Wednesday, March 21, 2012

ఒక శాసనం - వెనుక కథ

బహువృత్తాన్తాని రాజకులాని నామ - ప్రతిమా నాటకంలో భాసమహాకవి సీతమ్మ నోట చెప్పించిన మాట. రాజవంశాలలో జరిగే చిత్రాలు పలువిధాలు అన్న మాట ఆయన ఏ ముహూర్తంలో వ్రాసినాడో ఏమో ఇది భారతదేశ రాజవంశాలవిషయంలో అక్షరసత్యమయింది. ఆ ’చిత్రాలు’ తదనంతర కాలంలో శిథిలదేవాలయాలకూ, విరిగిపోయిన శిలలకూ, వైభవం కోలుపోయిన సంస్కృతీ నిలయాలకూ కారణమై, గతించిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఎట్టి కఱకు రాతి గుండెవానినయినా కరిగించి, విలపింపజేయగలిగిన కరుణాతరంగితమలయవీచికలు ఇవి. అలాంటి ఒకానొక కథను గుర్తు చేసే శిలాఫలకం, గతించిన దాని వైభవం, దానిని చెక్కించిన ఒకానొక పసి బాలుని దయనీయమైన కథనమే ఈ వ్యాసం.

(ఈ వ్యాసం ఉద్దేశ్యం చరిత్ర కాదు, చరిత్ర మీద, మన సంస్కృతి మీద సానుభూతి కలిగించడం. ఈ వ్యాసాన్ని ఏ విధమైన ప్రమాణంగా స్వీకరించవద్దని మనవి)

***********************************************************


(శాసనపాఠం - తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం)
శుభమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుద
య శాలివాహన శకవర్షంగ
ళు ౧౪౭౮ శయన సంవత్సరద
ఆషాఢ శు ౧౨ (మం)పుణ్యకాలదెయ శ్రీ
మద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ
వీరప్రతాపశ్రీ సదాసివరాయ మహ
రాయరూ ప్రౌఢిరాజ్యం గెవుతిరలు విరూ
పణనాయకరు శంఖదూర మల్లికా
ర్జున దేవర సమ్మాన సిలాశాసనద
క్రమవంతెందరె ప్రాకుదినగళలూ పారు
పత్యగారరూ మాన్యగ్రాసక్కొంబ గర్భ
రహౌసతం మ తందె రంతుప్రే నాయకరిగె
పుణ్యవాగి బెశోయంకుధారె
రద్దు కోట ధర్మశాసన యీ ధర్మ.

***********************************************************

భౌగోళికంగా రాయలసీమలో నేటి అనంతపురం జిల్లాకు ఒక వైచిత్రి ఉంది. అనంతపురం జిల్లాలోనికి కర్ణాటక తాలూకు ఒక పాయ చొచ్చుకుని వచ్చి ఉంటుంది. ఇటుప్రక్క, అటుప్రక్కనా తెలుగు, మధ్యలో కన్నడ. నేటి ఈ పరిణామం గత వందల యేళ్ళుగా కొనసాగుతున్న సాంస్కృతీ మైత్రికి చిహ్నం. రెండు భాషలు, రెండు సంస్కృతులు వందల యేళ్ళుగా కలిసి మమేకమై జీవిస్తున్న అపురూపమైన చోటు ఇది. లిపి కూడా తెలుగు కన్నడాలకు దాదాపు ఒక్కటిగానే ఉంది.

ఈ కర్ణాటక పాయకు ఇటువైపున కల్యాణదుర్గం, కంబదూరు, అటువైపు హేమావతి, అమరాపురం, మధ్యలో కన్నడనాడు ముఖ్యపట్టణం పావగడ. ఈ పేర్కొన్న పట్టణాలన్నీ గతించిన వైభవానికి చిహ్నాలే. అన్ని ప్రాంతాల్లోనూ విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్ళు కొద్దో, గొప్పో కనిపించడం కద్దు.

పైన పేర్కొన్న ఆ శాసనం కంబదూరు లోని శంఖదూరమల్లేశ్వరస్వామి దేవాలయం తాలూకుది. ఆ శాసనం తాలూకు భాష కన్నడ. శాసనంపైన శివలింగం చెక్కారు. కృష్ణరాయలు వైష్ణవుడు. ఈ శివలింగచిహ్నం ఆర్వీటి రామరాజు ప్రాభవానికి చిహ్నం కావచ్చును. ప్రతి వాక్యానికి ముందూ ’౦’ చెక్కారు. అందులో ప్రముఖంగా కనిపిస్తున్న పేరు - శ్రీ వీరప్రతాపసదాశివమహరాయలు. ఇంకా విరూపణ్ణ, పారుపత్తెదారుడు అన్న పదాలు కూడా ఉన్నై. ఆ శాసనంలో చెక్కిన సంవత్సరం - శాలివాహన శకం 1478 అంటే క్రీ.శ: 1556. ఆ యేడు ఆషాఢమాసంలో - శ్రీ మల్లేశునికి విరూపణ ద్వారా చెందవలసిన మాన్యాలను నిలుపుదల చేయిస్తున్నట్టు శ్రీ సదాశివరాయలి పారుపత్తెదారుడు వేయించిన శాసనం. పారుపత్తెదారుడు అంటే గ్రామాధికారి. బహుశా విరూపణ అనే అతను ఈ ప్రాంతానికి పారుపత్తెం వహిస్తూ ఉండేవాడు కావచ్చును. (ఈ అర్థాలు నాకు తోచినవి మాత్రమే)

మనకు తీగ దొరికింది: 1558 - అంటే తుళువ (సంపెట) శ్రీకృష్ణదేవరాయలవారు గతించిన తర్వాతి కాలం. ఆయన మరణించినది 1530 వ వత్సరంలో. అప్పటికి శ్రీవారి పుత్రసంతానం కూడా గతించింది. ఆ కుట్రకు తిమ్మరుసయ్య కారణమని ఆయన్ను పెనుగొండ జైల్లో పెట్టటమూ జరిగిపోయింది. ఆ దయనీయమైన పరిస్థితిలో ఆంధ్రవిద్యాభోజుడు, కవివరహృత్కమలబాలమిత్రుడు, ఆంధ్రాభారతీలాలసమానసాబ్జుడు, హిందూరాజ్యరమారమణుడు, మూరురాయరగండడు శ్రీ కృష్ణసార్వభౌముడు తన భౌతికకాయాన్ని విడచి యశఃకాయుడైనాడు.

సీ ||
కవిబుధనికరంబు కల్పతరూయని
వాక్రుచ్చి వాక్రుచ్చి వగచుచుండ
రాణులార్తధ్వనిఁ బ్రాణేశ్వరాయని
యుర్విపైఁబడి మూర్ఛనొందుచుండ
హా తండ్రి మమునిట్టులనదలఁ జేసితే
యని ప్రజాతతులంగలార్చుచుండ
వైరిరాజులుఁగూడ వీరాగ్రణీయని
విలపించి యశ్రులు విడచుచుండ
గీ||
గాఢమైనట్టి శోకాంధకారమందు
లోకమంతయు మునుఁగ నాలోకబాంధ
వుండు, శ్రీకృష్ణసార్వభౌముండు సుప్ర
శస్తవిక్రమసంపన్నుఁ డస్తమించె 

- (శ్రీకృష్ణదేవరాయచరిత్ర)

కృష్ణరాయల వారి తదనంతరం ఆయన సవతి తల్లి కుమారుడు (నరసరాజుకు కోబాంబిక వల్ల కలిగిన పుత్త్రుడు) అచ్యుతరాయలు - శాలివాహన శకం ౧౪౫౨ (క్రీ.శ 1530) విరోధినామ సంవత్సర కార్తీకబహుళపంచమి నాడు రాజ్యం తీసుకొన్నాడు. ఈయన రాజ్యం దక్షిణాన తిరునల్వేలి వరకు వ్యాపించినదని కంచిలో ఒక శిలాశాసనం ఉంది. అచ్యుతరాయలు ఎటువంటివాడయినా కానీ, తన దండాధిపతి, స్వయానా అచ్యుతరాయలికి బావమఱిది అయిన సలకము తిమ్మయ మాత్రం వెనకటి తిమ్మరుసయ్య లాగే కడుసమర్థుడు. ఈ తిమ్మయ్య తమ రాజ్యంలో తిరుగుబాటు ప్రకటించిన కేరళరాజును పాండ్యరాజును అణచివేసినాడు. అట్లాగే కృష్ణరాయలు ఇక లేడన్న ఔద్ధత్యంతో దాడి జరిపిన బిజాపురసులతానును పారద్రోలినాడు.

ఇలా సలకము తిమ్మయ అచ్యుతరాయని కంటికి రెప్పలా కాపాడుతూ రాజ్యాన్ని చూసుకుని వహిస్తున్నాడు. అయితే ఎంత సమర్థుడైనా తిమ్మయ కేవలం దండనాథుడు మాత్రమే. అచ్యుతరాయలు భోగలాలసుడు. సలకము తిమ్మయ చేత దెబ్బతిన్న రాజులందరినీ ఒకచోట చేర్చి కృష్ణరాయల అల్లుడు ఆరవీటి రామరాజు మెలమెల్లగా సామ్రాజ్యం మీద తిరుగుబాటు సలుపజొచ్చినాడు. అచ్యుతరాయలు ఆతని బాధ తప్పించుకోవడానికి ఇటుపక్క, యోగ్యులైన సామంతులనేకమంది నచ్చచెబుతున్నా  వినక విజాపుర సులతాను ఇబ్రహీం ఆదిల్షాతో చెలిమి చేయడమే కాక, అతనికి ఇరువది లక్షల వరహాల కప్పం చెల్లించుకున్నాడు. ఇదే అంతటి మహారాజ్యపతనానికి తొలి మెట్టుగా పరిణమించింది. మితిమించిన భోగలాలసతో అచ్యుతరాయలు అనతి కాలంలోనే కాలం చేసినాడు.

అచ్యుతరాయల తర్వాత -

సలకము తిమ్మయ తన మేనల్లుడు వేంకట దేవరాయని సింహాసనంపై కూర్చుండబెట్టి, రాజ్యవ్యవహారాలు తనే స్వయంగా చూడసాగినాడు. విధి వైపరీత్యం - వేంకటదేవరాయడు సింహాసనం ఎక్కిన కొంతకాలానికి మరణించినాడు.

"క్షితి ప్రతిష్టాపిత కీర్తిదేహే ప్రాప్తే పదం వైష్ణవమచ్యుతేంద్రే
అధ్యాస్య భద్రాసనమస్య సూనుర్వీరో బభౌ వేంకటదేవరాయః
ప్రశాస్య రాజ్యం ప్రసవాస్త్రరూపే విద్వన్నధౌ వేంకటరాయభూపే
అభాగదేయదచిరాత్ ప్రజానాం అఖండలావాసమదాధిరూఢే"

(ఎపిగ్రాఫికా ఇండికా)

సలకము తిమ్మయ్యే దేవరాయని చంపించాడని కొంతమంది చరిత్రకారులన్నారు. అయితే చరిత్రను మానవీయదృక్పథంతో, నిజాయితీతో, ప్రాంతీయనేపథ్యంతో పరిశీలించలేని అసమర్థ పాశ్చాత్య చరిత్రకారుల నిరాధారపు రాతలవి. ఆ తర్వాత తిమ్మయే రాజ్యానికి వచ్చినాడు. ఈ లోపల ఆరవీటి రామరాజు రాజ్యంలో ఒక్కొక్కరినీ తనవైపుకు తిప్పుకుని తిరుగుబాటు ప్రకటించినాడు. సలకము తిమ్మయ చేసేది లేక ఆదిల్షా సహాయం అర్థించినాడు. ఆదిల్షా విజయనగరానికి వచ్చి, కొన్ని రోజులు అతిథిలా ఉండి, కొంత కప్పం స్వీకరించి మరలినాడు. ఆదిల్షా మరలిన వెంటనే రామరాజు తిరిగి దండెత్తినాడు.

విధిలేని పరిస్థితులలో పరమరాజభక్తుడు, దేశప్రేమికుడు సలకము తిమ్మయ ఆత్మహత్య చేసికొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్నది కూడా చేవలేక కాదు - బ్రతికి ఉంటే ఆర్వీటిరామరాజు తనచేత ఇంకే అఘాయిత్యాలు చేయిస్తాడోనన్న బాధతో మాత్రమే.

ఆర్వీటి రామారాజునే అళియరామరాజంటారు. అళియ శబ్దానికి కన్నడ భాషలో అల్లుడని అర్థం.

ఆర్వీటి రామరాజు రాజ్యం కోసం ఎన్ని కుటిలప్రయత్నాలు చేసినా శౌర్యంలోనూ, రాజసంలోనూ తగ్గనివాడు. చంద్రవంశ సుక్షత్రియుడు. ఈతడు తను నేరుగా సింహాసనంపై కూర్చొనకుండా వేంకటదేవరాయని సవతి తమ్ముని - సదాసివరాయని సింహాసనాలంకృతుణ్ణి చేసినాడు. ఆ యేడు క్రీ.శ 1543. ఈ సదాశివరాయలు పాపం చిన్నవాడు. అభం శుభం ఎఱుగని పసివాడు. రాజ్యం పేరుకు ఈతనిది కానీ అధికారం అంతా రామరాజుది.

ఆ పటుకీర్తి రామవసు | ధాధిపచంద్రుఁడు కృష్ణరాయ ధా
త్రీపతిసార్వభౌమ దుహి | తృప్రియుఁడై వితతప్రతాప సం
తాపిత ప్రియుఁడై, యల స | దాశివరాయ నిరంతరాయ వి
ద్యాపుర రాజ్యలక్ష్మికి ని | దానము తానయి మించెనెంతయున్


(రామాభ్యుదయము)

సదాశివరాయలు యేడాదికొక్కమారు మాత్రమే ప్రజలకు కనబడే వాడుట. మిగిలిన సమయమంతా నిర్బంధమే. తర్వాత్తర్వాత అదీ నల్లపూసయింది. కొంతకాలానికి ఆ సదాశివరాయలు ఉన్నాడో లేడొ ప్రజలకు తెలియకుండా పోయింది. రామరాజే మొదటినుండి ఆతని పేరు వాడుకుని తద్వారా కృష్ణరాయల వారి విశ్వాసపాత్రులయిన దండనాథులను తనవైపుకు తిప్పుకొన్నాడని, రాజ్యం చేతికి రాగానే సదాశివరాయలిని నిర్బంధించి చంపించాడని హెరాసు అనే ఆయన ఆర్వీటి చరిత్రలో వ్రాశాడు.

రామరాజు అంతటి దుర్మార్గుడు కాదని, రాజ్యసంరక్షణ భారం సమర్థంగా నిర్వహించాలన్న తలంపుతో తనే ఎక్కువగా కలుగజేసుకొన్నాడని ఇంకో కథనం. ఏదేమైనా సదాశివరాయలు అతి దురదృష్టవంతుడు నిర్భాగ్యుడు. తదనంతరం ఆర్వీటి రామరాజు కడు సమర్థంగా కొంతకాలం రాజ్యం చేసినప్పటికీ, గొల్కొండ నవాబు మల్కిభరామునితో అనవసరంగా మైత్రి చేసి చివరికి దుర్మార్గంతా తురుష్కరాజులంతా దండెత్తితే ’రాక్షసతంగడి’ అనే భయంకరమైన పోరు సలిపి వీరస్వర్గం పొందినాడు.

ఒకమహాసమ్రాజ్యం తదనంతరం ఆరునెలలు తురుష్కుల ధాటికి చిన్నాభిన్నమైంది. ఒకప్పటి విజయనగరప్రభువుల రాజధాని విద్యానగరం (హంపి కమలాపురం, ఆనేగొంది పరివర్తిత ప్రాంతం) నేటి లండను నగరమంత వైశాల్యం కలిగి ఉండినదట. ఏడు ప్రాకారాలు. తుంగభద్రమ్మ చల్లని చూపులతో, అంగళ్ళరతనాలతో అలరారి దిక్కూ మొక్కూ లేక నాశనమయింది.

ఈ సామ్రాజ్యపు విషాదాన్తానికి కారణం -
మొత్తం దక్షిణదేశాన్ని చిటికినవేలుపై ఆడించిన తిమ్మరుసయ్య,
పసివాడు సదాశివరాయలు,
రాజభక్తి పరుడైన సలకము తిమ్మయ
వీళ్ళ శాపఫలితమేనేమో!

పై ముగ్గురిలో సదాశివరాయలి తాలూకు శాసనం ఈ మల్లేశ్వరస్వామి దేవళపు శాసనం. ఆతడు నాడు అనుభవించిన దుస్థితికి ప్రతిరూపంగానే దిక్కూ మొక్కూ లేకుండా ఉంది. అపురూపమైన శిల్పాలు ఉన్నై ఈ గుడిలో. గుడికి కాస్త దూరంగా పొలాల మధ్య ఒక నాలుక్కాళ్ళ మంటపం, చిన్న దేవళం శిథిలావస్థలో ఉంది. గుళ్ళో విగ్రహాలు ఇప్పటికే కొన్ని మాయమయినాయి. ఇదొక్కటే కాక, మరి కొన్ని ప్రాచీన శాసనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వాటిపై ఎవరో బట్టలారవేసుకునే దౌర్భాగ్యస్థితి నేడు ఉన్నది.

(గమనిక: ఈ రచనలోని చారిత్రకాంశాలలో సాధికారతను దయచేసి ఆశించవద్దు. ఇవి రచయితకు తెలిసినంతమేరలోని నిజాలు మాత్రమే.)

Saturday, March 17, 2012

విహారి - ఓ మినీ లోకల్ ట్రావెలాగుడు (ఫుటోలతో)

క్రితం వారం మా ఆవిడ పనిచేసే పల్లె (నీళ్ళు లేని)తిమ్మాపురంలో ఉండినాను. ఊరికే ఉండేదెందుకని ఉబుసుపోకుండా చుట్టు పక్కన ఒక మూడు పల్లెలు తిరిగొచ్చినాను. జీవితానికి మరొక రెండు అందమైన రోజులు జతపడినాయి. నా డైరీలో ఆ రోజునాటి పేజీలు..

నీళ్ళు లేని తిమ్మాపురం ఎందుకంటే - ఎక్కడో నీళ్ళుండే తిమ్మాపురం ఇంకోటుందంట. ఆ ఊరికి ఈ ఊరికి తేడా కనుక్కునేకి జనాలు ఇట్లా పెట్టుకున్నారు.

౧. రాధాస్వామి ఆశ్రమం - గుద్దెళ్ళ

అనంతపురంలో కల్యాణదుర్గం నుండి కర్ణాటక లో పావగడకు వెళ్ళేదారి బాగుంటుంది. ఆ దార్లో దాసంపల్లి తర్వాత ములకనూరు అనే పల్లెటూరు వస్తుంది. ఈ ఊరి శివార్లలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు - నెమళ్ళకొండ. అవును. ఆ కొండపైన సాయంత్రం పూట నెమళ్లను చూడవచ్చు మనం. ఒక్కొక్కసారి నెమళ్ళు కనిపించవు కానీ, చాలా దగ్గర నుండి మనకు నెమళ్ళ క్రేంకారవాలు వినిపిస్తాయి. ఆ ఊరిముచ్చట్లు మరెప్పుడైనా., ప్రస్తుతమనుసరామః...

ములకనూరు నుండి కాస్త ముందుకు వచ్చి కుడివైపు మట్టిదోవ పడితే రెండు కిలోమీటర్ల దూరంలో రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ ఇరవై ముప్ఫై ఎకరాల స్థలంలో ఆశ్రమం, తోట, ఆశ్రమం వారి నిర్వహణలో ఓల్డ్ ఏజ్ హోము ఉన్నాయి. అక్కడ వారందరు వారి అన్నం వాళ్ళే పండించుకోవాలి. అది నియమం. తోటలో సపోటా, మామిడి, జామ, అరటి, కూరగాయలు, తమలపాకులు, వక్క, ఆముదం విరగ కాసి ఉన్నాయి. దాపుల్నే చేనూ ఉందట. వేరుశనగ నూర్పిళ్ళు జరుగుతున్నాయి. బెంగుళూరు మామిడి కాయలు నవనవలాడిపోతున్నాయి. ఇవి కాస్త తీపిగా ఉండి ఊరగాయకు పనికి రావు కానీ,ముక్కలు కోసుకుని కారప్పొడి, తాలింపు వేసి పెట్టుకుని పెరుగన్నంలో నంజుకుంటే స్వర్గం కనిపిస్తుంది.


ఆశ్రమానికి వచ్చిన అతిథులకు కులజాతిమతభేదం చూపకుండా ఆశ్రమవాసులు స్వాగతించి భోజనం పెడతారు. ఒకరోజు ఉండదలుచుకుంటే ఆవాసం కల్పిస్తారు. ఆశ్రమానికి దాపున ఒక కొండ వుంది. రాత్రిపూట అక్కడనుండి ఎలుగుబంట్లు దుంపలకోసం వస్తాయి. అందుకని ఆశ్రమంలో జాతికుక్కలను సాకుతున్నారు.

ఆ ఊరికి నేను, మా ఆవిడా, తన తోడి టీచరమ్మలు, అయ్యలు కొంతమంది ఆటోలో వెళ్ళాము. వెళుతూ ఉంటే దార్లో ఒక అద్భుతం జరిగింది. కొండమలుపు దగ్గర దాదాపు పది పదిహేను జింకల గుంపు. అప్పుడు సాయంత్రం ఐదున్నర.

జింకలు మట్టి రంగుకు, సూర్యుని రంగుకు మధ్య రంగులో మెరిసిపోతున్నాయి. ఆటో శబ్దం వినగానే జింకలు గెంతుతూ పరుగు పెట్టినై.  కాళిదాసు శ్లోకం గుర్తొచ్చింది.

గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యన్దనే దత్తదృష్టిః
పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభియా భూయసా పూర్వకాయమ్ |
దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా
పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||

సూతా అదుగో చూడు! మెడను కాస్త వంచి క్రీగంట మన రథం మీద దృష్టిపెట్టి తిరిగి చూస్తూ, బాణం పడుతుందేమోనని ముడుచుకుంటూ, శ్రమవల్ల వచ్చిన ఆయాసంతో నోరు తెరిచి, గడ్డిపోచలు జారవిడుస్తూ, భూమిపైన కంటే, గాల్లోనే ఎక్కువభాగం ఉండేట్లుగా వేగంగా పరిగెత్తుతూంది.

(గ్రీవమంటే మెడ. గ్రీవాభంగమంటే మెడను తిప్పడం, గ్రీవాభంగ అభిరామం అంటే అందంగా మెడను తిప్పడం. స్యన్దనమంటే రథం)

కళ్ళకు కట్టినట్టుంది కదూ ఈ వర్ణన. ఈ సంస్కృతపద్యం అద్భుతరసానికి ఉదాహరణగా అలంకారికులు పేర్కొంటారు.
(జింక చచ్చేట్టు ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటే ఇందులో రసం, చారు కాచుకోవడమేం ఔచిత్యమని నాకొక అనుమానం ఉంది. మళ్ళెప్పుడైనా తీరిగ్గా ఆలోచించాలి.)

సరే మళ్ళీ బాటకు. జింకలు కెమెరా కన్నుకు దొరికినట్టు లేవు, ఒక్కటి దక్క.

తోటలో సపోటాలు, జామ కాయలు విరగకాసి ఉన్నాయి. మా ఆవిడ, తన సహచరులు ఆ తోటలో తమ షాపింగు చేసి రెండు సంచులు నింపుకున్నారు. ఆ రోజు గడిచింది.

౨. రాళ్ళపల్లి

మరుసటి రోజు పొద్దున - బండి తీసుకుని బయలుదేరాన్నేను సంహితతో కలిసి. తిమ్మాపురం నుండి కంబదూరుకు వెళ్ళేదారిలో ఒక కూడలి వస్తుంది. అక్కడి నుండి పక్కకు తిరిగితే - బొమ్మలో ఎఱుపు రంగు లైనుకు క్రిందుగా రోడ్డు కనిపిస్తూంది కదా ఆ దారిలో ఏడెనిమిది కిలోమీటర్లు వెళితే మేలుకుంట, రాళ్ళపల్లి గ్రామాలు వస్తాయి.


ఆ కొండ పైన ఒక చిన్న నీటి కొలను, దానిపక్కన ఒక చిన్న గుహ, అందులో ఎవరు ఎప్పుడు పెట్టారో తెలీని రాముల విగ్రహమూనూ. అక్కడికెళ్ళాలంటే కాస్త శ్రమపడి కొండ ఎక్కి దిగాలి. ఇది నిర్మానుష్యమైన ప్రదేశం. ఈ కొండపైన నీటికొలను, గుహలో రాముడి గురించి స్థానికులలో కూడా చాలా తక్కువమందికే తెలుసు. (ఈ ట్రెక్కింగు బ్లూస్ ఇప్పటివి కావు, పాత అనుభవాలు)


సరే మన దారికొచ్చాం.రాళ్ళపల్లి ఊరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక నిద్రాణమైన పల్లెటూరు. ఆ పల్లెలో ఏదో ఆంజనేయస్వామి దేవళం ఉందని విన్నా కానీ, అదీ అగుపడలేదు. వెళ్ళేదారి మాత్రం చాలా అందమైనది. అరటి తోటలు, దూరంగా కనిపించే పల్లె, మేలుకుంటలో చెఱువు...

రాళ్ళపల్లి - నిజానికి ఈ పేరు చెబితే ఇప్పటికే ఒక మహానుభావుని పేరు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మాత్రం అది తెలుగువాడి దౌర్భాగ్యం.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ - ఈయన 1893 నందన నామ సంవత్సరంలో రాళ్ళపల్లిలో పుట్టారు. (ఆయన తొమ్మిదవ యేట మైసూరుకు వెళ్ళి, ఆపై అక్కడే స్థిరపడ్డారు.) ఈయన గురించి చెప్పడం కొండను గాజుముక్కలో చూపడమే.
- రేడియోకి ఆకాశవాణి పేరు పెట్టినదీయనే.
- తొమ్మిది యేళ్ళ వయసులో అమ్మ, అయ్య చెప్పించిన చదువుతో తెలుగులో మీరా అనే ఖండకావ్యం వ్రాసిన ప్రతిభాశాలి. ఆ వయసులోనే సంస్కృత శ్లోకాలు చెప్పగలిగే వారట ఆయన. ఏక సంథాగ్రాహి, బహుభాషాకోవిదుడు కూడాను.
- మనం నేడు వింటున్న అన్నమయ్య పాటల్లో వందలాది పాటలకు స్వరాలు కూర్చిన సంగీతనిధి. (ఇప్పుడిటు కలగంటి, తందనానా ఆది, అదివో అల్లదివో..ఇట్లాంటి పాటలకు ఈయనే స్వరకర్త)
- అత్యుత్తమశ్రేణి విమర్శకుడు. ఈయన విమర్శ ఎంత నిశితమంటే, ఆయన తెనిగించిన రఘువంశకావ్యాన్ని (పదిహేడు సర్గలు), ఆయనే విమర్శించుకుని చించి వేశారు.
- వందలాది పీఠికలు వ్రాశారు. జాయపసేనాని వ్రాసిన నృత్తరత్నావళి సంస్కృత కావ్య అనువాదకర్త.
- అనేక గ్రంథాల పరిష్కర్త.

రాళ్ళపల్లి కాస్త నిరాశ కలిగించింది. అంతటి మహానుభావుడు పుట్టిన ఊరన్నట్టు లేకపోగా, ఆయనకు ప్రేరణ కలిగించినదేదైనా కనిపిస్తుందనుకుంటే అదీ లేదు.

తిరిగి వచ్చేప్పుడు, సంహిత,నేను సంహిత వాళ్ళమ్మకు చెప్పకుండా కొన్ని పనులు చేశాం. చింతచెట్ల చేతికి కొమ్మలు అందేట్లుగా కనిపిస్తే వాటిని పట్టి ఊపుకుని కాయలు రాల్చుకుని తిని, పక్కన పొలం గట్లలో పైపులో నీళ్ళు కడుపునిండా తాగేసొచ్చాం.