Sunday, August 7, 2011

మిళింద పన్హ


ఆర్యగౌతముడు గతించి భిక్కుసంఘానికి మహాకాశ్యపుడు మార్గదర్శకుడుగా ఉంటున్నకాలమది.
గంగానదీతీరంలో ఒక ఆవాసంలో భిక్కుసంఘం ఒకటి ఉంది. ఒకనాటి ఉదయం ఆ భిక్కుసంఘంలో శీలసంపన్నులయిన భిక్షులు బుద్ధానుస్సతి (బుద్ధుని దైవికగుణాలకు సంబంధించిన ధ్యానపద్ధతి) చేస్తూ అంకణాన్ని (ముంగిలి) ఊడ్చి, చెత్తాచెదారం ప్రోగు చేస్తున్నారు. ఆ పనిలో భాగంగా ఒక భిక్షువు శ్రమణేరునితో (కొత్తగా భిక్కుసంఘంలో చేరినవాడు) చెత్త కుప్పను ఊడవమని చెప్పాడు. ధ్యానమజ్ఞుడైన ఆ పిల్లవాడు ఆ పని చేయలేదు. మరోసారి చెప్పాడు భిక్షువు. అప్పటికి ఆ అబ్బాయి వినకపోతే చీపురుకొయ్యతో ఒకదెబ్బ వేశాడు. ఆ దెబ్బకా అబ్బాయి ఏడుస్తూ, భయంతో ఆ కుప్పను ఊడుస్తూ, మనసులో సంకల్పించుకున్నాడు. "ఈ కుప్పను ఊడ్చే ఫలం నాకు దక్కితే ఆ ఫలంతో, నిర్వాణపర్యంతం మహా తేజోవంతునిగా, మహా శక్తునిగా అవుతాను".
తర్వాత ఆ పిల్లవాడు గంగానది ఒడ్డుకు స్నానానికి వెళ్ళాడు. గంగానది అలల ప్రవాహాన్ని చూస్తూ, తన మనసులో ద్వితీయప్రణిధి (ఆకాంక్ష)ను అనుకున్నాడు. "నిర్వాణపర్యంతం నేను గంగానదిలా వేగవంతమైన మనస్సు కలిగినవాడినవుతాను". శ్రమణేరున్ని భిక్షువు ఆ సంఘటన ఆదిగా గమనిస్తూనే ఉన్నాడు. అతనితోబాటూ గంగాస్నానానికి భిక్కువు కూడా వచ్చియున్నాడు. ఆతడూ మనసులో సంకల్పం చెప్పుకున్నాడు. "తర్వాతి జన్మలలోనూ నేను గంగానది ప్రవాహంలా ఉద్ధృతమైన బుద్ధిని ఉపయోగిస్తూ ఈ అబ్బాయి ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వాడనవుతాను".

ఐదువందల యేళ్ళతర్వాత -

ఇందాకటి శ్రమణేరుడు, మిళిందుడు అన్న పేరుతో జంబూద్వీపంలోని సాగలనగరానికి రాజయినాడు. (అశోకుని తర్వాత జంబూద్వీపానికి గ్రీకులదండయాత్ర మరోమారు మొదలయ్యింది. గ్రీకు సేనాని ఒకడు భారతదేశ వాయవ్య భాగాన్ని (నేటి ఆఫ్ఘనిస్తాన్) ఆక్రమించాడు. ఆతడి కొడుకుగా రాజయినవాడు మినాందర్. అతడే మిళిందుడు)

మిళిందుడు అనేక శాస్త్రాలు చదివాడు. మహా మేధోవంతుడైనాడు. అయితే వితండవాది. అజేయుడు. ఎందర్నో తన వాదనలో ఓడించాడు. వాదప్రియుడు. అతని వాదానికి జంబూద్వీపంలో ఎవరూ సమాధానాలు చెప్పలేకపోయారు. "ఈ జంబూద్వీపం ఒక తుచ్ఛ ద్వీపం. ఇంతపెద్ద ద్వీపంలో ఒక్కరూ నాతో మాట్లాడగలిగే వాళ్ళు లేరు". అని ఆక్షేపించాడు. ఈతని ఆక్షేపణ అశ్వగుప్తుడనే భిక్షువు విన్నాడు. మిళిందునితో తలపడే శక్తి అతనికీ లేదు. తగిన వ్యక్తి కోసం, తగిన కాలం కోసం చూస్తూ అలాంటి వ్యక్తిని వెతకమని తన శిష్యుడు రోహణునికి చెప్పాడు.

అక్కడికి చాలా కోసుల దూరంలో - ఆంధ్రదేశంలో సోణుత్తరుడనే అతనికి నాగసేనుడనే పుత్రుడు జన్మించినాడు. ఆ పిల్లవాడు పుట్టగానే అనేక శుభాలు జరిగాయి.

రోహణుడు అర్హతుని కోసం వెతుకుతూ ఆంధ్రదేశం వచ్చాడు. సోణుత్తరుని ఇంట జన్మించిన మహాసేనుడనే బుద్ధకాయాన్ని గుర్తించాడు. ఆ తర్వాత సోణుత్తరుని ఇంటికి భిక్షకోసం రాసాగినాడు. సోణుత్తరుని ఇల్లాలు ఛీత్కరించి పంపేది. నిర్వికారంగా వెళ్ళేవాడు రోహణుడు. రోజూ అదేగతి. ఇలా ఏడు సంవత్సరాలు గడిచింది. నాగసేనుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు.

రోహణుడికి సోణుత్తరుని ఇల్లాలు ఒకనాడు, ఏ కళనుందో ఏమో, తిట్టిపోయకుండా "అధిగచ్చథ భన్తే" (ముందు ఇంటికి వెళ్ళండి) అని ఆదరంగా పలికింది. రోహణుడు వెళుతూంటే సోణుత్తరుడు అగుపడి, "మా ఇంట మీకు భిక్ష దొరికిందా" అని అడిగాడు. "అవున"న్నాడు రోహణుడు. ఇంటికి వచ్చిన సోణుత్తరుడు, భార్యను ప్రశ్నిస్తే, ఆమె భిక్ష ఏమీ ఇవ్వలేదని చెప్పింది. మరుసటి రోజు సోణుత్తరుడు రోహణుడిని కడిగిపారేద్దామని నిశ్చయించుకుని ఇంటిముందు కూర్చున్నాడు. రోహణుడు రాగానే అతణ్ణి నిందించాడు. "నీవొక మృషావాదివి. నిన్న మా ఇంట భిక్ష దొరికిందని అబద్ధం చెప్పావు" అన్నాడు. " అయ్యా! ఎన్నడూ ఆదరించని ఇల్లాలు మార్దవంగా ఒక మాట చెప్పింది. ఆ వచనలాభమే నా భిక్ష" అన్నాడు రోహణుడు. సోణుత్తరుడు చింతించాడు. ఒక్క వచనలాభమే ఇంత సంతోషాన్నిస్తే, భిక్ష ఇస్తే ఇంకెంత సంతోషిస్తాడో"నని రోహణుడికి భిక్ష ఇచ్చాడు. ఆ తర్వాత రోజునుండి ప్రతి రోజూ భిక్ష ఏర్పాటు చేశాడు.

నాగసేనుడు ఎనిమిది యేళ్ళ వయసులో గురువు వద్ద శాస్త్రాలన్నీ నేర్చేశాడు. అతనికి శాస్త్రాల మీద ఎందుచేతనో విరక్తి కలిగింది. మరణ సమయంలో ఈ శాస్త్రాలన్ని ఎందుకు పనికి వస్తాయోనని సందేహం కలిగేది.

ఒక రోజు నాగసేనుడు, తన ఇంట్లో భిక్ష స్వీకరిస్తున్న రోహణున్ని, "భన్తే! మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు మీ దుస్తులు మాకంటే వేరుగా ఉన్నాయి? ఎందుకు మీరు భిక్ష తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు?లోకరీతికి భిన్నంగా ముండనం ఎందుకు చేసికొన్నారు?" అని అడిగాడు.

రోహణుడు జవాబు చెబుతూ, "బాలకా! నేను ప్రవ్రజితుడను, పాపరూపములైన మలములను వదిలించుకొనేదానికి ఇల్లూవాకిలీ వదిలివేశాను. అలంకార, మండన, తైలమర్దన, ధోవన (shampoo),మాల, గంధ, వాసన,హరీతక, ఆమలక, రంగ(dye), బంధన,కోచ్ఛ(దువ్వెన), కప్పక, విజటన, ఊకా, కేశరక్షణ అనే పదహారు చింతనలనుండి తప్పించుకుందుకు కేశశ్మశ్రువులను తీసివేసుకున్నాను. కామమోహితం కారాదని ఈ బట్టలు వేసుకున్నాను" అన్నాడు. 

"
మీకు లోకంలో ఉత్తమమైన విద్య ఏదో తెలుసా?" అడిగేడు నాగసేనుడు.

"
తెలుసు. ఆ విద్య తెలియాలంటే నువ్వు ప్రవ్రజ్యం తీసుకోవాల"న్నాడు రోహణుడు.

నాగసేనుడు తల్లిదండ్రుల అనుమతితో ప్రవ్రజ్యం తీసుకుని రోహణుడితో కూడా సాగిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి నాగసేనుడు అర్హతుడయ్యాడు. క్రమంగా అతనికి శిష్యులు ఏర్పడ్డారు. ప్రవచనాలు చేస్తూ సాగలనగరానికి వచ్చాడు. నాగసేనుని శిష్యులలో ఆయుపాలుడనే ఒకతణ్ణి మిళిందుడు వాదనతో ఓడించాడు. ఆ శిష్యుడు నాగసేనునికి జరిగింది చెప్పడంతో, నాగసేనునికి మిళిందుని కలిసే అవకాశం వస్తుంది. ఒక శుభముహూర్తాన, భిక్షుల సంఘం చుట్టూ ఉండగా. రాజాస్థానంలో మిళిందుడు నాగసేనునితో వాదం పండితవాదం ప్రారంభించాడు.

వాదం పండితవాదం, రాజవాదం అని రెండురకాలు. మొదటివాదంలో సమాధానం కోసం తాపత్రయం మాత్రమే ఉంటుంది. వాదనను అటు, ఇటు పొర్లించి సమాధానం వెతకటం పండితవాదం. ఎదుటి వ్యక్తి వాదం విని కోపం తెచ్చుకుని శాసించటం రాజవాదం.

మిళిందుడు నాగసేనుడితో అనేకవిధాలుగా వాదించాడు. "నువ్వెవరు? నువ్వు ఏమీ కాకపోతే ఇంత ఆర్భాటం ఎందుకు? సంసారం మీద విరక్తి చెందితే ఆత్మహత్య చేసుకోక ఈ తతంగం ఎందుకు నడుపుతున్నావు? బుద్ధుడికి కోపం రాదంటావు, సారిపుత్రుణ్ణి మందలించాడంటావు. ఏది నిజం? దుస్తులు మారిస్తే నిర్వాణం వచ్చేస్తుందా?" ఇలా అనేకరకాలుగా వాదించాడు. నాగసేనుడు మిళిందుని ప్రశ్నలకు ధీటుగా, ఓపికగా, ఆర్తితో, ఆసక్తితో బదులుచెప్పాడు.

చివరికి -

తన ప్రశ్నలన్నీ నశించడంతో మిళిందుని చిత్తవికారాలన్నీ తొలగిపోయాయి. నాగసేనునికి, శిష్యవర్గానికి ఒక విహారం కట్టించాడు మిళిందుడు. తన తదనంతరం కుమారుని రాజ్యం అప్పగించి ఇల్లు విడిచి ప్రవ్రజ్య తీసుకున్నాడు. తన రెండువందల అరవై రెండు ప్రశ్నలను లిఖితం చేసి భద్రపర్చాడు.

**************************************************

పై కథ చాలావరకూ సంక్షిప్తీకరించి చెప్పినది.

**************************************************

మిళిందపన్హ అనేది బౌద్ధ సాహిత్యంలో ఒక అద్భుతం. ఈ పుస్తకంలో ప్రశ్నలు మనకూ రోజువారి జీవితంలో కలిగేవే.  దీన్ని ఆచార్య వసుబంధుడు క్రీ. శ. ఒకటవ శతాబ్దంలో రచించాడు. ఇది కాలక్రమేణా చీనాభాషలోకి అనువాదం చేయబడింది. బౌద్ధ త్రిపిటకాలలో వీటిని చేర్చడం కూడా జరిగింది. ప్రాకృతంలో ఈ పుస్తకం నేడు దొరుకుతున్నది. (బౌద్ధ భారతీ - వారాణసి) ఆంగ్లానువాదాలున్నాయి కానీ ఇలాంటి పుస్తకాలు భారతీయార్థంలోనివి ఆంగ్లంలో స్థూలంగా అర్థమయినా, సూక్ష్మస్థాయిలో అర్థాలు మారిపోయే అవకాశం ఉంది. తెలుగులో ఈ పుస్తకం సంక్షిప్తానువాదం బోధచైతన్య అనే ఒకాయన చేశారు. ఈ పుస్తకం విక్రయానికి కాదు. భాగ్యనగరంలో ఆనందబుద్ధవిహార ట్రస్టు వారి దగ్గర ఈ కాపీలు దొరకవచ్చు.

Sunday, July 3, 2011

తొలకరి జల్లు


ఈ మధ్య బ్లాగులు వ్రాయడంలో ఏ మాత్రం ఆసక్తి కుదరట్లేదు. ఇటు రెండేళ్ళు కుస్తీ పట్టి, అయ్యవార్లను పీడించి
నేర్పించుకున్న పద్యాలు కూడా ఎంచేతో కుదరట్లేదు. ఏదో ఒకటి రాయాలి..రాయాలి..అని మనసు లాగేస్తోంది. సరే ఏం రాద్దాం అనుకుంటే ఈ రోజు (నా డిక్షనరీలో ఈ రోజు అంటే నిన్న)  ఆషాఢమాసం అని తెలిసొచ్చింది. ఈ మధ్య న్యూసు, టీవీ పుణ్యమాని మదర్స్ డే లు ఫాదర్స్ డేలు తెలుస్తున్నాయి కానీ ఆషాఢ మాసాలు, పాడ్యమి తిథీ, నక్షత్రాలు తెలియట్లేదు. షో కేసులో ప్లాస్టిక్ పూలు చూసుకుని మురిసి పోయే రకాలం మనం. ఏదైనా ప్రశాంతంగా ఉన్న తోటలోకి పారిపోయి పూలమొక్కల మధ్య ఓ సాయంత్రం మొత్తం మౌనంగా గడిపి వస్తే మనసుకు పట్టిన తుప్పు వదిలి ఫలితం కనబడవచ్చునేమో!

విషయానికొద్దాం. ఆషాఢమాసం వర్షర్తువు, ప్రావృట్కాలం. "మాసానాం మార్గశీర్షోsహం ఋతూనాం కుసుమాకరః" అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. "నెఱ్ఱెలు విచ్చిన నేలతల్లిని చూసి పైనున్న ఆకాశం రాల్చిన అశ్రుకణం తాకే ఆషాఢ మాసం" -ఆయన్ను కదిలించలేకపోయింది. ఆయనేమో ఆనంద స్వరూపుడాయె. ఆయనకు కోకిల కుహూరవాలు, మామిడి పూతలు, చిగురించే పుష్పాలతో అవసరం. మనం మనుషులం కాబట్టి మనకు తొలకరి జల్లులు, మట్టి వాసనలు, పసి పిల్లల కాగితపు పడవలు మనకివి ఆనందం. (అఫ్కోర్సు due apologies on గీతాకారుడు)   
 
వర్షం పడుతూంటే కిటికీ పక్కన చల్లగాలి తగులుతూంటే ప్లేట్లో పకోడీలు, ఇటుపక్కన ఏ చిట్టిబాబు వీణానాదమో, ఆకాశవాణి లో ఛాయాగీత్ కానీ వింటూ, పక్కనో పాత చందమామ లేదా యువ పత్రిక తిరగేస్తూ ఉంటే.. ఆహా. స్వర్గంలో రంభలూ,ఊర్వశులు తప్ప ఇలాటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో.

నాకు నా చిన్నతనం నుండీ నీళ్ళ పిచ్చి విపరీతంగా ఉండేదట. అపసోపాలు పడి బడిలో చేర్పించాక, ఒక రోజు పొద్దున మా వీధి మొగదల వీధి కొళాయి నీళ్ళు అందరూ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను దానికింద తిష్టవేశానట. అలా నీళ్ళలో తడిసిపోతూ ఆనందంలో మునిగి తేలుతా ఉంటే, ఎవరో దుర్మార్గుడు మా ఇంట్లో వాళ్ళకు చెప్పి, వాళ్ళు నా తడిచిపోయిన పలక, బలపం తీసేసుకుని లాక్కుపోయి బడితెపూజ చేశారట. (ఈ విషయాలు మా ఇంట్లో వాళ్ళెప్పుడైనా చెప్పుకుంటూంటారు) ఆ తర్వాత ఏడవ తరగతిలో ఓ మారు మా ఫ్రెండు ఇంట్లో దిగుడు బావి ఉంటే అక్కడకెళ్ళి మునగబెండ్లవీ కట్టుకుని ఈత నేర్చుకుందుకు ప్రయత్నిస్తే, ఆ కుట్రను కూడా మా ఇంట్లో వాళ్ళు కనిపెట్టి భగ్నం చేశారు.

మూడేళ్ళ తమ్మి (సంహిత) కి కొన్ని నాన్న బుద్దులు వచ్చాయి. అమ్మ వారసత్వం కూడా (తమ్మి వాళ్ళమ్మ రైతుబిడ్డ). నాన్న బుద్దులు విజృంభించినప్పుడు వర్షంలో/నీళ్లలో ఆటలు, అమ్మ వారసత్వం బలంగా పని చేసినప్పుడు మా ఇంటి వెనుక చెట్లకు పాదులు తవ్వడం వంటి శ్రమజీవి లక్షణాలు అలవర్చుకుంది. నాకైతే అమ్మవారసత్వం ఇబ్బంది లేదు కానీ, మా ఆవిడ మాత్రం తమ్మి తాలూకు నాన్న బుద్ధుల్ని నిరసిస్తుంది. వర్షంలో తడిస్తే కసురుతూంటుంది.

రెండేళ్ళ క్రితం ఓ రోజు బస్సులో వెళుతున్నాను. బయట చినుకులు పడుతున్నాయి. ఆకాశం మన కళ్ళు పడితే
దిష్టి కొడుతుందేమో అన్నంత అందంగా ముస్తాబయింది. అప్పుడు బయట ఆకాశం, కిటికి పక్కన అలవోకగా జల్లు
కొడుతున్నప్పుడు మృచ్ఛకటికం అనే సంస్కృతనాటకం పుస్తకం చదివాను. ఆ నాటకంలోనూ కాకతాళీయంగా (ఐదవ అంకం) వర్ష రుతు వర్ణన. ఆ నాటకంలో సందర్భం ఇది. నాయిక వసంతసేన తన ప్రియుడి ఇంటికి వెళుతూంటుంది. ఆమెకు తోడుగా ఒకతను. వాళ్ళిద్దరూ (గాసిప్పులవీ కాకుండా) వర్షం గురించి మాట్లాడుకొంటూ, వర్షాన్ని వర్ణిస్తూ ఉంటారు.

" ఆహా ఈ నల్లమబ్బులు విరహిణుల హృదయాల్లాగా ఎంత భారంగా ఉన్నాయి? ఇదుగో ఈ ఉరుములు విని నెమళ్ళు పైకెగిరి, రెక్కలు అల్లల్లాడిస్తూంటే, ఆకాశాన్ని ఎవరో మణిమయవింజామరలతో వీస్తున్నట్టు లేదూ!"

"మేఘుడు వర్షధారలనే శరాలతో కొట్టి చంద్రుణ్ణి వశపర్చుకున్నాడు. ఉరుములు ఈ యుద్ధంలో భేరీనినాదాలు. మెఱుపులు మేఘుని విజయపతాకలు. చంద్రకిరణాలు - చంద్రుడు పన్నుల ద్వారా ప్రజలను పిండి వసూలు చేసిన సొమ్ము. వాటిని మేఘుడు కబళించాడు."

"ఈ దట్టమైన మేఘం చూడు! ఏనుగాలాగా ఉంది. ఆ కొంగలబారును చూశావూ! ఏనుగు కుంభస్థలంమీద అలంకరించిన పట్టుపాగాలానూ, మెఱుపులు వింజామరల్లానూ లేవూ?"

"ఆ పైనున్న మేఘాలు ఇంద్రుడి ఆజ్ఞ మేర మెఱుపులనే వెండి మోకులు విడిచి భూమిని కట్టి పైకి లాగుతున్నట్టుగా ఉంది!"

"ఆ కదంబ వృక్షం ఎఱ్ఱటి దివ్వెలా ఎలా వెలిగిపోతుంది చూడు!"

"దుష్టుడికి చేసిన ఉపకారాల్లాగా నక్షత్రాలు ముఖం చాటు చేశేసాయి.  ప్రోషితభర్తృకలలాగా దిక్కులు శోభను కోల్పోయినాయి."

"ఈ ఆకాశం మెఱుపులతో మండుతూంది. కొంగల గుంపుతో నవ్వుతూంది. హరివిల్లుతో కయ్యం పెట్టుకుంటూంది. పిడుగులతో అరుస్తూంది. మబ్బులతో ధూపంలా ఉంది"

....
....
....

అన్నట్టు ప్రోషిత భర్తృక = సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్య అని అర్థమట. ఈ మధ్యే తెలిసింది.

మృచ్ఛకటికం లో ఈ వర్ష ఋతు వర్ణన, సంస్కృత సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన వర్ణనగా పండితులు చెబుతారు.

అంత హెవీగా కాకపోయినా మన రవీంద్రుడు కూడా వర్షాన్ని తెగ వర్ణిస్తాడు. ఉరుముల శబ్దం, వలలో చిక్కిన అడవిదున్న ఆర్తనాదంలా ఉందంటాడాయన. ఈ వర్ణనలకన్నా, నాకు మాత్రం (కవీంద్రుని) కాగితపు పడవ తెగ నచ్చుతుంది. మా పాపకు కూడా.