Monday, August 6, 2012

మధురస్వప్నం



రోజూ లాగే మరో పొద్దు పొడిచింది. అదే పొద్దు మునుగుతూనూ ఉంది. ఈ పొద్దుకూ ఎక్కడెక్కడో, ఎన్నో తమ్మిపూలు విరబూసి ఉంటాయ్.  ఈ ఇంటా ఒక తమ్మి విరబూసింది. ఈ రోజు పొద్దునే సంహిత పట్టులంగాలో కనిపించింది. దానికి జుట్టు అంతగా పెరగలేదు. అయినా సరే రెండు క్లిప్పులు పెట్టుకుని, ఒక్కోసారి చిన్న చిన్న మల్లెపూలమాలలు చుట్టుకుని తిరుగుతూంటుంది. భలే నవ్వొస్తుంది. నాన్న బయటికే నవ్వేస్తుంటే అది కొంచెం ఉడుక్కుంటుంది. ఊహూ, ఉడుక్కోవడం కాదు...ఏదో విచిత్రమైన భావం! నాన్న ఎందుకు అమ్మలాగా, అమ్మమ్మలాగా సీరియస్ గా ఉండడు, ఊరికే నవ్వుకుంటూ ఉంటాడు అనేమో!

అవును మరి, అమ్మకూ, అమ్మమ్మలకూ పావడా,అంగీ తడుస్తే కోపం,మట్టిలో ఆడుకుంటే తప్పు, క్రాఫు మాసిపోతేనో, షర్టు నలిగితేనో, ఐస్క్రీం తింటేనో చిన్నపాటి భయం! నాన్నకివేవీ పట్టదు. నాన్న దగ్గర ఫ్రీ!

నాన్న కు బొంగరమాడటం, చేతిలో తిప్పటం వచ్చు ( గోళీలు,బొంగరాలు, చిల్లాకట్టె, బచ్చాలు వంటి విద్యలని ఉగ్గుపాలతో నేర్చుకున్న రక్తం గదా) 



మన్నెప్పుడో రాకరాక ఊర్లో వాన పడితే, తనూ, నాయనా కలిసి గొడుగు పట్టుకుని మిద్దె మీదకెళ్ళారు. కాసేపటికి వానతో బాటు, ఎండ మొదలైంది. దానికి సైడ్ ఎఫెక్ట్ లాగా సరిగ్గా ఇంటికికెదురుగా ఒక రంగురంగులబాణం వచ్చి నిలబడింది. పాప ఆ ఇంద్రచాపాన్ని చూసి దానికంటే అందంగా నవ్వింది. కాసేపటికి మళ్ళీ కాగితపు పడవల పర్వం మొదలయ్యింది. అంతా అయ్యి ఇంటికొస్తే, పాప అమ్మకు పాప, నాన్న ముఖాల్లో వెలుగుకన్నా, పాంటు అంచుల్లో బురద, పావడ అంచుల్లో నీళ్ళు కనబడ్డాయి. తిట్లు మామూలే. నాయన నవ్వు మామూలే. తమ్మి నాన్న వంక చిత్రంగా చూడటమూ మామూలే.

తమ్మికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే అందరికీ బాధ. నాన్నకు మాత్రం ఆ ముల్లు తీయడానికి, ఆ ముల్లు ద్వారా తెలుగు నేర్పడానికి ఒక అవకాశం చిక్కిందన్న ఊహ, ఆ ఊహ వలన వచ్చిన నవ్వు.

మరుసట్రోజు పాప అమ్మ దగ్గరకెళ్ళి పెద్దగా అరుస్తా పద్యం చెప్పింది.

చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ

అమ్మకు అందులో మూడవపాదం అన్నిటికన్నా స్పష్టంగా వినిపించింది. నిరసన మామూలే.

*********************************************************

మా తమ్మిని పట్టులంగాలో చూస్తుంటే ఏదో అస్పష్టమైన జ్ఞాపకం, మా అనంతపురంలో కురిసే వానలాగా నాతో దోబూచులాడుతూ ఉంది. అంతే కాదు, అది నా దగ్గర వచ్చి ఏదో ప్రశ్న అడగడం, దానికి నేను బయటికే నవ్వడం వంటివి చూసినప్పుడు కూడా ఏదో సందిగ్ధమైన ఆలోచన. ఎప్పుడో, ఎక్కడో, ఇలాంటిది నా ముందు జరిగింది అని.

ఆ జ్ఞాపకాల సీతాకోక చిలుక ఇదుగో ఈ రాత్రి నా చేతికి పట్టుబడింది.

**************************************************************

అవును. తమ్మి లానే పట్టు లంగా, చిట్టి చిట్టి జడలతో ఉన్న అమ్మాయి నాకు బహుశా ఐదారేళ్ళప్పుడు పరిచయం. ఆ అమ్మాయి మా పక్కింటి సరోజ. బహుశా నా జీవితంలో మొదటి గర్ల్ ఫ్రెండు!

సరోజ పొద్దస్తమానం మా ఇంట్లోనే ఆడుకునేది. మా ఇంట్లోనే భోంచేసేది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్న విషయం ఆ వయసులోనే ఆమెకు అర్థమయ్యింది! దానికి భోజనం పెట్టటం అమ్మకు, ఇంట్లో అందరికీ ముచ్చట. అయితే "సుందరాంగులను చూచిన వేళల కొందరికి ముచ్చట" ఎలాగో,"కొందరికి బిత్తర" అలాగే. ఎందుకంటే మదీయులకు అప్పుడు తిండి తినిపించడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉండేవి. కిటికీ పక్కన కూర్చోవాలి, అక్కడ కూర్చుని, పెరుగన్నం తినాలి. తినేప్పుడు ఆకాశవాణి కడపకేంద్రంలో నచ్చిన పాట వినబడాలి. నచ్చినపాట - ఎంతగా నచ్చాలంటే ఆ పాట సినిమా బండిలో వినబడితే ఆ బండి వెనక నడుచుకుంటూ తన్మయత్వంతో వెళ్ళిపోయేంత మంచిపాట అన్నమాట.

తిండికి ఇంత హంగామాని చూసి సరోజ నవ్వితే సూర్యుడు సిగ్గుపడి మబ్బులదాపునకెళ్ళిపోడూ!

ట్రాన్సిస్టర్ లో అయిపోయిన సెల్సూ, కొయ్య ఏనుగు బొమ్మా, కొన్ని ప్లాస్టిక్ బొమ్మలూ మా ఇంట ఉండేవి. ఒక ఏడెనిమిది సెల్స్ ను రౌండు గా పెట్టి, వాటిపై మరికొన్నిటిని, వాటిపైన వీలైతే ఒకసెల్ ను ఇలా అమర్చి ఆడుకొంటుంటే, సరోజ పట్టుపావడతో రెండు జళ్ళతో మా ఇంటికి వచ్చేది. భోజనాల సమయానికి కొంచెం ముందుగా. అంత కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడం ఆ పాపాయికి రాదు కాబట్టి ఏదో అలా చూసి వెళ్ళిపోయేది.

చందమామలో భల్లూక మాంత్రికుడు సీరియల్ వచ్చే రోజులవి.

మాచిరాజు కామేశ్వరరావు కథల్లో ’కట్నం’ అనే పదం ఎప్పుడూ వస్తుంది. అదేంటి అని అడిగితే మా అమ్మ చెప్పలేదు. భల్లూకమాంత్రికుడు చివర్లో ’ఇంకా ఉంది’ అంటే ఆ ’ఇంకా’ ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు. సరోజకు మాత్రం వాళ్ళ నాన్న రాత్రి పూట మడతకుర్చీలో పడుకుని చుక్కలు చూపిస్తా ఏవో కథలు చెప్పేవాడు.  నాన్న చేతిలోనే అలా నిద్రపోయేది.

నాకు బాగా జ్ఞాపకమున్న ఒకరోజు. సరోజ మామూలుగానే మధ్యాహ్నానికి కాస్త ముందు మా ఇంటికి రావాలన్న ప్లానుతో ఉంది. వాళ్ళమ్మకు పొద్దస్తమానం పాప అలా పక్కింటికి వెళడం తప్పని, దానికి సర్ది చెప్పాలని తాపత్రయం. అందుకని ముందుగానే భోజనం తినిపించెయ్యాలనుకుంది. ఊహూ. కుదరదు! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా కుదరదో, అలా సరోజ చేత పక్కింటికి వెళ్ళడం మానిపించడం అమ్మకు కుదరలేదు. వాళ్ళ అమ్మకు కోపం వచ్చింది. రెండు దెబ్బలేసింది.

అంతే! ఆ పాప ఏడుపు లంకించుకుంది. ఏమయ్యిందో, ఎలా వినబడిందో తెలియదు. వాళ్ళ నాన్న ఆఫీసు నుండి వచ్చాడు. పాపను సముదాయించాడు. ఆ తర్వాత మా ఇంట్లో ఆడుకోవటానికి పంపాడు!

ఇసుకలో ఆడుకుని బట్టలు పాడుచేసుకుంటే అమ్మ బట్టలు పాడయ్యాయంటే ఏం కాదని సరోజ నాన్న ఎత్తుకుని ముద్దుచేసేవాడు.

ఆ పాప వాళ్ళ నాన్న గారికి ట్రాన్స్ ఫర్ అయింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళ ఆచూకీ లేదు! అంతే! ఆ కథ ఒక ముగిసిపోయిన అందమైన అస్పష్టమైన మధుర స్వప్నం!

తమ్మి రాత్రి పూట అన్ని నక్షత్రాలు ఎక్కణ్ణుంచి వస్తాయని అనుమానం! అవన్నీ చిన్న పిల్లలై భూమీదకు వస్తాయని, ఒక నక్షత్రం పోతే మరొకటొస్తుందని నాన్న నవ్వు దాచుకుంటూ చెబుతున్నాడు. తమ్మికి నాన్న తప్పు చెబుతున్నాడా అని ఏదో అనుమానం. దాని ముఖం చూసి దాన్ని బోల్తా కొట్టించానని నాన్నకు నవ్వు!

సరోజ వాళ్ళ నాన్న కూడా ఇలానే నవ్వేవాడు!

అవును! పాపాయి పుట్టినప్పుడే ఆ ఇంట్లో నాన్న కూడా పుడతాడు! ఆ పుట్టుక తామర పువ్వు విరిసినంత అందంగా ఉంటుంది.

Tuesday, July 10, 2012

తామరశ్రీ మోసరి రామాయణరావు ధిషణా హేల

రామాయణరావు వ్యక్తి కాదు సుత్తి. అవును. మీరు సరిగ్గానే చదివారు. రామాయణరావు ఒక మహాసుత్తి. ఆ సుత్తి తాలూకు ప్రస్థానమే ఈ కథనం.

ఒక వ్యక్తి కి ఎన్ని పార్శ్వాలుంటాయి? సాధారణంగా రెండు. రామాయణరావులో అనేక పార్శ్వాలున్నాయి.
ఒక పత్రికాధిపతి
ఒక నటుడు
ఒక దర్శకుడు
ఒక నిర్మాత
ఒక పాటల రచయిత
ఒక మాటల రచయిత
ఒక రాజకీయనాయకుడు
ఇన్ని పార్శ్వాలను పూర్తిగా ఖర్చుపెట్టే సరికి సారం అంతా పోయి, అతడు నాలుగేళ్ళు వరుసగా బ్లాగులు రాసేసిన తెలుగు బ్లాగర్ లా నిస్సారంగా తయారయ్యాడు. ప్రేక్షకులకు అతని సంగతి తెలిసి, అతని సినిమాలు ఎప్పుడో చూడ్డం మానేశారు. ఇక మిగిలిన పార్శ్వాలూ అరిగిపోయాయి. దాంతో అతని పైశాచికత్వం బయటపడింది. చలనచిత్ర సీమలో ఎక్కడ మీటింగు జరిగితే అక్కడ దాపురించి, శ్రోతల మెదళ్ళను కబళించడం అతనికి కొంతకాలంగా అలవడిన రాక్షసవిద్య. ఇది ఎప్పుడు అంతమవుతుందో తెలుగు టీవీ ప్రేక్షకులు, శ్రోతలు దీనికి ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

**********************************************************

అది 1980 వ దశాబ్దం. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే - హీరో తాలూకు ఫ్యామిలీ ని విలన్ చంపడం, విలన్ ముసలి వాడై, ఇంకో రెండు రోజుల్లో వాడంతట వాడే ఛస్తాడనగా హీరో అతనిపై పగ సాధించడం - అని మాత్రమే తెలిసిన ఒక అమాయకమైన కాలం.

ఆ కాలంలో రామాయణరావు దర్శకుడిలా మారాడు. క్లీనర్ రాముడు, సర్కార్ పేష్వారాయుడు, బొబ్బిలిభల్లూకం, కామాభిషేకం, దాహసందేశం, శ్రీవారి కుంపట్లు వంటి చిత్రాలతో తెలుగు తెరపై ఒక మాయాజాలాన్ని సృష్టించాడు. అతడికి రె. కాఘవేంద్రరావు పోటీ. కాఘవేంద్రరావు కంటే ముందే ఈతను దర్శకరాట్న అనిపించుకున్నాడు.

ఇలా దర్శకరాట్న గా మారి తన రాట్నం తిప్పసాగాడు రామాయణ్. కాలక్రమంలో అతనికోసం అతని వెనుక పనిచేసిన పిశాచులకు (ఘోస్టులు) మోక్షం కలిగి దిక్కులకొక్కరుగా వెళ్ళిపోయి ఇతణ్ణి ఒంటరివాణ్ణి చేశారు. రామాయణ్ నిరాశ చెందలేదు. 

తరువాతి తరం వచ్చింది. దర్శకరాట్న కు సరికొత్త ఛాలెంజ్.

నటబ్రహ్మాండ కొడుకు సర్పార్జున తెలుగుపరిశ్రమలో అడుగుపెట్టి కొన్నేళ్లే అయింది. సర్పార్జున కళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. అవి దైన్యాన్ని తప్ప మరోభావాన్ని పలికించవు. ఆ విషయం గ్రహించాడు దర్శకరాట్న. అతనితో గుజ్ను అనే కళాఖండాన్ని తీశాడు. అలాగే మురుగెశ్ తో కొన్ని సినిమాలు తీశాడు. శిశుకృష్ణ తోనూ కొన్ని సినిమాలు తీశాడు. ఇలా ఒక్కొక్కరినీ తన రాట్నానికి బలి చేస్తూ తన అద్భుత ప్రతిభతో రిచంజీవి తో సింహళేశ్వరుడు సినిమా తీశాడు. ఆ సినిమా ఆంధ్రదేశంలో స్కైలాబ్ లా పడింది. ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. ఆ సినిమాలో - చెల్లెలు చచ్చిపోతే హీరో బ్రేక్ డేన్సు చేసినట్టు చూపడం దర్శకరాట్న ప్రతిభాపైశాచికత్వానికి పరాకాష్ట. తర్వాత ఒక సభలో మాట్లాడుతూ దర్శకరాట్న ఒక అపూర్వమైన విషయం చెప్పాడు. "రిచంజీవి సినిమాలో కథ ఉండరాదు. నేను ఈ సినిమాలో మంచి కథ చెప్పాను. అదే జరిగిన పొఱబాటుకు కారణం".

ఇతని దెబ్బ కాచుకోవడానికి, ఇతణ్ణి పడగొట్టడానికి పథకానికి బీజాలు పడినయ్.

**********************************************************

1990 దశాబ్దం మొదట్లో, అప్పట్లో తెలుగు సినిమా నటుల్లో ప్రముఖులు సర్పార్జున, గిగాస్టార్ రిచంజీవి, దగ్గుబాటి మురుగేశ్, శిశుకృష్ణ తదితరులు ఒక చోట చేరారు. ఆ సమావేశం అజెండా రామాయణరావును ఎదుర్కోవడం ఎలా?

సమావేశం ఆరంభిస్తూ మురుగేశ్ చెప్పాడు. మురుగేశ్ , సర్పార్జున అప్పుడప్పుడే తెలుగులో వత్తులు నేర్చుకుని చిత్రపరిశ్రమలో పైకొస్తున్నారు. కాబట్టి వారి మాటల్లో వత్తులు పలుకవు. శిశుకృష్ణకు ఆవేశం ఎక్కువ. ఒక పదం పూర్తి చెయ్యకముందే మరో పదానికి పరుగులు తీయిస్తుంది ఆ ఆవేశం. అంచేత మాటల్లో చివర్లు సరిగ్గా ఉండవు.

"సబ్యులందర్కీ నమస్కారం.  ఇవ్వాళ మనం ఇక్కడ కలుసుకున్నది రామాయణరావును ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ఒక తీర్మానానికి రావడానికి. ఈ విషయంపై ఒక స్ట్రాటెజీని మనం తయారు చేసుకోవాలని నా ఆకాంచ". చెప్పాడు మురుగేశ్.

"రామాయణరావు మనపాలిట శాపంగా మారాడు. ఎప్పుడు సినిమా తీస్తానంటాడో తెలీదు. వద్దు అందామంటే మొహమాటం. మొన్న సింహళేశ్వరుడు సినిమా తీసి నా పరువు తీశాడు." - వాపోయాడు రిచంజీవి.

"నాకూ అంతే. గుజ్ను సినిమా తీశాడు. అది హిట్ అయినప్పటి నుండి ఇంకో సినిమా తీస్తానని వెంట బడుతున్నాడు. ఇప్పుడు నాకు వతులు వచ్చేశాయి. అతనితో నేనెందుకు సినిమా తీయాలో నాకర్దం కావట్లేదు" - చెప్పాడు సర్పార్జున. సర్పార్జున కంఠం పాము బుసకొట్టినట్టు ఉంది.

"అహ, అతణ్ణి ఎదుర్కోవాలంటే మనం అతణ్ణి ఉబ్బేయాలి. అదే చక్కగా పనిచేస్తుంది." - శిశు కృష్ణ చెప్పాడు.

చివరికి శిశుకృష్ణ చెప్పిన దానితో అందరూ ఏకీభవించారు. అతణ్ణి ప్రతి సమావేశానికి పిలవాలి. ప్రతి పత్రికలోనూ పొగడాలి. అతడు సినిమా తీస్తానంటే మీరు ఆస్కార్ స్థాయి దర్శకులని, మాకు ఆ స్థాయి లేదని తప్పించుకోవాలి.

**********************************************************

ఆ కుట్ర చక్కగా పనిచేసింది. రామాయణరావు పీడను చిత్రపరిశ్రమ అగ్రనటులు అలా సమర్థంగా ఎదుర్కున్నారు. దర్శకరాట్న తన ప్రయత్నాలు మానలేదు. మొన్నతరం నటి భాగమతితోనూ, నిన్నటితరం అపజయశాంతి తోనూ సినిమాలు తీశాడు. ఆ పైన తన సుపుత్త్రుణ్ణి వెండితెరకు పరిచయం చేస్తూ సినిమా తీసి, తను కూర్చున్న కొమ్మను తనే విరుగగొట్టుకున్నాడు.

రామాయణరావుకు ఆఖరుగా హిట్ వచ్చిన చిత్రం ’ఏమేవ్ నారాయణమ్మ".

ఆ తర్వాత అతడు సినిమాకళాకారుల సంఘానికి అధ్యక్షుడయాడు. కానివ్వకపోతే అతడితో సినిమా తీస్తానని వెంటబడతాడని అందరి భయం. ఆ తర్వాత సినిమా ఫంక్షన్ లలో ప్రసంగాలు ఇవ్వడం రామాయణరావుకు అలవాటుగా మారింది. ప్రతి సినిమా ఫంక్షన్ కూ హాజరై తన పురాణం వినిపిస్తూ శ్రోతల్లో గుండెల్లో నిద్రపోవడం అతనికి కొత్తగా అలవడిన విద్య.సంచలనాలు అన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి కాబట్టి అప్పుడప్పుడూ ఈయన తన మాటలతో సంచలనం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎన్నో యేళ్ల తర్వాత శిశుకృష్ణతో సినిమా తీశాడు. ఆ సినిమాకు తుస్కార్ అవార్డు వస్తుందన్న స్థాయిలో రామాయణరావు ఆశపడ్డాడు. పరిశ్రమవర్గాలూ ఆ మాటే అన్నాయి (అనకపోతే జరిగేది తెలుసు కాబట్టి).

ప్రస్తుతం .... రామాయణ రావు సినిమా ఫంక్షన్ లలో స్పీచులిస్తూ ప్రశాంతంగా ప్రజల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఇతడివి 140 సినిమాలయాయి. మరో తొమ్మిది సినిమాల వరకూ టైముంది. ఆ తర్వాత తన 150 వ చిత్రం ఎవరితో తీయబోతాడో! అప్పుడు సునామీలా ఎవరిమీద విరుచుకుపడనున్నాడో దానికి కాలమే సమాధానం చెప్పాలి.