Sunday, July 3, 2011

తొలకరి జల్లు


ఈ మధ్య బ్లాగులు వ్రాయడంలో ఏ మాత్రం ఆసక్తి కుదరట్లేదు. ఇటు రెండేళ్ళు కుస్తీ పట్టి, అయ్యవార్లను పీడించి
నేర్పించుకున్న పద్యాలు కూడా ఎంచేతో కుదరట్లేదు. ఏదో ఒకటి రాయాలి..రాయాలి..అని మనసు లాగేస్తోంది. సరే ఏం రాద్దాం అనుకుంటే ఈ రోజు (నా డిక్షనరీలో ఈ రోజు అంటే నిన్న)  ఆషాఢమాసం అని తెలిసొచ్చింది. ఈ మధ్య న్యూసు, టీవీ పుణ్యమాని మదర్స్ డే లు ఫాదర్స్ డేలు తెలుస్తున్నాయి కానీ ఆషాఢ మాసాలు, పాడ్యమి తిథీ, నక్షత్రాలు తెలియట్లేదు. షో కేసులో ప్లాస్టిక్ పూలు చూసుకుని మురిసి పోయే రకాలం మనం. ఏదైనా ప్రశాంతంగా ఉన్న తోటలోకి పారిపోయి పూలమొక్కల మధ్య ఓ సాయంత్రం మొత్తం మౌనంగా గడిపి వస్తే మనసుకు పట్టిన తుప్పు వదిలి ఫలితం కనబడవచ్చునేమో!

విషయానికొద్దాం. ఆషాఢమాసం వర్షర్తువు, ప్రావృట్కాలం. "మాసానాం మార్గశీర్షోsహం ఋతూనాం కుసుమాకరః" అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. "నెఱ్ఱెలు విచ్చిన నేలతల్లిని చూసి పైనున్న ఆకాశం రాల్చిన అశ్రుకణం తాకే ఆషాఢ మాసం" -ఆయన్ను కదిలించలేకపోయింది. ఆయనేమో ఆనంద స్వరూపుడాయె. ఆయనకు కోకిల కుహూరవాలు, మామిడి పూతలు, చిగురించే పుష్పాలతో అవసరం. మనం మనుషులం కాబట్టి మనకు తొలకరి జల్లులు, మట్టి వాసనలు, పసి పిల్లల కాగితపు పడవలు మనకివి ఆనందం. (అఫ్కోర్సు due apologies on గీతాకారుడు)   
 
వర్షం పడుతూంటే కిటికీ పక్కన చల్లగాలి తగులుతూంటే ప్లేట్లో పకోడీలు, ఇటుపక్కన ఏ చిట్టిబాబు వీణానాదమో, ఆకాశవాణి లో ఛాయాగీత్ కానీ వింటూ, పక్కనో పాత చందమామ లేదా యువ పత్రిక తిరగేస్తూ ఉంటే.. ఆహా. స్వర్గంలో రంభలూ,ఊర్వశులు తప్ప ఇలాటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో.

నాకు నా చిన్నతనం నుండీ నీళ్ళ పిచ్చి విపరీతంగా ఉండేదట. అపసోపాలు పడి బడిలో చేర్పించాక, ఒక రోజు పొద్దున మా వీధి మొగదల వీధి కొళాయి నీళ్ళు అందరూ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను దానికింద తిష్టవేశానట. అలా నీళ్ళలో తడిసిపోతూ ఆనందంలో మునిగి తేలుతా ఉంటే, ఎవరో దుర్మార్గుడు మా ఇంట్లో వాళ్ళకు చెప్పి, వాళ్ళు నా తడిచిపోయిన పలక, బలపం తీసేసుకుని లాక్కుపోయి బడితెపూజ చేశారట. (ఈ విషయాలు మా ఇంట్లో వాళ్ళెప్పుడైనా చెప్పుకుంటూంటారు) ఆ తర్వాత ఏడవ తరగతిలో ఓ మారు మా ఫ్రెండు ఇంట్లో దిగుడు బావి ఉంటే అక్కడకెళ్ళి మునగబెండ్లవీ కట్టుకుని ఈత నేర్చుకుందుకు ప్రయత్నిస్తే, ఆ కుట్రను కూడా మా ఇంట్లో వాళ్ళు కనిపెట్టి భగ్నం చేశారు.

మూడేళ్ళ తమ్మి (సంహిత) కి కొన్ని నాన్న బుద్దులు వచ్చాయి. అమ్మ వారసత్వం కూడా (తమ్మి వాళ్ళమ్మ రైతుబిడ్డ). నాన్న బుద్దులు విజృంభించినప్పుడు వర్షంలో/నీళ్లలో ఆటలు, అమ్మ వారసత్వం బలంగా పని చేసినప్పుడు మా ఇంటి వెనుక చెట్లకు పాదులు తవ్వడం వంటి శ్రమజీవి లక్షణాలు అలవర్చుకుంది. నాకైతే అమ్మవారసత్వం ఇబ్బంది లేదు కానీ, మా ఆవిడ మాత్రం తమ్మి తాలూకు నాన్న బుద్ధుల్ని నిరసిస్తుంది. వర్షంలో తడిస్తే కసురుతూంటుంది.

రెండేళ్ళ క్రితం ఓ రోజు బస్సులో వెళుతున్నాను. బయట చినుకులు పడుతున్నాయి. ఆకాశం మన కళ్ళు పడితే
దిష్టి కొడుతుందేమో అన్నంత అందంగా ముస్తాబయింది. అప్పుడు బయట ఆకాశం, కిటికి పక్కన అలవోకగా జల్లు
కొడుతున్నప్పుడు మృచ్ఛకటికం అనే సంస్కృతనాటకం పుస్తకం చదివాను. ఆ నాటకంలోనూ కాకతాళీయంగా (ఐదవ అంకం) వర్ష రుతు వర్ణన. ఆ నాటకంలో సందర్భం ఇది. నాయిక వసంతసేన తన ప్రియుడి ఇంటికి వెళుతూంటుంది. ఆమెకు తోడుగా ఒకతను. వాళ్ళిద్దరూ (గాసిప్పులవీ కాకుండా) వర్షం గురించి మాట్లాడుకొంటూ, వర్షాన్ని వర్ణిస్తూ ఉంటారు.

" ఆహా ఈ నల్లమబ్బులు విరహిణుల హృదయాల్లాగా ఎంత భారంగా ఉన్నాయి? ఇదుగో ఈ ఉరుములు విని నెమళ్ళు పైకెగిరి, రెక్కలు అల్లల్లాడిస్తూంటే, ఆకాశాన్ని ఎవరో మణిమయవింజామరలతో వీస్తున్నట్టు లేదూ!"

"మేఘుడు వర్షధారలనే శరాలతో కొట్టి చంద్రుణ్ణి వశపర్చుకున్నాడు. ఉరుములు ఈ యుద్ధంలో భేరీనినాదాలు. మెఱుపులు మేఘుని విజయపతాకలు. చంద్రకిరణాలు - చంద్రుడు పన్నుల ద్వారా ప్రజలను పిండి వసూలు చేసిన సొమ్ము. వాటిని మేఘుడు కబళించాడు."

"ఈ దట్టమైన మేఘం చూడు! ఏనుగాలాగా ఉంది. ఆ కొంగలబారును చూశావూ! ఏనుగు కుంభస్థలంమీద అలంకరించిన పట్టుపాగాలానూ, మెఱుపులు వింజామరల్లానూ లేవూ?"

"ఆ పైనున్న మేఘాలు ఇంద్రుడి ఆజ్ఞ మేర మెఱుపులనే వెండి మోకులు విడిచి భూమిని కట్టి పైకి లాగుతున్నట్టుగా ఉంది!"

"ఆ కదంబ వృక్షం ఎఱ్ఱటి దివ్వెలా ఎలా వెలిగిపోతుంది చూడు!"

"దుష్టుడికి చేసిన ఉపకారాల్లాగా నక్షత్రాలు ముఖం చాటు చేశేసాయి.  ప్రోషితభర్తృకలలాగా దిక్కులు శోభను కోల్పోయినాయి."

"ఈ ఆకాశం మెఱుపులతో మండుతూంది. కొంగల గుంపుతో నవ్వుతూంది. హరివిల్లుతో కయ్యం పెట్టుకుంటూంది. పిడుగులతో అరుస్తూంది. మబ్బులతో ధూపంలా ఉంది"

....
....
....

అన్నట్టు ప్రోషిత భర్తృక = సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్య అని అర్థమట. ఈ మధ్యే తెలిసింది.

మృచ్ఛకటికం లో ఈ వర్ష ఋతు వర్ణన, సంస్కృత సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన వర్ణనగా పండితులు చెబుతారు.

అంత హెవీగా కాకపోయినా మన రవీంద్రుడు కూడా వర్షాన్ని తెగ వర్ణిస్తాడు. ఉరుముల శబ్దం, వలలో చిక్కిన అడవిదున్న ఆర్తనాదంలా ఉందంటాడాయన. ఈ వర్ణనలకన్నా, నాకు మాత్రం (కవీంద్రుని) కాగితపు పడవ తెగ నచ్చుతుంది. మా పాపకు కూడా.

Thursday, June 2, 2011

నూరు యోజనాలకు...



నేనిలా బ్లాగులు రాస్తాన్నట్లు మా అవ్వ చిన్నప్పుడు తన కతలు చెబుతా ఉండేది. మా అవ్వ అంటే మా అమ్మ నాయనకు చెల్లెలు. ఆయమ్మకు చిన్నతనంలోనే పెండ్లి చేస్తే, మొగుడు చనిపోయి విధవయింది. అప్పట్నుండి ఆయమ్మను సాకే పని మా తాతదయ్యింది. ఆచారం, ఆచారం అని నీల్గినందుకు గానూ ఆయనకొచ్చిన బహుమానం ఇది. బిడ్డా, గొడ్డూ లేదు కాబట్టి ఆయమ్మకు నా మీద ప్రత్యేకమైన ప్రీతి కాబట్టీ, నాకు ముచ్చట్లు చెబుతా ఉండేది.

మా తాత గోదావరి ధవళేశ్వరం కాడ బారేజీ కట్టేప్పుడు పీడబ్ల్యూడీలో గుమాస్తాగా చేసేటోడంట. ఆయనా, ఆయన భార్యా, తల్లీ, చెల్లెలు, చిన్న పిల్లకాయొకడూ. (అప్పటికి మాయమ్మ పుట్టలే) ఇదీ సంసారం. గోదారోళ్ళ మాటలు వీళ్ళకర్థమయేవి గాదంట. ఆ మాటకొస్తే వాళ్ళు ఎక్కడో తంజావూరు దగ్గర్నుంచీ వలస వచ్చినోళ్ళు కాబట్టి తెలుగే అంతంత మాత్రం. ప్రతి రోజు హాశ్చెర్యమే. 

సపోటాలమ్ముతా ఉంటే చూసి, వీళ్ళు ఉర్లగడ్డను కూడా పండు గా మార్చి తింటున్నారని అనుకొన్నారంట, మరో రోజు వీధిలో ఎవతో మరమరాలు అమ్ముతా ఉంటే ఆమెను ఏమ్మో వియ్యపురాలూ అని పిలిస్తే, ఆవిడొచ్చి ఎవరికి వియ్యపురాలు? అని ఒకటే గలాట పెట్టుకొనిందంట. మా ఊళ్ళో (సీమలో) మరమరాలకు బొరుగులు అని, వియ్యపురాలిని సంబంధి అని వాడుక. (మరమరాలకు, వియ్యపురాలకు మధ్య కన్ఫ్యూజన్ ఆమెకు) ఇట్లాంటి కబుర్లు చెప్పేది. ఆయమ్మవన్నీ డౌలు మాటలని అనుకునేటోళ్ళం నేనూ మాయన్నా. ఒకరోజు ఇదే గోదావరి కబుర్లు చెబుతా,మనకిక్కడ సీతాఫలమున్నట్ల అక్కడ రామాపండు ఉంటుందిరా అనింది. అది నేను నమ్మలే. ఇన్ని యేళ్ళ తర్వాత ఆ మధ్యనెప్పుడో ఒక ఫోటోబ్లాగాయన ఫోటోపెట్టి చూయిస్తే నమ్మాల్సొచ్చింది!

చిన్నప్పుడివి తెలీకపోయినా నా కాలేజీ రోజుల నుంచీ ఈ రోజు వరకూ ఇట్లాంటి ఆశ్చర్యాలు కనిపిస్తూనే ఉన్నై. వారం రోజుల క్రితం హైదరాబాదొచ్చి ఇక్కడ ఇల్లు చూసుకున్నప్పుడు గంటయ్య పరిచయమయ్యాడు. గంటయ్య నేనున్న అపార్టుమెంటు వాచ్ మెన్. అతనిది పాలకొల్లట. గోదావరి యాస. మొదట్రోజు ఒక్క ముక్క అర్థం కాలేదు. తర్వాత్తర్వాత డీకోడ్ చేసి అర్థం చేసుకుంటున్నా. మొన్నో రోజు పొద్దున అతను పలకరించాడు.

"సారూ, మీ జోళ్ళొదిలీశారేటండి?"

"?...కళ్ళజోడా?" (అడిగిన తర్వాత తెలిసింది వెధవప్రశ్నని)

"కాదండి, కాల్జోళ్ళండి"

కాసేపటికి బల్బు వెలిగింది. నా చెప్పులు బయట మర్చిపోయాను. అదీ సంగతి. మా ప్రాంతంలో కొన్ని చోట్ల చెప్పులకు మెట్లు అంటారు (మెట్టుతో కొడతా అని ఒక పాపులర్ తిట్టనమాట).

బల్బంటే గుర్తొచ్చింది. ఇంటికి బల్బు తెచ్చుకోవాలి.బయట అంగడికెళ్ళాను.

షాపతనకి చెప్పాను. బల్బొకటివ్వమని.

"అర్ పయ్యా? నల్ పయ్యా?"

"?!"

నా అయోమయం చూసి మళ్ళీ అడిగాడు. అర్థం కాకుండా తిరిగి వచ్చేస్తూంటే సిక్స్టీ వాట్ బల్బు, సిక్స్టీని అర్పై అంటున్నాడు కాబోలని స్ఫురణ(యాద్)కొచ్చింది. అదీ సంగతి.

ఇంటికొస్తే మా పాప మొదలెట్టింది.

"నానా, మామిడి పండు తింటా నానా, పండు నేను తింటా పొట్టు నువ్వు తిను.." (మామిడిపండు తోలు నాకు ఇష్టం.
అందుకని పండు కోసి దానికి పెట్టి తోలు నేను తినడం అలవాటు)

పొట్టు - ఫక్కున నవ్వొచ్చింది.

నవ్వుతూంటే అంది. "నానా నువ్వు నవ్వొద్దు". -

(తప్పుతుందా) "!...సరే"

కాలేజీ రోజుల్లో నెల్లూరతను మా మాటలు చూసి నవ్వే వాడు. ఓ రోజు కొన్ని పదాలు రాసుకొచ్చినాడు. వాడు రాసుకొచ్చిన మాటల్లో కొన్ని జ్ఞప్తికున్నవి.

"తీరుమానం"
"పాలేగాడు"
"రెట్టమతం"
"కొల్లబడిబోయింది"
"ఉర్లగడ్డ"
"బీగంచెవి" (బీగం - అంటే ఓ మారు మా కొలీగు ముసల్మాను భార్య అనుకుని తికమకపడినాడంట. ఆ తర్వాత అర్థయింది,వేరే ఏదో అని)
"తట్ట" (కంచం)
..
..

వాడిని అప్పట్లో బాగా తన్నాలనిపించింది, కానీ ఆ పరిస్థితి నాకూ చాలాసార్లు ఎదురయ్యింది. భారతదేశంలో ప్రతి నూరు యోజనాలకు భాష మారుతుందని పెద్దలమాటట. భాష ఒకటయినా మాటలర్థం కాక, అలాంటిది అనుభవంలోకొస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.