Tuesday, December 30, 2008

నా మొబైల్ కి తెలుగొచ్చేసింది

కొన్ని నెలల క్రితం, ఓపెరా విహరిణి తెలుగు లో రిలీజ్ అయినప్పుడు, వీవెన్ గారు ఓ టపా ద్వారా ఆ విషయం చెప్పారు. అప్పుడు ఓ అనుమానం వచ్చింది. మొబైల్ లో మన తెలుగు బ్లాగులు చూసుకోవచ్చా? అని. ఎందుకంటే, నాకు ఇంటి దగ్గర pc, లాప్టాప్ లేవు. పైగా వీలు చిక్కినప్పుడల్లా వారాంతాలు మా వూరికి ప్రయాణం పెట్టుకుంటూ ఉండడం వల్ల, ప్రయాణంలో బ్లాగులు చదువుకోడానికి అనువుగా మొబైల్ (ఓపెరా మినీ విహరిణి) లో చూసుకోవడం కద్దు. అయితే,నా మొబైల్ ఫోన్ (సోనీ ఎరిక్సన్ w 350-I) లో తెలుగు సదుపాయం లేదు. (అయితే యూనీ కోడు బెంగాలీ ఫాంట్, అరబిక్ వగైరా ఉన్నాయ్) అందుకే తెలుగు బ్లాగులు తెరిచినప్పుడల్లా, డబ్బాలు డబ్బాలు కనిపించేవి. ఫోన్ లో నేటివ్ ఫాంట్ లేకపోతే తెలుగు చదవడం కుదరదని ఓపెరా వారి ఉవాచ. వీవెన్ గారు ఆ విషయం ధ్రువీకరించారు.

ఈ రోజు ఉదయం ఓ అద్భుతం జరిగింది. మొబైల్ ఫోన్ లో ఎందుకో జీమెయిల్ చూసుకుంటుంటే, కొన్ని తెలుగు అక్షరాలు కనిపించాయ్. సరే అని, నా బ్లాగుకు వెళితే, చక్కగా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. అలానే కూడలి, లేఖిని వగైరా...

నేను నా మొబైల్ సాఫ్ట్ వేరు ను అప్డేట్ చేయలేదు. ఓపెరా కొత్త వర్షను దింపుకోలేదు. నా ఫోన్ లో ఇప్పటికీ తెలుగు ఫాంట్ లేదు. అయితే ఇది ఎలా సాధ్యమయిందో తెలియట్లేదు. ఈ మధ్య మా వూళ్ళో ఓ internet cafe లో కెళ్ళి, పాత చిరంజీవి పాటలు, కొన్ని గేములు ఎక్కించుకు రావడం తప్ప మరే పాపమూ ఎరుగను. ఏదైనా వైరస్సు తగులుకుందో ఏమో మరి. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే, ఆ వైరస్సు మాతకు నమోవాకాలు! :-)

మొత్తానికి ఇది చాలా పెద్ద వింతే నాకు!

మొబైల్ లో నా బ్లాగు :-

Thursday, December 11, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౫



ప్రపంచంలో అతి పురాతనమైన పిరమిడ్లు ఎక్కడ ఉన్నాయి?

ఈజిప్ట్ అంటే పప్పులో కాలేసినట్లే.సరి అయిన సమాధానం సూడాన్. రాజధాని ఖార్తూం కు ఈశాన్య దిశ గా 500 కిలో మీటర్ల దూరంలో మెరో అన్న ప్రాంతంలో, నైలు నది సమీపాన ఉన్నాయివి. అయితే ఈ పిరమిడ్లు ఆకారంలోనూ, వైశాల్యంలోనూ ఈజిప్ట్ పిరమిడ్ల కన్నా తక్కువ.ఇవి క్రీస్తు జననానికి 3 శతాబ్దాల ముందు కాలానికి చెందిన కుష్ వంశస్తులకు చెందినవని గుర్తించారు. అప్పట్లో భారత దేశానికి ఇక్కడికి వర్తక సంబంధాలు ఉండేవట. ఆ ప్రాంతాన్ని అల్ బజ్రావియా అని వ్యవహరిస్తారు. అయితే ఇవి ఇప్పుడు దాదాపు శిథిలావస్థ కు చేరుకున్నాయి.

మరిన్ని వివరాలిక్కడ. అప్పటి కుష్ వంశ ప్రజల లిపి , (meroetic) పక్కన చిత్ర లిపి కన్నా కాస్త అభివృద్ధి దశలో ఉండటం చూడవచ్చు.

ఐతే అక్కడకు వెళ్ళాలంటే, ఇక్కడ ప్రభుత్వం విధించే అనేక గొంతెమ్మ ఆంక్షలు పాటించాలి, దారిలో ఎదురు పడ్డ పెద్ద మనుషులందరికీ ఆమ్యామ్యాలు సమర్పించాలి.

పిరమిడ్లు కాక మేము చూసిన ఇంకో చక్కటి ప్రదేశం జబల్ అవలియా. అది ఖార్తూం నుండీ గంట ప్రయాణం. అక్కడ నైలు నది (వైట్ నైల్) పై తెల్ల దొరలెవరో ఆనకట్ట కట్టేరు. అంత పెద్ద ఆనకట్ట ఉన్నా, అక్కడ వ్యవసాయం ఛాయలు కూడా లేకపోవడం గమనించాం. అక్కడి ప్రభుత్వపు అలసత్వం కాబోలు. అయితే, చేపల వేట పై ఆధారపడి ఎన్నో చిన్న చిన్న గ్రామాలు నివసిస్తున్నాయి.




ఇక ఆ చుట్టుపక్క గ్రామాలు దారిద్ర్యానికి నిలయాలు. అక్కడ జనాల జీవితం, మనం ఊహించలేని మరో ప్రపంచాన్ని మన ముందు నిలుపుతుంది. ఇటుకలతో కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఆ ఇళ్ళకు విద్యుచ్ఛక్తి మాట అన్నది లేదు. ఓ గ్రామం ఉండీ ఇంకో గ్రామానికి వెళ్ళటానికి కాలినడక, లేదా గాడిదల బళ్ళు. కాస్త ఆస్తిపరుడైతే, సొంత గాడిదపై సవారీ.

జబల్ అవలియా ఇటు వైపు ఒడ్డున ఓ ఈజిప్టు దేశానికి చెందిన ఓ వౄద్ధ మహిళ (పేరు గుర్తు లేదు) ఓ చిన్ని ఢాబా వంటిది నడుపుతోంది. (ఢాబాను అరబ్బీ లో ఏమంటారో తెలియదు). ఆవిడో సంఘ సంస్కర్త. మహిళా వివక్షత విపరీతంగా ఉన్న రోజుల్లో ఆవిడ నైలు నది లో చేపల వేట వౄత్తిగా స్వీకరించి, చేప మాంసాన్ని తక్కువ ధరల్లో భద్ర పరిచడానికి సదుపాయాలను కనుక్కున్నది. ఆవిడ కు భారత దేశ ప్రభుత్వం తరఫున కూడా ఓ అవార్డ్ ఇచ్చారు. ఆ వార్త, సంబంధించిన చాయాచిత్రం ఆమె ఢాబా లో ఓ చోట చూసాం.


మా వాళ్ళు మధ్యాహ్నం అక్కడ సూడానీ బ్రెడ్ లు, ఉల్లిపాయలు, చేపల కూర తో సుష్టు గా లాగించేరు. నేను శాకాహారిని. మొదట శంకించినా, ఆకలి నకనకలాడుతుండటంతో చివరికి అభక్ష్య భక్షణం చేశాను. నిజం చెప్పద్దూ, భలే రుచి గా ఉన్నాయి. నదిలో చేపలు కాబట్టి అనుకుంటా, నీచు వాసన కూడా లేదు.