Monday, August 31, 2009

జానెడు సైజు జానపద నవలలు


"అబ్బా, సెగట్రీ, ఎప్పుడూ పనులూ బిగినెస్సేనా, మడిసనింతర్వాత కూసింత కలాపోసనుండాలి. పరగడుపునే కూసింత పచ్చిగాలి పీల్చి ఆ పత్యచ్చ నారాయుడి సేవజేసుకోవద్దూ".............

ఇంచుమించుగా అదే పద్ధతిలోనే -

"అబ్బా, ఎప్పుడూ చందమామ, బాలమిత్రలేనా. చదివి చదివి బోరు కొడతా ఉంది. కొత్తగా ఏమైనా కొనక్క రావా అమ్మా?".................

నా భ్రాతాశ్రీ అమ్మ దగ్గర అర్జీ పెట్టుకున్నాడు చిన్నప్పుడు.

ఇప్పుడంటే చందమామ చుట్టూ బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా ముసురుకుంటున్నాం కానీ, అప్పట్లో చందమామ రాగానే, దానికోసం - అక్కకూ చెల్లికీ, అన్నకూ తమ్ముడికీ, అక్కకూ తమ్ముడికీ...ఇలా ఏ ఇంట్లో ఏ కాంబినేషన్స్ ఉన్నాయో వారందరికీ మధ్య ఓ సంకుల సమరం జరిగి, ఎట్టాగోలా చందమామ దక్కిన తర్వాత - తీరా చూస్తే, ఓ గంట కంతా పుస్తకం చదవడం అయిపోతుండేది. తిరిగి ఇంకో నెల వరకు వెయిటింగు.

అదుగో..ఆ పరిస్థితి చూసి చూసి, విసిగి వేసారి ఒక రోజు మా అన్న అమ్మ దగ్గర పైన చెప్పిన రకంగా అర్జీ పెట్టుకున్నాడు. ఆ అర్జీ అమాయకమైన అర్జీ కాదు. అఖండుడతను. అంతకు ముందే బాలభారతి పుస్తకం చివరి అట్టమీద రెండు పొట్టి జానపద నవలల ఆడ్స్ చూసి పెట్టుకున్నాడు.

"ఏమి చెయ్యమంటావురా? " అమ్మ విసుక్కుంది.

"వేరే రకం పుస్తకాలు కొనుక్కుంటా". అమ్మ ఏ కళనుందో ఏమో, "సరే. ఏ పుస్తకం" అడిగింది.చెప్పాడు భ్రాతాశ్రీ.

"ఇవా?" కొంచెం సందేహించింది మాతాశ్రీ. (ఇవి దయ్యాలు, భూతల కథలు కదా. ఇవి పిల్లలు చదవచ్చా?)

"సరే. ఒక్క పుస్తకం మాత్రమే". బడ్జెట్ సాంక్షన్ చేసింది మా అమ్మ. అప్పుడా పుస్తకం ఖరీదు 1-75 పైసలు.

చందమామల నుండి మొట్టమొదటి సారి అప్ గ్రేడ్ అయిన వైనం అదీ. నేను చదివిన మొట్టమొదటి పొట్టినవల పేరు గుర్తు లేదు, కానీ ముఖపత్రం, చూచాయగా కథ గుర్తుకు ఉన్నాయి.

ఈ నవలల్లో కథ 80 వ దశకం తెలుగు సినిమాల్లోలాగ కొన్ని ఫిక్సెడ్ ఫార్ములాలు.

ఫార్ములా 1 : ఒక రాజుకు ఎన్ని నోములు నోచినా పిల్లలు కలుగరు. చివరికి ఎలాగోలా ఒక పాప పుడుతుంది. యువరాణీ వారు యుక్తవయస్కులవగానే, ఎవడో పొద్దుపోని మాంత్రికుడొకడు ఆమెను ఎత్తుకుపోతాడు. ఇక ఒక క్షత్రియ యువకుడు ఆమెను వెతుకుతూ వెళతాడు. చివరికి ఎక్కడో సప్త సముద్రాలకవతల ఏ చిలుకలోనో సేఫ్ గా ఉన్న ప్రాణాలను తీస్తాడు. యువరాణి + యువరాజు ఆల్ హాపీస్. యువరాణి కాకపోతే, రాజుకున్న జబ్బు మాన్పించటం - ఇక్కడ వెళ్ళటం ముఖ్యం, ఎందుకు అన్నది కాదు. అలాగే చివరకు మాంత్రికుణ్ణి చంపుతాడు అన్నది ముఖ్యం కాదు, మధ్య దారిలో ఏం జరిగింది అన్నది మాత్రమే ముఖ్యం.

ఫార్ములా 2 : ఒక రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తుంటాడు. (అంటే మరీ జోకొట్టటాలు, గోరు ముద్దలు తినిపించడాలు ఇలా కాకుండా). అతని సేనాపతి దుర్జయుడికి ఈ కాన్సెప్టు నచ్చదు. రాజ్యాన్ని దొంగగా తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఇంతలో ఊళ్ళో ఒక ముసుగు వీరుడు బయలుదేరి అక్కడక్కడా కొన్ని వీరోచిత కృత్యాలు చేస్తుంటాడు. ఈ ముసుగు వీరుణ్ణి యువరాణి ప్రేమిస్తుంది. ఈ ముసుగు వీరుడు చివరికి ఆ దుర్జయుడి ఆటకట్టిస్తాడు. ఇక్కడా కొన్ని పాయింట్లు. ఆట కట్టిస్తాడన్నది ముఖ్యాం కాదు. ఎలాగ అన్నదే మనకు ముఖ్యం.

ఇవి రెండూ కాక మూడో రకం నవలలు. ఇవి పురాణాలో, భారతంలో ముఖ్య పాత్రలో, అరేబియన్ నైట్స్ కథలో,... ఇలాగ వేటి మీదో ఆధారపడి ఉంటాయి. ఇవండీ రసగుళికలు.

బహుళ జాతి సంస్థల్లో హెచ్ ఆర్ వాళ్ళు హోరెత్తించే, ప్రోయాక్టివ్ థింకింగులు, పాజిటివ్ అవుట్ లుక్కులు, హై ఎనెర్జీ లెవెల్లు, యాంటిసిపేషన్లు, రిస్క్ మిటిగేషన్ ప్లాన్లు....ఇలాంటివన్నీ ఈ జానపద నవలల్లో హీరోలకు అలవోకగా స్వతః సిద్ధంగా ఉంటాయి. హెచ్ ఆర్ వారు ఇచ్చే టుమ్రీ ట్రయినింగులకన్నా, ఈ పుస్తకాలు చదవడం చాలా లాభదాయకం.

పఠనాసక్తి ని అమాంతం ఆకాశానికెత్తే ఇలాంటి పుస్తకాలు ఈ కాలం పిల్లలకు అందకపోవడం చాల పెద్ద దురదృష్టం. ఇన్ఫర్మేషన్ యుగం కదా. ఇన్ఫర్మేషన్ ముఖ్యం, ఇమాజినేషను కాదు! పైగా వెధవ డబ్బా ఉండనే ఉంది. ఇక ఇవన్నీ ఎందుకూ?

ఈ జానపద నవలలు, బుజ్జాయి, బాలభారతి, బొమ్మరిల్లు - ఈ సంస్థలు ముద్రించేవి అప్పట్లో. బుజ్జాయి లో "కేశి" అనే ఆయన బొమ్మలేసే వారు. ఎంతచక్కగా ఉండేవో అవి. ఆ "కేశి" గారు చందమామ పత్రికలోనూ బొమ్మలేశారు.

తలవని తలంపుగా నాకు ఈ జానపద నవల నిధి సంవత్సరం క్రితం దొరికింది. ఇప్పటి వరకు ఆ నవలలు పూర్తీ చేయలేదు. చిన్న పిల్లాడికి లాలీపాప్ దొరికితే ఎక్కడ అయిపోతుందో అన్నట్టు నిదానంగా లాగిస్తాడు కదా - అదే కాన్సెప్టు నాదీను.

అన్నట్టు నాకు దొరికిన నవలలకుప్పలో, సంస్కృత నాటకాలయిన రత్నావళి (శ్రీ హర్ష విరచితం) , మృఛ్ఛ కటికం (శూద్రకుడు), కథా సరిత్సాగరం (సోమదత్తుడు), ఇంకా సింద్ బాద్, అల్లా ఉద్దీన్ వంటి అరేబియన్ నైట్స్ కథలు ఉన్నాయి.

సుదూర భవిష్యత్తులో ఓ అందమైన రోజు - నా మనవరాలికి/మనవడికి ఈ కథలు చదివి వినిపిస్తాను, ఆ పాప రాజకుమారుడు మాంత్రికుడిని చంపక ముందే నిద్రపోతుంది. - ఇదీ నా అరుదయిన పగటి కల.

Friday, August 21, 2009

నూరు టపాల సింగారం

ఎట్టకేలకు....నేనూ హండ్రెడ్ షాట్ వాలా సరం పేల్చాను.

రెండేళ్ళు కావస్తూంది, బ్లాగ్లోకంలో అడుగుపెట్టి. నేను బ్లాగు మొదలెట్టిన విధంబెట్టిదనిన .......... మామూలే. ఆదివారం ఈనాడు అనుబంధం చదివి. చదవగానే బాడీ లో మూవ్ మెంట్స్ వచ్చాయి. ఆవేశం తన్నుకొచ్చింది, అదీ కాక ఆ వ్యాసంలో డాక్టర్ ఇస్మాయిల్ గారని మా సీమ డాక్టర్ బ్లాగు గురించి రాశారు! తట్టుకోలేక జూనియర్ ఎన్ టీ ఆర్ "ఆది" సినిమాలో లాగా, "ఎన్నాళ్ళిలాగ", "ఎన్నాళ్ళిలాగ" అని మనసు ఆక్రోశించింది. జనాలు నా రాతలు మిస్ అవుతున్నారు కదా అన్న భావన కుదిపేసింది. (అక్కడికి నా సోది వినడానికిక్కడ అందరూ కాసుక్కూర్చున్నట్టు) ఏదో చేసెయ్యాలి అని ఊగిపోయాను. ఆఫీసుకెళ్ళి చూస్తే అక్కడ బ్లాగర్.కాం వంటి తుచ్చమైన వాటికి పర్మిషన్ లేదు!

ఆ తర్వాత 2007 ఆగస్ట్ లో ఆన్ సైట్ తగిలింది. వాడుకోడానికి లాప్ టాప్ ఇచ్చారు ఆఫీసుగాళ్ళు. రూమ్ లో ఇంటర్నెట్ ధారలై ప్రవహిస్తూంది. అంత ఇంటర్నెట్ తేరగా దొరికే సరికి ఓ రెండు రోజులు అందరు మగాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ తేరగా దొరికితే ఏం చేస్తారో ఆ పనులు చేసి, విసుగెత్తి, బ్లాగుల గురించి చూశాను. త్రివిక్రం గారి బ్లాగు మొట్టమొదట తగిలింది. ఆ తర్వాత రాధిక గారి స్నేహమా బ్లాగు. అంతకు ముందు ఇస్మాయిల్ గారి గురించి విన్నారుగా. ఇదిగోండి, ఈ ముగ్గురే నేను బ్లాగడానికి మూలకారణమైన త్రిమూర్తులు. రానారె, ప్రవీణు, కొ.పా గారు, తదితరులు మొదట్లో రాసిన సోదంతా చదివి ప్రోత్సహించారు. మేధ (నాలో నేను) కూడా ఇంచుమించు అదే టైం లోనే బ్లాగులు మొదలెట్టారనుకుంటా. కాబట్టి ఆమె ఏమి రాస్తున్నారో చూసేవాణ్ణి రెగ్యులర్ గా.

సరే బ్లాగుకు ఏం పేరు పెడదామా అని "నీహారిక" అని డిసైడ్ చేసి, ప్రయత్నిస్తే, ఆ పేరుతో ఎవరో బ్లాగేస్తున్నారు. ఆ తర్వాత "హరివిల్లు", "ఉత్పలమాల" ఇలా ప్రయత్నించి, అవేవి కుదరక, చివరికి మాస్ టైటిల్ ప్రయత్నిస్తే, గూగులమ్మ ఓకే అంది. అదీ టైటిలు కథ.


రాద్దామనుకున్నది పేరడీలు. సినిమా రివ్యూలు. (నాకు కూసింత అనుభవం ఉండేది వాటిలో. మా మిత్రుల వెబ్ సైట్లు బలయ్యాయి నా రాతలకు) ఇప్పుడు రాసేవి చూస్తే, మళయాళం క్లాసిక్ సినిమా కథలా నా రాతలు నాకే అర్థమయి చావడం లేదు.

చాలా రోజులు ఆఫీసులో ఆఫీసుటైం లో బ్లాగిన తర్వాత (ప్రాక్సీ కనుక్కుని, దాని ద్వారా లాగిన్ అయి), మొన్నామధ్య మార్గదర్శిలో చేరకుండానే ఓ లాప్ టాప్ కొనుక్కున్నాను. అదీ నా సెల్ఫ్ డబ్బా.

వెనక్కి తిరిగి చూసుకుంటే -


ఈ రెండేళ్ళలో, కొన్ని నవ్వులు, కొన్ని చమక్కులు, ఇంకొన్ని చురుక్కులు, కొంచెం అమాయకత్వం, కొంచెం ఆస్తికత, కొంచెం తిరగబడ్డ ఆస్తికత్వం, అస్తవ్యస్తమైన ఆలోచనలు, కుదురుగా ఉండలేని తలబిరుసుతనం,
జ్ఞాపకాల అల్మారాలో వెలికితీతలు, హృదయమనే భూగర్భంలో నుంచి తవ్వుకున్న అనుభూతుల జలాలు,

"పుస్తకం" లో వెలగబెట్టిన కబుర్లూ..

అబ్బో.... నా రేంజుకంటే చాలా ఎక్కువే వెలగబెట్టాను!!

నిజానికి నా రాతల్లో చాలా తప్పులు నాకే కనిపిస్తాయి. అవి అలా ఉంటేనే బావుంటుందని నా అవుడియా.


నన్ను అనవసరంగా రాతగాణ్ణి చేసి, నా సోది ఓపికగా విన్న వారికి, వింటున్న వారికి, ప్రోత్సహించిన, ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు (బిల్ కుల్ ముఫ్త్). వీవెన్ గారికి కృతజ్ఞతలు. ఈ రెండేళ్ళలో రెండు సార్లు మాత్రం, ఎందుకొచ్చిన సోది, మానేద్దామనుకున్నాను. తిరిగే కాళ్ళు, తిట్టే నోరు ఊరుకోవు అని సింద్ బాద్ చెప్పినట్టు,మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాను. బ్లాగులు అన్నవి తెలియక ముందు, రాయలసీమ వాణ్ణి అని చెప్పుకోవాలంటే - ఓ గోళీలాట ఆటగాడు, క్యారమ్స్, బిలియర్డ్స్ ఆటగాళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయే వాణ్ణి. ఇప్పుడు షర్ట్ కున్న ఓ బటన్ విప్పేసి చెప్పుకుంటున్నాను, నేనో సీమ బ్లాగరిని (రచయితను కాకపోయినా) అని.

అన్నట్టు నా సోది రాతల వల్ల కొందరు సహృదయులను కలిసే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టం. ఇంకా బ్లాగర్లు సాధ్యమైనంత మందిని కలవాలని ఉంది. చూడాలి.


(టపాలో వాడుకున్న ఫోటోలకు మోడల్ - సంహిత అనే దుండగురాలు

వయసు - సరిగ్గా యేడాది.

చేసే పనులు - బొమ్మల తలలు, కాళ్ళు విరగ్గొట్టటం,
ఈనాడు పేపర్ రాగానే చింపెయ్యటం,
కొత్త గౌను మీద నీళ్ళు పోసుకోవటం,
మట్టి, చెప్పులు, పరక, ఇలాంటి వాటితో ఆడుకోవడం,
లాప్ టాప్ మీదెక్కి చిచ్చిపోయటం,
నాన్న సులోచనాలను (కళ్ళజోడు) లాగి విసిరెయ్యటం వగైరా..)