Wednesday, June 13, 2012

చివరికి మోహన్ బాబే గెలిచాడు!


పాడుతా తీయగా చల్లగా కార్యక్రమం అంటే ఒకప్పుడు ఎంతో ఆసక్తి నాకు. చాలా రోజుల తర్వాత ఈ మధ్య మళ్ళీ చూడ్డం తటస్థించింది.

ఇదివరకు బాలు పిల్లకాయల మీద కాస్త అతిగా కామెంటేవాడనుకుంటా. ఈ మధ్య కాస్త తగ్గించాడు. సరే బావుంది లెమ్మని తర్వాత ఎపిసోడ్లు చూడ్డం కొనసాగించాను. క్వార్టర్ ఫైనల్, సెమి ఫైనల్ లలో నేను చూసిన ఎపిసోడ్ లలో బాలు తో బాటు మరో ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ఒకాయన తి.తి,దే ఆస్థాన విద్వాంసులు, మరొకరు ద్వారం వెంకటస్వామినాయుడు గారి మనవరాలు, మరొకామె మల్లీశ్వరి సినిమాలో ఒక నటి, సింగర్, ఇదివరకు ఇదే కార్యక్రమంలో విజేత. చాలా చక్కటి జడ్జెస్ వచ్చారు కదా అని అనుకున్నాను. ఇక ఫైనల్స్!

********************************************************************************

ఫైనల్స్ లో - బాలు ఆనాటి గెస్ట్ గురించి చెప్పాడు. నా హృదయం ఏదో కీడును శంకించింది. ఎడమ కన్ను తనపని తను చేసుకుపోయింది. ఆ నేపథ్యంలో స్టేజ్ మీదకు ఒకనాటి ఎమ్జీయార్ టోపీ ధరించి ఒక ’సెలెబ్రిటీ’ ...కాదు కాదు..లెజెండ్ అడుగుపెట్టాడు. బాలు గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆ టెన్షన్ తన మాటల్లో ప్రతిఫలించింది. "ఈ నాటి మన గెస్టు కళాప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారు. మోహన్ బాబుకు నాకు 1975 నుండీ పరిచయం. తను సినిమారంగానికి వచ్చిన మొదటి రోజు నుండి నాకు తెలుసు. ఈ రోజు వారి పక్కన కూర్చుని నా బాధ్యత నిర్వర్తించడం ఎలానో తెలియట్లేదు! ఇదొక విషమ పరీక్ష నాకు. అతణ్ణి వేదిక మీదకు సగౌరవంగా తనను ఆహ్వానిస్తున్నాను." (చివరి మాట అంటున్నప్పుడు బాలు గొంతు దుఃఖంతో పూడుకు పోయింది)

మోహన్ బాబు గారు వచ్చారు. బాలును గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత తన సీటు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

అభ్యర్థులకు కూడా ఫైనల్స్ లో మంచి పాటలు, మంచి సంగీతం కన్నా కూడా మోహన్ బాబును ఎలా మెప్పించాలన్న ధ్యాస మొదలైన క్షణమది.

మొదటి అభ్యర్థి వేదిక మీదకు పిలువబడ్డాడు. అతను ఎంచుకున్న పాట - "పుణ్యభూమి నా దేశం నమోనమామి". చాలా గంభీరంగా, పాడాడు, పాట మధ్యలో వచ్చే "ఒరే తెల్లకుక్కా, ఎందుకు కట్టాలిరా శిస్తు..." వంటివి ఎంతో గంభీరంగా మాట్లాడాడు, చివరకు ముగించాడు.

అవతల మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయాడు. తను సినిమా రంగంలో కూడు లేక పడుకున్న రాత్రుల దగ్గర్నుంచి ఈ పాట వరకూ తన జీవిత చరిత్రను లక్షలాది ప్రజలకు వినిపించాడు. అతని మనసులో ఇంత చేసినా తను లెజెండ్ కాకుండా సెలబ్రిటీ గా మిగిలిపోయాడన్న బాధ సుళ్ళు తిరుగుతూ ఉండాలి! ఆ పాటను బాలు తప్ప మరెవరూ అంత బాగా పాడలేరన్నాడు. ఇవతల అభ్యర్థి అయిన పిల్లవాడి ముఖంలో అయోమయం, బాధ! అతను కనీసం సెలబ్రిటీ అయినా అయాడు, నా పాట గురించి కనీసం ఒకమాట మాట్లాడలేదే అని ఆ అబ్బాయి పాపం పరితపించాడు. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణాన్ని చల్లబరిచే కొండంత బాధ్యతను బాలు తన భుజాలపై మోశాడు. కాసేపు మోహన్ బాబును ఇమిటేట్ చేశాడు.  తమ అనుబంధం, మిత్రత్వం గురించి చెప్పాడు. అతడి గొంతును అనుకరించి జనాలను ఆహ్లాదపరిచాడు. మోహన్ బాబు తనకు వంద రూపాయలు బాకీ అని చెప్పాడు. మండుతున్న మోహన్ బాబు గుండెలో పన్నీరు చల్లాడు. చివరకు అతణ్ణి ఎలాగో జనజీవనస్రవంతిలోకి ఈడ్చుకుని వచ్చాడు.

ప్రోగ్రాములో కమర్షియల్ బ్రేక్ వచ్చింది. దాదాపు ముప్ఫై వాణిజ్య ప్రకటనల తర్వాత తిరిగి ప్రోగ్రాం మొదలయ్యింది. "ముద్దబంతి పువ్వులో మూగ బాసలు.." ఈ పాట పాడాడు అభ్యర్థి. పాట ముగిసింది. మోహన్ బాబు మరో సారి తన పురాణం వినిపించాడు. ఈ పాట వెనుక కృషి, తన నిద్రలేని రాత్రులు, రె. కాఘవేంద్రరావు తనను మెచ్చుకోవడం, తను అప్పుల్లో మునిగి ఉండడం వంటివి శ్రోతలు అందరికి స్ఫూర్తిదాయకమైన రీతిలో చెప్పాడు. అభ్యర్థికి సలహా ఇస్తూ, "నవ్వుతూ పాడాల"న్నాడు.

"ఏదీ నవ్వుతూ ఓ ముక్క పాడు చూద్దాం!" అన్నాడు. ఆ అభ్యర్థి పాపం - నవ్వలేక ఏడుస్తూ పాడాడు. నవ్వితే పాటెలా వస్తుంది? నవ్వడమైనా ఉండాలి, లేదా పాడ్డమైన ఉండాలి. రెండూ కలిపితే పులుసులోకి ఆముదపునూనెతో తిరగమోత పెట్టినట్టుంది. అయినా సరే అభ్యర్థి గుండె చిక్కబట్టుకుని తన పని నిర్వహించాడు.

మళ్ళీ కమర్షియల్ బ్రేకు!

ఆ తర్వాత మూడో అభ్యర్థిని ఏదో పాట పాడింది. మోహన్ బాబు తిరిగి విజృంభించాడు. బాలు తనకన్నా పెద్దవాడెలాగన్నాడు? తన తండ్రి వయసు 94 యేళ్ళు అన్న విశేషాలు, తను ఎప్పుడు చిత్రరంగంలో అడుగుపెట్టాడు అన్న విషయమూ చెప్పాడు. మధ్యలో బాలు అతణ్ణి చల్లబరచాలని, తను మోహన్ బాబుకన్నా తక్కువ వయసు వాడన్నాడు. మోహన్ బాబుకు కోపం + అనుమానం వచ్చాయి. కొంపదీసి బాలు తనని లెజెండ్ కాదని శంకిస్తున్నాడా? బాలు మీద అనుమానంతో ఆ అమ్మాయిని ఓ  ప్రశ్న అడిగాడు.

"అమ్మాయ్, నువ్వు చెప్పు! నేను నా సినిమాలో ఛాన్సిస్తా! బాలు పెద్దవాడా? నేనా?" ఆ అమ్మాయి జడ్జులిద్దరిలో ఎవరిని అంటే ఏమౌతుందోనని భయపడింది. ఏం చెప్పాలో తెలియలేదంది. అదే ఆ పాప పాలిట శాపమౌతుందని ఆ క్షణాన ఆ అమ్మాయికి తెలీదు!

చివర్న - చివరి అభ్యర్థి - పాటపాడింది. ఈ సారి మోహన్ బాబు కు బాలు ఏం చెప్పాడో తెలీదు. కాస్త తొందరగానే వదిలాడు.

********************************************************************************

ఒక రోజులో ముగించాల్సిన పని మరోవారానికి వాయిదా పడింది. మరో ఎపిసోడు మొదలయ్యింది.

********************************************************************************

ఈ సారి మొదటి అభ్యర్థి - మోహన్ బాబును గాలికి వదిలేశాడు. అతణ్ణి ఇంప్రెస్ చేయడానికి కాకుండా నిజంగానే గొప్పపాట అయిన "శివశంకరీ, శివానంద లహరి" ని చక్కగా పాడాడు. మోహన్ బాబు గుండెలో కోటి వీణలు మోగాయి. అన్న పాట పాడినందుకు ఆ అభ్యర్థిని అభినందించాడు. బాలు మాత్రం ఈ సారి ఆ అబ్బాయి పాటలో కాసిన్ని తప్పులేరాడు. బాలు బాధ ఏమంటే - తను మాట్లాడకపోతే మోహన్ బాబుకు శ్రోతగా మారే ప్రమాదం ఉంది. అంచేత ఈ సారి స్ట్రాటెజికల్ గా ప్లాను వేసి తనే లీడ్ తీసుకున్నాడు. బాలు ప్రయత్నం వృథా పోలేదు. మోహన్ బాబును తన జీవిత చరిత్ర ఒక ఎపిసోడు పాటు చెప్పకుండా నిరోధించడంలో అతను 70 శాతం కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి.

రెండవ అభ్యర్థి. ’రసిక రాజ తగువారము కామా’ పాట పాడాడు. అద్భుతంగా పాడాడనే చెప్పాలి. కానీ రసికులెవరక్కడ! పిల్లవాడికి కూడా పాడడానికి ’లెజెండ్ రాజ తగువారము కామా’ అనే పాటలేదుగా మరి! అయినా పాటెవడిక్కావాలి? ఎప్పుడు పాట ముగుస్తుందా, తన జీవిత చరిత్ర మొదలెడదామా అని మోహన్ బాబు! అతణ్ణెలా కంట్రోలు చెయ్యాలా అని బాలు! ఎలాగో పాట ముగిసింది. అయితే ఎలాగో మోహన్ బాబు తన శక్తి మొత్తం కూడగట్టుకుని తన జీవిత చరిత్ర చెప్పకుండా ఆవేశాన్ని అణచుకున్నాడు.

మూడవ అభ్యర్థిని - పాపం ముందు ఎపిసోడ్ లో మోహన్ బాబు అడిగిన ధర్మసందేహం దెబ్బకు ఆమె ఇంకా కోలుకోలేదు. అంచేత చిన్న పొఱబాటు చేసింది. (అందుకు తగిన మూల్యమూ ఆ అమ్మాయి చెల్లించింది) జానకి పాడిన "నీలీల పాడెద దేవా" మొదలెట్టింది. (ఆ ’లీల’ ఎవరిదో దేవుడికే తెలియాలి). ఆ పాట మధ్యలో వచ్చే సంగీతం బిట్లు కాస్త తప్పుగా పాడింది. పాట ముగిసింది. అంతే! మోహన్ బాబుకు బాల్యం గుర్తొచ్చింది. తను వాళ్ళ గురువు గారు చెప్పిన సంస్కృత శ్లోకాన్ని ఎలా భట్టీ పట్టారో చెప్పాడు. అటుపై తన తండ్రికున్న మూడెకరాల పొలం, కష్టాలు, తనకు పెళ్ళి లేటవడం ...వగైరా విషయాలు చెప్పాడు. చివర్న పాట పాడిన అమ్మాయి ’ఏదో’ పొఱబాటు చేసినట్టు తన లెజెండ్రీ బుద్ధికి తోస్తున్నట్టు నొక్కి వక్కాణించాడు.

బాలు ఆ మిగిలిన దాన్ని పూరించాడు. ( ఈ సారి బాలు మోహన్ బాబును ఒక ఎపిసోడ్ అనుభవంతో బాగా ఎదుర్కున్నాడు. మోహన్ బాబుతో తన మిత్రత్వం గురించి చెప్పాడు) ఆ అమ్మాయి తప్పు చూపించాడు.

చివరి అమ్మాయి - అప్పటికే ఈ పోరాటంలో బాలు, మోహన్ బాబులు అలసి పోయారు. ఆ అమ్మాయి పాలిట అది వరమయ్యింది. స్వతహాగానే అందమైన గొంతున్న అమ్మాయి చక్కగా పాడింది. ఆ అమ్మాయి పాట ముగిసింది.

ప్రథమ బహుమతి ఆ చివరి అమ్మాయికే వచ్చింది. ఆ అమ్మాయి సంతోషించింది. ప్రోగ్రామును (బాబును) ఎలానో వదల్చుకున్నందుకు బాలు ఆనందపడ్డాడు.

*********************************************************

ఈ కార్యక్రమంలో నిజమైన విజేత ఎవరు???? ఇది తెలిసీ చెప్పకపోతే అతడికి మోహన్ బాబు జీవిత చరిత్ర కాసెట్ వందసార్లు చూసే అవకాశం వస్తుంది.

అవును మీరు కరెక్టే. తనే విజేత. ఇది మోహన్ బాబు లెజెండ్ అన్నంత పచ్చి నిజం.

Friday, May 11, 2012

సత్తెయ్య - శాకయ్య


ఒకింత దుర్భాగ్యవశమున ఈ మధ్య నొక జ్ఞాని రచనను చదువుట తటస్థించినది. పుస్తకమున 240 పేజీలు మాత్రముండినవి. యది నా అదృష్టము. ఈ రచనకు సమీక్ష వ్యర్థమయిననూ, నా సమయము హరించిన ఈ పుస్తకమును గూర్చి యొక పరి వ్రాసి పెట్టుకొనుట మంచిదని వ్రాసికొనుచున్నాను. ఆ పుస్తకము పేరు ’దిండు కింద పోకచెక్క’. ఇది యొక నవల.

ఆ శీర్షిక యందు సత్తెయ్య అనగా రచయిత. రచయిత యనగానొక పేరుండవలెను. లోకమున నొక్కొక్కనికి నొక్కొక్క పేరుండును. కొందరి పేర్లకు వెనుక విశేషణములుండును. మరికొందరు తమనామములకు ముందున కొన్ని బిరుదములను తగిలించుకొందురు. ఈ నవలా రచయితకును విశ్వనాథ సత్యనారాయణ యను పేరు కలదు. ఈ నవలయందు రచయితయూ నొక పాత్రధారి. నవల యందు నడచినకథకు ఐదువేల సంవత్సరముల తరువాత అనగా నేటికాలమందు ఈయన ప్రభవించునని చెప్పుకొనును. నవలయందు ఈయన విశేషణము జ్ఞానాగ్ధిదగ్ధకర్ముడు, బ్రహ్మపదార్థజ్ఞాత. జ్ఞానియగు నొకవ్యక్తి తనను తాను యివ్విధముగా పొగడుకొనుట అహంకారమని, అనౌచిత్యమని కొందరు భ్రమింపవచ్చును. అది యజ్ఞానము గావచ్చును. అహంకారమే బ్రహ్మజ్ఞానమేమో? లేక బ్రహ్మపదార్థమును రచనలో జొప్పించినవాడు బ్రహ్మజ్ఞానియని యెఱుగవలెనేమో!

నవల యనగా నొక ప్రతినాయకుడుండవలెను. ఈ నవలారాజమున ప్రధానపాత్ర, మరియు ప్రతినాయకుని పేరు శాకయ్య. శాకయ్య అనునది రచయిత సృజించిన నామము కాగా అతని నామము శాక్యుడు. ఈతడు శాక్యముని బుద్ధుడు కాడట. అంతకు మునుపు ద్వాపరాంతమున నాంధ్రదేశమున జన్మించిన నొక కుత్సితుడట. ఈ శాక్యుడు, లేదా శాకయ్యకు శాక్యసింహమని పేరుండెను.

నవలయనగా కథయునూ యించుక నుండవలెను. కొందరు కథ కోసము నవల వ్రాయుదురు, కొందరు తమ తత్త్వములనెఱింగించుటకు కథ తెలుపుదురు. ఇది రెండవకోవకు చెందినదనవచ్చును.

కథాకాలము ఐదువేలవత్సరములకు పూర్వము. మహాభారతయుద్ధమునకు స్వల్పకాలము ముందు. శాకయ్య ఆంధ్రుడు. ఆతడికి పదునైదు వత్సరములకు బెండ్లి అయినది. ఆరుగురు సంతానము. అతడు పిత్రార్జితముతో నెట్లో తన జీవనమును గడుపుచుండును. ఇట్లు అతనికి ముప్పది యేండ్లు గడచిన తర్వాత, యాతడు ఇండ్లు వదిలి దేశద్రిమ్మరి యగును. కొన్ని క్షుద్రమంత్రములను నేర్చి, వశీకరణాది అల్పవిద్యలను అలవర్చుకొనును. అతనికి యున్న మరొక గుణము విపరీతకాముకత్వము. తన శరీరమును అందుకు బాగుగ సహకరించును. యతడు ఆయా దేశముల దిరుగుచూ, అచ్చట తను మోజుపడిన స్త్రీలను లొంగదీసుకొనును. లొంగనివారిని బలవంతముగా అనుభవించును. లొంగినవారితో కొంతకాలము కాపురముండి వారిని గర్భవతుల జేసి తప్పికొనును. ఇట్లు అతని మోసమునకు గురైన వారు రత్నావళి, నాలాయిక మున్నగువారు.

ఆ కాలమందు పురాణములలో జెప్పినవిధమున కలియుగమున బుద్ధుడవతరించునని నమ్మికయుండెను. శాకయ్య ప్రజలలో గల ఆ నమ్మకమును తనకనుగుణముగా మార్చుకొననెంచెను. అందుకై యాతడు అహింసాధర్మమును, కొత్తమతమునూ బోధింపుచూ సన్యాసి వేషమెత్తి ప్రజలకు చేరువగును. ఇట్లు అతడు పేరుప్రతిష్టలూ బడయును. అతడు వేలాది సంవత్సరములు బ్రదుకుటకు నుపకరించు నొక రొట్టెవంటి పదార్థము, తిప్సిల అను యొక సర్పమునకు చెందిన ఆహారమునకై వెదకుచుండును. ఆ ప్రయత్నమున నాతనికి గీలా (నిరాలంబ) యను నొక యువతి పరిచయమగును. ఆమెను  కూడా యతడు అనుభవించి వదలును. ఇట్లు యతడు దేశదేశములు దాటి నేపాళదేశమునకు బోవును. ఒక మదపుటేనుగును లొంగదీసి, యచ్చటి రాజు జితేదాస్తి ప్రాపకమును, నలుగురు శిష్యులను సంపాదించుకొనును. ఈతడి వలన మోసగింపబడిన స్త్రీలకు సంతానము కలిగి పెద్దవారగుదురు. వారిలో నొకడు గోస్వామి. ఆతడు పండితుడై, మిగిలిన తన యన్నదమ్ములను, తల్లులను కూడగట్టి ప్రతీకారము నెరపుట, యజ్ఞము జరిపి శాకయ్య భార్యలపాపములను గ్రహించి పిశాచమగుటతో నవల ముగింపునకు వచ్చును.

************************************************************************************************

ఈ నవల యట్టమీద ’కల్పనాత్మకమైన చారిత్రక నవల’ యని వ్రాసి ఉన్నది. కల్పనయే - ఆత్మ గావున యిందున విషయమంతయూ కల్పన. అచ్చటచ్చటా వార్ష్ణేయుల ప్రస్తావన, మగధాధిపతి జరాసంధుడనియు, ఆతని పుత్త్రుడు సహదేవుడనియూ, ఆ కాలమునందు కృష్ణవ్యతిరేకులున్నట్లు కొన్ని కల్పనలు తక్క, ఇందున చారిత్రకమైన వాతావరణమూ, పేళ్ళూ, యప్పటి సంస్కృతీ సాంప్రదాయ లక్షణములు, సమాజమూ, మతవ్యవస్థా, దేశమునందు వివిధ రాజ్యముల వ్యవహారములూ వీటి చిత్రణము మిక్కిలి అసమర్థముగ నున్నవి. కల్పన యనగా వాస్తవాభాసము. చరిత్ర నేతిబీరకాయ. వెరసి సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి. ఇందున విషయమేమి? ఒకడు దేశదేశములందు తిరిగి అనేక వనితలను బలాత్కరించుచూ, వారియందు బీజారోపము జేయుచూ బోయెనని కాబోలు.  కథా విషయమున ఆధునిక "రేప్" "మర్డరు" మిస్టరీ నవలలకు ధీటైన రచన ఇది.

నేపాళరాజచరిత్ర శృంఖలము పేరిట వ్రాసిన రచనలకిది యాద్యమట. ఇందులో మౌలికముగ రచయిత చెప్పవచ్చినదేమో?  అసలిది రాజచరిత్రమే కాదు.

కల్పనకునూ ఒక్కొక్కసారి పౌరాణికాధారముండును. లేదా ప్రఖ్యాత గ్రంథమున గౌణముగనున్న నొక ప్రస్తావనను రచయిత వస్తువుగ స్వీకరించుట గలదు. కాని అవేవియును నిందులో లేవు. మరి ఈ రచన యెందుకు వ్రాసినట్లు? ’శాక్యుని’ గురించి వ్రాయలేదని జెప్పుచూ అహింసాసిద్ధాంతమును అసంబద్ధముగ నర్థము జేసికొని విమర్శించుట కనిపించును. శాక్యముని యను నామసామ్యమును స్వీకరించి, పరోక్షముగ అహింసాసిద్ధాంతవిమర్శనము జేయును. ఈ సృష్టి యంతయునూ హింసయేనట. హింసలేనిది పుట్టుక, పదినెలల గర్భధారణ ఇవేవియునూ లేవట - యిట్లు సిద్ధాంతము. ఒకచోట ఈ రచయిత విడమరచును - సమాజమునకు కులీనత యను అహంకారము అత్యంతావశ్యకమట. మరియొక చోట ’వేమన’ ను పేరు జెప్పక వాల్మీకితో పోల్చి ఈ రచయిత యవమానించును.  వీటి వెనుక రచయిత ఉద్దేశ్యములు కుటిలములని దోచును.

బుద్ధావతారము గురించి నవలలో యొకచోట కొంత వివరణ యున్నది. దశావతారములలో బుద్ధుడొకడు. ఈతడు శ్రీమన్నారాయణుని యవతారమే. త్రిపురాసురులను సంహరించుటకు శివునకు విష్ణువు అవసరమాయెను. అప్పుడు విష్ణువు సన్యాసి అవతారమెత్తి త్రిపురాసురుల భార్యలకడకు వెళ్ళి వారికి శీలము, పాతివ్రత్యము, వర్ణవిభేదము వంటి వాటిని గూరిచి వైదికధర్మవిరుద్ధముగా జెప్పగా, వారు పాతివ్రత్యములఁ గోల్పోయిరట. అందువలన వారి పతులకు ముప్పు వచ్చి శక్తులను కోలుపోగా శివుడు వారలను సంహరించెనట. ఈ బుద్ధావతారమును గూర్చి సామాన్యులు యెఱుగరు. మేధావులకే నిది తెలిసియుండెనోపు.

అంతటి వైదికనిరతులు, ధర్మనిష్టులైన ఆ స్త్రీలను యధర్మపు బాటపట్టించి వారి పతులను శివునిచేత చంపించి సన్యాసి బుద్ధుడు, శ్రీమన్నారాయణావతారము బావుకున్నదేమిటన్న ప్రశ్న యడుగరాదు. అంతకంటే మంచి రాచమార్గమున్నది కదా. అవతారమెత్తి త్రిపురాసురుల బుద్ధులను ద్రిప్పవచ్చును. అట్లు చేయుట భగవంతుని లక్షణము కాదు కాబోలు! పైగా యది అహింసాసిద్ధాంతమును సమర్థించినట్లగును. అది రచయిత భావజాలమునకే విరుద్ధము. భగవంతుడు అవతారమెత్తి త్రిపురాసురుల పెండ్లాముల మనస్సులను చెడగొట్టి పాతివ్రత్యభంగము గావించుటే ధర్మము. బ్రహ్మజ్ఞాని యైన రచయిత యేది ప్రతిపాదించునో అదియే సత్యమని యెఱుగవలెను!

అప్పటినుండి విష్ణువుకు ఈ సూత్రము అచ్చిరాగా అప్పుడప్పుడూ బుద్ధావతారమెత్తుచూ యుండునట. అహింసాసిద్ధాంతమును బోధించుచూ జనులను పాపులను గావించుచూ, వైదిక ధర్మబాహ్యులను జేయుచూ యుండునట. కాదని యనరాదట. నిజమునకు బుద్ధుని యవతారము మిగిలిన యవతారములకంటే విలక్షణమైనదట. కృతయుగమున ఈ యవతారమెత్తితినని విష్ణువు ఈ యవతారమునెత్తక మానడట. ఇట్లు జెప్పి తదనంతరము పుస్తకపు చివర, బుద్ధుడు వేరని, యతని పండితులాశ్రయింతురని, అతని మతము ప్రఖ్యాతమగునని రచయిత మాటమార్చగల సమర్థుడు.

యనగానేమి? బుద్ధుడు గొప్పవాడు కానీ అహింస గొప్పది కాదు. సరి అలాగే అనుకొందము. నిజముగానిది బౌద్ధవిమర్శనమైనచో ’అహింస’ యను మాటను శాక్యముని యే యర్థమున వాడినాడన్న ఎఱుక రచయితకు లేదు. అహింస హింసకు వ్యతిరేకమట. అహింసను బోధించుట యనగా శ్రీకృష్ణునికి విరుద్ధమగునట. బుద్ధుని యనుసరించు వారు శ్రీకృష్ణునికి వ్యతిరేకులన్నట్లు గౌణముగ నొక సూచన జేయుట. ఇది యొక పెడవాదము.

బహుశా యిట్టి రచన(ల)తో వచ్చిన ధైర్యమో యేమో కాబోలు, ఈ రచయిత అనేక రచనలయందునూ, చివరికి పసిపిల్లల పాఠ్యపుస్తకములయందునూ శాక్యముని గౌతమబుద్ధునిపై కుత్సితమగు తన ఆలోచనలను వింగడించెను.

దిండుకింద పోకచెక్క యను ఈ నవల చక్కగా చదివించును. అచ్చటచ్చటా ఇక్షుపాకము అయిననూ, కొన్ని చోట్ల మాత్రము సీడ్ లెస్ ద్రాక్షాపాకమనియే జెప్పవచ్చును. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధించు చందమున కొన్ని పేజీలు గలవు. "హిమగిరి యనగా మంచు గుట్ట. మంచు కరిగినచో నీరగును. నీరు నదిగా మారి ప్రవహించును. కరుగని చోట్ల రాళ్ళు ఉండును. అట్టి రాల మధ్య చెట్లు మొలచును" - ఇది యొక హింస. ఈయన వాదమే హింసావాదము గదా. ఆశ్చర్యమేమి?

మరికొన్ని సందర్భములలో ఇతడు వైదిక ధర్మబోధ జేయును. అనగానేమి? "చాకలి బట్టలు యుదికిన మరియొక వర్ణము వానికి 'భావగత ' మాలిన్యము దొలగును. స్త్రీ పాతివ్రత్యము పురుషుని రక్షించును, ఏలయనగా, పాతివ్రత్యము నెరపని యెడల, ఆమెను అనేకులు మోహించి ఈర్ష్యాళువులగుటకు వీలున్నది.. ఆ సంభావ్యత తొలగించుట ద్వారా స్త్రీ పాతివ్రత్యము పూరుషుని సౌఖ్యదోహద హేతువు అగుచున్నది." - ఇట్టి తింగరి వాదములన్నమాట.
సమయహరణమునకు, దిండు వలెనూ కూడా ఈ పుస్తకము చక్కని యుపకరణము. అంతకు మించి సామాన్యులాశించుట వ్యర్థము.

జ్ఞానమనగా నేమి? ఆత్మ - శూన్యమని యొక యెఱుక. శూన్యమనగా నేమి? ఒక విధమైన వంచన. అనగా ఆత్మజ్ఞానమనగ ఆత్మవంచన యని యర్థము చెప్పుకోవచ్చును.  (బ్రహ్మజ్ఞానమనగా ఇతరులను వంచించుట అని యేమో) ఆత్మజ్ఞానాభిలాషులకు ఇట్టి రచనలు పసందగును. పండితులకు నిది మరింతఁ బనికి వచ్చును.