Wednesday, December 3, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౪

ప్రపంచంలో ఏ మత్తు పదార్థమూ, మాదక ద్రవ్యమూ ఇవ్వనంత కిక్కు, ఉన్మాదం, సిద్ధాంతం (idealogy) ఇస్తుంది - తీసుకోగలిగితే. ఆ idealogy మతం కావచ్చు, వర్ణ విభేదం కావచ్చు, మరే ఇజమైనా కావచ్చు. మనిషి మనుగడలో సౌలభ్యానికి, మానవీయ విలువల ఆవిష్కరణకూ ఆలంబన కావలసిన మతం మనిషి వినాశనానికి దారి తీయటం శొచనీయం.

*************************************

సూడాన్ దేశం ఆఫ్రికాలో అతి పెద్ద దేశం. మన భారత దేశంలో మూడు వంతులు ఉంటుంది సుమారుగా. జనాభా 4 కోట్లు (మాత్రమే). దేశం లో దక్షిణ (సగ) భాగం పర్వతాలు, అరణ్యాలు అయితే, మిగిలిన భాగం ఎడారి. దేశమంతటా ప్రవహించే నైలు నది.

దేశానికి పడమర దిశగా, సరిహద్దులో ఉన్న ప్రాంతం పేరు దార్ఫుర్.

సూడాను గురించి గూగిలిస్తే, మనకు ఎదురయ్యే లంకె లలో ఎక్కువ భాగం ఆ దార్ ఫుర్ కి సంబంధించినవే.ఓ నాలుగు సంవత్సరాల క్రితం ఆ దార్ఫుర్ ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది పిల్లలు, ఆడవాళ్ళు అని లేకుండా, దారుణంగా హత్య చేయబడ్డారు. హత్యలు, మానభంగాల రాక్షస కాండతో ఆ ప్రాంతం అట్టుడికి పోయింది. లక్షల మంది నిరాశ్రయులై, పక్కన ఉన్న చాడ్ దేశానికి వలస వెళ్ళి కాందిశీకులుగా మారారు.

సూడాన్ అన్న పదానికి అర్థం "నల్ల వాళ్ళ భూమి" (land of blocks) అట. అక్కడ సాధారణంగా రెండు వర్గాల ప్రజలు కనిపిస్తారు. కారునలుపు రంగులో ఉన్న ఆఫ్రికనులు (నీగ్రోలు), కాస్త ముదురు గోధుమ వర్ణంలో ఉన్న ఆఫ్రో అరబ్బు జాతి వారు. (మాకు ఈ తేడా కనిపించింది, మేము చూసిన జన సమూహాల్లో).

ఆ ఆఫ్రికనులు అబ్దుల్ వహిద్ అల్ నుర్ అనే అతని నేతృత్వంలో 1992 లో Sudan Liberation Movement / Army అనబడే పార్టీ స్థాపించి, స్థానికుల (భూమి పుత్రుల) సమస్యలను పరిష్కరించుకోవాలనుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో National Islamic front కేవలం 10 శాతం ఓట్ళ తేడాతో ఓడిపోయింది. ఆ పార్తీ జెనెరల్ అల్ బషిర్ అధికారం హస్తగతం చేసుకుని, వెంటనే SLM మీద "జిహాద్" ప్రకటించి, దక్షిణ సూడాన్ లో నూబా పర్వత ప్రాంతాలపై దాడి చేయించి, భయంకరమైన ఊచకోతకు నాంది పలికాడు. ఆ మారణహోమంలో సుమారు 5 లక్షల మందిని చంపించాడని ఓ అంచనా. కొన్ని సంవత్సరాల పాటు స్తబ్దుగా ఉన్న NLM, తిరిగి దార్ఫుర్ దగ్గర ఓ గ్రూపుగా ఏర్పడి, కార్యకలాపాలు ఆరంభించసాగింది. ఈ సారి అల్ బషిర్, సూడాను లో ఆఫ్రో అరబ్బు తెగకు చెందిన జంజవీద్ అన్న తెగకు ఆయుధాలు అందించి, ఇంకో మారణ హోమానికి నాంది పలికాడు.పాశ్చాత్య ప్రపంచం, UN దీనికి స్పందించి, అక్కడ రక్షణ శిబిరాలు ఏర్పరిచి, సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ వ్యవహారం అంతా, అమెరికనులు, యూరోపియనులు, సహాయం పేరు తో జొర్బడి, సూడానులో ఉన్న తైల వనరుల ఆధిపత్యం కోసం ఆడుతున్న నాటకం అని అక్కడ అనేకమంది మనసులో సందేహం.

ఆ సంక్షోభం మీద ఇంకా అనేక వివరాలు అంతర్జాలంలో కనిపిస్తాయి.

మేము వెళ్ళినది రాజధాని ఖార్తూమ్ కు. ఇది అటు దార్ఫుర్ కు, ఇటు దక్షిణ ప్రాంత అడవులకు చాలా దూరం. అందువల్ల మాకు అక్కడ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదు.

అయితే ఓ రోజు...

ఆ రోజు పొద్దున ఆఫీసుకు వెళ్ళే దారిలో అనేకమంది రోడ్డుపైన జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ కనిపించారు. జాగ్రత్తగా గమనిస్తే (తేడా స్వల్పమే అయినా) వాళ్ళందరూ ఆఫ్రికన్లు అని గుర్తించవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత బాల్కనీ దగ్గర నిలబడి ఉన్నాం. మా ఆఫీసుకు కాస్త ముందు నగరంలో ఓ ప్రధానమైన కూడలి. అక్కడ మిలిటరీ దుస్తుల్లో కొంత మంది. పొద్దున బస్సుల్లో, బోక్సు ల్లో కనిపించిన ఆ విప్లవ కారులు ఆ కూడలి వద్ద గుమి గూడి కనిపించారు. ఇంతలో మేము చూస్తుండగనే కొన్ని కాల్పులు, భాష్ప వాయువు ప్రయోగం, నినాదాల జోరు మిన్నుముట్టాయి. మాకు అరబ్బీ రాదు కాబట్టి, ఏమీ అర్థం అవలేదు.ఆ భాష్ప వాయువు ప్రయోగానికి, స్వల్పంగా మాకు కళ్ళల్లో కాస్త మంటగా అనిపించడంతో లోనికి వెళ్ళాము. మా క్లయింట్ తో అడిగేము, ఆ గొడవ ఏమిటని. తను చెప్పినది, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జనాభా చేస్తున్న బందు అని. అప్పటికి నాకు దార్ ఫుర్, సూడాన్ సంక్షోభం గురించి తెలియదు., కాబట్టి పట్టించుకోలేదు. నిజమే కామోసు అనుకున్నా.

ఇంకో విషయం చెప్పటం మరిచాను. మేము ఖార్తూమ్ నగరంలో రోమింగ్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు, వూరి శివారులలో ధ్వంసమైన ఓ ఫాక్టరీ చూసాము. అది ఓ కెమికల్ ఫాక్టరీ. దాని గురించి అప్పుడు మాకు తెలియలేదు. (దాని ఫోటో తీసుకోలేదు, నిషిద్ధం కాబట్టి) తర్వాత ఓ రోజు అక్కడ ఒకతనితో మాటల సందర్భంలో తెలిసిన వివరాలివి.
ఆ ఫాక్టరీ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ఓ తీవ్రవాది తాలూకుది (అని చెప్పబడుతోంది).

ఆ వ్యక్తి ఒసామా బిన్ లాడెన్.

ఆ కర్మాగారంలో రసాయన ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందని, పాశ్చాత్యులు ఎవరో దాడి జరిపి ధ్వంసం చేశారట. అక్కడ అలాంటిదేమీ లేదని, అక్కడి అభివృధ్ది ని ఓర్వలేక పాశ్చాత్యులు చేసిన ఆగడం అని అక్కడ కొంతమంది స్థానికుల వాదన. నిజానిజాలు భగవంతుడికే తెలియాలి.

దార్ఫుర్ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి మా అపార్ట్మెంట్ లో పని చేసిన మూసా అనే కుర్రాడు.


ఫోటోలో నల్లనయ్య మూసా. పక్కన మా కొలీగు.

మూసా తల్లిదండ్రులూ, బంధు వర్గం మొత్తం దార్ఫుర్ లో చంపబడ్డారు. ఆ తర్వాత ఏ పుణ్యాత్ముడో తనను తీసుకొచ్చి, ఇక్కడ పనిలో పెట్టేడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు. ఆఫ్రికనుల వద్ద ఓ విషయం గమనించవచ్చు. వారు అమాయకులు.వారికి వచ్చినది, చెప్పింది చేయడం మాత్రమే.సొంతంగా ఓ విషయాన్ని ఆలోచించి, ఆచరణలో పెట్టే సామర్థ్యం అంతగా కనిపించదు వారిలో. మూసా కూడా అలాంటి వాడే. వాష్ బేసిన్ తాలూకు ఊడిపోయిన నీటి ట్యూబును బిగించమంటే ఓ రోజు "కుల్లు ముశ్కిలా" అన్నాడు, నవ్వుతూ. (కుల్లు ముశ్కిలా అంటే చాలా కష్టం). ఆ ముశ్కిలా అన్న మాట చాలా సార్లు విన్నాం తన దగ్గర. తన పని మా బట్టలు ఉతికి పెట్టటం, పాత్రలు తోమటం వగైరా, వగైరా అంతే. ఆ పైన మరే పని చేయంచాలన్నా మాకు భాష అడ్డు, తనకు "ముశ్కిలా". అయితే మా వాలకం చూసి తనూ, తన వాలకం చూస్తూ మేము, తెగ నవ్వుకునే వాళ్ళం.

(సశేషం)

Tuesday, December 2, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౩

హబూబ్ లో తడిసి మట్టి అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చేము. అక్కడ మా సంస్థలో భోజన శాలలో విచిత్రం. చాలా మంది భారతీయులు మమ్మల్ని చూసి, మేము వాళ్ళను చూసి ఆశ్చర్యపొయాం. సంగతేమిటంటే, అక్కడ ఆ సంస్థలో దాదాపు 30 శాతం భారతీయులే. డిప్యూటీ మేనేజరు తెలుగాయన కృష్ణమోహన్. ఇంకా బిహారీలు, మలయాళీలు (డీఫాల్ట్), ముంబైకర్లు, వగైరా, వగైరా. వంటతను వంగ దేశస్తుడు (బంగ్లా దేశ్)., చక్కటి భోజనం పెట్టేడు మాకు. భోజనం చివర్లో లస్సీ కొసమెరుపు.

అక్కడ ఉన్న భారత దేశ పౌరులు, మమ్మల్ని శుక్రవారం ఆహ్వానించేరు,తమతో గడపడానికి. వాళ్ళకోసం ఓ హాస్టలు ఏర్పాటు చేసారక్కడ.

సరే, మధ్యాహ్నం తిరిగి రోమింగ్ టెస్ట్ కోసం బయలుదేరాం. అంటే, కారులో ఊరంతా తిరుగుతూనే ఉండాలి. (రోమింగ్ టెస్ట్ కోసం)మా ఆఫీసు సందు గొందుల నుండీ కాస్త బయటకు వచ్చి, మెయిన్ రోడ్డు కి రాగానే ఊపిరి ఆగి పోయేంత చక్కటి దృశ్యం. అక్కడ - నైలు నది, దిగువన వరద కారణంగా, దాదాపు రోడ్డు కు ఒరుసుకుని, మట్టి రంగు (వరద) నీళ్ళతో, దాదాపు రెండు కిలో మీటర్ల వెడల్పుతో ఉధృతంగా ప్రవహిస్తోంది!



చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది, నైలు నది ప్రపంచంలో అన్ని నదులకన్నా పొడవైనది, మన గంగా నదికి ౩ రెట్లు పొడవైనది అని. అప్పుడు స్వయంగా చూడ్డం. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

మేము చూసినది, బ్లూ నైలు నిజానికి. బ్లూ నైలు , వైట్ నైలు అన్న రెండు నదులు కలిసి, ఓ నదిగా ఏర్పడి, నైలు నదిగా ఉత్తరాన ఈజిప్టు వైపు సాగిపోతుంది. ఆ రెండు నదులు కలిసే చోటు సూడాన్ రాజధాని ఖార్తూమ్ లోనే. మన భారద్దేశం లో అయితే, అలాంటి సంగమం పవిత్రంగా భావిస్తాం. అక్కడ అలాంటిదేమీ లేదు. ఓ చిన్న పార్క్ ఏర్పాటు చేసారా సంగమ ప్రదేశంలో. మేము వెళ్ళినప్పుడు ౨ నదులు వరదలో ఉన్నాయ్ కాబట్టి, మట్టి రంగులోనే కనిపించాయి రెండూనూ.

నైలు నది పక్కన సాయంత్రం ఓ అనిర్వచనీయమైన అనుభూతి.
సరే, మొదటి రోజు ఆఫీసులో అలా గడిచింది. ఆ సాయంత్రం మా బసకు తిరిగి వచ్చేము. మేము సాయంత్రం వచ్చే సరికి, అక్కడ మా ఇంట్లో కరెంట్ పోయింది. మా డ్రయివర్ కు చెప్పాము వెంటనే, కరెంట్ లేదని. సరే, ఇప్పుడే వస్తా అంటూ, ఓ పది నిముషాల తర్వాత వచ్చేడు. వచ్చి కరెంట్ మీటరు దగ్గర ఉన్న కీ పాడ్ లో కొన్ని నంబర్లు నొక్కేడు. కరెంట్ తిరిగి వచ్చింది! అక్కడ కరెంట్ ప్రీ పెయిడ్. ఉన్న డబ్బులకు కరెంట్ అయిపోగానే, విద్యుత్ శాఖ ఆఫీసుకెళ్ళి, డబ్బులు కడితే, వాళ్ళో నంబరు చెబుతారు. ఆ నంబరు ఇంట్లో ఉన్న కరెంట్ మీటరు లో ఎంటర్ చేస్తే చాలు!

అన్నట్టు సాయంత్రం వచ్చేప్పుడు అక్కడ ఓ మిలిటరీ వారి ఆఫీసు చూసేము. అక్కడ UN వారి అనేక బళ్ళు అనేకం ఉన్నాయి. ఓ పెద్ద కాంపస్. ఆ కాంపస్ ద్వారం వద్ద కొంత మంది సాయుధులు కాపు కాస్తున్నారు. ఆ ద్వారం పై భాగాన, కొన్ని ఇసుక మూటలు (?) వెనుక నక్కి, కొంత మంది తమ గన్ లను గురి పెట్టి అలర్ట్ గా ఉన్నారు. అక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం.

సూడాను వివాదం గురించి వచ్చే టపాలో.
(సశేషం)