మొదటిది.
ఓ ప్రాజెక్టు నిమిత్తమై ఇండోనేషియా కు వెళ్ళాను. అక్కడ నా పనిలో భాగంగా ఓ కొరియన్ మార్కెటింగు మేనేజరుతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఉంటుందా, ఊడుతుందా అన్న ప్రాజెక్టు అదృష్టవశాత్తూ, అనుకున్నదానికన్నా బాగా వచ్చి, విజయవంతమయింది. ఆ మానేజరు మాతో చాలా ఆప్యాయంగా వ్యవహరించేవాడు. (కొరియా వాళ్ళు పని తప్ప మిగిలిన విషయాలు మామూలుగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా, వారి ప్రవర్తనలో diplomacy తప్ప అప్యాయత ఉండదు) చివరి రోజు ఆ కొరియా ఆయన మాకు ఓ పార్టీ ఇచ్చాడు. పార్టీలో ముచ్చటిస్తూ, ఆయన ఓ వింత కథ చెప్పాడు. ఆ విషయం కొరియా సంస్కృతికి సంబంధించిన చిన్న అంశం.
వందల సంవత్సరాల క్రితం భారతదేశం, అయోధ్యానగరానికి చెందిన ఓ రాకుమారి, పడవలో సువర్ణద్వీపానికి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో తుఫాను రావడంతో, పడవ తలక్రిందులయింది. ఆమె దొరికిన ఓ చెక్కముక్కను పట్టుకుని ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుంది. అలా ఆమె ఓ తీరం చేరుకుంది. అది కొరియా దేశంలోని తీరం. అక్కడ ఆమెను ఎవరో రక్షించి, రాజు గారికి తెలిపారు. రాజు ఆమెను చేరదీసి, ఆమెకు ఏ లోటు రానివ్వకుండా, ఘనంగా చూసుకున్నాడు. ఆ రాజుకు, ఆ దేశ ప్రజల అభిమానానికి మెచ్చి, ఆ రాకుమారి, అతణ్ణే పెళ్ళాడి, అక్కడే స్థిరపడిపోయింది. ఆమెకు, ఆ రాజుకు పుట్టిన వంశం "కిమ్" అన్న పేరుతో పిలువబడ్డారు. (కొరియాలో అడుగుకు ఓ పదిమంది "కిమ్" లు, ఓ ఐదు మంది "లీ" లు, మరో మూడు మంది "పార్క్" లు తారసపడతారు. అయితే అందరు "కిమ్" లు ఆ రాకుమారి వంశస్థులు కారు. ఏదో ఒక్క "కిమ్" వారు మాత్రమే ఆ రాకుమారి వారసులు). రాకుమారి, ఆ దేశపు రాణి గారు కదా! రాణి గారిది భారతదేశం కాబట్టి, భారతీయులను "cousins" అన్నదమ్ముల్లా భావించమని రాజు ఆజ్ఞ జారీచేశారు. అప్పటి కథ ప్రకారం కొరియనులు, భారతీయులు, సహోదరులు అని ఓ భావన.
మాకు పార్టీ ఇచ్చినాయన పేరు మీరు ఊహించగలరనుకుంటాను.
ఇంతా చెప్పి, ఆయన ఓ చిన్న ట్విస్టు ఇచ్చాడు. అయోధ్య అనే నగరం ఒకటి థాయిలాండులో ఉన్నదట. ఆ రాకుమారి థాయిలాండు దేశానికి కూడా చెందినది అయి ఉండవచ్చు అని ఓ మెలిక పెట్టాడు. అయితే మాపట్ల అతడి ప్రవర్తన, అతడిమనసును మాకు చెప్పకనే చెప్పేది
*******************************************************************
ఇంకో కథ.
ఈ సారి మరో ప్రాజెక్టు, మరో దేశం, యెమెన్.
ఈ సారి మార్కెటింగ్ అధికారి పేరు అహ్మద్. ఆ దేశస్థుడే. యువకుడు, అందగాడు, పనిరాక్షసుడు, పనిలో ఏ చిన్న పొరబాటూ సహించనివాడూ. ఈతడితో కలిసి పనిచేసేప్పుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పేవాడు.
నేను యెమెన్ లో ఉన్నప్పుడు మా ఆవిడకు నాలుగో నెల.
ఈ యెమెన్ లో తిండి విషయంలో మాకు ఏ లోటూ రాలేదు. నేనూ, నా మిత్రుడూ, శాకాహారులమైనా, అక్కడ మాకు మంచి రుచికరమైన చపాతీలు, రోటీలు (భట్టీలో గోడలకు తాపించి తయారు చేసినవి), కూర (ముషక్కల్ ఆధి (అరబ్బీ) - శాకాహారపు కూర) దొరికేది. బయట కిరాణా కొట్లలో కూడా చపాతీలు దొరికేవి. ఒక చపాతీ భారతదేశ రూపాయల్లో ఒక రూపాయి. ఓ రోజెందుకో మా ఆవిడ యెమెన్ నుండీ వస్తూ ఆ చపాతీలు పట్టుకు రమ్మని చెప్పింది. ఈ విషయం నేను అహ్మద్ కు మాటవరసకు చెబితే, తనన్నాడు. గర్భవతుల కోరిక ఎటువంటిదైనా నెరవేర్చాలి. అతడికో చెల్లి. ఆమె చూలాలుగా ఉన్నప్పుడు, ఓ రోజు పుచ్చకాయ (కళింగడి) తినాలనుందని కోరిందట, అహ్మద్ ను. అప్పుడు ఆ ఫలాల సీజన్ కాదు. అయినప్పటికీ ఈ అబ్బాయి ఎక్కడెక్కడో వెతికి ఏవో తిప్పలు పడి ప్రయత్నాలు చేశాడుట. చివరికి పుచ్చకాయ దొరకలేదట. ఆ తర్వాత అహ్మద్ చెల్లెలికి ఓ పాపాయి పుట్టిందట. ఆ పాపాయి కడుపు మీద కాస్త ముదురు రంగు చార, ఆ చార మీద అక్కడక్కడా నల్లటి చుక్కలు. (పుచ్చకాయ రూపులో) ఈ ఉదంతం చెప్పి, చివర్లో అహ్మద్ "గర్భవతులకు రెండు హృదయాలు ఉంటాయి. ఒకటి తనది, రెండవది కడుపులో పెరుగుతున్న పాపాయిది" అంటూ ముక్తాయించాడు.
ఆ తర్వాత కొన్ని నెలలకు రఘువంశకావ్యం చదువుతుంటే, అందులో "దౌహృదా" అన్న ప్రయోగం చూశాను. దిలీపుడి భార్య సుదక్షిణా దేవి గర్భవతి అయినప్పటి సన్నివేశంలో. "దౌహృదా" అంటే - రెండు హృదయాలు కలది అని అర్థం.
ఎక్కడి అరబ్బు? ఎక్కడి భారతదేశం?
(ఇంతకూ నా విషయం ఏమైందంటే, నేను ఆ చపాతీలు పట్టుకు రాలేదు, మా ఆవిడకోసం. మా పాపాయికి చారలవీ రాలేదు కానీ.....ఈ క్రింద బొమ్మ చూడండి.

.....అదీ కథ. దానికి చపాతీల పీట, అప్పడాలకర్ర చూస్తే, ఆవేశం ఆగదు.)
ఓ చిన్న విషయం చెప్పి ముక్తాయిస్తాను. ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య, భాష, సంస్కృతి, సంప్రదాయము, రంగు, మతం ఇలాంటివాటికి అతీతంగా ఏదో రకమైన అనుబంధం ఉందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటూంది. (It may sound sentimental & romantic, but it gets revealed to us few times magically) దీనికి దృష్టాంతాలు మనం వెతికి చూస్తే కనబడుతూనే ఉంటాయి.


