Monday, April 4, 2011

"మూల" బడిన నక్షత్రం

చిన్నప్పుడు ఆరవ తరగతిలో అనుకుంటాను. తెలుగులో చంద్రహాసుడి పాఠం వస్తుంది. కథ లీలగా మాత్రమే గుర్తుంది. చంద్రహాసుడనే అతడు మూలానక్షత్రంలో పుట్టాడు. అతడు ఒకరోజు ఒకానొక ఉద్యానవనంలో తెలివితప్పి పడిపోయి ఉన్నాడు. అతడి జేబులో ఒక ఉత్తరం ఉంది. అందులో "ఇతడహితుడు. విషమునిమ్ము" అని రాసుంటే, రాకుమారి విషయ చూసి, కాటుకతో, "ఇతడు హితుడు. విషయ నిమ్ము" అని మారుస్తుంది. దాంతో కథ సుఖాంతం.

ఆ కథ గుర్తుండడానికి ముఖ్యమైన కారణమేమంటే, నాదీ మూలా నక్షత్రం కనుక. నాకు జ్యోతిష్యం మీద ఆసక్తి, అనాసక్తి రెండూ లేవు కానీ నాకు తెలిసిన కొంతమంది చెప్పేదేమంటే - ఈ మూలా నక్షత్రం ఒక వేస్టు చిల్లర నక్షత్రమట. ఇందులో పుట్టినవాళ్ళను చేసుకుంటే అత్తగారు గానీ, మామగారు కానీ ఫట్ అంటారు అని. ఇవి ఎంతవరకూ నిజాలో నాకు తెలియదు. దానికి ఎక్సెప్షన్స్ ఏవేం ఉన్నాయో అంతకన్నా నాకు తెలీదు.

అయితే ప్రతి ఉగాదికీ పంచాంగశ్రవణం వినేప్పుడు ఠంచనుగా అయ్యవార్లు చెప్పేది మాత్రం గుర్తుంది. ఈ యేడాది ధనూ రాశి వారికి బావోలేదు. చిన్నప్పుడు మా అమ్మ రెండు మూడు ఉగాదులు వరుసగా ధనూరాశి వారికి బావోలేదని చెప్పి ఆ తర్వాత ఉగాదికి మళ్ళీ ధనూరాశికి అష్టమ శని అనేసరికి కోపం వచ్చి నేనడిగా. "అమ్మా, శని ధనూరాశికి పట్టిందా? ధనూరాశే శనికి పట్టిందా?". మా అమ్మ కాసేపు అలా దిక్కులు చూసి, సరే కనుక్కుని చెబుతానంది. తరువాత రెండు రోజులకు అమ్మ నా దగ్గరకు వచ్చి అంది. "ఒరే, ఆణ్మూలం అరసియల్ (తమిళం) అంటార్రా, అంటే మూలానక్షత్రంలో పుట్టిన మగపిల్లవాడికి ఎదురే లేదుపో!" మళ్ళీ అడిగా. ఆణ్మూలం సంగతి సరే, పెణ్మూలం బావోదా? ఈ సారి అమ్మ నవ్వేసింది. నేననుకున్నాను. పెణ్మూలం ఎందుకు బావుండదూ? ఖచ్చితంగా బావుంటుంది, బావుండాలి, బావుంది కూడానూ. కంటెదురుగా మూలా నక్షత్రంలో పుట్టిన పెణ్ణు కనిపిస్తూంది. (మా అమ్మ నక్షత్రం ఏంటో కనుక్కున్నారా? లేకపోతే వెవ్వెవ్వె)

ఈ ఆణ్మూలం సెంటిమెంటు మరోసారి నా లైఫులో ఎంట్రీ ఇచ్చింది. నా మీద మా నాన్న కుట్రపన్ని నాకు పెళ్ళి సంబంధాలు వెతుకుతుంటే ఎవరో నా నక్షత్రం సంగతి విని హెవీ కట్నం ఆఫర్ చేశారట. అయితే మా నాన్న కట్నం మాటవింటే నేనెక్కడ కసురుకుంటానో అని ఆ ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు. ఈ మధ్య ఎందుకో నాదగ్గర మానాన్న ఆమాట అంటే నేను అన్నాను. అవును మూలానక్షత్రం వాళ్ళు రాజులా ఉంటారుకానీ బానిసలా అమ్ముడు పోరుగా..

ఈ మధ్య పెళ్ళైన తర్వాత మూడేళ్ళుగా పంచాంగశ్రవణంలో ఒక చిత్రం గమనిస్తున్నాను. నాకు ఆదాయం 14, వ్యయం 2 అని ఉంటే మా ఆవిడ నక్షత్రంలో ఆదాయం 2, వ్యయం 14 ఇలా ఉంటూ వస్తూంది. అంటే నేను సంపాదించడం, ఆమె ఖర్చు పెట్టడం ఇలా అన్నమాట. (సాధారణంగా భార్యాభర్తలు అందరికీ ఇదే ఈక్వేషన్ వర్తిస్తుందని నాకు చూచాయగా తెలుసు). హళ్ళికి హళ్ళి, సున్నకు సున్న. ఈ సీక్వెన్సు జీవితాంతం కంటిన్యూ అవుతూంటుంది. అవడమే మేలు. అలా కాక, భార్యాభర్తలిద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టినవాళ్ళై, ఆదాయవ్యయాల లెక్క ఒకటే అయితే అప్పుడు ఆ ఇంట్లో రిక్టర్ స్కేలు ఒకటి సంస్థాపించి పెట్టుకోవాలి. తప్పదు.

మొన్నామధ్య మా ఆవిడకు జ్ఞానం ఎక్కువై, మీది మూలానక్షత్రమటగా అంది అనుమానంగా చూస్తా. అవునన్నా. అదేమంత నక్షత్రం కాదటగా అంటే నేనన్నా, మీ ఇంటిదేవుడు ఆంజనేయస్వామి కూడా మూలానే తెలుసా. ఆవీడ సన్నగా ఏదో అంది. నాకు ఆమె ఏమందో వినబడలేదు. (తూచ్)

ఈ రోజు యుగాది కాబట్టి ఏదో రాయాలనే సెంటిమెంటుతో రాశా. మూలా నక్షత్రం గురించిన పచ్చి నిజాలేమైనా ఉంటే అవి ఈ టపా వ్యాఖ్యలలో అనుమతించనని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆపైన మీ ఇష్టం.

అందరికీ ఖర నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.

Friday, April 1, 2011

మేడ

మా ఇంట్లో అన్నిటికన్నా నాకు ఇష్టమైన గది - నా బెడ్రూము, డ్రాయింగు రూము..ఉహూ..ఏదీ కాదు. నాకిష్టమైన చోటు - మా ఇంటి మేడ. అదొక ప్రత్యేకప్రపంచం.

చాలాకాలం క్రితం ఎన్. ఆర్. నంది సీరియల్ ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చేది. పేరేంటో మరిచాను. ఆ సీరియల్ లో ఒకమ్మాయికి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. ఆమె స్నేహితురాలొకనాడు ఆమె ఇంటికొస్తుంది. ఇద్దరు కలిసి డాబా మీదికి వెళతారు. పైనుండి వీధిలో జరిగే పోట్లాటను గమనిస్తుంటారు. అప్పుడా అమ్మాయి అంటుంది - మనం పైనుండి చూస్తే క్రింద జరుగుతున్నది కనిపిస్తుంది. అలాగే అంతః చక్షువులను ధ్యానం ద్వారా సాధారణ స్థాయినుండి పైనికి తీసుకెళితే మనకు సాధారణ ప్రపంచం విషయాలు తేలిగ్గా తెలుస్తాయి అంటూంది. ఆ సీరియల్ లో ఆ అమ్మాయికి మేడనే ప్రపంచం.

అతీత శక్తులు ఏంటో కానీ, మేడ పైనుండి కనిపించే ప్రపంచం అద్భుతమైనది. అందునా సాయంకాలం పూట..

లంకంత ఇంట్లో మనుష్యుల మధ్య ఇమడలేక బయట వచ్చి కూర్చున్న ముసలమ్మ,
అమ్మ కొంగుపట్టుకుని సోన్ పాపిడి బండి వైపు లాగుతున్న పిల్లవాడు,
బడిపిల్లలను దించడానికొస్తున్న స్కూలు బస్సు,
ధీమాగా రోడ్డుపైన కదిలిపోతున్న ఆవు
రాత్రి నడుం వాల్చడానికో గూడు కోసం ఎగిరిపోతున్న కొంగ,
దూరంగా మరో డాబా పైన కేకలు పెడుతూ బంతాట ఆడుకుంటున్న పాప, అతని చిట్టి తమ్ముడూ,
ఆఫీసునుండి ఇంటికి వచ్చి తిరిగి ఏదో పనిమీద బండిమీద కిరాణాకొట్టు భారంగా వెళుతున్న నిరంతరశ్రమజీవీ,
ప్రపంచాన్నంతటినీ నిర్వికారంగా చూస్తూ అవనితల్లిని సెలవడుగుతున్న రవి...

ద్వైతం లేకపోతే అద్వైతం లేదు. ప్రపంచమూ-ప్రజలూ, బాధా-సంతోషమూ, చిర్నవ్వూ-కన్నీటిచుక్కా, మంచీ-చెడూ ఇవన్నీ లేక దైవత్వం, దేవుడూ ఉండడు. ఠాగూర్ ఒకానొక కవితలో ఒక చిన్నకథ చెబుతాడు. అర్ధరాత్రి సన్న్యసించడానికి ఉద్యుక్తుడవుతాడు. అతడికి ఎవరో తనచెవిలో "వద్ద"ని గుసగుసలాడుతారు. "ఎవరూ" అంటాడతను. నిద్రలో పాపాయి వాళ్ళమ్మను మరింత హత్తుకుంది. నన్ను వదిలి నా భృత్యుణ్ణి వెతకడానికి వెళుతున్న ఈ పిచ్చివాడెవడవని భగవంతుడు నవ్వుకుంటాడు.

Being in the world, but not of it
O yogi, get salvation at market place!

ఎక్కడో చదివిన కవిత..

ధ్యానమూ, ఏకాగ్రతా వేర్వేరంటాడు కృష్ణమూర్తి. ఏకాగ్రత అంటే - ఒక వస్తువుపైన దృష్టిని కేంద్రీకరించడం. ఆ ప్రయత్నంలో అందుకు అడ్డువచ్చే ఆలోచనలను నియంత్రించడం తప్పనిసరి. ఆ నియంత్రించేది కూడా బుద్ధే కాబట్టి ఏకాగ్రత ఓ ద్వైధీభావం. మెదడులో నిరంతరంగా జరిగే సమరం అది. ధ్యానం అంటే చుట్టూ జరుగుతున్న ప్రపంచాన్ని నిర్వికారంగా ’చూడడం’. ఈ చూడడం కాంక్షారహితమై, గతం, ఆగతం వర్తమానంలో కరిగిపోతే అదే ప్రేమ, అదే దైవం, అదే నిర్వాణమంటాడాయన.

ఈ రోజు మేడపైన - ప్రపంచాన్నీ, సూర్యుణ్ణీ, ఆ తర్వాత ఉదయించిన చంద్రుణ్ణి చూస్తూంటే ఏకాంతానికి అర్థం లీలగా స్ఫురించింది. ఏకాంతం - అంటే ఒంటరితనం కాదు. తనకు తాను తోడుండడం. అది అనుభవైకవైద్యం.