Wednesday, October 13, 2010

కథకళి ప్రదర్శన చూసిన రోజు...


"ఒక్క టికెట్టు రెండొందలా?" కథకళి ఆర్టిస్టులా కళ్ళు పెద్దవి చేసి అడిగింది మా శ్రీమతి. నాల్రోజులు సెలవు దొరకడంతో, కేరళకెళ్ళాము నేనూ తనూ, పాపాయీ కలిసి. ఓ సాయంత్రం పూట రిసార్టులో పనేమీ లేకపోవడంతో దగ్గరలో జరిగే కథకళి ప్రదర్శన చూడ్డానికి వచ్చేము. బయట వర్షం కురుస్తోంది.

"పర్లేదులే, చూద్దాం" అన్నాను నేను. నాకూ రెండొందలు ఎక్కువనే అనిపించింది. కానీ ఆమెను వదిలితే బయట వర్షంలో క్రెడిట్ కార్డు తూట్లు పడేలా షాపింగు చేస్తుంది, పైగా ఆమె చేసే షాపింగుకు వర్షంలో ఆమెవెంట అంగరక్షకుడిలా నేను నిలబడి ఛావాలి. అంతకంటే ఈ "కలాపోసన" మేలని నా ఎడమవైపు మెదడు ఘోషించింది.

"సీటు నంబరు 27,28" అన్నాడు టికెట్లిచ్చే యువకుడు. చక్కని ముఖ వర్ఛస్సు ఆ యువకుడిది.

పదడుగుల దూరంలో ఓ స్టేజి, ఓ యాభై ప్లాస్టిక్ కుర్చీలు, పల్చగా జనం. కుర్చీలలో కూర్చున్నాము.

రెండేళ్ళ మా పాప ఇక ప్రశ్నల కార్యక్రమం మొదలెట్టింది.

"రాచ్చతుడు ఏం చేత్తాడు?" (కథకళి ఆర్టిస్టు ముఖం చూసి రాక్షసుడని డిసైడు చేసిందది)
"రాచ్చతుడు కాదమ్మా, దామ"
"దామ ఇప్పుడేం చేత్తాడు?"
"కొంచేం సేపయిన తర్వాత డాన్సు చేస్తాడు"
"ఏ డాన్చు?"
"కథకళి"
"అదేమి"
"దీపం?"
"దీపం ఎందుకు?"
"?"
"నేను దీపం మొక్కుంటా"
"అది మొక్కుకునే దీపం కాదమ్మా"
...
...
...

స్టేజి మీద ఓ దీపం (కలివిళక్కు) వెలిగించారు. ఇద్దరు స్ఫురద్రూపులైన యువకులు కథకళి నృత్యానికి తగినట్టు మేకప్ (చుట్టి - చుట్టి అంటే పురుషపాత్రధారి గడ్డంలా ఉన్న తెల్లటి చక్రం. సామాన్యార్థంలో మేకప్) చేసుకుంటున్నారు. నాట్యంలో ఓ స్త్రీపాత్ర, ఓ పురుషపాత్ర ఉన్నట్టు తెలుస్తూంది.

ముఖానికి మేకప్పు పూర్తవగానే పురుషపాత్రధారి నడుముచుట్టూ ఓ తాడుబిగించి కట్టుకుని, నిలబడ్డాడు.

అతడి నడుముకు బిగించిన తాడు అట్టముక్కలను గుచ్చుతూ, గంపలాగ తాయారు చేశారు. దానిపైకి దుస్తులు తొడిగారు. కాళ్ళకు గజ్జలు, కిరీటం, ఇలా పైపైన ఆహార్యం పూర్తయ్యింది. తెరపైనే ఓ మూలగా ఉన్న గదిలోకెళ్ళి పూర్తిగా తయారయ్యారు.

కాసేపటికి లైట్లవీ ఆర్పి, దీపం వెలుగులో కళాకారులు స్టేజి మీదకు వచ్చారు. తెరపై కళాకారులిద్దరూ వెలిగిపోతున్నారు. వారిని చూసేసరికి, అంతవరకూ ప్రశ్నలతో, స్టేట్ మెంట్లతో ఊపిరి సలుపకుండా చేసిన పాపాయి కూడా నోరు తెరుచుకుని చూడసాగింది. ఇందాక టికెట్లు పంచిన కుర్రాడు మైకు పట్టుకుని, కథకళి గురించి ఆంగ్లంలో క్లుప్తంగా చెప్పేడు.

కథకళి ఆట 17వ శతాబ్దంనుంచి ఉన్నదట. సాహిత్యం, సంగీతం, చిత్రం, నాట్యం, నర్తనం అనే ఐదు అంగాల కలయిక కథకళి. ఈ ఆటను సాధారణంగా దేవాలయాలలో ఆడతారు. సాధారణంగా మహాభారతం, రామాయణం, పురాణాలు మొదలైన గ్రంథాల తాలూకు కథలు లేదా ఆయా గ్రంథాల పాత్రలతో అల్లిన కథలతో కథకళి ఆడటం జరుగుతుంది. కథకళి ఆటలో నర్తించే కళాకారులు పెదవి కదుపరు. కేవలం సైగలతో, హావభావాలతో 24 ముద్రలతో, శరీర కదలికలతో భావాలను ప్రతిఫలింపజేస్తారు. కథకళి తాలూకు పాటలు మణిప్రవాళం (సంస్కృతము, మలయాళమూ కలిసినది) లో ఉంటాయి. ముఖ్యమైన వాయిద్యాలు చండై (తబలా), మద్దాలం,(మద్దెల) ఇలతాళం (భజంత్రీలు), చెంగిల, ఎడక్క (ఘటం కాబోలు) మేము చూసిన ప్రదర్శనలో చండై, ఇలతాళం మాత్రమే ఉపయోగించారు.

మైకులో ఆ యువకుడు కథకళి లో నవరసాల గురించి ఒక్కొక్కటి చెబుతుంటే, యవనికపైన స్త్రీ పాత్రధారి అభినయించి చూపసాగాడు. ఆ తర్వాత 24 ముద్రలు పరిచయం చేశాడు.

తర్వాత ఓ పదిహేను నిముషాలు స్త్రీపాత్రధారి చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి హావభావాలను అభినయించేడు.

చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి ముఖంలో మురిపెం,
బిడ్డ అమ్మను గుర్తించి నవ్వితే తల్లి ముఖంలో కనబడే సంతోషం,
బిడ్డ స్పర్శకు తల్లి పులకరింత,
బిడ్డకు స్తన్యం ఇచ్చేప్పుడు తల్లి వదనంలో ప్రశాంతత,
బిడ్డ నిద్రలో నవ్వితే అమ్మ ముఖంలో కనబడే సంబరం, సంభ్రమం,
..
చివరికి బిడ్డ తన అంకంపై ఉచ్చపోస్తే, ఆ ఉచ్చను అలవోకగా విదిలిస్తూ అమ్మ బిడ్డపై చూపే చిరుకోపం
..
అత్యద్భుతంగా, అనన్యసాధ్యంగా అభినయించేడు.

ఆ తర్వాత ఆహ్వానం మూడు విధాలుగా అంటే విన్నపం, ఆజ్ఞ, శాసనం రూపాల్లో అభినయించి ప్రేక్షకులకు ఆహ్వానం పలికాడు. ఆ తర్వాత కథకళి నాట్యప్రదర్శన మొదలైంది. ఆ రోజు నేపథ్య కథ ఇది.

************************************************************

నరకాసురుని దాసి అయిన నక్రతుండి, స్వర్గంలో అప్సరసలను అపహరించుకుని రమ్మని నరకుడు ఆజ్ఞాపిస్తే ఆ కార్యనిమిత్తం స్వర్గానికి వెళుతుంది. అక్కడ ఆమె ఇంద్రసుతుడు జయంతుని చూసి, మోహించి, ఓ అందమైన అమ్మాయిలా మారి, తన పేరు లలిత అని చెప్పుకుంటూ నృత్యగానాదులతో అతణ్ణి సమీపిస్తుంది. 

తను సురకన్యనని, తనను వరించమని జయంతుణ్ణి వేడుకుంటుంది. జయంతుడు, తన గురించి చెప్పుకుని, తన తండ్రి ఆజ్ఞలేనిదే ఏ యువతిని చేపట్టనంటాడు. లలిత వేషంలోని నక్రతుండి విడవక, జయంతుణ్ణి కౌగిలించుకోజూస్తుంది. కృద్ధుడైన జయంతుడు ఆమెను అక్కడనుండి వెళ్ళిపోమని శాసిస్తాడు. నక్రతుండి నిజరూపం ధరించి జయంతుని సమీపిస్తుంది. జయంతుడు నక్రతుండి ముక్కు చెవులు కోసివేస్తే, బాధతో పెనుకేకలు పెడుతూ అక్కడనుండి నక్రతుండి నరకాసురుని దగ్గరకు తిరిగి పరిగెడుతుంది. జయంతుడు తన తండ్రి వద్దకు జరిగిన విహయాలు చెప్పడానికై నిష్క్రమిస్తాడు.

************************************************************

ఓ గంటన్నరసేపు జరిగిన నాట్యం - కేవలం ఇద్దరు పాత్రలతో, ఓ పాటగాడు, ఒకేఒక్క తబలా వాయిద్యంతో
రక్తికట్టించడంలో వారు కృతకృత్యులయ్యేరు. చివర్లో నక్రతుండి ముక్కు చెవులు కోసేప్పుడు స్త్రీపాత్రధారి
హావభావాలు, ఆర్తనాదాలు (భీభత్స రసం) గగుర్పొడిచేలా ఉన్నాయి. మాకు భాష అర్థంకాకపోయినా, అభినయంలోని భావం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇటువైపు మా పాపాయి బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని
చూస్తోంది. మొదట్లో శృంగారం ఎంత చక్కగా అభినయించాడో, చివర్లో భీభత్సం కూడా అంతే చక్కగా అభినయించేడు. పురుషపాత్రధారి వీరత్వం, రౌద్రం కూడా తీసిపోలేదు. నాటకం ముగియగానే అక్కడ ఉన్న ప్రేక్షకుల (కేవలం 26 మంది మాత్రమే) కరతాళధ్వనులతో మారుమోగింది, ప్రదర్శనశాల.

చివర్లో ఆ కళాకారులతో ఫోటోలు దిగడం చక్కటి ముక్తాయింపు. స్త్రీపాత్రధారి పేరు మహేష్ అట. కళాకారులిద్దరినీ మనఃస్ఫూర్తిగా అభినందించేను, అభినందనలు స్వీకరించినట్టు వారి ముఖంలో భావాలు స్పష్టంగా తెలిపాయి.

************************************************************

"ఈ షోకు రెండొందలు తక్కువే" - మా శ్రీమతి వస్తూవస్తూ చెప్పిన మాట.

************************************************************

కథకళి గురించి ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ.

************************************************************

Monday, October 4, 2010

పద్యరచన for dummies

ఈ టపా వ్రాయడానికి నాకున్న అర్హత - అనేకమంది ప్రోత్సాహం, ప్రోద్బలం వల్ల నేర్చుకున్న కాసిన్ని ముక్కలు, నా దిక్కుమాలిన ప్రయోగాలున్నూ. నేను ఏ విధమైన కవిని, పండితుణ్ణీ కానని నాకు తెలుసు. మీకు ఇదివరకే పద్యాలు వ్రాసిన అనుభవం ఉంటే ఈ టపాలో సొల్లును పట్టించుకోకండి. ఇక విషయంలోకి.

దాదాపు ఒకటిన్నర యేళ్ళ క్రితం. ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు చింతా రామకృష్ణారావు గారోమాట అన్నారు. "వచనం వ్రాయడం కన్నా, పద్యం వ్రాయడం సుళువు. బస్సు నడపడం కన్నా రైలు నడపడం సులువు. నియమాలను పాటిస్తూ వెళితే మిగిలిన సంగతి పద్యమే చూసుకుంటుంది అని. అప్పుడాయన మాట నమ్మశక్యం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది.

పద్యరచనలో మెళకువలు, నియమాలు నేర్పడానికి జాలంలో శంకరయ్య గారు, రామకృష్ణారావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు, కామేశ్వర రావు గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు వంటి వారు ఇదివరకే ఉన్నారు. కొన్ని చక్కటి వ్యాసాలు అందం బ్లాగులో రాకేశ్వరరావుగారు వ్రాశారు. ఉపజాతి పద్యాల గురించి పొద్దులో రాఘవగారు చక్కగా వివరించారు. వీటికి తోడు నా అనుభవాలు ఎవరికైనా ఉపయోగపడవచ్చునని ఈ టపా వ్రాస్తున్నాను. ఇందులో కాస్త స్వోత్కర్ష ధ్వనించవచ్చు. అలాగే ఈ చెప్పబోయే విషయాలు సూచనల్లా ధ్వనించినా, నిజానికి అవి నేను అనుకరించిన పద్ధతులు.

మొదట కావలసిన దినుసులు 3.

౧. వ్రాయాలన్న తపన
౨. నియమాలు తెలుసుకోవడం
౩. మంచి గురువు/సలహాలు చెప్పగల వారిని ఎన్నుకోవడం.

రెండవ విషయం - జాలంలో దొరుకుతుంది. అయితే విషయం మీకర్థం అవడం కోసం ఓ పుస్తకంలో మీకు అర్థమయే విధంగా వ్రాసుకోండి. ఈ నియమాలను చూసి భయపడవద్దు, చికాకు పడవద్దు. తప్పులు చేయడానికి జంకవద్దు. ఇంకా వీలయితే మొదట ఓ మాట అనుకుని, దానిని ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించండి.

ఉదా: కాకిపిల్ల కాకికి ముద్దు.

ఇది ఆటవెలదికి దగ్గరగా ఉంది. ఓ గణం (మూడవ గణం), చివరి గణంలో ఓ అక్షరం మాత్రమే లోపం. ఆ మార్పు కాస్తా చేసేద్దాం.

కాకిపిల్ల తల్లికాకికి ముద్దొకొ!

అంతే - ఓ పాదం తయారు!

అత్త లేని కోడలుత్తమురాలు! ఈ వాక్యాన్ని ఒకే ఒక్క చిన్న మార్పుతో ఆటవెలది పాదంగా మార్చవచ్చు. మీకు తెలుసా?

మీకు వ్రాయాలన్న ’తపన’ ఉంటే అదే మీచేత వ్రాయిస్తుంది. నిజం. కానీ మనకు ఈ నియమాలు అవీ చూస్తే చికాకు. ఈ చికాకు, పరాకు పోవాలంటే మీకు ఇష్టమైన విషయంలో మంచి పద్యాలు, వీలయితే చిన్నచిన్న పద్యాలు, తేటగీతి, ఆటవెలది, కందం వీటిలో వ్రాసినవి చదవండి. ఉదాహరణకు - ఓ చక్కని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందం ఎలా ఉందంటే -

నువ్వుపువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురుసవురు జవురు నువిదమోవి
మబ్బునుబ్బుగెబ్బు బిబ్బోకవతివేణి
జగమెఱుంగు దాని జగమెఱుంగు.

ఈ పద్యంలో చిన్నచిన్న పదాలలో అమ్మాయి ముక్కును, పెదవిని, జడను వర్ణించడం చూస్తే ఓ మారు ఆహా అనిపిస్తుంది. (ఈ పద్యం నేను పదవ తరగతిలో ఓ లైబ్రరీలో చదివి భట్టీయం వేశాను. ఈ మధ్యనే ఇది చేమకూరవెంకటకవి విజయవిలాసం లోనిదని తెలిసింది)

అలాగే మీకు పదాలతో కవులు ఎలా ఆడుకుంటారు! ఈ విషయం మురిపెంగా అనిపిస్తే ఈ క్రింది పద్యం స్ఫూర్తినివ్వచ్చు.

ఎందుండి ఎందు బోవుచు
ఇందలి కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేడు కదామ
న్మందిరము ధన్యంబయ్యె మాన్యుడ నైతిన్!

ఈ పద్యం మనుచరిత్రలోనిది. ఇలాంటివి అనేకం దొరుకుతాయి. చదువుతూ ఉండండి. ఇంకా సులువుగా , సమస్యాపూరణలు శంకరయ్యగారి బ్లాగులో ప్రతిదినం ఉంటున్నాయి. వాటిని చదవండి.

ఒక్కోసారి, మన కోపాన్ని కూడా ’తపన’ కింద మార్చుకోవచ్చు. ఉదా: నాకు ’ఫలానా’ కామేశ్వర రావు గారంటే కోపం. ఆయనలా పద్యాలు రాయలేకపోతున్నానని ఉక్రోషం. ఆయన బ్లాగు హిట్లను చూసి కుళ్ళు, వగైరా. ఇప్పుడు ఆ ’స్ఫూర్తి’ తో ఎలాగో కష్టపడి

’మర్రిచెట్టు కలదు మహిలోన ఒకచోట
మర్రిచెట్టుకొక్క తొర్ర కలదు’ - అని గరికపాటి వారు వెక్కిరించిన రీతిలో ఓ పద్యం వ్రాసాను. పైగా ఈ పద్యం తప్పొప్పులు చూడమని ఆయన్నే అడుగుతాను! నా ప్రతీకారం, ఆకాంక్ష రెండూ తీరతాయి! పైగా ఆయన్ను ఇలాంటి పద్యాలతో కాల్చుకు తినదం అన్న పురుషార్థమూ దక్కె.చూశారా, ద్వేష బ్లాగు రాయడం కంటే ద్వేషపద్యం వల్ల ఎన్ని అడ్వాంటేజులో!

నేర్చుకోవాలన్న ’తపన’- చాలా పనులు చేయిస్తుంది. ఈ విషయం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. అంచేత పైన విషయాలు వ్రాశాను.

ఇక గురువు. ఈ విషయంలో చాదస్తం అనుకున్నా పర్లేదు చెప్పాలి. ఒక్కోసారి మంచి గురువు, మీ చేత అద్భుతాలు చేయిస్తాడు, నిజానికి తనేమీ చేయకుండానే. అయితే దీనికి ప్రేమతో కూడిన ఓ బలమైన అభిమానం, నమ్మకం ముఖ్యం. ఈ విషయాలు quantitative కాదు కాబట్టి నిరూపించడం సాధ్యం కాదు. కానీ నా జీవితంలో చాలా సార్లు నాకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ విషయం మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవలసిందే. 

దినుసులు సమకూరాయి.

ఇక మొదలెట్టటం ఎలా? ఇదో భయంకరమైన భూతం. కానీ భూతాన్ని ఎదుర్కోవాలంటే రాకుమారుడు లేదా షాడో లాంటి వీరుడు మొదట దాని వీక్నెస్ ఎక్కడుందో చూస్తాడు. అంటే సమస్యను కుదింపజేయడానికి చూస్తాడు. మనమూ అదే చేస్తే పోలా? ఎలానో క్రమంగా చూద్దాం.

౧. మొదట ఆటవెలది/తేటగీతి పద్యాలు సులువు. వాటితో మొదలెట్టటం మంచిది.
౨. ఏ పద్యం మనకు సులువు? ఇది వ్యక్తులను బట్టి ఉంటుంది. ఒకరికి వర్ణన ఇష్టమైతే ఒకరికి సమస్యాపూరణ ఇష్టం.

సమస్యాపూరణ అనుకోండి. సమస్యాపూరణ చివరిపాదం అయితే అంతకు ముందు ఓ పాదం మాత్రమే వ్రాయండి. ఆ తర్వాత వీలున్నప్పుడు మిగిలిన పాదాలు వ్రాయండి. కుదరకపోతే మీ ప్రయత్నాలు వివరించి గురువులను శరణు వేడండి. వారే మార్గం చూపిస్తారు.

వర్ణన అయితే ఏ పాదానికి ఆ పాదం విడిగా వ్రాసేసుకోడానికి పూనుకోండి. ఉదాహరణకు - పద్యం గురించే రాయాలనుకోండి. ఇలా మొదలెట్టవచ్చు. ఆటవెలది ఎంచుకుందామా?

ఆ.వె:

పద్యము మనసుకును హృద్యముగాఁ దోచు
పద్యము సుమలలిత పద శుభదము
...
...

మిగిలిన రెండు పాదాలు అవే మాటలలో పూరించి ప్రయత్నించి చూడవచ్చు.

అబ్బే! పై పద్యం "నాకొక బుల్లి చెల్లి" ని గ్రాంథికంగా చెప్పినట్టు ఉంది అని మీరనుకోవచ్చు. కానీ "కాకిపిల్ల కాకికి ముద్దు". ఇలా జనులమీద experiment చేస్తేనే మనకు వస్తుంది.

ఇంకాస్త సులువు పద్ధతుంది, అయితే కాస్త తెలివి, ట్రిక్సు కావాలి. ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది. మీ ఎదుట ఇతరులు ’అసలు’విషయం తెలుసుకోలేక మీ పద్యాలను ’ఆహా, ఓహో’ అంటూంటే, భలేగా ఉంటుంది. (నేనిలా బోల్డన్ని రాశాను. :-))

ఉదాహరణకు చాటువుల్లో తిరుపతి కొండమీద ఒకాయన సీసం వ్రాశారు. ప్రతి పాదాంతంలో "కొండ" అని వస్తుంది. నేను అలాగే ప్రతి పాదం చివర్లో "నగరి" అని వాడుకుని పద్యం ప్రయత్నించి సఫలమయ్యాను.

ఇలా తేటగీతులు, ఆటవెలదులు, బ్లాగు జనులమీద ప్రయోగిస్తూ వెళ్ళండి. మధ్యమధ్యలో మన గురువులను సాధ్యమైనంత విసిగిస్తూ ఉందండి. ఇంకా మీ బ్లాగు ఉంది కదా, అక్కడ ఫోటొ, కింద ఓ పద్యం, బాలకృష్ణ, విజయకాంత్ లాంటివారి మీద పద్యాలు, వీలైతే సమస్యా పూరణలు, మీ పాపాయి/బాబు బోసినవ్వు మీద ఓ మాట, ఇంకొన్ని సలహాలు క్రింద.

* ఇతరుల పద్యాలు తీసుకుని, వాటిలో పదాలు మాత్రం మార్చి మీరో పద్యం వ్రాయండి.
* యతి కిట్టించదం కోసం బ్రౌణ్యగ్రంథం వెతకండి. ఉదా: ఇది వరకు పద్యం మీద పద్యం ఉంది కదా. మీకో ఆలోచనొచ్చింది."పద్యము వలన మది ........" తర్వాత రావట్లేదు. ఇప్పుడు -
యతి స్థానంలో "ప", "పం", "పా", "పై", "పౌ", "వ", "వా","వౌ","వై" - వీటితో మొదలయే పదాలు వెతకండి. ఏదో ఓ పదం దొరక్కపోదు!
* వేటూరి పాట, మీకిష్టమైన దాన్ని తేటగీతి/ఆటవెలదిగా మార్చండి. (ఇది నేను చేశానోసారి. మరో ప్రముఖులు కూడా చేశారు.:-))
* మీ దైనందిన జీవితంలో మాటలని పద్యాలుగా మార్చండి. (ఇది చాలా ప్రావీణ్యతనిస్తుంది. నిజం)
* మీరో పద్యపాదం వ్రాశారు. అది చూసి, మీకే "ఏంట్రా ఇది" అనిపించిందనుకోండి. ఫీల్ అవద్దు. కాస్త ఆలోచించి, కుదిరిన చోట్ల అరసున్న పెట్టండి. పద్యానికి హుందాతనం వస్తుంది. నిజమ్.
* చివరిగా - కొంచెం వ్యక్తిత్వ వికాసం టచ్ లో - మీ రచనలను మీరు గర్వంగా ఫీల్ కండి. ఇతరులూ వాటి గురించి అలానే అనుకుంటారు.