Monday, October 20, 2014

అన్నబెల్లె యను దయ్యపు కథ


అది యొక బొమ్మ. బొమ్మ యనగానేమి? ఆటవస్తువు. భౌతికముగ నా యాటవస్తువునకు ప్రయోజనము శూన్యము. మరి మానవులెందుకు యాటవస్తువులను కొనుచుందురు? అది యొక మానసికావసరము. లోకమున ప్రతివస్తువునకూ భౌతికముగనూ, మానసికముగనూ ప్రయోజనముండును. ఆ ప్రయోజనమును గుర్తింపక, భౌతికావసరముననో, లేక కేవలమానసికావసరమాత్రవిశేషముగనో ప్రాధాన్యతను నిర్ణయించుట మానవుని స్వభావదోషము. దీపావళి పండుగ గలదు. ఆనాడు మాతాబాలు కాల్చుట యొక సాంప్రదాయము. మాతాబాలు వెలిగించుట వ్యర్థమగు ఖర్చని కొందరందురు. ఇవతలి వాడు "అది సత్యభామ నరకుని సంహరించిన తరుణమును గుర్తించుకొనుటకై యేర్పడిన యేర్పాట"ని జెప్పబోవును. అవతలివాడందులకంగీకరింపడు. ఈతని సాంస్కృతికావసరమును యాతడు గమనింపడు. లోకపు తీరిట్లుండును.

అతడామె ప్రణయసామ్రాజ్యమునకు సమ్రాట్టు. ఆమె యాతని ప్రణయిని. వారువురి వివాహబంధము యొక అందమైన కావ్యము. ప్రకృతమాయమ గర్భము దాల్చినది. ఒకదినము జాన్ ఆమెతో నిట్లనెను.
"ఏమోయీ! నీకేమైననూ కోరికలున్నవా? చెప్పినచో తీర్తును."
"నాకేమియునూ వద్దు."
"అట్లు కాదు. నీకు కాకపోయిననూ, నీ యందున్న ప్రాణికి ఏమైన కోరికలుండవచ్చును."
"ఆ ప్రాణికి బాహ్యప్రపంచము తెలియదు. ఆ యవసరముండదు లెండు."
"అట్లనకోయి. గర్భస్థశిశువు ప్రపంచమును గమనించునని, అందులకొక తీరు గలదని వైద్యులు పరిశోధించుచున్నారు."
మియా ఫక్కున నవ్వి యిట్లనెను." మీరలు కోట్లరూపాయల ధనము వెచ్చించి జేయు పరిశోధనాఫలితము నన్నడిగిన ధనమవసరము లేకనే జెప్పియుందును గదా!"

జాన్ కూడా నామె నవ్వుతో శ్రుతి గలిపెను.

మరుసటి రోజు జాన్ ఒక పెద్ద మంజూషికను దెచ్చెను. మియా కనులను మూసి, ఆ పేటికను తెరచెను. ఆ పెట్టెలోనొక బొమ్మ యున్నది. మియా, జాన్ ను విస్మయానందముల గాంచెను. "ఏమండీ! నేనెన్నడో యడిగిన బొమ్మ గదా యిది". "అవునోయి, నిన్న యే కోరిక లేదంటివి" యని మేలమాడెను. పాండురములైన యామె గండద్వయమున రాగోదయమాయెను. ఆమె యా బొమ్మను మిగిలిన బొమ్మలతో గలిపి ముఖ్యమైన గదిలో నుంచెను.

********************

అదే ఆమె చేసిన తప్పు.

ఆ బొమ్మ భవిష్యత్తులో ఒక దుష్టశక్తికి నెలవవుతుందని ఆ క్షణంలో ఆమెకు తెలీదు. చాలా మామూలుగా ఆ బొమ్మను సర్దుతూ, "ఇప్పటికి మొత్తం సెట్టు పూర్తయ్యింది కదండీ" అంది.

దూరంగా ఒక తీతువు పిట్ట వికృతంగా అరుస్తూ వెళుతోంది.

********************

గడియారం తాలూకు రేడియం డయల్ పన్నెండు గంటలని చూపిస్తోంది. దంపతులిద్దరూ నిద్రపోతున్నారు. ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచింది మియా. పక్కనే పడుకున్న జాన్ ను తట్టి లేపింది.

"పక్క యింట్లో ఏదో చప్పుడవుతోంది" చెప్పింది మియా.
"ఉండు చూసొస్తాను" చెప్పాడు జాన్.

మియా బయటకు వచ్చింది. చలిగాలి రివ్వున ఒడుతోంది.

పక్కింట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఆ గొడవను బయటనుండి చూసాడు జాన్."నీవిప్పుడే అంబులెన్స్ కు ఫోన్ చేయి. నేనిప్పుడే వస్తాను" చెప్పి బయటకు పరిగెత్తాడు.

ఆమె ఫోన్ చేస్తుండగా జరిగిందిది.పక్కింటి జంట వేగంగా పరిగెత్తి మియా ఇంట జొరబడ్డారు.

భార్యను కత్తితో పొడవబోయాడతడు. ఆమె అతని గుండెలపై గుప్పిళ్ళతో గుద్దుతూ గింజుకోసాగింది. ఆ ఘటనలో దుండగుడు మియాను గాయపర్చాడు. ఆపైన అతడామెను కత్తితో పొడిచాడు.

పోలీసులు సమయానికి రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే హంతకుడు తన భార్యను పొడిచినప్పుడు ఆ రక్తపు చుక్క పక్కన బొమ్మపై పడింది. ఆ చుక్క బొమ్మ కంటిలో పడి తెల్లటి ఆ బొమ్మ కళ్ళ చివర సన్నటి రక్తపు చారిక నిండడం ఎవరూ గమనించలేదు.

********************

యిది ఇట్లుండ, ఒకనాడు వఱువాత మియా తన నిజగేహమున ఊహావశంబై, వసనమునొక్కదానికి సాధింపనెంచి కుట్టుయంత్రము నవశముగ నాక్రమించి సమయమతిక్రమించుట యెంచక కర్మావశిష్టయై ఉపవిష్టయైనది. అంతట యరమనె (వంటగది) యందు పొయ్యి తనంతట తనే వెలుంగుటం జేసి, యా మంట యంతంతన్ మిక్కుటమై, యగ్ని ప్రమాదమునకు దారితీసెను. మియా యా తెరంగునెఱింగి మంటలనార్పునంత ఆ నిప్పు యందు మరుగుననున్న ప్రేతాత్మ యామెనాక్లిష్టంబొనర్చి కబళింపసొచ్చెను. సమయమునకు యెవరో వచ్చి కాపాడిరి.

మియాకు నెలలు నిండి పనసపండువంటి పసిబిడ్డను ప్రసవించెను. అటపై యా దంపతులు ప్రేతనిలయమైన యా గేహమును వీడి మరియొక నూత్నగేహమున వసింపనిచ్చగించిరి.

రామేశ్వరము పోయిననూ శనేశ్వరము వీడనట్టుల కొత్త ఇంటనూ ఆ యింతికి కంట నిద్ర కరువాయెను. ప్రేతావశిష్టమైనక్రీడాఖండమఖండముగ నీ నూత్నగేహమున యాహ్వానము లేని యతిథి వోలె నరుదెంచెను. ఒకదినంబున మియా సరుకుల కొనుటకవసరంబై, వీధిని యిచ్చంబోవుచుండనామెకు యొక యంగడి కానంబడియెను. ఆ పుస్తకములయంగడి ఎవెలిన్ యను నామెది.

**********************

జ్ఞాపకాల దాహంతో అనుక్షణం తపిస్తూ, జీవితమెందుకో తెలియక, మరణాన్ని వెతుక్కోలేక, జీవిస్తూ మరణిస్తున్న నాకెందుకమ్మా నేస్తం, ఒయాసిస్సులా కనిపించావు? మళ్ళీ ఆ ఒయాసిస్సును చేరబోతే, ఎక్కడ దాహాన్ని తీర్చవలసి వస్తుందోనని నేనొక ఎండమావినని కల్లలెందుకు నేస్తం? ఏదీ ఆశించకపోయినా, స్నేహానికి వెలకడుతున్నానని నా హృదయాన్ని ఎలా అంచనా కట్టావమ్మా? ఎవ్వరూ లేని నాకు అమూల్యమైనది నీ స్నేహమేనని తెలుసుకోలేవా పిచ్చితల్లీ?

ఎవెలిన్ మియాను పలుకరించింది. అది మొదటి పలుకరింపు. ఆ క్షణంలో ఎవెలిన్ కు గుర్తొచ్చినది తన కూతురు. సరిగ్గా కొన్నేళ్ళ ముందు ఒక ఏక్సిడెంట్లో మరణించిన తన కూతురు. బ్రతికి ఉంటే సరిగ్గా మియా వయసు ఉండి ఉండేది.

ఎవెలిన్ ఆపైన మెల్లగా అయినా స్ఫుటంగా మియాతో స్నేహం చేసింది. భర్త లేని వేళల్లో ఆమెకు చేదోడువాదోడయ్యింది. అంతే కాక, మియా ఇంటనున్న ప్రేతాన్ని వదిలించడానికి తనవంతు ప్రయత్నం చేసింది.

**********************

జాన్ మియా దంపతులకు నొక చర్చి మతగురువు తెలిసియుండెను. యాతడు వారి యింటనున్న బొమ్మనూ, బొమ్మనావహించిన ప్రేతాత్మను వదిలింపనెంచి, యా బొమ్మను తీసికొని చర్చ్ కు వచ్చెను.

ఫాదర్ చర్చి తలుపు వద్దకు వచ్చేడు. ఏదో అనుమానం వచ్చి వెనక్కు చూసేడు. అక్కడ - ఒక నల్లని నిశ్చలమైన ఆకారం. పై నుండీ క్రిందివరకూ వ్రేలాడుతున్న అంగీ, చింపిరి జుత్తూ...

అది కాదు అతడు చూస్తున్నది. ఆ ఆకారం కన్నుల్లో నిర్లిప్తత, ఆ నిర్లిప్తత వెనకున్న క్రౌర్యం. ఛప్పున తలతిప్పి చర్చి లోపలికి అడుగుపెట్టబోయేడు.

ఒక్క క్షణం అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏదో రాక్షసహస్తం విసిరేసినట్టు రోడ్డుపైన పడ్డేడు. నోరు తెరిచి యేదో చెప్పబోయాడు. మాట రాలేదు. 

నా ప్రస్థానం ఇందుకా నేస్తం? నా స్నేహం నీతో మాట్లాడటానికే కాదమ్మా, నీకోసం ప్రాణాలివ్వటానికి కూడా. 

**********************

అన్నబెల్లె దయ్యం చివర్న ఏమయ్యింది అన్న ముక్క మాత్రం సినిమాలో చూడండి. :)

Monday, September 16, 2013

మృచ్ఛకటికం - కొన్ని ఆలోచనలు


రచయితకు గొప్ప ఉదాత్తత (sensibility) అన్నది ఉన్నప్పుడు, ఆ ఉదాత్తతను ప్రతిబింబిస్తూ ఒక పాత్ర వెలువడినప్పుడూ, రచయిత యొక్క sensibilities కు తగిన పాఠకుడు ఆ రచనను చదవడం తటస్థించినప్పుడు ఆ రచయితకూ ఆ పాఠకుడికి మధ్య జరిగే ఏకాంతమైన అవగాహన సద్యఃపరనిర్వృతి అని నా అభిప్రాయం. దీన్నే రసనిష్పందం అనవచ్చునేమో. రాళ్ళపల్లి వారు ఒకచోట అన్నట్టు రసం అంటే తొమ్మిది భేదాలతో మాత్రమే నిర్వచింపదగిన emotion మాత్రమే కాదు. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఏదో అనుకూలం కోసం రసాలను నవవిధాలుగా వింగడించుకున్నప్పటికీ రసనిష్పందం యొక్క ఖచ్చితత్వం ఆ వింగడింపులో మాత్రమే లేదు.

సద్యః పరనిర్వృతి కలిగించే రచయితను కవి అని, ఆ పాఠకుడిని సహృదయుడని అనవచ్చునేమో.

వ్యక్తి వ్యక్తికీ సున్నితత్వపు తేడాలు సహజం. అదే స్థాయిలోనూ పాఠకుల సహృదయత కూడా మారుతుంది. అభిమాన రచయిత కూడా మారుతాడు. శాశ్వతంగా అందరికీ నచ్చే రచయిత కానీ, నచ్చే రచన కానీ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఫలానా రచన నా అభిమాన రచన, ఫలానా రచయిత నా అభిమాన రచయిత అన్నది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. అభిప్రాయాలకంటే రచన తాలూకు sensibilities గురించి మాట్లాడుకోవడం మంచిది.

వర్షాకాలం గురించి అనుకోగానే నాకు శూద్రక మహాకవి, మృచ్ఛకటికకావ్యం, అందులో వర్షర్తు వర్ణనా గుర్తొస్తాయి. అలాంటి వర్ణన అంతకన్నా గొప్పగా ఇతర కావ్యాలలో ఉండవచ్చు గాక. అయితే మృచ్ఛకటికం తాలూకు ఉదాత్తత కేవలం వర్ణనలో లేదు. అది దృశ్యకావ్యమవడం మూలాననూ, అక్కడ కవి కల్పించిన సన్నివేశం వల్లనూ, వసంతసేన పాత్ర యొక్క ఉదాత్త స్వరూపం నేపథ్యంగానూ ఆ వర్ణన యొక్క సౌందర్యం వ్యక్తమవుతుంది.

వసంతసేన ఒక గణిక, క్షత్రియ. ఈమె దరిద్రుడూ, అప్పటికే భార్య, పుత్రుడు ఉన్న ఒక సార్థవాహుణ్ణి (బ్రాహ్మణుడు/వైశ్యుడు) ప్రేమించింది. ఒకానొక రాత్రి తన ప్రియుని ఇంటికి బయలుదేరింది. ప్రియుణ్ణి మొదటి సారి చూడబోతున్న తరుణం. ఆమె చిత్తం లోపల ఉద్వేగమూ, ఆనందమూ పెనవేసుకుని ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రశ్న. గణిక - అంటే ఒక వేశ్యకు - అంటే పురుషసంగమం అలవాటైన ఒక యువతికి - ఒక మొగవాని పట్ల అలాంటి భావాలు ఉండటం ఎలా సంభవం? సరిగ్గా ఇక్కడే పాత్ర ఉదాత్తత - సహృదయునికి తెలుస్తుంది. శీలం వేరు, స్వచ్ఛత వేరు. శీలం సామాజికం అయితే స్వచ్ఛత మానసికం. రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు, దోహదకారులూ కానవసరం లేదు. సందర్భమో కాదో తెలియదు కానీ ఈ మధ్య మరోసారి చదివిన యండమూరి నవల అష్టావక్ర గుర్తొస్తుంది. అందులో ప్రతిమా అగర్వాల్ పాత్ర ఇదే పాయింట్ మీద నడుస్తుంది. అలాగే హంపి నుండి హరప్పా దాక లో బసివి నాగమ్మ గురించి రామచంద్రగారు వివరిస్తారు. ఆ పాత్ర గురించి చదివిన తర్వాత పాఠకుడికి సానుభూతే తప్ప ఏ విధమైన వికారమూ కలుగదు. వసంతసేన కూడా అలాంటి ఒక ఉదాత్తమైన పాత్ర.

వసంతసేన ఉద్వేగానందాలను ప్రతిబింబిస్తూ బయట వాతావరణం. కుండపోతగా వర్షం. ఆ వాతావరణంలో వసంతసేనకు తోడుగా గొడుగు పట్టి వెంట వస్తున్న విటునికి, వసంతసేనకూ మధ్య వర్షం గురించిన సంభాషణ.

ఇందులో ఓ రెండు పద్యాలు.

గర్జంతి శైలశిఖరేషు విలంబిబింబా మేఘా వియుక్తవనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళశృంగైః ||

వసంతసేనా! చూడు!చూడు! శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ!

మూఢే ! నిరంతర పయోధరవా మయైవ కాంతః సహాభిరమతే యది కిం తవాత్ర!
మాం గర్జితైరితి ముహుర్వినివారయంతీ మార్గం రుణద్ధి కుపితేవ నిశా పత్నీ ||

‘ఓసి మూర్ఖురాలా! వసంతసేనా! దట్టమైన మబ్బులున్న (ఇఱుకు పయోధరాలు) ఉన్న నేను నా కాంతుడితో రమిస్తూంటే, మధ్యలో నీకేంటి?’ అని ఉరుములతో మాటిమాటికీ నివారిస్తూ (నాపై ఉరుముతూ) ఈ నిశ, సవతి లా మారి, నా దారిని అడ్డగిస్తూంది కదా!
(సవతి ఎందుకంటే, తనను తన ప్రియుడి వద్దకు చేఱుకోనీకుండా అడ్డుపడుతున్నది కాబట్టి) అని వాపోతుంది. పయః అన్న సంస్కృతపదానికి నీరు, పాలు అని రెండు అర్థాలు. నిరంతర పయోధరములు అన్నది శ్లేష. దట్టమైన మబ్బులు అని ఒక అర్థం, (నిర్ + అంతర) ఇఱుకు పయోధరాలని మరొక అర్థం.

********************************************
ఇక్కడ మరో సారి అనంతకృష్ణశర్మ గారిని గుర్తు తెచ్చుకుంటాను. యే ఉదాత్త రచన అయినా రచయిత యొక్క శాంతస్వభావం మూలం కావాలి. ధిషణాహంకారాలూ, పాండిత్యప్రగల్భా వాచ్యార్థాల ప్రాభవం పెంపు చేయవచ్చును, కానీ ఉదాత్తమైన భావం కవి అంతః కుహరాల్లోనుంచి రావాలి. అందుకు శాంతమే ఆలంబన. నిజమైన శృంగార వర్ణన - అది నిజంగా సున్నితత్వాన్ని నింపుకొన్నదైతే ఉద్రేకాన్నీ, ఆవేశాన్నీ కలిగించరాదు. అది చిత్త ఆహ్లాదకారకం కావాలి. అంతమాత్రమే కాదు, రంజింపజేయాలి. కవి తాలూకు దార్శనికత సహృదయుడైన పాఠకుడికి దారి చూపాలి.

మృచ్ఛకటికం కావ్యంలోని ఈ ఘట్టం నిజంగానే వర్షంలో తడుస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అనుభవైకవేద్యం. సన్నివేశం, పాత్రలూ, వాటి ఉదాత్తతా నేపథ్యంగా ఔచిత్యశోభితంగా ప్రావృట్వర్ణన అనే వస్తువును వర్ణించిన అపూర్వమైన ఘట్టం. వ్యక్తిగతంగా నాకు నచ్చిన గొప్ప వర్ణన.