెలియకుండా పోయింది. రామరాజే మొదటినుండి ఆతని పేరు వాడుకుని తద్వారా కృష్ణరాయల వారి విశ్వాసపాత్రులయిన దండనాథులను తనవైపుకు తిప్పుకొన్నాడని, రాజ్యం చేతికి రాగానే సదాశివరాయలిని నిర్బంధించి చంపించాడని హెరాసు అనే ఆయన ఆర్వీటి చరిత్రలో వ్రాశాడు.

రామరాజు అంతటి దుర్మార్గుడు కాదని, రాజ్యసంరక్షణ భారం సమర్థంగా నిర్వహించాలన్న తలంపుతో తనే ఎక్కువగా కలుగజేసుకొన్నాడని ఇంకో కథనం. ఏదేమైనా సదాశివరాయలు అతి దురదృష్టవంతుడు నిర్భాగ్యుడు. తదనంతరం ఆర్వీటి రామరాజు కడు సమర్థంగా కొంతకాలం రాజ్యం చేసినప్పటికీ, గొల్కొండ నవాబు మల్కిభరామునితో అనవసరంగా మైత్రి చేసి చివరికి దుర్మార్గంతా తురుష్కరాజులంతా దండెత్తితే ’రాక్షసతంగడి’ అనే భయంకరమైన పోరు సలిపి వీరస్వర్గం పొందినాడు.

ఒకమహాసమ్రాజ్యం తదనంతరం ఆరునెలలు తురుష్కుల ధాటికి చిన్నాభిన్నమైంది. ఒకప్పటి విజయనగరప్రభువుల రాజధాని విద్యానగరం (హంపి కమలాపురం, ఆనేగొంది పరివర్తిత ప్రాంతం) నేటి లండను నగరమంత వైశాల్యం కలిగి ఉండినదట. ఏడు ప్రాకారాలు. తుంగభద్రమ్మ చల్లని చూపులతో, అంగళ్ళరతనాలతో అలరారి దిక్కూ మొక్కూ లేక నాశనమయింది.

ఈ సామ్రాజ్యపు విషాదాన్తానికి కారణం -
మొత్తం దక్షిణదేశాన్ని చిటికినవేలుపై ఆడించిన తిమ్మరుసయ్య,
పసివాడు సదాశివరాయలు,
రాజభక్తి పరుడైన సలకము తిమ్మయ
వీళ్ళ శాపఫలితమేనేమో!

పై ముగ్గురిలో సదాశివరాయలి తాలూకు శాసనం ఈ మల్లేశ్వరస్వామి దేవళపు శాసనం. ఆతడు నాడు అనుభవించిన దుస్థితికి ప్రతిరూపంగానే దిక్కూ మొక్కూ లేకుండా ఉంది. అపురూపమైన శిల్పాలు ఉన్నై ఈ గుడిలో. గుడికి కాస్త దూరంగా పొలాల మధ్య ఒక నాలుక్కాళ్ళ మంటపం, చిన్న దేవళం శిథిలావస్థలో ఉంది. గుళ్ళో విగ్రహాలు ఇప్పటికే కొన్ని మాయమయినాయి. ఇదొక్కటే కాక, మరి కొన్ని ప్రాచీన శాసనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వాటిపై ఎవరో బట్టలారవేసుకునే దౌర్భాగ్యస్థితి నేడు ఉన్నది.

(గమనిక: ఈ రచనలోని చారిత్రకాంశాలలో సాధికారతను దయచేసి ఆశించవద్దు. ఇవి రచయితకు తెలిసినంతమేరలోని నిజాలు మాత్రమే.)