Sunday, June 29, 2008

మా సీమలో ఓ రోజు (గత నెల)

మా ఆవిడ వాళ్ళ వూరు కర్నూలు జిల్లా లో హంప అనే ఓ పల్లెటూరు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు అనే పట్టణానికి దగ్గర.ఇక్కడకు దగ్గర్లోనే కసాపురం అనే ప్రముఖ ఆంజనేయ దేవస్థానం ఉంది. సరే అంత విశేషమేమిటి? అంటారా? పెద్దగా విశేషాలేం లేవనుకోండి. కొన్ని ముచ్చట్లు.

మనకు విజయ నగర సామ్రాజ్య ముఖ్య పట్టణం, సాహితీ సమరాంగణ చక్రవర్తి, కృష్ణ రాయల గారి రాజధాని హంపి తెలుసు. ఈహంపి విరూపాక్ష స్వామి మొదట హంప లో వెలిసాడట. ఈ హంప నుండీ రాయల వారు విరూపాక్ష స్వామి ని హంప కు తరలించాడని ఓ కథనం. దానికి సాక్ష్యంగా హంప లో విరూపాక్ష స్వామి శిథిల దేవాలయం ఇప్పటికీ ఉంది. హంప నుండి విరూపాక్షుడు వెళ్ళడం వల్లే విరూపాక్షుడు కొలువున్న పట్టణం హంపి అయింది అని ఐతిహ్యం.

మా ఆవిడ తాలూకు వారు ఈ గ్రామానికి శ్రోత్రియందార్లు. వాళ్ళ ఇంటి పేరు అవధానం వారు. వీళ్ళకు ఈ గ్రామం సమీపాన 200 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి ఉండేదట. మాగాణి పండించటానికి 2 చెరువులు కూడాను. గ్రామ కక్షల వల్లో, అధికారుల అలసత్వం వల్లో, మరే కారణాల వల్లో అవన్నీ ఉడిగిపోయి, ఇప్పుడు కేవలం 20 ఎకరాలు, ఎండిన చెఱువులు మిగిలాయి. ఈ గ్రామానికి ఉన్న ఇంకొక ప్రాముఖ్యత వజ్రాలు. (ఎంతైనా ఒకప్పటి రతనాల సీమ కదా) గ్రామంలోని పాడుబడ్డ శిథిలాల మధ్య, పంటపొలాల్లోనూ, కొందరు గ్రామస్తులకు వజ్రాలు దొరికాయి (ట) . ఇప్పటికీ అలాంటి వజ్రాల కోసం అన్వేషించే వారు ఉన్నారు.

ఆ వజ్రాల సంగతి ఏమో తెలియదు కానీ, నాకు మాత్రం ఓ నిధి దొరికిందీ వూళ్ళో. అవి పాత చందమామలు. మా ఆవిడ తాలూకు మామగారొకాయన ధన్యజీవి. ఎన్నో చందమామలు, కాశీమజిలీ కథలు మొదలుకుని, యద్దనపూడి సులోచనారాణి నవలల వరకు అనేకం సేకరించేడీయన. (సహస్ర చంద్ర దర్శనం తర్వాత ఈ మధ్యే ఆయన కాలం చేసారు )1955 మొదలుకుని 60, 70 వ దశకంలోని అనేకమైన చందమామలు, కొన్ని బొమ్మరిల్లు, బాలమిత్రలూ, ఇంకా కొన్ని పాకెట్ సైజులో ఉన్న చిట్టి చిట్టి జానపద నవలలూ ఓ పెద్ద అట్టపెట్టెలో పెట్టి తీసుకు వచ్చేము.

(ఈ మధ్య కొత్త పాళీ గారు ఏదో బ్లాగులో కామెంటు రాస్తూ, పాత బొమ్మరిల్లులోని చమత్కార శ్లోకం కథ, ఆడ కవిత్వం, మగ కవిత్వం గురించి భోజరాజు,కాళి దాసు చెప్పుకున్న ముచ్చట్ల గురించిన కథను ఉదహరించేరు.. ఆ బొమ్మరిల్లు కూడా మొన్నే చదివి సంతోషించాను. అలాగే అప్పటి బొమ్మరిల్లు పుస్తకాలలో చమత్కార శ్లోక కథ తో పాటూ, తెనాలి రామకృష్ణుని కథ, ఖరభ శరభుల కథ, ఇంకా కథా సరిత్సాగరం, ప్రముఖ రచయిత మల్లాది గారి చిన్న చిన్న కథలూ (ఓ పేజి కథలు) కనిపిస్తాయి.)

ఇంకా అక్కడ నులక మంచం పై నిద్ర, వాళ్ళ పాత ఇల్లు, పొగచూరు, కట్టెలపొయ్యి, వర్షం వస్తే మిద్దె పైకెక్కి మూయాల్సి వచ్చే గవాక్షాలు...ఓహ్! వాళ్ళ కాడెద్దు కి పృష్టానికి కాస్త ఎడంగా స్వస్తిక్ గుర్తు ముద్రించారు. అచ్చోసిన ఆంబోతు అంటే అదేనేమో? (నాకు పల్లె జీవితం గురించి పెద్దగా తెలియదు).

ప్రతీ సంవత్సరం ఆనవాయితీ గా హనుమజ్జయంతి జరుపడం ఓ ఆచారం వారికి. ఈ సంవత్సరం హనుమజ్జయంతి తాలూకు కొన్ని స్మృతులు (ఇవిగో).



ఎన్ని రక్తపు మడుగులకు సాక్షీభూతమయిందో, మాఇంటి ఈపాతకాలం నాటి కత్తి (కరవాలం)...


తిరిగి వస్తున్న దారిలో అనంతపురం ఇస్కాన్ దేవస్థానం సందర్శించినప్పుడి ఫోటోలు కొన్ని...




Tuesday, June 17, 2008

నేడు భాషాసేవకుడి 95 వ జయంతి

ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ లాంటి పత్రికలలో ఎంతో కాలం పని చేసి, 'నుడి నానుడి ' లాంటి ఎన్నో శీర్షికలను సమర్థంగా నిర్వహించిన పాళీ ఎవరిది?

తిరుపతి సంస్కృత కళాశాలలో చదువుతూ, స్వతంత్ర సంగ్రామం లో పాల్గొని, గోవిందరాజుల స్వామి దేవస్థానం పై భారత జండానెగురవేసిన ధీరుడు ఎవరు ?

తిరునల్వేలి జైలు లో భగత్ సింగ్ తో పాటు ఉరిశిక్ష కు గురయిన బటుకేశ్వర దత్తా తో జైలు జీవితాన్ని పంచుకున్న తెలుగువాడు ?

ఎన్నో తెలుగు ప్రబంధాల పరిష్కర్త అప్పటి సాహిత్య వినీలాకాశంలో దేదీప్యమైన తార వేటూరి ప్రభాకర శాస్త్రి శిష్య ప్రవరుడూ, ఆయనతో పాటు ఎన్నో సాహిత్య చర్చలలో పాల్గొన్న ఈ అఙ్ఞాత పుంభావ సరస్వతి ఎవరు ?

తెలుగు లిపి తో పాటు భారతీయ లిపులన్నిటి మీద సశాస్త్రీయంగా, సమర్థంగాను, సప్రామాణికంగాను, అద్భుతమైన గ్రంథ రాజాన్ని వెలయించి, తెలుగు తల్లి కి అక్షరలక్షలు ఒసంగిన మేరు నగధీరుడు ?

కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, గాంధీ మొదలుకుని, యల్లా ప్రగడ సుబ్బారావు, మల్లం పల్లి సోమశెఖర శర్మ, మానవల్లి రామకృష్ణ కవి, డాక్టర్ రఘువీర్ మొదలయిన అనేక మంది తో తమ అనుభవాలను పంచుకుని, హంపీ నుండీ హరప్పా వరకు భారతదేశాన్ని అసాంతం చుట్టి వచ్చిన మనశ్వి, యశస్వి ఎవరు ?

'జనని సంస్కృతంబు సకల భాషలకునూ అన్న వాక్యాన్ని ప్రశ్నించడమే కాక, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని, ప్రాకృతం సంస్కరింపబడి సంస్కృతం అయిందనీ, ఎన్నెన్నో ఆధారాలు చూపించి, చెరుకూరి నారాయణ రావు వంటి సాహితీ ప్రముఖులచేత 'ద్రవిడ భాషా సన్నిపాత జ్వరితుడు ' అన్న తిట్టును కూడా వినయంగా భరించిన వినయశీలి?

ఆయన మా (మన) రాయల సీమ (అనంతపురం) ముద్దుబిడ్డ డాక్టర్ తిరుమల రామచంద్ర గారు. ఆయన 95 జయంతి నేడు.

తిరుమల రామచంద్ర గారు 1913 లో ఇదే రోజు జన్మించి 1997 లో అక్టోబర్ 12 వ తేదీ పరమపదించారు. ఈయనది శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థాన పండితుడు తాతాచార్యుల వారి వంశమట.

ఈయన రచనలు కొన్ని, కింద ఉదహరిస్తున్నారు, ఔత్సాహిక బ్లాగర్ల కోసం...
1. హంపీ నుండీ హరప్పా దాకా (ఆత్మకథ..అజోవిభొ ప్రచురణ)

2. సాహితీ సుగతుని స్వగతం
3. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు
4. బృహదారణ్యకం
5. అహం భో అభివాదయే
6. ప్రాకృత వాఙ్ఞయంలో రామకథ
7. నుడి - నానుడి
8. లలిత విస్తరం (అనువాదం, ఈయన బులుసు వెంకట రమణయ్య గార్లు)
9. తెలుగు పత్రికల సాహిత్య సేవ
10. గాథా సప్త సతి లో తెలుగు పదాలు

ఇంకా ఎన్నెన్నో ... తెలుగు వారు మర్చిపోయిన ఈ మహానుభావుడికి వందనాలు.